27, ఆగస్టు 2020, గురువారం

మనసా...వాచా...కర్మణా... 🌼🌿






శ్రీ ఆది శంకరాచార్యుల వారు , శిష్యులతో కాశి విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు.

గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట, “నేను 3 దోషములు/పాపములను చేశాను, నన్ను క్షేమించండి ” అని ప్రాధేయ పడ్డారు. ఇది విన్న శిష్యులు “ఆచార్యులవారు, ఏమి పాపమలు చేశారని ప్రాయశ్చిత్త పడుతున్నారు ?” అని అనుకున్నారు.

ఒక శిష్యుడు,ఏమిటి ఆ పాపము నేను తెలుసుకోవాలి అని , ఆచార్యుల వారిని అడిగాడు.
దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు.

1. “నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను. సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేస్వరుడిని చూడడానికి మటుకు కాశి నగరానికి వచ్చాను. అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను. అది నా నేను చేసిన మొదటి దోషము “అని సమాధానమిచ్చారు.

2. తైత్త్రియ ఉపనిషద్ లో “యతో వాచో నివర్తన్తే , అప్రాప్య మనసా సః ” భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా శ్రీ కాశి విశ్వనాధ అష్టకం వ్రాశాను.”ఇది నేను చేసిన మొదటి తప్పు!

3. నిర్వాణ శతకం లో
“న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఖం.
న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః
అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం “అని వ్రాశాను
అర్థము :
నాకు పాప పుణ్యములు సుఖ దుఖములు లేవు .మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము ,భోజనము , భోక్త ( భుజించేవాడు) నేను కాదు!నేను చిదానంద స్వరూపుడను , శివుడను ,శివుడను!



ఇంత వ్రాసికుడా నేను తీర్ద యాత్రలు చేస్తున్నాను .
అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ మూడు తప్పులని మన్నించమని ,ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను.

నీతి :

మన ఆలోచన , తీరు , మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి కథ మనకి తెలియజేస్తోంది.
బైట ప్రపంచం మన పని తీరుని మటుకే చూస్తుంది. భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తారు.
“మనస్ ఏకం , వచస్ ఏకం , కర్మణ్యేకం!”

ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధి తో ,ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము .

నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.🙏🙏🙏
***************

కామెంట్‌లు లేవు: