27, ఆగస్టు 2020, గురువారం

మంత్రము-సాధన

ఏ మంత్రమైనా గురూపదేశం లేనిదే ఫలించదు. మంత్రాన్ని పుస్తకాలలోనూ, టివిలలోనూ, రేడియోలలోనూ, క్యాసెట్లలోనూ తీసుకొని చేస్తే మహాపాపం. కఠోరమైన నియమాలున్నాయి. ప్రమాణ శ్లోకాలతో చూపిస్తే భయపడతాం. మనకి తొందరగా కోరిక తీరాలనే ఆబ, ఆశ, ఎక్కువ. త్వరగా సంపాదించాలనే ఆశ వాళ్ళకి ఎక్కువ. ఈరెంటి మధ్య కలియుగంలో మంత్రములు బజారు పాలు అవుతున్నాయి.

రింగ్ టోన్ల రూపంలో గాయత్రి మంత్రం, మృత్యుంజయ మంత్రం వినపడుతున్నాయి. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులలో ఉన్నామో ఆలోచించుకోండి. ఇవి మనల్ని పతనం చేస్తాయి. మంత్రములు ఎప్పుడూ పాటలు కారాదు. మననం చేయవలసింది మంత్రం. గురూపదేశం ద్వారా పొంది మనస్సులో చేయాలి. మంత్రాలు పాటలు, భజనలు కావు. పాటలు, భజనలు కావలసినన్ని ఉన్నాయి. చేసుకోండి. అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు చాలా ఉన్నాయి. హాయిగా పాడుకోండి. రామ, శివ, శంభో అని నామం చేసుకోండి. తప్పులేదు. కానీ మృత్యుంజయ మంత్రం, గాయత్రీ మంత్రం బయటికి అంటాం, భజనలు చేస్తాం, ఎలుగెత్తి పలుకుతాం అంటే మహాపాపం. శక్తివంతమైన వాటిని జాగ్రత్తగా వాడాలి. Hi Voltage Electricityని జాగ్రత్తగా వాడుతున్నామా? లేదా? ఉపయుక్తమైనది, మంచిది, గొప్పది అని తీగను పట్టుకుంటే ఏమౌతుందో అదే అవుతుంది ఇవన్నీ చేస్తే. శాస్త్ర ప్రమాణములున్నాయి దీనికి. ఒకమందు ప్రిస్కిప్షన్ లేనిది పుచ్చుకోకూడదని డాక్టర్లు చెప్తారు. మనకి ఇప్పుడు ఇంటర్నెట్ ఒకటుంది. ఏ జబ్బుకి యేమందో లిస్ట్ దొరుకుతుంది. నచ్చిన మందు వేసుకుంటే యే డాక్టర్ ఒప్పుకుంటాడో చెప్పండి. జబ్బు, మందు తెలిసినప్పటికీ వాడకూడదు. వైద్యుడు దగ్గరికి వెళ్ళాల్సిందే. వైద్యుడు కూడా ఇద్దరు డయాబెటిక్ పేషేంట్స్ కి ఒకే మందు వ్రాయడు. ఒక మందు ఇవ్వడానికి రోగిని వైద్యుడు ఎంత పరీక్షించాలో ఒక మంత్రిమివ్వడానికి గురువు శిష్యుడిని అంత పరీక్షించాలి. వాని పద్ధతి, జీవన విధానం, పరంపర, పుట్టిన నక్షత్రం ఇవన్నీ చూసి ఇవ్వాలి. దీనిని అర్వణ శాస్త్రం అంటారు.

అయితే కొన్ని మంత్రాలకి ఎక్కువ నియమాలుంటాయి. కొన్ని మంత్రాలకు పెద్ద నియమాలుండవు. అలాంటివి కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో పంచాక్షరి ఒకటి. నమశ్శివాయ, శివాయ నమః కూడా పంచాక్షరే. ఉపదేశం ఉన్నవారు మాత్రమే ప్రణవంతో చేయాలి. ఉపదేశం లేని వారు ప్రణవసహితంగా చేయరాదని శాస్త్రం చెబుతోంది. ఉపదేశం లేనప్పుడు శివాయ నమః – భక్తితో చేస్తే అదే పెద్ద ఫలితం ఇస్తుంది. ఓం నమశ్శివాయ అని పాటలు పాడితే తప్పు అని శాస్త్మే చెప్తోంది. అశాస్త్రీయం అలవాటు అయిపోయి అసలు శాస్త్రం చెప్తే కోపం వచ్చే రోజులలో ఉన్నాం. ఉపదేశం లేకుండా పంచాక్షరి చేస్తే సత్ఫలితం ఇస్తుంది. అందులో ఏమీ తేడాలేదు. అయితే ఉపదేశం లేకుండా చేస్తే దానికి సాధ్యమంత్రము అని పేరు. ఉపదేశం పొంది చేస్తే సిద్ధమంత్రము అని పేరు. ఉపదేశం చేసే దానికంటే ఉపదేశం పొంది చేసే మంత్రం కోటిరెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఉపదేశం ఇచ్చిన వారు మంత్రంలో సిద్ధి పొందిన వారు అయితే అప్పుడు ఆ మంత్రం సుసిద్ధ మంత్రం అవుతుంది. గురువులేనిదే యేవిద్య కూడా భాసించదు.

ఒక చెట్టును ఫోటోతీసి ఇంట్లో ఉంచుకొని, అందులోంచి చెట్టు ప్రయోజనాల్ని పొందడం ఎలాంటిదో – రికార్డు చేసిన మంత్రాలద్వారా అనుష్ఠానం, అర్చనాదులు చేయడం అలాంటిదే. అందులోంచి ప్రాణశక్తిని పొందలేం.

నేర్చుకోవడానికి, లేదా విని అనుభూతిని పొందడానికి ఈ కేసెట్స్ పనికిరావచ్చు. అంతేగానీ వ్రతాలు, అభిషేకాలు చేయడానికి మాత్రం పనికిరావనే చెప్పాలి.

వ్రతాది యజ్ఞ (ఆరాధనా) కార్యాలలో బ్రహ్మను (విప్రుని) ఉచిత స్థానంలో ఆసీనుని చేయాలి. యజ్ఞాలో ’ఋత్విగ్వరణం’ ఇదే. అలాగే పూజాదులను స్వయంగా అనుష్ఠించలేనప్పుడు, బ్రహ్మస్థానంలో ఒకరిని నియమితుని చేసి వారు మంత్రోచ్చారణ చేస్తుంటే వీరు ఆచరిస్తుంటారు.

న సిద్ధ్యతి క్రియాకాపి సర్వేషామ్ సద్గురుం వినా!
మయా శ్రుతా పురా సత్యం శ్రుతిరేషా సనాతనీ!!

సద్గురువు లేనిదే యే సాధనా ఫలించదన్న విషయం సనాతనమైన వేదవాక్యము.
************************

కామెంట్‌లు లేవు: