26, జులై 2023, బుధవారం

*శ్రీ దేవి భాగవతం - 5 వ అధ్యాయము*

 *శ్రీ దేవి భాగవతం - 5 వ అధ్యాయము*


*శ్రీ హయగ్రీవావతార వర్ణనము*


*ఋషులనిరి:* ఓ సూత మహర్షీ! లోకములకు వింత - యచ్చెరువు గొలుపు కత మాకు వినిపించితివి. అది విని మా మనంబులు సంశయ సాగరమున కొట్టుమిట్టా డుచున్నవి. ఆ భగవానుడు మాధవుని తల శరీరమునుండి తెగిపడినదనియు ఆ విశ్వకర్త యగు జనార్దనుడు హయగ్రీవ రూపము దాల్చెననియు అంటివి. దేవతలెల్లరూ దేవ దేవుని ప్రస్తుతింతురో విబుధులెల్లరు సర్వము తానయైన యే విష్ణువు నాశ్రయింతురో అతడే జగన్నాథుడు - ఆదిదేవుడు - సర్వకారణ కారణుడును. అట్టివాని తలయును ఎట్టి విధియోగమున దెగిపడినది? ఆ కథయంతయును మాకు విశదముగ తెలుపుము.


*సూతుడిట్లనియె*: ఓ మునులారా! దేవదేవుడును పరమతేజస్వియగు శ్రీ మహావిష్ణుని పావన చరిత సావధానముగ చెవులార వినుడు. సనాతనుడును భగవానుడు నగు జనార్దనుడు తొల్లి పదివేలేండ్లు భీకరమైన పోరాటము సలిపి మిక్కిలి యలసట జెందెను. అపుడతడు సమప్రదేశమున పద్మాసనముపై కూర్చుండి ఎక్కు పెట్టిన విల్లు తన కంఠ పురోభాగమునకు నానించు కొని అలసట చెంది యుండుటచే వింటికొనపై తన మేనిబరువంతయు నుంచి నిదురించెను. కొంతకాలము గడిచిన పిమ్మట నింద్రుడు మున్నగు దేవతలెల్లరును బ్రహ్మతోగూడి యొక యాగము సేయదలంచిరి. మహా యజ్వయగు విష్ణువే దేవకార్యము నెరవేర్చుటకును యాగాధిపత్యము వహించుటకును సమర్థుడని తలచి బ్రహ్మాదులు జనార్దనుని దర్శింప వైకుంఠమేగిరి.


అచట వారికి హరి కనబడలేదు. వారు జ్ఞానదృష్టితో విష్ణుడున్న జాడ నెఱిగి యచ్చోటి కరిగిరి. నిశ్చలముగ యోగనిద్రలో మునిగిన జగత్పతిని విభుని ఈశానుని గనుంగొనిరి. బ్రహ్మ రుద్రుడు మొదలగు దేవతలు పరమచింతాక్రాంతులైరి. అంత నింద్రుడు వారి కిట్లనియె : ఓ సురలారా! ఇపుడు మన కర్తవ్యమేమి? ఆ హరికి నిద్రాభంగము చేయుట తగదు. అది మహాదోషము. కనుక మీరలెట్లేని యజ్ఞకార్యము కొనసాగింపుడు. బ్రహ్మ యిట్లనియె : ''నేను చెదపురుగును పుట్టించి యీ నేలనున్న వింటికొనను తినుటకు దాని నాదేశింతును. చెద పురుగు వింటికొనను తినగా నారి తెగును. అపుడు గాని యీ దేవదేవుడు నిదురనుండి మేలుకొనడు! దానివలన దేవకార్యము నెరవేరును. ఇందు సంశయము లేదు.'' అని దేవ దేవుడగు బ్రహ్మ చెద పురుగు నాదేశించెను. చెద పురు గిట్లనెను : రమాపతియు జగద్గురుడునగు దేవదేవునకు నేను నిద్రాభంగమెట్లు గల్గింతును? *ఎవ్వరికైనను నిద్ర చెడగొట్టుట సత్కథలు వినకుండ చేయుట భార్యా భర్తల నడుమ కలతలు పుట్టించుట తల్లినుండి శిశువును వేరు చేయుట - ఇవి బ్రహ్మహత్యాసమములని స్మృతులు వక్కాణించును. ఆ దేవదేవుని నిద్రాసుఖమున కెట్లు నేను భంగము కల్గింతును? దానిని తినుట వలన నాకు వచ్చెడి ఫలితమేమి? నేను పాపినగుటయే కదా? లోకములన్నియు తఱచుగ స్వార్థపీడితములై ఘోర దురితములు చేయు చుండును. అట్టి స్వార్థ మాశించియే నేనును* తినవలయునా?


బ్రహ్మయిట్లనియె : యాగములో నీకు కొంత భాగమేర్పరతుము. కనుక నీవు వెంటనే విష్ణుడు మేల్కొనునట్లు చేయుము. మా కార్యము నెరవేర్చుము. యజ్ఞములందు వేల్చునపుడు హవిస్సునుండి కొంత ప్రక్కలకు బడును. అది నీ భాగమని తెలిసికొనుము. ఇక త్వరగ నీ పని కొనసాగింపుము.


 *సూతుడిట్లనియె* : ఆ విధముగ బ్రహ్మ పలుకగా చెదపురుగు వెనువెంటనే వింటి నారిని కొరికెను. వెంటనే వింటి నుండి నారి తెగిపడెను. తత్ఫలితముగ విల్లు నేలపై బడినది. పడుటయే తడవుగ ఘోర శబ్ద ముప్పతిల్లెను. అది విని దేవతలందఱును భయపడిరి. బ్రహ్మాండము దద్దరిల్లెను. భూమి కంపించెను. సంద్రము లల్లకల్లోలమందెను. జలజంతువు లదరిపడెను. పెనుగాలులు వీచెను. గిరులు గ్రక్కదలెను. దుఃఖ సూచకములును మహోత్పాతములునగు ధూమ కేతువులు రాలిపడెను. ఎల్లదెసలు ఘోర రూపము దాల్చెను. సూర్యు డస్తమించెను. ఇట్టి దుర్దినమున నేమి మూడునో కదా! యని వేల్పులెల్లరు పెల్లుగ జింతిల్లిరి.


అమరులిట్లు చింతించు చుండగనే దేవదేవుడగు విష్ణునియొక్క కిరీట కుండలములతో శోభిల్లు తల అదృశ్యమయ్యెను. కొంతవడికి వెఱపుగొలుపు పెంజీకట్లు విరిసెను. బ్రహ్మరుద్రాది దేవతలపుడు తలలేని హరి మొండెమును గని విస్మితులై శోకసాగరమున మునిగి యిట్లు వాపోయిరి : జగన్నాథా, ప్రభూ! ఇది నీ యమానుషలీలా రూపమా యేమి? సనాతనా! దీనివలన వేల్పులకందఱకును వంత మిక్కుటమైనది. నీవు అచ్ఛేద్యుడవు - ఆదాహ్యుడవు - అక్లేద్యుడవు - అశోష్యుడవు - నిత్యుడవు. ఇంతటి నీ తల తెగుట కేదేవతమాయ హేతువో కదా! నీ విటుల తలలేకున్నచో దేవత లెల్లరు వసువులు గోల్పోవుదురు. మాకు నీయందిం కెటుల ప్రీతి గల్గును? కావున మేము మా స్వార్థము గోరి శోకించు చున్నాము. రమావల్లభా! ఇంతటి ఘోరమే దైత్యులచే గాని యక్షులచేతగాని రాక్షసులచే గాని సాధ్యము కాదు. ఇది దేవతల వలననే జరిగి యుండును. కావున నెవరిని నిందించగలము? ఎవరిని దూషించగలము! దేవేశా! మేమెల్ల దేవతలము పరతంత్రులము. మేమిపుడేమి చేయవలయునో యెచటి కేగవలయునో - మూఢ మతులమగు మాకింక శరణ్యమెవ్వరో ఏమియును దోచుట లేదు. విష్ణువు మాయా పతి యగుట వలన సత్వరజస్తమ శ్శక్తులు గల మాయ యీ జగద్గురుని తల ఛేదింపనోపదు. శివుడు మున్నగు దేవతలీ తీరున వాపోవుచుండిరి. అదంతయు విని వేదవిదుడగు దేవగురుడు వారి బిట్టేడ్పు చల్లార్పదలచి వారి కిట్లు పలికెను : ఓ మహాభాగులారా! ఇట్లు రోదించుటవలన నేమి ప్రయోజనము? ఇపుడెల్ల విధముల చక్కని బుద్ధితో నుపాయ మాలోచించుటయే మన కర్తవ్యము. ఇంద్రా! అదృష్టము పురుషకారమును రెండును సమానములే. కనుక మతిమంతుడు తొలుత నుపాయ మాలోచించ వలయును. పిదప తప్పక దైవ మనుకూలించును.


*ఇంద్రు డిట్లనెను* : దైవమే బలవత్తరమైనది. పురుషార్థ మనర్థమునకు దారితీయును. అది వ్యర్థము. మనకండ్ల యెదుటనే విష్ణువంతటి వాని తల తెగిపడెనుగదా! బ్రహ్మ యిట్లనియె: కాలానుగుణముగ మంచిగాని చెడుగాని యేది ప్రాప్తించిన దానిని తప్పక యనుభవించి తీరవలయును. ఎట్టివాడును దైవమును మీరలేడుగదా! దేహధారియగు జీవుడు సుఖ దుఃఖము లనుభవించి తీరవలయును. ఇందు సందియమే లేదు. నేనును కాలబద్ధుట నగుట చేతనే నా తల శివునిచేత ద్రుంప బడినది. శాప కారణమున హరుని లింగము పతనమందినది. నేడును హరి తల తెగి లవణ సాగరమున బడినది. దేవేంద్రునంతటి వానికిని సహస్రభగుడగు దుఃఖము తప్పలేదు. అతడును పదభ్రుష్టుడై మానస సరస్సులో తల దాచుకొనెను. ఇంతటి వారే దుఃఖములు గఱచు చుండగ నిక దుఃఖించని మనుజు డెవ్వడు? ఈ ఘోర దుఃఖ సంసార సాగర మేరికిని దాటశక్యము గాదు. కాన తెలివి గల మానవుడు ఆపదలో దుఃఖింపరాదు. అందుచే మన మిపుడా మహామాయ శ్రీ విద్యామయి సనాతన పరా ప్రకృతియగు నిర్గుణదేవిని సంస్మరింతము గాక. ఆ దేవ దేవియే మనయెల్ల కార్యకములు చక్కగ సమకూర్చ గలదు. ఆమెయే బ్రహ్మ విద్య - జగద్ధాత్రి - విశ్వజనయిత్రి - చరా చరాత్మకమైన ముల్లోకములకు తల్లి. ఆ లోకములన్నియు నామె చేతనే నిలిచి వ్యాప్తమై వెలుగొందుచున్నవి.


*సూతు డిట్లనియె*: అని యీ ప్రకారముగ బ్రహ్మ దేవతలతో పలికెను : పిదప బ్రహ్మ వేదముల నాదేశింపగ నవియు దేవకార్యము సాధించుటకు శరీరములు దాల్చి యతని యెట్టయెదుట నిలుచుండెను. మీరు సర్వ కార్యములు సఫల మొనరించి పరాభట్టారికయు పురాతన బ్రహ్మ విద్యయు గూఢాంగియు మహామాయయు నగు మహాదేవిని సంస్తుతింపుడు అని వేదములను బ్రహ్మ యాదేశించెను. బ్రహ్మ వచనానుసారము సర్వాంగ సుందరములైన వేదములు విశ్వస్థితి కారణియు జ్ఞానగమ్యయునగు మహామాయ నీ విధముగ సంస్తుతింప దొడగినవి : *సకల భూతేశ్వరీ! శివకామినీ! విశ్వజననీ! శివాత్మికా! మహామాయాదేవీ! నీకు మా నమస్కారములు! నీవే సర్వభూతములకు మూలాధారమవు. నీవే ప్రాణుల ప్రాణమవు. శ్రీ -క్షమ - బుద్ధి - కాంతి - శాంతి - శ్రద్ధ - మేధ - ధృతి - స్మృతి - ఇవన్నియు నీవే. ప్రణవమందలి బింద్వర్ధ చంద్రస్వరూపమగు నర్థమాత్రవు నీవే. శ్రీగాయత్త్రీ దేవతవు సప్త వ్యాహృతులు జయ - విజయ - ధాత్రి - లజ్జ - కీర్తి - దయ - స్పృహ - ఇవన్నియు నీవే. దయామృత తరంగిణీ! విశ్వమాతా! ముల్లోకముల సృష్టించు భవభవ భంజనీ! వరేణ్యా! మహావిద్యా స్వరూపిణీ! వాగ్బీజ నివాసినీ! ఓ అమ్మా! నిన్ను రేయైన పగలైన సంస్తుతింతుమమ్మా హరిహర బ్రహ్మలు - ఇంద్రాగ్నులు! రవి - సరస్వతి - లోకాధిపతులును నీచేతనే సృజింపబడిరి. ఇంతేకాదు. ఈ స్థావర జంగమముల కన్నింటికి నీవే జనయిత్రివి! నీవీ జగములనెల్ల నిర్మించనెంచి త్రిమూర్తులను సృజించి వారిచే సృష్టి స్థితి లయము లొనరింప జేయు చున్నావు. ఐనను నీవేకాత్మవై తేజరిల్లుటచేత నీలో నీ సంసార వికార వాసనలు లేశమాత్రమున పొడసూపవు*


నీ యనంత నామములును నీ దివ్య స్వరూపమును నీ వస్తుతత్త్వమును నెఱుంగ జాలినవాడు భువనంబు లన్నింటిలో నెవడును లేడు. ఒక చిన్న నీటి పడియను దాటజాలనివాడు సత్య ప్రతిజ్ఞుడై మున్నీటి నెట్లు దాటగలడు? ఈ యెల్ల వేల్పులం దొక్కండును నీ యనంత దివ్యవిభూతు లెఱుంగ గలవాడు లేనేలేడు. నీ శ్రీమాతృదేవినామ మెంతయో మధురాతిమధురము, ఈ మిథ్యా జగముల నెల్ల రచించుటకు నీవొక్కతెవే చాలు ననుటకు వేదవాక్కులు ప్రమాణభూతములు. నీవే కోర్కెలును లేనిదానవు. ఎల్ల భువనములకు కారణ భూతురాలవు. కాన నో భగవతీ! నీ విచిత్ర చరిత్ర మా మది కద్భుతముగ దోచుచున్నది. వేదములు 

అ న్నియు నొక్కటైనను మనోవాక్కుల కతీతమైన నీ మహోజ్జ్వల ప్రతిబ నెఱుగలేవు. ఇక మేమేమి గ్రహింపగలము? ఈ విష్ణు శిరము అదృశ్యమగుట నీకు తెలియదా? కాక నీవెఱింగియు తిరిగి తెలిసికొన దలంతువా? కాదేని మధువైరి బల మెంతయో తెలిసికొన జూతువా? హరియం దేదేని బలవత్తరమైన దోషమున్నదందుమా? అదియును సరికాదు, ఏలన - నీ పావన చరణ కమలములు గొల్చువారిని పాతకము తాకనైన తాకలేదు. ఓ విశ్వమాతా! ఈ హరి యెల్ల వేల్పులలో చాల దొడ్డవాడు. ఇతని విషయ ముపేక్షింప దగదు. ఇతని తల తెగిపడుట చూడగ నబ్బురముగ నున్నది. మదిలో వంత గల్గించుచున్నది.


*ఓ అమ్మా! ఈ చావు పుట్టుకల వలని వంతలనెడి తీగలను త్రుంచుట కీవే సమర్థురాలవు. మరియు మధుసూదనుని తల మరల నతికించుటకు జాగేల యెనరింతువో తెలియుటలేదు. దేవతలును దోష యుతులే యని యెంచి వారి దోషమునకు ఫలముగ హరిశిరమును ద్రుంచితివో! లేక నరుల పాపము రాజునకు సంక్రమించునుగాన నరుల - దేవతల పాతకముల వలన నితని తల తెగిపడినదో! కాక మధుకైటభులను చంపుటచే నితనికి గర్వము బలిసెనని తలచి యతని తలను ఛేదించితివో! దీని కారణమేమో మేమూహింపజాలకున్నాము*

 *భవానీ! రణమున నోటుపడిన రక్కసులు విమల తీర్థములందు తపములు సేయగ వారికి వరము లొసంగితివో! కాదయేని తలలేని వాసుదేవునిగని వినోదింపదలచితివో! నీవిందే మనుకొనుచున్నావో కాని మాకు మాత్రము హరి తల కనబడుట లేదు. సనాతనీ! కానిచో లక్ష్మిపై కోపించి యిట్లొనర్చితివో! ఐనచో పతిలేని యామె మొగమెట్లు చూడగలవు? నీ యంశమున బుట్టిన కడలి రాపట్టి చేసిన నేరమును క్షమింపవలయును* గదా! కావున నిపుడీ హరిని లేపి మాకానందము జేకూర్చుము తల్లీ!


మేము కార్యకుశలురము. ప్రభావ సంపన్నులము. దేవతలము. రేయైన పగలైన నీ చరణములే నమ్ముదుము. ఓ దేవదేవీ! ఈ లోకాధినాథుని బ్రతికించి మమ్మీ శోకవారిధి నుండి దాటించుము. శ్రీహరి శిరమేమయ్యెనో మాకు దోచుట లేదు. మేమిక మనుట యెట్లో తెలియుట లేదు. అమరులకు జీవనదాన మొసగు దివ్యామృత మూర్తిని నీవే కదా! ఈ జగములకు బ్రతుకు వెలుగు చూపింపగదవే! సూతుడిట్లనియె ; ఈ ప్రకారముగ సాంగములగు వేదములతో సామగులు సామగానము సలిపి తన్ను సన్నుతింపగా గుణాతీత - మహేశ్వరి - పరమమాయ పరమానంద భరితు రాలయ్యెను. అంతలో నంతరంగముల కభిరామమైన యశరీరవాణి సుస్వరమున వేల్పుల నుద్దేశించి యిట్లు పలికెను. అమరులారా! నేను ప్రాజదవుల చేత ప్రస్తుతింపబడి ప్రసన్నమైతిని. మీరలు చింత - వంత వదలుడు. స్వస్థులుగండు, నా మాట నమ్ముడు. ఎవ్వడీ భూమిపై నన్నీ దివ్యస్తోత్రమున సంస్తుతించునో, భక్తి యుక్తుడై దీనిని చదువునో, వానియెల్ల కోర్కులు తప్పక ఫలించును. వేదస్తోత్రము వేద తుల్యము. కనుక నెవడేని మూడు కాలములందును పరమభక్తి నిండార నీ వేదస్తోత్రము పారాయణమొనరించునో వాడు దుఃఖరహితుడై సుఖించగలడు.


లోకమందు కారణము లేక కార్యము లేదు. కనుక నీ హరి శిరము తెగుటకు గల కారణమాలింపుడు. మున్నొకప్పుడు కడలిరాచూలి హరిప్రియురాలు హరి చెంతనే యుండెను. అత్తఱి మనోరమమగు నామె పద్మవదనముగని హరి నవ్వెను. నన్ను జూచి యూరకే మాధవుడేల నవ్వును? తప్పక యేదేని వికారము నా మొగమందా ప్రభునకు బొడగట్టి యుండనోపును. అకారణముగ నవ్వేల వచ్చును? ఇతని నెమ్మదిలో నన్య వనిత నాకు సవతిగ నిల్చి యుండనోపునని లచ్చి తలంచెను. ఆమె మేనియందప్పుడు తామస శక్తి యావేశించి యుండెను. అందుచే నా మహాలక్ష్మి తమోగుణముచే కోపవంతురాలయ్యెను. ఆ సమయమున దైవ యాగమునను దేవకార్యమునకు నామె శరీరమందు దారుణమైన తామస శక్తి నిండి మెండుకొని యుండినందున తదావేశముచే ''నీ తలతెగి పడిపోవుగాక!'' యని లక్ష్మి మెల్లగ హరితో ననెను.


మునుపు మహావీరుడగు హయగ్రీవుడను దైత్యుడుండెను. అతడు సరస్వతీనదీ తీరమున ఘోరముగ తపమొనర్చెను. అతడన్నపానములు సుఖభోగములు విడనాడి విజితాత్ముడై మాయాబీజమగు నేకాక్షర మంత్రరాజమును జపించుచు లలిత భూషణ భూషితమగు నా తామసిక శక్తి ననుధ్యానించుచు వేయేండ్లతి దారుణమైన తపస్సు చేసెను. అతడెట్టి తామసరూపమును ధ్యానించెనో నేనదే తామసరూపమున నతని యెదుట ప్రత్యక్షమైతిని. సువ్రతా! నీకు వరమొసంగుదును. ఏదేని గోరుకొమ్మని సింహాసనాసీననై నేనతనితో దయదలచి పలికితిని. అతడు నా మాటలు విని బత్తితో నాకు ప్రదక్షిణించి సాగిలపడి మ్రొక్కెను. అతడు నా దివ్యస్వరూపముగాంచి కనులనిండ నానంద బాష్పములునిండ నన్ను కీర్తించెను. హయగ్రీవుడిట్లనె : కామమోక్షములొసగు మహామాయాదేవీ! భక్తాసు గ్రహస్వరూపిణీ! సృష్టి స్థిత్యంతకారిణీ! నీకు నమః సహస్రములు. నింగి గాలి నిప్పు నీరు నేలలకును శబ్దస్పర్శరూపరస గంధములకును నీవే మూలమైనదానవు. త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వాఘ్రాణములలో వాక్పాణి పాద పాయూపస్థలును శక్తి చేత తమతమ పనులు జేయుచున్నవి.


శ్రీదేవి యిట్లనియెను : ఓ దానవా! నీ యద్భుత తపమునకు నీ పరభక్తికిని మెచ్చితిని. నీ కెట్టి కోర్కియున్నను తీర్చెద. వరమడుగుము. హయగ్రీవుడనియె : అమ్మా! సురాసురుల కజేయుడనై యోగినై యమరుడనై చావకుండునట్లు వరము నా కిమ్ము. శ్రీదేవి యిట్లనియె : పుట్టిన ప్రాణి తప్పక గిట్టును. గిట్టినదెల్ల తిరిగి పుట్టును. ఇది లోకమర్యాద. దీనికి విరుద్ధముగ నెట్లు జరుగగలదు? కావున చావు తప్పదని నిశ్చయించుకొని మరేదేని వరమడుగుము. హయగ్రీవుడనె : తల్లీ! నా చావు కేవలమొక్క హయగ్రీవుని వలననే జరుగవలయును. ఇతరుని చేత కూడదు. ఇదే నా కోర్కి. నాయీ కోర్కి తీర్చుము. శ్రీదేవి యిట్లనియె : ఓ మహాభాగా! నీవిక నీయింటికేగి సుఖముండుము. హయగ్రీవుడుగాక యితరునివలన నీవు చావవు అని పరాంబిక మహామాయ వరమొసగి అదృశ్యయయ్యెను. ఆ రక్కసుడును ప్రమోదించి తన యింటికేగెను. నాటినుండి యతడు వేదవిప్రులను మునినరులను బాధింపదొడగెను. ముల్లోకములలో నతని నెదుర్కొని తెగటార్చువాడెవ్వడును లేకుండెను. కావున దేవతలారా! మీరిపుడొక గుఱ్ఱము తలతెచ్చిఇండు. దానినీ మొండెమున కతికించి హరిని త్వష్ట మరల బ్రతికించును. అపుడా శ్రీ హయగ్రీవ భగవానుడా పాపిష్ఠుడును క్రూరుడునగు హయగ్రీవ దానవుని దప్పక దునుమాడగలడు. సూతుడిట్లనియె : ఈ విధముగ శ్రీభువనేశాని పలికి మౌనమూనెను. దేవతలును మోదమలర దేవశిల్పియగు త్వష్టతో శ్రీహరి మొండెమునకు గుఱ్ఱము తల నతికింపుము. ఆ శ్రీ హయగ్రీవుడు హయగ్రీవుని దెగటార్చును. ఇట్లు దేవతల కార్యము సాధింపుము అని వేడిరి. సూతుడిట్లనియె : ఆ దేవతల వచనములు విని త్వష్ట సంతసించి వెంటనే వారి సమక్షముననే యొక్క హయము తల ద్రుంచి దానిని హరిమొండెమున కతికించెను. అంత మహామాయ దయవలన హరి హయగ్రీవుడయ్యెను. కొన్ని దినముల పిదప నా శ్రీ హయగ్రీవుడు యుద్ధమున మదగర్వితుడు దేవవైరియగు హయగ్రీవుని నేలగూల్చెను. ఈ సుందరమైన కథను వినిన మానవుడు సర్వదుఃఖములు బాసి సుఖించగలడు. సందేహము లేదు. ఈ శ్రీ మహామాయాదేవి చరిత్ర పవిత్రము, పరమ పావనము, పాపనాశనము. దీనిని చదివిన వారికిని వినిన వారికిని మేలి కలుములు చేకూరును. ఇది ముమ్మాటికి నిజము.


*ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ప్రథమస్కంధే హయగ్రీవావతారకథనం నామ పంచమోధ్యాయః*


*ఇది శ్రీ దేవీ భాగవత మహాపురాణ మందలి ప్రథమ స్కంధమున*

*శ్రీ హయగ్రీవావతార కథనమను పంచమాధ్యాయము.*

🙏🙏🙏👍👌😷😷😷🙏🙏

కామెంట్‌లు లేవు: