8, జులై 2024, సోమవారం

ఆధ్యాత్మికము దూరమైపోతుంది

 ఒక శ్రీమంతుడు ఉండేవాడు.అతనికేమీ పనిలేదు.కేవలం లోడింగ్ , అన్ లోడింగ్ .అందువలన అతనికి అజీర్ణవ్యాధి వచ్చింది.ఒక స్పెషలిస్టు డాక్టర్ని సంప్రదించాడు. ఆ డాక్టరు ,  "ఓ శ్రీమంతుడా !నీ అజీర్ణమునకు నీవే కారణము.నీ కడుపు ఎంత పడుతుందో నీకు తెలియదా?కేవలము దురాశచేత ఊరికే కూరుతున్నావు .జీర్ణశక్తి తక్కువ తినే పదార్ధము ఎక్కువ!అందుకే అజీర్ణవ్యాధి వచ్చింది.దీనికి ఒక చక్కని మందు చెపుతున్నాను విను.ఎపుడూ నీ నోటిలో ఇ ఉప్పుగడా పెట్టుకొని దాని సారాన్ని మింగుతూ ఉండు."అన్నాడు.ఆ విధంగా చేసేసరికి కొంతకాలానికి అతని అజీర్ణ వ్యాధి తగ్గిపోయింది.ఆ సమయానికి అతని పుట్టినరోజు వచ్చింది.తన పుట్టిన రోజికి అజీర్ణ వ్యాధి తగ్గింది కనుక అందరికీ మిఠాయిలు పంచాలనుకున్నాడు.ఒక మిఠాయి అంగడికి వెళ్ళాడు,అక్కడ మిఠాయి కొంచముగిల్లి నోట్లో వేసుకున్నాడు.ఉప్పగా ఉంది. అదిసరిలేదని మరొక అంగడికి వెళ్ళాడు.అక్కడకూడా మిఠాయిని రుచి చూస్తే ఉప్పగా అనిపించింది.ఈ విధముగా అయిదారు అంగళ్ళు దాటిపోయాడు.ఇతనిపరిస్థితి ఆరవ అంగడివాడు చక్కగా కనిపెట్టాడు.ఈ శ్రీమంతుడు అతనిదగ్గరకు వెళ్ళేసరికి "అయ్యా ! ఎదురుగా కుళాయి ఉన్నది .ముందు నువ్వు నోరు కడుక్కొనిరా ! అప్పుడు లడ్డు రుచి చూపిస్తాను "అన్నాడు.ఆశ్రీమంతుడు కుళాయి దగ్గరకు పోయి నోటిలోఉన్న ఉప్పుగడ్డను పార వేసి నోరు క్లీన్ చేసికొని లడ్డు రుచి చూశాడు. "ఆహా ! చాలా మధురముగా ఉన్నది అన్నాడు.అపుడా అంగడివాడు చెప్పాడు."పిచ్చివాడా ! నోటిలో ఉప్పు గడ్డను పెట్టుకొని లడ్డు తింటే తీయగా , ఉంటుందా ?".   అదే విధముగా నాస్తికత్వమనే రోగమును, దుర్గుణములు,దురాలోచనలు , దుశ్చింతలు అనే చేదును తనయందు ఉంచుకొని మధురమైన దైవనామములు , భగవత్సంబంధమైన విషయములు ఎన్ని విన్నప్పటికి అవి చేదుగానే ఉంటాయి.ఆధ్యాత్మికము దూరమైపోతుంది .   (శ్రీ సత్యసాయి వచనామృతము )

కామెంట్‌లు లేవు: