18, అక్టోబర్ 2020, ఆదివారం

 సభా పర్వము -6

ద్రౌపది వస్త్రాపహరణం

అలా దుర్యోధనుడు అడిగేసరికి తప్పని సరి పరిస్థితిలో ధృతరాష్ట్రుడు విదురునితో ” విదురా! మనము ఒక సభ నిర్మించాము కదా దానిని చూడటానికి ధర్మరాజుని అతని తమ్ములతో ఆహ్వానించి నీతో తీసుకుని రా. పొద్దు పోవడానికి దుర్వోధనునితో జూదం ఆడుతాడు ” అన్నాడు. విదురుడు జూదం అనర్ధమని ఎన్ని మార్లు చెప్పినా ప్రయోజనం లేక పోయింది. ఇక తప్పదని ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు.

ధర్మరాజు విదురుని సాదరంగా ఆహ్వానించాడు. విదురుని రాకకు కారణం తెలుసుకున్న ధర్మరాజు విదురునితో ” విదురా ! మా పెదనాన ఆహ్వానం మన్నించి నీ వెంట వస్తాము . సభను చూస్తాము కానీ జూదం తగునా జూదం వలన విభేదాలు వస్తాయి. అయినా దృతరాష్ట్రుని ఆజ్ఞ మాకు శిరోధార్యము . అందుకని మీతో వస్తాము ” అన్నాడు. హస్థినాపురంలో కుమారులతోను భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు , శకుని, అశ్వత్థామ, సైంధవుడు మొదలైనవారితో ఉన్న దృతరాష్ట్రుడికి, భానునుమతి మొదలైన కోడళ్ళతో ఉన్న గాంధారి కి ధర్మరాజాదులు నమస్కరించారు. ద్రౌపది సౌందర్యానికి గాంధారి కోడళ్ళకు ఆశ్చర్యంతో కూడిన అసూయ చెందారు. దుర్యోధనునితో కలసి పాడవులు సభను తిలకించి సుఖానుశీనులైనారు.

ఆ సమయంలో దుర్యోధనుడు ” ధర్మజా! కొంచెం సేపు జూదం ఆడతాము. నీకు జూదం ఆడటంలో ఆసక్తి ఉంది కదా ” అన్నాడు. ధర్మరాజు ” సుయోధనా ! జూదం అందులో మోసపూరిత జూదం క్షత్రియ ధర్మం కాదు. రాజులు జూదం ఆడుట ధర్మం కాదు. కుటిలులతో జూదం తగదు. దాని వలన ఎంతటి వారైనా సంపద కోల్పోతారు. ధర్మ జూదంలో గెలవడం పుణ్యం , కపట జూదంలో గెలవడం పాపం ” అన్నాడు. శకుని ” జూదంలో నేర్పరులు, లోకజ్ఞానం కలవారు, సుక్షత్రియులు, రాజనీతి తెలినవారు జూదాన్ని నిందించటం తగదు. బలహీనులు బలవంతులను ఓడించటానికి మాయలు పరిపాటి కదా. నీకు భయమైతే వద్దు ” అన్నాడు. ధర్మరాజు ” బలవంతంగా జూదానికి పిలువబడ్డాము. ఆడక తప్పుతుందా. ఇక మాటలెందుకు కానివ్వండి ” అన్నాడు. ధర్మరాజు ” మీలో నాతో ఎవరు జూదం ఆడుతారు ” అని అడిగాడు. దుర్యోధనుడు ” ధర్మజా! నా తరఫున శకుని జూదం ఆడతాడు అతడు ఓడిన ధనరాశులు నీవి ” అన్నాడు. ధర్మరాజు ” ఒకరి కోసం ఒకరు ఇది అక్రమం ” అనుకున్నాడు. చేసేది లేక తన చేతి రత్నఖచిత కంకణాన్ని ఫణంగా పెట్టాడు. జూదం స్నేహపూరితంగా జరుగుతున్నది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు వికల మనస్కులై చూస్తున్నారు.

శకుని తనకోసం చేయించుకున్న ప్రత్యేక పాచికలతో జూదం ఆడి గెలుస్తున్నాడు. ధర్మరాజు లో పంతం పెరిగింది. ఒకటి తరువాత ఒకటిగా ఒడ్డుతూ ఓడుతున్నాడు. బంగారు బండాగారాలు, వజ్రాల బండాగారాలు, రత్నబండాగారాలు, బంగారు నిధులు, అశ్వములు, ఏనుగులు, సేవకులు, దాసదాసీ జనాలు, గూవులు, సేనావాహిని, అన్నింటినీ ఓడి పోయాడు. ఇది చూసి విదురుడు దృతరాష్ట్రునితో ” దుర్యోధనుడు పాపాత్ముడు కురు వంశం పాపంతో నిండపోతుంది. దుర్యోధనుని నివారించు. ధర్మాన్ని రక్షించు. వినాశనాన్ని ఆపించు. దుర్యోధనుని బహిష్కరించు. అతడు బలవంతులతో యుద్ధానికి కాలుదువ్వుతున్నాడు. జూదాన్ని ఆపు ఉపేక్షించకు ” అన్నాడు. పుత్రుల మీద మమకారంతో ధృతరాష్ట్రుడు మిన్నకున్నాడు. విదురుడు దుర్యోధనునితో ” సుయోధనా ! నువ్వు ఈ ప్రకారంగా శకుని సహకారంతో పాండవులను కొల్లగొడుతుంటే ప్రజలు ఛీ కొట్టరా ? ఇలా మోసం చెయ్యటం మంచిదా ” అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు విదురుని చూసి కోపంతో ” నువ్వు ఎప్పుడూ పాండవుల పక్షాన మాట్లాడతావు. నువ్వు మా ఇంట్లో ఉంటే విష సర్పం ఉన్నట్లే. శత్రువుల సంపదను సులభ మార్గంలో అపహరించడం రాజధర్మం. కనుక మాకు బుద్ధులు చెప్పద్దు ” అని దూషించాడు. శకుని ధర్మరాజు తో ” ధర్మజా! నీవు నీ సంపదనంతా పందెంలో ఒడ్డి ఓడావు. తరువాత పందెం ఏమిటి ” అన్నాడు. అప్పటికే ధర్మరాజు జూదానికి బానిస అయ్యాడు. తన సమస్త రాజ్యాన్ని ఒడ్డి ఓడిపోయాడు. తరువాత బ్రాహ్మణులకు, దేవాలయాలకు ఇచ్చిన భూములు తప్ప మిగిలిన ఆస్తులను ఒడ్డి ఓడిపోయాడు. తన తమ్ములను ఒడ్డి ఓడిపోయాడు ఆఖరున తనను తాను ఓడ్డుకున్నాడు. అప్పుడు శకుని ” ధర్మజా ! అదేమిటి నిన్ను నీవు ఒడ్డుకున్నావు. నీ వద్ద ఒడ్డడానికి మరొక ధనం ఉంది మరిచి పోయావా ? నీ భార్య ద్రౌపది నీ ధనం కాదా?” అని ఎత్తి పొడిచాడు. అప్పుడు పాచికలు అందుకున్న ధర్మరాజు ద్రౌపది ని ఫణంగా పెట్టి ఓడి పోయాడు. అప్పుడు ఆట చాలించాడు.

ఇదంతా చూస్తున్న భీష్మునకు నోట మాటరాలేదు. విదురుడు దుఃఖిస్తున్నాడు. కర్ణుడు, సైంధవుడు ఆనందంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పడు ధృతరాష్ట్రునికి తెలివి వచ్చింది. ” విదురా! ఏమైంది? ఎవరెవరు ఏ పందాలు ఒడ్డారు?” అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు విదురుని చూసి ” నా ఇల్లు తుడవటానికి దాసి ద్రౌపదిని పిలుచుకురా ” అని ఆజ్ఞాపించాడు. విదురుడు ” ఛీ నీవంటి మూర్ఖుడు లేడు. ఇలాంటి పనికి నన్ను పంపుతారా. ద్రౌపది ఎవరు ? సమస్త భూమండలానికి పట్టమహిషి. ఆ సాధ్విని అవమానిస్తారా ! ” అని అడిగాడు. సుయోధనుడు ప్రాతిగామి అను సూతనందనుని పిలిచి ” నీవు పోయి ద్రౌపదిని సభకు తోడ్కొని రా ” అన్నాడు. ప్రాతిగామి ద్రౌపది వద్దకు పోయి ” అమ్మా ! ధర్మరాజు జూదంలో సమస్త సామ్రాజ్యాన్ని, తమ్ములను, తనను, నిన్ను ఓడిపోయాడు. దుర్యోధనుడు నిన్ను సభకు తీసుకురమ్మని నన్ను పంపాడు. పదమ్మా పోదాము ” అన్నాడు. అప్పుడు ద్రౌపది ” అయ్యా! ఏ యుగంలోనైనా ఇలాంటి చెడ్డ జూదగాడు ఉంటాడా ? ధర్మరాజు ఇలా చేసాడా? తనను కూడా ఓడాడు అంటున్నావు. తన్నోడి నన్నోడెనా ? నన్నోడి తన్నోడెనా ? తెలుసుకుని వచ్చి నన్ను తీసుకు పో ” అన్నది. ప్రాతిగామి తిరిగి వచ్చి ఇదే విషయం అడిగాడు. ” ఇది సమాధానం చెప్ప వీలులేని విషయం. ఇక్కడికే వచ్చి అడగమను. నీవుపోయి ద్రౌపది ని తీసుకు రా ” అని పంపాడు. ప్రాతిగామి ద్రౌపది వద్దకు పోయి ” అమ్మా! నీవు అడిగిన విషయం తెలుసుకోవడానికి నిన్ను అక్కడికి రమ్మన్నారు ” అన్నాడు. చేసేది లేక ద్రౌపది ఏకవస్త్రంతో సభకు వచ్చింది. దృతరాష్ట్రుని పక్కన నిలబడింది. ద్రౌపది దుస్థితి చూడలేక పాండవులు తలలు వంచుకున్నారు.

అప్పుడు దుర్యోధనుడు దుశ్శాశనుని చూసి ” నీవు పోయి ద్రౌపదిని ఇక్కడికి తీసుకు రా ” అన్నాడు. ద్రౌపది ఒక్క పరుగున గాంధారి పక్కకు పోయి నిలబడింది.

దుశ్శాసనుడు ద్రౌపదితో ఎక్కడికి పోతావు నిన్ను శకుని జూదంలో గెలిచాడు. నువ్వు దుర్యోదనుని సొత్తు అయినావు ” అంటూ దగ్గరికి వచ్చాడు. ” అయ్యా నేను రజస్వలను. ఏకవస్త్రను. నన్ను ముట్టవద్దు. సభకు రాలేను ” అన్నది. దుశ్శాసనుడు నవ్వి ” ఏకవస్త్రవైనా విగత వస్త్రవైనా రాక తప్పదు. నేను నిన్ను తీసుకు పోతాను ” అంటూ దుశ్శాసనుడు ద్రౌపది కురులు పట్టుకుని ఈడ్చుకుంటూ సభకు తీసుకు వచ్చాడు. ద్రౌపది కురువంశ పెద్దలను చూసి ” అయ్యా! దుశ్శాసనుడు నన్ను ఈ సభకు ఈడ్చుకు వచ్చాడు. మీరందరూ చూస్తుండగా అవమానించాడు. అధర్మం పెరిగి పోయింది ” అని అంటూ భయంతో మనసులో శ్రీకృష్ణుని ధ్యానించింది. భీముడు ధర్మరాజు ని చూసి ” ఓ ధర్మజా! ఈ రాజ్యం, నీ తమ్ములు నీ వశంలో ఉన్నాము కనుక జూదంలో ఒడ్డావు. దృపదరాజ పుత్రిని జూదంలో పెట్టడం తగునా ? అందు వలన ద్రౌపది అవమానాల పాలైంది. జరుగుతున్నది అధర్మ జూదమని తెలిసి నువ్వు జూదం ఆడావు. నీ చెయ్యి కాల్చాలి కదా ” అర్జునుడు ” అన్నయ్యా ! స్నేహంగా ఆడుకునే జూదానికి , ధర్మయుద్ధానికి పిలిస్తే పోవడం రాజధర్మం. అందుకనే ధర్మరాజు ధర్మం పాటించి ఆడాడు కాని విధి వైపరీత్యానికి ఏమి చేస్తాం ? ” అన్నాడు.

దుర్యోధనుని తమ్ముడు వికర్ణుడు ” ఈ సభలో ఉన్న కురువృద్ధులు , గురువులు, పెద్దలు అందరూ మౌనంగా ఉన్నారు. మిగిలిన వారైనా ధర్మం చెప్పండి. ఆలోచించండి ఇక్కడ జరుగుతున్నది ధర్మమా ? ” అన్నాడు. ఎవరూ బదులు చెప్పక పోవడం చూసి వికర్ణుడు ” నేను ఇక్కడ ధర్మనిర్ణయం చేస్తాను. జూదం, వేట, మద్యపానం, అతిగా తినడం దుర్వ్యసనాలు. వీటి వలన మానవులు ధర్మం తప్పి ప్రవర్తిస్తారు. అలాంటి వారు చేసే పనులు లెక్కలోకి రావు. ఒక జూదరి చేత పిలువబడిన వ్యసనపరుడైన మరో జూదరి ధర్మరాజు పాండవుల ఉమ్మడి ధనమైన ద్రౌపది ని ఫణంగా పెట్టి ఆడి ఓడడం ధర్మం కాదు. పైగా ఏకవస్త్రను సభకు తీసుకు రావడం అన్యాయం ” అన్నాడు.

కర్ణుడు వికర్ణుని చూసిన కర్ణుడు ” ఎందుకీ అధిక ప్రసంగం ? చిన్నవాడివి ధర్మం గురించి నీకేమి తెలుసు. ఇంత మంది పెద్దలు ఉండగా ధర్మ నిర్ణయం చెయ్యడం నీకు తగదు. ద్రౌపది ధర్మరాజు ధనం. కనుక ధర్మ విజిత. లేకుంటే పాండవులు అంగీకరిస్తారా. పెక్కు మంది భర్తలు కలిగిన ద్రౌపది బంధకి. అలాంటి వారిని ఏకవస్త్రగానే కాదు. విగత వస్త్రగా తెచ్చినా అధర్మం కాదు ” అన్నాడు. దుర్యోధనుడు ఇలా అన్నాడు ” కర్ణుడు బాగ చెప్పాడు. దుశ్శాశనా ! ద్రౌపది పాడవుల వస్త్రాలు తీసుకో ” అన్నాడు. దుశ్శాసనుడు ఇది ధర్మం కాదు అని ఆలోచించక ద్రౌపది కట్టుకున్న చీరను లాగాడు. విచిత్రంగా ద్రౌపది నడుముకు ఉన్న చీర నడుము భాగాన్ని వదలలేదు. లాగుతుంటే అలాంటి వస్త్రాలు వస్తూనే ఉన్నాయి. విప్పిన చీరలు గుట్టలుగా పడ్డాయి కాని ద్రౌపది నడుముకు చీర అలాగే ఉంది. ఇది చూసి దుశ్శాసనుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇది చూసి భీముడు ఆగ్రహంతో ” కురువృద్ధులు, బంధువులు సభాసదులు చూస్తుండగా ద్రౌపది ని ఇలా అవమానించిన దుశ్శాశనుని సుయోధనుడు చూస్తుండగా యుద్ధ భూమిలో ఘోరంగా చంపి అతని రక్తం దోసిలి పట్టి తాగకుంటే నేను నా పితృ పితామహులకు పుట్టలేదు ” అని భీముడు భీకర ప్రతిజ్ఞ చేసాడు. సభలోని వారు ” కుమారుడి మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు ద్రౌపది అడిగిన దానికి ఉపేక్షించాడు ” అని అనుకున్నారు.

కామెంట్‌లు లేవు: