18, అక్టోబర్ 2020, ఆదివారం

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*702వ నామ మంత్రము*


*ఓం సర్వగాయై నమః*


సర్వజీవులలోను, సమస్త వస్తుజాలమునందును, సకల ప్రదేశములలోను, ఇందు, అందు అనక ఎందైననూ సర్వాంతర్యామియై యుండు అఖిలాండేశ్వరియైన ఆ జగన్మాతకు నమస్కారము.  


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సర్వగా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రముసు *ఓం సర్వగాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తిప్రపత్తులతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకునకు ఆ జగన్మాత కరుణతో అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదతోబాటు, భౌతికపరమైన సుఖసంతోషములు కూడా ప్రసాదించును. సాధకుడు ఆధ్యాత్మికపరమైన జీవనము గడిపి తరించును.


ఇంతకు ముందు (701వ నామమంత్రములో) *దేశకాలాపరిచ్ఛిన్నా* అని చెప్పాము. జగన్మాత అందు, అందు అనక ఎందైనా ఉంటుందనియు (దేశాపరిచ్ఛిన్నము లేనిదనియు) , అలాగే ఇప్ఫుడు, తరువాత రాబోయే కాలంలో, ఇంతకుముందు, ఎప్పుడో? అని కాకుండా, సృష్టికి ముందు, సృష్టి తరువాత, లయం తరువాత కూడా ఉంటుంది అంటూ కాలాపరిచ్ఛేదం లేనిదిగా సర్వదా ఉండునని అన్నాము. అనగా *దేశకాలాపరిచ్ఛిన్నా* - ప్రదేశపరంగాను, కాలపరంగాను విభజించుట గాని కొలుచుటగాని వీలు లేనిది. అందుచే జగన్మాత *సర్వగా* *(సర్వ* అనగా సర్వదేశ కాలములందు, *గా*) అంతర్యామిగా ఉంటుంది.


దేవి తానే సృష్టిరూపిణియై శ్వేతపర్వతముపై బ్రహ్మగూర్చి తపస్సు చేసెను. బ్రహ్మపత్యక్షమై కావలసిన వరము కోరుకొనుము అని చెప్పెను. అప్పుడు సృష్టిస్వరూపిణి అయిన దేవి బ్రహ్మతో 'నేను ఒకచోటు అని కాకుండా అన్నిచోట్లా, సర్వాంతర్యామిగా ఉందును.అట్లు వరమీయము' అని అనగా బ్రహ్మ అట్లే వరమిచ్చెను. 


శ్రీమద్భాగవతంలో ప్రహ్లాదుడు ఆ సర్వాంతర్యామి అయిన పరమాత్మ ఎందైనా గలడని ఈ క్రింది పద్యముద్వారా చెప్పబడెను.


*బమ్మెర పోతనామాత్యులవారి పద్యుము*


*కంద పద్యము*


ఇందు గలఁ డందు లేఁ డని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెం దెందు వెదకి చూచిన

నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."


భావం


ఓ హిరణ్యకశిప మహారాజా! శ్రీమహావిష్ణువు ఇక్కడ ఉంటాడు; ఇక్కడ ఉండడు; అని చెప్పడానికి లేదు. అయన సర్వోపగతుడు అంటే సర్వకాల సర్వావస్థల అన్నటి యందు ఉండే వాడు. ఈవిషయంలో ఏమాత్రం సందేహం అన్నది లేదు; అందుచేత ఎక్కడైనా సరే వెతికి చూడాలే కాని అక్కడే ఉంటాడయ్యా. రాక్షసరాజా!

 

ఈ సంఘటన కేవలం భగవానునికేకాదు, సర్వాంతర్యామియైన జగన్మాతకు కూడా అన్వయింపబడుతుంది. ఎందుకంటే సృష్టిని నిర్వహించడాని శ్రీమాత త్రిమూర్తులను నియమించింది. వారు సర్వాంతర్యాములయి ఉన్నారు. మరి *శ్రీమహారాజ్ఞి* అయిన అఖిలాండేశ్వరి కూడా సర్వాంతర్యామియే గదా! అందుచే జగన్మాత *సర్వగా* అని నామప్రసిద్ధమైసది. బ్రహ్మదేవుడు శ్రీమాతకు వరమిచ్చునపుడు ఆమెను *సర్వరూప* అని సంబోధించెను. అంటే సృష్టిలో సర్వజీవులయందు, సర్వవస్తు జాలములయందు, ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో, ఎప్పుడు, ఎలా చూడాలంటే అలా దర్శనమిస్తుంది. జగన్మాత *మహాచతుష్షష్టికోటి యోగినీ గణసేవితా* (లలితా సహస్రనామస్తొత్రమందు 58వ శ్లోకము, 2వ పాదము మరియు శ్రీలలితా సహస్రనామావళి యందు 237వ నామ మంత్రము) అరవైనాలుగు కోట్ల యోగినులచే లేదా శక్తి గణములచే సేవింపబడుచున్నది. అనగా జగన్మాత అన్నికోట్లరూపాలలో మనచే ఆరాధింపబడుచున్నది. శక్తిపీఠాలు, గ్రామదేవతలు ఇలా ఎన్నో రూపాలలో, సృష్టిలోని సర్వజీవులచే సేవింపబడుతోంది. కాబట్టీ జగన్మాత *సర్వగా* అని నామ ప్రసిద్ధమైనది. జగన్మాత అన్నిటితో అభేదమును పొందియుండుట, అన్ని శరీరములందు సగుణ స్వరూపముతో ఉండుట, అంతర్యామిరూపముగా ఉండుట యగుటచే *సర్వగా* యను నామముతో ప్రసిద్ధి నందినది. దేవీ పురాణములో ఇలా చెప్పబడినది - "వేదములు, యజ్ఞములు, స్వర్గము శ్రీమాతయే అయి ఉన్న అభేదరూపము. స్థావరజంగమాత్మకమయిన జగత్తు అంతటను దేవియే వ్యాపించియున్నది. ఇది అంతర్యామిత్వము అన్నపాన స్వరూపురాలుగా స్తుతింపబడి, పూజింపబడుచున్నదని చెప్పుట. వృక్షము, భూమి, వాయువు, ఆకాశము, నీరు, అగ్ని వీటిలో నామరూపములతో వ్యాపించియున్నది శ్రీమాత. వీటిలో స్థులరూపమున శాస్త్రప్రకారము పూజింపదగినది" అందుచే శ్రీమాత *సర్వగా* యని స్తుతింప బడుచున్నది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సర్వగాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: