19, సెప్టెంబర్ 2020, శనివారం

🌺💥పురాణ కథలు🌺💥



🌺అక్షరాలా దేహం ఓ వృక్షమే!🌻

 

మానవ దేహం వృక్షంతో సమానం. అది ఎలా? అనే విషయాన్ని వివరించి చెప్పేదే ఈ కథాసందర్భం. మహాభారతం అశ్వమేధపర్వం ముప్పైఅయిదో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విషయాలను వివరించి చెప్పాడు. మానవ దేహం అక్షరాలా ఓ వృక్షం లాంటిది. అజ్ఞానం అనేది ఈ వృక్షానికి మూలమైన బీజం. బుద్ధి దాని బోదె. అహంకారం ఆ చెట్టుకు ఉండే కొమ్మలు. ఇంద్రియాలు ఆ చెట్టు మానుకు ఉన్న తొర్రలు. పంచమహాభూతాలు ఆ వృక్షానికి ఉన్న విశేషమైన అవయవాలు. ఆ పంచభూతాల విశేష భేదాలు కొమ్మల నుంచి పుట్టుకొచ్చిన చిరుకొమ్మలు. ఈ కొమ్మలకు, చిరుకొమ్మలకు నిరంతరం సంకల్పాలు అనే ఆకులు పుడుతుంటాయి. కర్మలు అనే పూలు పూస్తుంటాయి. 

పిచ్చిమొక్కల్లా మిగలగూడదు..  

శుభ, అశుభ కర్మలవల్ల కలిగే సుఖదుఃఖాదులే ఆ చెట్టు పండ్లు. ఇలా బ్రహ్మరూపమైన బీజం నుంచి పుట్టుకొచ్చి ప్రవాహరూపంగా నిరంతరం ఉండే దేహం అనే వృక్షం జాగ్రత్తగా పరిశీలిస్తే అంత సామాన్యమైనదేమీకాదు. అది చాలా గొప్పదే. ఎందుకంటే అది ఎన్నెన్నో ప్రాణుల బతుకులకు ఆధారంగా ఉంటుంది. ఆ దేహమనే వృక్షతత్వాన్ని అందరూ గ్రహించగలగాలి. ఆ తత్వం అర్థం కావాలంటే సద్గురువుల ఉపదేశాలు అవసరం. అయితే ఒకసారి అలా ఉద్భవించిన దేహం సంసార సముద్రంలో పడి తాను, తనవాళ్లు అని కొట్టుమిట్టాడుతూ స్వార్థంతో నిండిపోతే కష్టమే. నిస్వార్థంగా నిజమైన చెట్టులాగా అందరికీ సహాయపడాలే తప్ప పిచ్చి మొక్కల్లాగా పనికిరాని తీరులోనూ అందరికీ ఇబ్బంది కలిగించే చెట్లలాగా మనిషి దేహం మారకూడదు. తన దేహం అలా మారుతోంది అని సందేహం కలిగినప్పుడు సద్గురువు సూచనల మేరకు జ్ఞానం అనే ఉత్తమ ఖడ్గాన్ని తీసుకొని అజ్ఞాటవు ఆలోచనలను నశింపచేసుకోవాలి. అప్పుడే మానవ దేహం అందరికీ నీడనిచ్చే మంచి చెట్టులాగా పేరు తెచ్చుకుంటుంది. అలా కానప్పుడు ముళ్లచెట్టులాగానో, పిచ్చిచెట్టులాగానో అందరి నిరాదరణకు గురవుతుంది. 

బ్రహ్మ చెప్పిన మంచిచెడ్డలు  

సనాతన జ్ఞానవిషయం ధర్మాన్ని అనుసరిస్తూ అలా మనిషి తన దేహాన్ని అన్ని ధర్మకార్యాలకు సాధనంగా వినియోగిస్తుండాలి. ఈ విషయం తెలిసిన వారే జీవితం ఫలవంతం చేసుకోగలరు. వారే విద్వాంసులు, సిద్ధులు అని పేరు పొందుతారు. పూర్వకాలంలో దక్షప్రజాపతి, భరద్వాజుడు, గౌతముడు, శుక్రుడు, వసిష్ఠుడు, కశ్యపుడు, విశ్వామిత్రుడు, అత్రి అనే మహర్షులు తమతమ మార్గాలలో పెద్దపెద్ద వృక్షాలు మానవాళికందించినంతటికీ సుఖాన్ని అందించారు. అయితే దేహమైనా, వృక్షమైనా కొద్దికాలంపాటే భూమ్మీద ఉండగలిగేది. కనుక కొంతకాలానికి వారికి అలసట వచ్చింది. అప్పుడు వారంతా కలిసి అంగిరస మునిని వెంటపెట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు. వెళ్లి అంతకాలంపాటు తామెన్నో పనులు చేశామని ఆ పనులన్నీ మంచివేనా? లేకపోతే శ్రేష్ఠకర్మ ఎలా చేయాలి? ఒకవేళ పాపం చేసి ఉంటే ఆ పాపం నుంచి ఎలా బయటపడాలి? అనే విషయాలను గురించి చెప్పమన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారందరికీ మంచి పనులు, పుణ్యకార్యాల విషయాలను తెలియచెప్పాడు. బ్రహ్మ చెప్పిన విషయాలతోపాటు తాము చేసిన పనులు సరిపోల్చుకొని ఆదర్శవంతమైన జీవితాన్ని మళ్లీ సాగించారు ఆ రుషులు. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియచెప్పాడు. ఈ కథాసందర్భంలో గమనించాల్సిన విషయం ఒకటుంది. మనిషి నిస్వార్థంగా ఓ మంచి చెట్టులాగా అందరికీ సహాయపడుతూ ఉండాలి. ఎన్ని మంచి పనులు చేస్తున్నా చివరకు అనుభవజ్ఞుల దగ్గర తమ పనులను సమీక్షించుకుంటూ మంచి, చెడులను బేరీజు వేసుకుంటూ మందుకు నడవాలనే జీవన మార్గదర్శక సూత్రాన్ని ఈ కథాసందర్భం వివరిస్తోంది.

కామెంట్‌లు లేవు: