12, మే 2023, శుక్రవారం

సాధువు

 


                    *సాధువు*

                 ➖➖➖✍️

 

*ఒక గ్రామంలో ఒక జమీందారు నివసించేవాడు. ఆయన కుటుంబంలో ఎవరూ బ్రతికిలేరు. ఆయన ఒంటరిగా ఉండేవాడు.  జమీందారు వద్ద ఒక పాలేరుకుర్రాడు ఉండేవాడు. వాడికీ ఎవరూలేరు. వాడు పశువులను మేపేవాడు. ప్రతీరోజు ఉదయాన్నే పశువులను మేతకు తీసుకువెళ్ళి, మధ్యాహ్నం దాకా వాటిని బాగా మేపి తీసుకువచ్చేవాడు.*


*జమీందారుగారి వంటమనిషి వాడికి అన్నం పెట్టేది. ఇది వారికి నిత్యకృత్యం. ఒకరోజు ఆ కుర్రాడు పశువులను బాగా మేపి మధ్యాహ్నమవుతుండగా తిరిగివచ్చాడు. ఆరోజు చాలా ఎండగా ఉంది. ఆకలితో నకనకలాడుతున్నాడు. రోజూలానే భోజనం చేయడానికి సిద్ధంగా కూర్చున్నాడు. వంటమనిషి ఎప్పట్లానే అతనికి చద్దిఅన్నం పెట్టింది. అతడు కొంచెం మజ్జిగగాని, జావగాని పొయ్యమన్నాడు. *


*దానికి ఆ పనిమనిషి - "నీకోసం నేను జావ కాచాలా? తింటే తిను. లేకపోతే పో" అని విసుక్కుంది.*


*వంటమనిషి మాటలతో ఆ బాలుడి హృదయం గాయపడింది. తిరిగి తిరిగి, అలసిపోయి ఆకలితో అన్నం పెట్టమని వస్తే నన్ను విసుక్కుంటుందా అని బాధపడి అన్నం తినకుండానే వెళ్ళిపోయాడు.* 


*అలా నడుస్తూ నడుస్తూ, దగ్గరలోని పట్టణానికి వెళ్ళాడు. ఆ నగరంలో ఒక సాధువుల మఠం ఉంది. ఆ మఠంలోని సాధువులు ఆ కుర్రాణ్ణి చేరదీసి, అన్నం పెట్టి, ఏ ఊరినుంచి వచ్చావని అడిగారు. అతడు తాను అనాథనని, తనకు ఎవ్వరూ లేరని బదులిచ్చాడు.*


*సాధువులు "నువ్వు కూడా సాధువుగా మారిపోయి యిక్కడే ఉండిపో" అన్నారు.*


*ఆ బాలుడు అలానే సాధువుగా మారిపోయి, మఠం ఆశ్రయాన్ని పొందాడు. విద్యాభ్యాసం కోసం కాశీకి వెళ్ళాడు. అక్కడ బాగా చదువుకొని గొప్ప పండితుడయ్యాడు. కొంత కాలానికి అతడే ఆ మఠానికి అధిపతి అయ్యాడు.*


*కొన్ని రోజులకు అతని స్వగ్రామానికి రమ్మని, అతనికి ఆహ్వానం లభించింది. మఠాధిపతి కావడంతో తన పరివారాన్ని తీసుకుని అతడు గ్రామానికి బయలుదేరాడు.*


*పూర్వం అతడు పాలేరుగా పనిచేసిన జమీందారు అప్పటికి బాగా వృద్ధుడయ్యాడు. ఆయనే ఈ కొత్త మఠాధిపతికి ఆతిథ్యం యిచ్చాడు.*


*సన్యాసి పూర్వాశ్రమంలోని తన యజమానిని గుర్తుపట్టాడు గాని, వృద్ధుడైన జమీందారు తనవద్ద పనిచేసిన బాలుడే, ఈ మఠాధిపతిగా మారాడని గుర్తుపట్టలేకపోయాడు.*


*జమీందారు యింటిలో మఠాధిపతికి, అతని పరివారానికి భోజనాలు ఏర్పాటుచేయబడ్డాయి.*


*సాధువులందరూ భగవద్గీతలోని 15వ అధ్యాయాన్ని (పురుషోత్తమ ప్రాప్తి యోగము) పారాయణ చేసి, భోజనానికి ఉద్యుక్తులయ్యారు.*


*మఠాధిపతి ఎదుట రకరకాల భోజన పదార్థాలు అమర్చబడి ఉన్నాయి.*


*ఇంతలో జమీందారు సాధువును సమీపించి - "స్వామీ! నా స్వహస్తాలతో మీకు వడ్డించనివ్వండి. నామీద దయయుంచి నా చేతులతో యిస్తున్న ఈ మిఠాయిని స్వీకరించండి" అని ప్రార్థించసాగాడు.*


*ఇదంతా చూసి ఆ సాధువుకు నవ్వు వచ్చింది. అతడు చిరునవ్వు నవ్వసాగాడు.* 


*జమీందారు వినయంగా - "స్వామీ! మీరెందుకు నవ్వుతున్నారు?" అని అడిగాడు.*


*సాధువు చిరునవ్వుతో "ఏమీలేదు. ఏదో పాతసంగతి జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది" అన్నాడు.*


*జమీందారు ఆ సంగతి ఏమిటో చెప్పమని అడిగాడు.*


*సాధువు తోటి సన్యాసులతో - "అందరూ ఒకసారి ఆగండి. ఈ జమీందారుగారు నేనెందుకు నవ్వుతున్నానో అడుగుతున్నారు. నేను ఆయనకు సమాధానం చెబుతున్నాను" అని జమీందారుని యిలా అడిగాడు.*


*"మీ యింటిలో చాలాకాలం క్రితం ఒక పాలేరు పిల్లవాడు ఉండేవాడుకదా. అతడు ఏమయ్యాడు?" *


*"ఆ పిల్లవాడు పశువులను మేపేవాడు. అతడు ఎప్పుడో యిల్లు వదిలి పెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడకు వెళ్ళాడో, యిప్పుడెక్కడ ఉన్నాడో తెలియదు" అన్నాడు - జమీందారు.*


*ఆ కుర్రవాడిని నేనే. ఆ రోజు కోపంతో యిల్లు విడిచి పెట్టి వెళ్ళిపోయాను. తిన్నగా పట్టణంలోని సాధువుల మఠానికి వెళ్ళాను. వారు నన్ను ఆదరించి ఆశ్రయమిచ్చారు. అక్కడనుండి కాశీకి వెళ్ళాను. అక్కడ చదువుకొని తిరిగివచ్చి మఠాధిపతి నయ్యాను.*

 

*ఇదే ఆ యిల్లు, అదే మీరు అదే నేను. ఆ రోజు ఆకలితో అల్లాడుతుంటే గుక్కెడు గంజి పొయ్యాడానికి మీ వంటమనిషి నిరాకరించింది. ఈ రోజు మీరు మీ స్వహస్తాలతో వడ్డిస్తానని నన్ను ప్రాధేయపడుతున్నారు. ఇదంతా చూసి నాకు నవ్వు వచ్చింది.*


*సాధువుల ఆశ్రయం దొరకగానే, గంజినీళ్ళు కూడా దొరకనివాడికి రాజభోగాలు లభిస్తున్నాయి. భగవంతుని శరణు పొందినవాడు సన్యాసులకు సైతం ఆదరణీయుడవుతాడు. లక్షాధికారో, కోటీశ్వరుడో అవడంకంటే, భగవంతుడైన శ్రీహరికి శరణుజొచ్చి ఆయన భక్తుడయినవాడే  సంతోషం గా     జీవించగలడు. ఇలాంటి అవకాశం కేవలం మానవుడిగా జన్మించినవారికి మాత్రమే లభిస్తుంది.’*✍️

 .          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం… గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

కామెంట్‌లు లేవు: