12, మే 2023, శుక్రవారం

శ్రీ మహాభారతం

 


                శ్రీ మహాభారతం 

                 ➖➖➖✍️

                 349 వ భాగం

   శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:


#మహాప్రస్థానిక_పర్వము


శ్రీకృష్ణుడు, బలరాముడు నిర్యాణము చెందారు. యాదవులు అందరూ మరణించారు. అర్జునుడిని వ్యాసుడు మహాప్రస్థానికి సిద్ధమవమని చెప్పాడు. అదే విషయాన్ని అర్జునుడు ధర్మరాజుకు చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు అర్జునుడితో అర్జునా ! అన్నిభూతములను కాలుడు కాల్చకమానడు. మనము కూడా ఈ శరీరాన్ని వదలవలసిన కాలము ఆసన్నము అయింది. మనము కూడా అన్ని కర్మలను త్యజించవలసిన కాలము సమీపించింది. నీ అభిప్రాయము అదేకదా ! అని అడిగాడు. అర్జునుడు అన్నయ్యా ! మీరు చెప్పినది నిజము. కాలానికి సాటి కాలమే. మనము కూడా కాలముతో పయనించక తప్పదు అన్నాడు. వెంటనే ధర్మరాజు భీమ, నకుల, సదేవులను పిలిపించాడు. వారికి అన్ని విషయములు చెప్పాడు. వారు కూడా ధర్మరాజు మాటలకు అంగీకారము తెలిపారు. 


ధర్మరాజు కురుసామ్రాజ్య వారసులను నిర్ణయించుట:

ధృతరాష్ట్రుడి వారసులలో యుయుత్సుడు ఒక్కడే మిగిలాడు. ధర్మరాజు యుయుత్సుడిని కురుసామ్రాజ్యానికి పట్టభిషిక్తుడిని చేసాడు. పరిక్షిత్తుని యువరాజుగా పట్టభిషిక్తుడిని చేసాడు. యుయుత్సుడికి రాజ్యపాలన గురించిన విషయములు అన్నీ వివరించాడు. తరువాత సుభద్రతో అమ్మా సుభద్రా ! ఈ భరత సామ్రాజ్యానికి నీ మనుమడు ఉత్తరాధికారి అయ్యాడు. శ్రీకృష్ణుడి మనమడు వజృడు ఇంద్రప్రస్థానికి రాజు అయ్యాడు. ఈ విధముగా కురువంశము, యాదవవంశము వర్ధిల్లుతాయి. ఈ రెండు వంశాలను నీవే రక్షించాలి అని సుభద్రను రెండు వంశాలకు సంరక్షకురాలిగా నియమించాడు. తరువాత భారతయుద్ధములొ మరణించిన వీరుల కుటుంబాలకు అగ్రహారాలు, గ్రామాలు, ధనము ఇచ్చి వారి పోషణకు తగు ఏర్పాట్లు చేసాడు. బ్రాహ్మణులకు గోదానములు, భూదానములు, సువర్ణ దానములు విరివిగా చేసాడు. పరిక్షిత్తును కృపాచార్యుడికి శిష్యుడిగా అప్పగించాడు. తరువాత హస్థినాపురప్రజలతో ఒక సభ ఏర్పాటు చేసాడు. 


పాండవులు మహాప్రస్థానికి తరలుట:

ధర్మరాజు హస్థినాపుర వాసులను పిలిచి ఏర్పాటు చేసిన సభలో హస్థినాపుర వాసులతో హస్థినాపుర వాసులారా ! మా అయిదుగురికి బదులుగా అభిమన్యుడి కుమారుడిని మహారాజుగా నియమించాను. అతడి మీద కూడా మీరు మీ ప్రేమ అభిమానము చూపండి అని చెప్పాడు. హస్థినపుర వాసులకు పాండవులు వెళ్లిపోతున్నారన్న విషయము అర్ధము అయింది. వారు మహారాజా ! ఏమిటిది ? మమ్ములను ఇలా వదిలి పెట్టి వెళ్ళడము మీకు ధర్మమా ! నీవు ప్రేమమూర్తివి, కరుణామూర్తివి అంటారే ఇదేనా మీ కరుణ. మేమంతా నిన్ను చూసుకుని కదా బ్రతుకుతున్నది. మీరు లేక మేము ఎలా బ్రతుకగలము. మమ్ము వదిలి వెళ్ళడము భావ్యమా అని ప్రార్ధించారు. వారిని ధర్మరాజు అనునయ వాక్యాలతో అనునయించాడు. తరువాత పాండవులు, ద్రౌపది తమ వస్త్రములను మార్చుకుని నారచీరలను, నారవస్త్రాలను, జింకచర్మాలను ధరించారు. ఆభరణములను తీసివేసారు. తరువాత అగ్ని కార్యములు నెరవేర్చి అగ్నిని నీటిలో నిమజ్జనము చేసారు. అందరూ అంతఃపురమును విడిచి బయలుదేరారు. పాండవులు ముందు నడువగా ద్రౌపది వారిని వెంబడించింది. వారి వెంట ఒక కుక్క కూడా వెంబడించింది. హస్థినాపురవాసులు వీధులకు అటూ ఇటూ నిలబడి వారికి కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు. పాండవులు అలా వెళుతున్నప్పుడు హస్థినాపురవాసులకు జూదములో ఓడి అడవులకు వెళుతున్న దృశ్యము గుర్తుకు వచ్చింది. వారి వెంట యుయుత్సుడు సైన్యముతో నడుస్తున్నాడు. అతడి వెంట విచారవదనముతో పరీక్షిత్తు నడుస్తున్నాడు. అందరూ హస్థినాపుర పొలిమేరలకు వచ్చారు. ధర్మరాజు హస్థినాపుర వాసులతో ఇక ఆగమని చెప్పాడు. వారంతా పాండవులకు ప్రదక్షిణలు చేసారు. పాండవులు ద్రౌపదితో ముందుకు సాగారు. యుయుత్సుడు, పరీక్షిత్తు వెనుదిరిగి హస్థినాపురము చేరుకున్నారు. అర్జునుడి భార్య ఉలూపి తన పుట్టిల్లు అయిన నాగలోకము చేరింది. చిత్రాంగధ తన కుమారుడు అయిన బభ్రువాహనుడి వద్దకు చేరింది. కృపాచార్యుడు, ధౌమ్యుడు ధర్మరాజు ఆదేశానుసారము హస్థినాపుర బాధ్యతలను స్వీకరించారు. 


అర్జునుడు గాండీవమును వరుణదేవుడికి ఇచ్చుట:

krishna

గాండీవమును విసర్జించుచున్న అర్జునుడు


పాండవులు ద్రౌపది అలా ప్రయాణిస్తూ ముందుకు సాగి గంగానదిని దాటి తూర్పు సముద్రతీరానికి చేరుకున్నారు. వారి వెంట కుక్క కూడా వారిని అనుసరించి పోసాగింది. అప్పుడు వారికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై అర్జునా ! శ్రీకృష్ణుడి సుదర్శనచక్రము ఎప్పుడో వైకుంఠము చేరింది. నీవు ఇంకా ఈ గాండీవము వదలక ఉన్నావు. దుష్టసంహారణార్ధము నేను ఈ గాండీవాన్ని వరుణుడి వద్ద నుండి తీసుకువచ్చి నీకు ఇచ్చాను. ఇది నీకు ఇచ్చిన కార్యము నెరవేరింది కనుక దీనిని ఇక వరుణదేవుడికి అప్పగించు అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి గాండీవమునకు నమస్కరించి దానిని సముద్రపునీటిలో వదిలాడు. గాండీవము వరుణుడిని చేరింది. తరువాత అగ్నిదేవుడు అదృశ్యము అయ్యాడు. 


పాండవులు ఒకరి తరువాత ఒకరు పడిపోవుట:

krishna

నడవలేక పడిపోయిన ద్రౌపది


పాండవులు దక్షిణ దిక్కుగా ప్రయాణించి అక్కడ నుండి పడమరగా ప్రయాణించి పడమర సముద్రతీరము చేరుకున్నారు. నీటిలో మునిగిన ద్వారక సమీపముకు వెళ్ళారు. తరువాత వారందరూ ఉత్తర దిక్కుగా ప్రయాణించి హిమవత్పర్వతము చేరుకున్నారు. అక్కడ నుండి ప్రయాణించి మేరుపర్వతము చేరుకున్నారు. ఇప్పుడు వారు యోగసమాధిలో ఉన్నారు కనుక వారికి నడకశ్రమ తెలియడము లేదు. ముందుగా ద్రౌపదికి యోగసమాధి సడలింది. ద్రౌపది ఇక నడవలేక నేలమీద పడిపోయింది. అది భీముడు చూసి ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు భీముడితో భీమా ! పాంచాలరాజపుత్రి ద్రౌపదిని అర్జునుడు మత్స్య యంత్రము కొట్టి గెలుచుకున్నాడు కనుక ఈమెకు అర్జునుడంటే అధికమైన ప్రేమ, అనురాగము. ఈమె ప్రేమలో పక్షపాతము ఉన్నది కనుక ఈమె చేసిన పుణ్యములు ఫలించక ఇలా పడి పోయింది అన్నాడు. భీముడు ద్రౌపది వంక చూసాడు. అప్పటికి ఆమె మరణంచింది. ధర్మరాజు నిర్వికారముగా ఆమె శవమును అక్కడే వదిలి ముందుకు సాగాడు. మిగిలిన నలుగురు ధర్మరాజును అనుసరించారు. ఇంతలో సహదేవుడు నేల మీద పడ్డాడు. సహదేవుడు పడి మరణించడము చూసిన భీముడు ధర్మరాజుతో అన్నయా ! సహదేవుడు కింద పడిపోయాడు. సహదేవుడు అహంకారము అంటే ఏమిటో తెలియదు. నిన్ను సదా భక్తితో సేవించాడు. మా అందరిలో సన్మార్గచరితుడు. అతడిలా పడిపోవడానికి కారణము ఎమిటి ? అని అడిగాడు. ఆ మాటలకు ధర్మరాజు అతడికి తన కంటే ప్రాజ్ఞుడు ఈ లోకములోనే లేడన్న గర్వము ఉంది. ఆ గర్వాతిశయముతోనే అతడు కింద పడిపోయాడు అని చెప్పాడు. ఆ తరువాత ధర్మరాజు సహదేవుడిని కూడ ద్రౌపదిలాగానే అక్కడే వదిలి నిర్వికారముగా ముందుకు నడిచాడు. నకులుడు, అర్జునుడు భీముడు ధర్మరాజును అనుసరించారు. కుక్క మాత్రము వారిని వదలకుండా వెన్నంటింది. మరి కొంత దూరము పోయాక నకులుడు కింద పడి మరణించాడు. అది చూసి భీముడు తట్టుకోలేక పోయాడు. ధర్మరాజుతో అన్నయ్యా ! నకులుడు కూడా పడిపోయాడు. అతిసుందరుడు, మంచితనముకు మారుపేరు, అత్యంత శౌర్యవంతుడు, సుగుణాలఖని, ధైర్యవంతుడు ఇటువంటి మంచి గుణములు ఒక్కటిగా రాశిపోసినట్లు ఉండే వాడు. ఇతడిలో ఏ దుర్గుణము ఉందని ఇలా పడిపోయాడు ? అని అడిగాడు. ధర్మరాజు భీమా ! నువ్వు చెప్పినది నిజమే ఇతడికి లేని సుగుణములు లేవు. కానీ ఈ లోకములో తన కంటే అందగాడు లేడని గర్వము ఉంది. ఆ కారణముగా ఇతడిలా పడి పోయాడు అని చెప్పి తిరిగి ధర్మరాజు నిర్వికారముగా ముందుకు సాగాడు. కుక్క కూడా వారిని వదలక వెంబడిస్తుంది. అప్పటివరకు జరిగినది మౌనంగా గమనిస్తున్న అర్జునుని మనసు బాధతో మునిగిపోయింది. తరువాత వంతు తనదేనా అని అనుకున్నాడు. అలా అనుకునేంతలో అర్జునుడు కూడా కిందపడి మరణించారు. అది చూసి భీముడు అన్నయ్యా ! అర్జునుడు కూడా పడి పోయాడు. ఎన్నడూ అబద్ధము ఆడి ఎరుగడు, అతడికి ఉన్న సుగుణములు, సౌర్యపరాక్రమములు ఎవరికి లేవు. అర్జునుడు పడిపోవడానికి కారణము ఎమిటి ? అని అడిగాడు. ధర్మరాజు కొంచెము ఆలోచించి అవును ఇతడు అత్యుత్తమ ధనుర్ధారి. అదే అతడి గర్వముకు మూల కారణము. పైగా ఇతడు ఒక్క రోజులో కౌరవులందరినీ చంపుతానని అతడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చ లేదు. అది నెరవేర్చ లేదు. అందుకే ఆడినమాట తప్పిన వాడు అయ్యాడు. అందుకే అతడికీ దురవస్థ అని అర్జునుడిని అక్కడే మిగిలిన వారిలా వదిలి నిర్వికారముగా ముందుకు నడిచాడు. అది చూసి భీముడికి కూడా భయము పట్టుకుంది. భయం భయంగా నడుస్తూనే నేలమీద కూలిపోతూ ధర్మరాజా ! నేనుకూడా పడిపోయాను. నాలో ఉన్నలోపము ఏమిటి ? నాకు తెలియచెప్పు అని అడిగాడు. ధర్మరాజు భీమసేనా నీవు అత్యుత్తమ గధాదారివి, పరాక్రమవంతుడవు కాని తిండి పోతువు. అనవరంగా మాట్లాడతావు. నికు అనవసరమైన విషయాలన్ని మాట్లాడతావు. అందుకే నీకు ఈ దురవస్థ అని నిర్వికారముగా భీముడిని వదిలి ముందుకు సాగాడు. కుక్క మాత్రము అతడిని వెన్నంటి వెళుతూనే ఉంది. 

✍️.          

            *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

🙏

కామెంట్‌లు లేవు: