22, ఫిబ్రవరి 2021, సోమవారం

మన మహర్షులు - 30

 మన మహర్షులు - 30


  మాండవ్య మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


మాండవ్యుడు   ఒక ముని కుమారుడు. తపశ్శాలి,బ్రహ్మ విద్యాపరుడు బ్రహ్మర్షి,స్ధిరచిత్తుడు . మౌన వ్రతుడు,పుణ్యపురుషుడు,

సత్యవ్రతుడు.


 భూమి మీద ఉన్న అన్ని తీర్థాలు తిరిగి ఒక అడవిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సంవత్సరాలు గడిచిపోతున్నా ఋతువులు మారిపోతున్నా తపస్సులోనే ఉండిపోయాడు.


అటువంటి మాండవ్యునిపై ఒక అపనింద పడింది. ఒకదారి దొంగలు కొందరు రాజభవనంలో ఖజానా

దోచుకొని మాండవ్యుని ఆశ్రమాన పాతిపెట్టి పొదలమాటున పొంచి ఉన్నారు.


రాజభటులు దొంగలను వెతుకుతూ వచ్చి వారు కనపడకపోగా సమీపాన ఉన్న మాండవ్యుని అడిగారు.


మౌనవ్రత మందున్న మాండవ్యుడు సమాధానం చెప్పలేదు.


భటులు ఆశ్రమమంతా వెతకి దొంగలు పాతిపెట్టిన ఖజాన బయటకు తీశారు.దొంగలను బంధించారు.ముక్కు మూసికొని తపస్సు చేసికొనే మాండవ్యుని కూడా దొంగేనని భావించి దొంగలతో పాటు బంధించి తీసికొని పోయారు.


రాజు అందరికీ శిక్ష విధించి మాండవ్యునికి శూలం గుచ్చి పాతివెళ్ళిపోయారు.


 మాండవ్య మహర్షి బాధని లెక్కచెయ్యకుండా నే తపస్సు చేసుకుంటుంటే మిగిలిన మునులందరూ రాత్రివేళ పక్షిరూపంలో వచ్చి ఎవరికీ అపకారం చెయ్యనివాడివి నీకీ కష్టాలేమిటని అడిగారు. 

మహర్షి కర్మఫలం అనుభవించాలి కదా! అన్నాడు


. ఈ మాటలు కాపలా వున్న రక్షకభటులు విని రాజుకి చెప్పారు

రాజు పరుగెత్తుకుంటూ వచ్చి మహాత్మా! తెలియక తప్పు చేశాను. మీరు మహర్షులని తెలియదు. మావాళ్ళు దొంగ అని చెప్తే ఆలోచించకుండా శిక్ష వేశాను క్షమించమని అతని కంఠంలో వున్న శూలాలు తీయడానికి ప్రయత్నించాడు రాజు. అవి ఊడి రాలేదు. ఆ చివర ఈ చివర కోసినా ఒక ముక్క మాత్రం మహర్షి కంఠంలో ఉండిపోయింది. 

ఆ ముక్కకి పూలబుట్ట తగిలించుకుని తిరిగేవాడు


మాండవ్యుడు యమధర్మరాజుని కలిసి నేను చేసిన తప్పేమిటి? ఎందుకు నాకీ శిక్ష వేశావు ? అని అడిగాడు. 


చిన్నతనంలో తూనీగల్ని బాధపెట్టావు, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నావు అన్నాడు యముడు.


అప్పుడు నా వయస్సెంత ? ఏ వయస్సు వరకూ బాల్యం అంటారు? బాల్యంలో చేసినదానికి శిక్ష వుండదంటారు కదా! అని అడిగాడు.


 పుట్టినది మొదలు పన్నెండేళ్ళ వరకూ బాల్యం అంటారు అన్నాడు యమధర్మరాజు.


 మాండవ్యుడు నేనప్పుడు బాల్యంలోనే ఉన్నా నాకు శిక్ష వేశావు కాబట్టి నువ్వు భూలోకంలో

ఒక శూద్రుడికి పుడతావని శపించాడు. అతడే విదురుడు.


జనక మహారాజుకి జ్ఞానం సంపాదించడం అంటే ఇష్టం. ఎప్పుడూ చుట్టూ మహర్షుల్ని పెట్టుకుని చర్చాకార్యక్రమాల్లో ఉండేవాడు. 


మాండవ్యుడు ఒకసారి జనకమహారాజుని కోరికలకి కారణం ఏమిటి? అని అడిగాడు.


ధనమే దీనికంతకీ మూలం. ఆవుతో పాటు కొమ్ములు పెరిగినట్లు మనిషికి కోరికలు పెరిగి దాంతో మమకారం పెరిగి అట్టలు కట్టుకుపోయినట్లయిపోయి దాంట్లోంచి బయటకు

రాలేడు. అందుకే కోరికల్ని చంపుకోవాలని అన్నాడు జనక మహారాజు .


 మరి కొన్నాళ్ళకు మాండవ్యుడు ధర్మరాజును దర్షించడం జరిగింది. మాండవ్యుడు ధర్మరాజునకు .

 అనేక విషయాలు తెలిపి శివమహిమ గురించి వివరించిచెప్పాడు. శివస్మరణ వల్ల దు:ఖములు నశించునని నిత్య శివస్మరణ చేయుమని ఉపదేశించాడు. 


మాండవ్యుడు.జనక,ధర్మరాజాదులకు జ్ఞానోపదేశం చేసి తన శక్తి సామర్ధ్యాలు ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తపశ్శాలి.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: