10, జులై 2024, బుధవారం

స్కూలే లేనిచోట..*

 👆👆👆👆👆👆👆👆👆👆

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀




*స్కూలే లేనిచోట..*

                   పాఠాలు చెబుతూ!*

                 ➖➖➖✍️


*బదిలీపై వెళ్లిన ఆ టీచరమ్మకి అసలు అక్కడ స్కూలే లేదని తెలిసింది. నిర్వాసితులైన వారికి నీడే కష్టం... మరి బడి గురించిన ఆలోచన ఎక్కడుంటుంది? కొత్తూరి శ్రీలత మాత్రం అక్కడున్న విద్యార్థుల భవితవ్యం గురించే ఆలోచించి ఏం చేశారో తెలుసా?...*


*తల్లిదండ్రుల తర్వాత పిల్లల తలరాతను మార్చే   మంత్ర దండం గురువే. అక్షరాలా అది నిజమని నిరూపించారు ఆదిలాబాద్‌లోని కుమురం భీం ప్రాథమిక పాఠశాల టీచర్‌ కొత్తూరి శ్రీలత. 2018 బదిలీల్లో భాగంగా కుమురం భీం కాలనీ పాఠశాలకి పోస్టింగ్‌పై వెళ్లారామె. అక్కడ అసలు బడే లేదని తెలిసి ఆశ్చర్యపోయారు. ఆక్రమణల తొలగింపులో భాగంగా అధికారులు ఆ కాలనీని ఖాళీ చేయించటంతో అక్కడున్న పాఠశాల కాస్తా మూతపడింది. విద్యాశాఖ రికార్డుల్లో మాత్రం అదే పేరుతో పాఠశాల ఉంది. దాంతో శ్రీలత తాను ఇంతకు ముందు పనిచేసిన సాంగడి బడికే డిప్యూటేషన్‌పై తిరిగి వెళ్లిపోయారు. ఈలోగా ఖాళీ చేయించిన కుమురం భీం కాలనీ నిర్వాసితులకు మరోచోట ప్రభుత్వం పట్టాలు జారీ చేసింది. కానీ బడి ప్రస్తావన మాత్రం రాలేదు. శ్రీలత మాత్రం అక్కడున్న నిర్వాసిత పిల్లల గురించే ఆలోచించి... తన భర్త అశోక్‌తో కలిసి సర్వే చేశారు. 40 మంది చదువు అందని విద్యార్థులని గుర్తించారు. తన ఏడాది డిప్యూటేషన్‌ రద్దు చేయించుకొని తిరిగి కుమురం భీం కాలనీకి వచ్చారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకొని తనే నెలకి మూడున్నర వేల రూపాయల అద్దె చెల్లిస్తూ అక్కడ ఆగిపోయిన చదువుకు ప్రాణం పోశారు. విద్యార్థుల ఆటపాటలతో ఆ బడికి పండగ వాతావరణం తెచ్చారు. కొవిడ్‌ సమయంలోనూ ఏ ఆటంకం రాకుండా చూసుకున్నారు. దాంతో బడిలో పిల్లలే కాదు వాళ్ల తల్లిదండ్రులూ ఈ టీచరమ్మని ప్రేమించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ బడిలో విద్యార్థుల సంఖ్య 83 మందికి పెరిగింది. పిల్లలందరికీ మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఏకోపాధ్యాయురాలినని భావించకుండా విద్యార్థులను సొంతబిడ్డలా భావిస్తూ పాఠాలు చెబుతున్న విషయం నాలుగేళ్ల కిందటనే అప్పటి కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ దృష్టికి వెళ్లింది. దాంతో శ్రీలతని ఉత్తమ ఉపాధ్యాయురాలిగా గుర్తించి వెన్నుతట్టారు. బడి కోసం నాలుగు గుంటల స్థలాన్నీ కేటాయించారు. అదింకా మంజూరు కాకపోవడంతో ఇప్పటికీ శ్రీలతే అద్దె చెల్లిస్తూ పాఠశాలను కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలిసి, ప్రస్తుత కలెక్టర్‌ పక్కాభవనం కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. ఉద్యోగం ఎవరైనా చేస్తారు.. కానీ కొందరే బాధ్యతగా నా అనుకుని చేస్తారు. అలాంటి వాళ్లలో ఈ శ్రీలత ఒకరు.✍️*



🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కామెంట్‌లు లేవు: