10, జూన్ 2024, సోమవారం

తెలుగు భాషకు

 తెలుగు భాషకు చిరస్మరణీయ సేవలందించిన భాషా సేవకుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. తెలుగులో చరిత్ర పరిశోధనలు, విజ్ఞాన రచనలు చేయడానికి తొలి అడుగులు వేసినవారు. నిద్రాణమై ఉన్న తెలుగు జాతిని మేల్కొలిపిన మహనీయుల్లో ఎన్నదగిన వారు.



కొమర్రాజు వెంకట లక్ష్మణరావు క్రీ.శ. 1876 మే 18న ఉమ్మడి కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించారు.విద్యార్థిగా ఉన్నపుడు ‘సమాచార్’,’వివిధ విజ్ఞాన్ విస్తార్’ వంటి మరాఠి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘కేసరి’, ‘మహారాష్ట్ర’ వంటి పత్రికలకు విరివిగా వ్యాసాలు రాశారు. అనేక చర్చల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలుగులో ‘జనరంజని’ పత్రిక స్వయంగా నడిపించారు. విజయవాడలో స్త్రీ విద్యావ్యాప్తి ‘తెలుగు జనానా’ పత్రికలో సోదరి బండారు అచ్చమాంబతో కలిసి అనేక రచనలు చేశారు.


హైదరాబాదులోని ‘శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం’ స్థాపించడంలోనూ; ‘విజ్ఞాన చంద్రికా మండలి’, ‘విజ్ఞాన చంద్రికా పరిషత్’, ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ వంటి సంస్థల నిర్వహణలోనూ ఆయన పాత్ర కీలకమైనది.


లక్ష్మణరావు సాహిత్య, సామాజిక ఉద్యమ నేపథ్యానికి వారి సోదరి అచ్చమాంబ అందించిన ప్రోత్సాహం ఎంత ఉన్నతమైందో, తొలి తరం తెలుగు కథా రచయిత్రిగా అచ్చమాంబ ఎదుగు దలలో ఆయన ప్రోత్సాహం కూడా మరువలేనిది. ‘ఆంధ్ర విజ్ఞాన సర్వ స్వం’ ఆయనకు విశేష కీర్తిని తెచ్చిపెట్టింది. ‘శివాజీ చరిత్ర’, ‘హిందూ మహా యుగము’ వంటి రచనలు చేశారు. ‘జ్ఞానమొక భాషయొక్క యబ్బ సొమ్ము కాదు’ అని నినదించారు.

కామెంట్‌లు లేవు: