4, అక్టోబర్ 2024, శుక్రవారం

హైందవం వర్ధిల్లాలి 20*

 *హైందవం వర్ధిల్లాలి 20*


సభ్యులకు నమస్కారములు.


ధర్మ ప్రచారకులు, ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాదిపతులు, హిందూ నాయకులు హైందవ జాగరణకై ప్రజాలలోకి రావాలి. :- i ) రామాయణ మహా కావ్యంలోని ఒక ఘట్టం చూద్దాం. జనక మహారాజు సభలోకి అష్టావక్రులవారు ప్రవేశించినప్పుడు, ఆ సంవాదంలో  అష్టావక్రుల వారినుద్దేశించి, ద్వారపాలకుడంటాడు బాలుడివి వృద్ధుడులాగా చాలా జ్ఞాన సంపదతో మాట్లాడుతున్నావు అని. అష్టావక్రుల వారి సమాధానం *న జ్ఞాయతే  కాయ వృద్ధ్యా నివృద్ధిః, యథా ష్టీలా శాల్మలే: సంవృద్ధా, హ్రస్వోల్పకాయః ఫలితో వివృద్ధ:, యశ్చా ఫలస్థస్య న వృద్ధభావః*. అర్థం :- శరీరం పెరిగినంత మాత్రాన జ్ఞానం పెరుగదు. బూరుగు విత్తనం పెరిగేకొద్దీ సారం లేనిదే అవుతుంది. చిన్న చెట్టైనా పండ్లు, కాయలు ఎక్కువగా ఉంటే అదే పెద్ద చెట్టు. అంతే కాని పెద్దదయినా ఫలాలు లేని చెట్టు వ్యర్థమే. *నీతి:- వయస్సు పైబడిన వారు, వృద్ధులు అయినా జ్ఞాన శూన్యులు వ్యర్తులే*.


మన సమాజంలో అధిక జనాభాకు ఇది (క్రియాశీల జ్ఞాన శూన్యతకు)  చక్కటి దృష్టాంతము. యుక్త వయస్సు, మధ్య వయస్సు పర్యంతం తమ అభివృద్ధికి, తమ వారసుల అభివృద్ధికి నిరంతరం,  అహర్నిశలు శ్రమించి, వారి వారి లక్ష్యాలు సాధించి, ఒక స్థాయికి చేరినా, మిగతా జీవిత కాలం, *ఏ సమాజ సహకారము, సహాయము గైకొని ఇంత వృద్ధి చెందారో* ఆ సమాజ మరియు దేశ హితం కొరకు పాటుపడదామన్న  కనీస స్పృహ పెంచుకోరు, పాటించరు. స్వలాభానికై ఇంకా సంపాదిద్దాము.  ఉదయం లగాయతు సాయంత్రం వరకు సంసార తాపత్రయాలతోనే కాలక్షేపం చేద్దాము అను స్వార్థ ధృక్పథంతో ఉంటారు. *వయస్సు పైబడిన వారైనా ఇటువంటి వారు "సుసమాజం" దృష్టిలో వ్యర్థులే*.  


మన ప్రాంతము, మన దేశము, మన సంస్కృతి, మన ధర్మము పట్ల మమకారము, ఈ జాతీయత పట్ల అభిమానము, సేవానిష్ఠ లేని వారు మరియు నివసించుచున్న నేల పట్ల మాతృ భక్తి లేని నీతిభాహ్యులు *గుడ్డి కన్ను తెరిచినా ఒకటే మూసినా ఒకటే చందాన జీవితం వెళ్ళదీస్తుంటారు*. ఈశ్వరా రక్షించు మమ్ములను.  


మన భారత  ప్రజలలో వర్గ, భాషా, ఆహార, ఆహార్య, సంస్కృతి, సంప్రదాయ మరియు తదితర అనేకానేక వైవిధ్యాలు, భిన్నత్వాలు  కల్గిఉన్నా *అందులో నిహితమై ఉన్న సమన్వయాన్ని, ఏకత్వాన్ని, ఆసేతు హిమాచలం (కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు) మళ్ళీ ఒకసారి పునరుద్దరించడానికి* ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, ధర్మప్రచారకులు, హిందూ నాయకులు ప్రజల మధ్యకు రావాలి. *ఈ సత్సంకల్పానికి రచయితలు,  కవులు, గాయకులు, సామాజిక వైతాళికులు తోడు నిలవాలి*. *కావున మన హిందు ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*. 


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: