4, అక్టోబర్ 2024, శుక్రవారం

*శ్రీ ఆది శంకరాచార్య చరితము 31

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము 31 వ భాగము* 

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


ఆ తరువాత  శార్ఞపాణి అనే వైష్ణవ శ్రేష్ఠుడు శంకరులతో మాటాడ నెంచెను.


శార్ఞపాణికి తత్త్వబోధ:

తెలియనంత వరకు ఎవరి మతం వారికి గొప్పదిగా కన్పించుట సహజం. శార్ఙ్గపాణి వైష్ణవమత మందు గొప్ప వాడని ప్రసిద్ధి పొందియున్నాడు. ఆయన తన మత విధానమును శ్రీ శంకర పాదులకు వినుపించ నెంచి లేచి, 'స్వామీ! విష్ణుమూర్తి యొక్క శంఖచక్రాలు ముద్రలు గా ధరించి, సదా "ఓం నమో నారాయణాయ" అనే మహా మంత్రాన్ని స్మరణ చేయుచుం దుము. విష్ణుభక్తులకు వైకుంఠ నివాసము తప్పక ప్రాప్తించును. కనుక ఈ సంసార బంధము నుండి విముక్తి నొంది ఇప్పుడే వైకుంఠమునకు వెడలుచున్నాను. శంఖచక్రాది చిహ్నధార ణలకు పురాణము ల యందు ప్రమాణము లున్నవి. ఏ వైష్ణవుడు శంఖచక్రాది చిహ్నము లను ధరించుకొని కంఠమున తులసి, పద్మబీజ మాలలను అలంకరించుకొని ఊర్థ్వ పుండ్రధారణ చేసికొని యుండునో అట్టివానిని చూచినంత మాత్రాన శ్రీ మహావిష్ణు వును దర్శించినట్లే యగును' అని తన అభిమతాన్ని వ్యక్తం చేశాడు.


ఆచార్యస్వామి శార్ఞపాణి పలుకులు ఆలకించి 'భక్తుడా తగు ప్రమాణంగల మాట లకు విలువ కలుగును. చక్రాంకితములు వేద విహితములు కావు. అందువలన అది ప్రమాణ రహితము. వ్రతాల నాచరించ కుండా శరీరం తప్తం కాదు. తప్తంకాని శరీరం గల వానికి మోక్షం రాదని శ్రుతి తెలుపు చున్నది. పాపాలు పోవలెనన్న శరీరాలు శుష్కించి తీర వలెను. వ్రతాదుల వలన శరీరం తప్తం కానిచో ధ్యానం చేయవలెను. పురాణ ములు కేవలం ప్రమాణ ములుగా ఎంచకుడు. శంఖ చక్రాంకితములు తక్షణం విడిచి పెట్ట తగి యున్నవి. మోక్షం కావ లయునన్న బ్రహ్మజ్ఞానం కలుగ వలెను, అని శ్రుతి ఎలుగెత్తి చాటు చున్నది. పుణ్యం క్షీణించిన స్వర్గాది పుణ్యలోకవాసం అంతమై తిరిగి మానవుడై జన్మించునని శ్రుతి తెలుపుచున్నది. చిహ్న ధారణలను శ్రుతి స్మృతులు అంగీకరిం చుటలేదు. బృహ న్నారదీయమందు గాని, పురాణముల యందుగాని చిహ్న ధారణ నిషేధమనియే విధించబడినది. చిహ్న ధారణతో నేను విష్ణువుతో సమాన మనుకొనుట భావనా రాజ్యము వంటిది. వేదములు వల్లించక బాహ్మణ చిహ్నములైన శిఖా యజ్ఞోపవీతం మొదలయినవి ధరించి నంత మాత్రాన జ్ఞానార్జనచేయనిచో బ్రాహ్మణుడు కాజాలడు. బ్రహ్మజ్ఞానార్జన చేయు వానినే బ్రాహ్మణు డందురు. భ్రష్ఠుడైన బ్రాహ్మణుడు తిరిగి బ్రాహ్మణుడు కాగలడా! బ్రహ్మజ్ఞానం వల్లనే ముక్తి ప్రాప్తించునని శ్రుతివాక్యములు ఢంకాధ్వని చేయు చున్నవి. కనుక ప్రతీ క్షణం తత్త్వవిచారణ చేయుచుండుడు. అంతట జీవేశ్వరాభేదం దృఢమై జీవుడే శివుడగుచున్నాడు. 'శివోహం' అని నిరంతరం మననం చేసికొను వానిని ఆ శివుడే వానిని శివునిగ చేయును. వాసన క్షయించి భేద బుద్ధి నశిస్తుంది. ఈ విధంగా  శివగీత పలుకుచున్న’ దని వచించారు.


శార్ఙ్గపాణి శ్రీ ఆచార్య స్వామి వెలువరించిన తత్త్వబోధవిని సాష్టాంగ వందనములర్పించి కృతార్ధుడనైతి' నని తన నిశ్చయాన్ని వ్యక్తం చేశాడు.


వైఖానసుడు:


శ్రీ ఆచార్యస్వామి గావించు మతప్రబోధ మెటులున్నను తాము బహుకాలమునుండి ఆచరించు విధానము ను తిరస్కరించుటను సహించలేక వైఖానసు లలో ప్రముఖుడైన వ్యాస దాసుడు శ్రీశంకరపాదులను సమీపించి, 'స్వామీ! మాకు శీమన్నారాయణ మూర్తియే పరమదైవం. కావున మా పక్షమును కాదనుటకు బ్రహ్మతరం కాదు. 'తద్విష్ణో: పరమం పదమ్' మొదలయిన శ్రుతి వాక్యములు శ్రీమన్నా రాయణ మూర్తికే అగ్రస్థానమిచ్చినట్లుగ తెలుపుచున్నవి. అదియును గాక ఆయనలోనుండి బ్రహ్మ, రుద్రుడు పుట్టుచున్నా రని 'నారాయణాద్బహ్మా జాయతే రుద్ర ఏవచ' శ్రుతి వెలువరించినది కనుక నారాయణ మూర్తినే సేవించ వలసి యున్నది.


ఆయన సర్వాంతర ర్యామియై వెలయు చున్నాడు. విష్ణుభక్తుల లక్షణములు మొదలగు నవన్నియు వైఖానస మతమందు విపులంగా తెలుపబడి యున్నవి. శంఖ చక్రాది విష్ణు చిహ్నములను ధరించి ఊర్థ్వపుండ్రములను పెట్టుకొన్నవాడే విష్ణు భక్తుడని తెలియ బడును.' అని వివరించెను.


వ్యాసదాసుడు వివరించిన విధానము నాలకించి అందు గల లోపములను సవరించనెంచి, 'వ్యాస దాసా! ఈ లోకాలను సృష్టించు వాడు బ్రహ్మా? విష్ణువా? నారాయణ మూర్తి సృష్టి చేయు వాడగుచో పరిపాలించు వాడెవడు? ఇందులో వివాద మెంతేని గలదు. ఇది అటుండ నిమ్ము. సృష్టిస్థితిలయ కారకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అను మువ్వురున్నారు.వీరలేమగుదురు? ఇది కూడ అటుండనిమ్ము, నారాయణమూర్తి యనినా విష్ణు వనినా ఒకటేకదా! విష్ణుపద మనగా నిత్యముక్తి. అది కేవలం తత్త్వజ్ఞాన ముండిననే లభ్య మగును. జ్ఞానం వినా ముక్తికి మరియొక మార్గం కానరాదు. నీవు విష్ణుభక్తుడవే యగుచో ఆయన ప్రీతి కొరకు వైదికకర్మలను ఆచరిం చుమా! శంఖచక్రాంకితా లనుచు కాల్చుకొన్నంత మాత్రాన ముక్తి రాదు. ఆగమాచారాలు బ్రాహ్మణత్వమును నాశనం చేయుటకు కారణమగుచున్నవి. అట్టివి లేకుండిన యోగ్యత కలిగి యుండేది.' అని శ్రీశంకరపాదులు తెలియజేశారు.


శ్రీ ఆచార్యస్వామి చెప్పినది విని సంశయ గ్రస్తుడై మరల, 'పూర్వకాలంలో దత్తాత్రేయ యోగీంద్రుల వారు పంచముద్రలు ధరించియున్నారు కదా! ఆయనది మోక్షమార్గమే కదా! అందు వలననే మేమందరం ఆయన మార్గాన్ని అనుసరించుచున్నాము. పురాణ ములలో శంఖ చక్ర ధారణ చెప్పబడి యున్నది. ఇన్నిట చక్రాంకితములు యోగ్యమై యున్నవి. ఇవిలేనిచో వైష్ణవ మతమునకే హాని సంభవించును. కావున భగవంతుని చిహ్నము లను ధరించడం విధి!' అన్నాడు వ్యాస దాసుడు.


శ్రీశంకరపాదులు వ్యాసదాసుడు తెలిపిన విషయము మరల ఆలకించి, వ్యాసదాసా! నీ అవివేకమును  ఏమనవలెను! బాలకు లు కూడ ఈ చక్రాంకిత ములు లాభము లేద నుచున్నారు. 


మహాతత్త్వవేత్త, పరమ యోగీంద్రులు అయిన దత్తాత్రేయులు ముద్రాంకితములు పొందియుండలేదు. చక్రాంకితములు ధరించినటుల ఎందునా కానరాదు. పురాణ ములయందు గలద నుట ఉచితము కాదు. ఇప్పుడైనను నీ మూఢ భక్తిని విడనాడి సుఖముగానుండుము. భక్తుడా! ప్రహ్లాదుడు, గజరాజు, ధ్రువుడు, హనుమంతుడు, ద్రౌపది, గోపికలు, గోపకులు, వీరందరికీ చక్రాంకితములు చేసిన గురువు ఎవరు? అట్టి ఊహలు విడవాడి 'బ్రహ్మాస్మి' అనే అద్వైత భావమును పొంది సుఖంగా మోక్షమును పొందుమా!

చక్రాంకితములు తప్పు కాదందువా, కపోల తలముల యందు శేషునిముద్రలు, కంఠమున గరుత్మంతు ని ముద్ర, భుజముల యందు, జ్ఞానేంద్రియ సమీపమున చక్రాంకిత ములు ధరించరేల? అచ్చట ప్రమాద మనియా!' అని వ్యక్తం చేశారు.


‘యతివర్యా! తమ అనుగ్రహంతో వివేక ముదయించినది. నేనింక చక్రాంకితాలు ధరించబోను. చిన్న తప్పును తెలిసికొన జాలక, ముందుకు పోజాలకుంటిని. ఇట్టి పరమ రహస్యమును తెలిసికొనలేక పోవడం ఇంత వరకు మాకొక గొప్ప అవరోధమే ఏర్పడింది. దానిని తృణప్రాయంగా తొల గించినందుకు కృతజ్ఞుడను. మిమ్ములను 'జగద్గురువు' లనియే పిలువవలెను. కరుణించుడు!' అని వ్యాసదాసుడు  శ్రీ శంకరపాదులకు కృతజ్ఞతలు అర్పించాడు.వ్యాసదాసునకు ముక్తిమార్గం చూపనెంచి శ్రీశంకరాచార్య స్వామి, 'వ్యాసదాసా! 'నేనే బ్రహ్మను. బంధములు లేని వాడను’ అని సదా భావన చేయు చుండుమా! అట్లు చేయ లేనిచో ‘బ్రహ్మైవాహం న సంసారీ ముక్తోహమ్' అని యైనను నిరంతర మూ మననం చేయు చుండుమా! ఇట్లాచరించినచో బంధముల నుండి విడివడి పరమాత్మను తెలిసికొనగలవు. అట్లు తెలిసికొనడమే ముక్తి.  ముక్తినొందుడు మరో దారిలేదు” అని ఉపదేశించారు.


కర్మహీన శాఖీయులు:


కర్మహీనులని పిలువ బడే శాఖయొకటి వైష్ణవమతమందు గలదని ఇదివరలో తెలుపబడినది. ఆ శాఖకు చెందిన నామ తీర్ధుడను ప్రముఖుడు సభలోనుండి లేచి శ్రీశంకరాచార్యులను సమీపించి, 'యతివర్యా! నమస్కారములు! మా మత ధర్మములు వినండి! విష్ణుమూర్తి మతమగుటచే దీన్ని కాదనుటకు ఆదిశేషు నికి కూడ శక్యం కాదు. కారణమేమన, జగమంతావిష్ణుమయం. శిష్యునికి ముక్తిని ప్రసాదించు నిమిత్తం గురువు విష్ణుమూర్తిని ప్రార్థించాడు.'నాశిష్యుని తమపాదారవిందముల కడకు చేర్చుకొను’ డని ఆ ప్రార్థన విని శ్రీపరమేశ్వరుడు అట్లు తన పాదసన్నిధికి చేర్చుకొన్నాడు.


‘యతివర్యా! నాకు తిరిగి జననం లేదు.  మీరందరూ సర్వలోక ప్రభువైన విష్ణువును పూజించుడు. ముక్తి తప్పకరాగలదు.' అని నివేదించాడు.


శ్రీ శంకరాచార్యస్వామి కర్మహీనుని పద్ధతి విని అతనిని బాగుచేయ నెంచి, 'నామతీర్ధ! కర్మ చేయని వాడవు! జీవన్ముక్తుడ వైతివా! ఇది ఎంతనింద్యము! ఇది మంచి, అది చెడ్డది అనే తేడా నీకు లేనందున నీది పిశాచ వృత్తి! వేద విహితమైన విధికర్మల నాచరిస్తూ తత్ఫలితాన్ని ఈశ్వరా ర్పణ చేసినచో అయ్యది జ్ఞానమార్గ మగును, ఫలాపేక్ష తో కర్మచేసినప్పుడు అది కర్మమార్గము. అన్ని విధాలా కర్మభ్రష్ఠుడవే యగుచున్నావు. అందువల్ల శ్రుతి స్మృతులు నీకు శిక్షను విధించుచున్నవి. ఏవిధంగా జూచినను నీవు విష్ణుభక్తుడవు కానేరవు. స్వధర్మము నాచరించువాని లక్షణాలు చెప్పెదను, విను. విష్ణుభక్తుడు సదా ధర్మమును చలించకుండ ఆచరిం చవలెను. ఇష్టుడు, అయిష్టుడు అను భేదం లేకుండ సమబుద్ధితో నుండవలెను. అట్లు ఆచరించుచు పరిశుద్ధ మైన అంతఃకరణ బుద్ధితో నుండవలెను.


'శ్రుతులలోను, స్మృతు లలోను ఏది చెప్పబడి యున్నదో, అదినాఆజ్ఞ' ఆ శ్రుతిస్మృతులకు వ్యతిరేకముగ ప్రవర్తిం చు వాడు నాకు ద్రోహి. అతడెంతటి భక్తుడైనా నరకమును పొంద వలసినదే!' అని పరమేశ్వరుడు వచించినట్లు ప్రబల మైన ప్రమాణములు ఉన్నవి. 'బ్రాహ్మణం కర్మ కుర్వీత' అనే వాక్యము ననుసరించి బ్రాహ్మణు లైన వారందరు కర్మ విధిగా ఆచరించ వలసినదే. బ్రాహ్మణుల కెక్కడా కర్మత్యాగం చెప్ప బడి యుండ లేదు. పైగా దేవాంతర పూజను విడువ గూడదు. 'అగ్నిర్దేవో ద్విజాతీనాం' అని శాసించడంవల్ల బృహ్మ చారి మొదలయిన వారందరు కర్మత్యాగం చేయరాదని తేలినది. త్రికాలముల యందు సంధ్యావందనం విధిగా ఆచరించ వలెను. అట్లు చేయనందువలన వచ్చు దోషం పోగొట్టు కొన వలయునన్న మూడు కృచ్ఛవ్రతము ల నాచరించవలెను. విప్రునకు కర్మ చేయడం తో శూద్రత్వం పోయి ద్విజత్వము వచ్చునని శాస్త్రము వచించు చున్నది. రెండు పుట్టుకలు అందొకటి శూద్రత్వము, రెండవది బ్రాహ్మణత్వము కలది గనుకనే బ్రాహ్మణులను ద్విజులన్నారు. కర్మ చేయనివాణ్ని ద్విజుడు అనడం మహాదోషం.


‘నకర్మణా నప్రజయా' అను శ్రుతి వాక్యము న్నది గదా యనెద వేమో అది ద్విజుల కొరకు చెప్పబడి యుండలేదు. సన్న్యాసం పొందిన యతుల కొరకై

పరిత్యాగం చెప్పబడినది అని వివరించి చెప్పిరి.


శ్రీ శంకరులు వచించిన ధర్మం బుర్రకెక్కి సంతుష్టుడై నామ తీర్థుడు జగద్గురు వులకు సాష్టాంగ వందనము లర్పించి అప్పటి నుండి కర్మలు చేయడం ప్రారంభిం చాడు. మిగిలిన వారందరు ధర్మసూత్రా లను గ్రహించి జ్ఞాన మార్గమందు సంచరిం చడం ప్రారంభించి అద్వైతులయ్యారు. శిష్యులతో అచ్చట నుండి సుబ్రహ్మణ్య క్షేత్రమునకు శ్రీఆచార్య స్వామి పయన మయ్యారు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరితము 31 వ భాగముసమాప్తము*.

🌺🌺🌺🌼🌼🌼🌺🌺🌺

కామెంట్‌లు లేవు: