19, నవంబర్ 2022, శనివారం

మొక్కలు మహాశక్తివంతం

 ప్రియమితృలకు నమస్కారం , 


     ఆయుర్వేదం నందు మూలికలు ప్రధాన ఔషదాలుగా ఉపయోగపడుతున్నాయి . కొన్ని రకాల మొక్కలకు కొన్ని ప్రత్యేక సమయాలలో మొక్కలు మహాశక్తివంతం గా ఉంటాయి . వాటిగురించి కొన్ని ఆయుర్వేద గ్రంథాలలో మరియు తాంత్రిక గ్రంథాలలో విపులంగా వివరించారు . 


                మీకు ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే "తెల్ల జిల్లేడు " దీనిని శ్వేతార్కం 

అంటారు . ఈ శ్వేతార్కం యొక్క వయస్సు 12 సంవత్సరాలు దాటిన తరువాత దీనియొక్క ప్రధాన వేరు వినాయకుడిగా రూపాంతరం చెందుతుంది. మామూలు సమయంలో ఈ చెట్టుకు ఎటువంటి ప్రత్యేక శక్తి ఉండదు. కాని ఆదివారం పుష్యమీ నక్షత్రం లేదా గురువారం పుష్యమీ నక్షత్రం ఈ రెండు ముహూర్త సమయాల్లో మాత్రమే ఈ చెట్టు యొక్క ప్రధాన వేరు గ్రహించాలి. శాస్త్రబద్ధంగా గ్రహించిన వేరు వినాయకుడి రూపంలో ఉంటుంది. లేనిచో దానిని చెక్కించి ఒక శుభముహూర్తాన బ్రాహ్మణుడితో ప్రాణప్రతిష్ట గావించి ఎర్రటి వస్త్రంలో ఉంచి పూజగదిలో ప్రత్యేక స్థానం నందు ఉంచి ప్రతిదినం బెల్లం ముక్క నైవేద్యం సమర్పించి శ్రద్ధతో ఆ విఘ్నేశ్వరుని కొలిచిన సాక్షాత్తు లక్ష్మి అమ్మవారు ఇంటియందు కొలువై ఉంటారు . దుష్టశక్తులు రాలేవు.   ఇటువంటి అద్బుత లక్షణాలు కొన్ని ప్రత్యేక మొక్కలకు కలవు . 


              నల్లవావిలి అని మరొక ప్రధాన మైన మొక్క కలదు. ఇది మహాశక్తివంతం అయిన మొక్క ఈ మొక్క చీకటి నలుపు కూడుకుని ఉంటుంది. దీనిని రసవాదంలో వాడతారు. ఈ చెట్టు పైన మిన్నాగులు ఉంటాయి . మిన్నాగులు అనగా కేవలం ఒక జానెడు మాత్రమే ఉంటాయి. ఇది కేవలం కనుబొమ్మల మధ్యనే కాటువేస్తుంది. ఔషదం తీసుకునే సమయం కూడా ఉండదు. మరణం తప్పదు. ఇది ఎగరగలదు.  


                 నల్లపసుపు , ఎర్రచిత్రమూలం వంటి మొక్కలు కూడా మహాశక్తివంతాలే . ఎర్రచితమూలం అమావాస్య రోజు మహాశక్తివంతంగా ఉంటుంది. దీనిని మాంత్రిక విద్యలు , రసవాదం నందు ఉపయోగిస్తారు.   


          వరంగల్ , కరీంనగర్ , ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలలో కొన్నిసార్లు భూగర్భాలలో కుండల్లో మూడు రకాల పౌడర్లు ఒకే దగ్గర కుండలలో నింపి ఉంటాయి . ఆ పౌడర్లు నల్లవావిలి , ఎర్రచిత్రమూలం , తెల్ల మోదుగ మొదలగు చెట్ల నుంచి తయారు చేసినవి . వీటిని దాచిన ప్రదేశానికి సమీపంలో ఎక్కడో ఒకచోట ఒక శాసనం మరియు ఒక చిన్న పిడత ఉంటుంది . ఆ పిడత లొపలికి గాలి పోకుండా అత్యంత పటిష్టంగా బంకమన్నుతో సీల్ చేయబడి ఉంటుంది . ఆ శాసనం ఎక్కువుగా రాగి లేదా ఇత్తడి ప్లేట్ అయ్యి ఉండి దానిపైన ఈ పౌడర్లను ఎంత మోతాదులో కలుపుకోవాలి అన్నది వివరంగా రాసి ఉంటుంది. ఆ పసరు ఈ పౌడర్లలో ఎలా ఉపయోగించాలో కూడా వివరంగా ఉంటుంది.  ఆ యొక్క పసరును "పరుసవేది " అంటారు.  


             కొన్ని గ్రంథాలలో ఉడుగ చెట్టు శక్తి  గురించి రాసి ఉన్నది. ఉడుగ చెట్టు నుంచి రాలిపడిన విత్తనాలు మరలా చెట్టు వైపు పయనించి కాండంలో విలీనం అవుతాయి అని కూడా ఉంది . వర్షం పడ్డప్పుడు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయిన విత్తనాల ద్వారా మాత్రమే ఆ వృక్షజాతి అభివృద్ధి అగును. 


                     ఉడుగ చెట్టు విత్తనాల నుంచి తైలం తీయుట మహా దుర్లభం . కేవలం ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన పాతాళ యంత్రం ద్వారా మాత్రమే తీయవచ్చు. మరోక పద్దతి చెప్పారు కాని అంత స్వచ్ఛత లేదు .

ఈ అంకోలా తైలంతో అద్భుతాలు సృష్టించవచ్చు. ఈ తైలాన్ని మహేంద్రజాల విద్యల్లో ఎక్కువ వాడతారు.  ఉదాహరణకి ఈ అంకోలా తైలంలో 11 దినములు మామిడి విత్తనాలను నానబెట్టి 12 వ దినము నందు పుట్టమట్టిలో ఆ విత్తనాలు నాటి నీళ్లు చల్లిన అప్పటికప్పుడే ఆ మొక్క వృక్షంలా మారి చిగుర్లు , పండ్లు , పుష్పాలతో కూడి ఉండును అని తెలియచేశారు.  


             ఈ విధంగా అద్భుతశక్తులు కొన్ని మొక్కలకు మాత్రమే ఉండును.ఈ మొక్కలు సాధారణ మనుష్యులు తిరిగే ప్రదేశాలలో ఉండవు. నరసంచారం లేని దట్టంగా అడవుల్లోనే ఉంటాయి. నరుడు నడిచే చోట గడ్డికూడా పుట్టదు. 


         అదే విధముగా భూచక్రగడ్డ         అని ఒక మహామాన్వితమైన గడ్డజాతి కలదు . ఈ గడ్డ భూమియందు బండిచక్రం వెడల్పుతో ఉండును . ఇది ఎక్కువుగా ఈతచెట్ల కింద ఏర్పడును . చెట్టుపైన తీగ పాకి ఉండును . పైన ఉన్న తీగకు భూమియందు ఉన్న గడ్డకు ఎటువంటి సంబంధం ఉండదు. వాటిమధ్య ఒక బలమైన అయస్కాంత శక్తి ఉండును. దీనిని సర్వరోగ నివారణిగా పిలిచెదరు . ఆయుర్వేదంలో కాయచికిత్స అనగా శరీరపు వయస్సు పెరగకుండా నిలుచుటకు వాడెదరు . దీనిని తవ్వితీయుట కూడ అత్యంత జాగ్రత్తగా తీయవలెను . తీయునప్పుడు భూమి అదిరిన దొరకదు అని చెప్పెదరు. రహదారుల పైన భూచక్రగడ్డ పేరుతో అమ్మేవి నిజానికి అది కాదు . ఇది దొరుకుట అత్యంత అదృష్టము .ఈ గడ్డ గురించి ఆయుర్వేద గ్రంథాల కంటే పురాతన తాంత్రిక గ్రంథాల యందు వివరణ ఉన్నది .        


  మొక్కల యొక్క శక్తి ఎలా ఉంటుందో మీకో వీడియో చూపిస్తాను . తప్పకుండా చూడండి.



      మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 

కామెంట్‌లు లేవు: