9, మే 2025, శుక్రవారం

దానగుణ విశిష్టత!

 శు భో ద యం 🙏


దానగుణ విశిష్టత!


ఈరోజు దానగుణం ఎంతవిశిష్టమైనదో తెలిసికుందాము. 


                      శా:- ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, నంశోత్తరీయంబుపై, 

                              పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలిండ్లపై , నూత్నమ 

                                ర్యాదంజెందు కరంబుక్రిందగుట, మీదై నాకరమబుంటమే          

                                 ల్గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు వాపాయమే? 

                     

                  శ్రీమదాంధ్రమహాభాగవతము - పోతన- వామనచరిత్రము 


            వివరణ:- దేవతావిరోధియగు బలిచక్రవర్తని మూడడుగులదానమును వామనుడు అడుగుసందర్భము . 

                           వచ్చినది శ్రీహరియని శుక్రాచార్యులవారు గ్రహించి దానమువలన కలుగు పరిణామము నూహించి 

                            బలిని వలదని వారింపగా బలియన్నమాటలను కవినిపుణముగా వర్ణించినాడు అంత్యప్రాసలతో 

                             నందగించిన పోతనకవితాసౌందర్యము తోబాటుగా బలి పరమౌదార్యమును తెలిసికొనుటకు

                             ప్రయత్నంచేద్దాము. 


                                                   వచ్చినవాడు'హరి'దానమీయవలదు అనివారించు శుక్రునితో " శ్రీసతి శిరోజాలంకృతిపై, మేనుపై, భుజములపైనుడు ఉత్తరీయముపైనను ,పాదపద్మములపైనను,బుగ్గలపైనను, పయోధరములపైనను నూత్నమర్యాదలతో సంచరించు నాశ్రీహరి హస్తము క్రిందగుట, మీదుగా నాహస్తమగుట 

ఆహా !ఎంతటి అదృష్టము. ఈరాజ్యము శాశ్వతమా? శరీరము అపాయరహితమా? ఏదియేమైనను ఇంతటిమంచి 

అవకాశమునువిడువను దానమవస్యముగా నిత్తునని యట్లేయొనరించినాడు .ఆహా!బలియెంతటిమహనీయుడు.

                దానముమిగులగప్పది .వేదములు" నకర్మణా నప్రజయా నధనేన దానేనైకేనామృతత్వమానసుః" నీవు 

     చేయుపనులవలనగానీ, నీసంతానముచేతగానీ, నీకున్నధనముచేతగానీ అమృతత్వాన్ని (అమరత్వము)పొందలేవు. 

      దానగుణం ఒకటి ఉంటేచాలును అమృతత్వం పొందగలవు. అంటోంది. కాబట్టిఉత్తమ గుణాలలో మిన్నయైన దాన

        గుణాన్ని అందరూ అలవరచుకోవటం ఉత్తమం.అది మనకు సమాజానికీ చాలామేలు చేస్తుంది .

"న కర్మణా నప్రజయా న ధనేన త్యాగేనైకేనామృతత్వమానసుః" -అన్నది వేదం.

నేనిన్ని మంచిపనులుచేశాను, ఇంతమంది పిల్లలనుగన్నాను. ఇన్నికోట్లు సంపాదించాను.అంటే లాభంలేదు.మానవుడు అమృతత్వాన్ని పొందాలంటే దానమొక్కటే సాధనమ్.

                         స్వస్తి!!🙏🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

పోతన విశ్వ రూప

 🙏పోతన విశ్వ రూప సందర్శనము🙏

వామనుడు త్రివిక్రముడైన విధానం వర్ణించిన తీరు అద్భుతం. ఇది మూలంలో లేదు. పోతన మహాశయుడు సొంతంగా రచించి మనలకు కన్నులకు కట్టాడు.ఆ పద్యరాజములను చూద్దాము

.

శా. ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై

      నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై

      నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై

      నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై!!

ఈ పద్యం ఏదో ఒక సందర్భంలో వినని వారుండరనుకుంటాను. ఒక సామాన్యుడిగా బ్రతుకు ప్రారంభించి. అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తిని గురించో, అలాగే సన్నగా ప్రారంభమై క్రమక్రమాభివృద్ధి పొంది మిన్నగా రూపొందిన దాన్ని గురించో చెప్పేటప్పుడు ‘ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిపోయాడు’ అని చెప్పుకోవటం పరిపాటి. అంతగా ప్రజల నాలుకల మీద – కనీసం మొదటి లైను ఐనా – నిలిచిపోయింది ఈ పద్యం. ఈ పద్యంలోని ప్రసన్నమైన శైలి చెప్పకనే చెబుతుంది ఇది బమ్మెర పోతనామాత్యుని పద్యమని. పోతన ఆంధ్రీకరించిన భాగవతం అష్టమ స్కంధంలో – వామనుడు త్రివిక్రముడై పెరిగిపోయే దృశ్యాన్ని అత్యంత సహజసుందరంగా వర్ణించిన పద్యం ఇది.

బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది, ఒక అడుగును భూమిపై మోపి, రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రిందనుంచి ఒక్కోదాన్నే దాటుకుంటూ ఎలా విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా, ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు రూపు కట్టించాడు పోతన. చేతులతో అభినయంచకుండా ఈ పద్యం బోధించలేము.చేతులతో చూపిస్తూ ముఖం ఆకాశము వైపు ఎత్తవలసినదే.

ఇంతైనాడు, మరిం తైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుని దాటి ఇంకా పైకి సాగాడు, మహర్లోకం దాటినాడు, చూస్తుండగానే సత్యలోకంకన్నా ఉన్నతంగా ఎదిగాడు. బ్రహ్మాండమంతా నిండిపోయాడు – ఇదీ ఒక కుబ్జబాలకుడు క్రమక్రమంగా బ్రహ్మాండ భాండాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్ఫూర్తి. క్రింద మునులూ, బలి చక్రవర్తీ, శుక్రుడూ నివ్వెరపోయి పూర్వం కండ్లముందు నిలుచున్న బ్రహ్మచారి బాలకుడు – ఒక్కసారిగా కాదు – క్రమక్రమంగా ఎదిగి భూనభోంతరాలు నిండిపోవడాన్ని ఇంతకన్నా అందంగా రూపు కట్టించడం అసాధ్యమనుకుంటాను. పద్యం పద పదానికీ విరుగుతూ, వామనుడు పద పదానికీ పెరుగుతూపోయే క్రమతను రూపించింది. ఇంతై, అంతై, దీనికింతై, దానికింతై అంటూ ఒక గొప్ప దృశ్యానికి ప్రత్యక్ష వివరణ, ప్రత్యక్ష ప్రసారము ఏకకాలంలో చేశాడు కవి. ఈ పద్యం మనసున పట్టించుకొని చదువుతూ ఉంటే ఒక గ్రాఫిక్ దృశ్యం కండ్లముందు నిలిచిపోతుంది. నిజం చెప్పాలంటే 

కెమెరాలో చిత్రించి చూపించాడు. ఇంతటితో సంతృప్తి చెందలేదు. ఇంకా వివరించాలి అనుకున్నాడు 

ఈ పద్యం తరువాతనే మరో పద్యం ఉంది. క్రిందినుంచి వామనుడు క్రమక్రమంగా పైకి పోయే కొద్దీ పైనున్న సూర్యబింబాన్ని ఈ పెరిగే పెద్దమనిషితో కలిపి చూపిస్తూ ఆ రవిబింబపు దశల్లోని వివిధరూపాలని వర్ణించిన పద్యం అది. ఇంతకు ముందు చూపిన దృశ్యాన్నే మరో కోణంలో చూపించడమన్నమాట. వామనుడు పెరిగేకొద్దీ సూర్యబింబం ఎలా ఉందంటే, ముందు ఒక గొడుగు లాగా అతని తలపై కనిపించి, క్రమంగా శిరోరత్నం గానూ, చెవి కమ్మగానూ, కంఠా భరణంగానూ, బంగారు భుజ కీర్తులు లాగానూ, కరకంకణం లాగానూ, నడుముకు కట్టిన మొలతాటి బంగారు గంట గానూ, పాదాల అందె గానూ ఆఖరుకు పాదపీఠం గానూ ఉపమించడానికి యోగ్యంగా కనిపించిందట. ఆ పద్యం కూడా చిత్తగించండి.ఈ పద్యం లో మన దృష్టి సూర్యునిపై కేంద్రీకరింప జేశాడు మీరు సూర్యుణ్ణే చూడమన్నాడు సూర్య బింబము ఎలా మారుతోందో చక్కగా చిత్రీకరించాడు 

రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై

ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్

మహానుభావుడు పోతన. భగవంతుని లీలలను వర్ణించే ఘట్టం వచ్చేసరికి పోతనకి ఒళ్ళు తెలియనంత తాదాత్మ్యం ఆవహిస్తుంది. ఆ తాదాత్మ్యంలో వ్రాసే పద్యాలు గుండెలను పట్టుకునేవిగా రూపొందుతాయి. ఆ పద్యాల్లో గణాలు, యతులు, ప్రాసలు ఇవ్వన్నీ అలవోకగా జేరిపోయి ఒక మహాభక్తుని ఆంతరంగ పారవశ్యం వాటిల్లో పొంగిపొరలుతూ వుంటుంది. భాగవతంలోని అనేక ఘట్టాలు – ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షము, రుక్మిణీ కళ్యాణము, కృష్ణ లీలలు, అంబరీషోపాఖ్యానము లాంటివి – దీనికి తిరుగులేని సాక్ష్యాలు. భాగవతం లాంటి గొప్ప భక్తి పురాణం పోతన చేతిలో పడి తెలుగులోకి రావటం, తెలుగు జాతి చేసుకున్న గొప్ప అదృష్టం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఆనందో బ్రహ్మేతి

 🙏ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌’🙏

భృగువు ఒకసారి తన తండ్రియైున వరుణుని వద్దకు వెళ్లి.. బ్రహ్మమును గురించి తెలుపవలసిందిగా కోరుతాడు. అప్పుడు వరుణుడు పుత్రునితో ‘‘దేనివలన ఈ ప్రాణులు, పదార్థాలన్నీ పుడుతున్నాయో, దేని వలన పుట్టినవి జీవిస్తున్నాయో, దేని యందు లీనమవుతున్నాయో అది బ్రహ్మము’’ అని చెప్పి, ‘దానిని నీవే తెలుసుకో’ అని చెబుతాడు. అప్పుడు భృగువు బ్రహ్మమును తెలుసుకోవడానికి తపస్సు చేస్తాడు. ఆ తపస్సులో ఆయనకు.. అన్నమే బ్రహ్మమని తెలుస్తుంది. ఎందుకంటే ప్రాణుల శరీరాలన్ని అన్నము వలననే పుడుతున్నాయి. పుట్టిన ప్రాణులన్నీ అన్నము చేతనే పోషింపబడుతున్నాయి. చివరకు అన్నము (మట్టి) యందే కలిసి పోతున్నాయి. కాబట్టి అన్నమునే బ్రహ్మముగా తెలుసుకున్నానని తండ్రిని సమీపించి చెబుతాడు. అప్పుడు వరుణుడు ఆయనను ఇంకా తపస్సు చేయమంటాడు. 

మళ్లీ తపస్సు చేసిన భృగువు.. ఈసారి ప్రాణమును బ్రహ్మముగా తెలుసుకుంటాడు. ఎందుకంటే ప్రాణము వలనే ప్రాణుల శరీరాలు పుడుతున్నాయి. ప్రాణము చేతనే పుట్టినవి జీవిస్తున్నాయి. ప్రాణములందే లీనమవుతున్నాయి. కాబట్టి ప్రాణమే బ్రహ్మముగా ఎరిగినానని చెప్పగా.. ‘‘ఇంకా తపస్సు చెయ్యి. బ్రహ్మము నెరుగుటకు తపస్సే సాధనం’’ అని వరుణుడు చెబుతాడు. ఈసారి తపస్సులో.. ‘మనసే బ్రహ్మము’ అని భృగువుకు తెలుస్తుంది. ఎందుకంటే మనసులోనే సంకల్పాలు కలుగుతాయి. ఇంద్రియాలన్నింటికీ మనసే ఆధారం. సంకల్పాల కారణంగానే జీవులకు శరీరాలు లభిస్తాయి. కర్మఫలాలను అనుభవించడానికి శరీరస్థితి ఏర్పడుతుంది. శరీరం నశించినప్పుడు జీవుడు వాయురూపంలో వెళ్లిపోతాడు. కాబట్టి శరీరోత్పత్తి, స్థితి, లయములకు మనసు కూడా కారణమవుతున్నది. కావున అది బ్రహ్మమని తలచి తండ్రికి ఆ విషయమే చెబుతాడు. అప్పుడు తండ్రి.. ఇంకా తపస్సు చేయాల్సిందిగా సూచిస్తాడు. ఈసారి విజ్ఞానం బ్రహ్మమని భృగువు తలుస్తాడు. విజ్ఞానమంటే నిశ్చయాత్మక జ్ఞానం. అదే బుద్ధి. ఆ విషయం చెప్తే.. ఇంకా తపస్సు చేయమంటాడు వరుణుడు. తపస్సులో మరలయత్నించిన భృగువు ఆనందమే బ్రహ్మముగా తెలుసుకుంటాడు. ‘ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌’ ఆనంద రూపమగు బ్రహ్మమే కారణమని, బ్రహ్మమే కర్త అని రూఢి చేసుకుంటాడు. 

భృగువును వరుణుడు అన్నిసార్లు తపస్సు చేయాల్సిందిగా ఎందుకు ఆదేశించాడంటే.. అసలైన బ్రహ్మము గురించి ఆయన తెలుసుకోవడానికే. భృగువు మొదట అన్నము బ్రహ్మమని ఎరిగినప్పటికీ.. అన్నానికి కారణం ఉంది. బ్రహ్మమంటే కారణం లేనిది. కాబట్టి మరోసారి తపస్సు చేయాలంటాడు. అదే విధంగా ప్రాణం, మనసు, విజ్ఞానం అన్నింటికీ కారణం ఉన్నది. ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి ప్రాణం జనిస్తున్నాయి. మనసు, విజ్ఞానం ఆత్మాశ్రితాలు. కాబట్టి, ఆనంద స్వరూపమైన బ్రహ్మమే ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములకు కారణమని, బ్రహ్మమునకు ఇంకొక కారణం లేదు అని చివరకు తెలుసుకుంటాడు. ఆనంద స్వరూపమైన బ్రహ్మము నెరిగినవాడు ఆనందంలో ఉండి దానిననుభవిస్తాడు. ప్రపంచంలో ఆనందంగా ఉన్నవాడు తృప్తిగా ఉంటాడు. మనం పొందే ఆనందం ఏదో కారణంచేత కాబట్టి ఆ దొరికిన దానిని బట్టి అది క్షణికమైనది లేదా కొద్దికాలం ఉండేది అవుతుంది. కాబట్టి కారణం లేకుండా ఆనందంగా ఉండడమే మోక్షం అనబడుతుంది. 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - ద్వాదశి - హస్త -‌‌ భృగు వాసరే* (09.05.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగం 09.05.2025

 ఈ రోజు పంచాంగం 09.05.2025

Friday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన  విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస శుక్ల పక్ష ద్వాదశి తిథి భృగు వాసర హస్త నక్షత్రం వజ్ర యోగః: బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30  వరకు.


నమస్కారః , శుభోదయం

భారతావని నుదుట సిందూరం*

 🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

*భారతావని నుదుట సిందూరం*


🔥💥

సీ॥

సుందరకాశ్మీరశోభలు చెరుపంగ 

ముష్కరమూకలు పూనుకొనగ 

మహిళామతల్లుల మహితసిందూరమ్ము 

తుడువనెంచగ నేడు ధూర్తపాకి 

మోదీకి చెప్పుకో పోయి వెంటనె యంచు 

వదరిన పాకీకి బలిసె మదము 

మోదీకి చెప్పిరి ముగ్ధలందరు వెళ్ళి 

మోదియు చింతించి పూనె ప్రతిన 

తే౹గీ॥ దిక్కులన్నియు మార్మ్రోగ ధిక్కరించి 

వెలికి చక్రాయుధమ్మును వెడలదీసె 

గొంతు సవరించి గర్జించి యుద్ధతంత్ర 

నియతి బూనుచు విశ్వమ్ము నివ్వెరంద 

🔥💥

శా॥

మా మోదీకి వచించి వచ్చితిమి సన్మానమ్ము జేయన్వెసన్ 

మీ మాత్సర్యము తృప్తిజెందునటులన్ మిమ్మెంచి కీర్తించగా 

మా మోదీ కబురంపె సైన్యమునకున్ మాన్యత్వ మింపొందగా 

నేమాచూపులు? కాచుకొండి యని మిమ్మెంచె మా భారతుల్ 

🔥💥

కం॥

మోదీ షా జైశంకరు 

లా ధోబలుతోడ గూడి యాలోచించన్ 

పాదులు కదిలించగ పా

కీధర నడలంగజేయ కృతనిశ్చయులై 

🔥💥

శా॥ 

అదిగో దూకెను భీకరోజ్జ్వలముగా నాజిన్ విమానమ్ములున్ 

రొదలం జేయుచు విస్ఫులింగముల నిర్మూలించ పాకీస్థలిన్ 

మెదలన్ శక్యము కాని రీతి క్షిపణుల్ మిన్నూడి పడ్డట్లుగా 

కదిలెన్ పాకిభువీస్థలిన్ నగరముల్ కాష్టాలగడ్డవ్వగన్ 

🔥💥

ఉ॥

దిక్కులు పిక్కటిల్లె మన తేజము లొక్కెడ దాడి జేయగా 

కుక్కలు చింపు విస్తరిగ కూలెను పాకి ప్రభుత్వమిత్తఱిన్ 

పిక్కల శక్తిమై పరుగువెట్టెను ప్రాణభయమ్ము తోడుతన్ 

నక్కెనొ? పాఱెనో? యన వినాశము జూచిన పాకినేతయై 

🔥💥

చం॥

త్రివిధదళమ్ములుం గదలి తేల్చెను ముంచెను పాకినేతలన్ 

ఛవులు రహించ ద్రెళ్ళుచు సత్త్వము జూపి విమాన నౌకలన్ 

భవిత హరించి రేవులను భస్మము జేయుచు జృంభణమ్ముగా 

నవిరళదీక్షతో నిగిడి హా! యని త్రేన్చెను నిండుబొజ్జలన్ 

🔥💥

ఉ॥

భారతసైన్యముల్ గదలె భండనవిక్రమపౌరుషమ్ముతో 

ధీరవిచారసారఘనతేజులు మోదియు శంకరేతరుల్ 

దీరి వచింప ముందుకని దిక్కరు లన్నియు గూడినట్లుగా 

భూరిపరాక్రమమ్మున ప్రమోదము బంచగ భారతోర్వికిన్ 

🔥💥

మ॥

జయహో భారత సైనికా! ప్రబలవిశ్వాసమ్మె సంపూర్తిగా 

నియతిన్ సాగుచు మాతృభూమి హితమే నీ ప్రాణమై సాగుచున్ 

రయమున్ శత్రువినాశదీక్ష గొని నిర్వ్యామోహచిత్తాన ని 

ర్భయమున్ మాకు నొసంగు దేవుడవు! గర్వాతీత! నీకున్నతుల్ 

🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

*~శ్రీశర్మద* 

ది:09-05-2025

సమయం: 

ఉదయం: 03-45.

8, మే 2025, గురువారం

గురువారం🪷* *🌹08 మే 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🪷గురువారం🪷*

     *🌹08 మే 2025🌹*

     *దృగ్గణిత పంచాంగం*   

                

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖ మాసం - శుక్లపక్షం*


          *ఈనాటి పర్వం*

              *సర్వేషాం*     

         *మోహిన్యేకాదశి*  


*తిథి      : ఏకాదశి* ప 12.29 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం   : ఉత్తర* రా 09.06 వరకు ఉపరి *హస్త*

*యోగం : హర్షణ* రా 01.57 వరకు ఉపరి *వజ్ర* 

*కరణం   : భద్ర* ప 12.29 *బవ* రా 01.41 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 08.00 - 09.30 & 11.00 - 12.00*

అమృత కాలం  : *మ 01.03 - 02.51*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*


*వర్జ్యం            : ఈరోజు లేదు*

*దుర్ముహూర్తం  : ఉ 09.56 - 10.47 మ 03.04 - 03.55*

*రాహు కాలం    : మ 01.40 - 03.16*

గుళికకాళం       : *ఉ 08.52 - 10.28*

యమగండం     : *ఉ 05.39 - 07.16*

సూర్యరాశి : *మేషం*

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.47*

సూర్యాస్తమయం :*సా 06.38*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.39 - 08.13*

సంగవకాలం         :*08.13 - 10.47*

మధ్యాహ్న కాలం    :     *10.47 - 01.21*

అపరాహ్న కాలం    : *మ 01.21 - 03.55*


*ఆబ్ధికం తిధి         : వైశాఖ శుద్ధ ద్వాదశి*

సాయంకాలం        :  *సా 03.55 - 06.29*

ప్రదోష కాలం         :  *సా 06.29 - 08.43*

రాత్రి కాలం           :*రా 08.43 - 11.41*

నిశీధి కాలం          :*రా 11.41 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.10 - 04.54*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం*


*బ్రహ్మానందం బ్రహ్మముకుందం భగవంతం*

*బ్రహ్మజ్ఞానం జ్ఞానమయం తం స్వయమేవ |*


*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

తెలుగు సామెతలు

 🔴-తెలుగు సామెతలు -🔴

🚩🚩

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. . "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.

           సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. 

ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు

 ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). 

పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు 

("ఊరక రారు మహానుభావులు"). 

సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును

 ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). 

ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును

 ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", 

"కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). 

ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును 

("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది").

 వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును 

("మనసుంటే మార్గముంటుంది")

 ప్రమాదమును హెచ్చరించవచ్చును

 ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). 

వాదనకు ముక్తాయింపు పాడవచ్చును

 ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). 

హాస్యాన్ని పంచవచ్చును 

("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[

♦అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు

అర్ధం

సాధారణంగా అల్లుడంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సంప్రదాయం. ఇక విందు భోజనాలకి చెప్పనవసరం లేదు కాని ఎన్ని చేసిన ఏదోకారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అన్నీ అందుబాటులో ఉన్నా అనుభవించటానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు. 

మన దేశంలో అన్ని వనరులూ పుష్కలంగా ఉన్నాయి. కాని లంచగొండితనం వలన దేశం అభివృద్ధి కావడం లేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది

♦అక్కర వున్నంతవరకూ ఆదినారాయణ - అక్కఱ తీరిన తర్వాత గూదనారాయణ

దీనికి సమానర్థంలో మరికొన్ని సామెతలు: 

1. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం.

 2. ఏరు దాటునంత వరకు ఓడ మల్లయ్య గారు..... ఏరు దాటాక బోడి మల్లయ్య.

♦పండగ నాడు కూడా పాత మొగుడేనా?

సామెతను మార్చేసి పలుకుతున్నారు.

 పండగ పూట పాత "మడుగేనా" అన్నది అసలైన సామెత. మడుగు అంటే వస్త్రం అని అర్థం. పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ. ఆ అర్థంలో పుట్టిన సామెత పండగ పూట పాత బట్టలు కాదు కొత్త బట్టలు కట్టుకోవాలి అని.

ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం మనం చేయకూడదు. సరైన రీతిలో నే పలుకుదాం, పలికిద్దాం.

♦పట్టు చీర అరువిచ్చి పీట పట్టుకొని వెనకాలె తిరిగినట్టుంది

మొగ మోటానికి పోయి ఒకామె మరొకామెకు పట్టు చీర అరువిచ్చిందట. ఆమె ఎక్కడన్నా కూర్చుంటే తన చీరకు మట్టి అంటుతుందని ఒక పీట తీసుకొని ఆమె ఎక్కడ కూర్చుంటుందో అక్కడ పీట వేసేదట.

 మొగమాటానికి పోయి కష్టాలు తెచ్చుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది.

7, మే 2025, బుధవారం

సంతోషాన్ని నిర్ణయించగల హార్మోన్లు

 మనుష్యుల సంతోషాన్ని నిర్ణయించగల హార్మోన్లు నాలుగు ఉన్నాయి..


అవి..


1.ఎండార్ఫిన్స్

2.డోపమైన్

3.సెరొటోనిన్

4.ఆక్సిటోసిన్


ఈ హార్మోన్లని అర్థం చేసుకోవడం మనకి చాలా అవసరం..ఎందుకంటే మన సంతోషానికి ఇవి కారణం కాబట్టి ...


మొదటి హార్మోన్ ఎండార్ఫిన్స్ గురించి తెలుసుకుందాం..


మనము వ్యాయామం(exercise) చేసినప్పుడు మన శరీరం ఈ హార్మోన్ ని విడుదల చేస్తుంది ..


ఈ హార్మోన్ మనం వ్యాయామం చేసినపుడు కలిగే నొప్పిని తట్టుకునేందుకు సహకరిస్తుంది...అందుకే మనం మన వ్యాయామాన్ని ఉల్లాసంగా తీసుకోగలము ఎందుకంటే ఎండార్ఫిన్స్ మనకి ఆనందాన్ని కలిగిస్తాయి..


నవ్వితే కూడా ఎండార్ఫిన్స్ చాలా చక్కగా విడుదల అవుతాయి..


మనం రోజుకి కనీసం 30 నిముషాల వ్యాయామం చేయాలి..హాస్యసంబంధిత విషయాలను చదవటం కానీ చూడటం కానీ చేస్తే రోజుకి సరిపడా ఎండార్ఫిన్స్ లభిస్తాయి..


రెండవ హార్మోన్ డోపమైన్..


మనం మన జీవితంలో చిన్నవైనవో పెద్దవైనవో అయిన లక్ష్యాలను సాధిస్తూ ఉంటాము..ఆయా సందర్భాలకు తగినంత డోపమైన్ లభిస్తూ ఉంటుంది..


మనకి ఇంటి దగ్గరనో ఆఫీసులోనో ప్రశంసలు దొరికినప్పుడు సంత్రృప్తిగా అనిపిస్తుంది..అది ఈ డోపమైన్ విడుదల అవటం వలననే ..


ఇదే కారణం ఎక్కువ మంది ఇల్లాళ్ళు(housewives) ఆనందంగా ఉండలేకపోవటానికి కారణం తాము చేసే శ్రమకు తగిన గుర్తింపు ప్రశంసలు దొరకక పోవటమే వారి అసంతృప్తికి కారణం ...


ఒకసారి మనకు ఉద్యోగం దొరికాక..

కారు

ఇల్లు 

కొత్త కొత్త అధునాతన వస్తువులు ..

కొంటాము..

ఆయా సందర్భాలలో ఈ డోపమైన్ విడుదల అవుతుంటుంది, మనం ఆనందపడుతాము..


ఇప్పుడర్ధమైంది కదా మనం షాపింగ్ చేసినప్పుడు మనకి ఆనందంగా ఎందుకనిపిస్తుందో...


మూడో హార్మోన్ సెరెటోనిన్ మన వల్ల వేరొకరు ఆనందపడినప్పుడు, మనం వేరొకరికి ఉపకారం చేసినప్పుడు విడుదల అవుతుంది...


మనం సాటివారకి గానీ ప్రకృతికి గానీ సమాజానికి గానీ మంచి చేయగలిగినప్పుడు సెరిటోనిన్ విడుదల అవుతుంది..


అంతేకాదు..ఒకరి సమస్యలకు, ప్రశ్నలకు ..సలహాలు, సమాధానాలు బ్లాగ్స్ రూపంలోనో ఫేస్‌బుక్ గ్రూపు ల రూపంలోనో ఇవ్వగలిగినప్పుడు కూడా ఈ సెరిటోనిన్ విడుదల అయ్యి ఆనందంగా అనిపిస్తుంది...


అలా ఎందుకంటే మన విలువైన సమయాన్ని మరొకరికి సాయం చేసేందుకు ఉపయోగించడం మనకి సంతోషాన్ని ఇస్తుంది..


చివరి నాలుగవ హార్మోన్ ఆక్సిటోసిన్..మనం తోటివారితో అనుబంధాన్ని పెంచుకుని వారికి దగ్గర అయినప్పుడు విడుదల అవుతుంది..


మనం మన స్నేహితులనో కుటుంబసభ్యులనో ఆలింగనం (hug) చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది...మున్నభాయ్ అనే హిందీ సినిమాలో చెప్పినట్టు నిజంగా, ఒక ఆత్మీయఆలింగనం మంత్రం వేసినట్లుగా మాయ చేసి మనసుని కుదుటపరుస్తుంది...

అదేవిధంగా కరచాలనం, భుజాల చుట్టూ చేయి వేసి భరోసా ఇవ్వటం కూడా చాలా ఆక్సిటోసిన్ ని విడుదల చేయగలదు...


కాబట్టి ..

రోజూ వ్యాయామం ఎండార్ఫిన్స్ కోసం...

చిన్ని చిన్ని లక్ష్యాలను సాధిస్తూ డోపమైన్ కోసం..

తోటివారితో స్నేహంగా ఉంటూ సెరొటోనిన్ కోసం...

మన పిల్లలను ఆలింగనం చేసుకుంటూ ఆత్మీయులను దగ్గరకు తీసుకుంటూ ఆక్సిటోసిన్ కోసం..

జీవించే పద్ధతి ని అలవాటుచేసుకుంటూ ఉంటే ఆనందంగా జీవించగలమ

మనం సంతోషంగా ఉంటేనే మనం మన సమస్యలను సవాళ్ళను బాగా పరిష్కరించుకోగలము..


ఇప్పుడర్ధమైందా పిల్లలు చిరాకుగా ఉన్నప్పుడు వారిని దగ్గరకు తీసుకుని లాలించాలి...


అప్పుడు రోజురోజుకి మీ బిడ్డ సంతోషంగా హుషారుగా ఉండగలరు..


1.* ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి...ఎండార్ఫిన్స్


2.బిడ్డల చిన్న పెద్ద విజయాలకు ప్రశంసించాలి...డోపమైన్


3.సాటివారిని కలుపుకుంటూ వారితో సంతోషాలు పంచుకుంటూ జీవించే అలవాటుని మీరు పాటిస్తూ పిల్లలకూ అలవాటు చెయ్యాలి...సెరొటోనిన్


4. మీ బిడ్డ ను దగ్గరకు హత్తుకోండి...ఆక్సిటోసిన్...


జీవితాన్ని ఆనందమయం చేసుకోండి...🙂

ఆ రోజులే ఎంతో హాయి!

 శీర్షిక.. ఆ రోజులే ఎంతో హాయి!


ఆరోజులె ఎంతో హాయి

ఇది కాదనలేని నిజం 


కారంతో మండే పచ్చడి మెతుకులు తిన్నా

చల్దన్నం తిన్నా .. మారాం గారం 

అలుకలతో.. అమ్మ గుమ్మపాలు త్రాగి గడిచిన బాల్యం 

భీమునిలా బలవంతుని చేసిన పౌష్టిక ఆహారం

ఈనాడు డబ్బా పాలతో అవుతుంది పీలగా.. బలహీనంగా 


కొండలు ఎక్కుతూ, చెట్టూ చేమలపై ఎగబ్రాకుతూ

పొలాల గట్లపై గెంతుతూ.. చెరువుల్లో ఈదుతూ 

చెట్లెక్కిన ఆ బాల్యం ఎంతో అపూర్వం 

నాన్న తెచ్చిన తాజా తాజా బుట్టెడు మామిడి పండ్ల

రసాలు జుర్రుతూ.. ఆస్వాదించిన తీయని మమతల 

మాధుర్యం బాల్యం గుండె గుడిలో దాగింది..దొంగాటలు ఆడుతుంది 

నేను మళ్లీ నీకు కనిపించనంటూ..


బ్రహ్మ ముహూర్తం లో ఎక్కాల లెక్కల

చదువుతూ.. శతక పద్యాలు బట్టీ బెట్టింగులతో 

స్వర రాగాల పల్లకిలో..హల్లుల తైతక్కలతో 

చిలుకల పలుకుల పదాల పదనిసలతో 

సరస్వతీ నమస్తుభ్యం.. గురువే దైవంగా 

భావించిన విద్యాధనం పొందిన ఆరోజులే ఎంతో హాయి 


 కష్ట సుఖాల్లో కలిసీ మెలిసీ ఒకరికి ఒకరై అండగా 

తోడు నీడగా.. నిలిచిన ఉమ్మడి కుటుంబం 

ఆకలిని తీర్చే దయా గుణంతో 

వినయం శాంతీ సహనంతో వర్ధిల్లిన ఆ రోజులే ఎంతో హాయిగా..


వృద్ధాప్యంలో తీయని స్మృతులు 

ఆలపించాయి.. మది వెన్నెల కంటె చల్లగా సేదలు తీర్చాయి 

మమతలు వెల్లువగా 

ఆనాటి ఆ రోజులే ఎంతో హాయి కదా!!


°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ఇది నా స్వీయ కవిత

దయాసముద్ర తరంగాలు*

 🌸 *దయాసముద్ర తరంగాలు*


(శృంగేరి శారదా పీఠం 36వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి జీవిత విశేషాలు)


శ్రీచరణులు నిరంతర పఠనశీలి. ఎన్నో గ్రంథాలను అవలోకిస్తుంటారు. కొన్ని పుస్తకాలను సంపాదించి శృంగేరికి వెళ్లినప్పుడు శ్రీచరణులకు సమర్పిద్దామని ఒక భక్తుడు అనుకుని పుస్తకాలను అమ్మే కొట్టుకువెళ్లాడు. అక్కడ పుస్తకాలను పరిశీలిస్తుంటే ఒకపుస్తకం పై అర నుండి క్రింద పడింది. అతను దానిని తీసి పైన పెట్టాడు. కాస్సేపటికి ఆ పుస్తకం మళ్లీ క్రిందపడింది. ఆ భక్తుడు తిరిగి దానిని పై అరలో పెట్టాడు. కొన్ని పుస్తకాలను ఎంచుకుని వాటిని డబ్బుకట్టే చోటికి తీసుకువెళ్తుంటే, రెండుసార్లు తాను పై అరలో పెట్టిన పుస్తకం మళ్లీ నేలమీదపడి ఉండటం చూసాడు. అప్పుడు ఆపుస్తకాన్ని కూడ కొన్నాడు.


శృంగేరికి వెళ్లి శ్రీచరణులను దర్శించిన తరువాత భక్తుడు తన సంచీనుండి తాను కొన్నపుస్తకాలను బయటికి తీసి శ్రీచరణులకు సమర్పించాడు అయితే మూడుసార్లు నేలమీద పడిన పుస్తకాన్ని మాత్రం సమర్పించలేదు.


శ్రీజగద్గురువులు : (ఆ పుస్తకాన్ని చూస్తూ) ఆపుస్తకమేమిటి?


భక్తుడు : యితరపుస్తకాలను వెదుకుతున్నప్పుడు దీనిని కొనాలనిపించింది.


శ్రీజగద్గురువులు : అలాగా! మేము దానిని ఒక్కసారి చూడవచ్చా?


భక్తుడు : తప్పక (పుస్తకాన్ని సమర్పిచాడు)


శ్రీజగద్గురువులు : (పుస్తకం పై అట్టను చూసి) ఆశ్చర్యంగా ఉంది. చాలా కాలంనుండి ఈ పుస్తకాన్ని మేము చదవాలనుకుంటున్నాము.


భక్తుడు : ఈవిధంగా ఈ పుస్తకాన్ని నేనెందుకు కొన్నానో నాకిప్పుడు అర్ధమైంది.


శ్రీచరణులు చిరునవ్వుతో యిలా అన్నారు "ఆ గొప్పతనం మాది కాదు. ఇలా. జరగాలని అమ్మవారి సంకల్పం. అలా జరిగింది."


ఆంగ్లమూలం:

కె.సురేష్ చందర్ గారు

https://chat.whatsapp.com/LbYrKf7JokM6lc6MEhj5if

తెలుగు అనువాదం : 

తుమ్మలపల్లి హరిహరశర్మ గారు.


🌸 *శారదే పాహిమాం శంకర రక్షమాం* 🙏

గోధుమగడ్డి రసం ఉపయోగాలు

 గోధుమగడ్డి రసం ఉపయోగాలు - సంపూర్ణ వివరణ.


       గోదుమగడ్డి రసం అనునది వైద్యంలో చాలా ప్రముఖపాత్ర కలిగి ఉంది. చాలా మందికి దీనియొక్క ఉపయోగాలు తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు . గత కొంతకాలంగా దీనిపైన కొంతపరిశోధన చేసి దీని ఉపయోగాలు తెలుసుకున్నాను. ఈ గోధుమగడ్డి రసం కేన్సర్ చికిత్సలో కూడా చాలా అద్బుతఫలితాలు ఇచ్చింది. ఇది జలుబు , దగ్గు లాంటి చిన్నచిన్న వ్యాధులనే కాక బ్లడ్ కేన్సర్ , కేన్సర్ వంటివాటిలో కూడా చక్కని ఫలితాలు ఇస్తుంది.


             డాక్టర్ థామస్ అనే పరిశోధకుడు కూడా ఈ గడ్డిపైనా చాలా అద్భుతపరిశోధనలు చేశాడు . ఈ గడ్డిలో జీవమున్న ఖనిజాలు , విటమిన్లు , ఇతర పోషకాలు అనేకం ఉన్నాయి అని కనుగొనినాడు. ఒక ఆరోగ్యవంతుడి రక్తములో ఉండే అన్ని రకాల పదార్ధాలు ఈ గోధుమగడ్డి రసములో ఉండును. ఈ గోధుమగడ్డి రసానికి "ఆకుపచ్చ రక్తం " అనికూడా పేరు కలదు. కేన్సర్ తో బాధపడువారు ఒక గ్లాసు నిండా గోదుమగడ్డి రసాన్ని రోజుకి నాలుగుసార్లు తీసుకొనవలెను . ఇలా రోజుకి నాలుగు గ్లాసుల చొప్పున గోదుమగడ్డి రసాన్ని తీసికొనవలెను .


              ఈ గోధుమగడ్డికి జీవమున్న ఆహారం అని పేరు కలదు. దీనిలో ఉండే "క్లోరోఫిల్" రక్తాన్ని శుద్దిచేస్తుంది. పేగుల్లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . గోదుమగడ్డి రసంలో ఉండు క్లోరోఫిల్ పార్టికల్స్ హిమోగ్లోబిన్ ని పోలి ఉంటాయి. అందువల్ల రక్తహీనతకు ఐరన్ లా పనిచేయును . ఈ క్లోరోఫిల్ గుండె పనితీరును మెరుగుపరుచును. శరీరవ్యవస్థను , పేగులను , మూత్రకోశం , ఊపిరితిత్తులను బాగుగా ప్రభావితం చేయును . దీనిలో విటమిన్ A , B , ఈ మరియు K పెద్దమొత్తంలో ఉంటాయి. గోధుమ కంటే 600 శాతం అధికంగా విటమిన్ B ను గోధుమగడ్డి కలిగి ఉంటుంది. గోధుమగడ్ది లో కేన్సర్ నివారణకు ఉపయోగపడు B17 పెద్దమొత్తంలో ఉన్నది. గోధుమల కంటే గోధుమగడ్డిలో 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 


                శరీరంలో 30 రకాల ఎంజైములను చురుకుగా ఉంచడానికి అవసరం అయిన మెగ్నీషియం ఖనిజాలు గోధుమగడ్డి రసములో తేలికగా లభ్యం అగును. ఇప్పుడు మీకు గోధుమగడ్డి రసం వాడటం వలన నయం అయ్యే కొన్నిరకాల వ్యాధుల గురించి తెలియచేస్తాను . అవి 


     చర్మవ్యాధులు , మానసిక , శారీరక వ్యాధులు , మూత్రకోశ సంబంధ వ్యాధులు , మూత్రపిండాలలో రాళ్లు , మలబద్దకం , కడుపువ్యాధులు , మధుమేహం , గుండెవ్యాధి , కీళ్లు , కండరాల వ్యాధులు , ఆస్తమా , వంధత్వము , కన్ను , చెవి సంబంధ వ్యాధులు , కంపవాతం , దీర్ఘకాలిక జలుబు , అగ్నిమొలలు , వయస్సుకు ముందే జుట్టు నెరవడం , స్త్రీ గర్భసంబంధ వ్యాధులు , నిద్రలేమి , రక్తహీనత , కేన్సర్ వంటి వ్యాధులు 


             పైన చెప్పిన సమస్యలతో బాధపడువారు రోజుకు నాలుగు గ్లాసుల చొప్పున తక్కువలోతక్కువ 21 రోజులపాటు తీసుకొనవలెను .


    

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

నిమిత్త మాత్రులం

 *🙏🏻🙏🏻🙏🏻జై శ్రీ సంతోషిమాత 🙏🏻🙏🏻🙏🏻*


💎 *ఒక రోజు హనుమంతుడు శ్రీరాముణ్ణి కలుసుకున్నాడు. తన మనసులో కదులుతున్న ఆలోచనలను విన్నవించుకున్నాడు. "ప్రభూ! ఒక వేళ నేను లంకకు వెళ్ళకపోతే నా జీవితంలో ఎంతో పెద్ద లోపం మిగిలిపోయేది. అన్నిటికంటే ముందు విభీషణుడి ఇంటిని నేను చూశాను "ఈ రావణ లంకలో సాధువులు కూడా ఉంటారా" అనుకున్నాను. నేను లంకలో సీతాదేవిని వెతక లేకపోతే విభీషణుణ్ణి కలిసినప్పుడు ఉపాయం చెప్పాడు.*💎


              *నేను ఎంత ప్రయత్నించినా తెలియని విషయం లంకలో ఉన్న ఆ సాధువు ద్వారానే నాకు తెలిసింది ప్రభూ! బహుశా ఈ దృశ్యం చూపించడానికే ఇక్కడకు నన్ను పంపిచారేమో! అశోక వాటికలో రావణుడు వచ్చినప్పుడు ఆయన క్రోధంతో కత్తి దూసి సీతమ్మను చంపబోతుంటే, నాకు ఒక్కసారిగా దూకి, ఆ కత్తిని లాక్కొని, అతని తల ఖండించా లనిపించింది.*💎


        🔔 *కాని మరుక్షణమే మండోదరి రావణాసురుని చెయ్యి పట్టుకుని ఆపింది. ఆ దృశ్యం చూసి నేను పులకరించిపోయాను. ఓ తండ్రీ! మీరు ఎంతమంచి పాఠాన్ని నేర్పించారు! ఒకవేళ నేను సీతమ్మను రక్షించి ఉంటే "నేను లేకపోతే ఏమయ్యేది" అనే భ్రమ ఏర్పడేది. చాలమందికి "నేను లేకపోతే ఎలా?" అనే ఇలాంటి భ్రమ ఏర్పడుతుంది. నాకు కూడా అదే జరిగేది. ప్రభూ!*🔔


            *మీరు సీతమ్మను రక్షించడమే కాదు, ఆ పనిని రావణుడి భార్యకే అప్పగించారు. సీతమ్మకు ఏమవుతుందనే చింత, భయం నాకు తొలగిపోయాయి. అలాగే, త్రిజట లంకలోకి కోతి వచ్చిందని చెప్పింది. నాకు త్రిజట కూడా ఒక గొప్ప సాధ్విని అనిపించింది. ఈ కోతి లంకను తగుల బెడుతుందని చెప్పింది. కాని మరి "నా శ్రీరాముడు లంకను తగుల బెట్టమని చెప్పలేదు కదా? ఎలా?" అని ఆలోచనలో పడిపోయాను.*🔔


       🤔 *రావణాసురుడి సభలో నేను బంధితుణ్ణి అయితే ఎలా ఉంటుందో చూడ్డానికి బందీని అయ్యాను. రావణుడి సైనికులు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నన్ను రక్షించుకోవడానికి నేను ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. కాని దూతను చంపడం సరికాదని విభీషణుడు చెప్పాడు. నన్ను రక్షించడానికి ఈ ఉపాయం మీరే చేశారని నాకు అర్థమయింది.*🙂


            *ముందు విభీషణుణ్ణి నాకు చూపి నా భ్రమను తొలగించారు. సీతమ్మను రక్షించడానికి మండోదరిని నియమించారు. నన్ను రక్షించడానికి రావణుడి తమ్ముణ్ణి పంపించారు. ప్రభూ! అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం...రావణుడు " కోతిని చంపకూడదు. కాని దాని తోకకు నూనెలో ముంచిన వస్త్రాన్ని చుట్టి నిప్పు అంటించవచ్చు" అన్నాడు. ఆ విధంగా లంకలో త్రిజట చెప్పిన మాట సత్యమయింది. "లంకను తగులబెట్టడానికి నూనెనూ, నిప్పునూ నేను ఎక్కడినుంచి తీసుకురాగలను" అనుకున్నాను. కానీ ఆ ఏర్పాట్లు కూడా రావణాసురుడే చేశాడు. రావణుడితో కూడా మీరు పని చేయించు కున్నప్పుడు నాతో చేయించు కోవడం పెద్ద విషయమేమీ కాదు" అన్నాడు వినయంగా.*


          *అందుకే ఈ ప్రపంచంలో ఏది జరుగుతున్నా అది కర్మసిద్ధాంతం ప్రకారమే, దైవ సంకల్సం తోనే. మనం కేవలం "నిమిత్త మాత్రులం" అని గుర్తుంచుకోవాలి*👍🏼🔔🙏🏼🙏🏼.. *ఆంధ్ర ఫోకస్✍️*సర్వేజనా సుఖినోభవంతు🙏🏻🙏🏻*

జై గణేష్

 జై గణేష్

ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః

శుభోదయం.


శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే


ఓం గం గణపతయే నమః


అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః 

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః 


ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః 

వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః 


షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి 

విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా 

సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య


శ్రీ గురుభ్యోన్నమః


గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।

గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ।।


సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం

అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం


పూజ్యాయ రాఘవేంద్రాయ, సత్య ధర్మ రతాయచ, భజతాం కల్పవృక్షాయ, నమతాం కామధేనువే.


లోకాః సమస్తాః సుఖినోభవంతు ॥

శుభమస్తు, 

ఓం శాంతి.. శాంతి.. శాంతిః

ఇద్దరే బలవంతులు

 *ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను అంటుంది🌲*


*కాళిదాసు*


*🌻మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు. మిట్టమధ్యాహ్న సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.*


*🌻ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది. ఆమెను చూసి బాలికా! నాకు దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వమని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక,‘మీరెవరో నాకు తెలియదు నీళ్లు ఎలా ఇచ్చేదను’అని బదులిచ్చింది.*


*🌻కాళిదాసు ‘నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? పెద్ద పండితుడను ఎవరిని అడిగినా చెబుతారు’అని అన్నాడు. అహంకార పూరితమైన ఆ మాటలు విని బాలిక నవ్వి,మీరు అసత్యమాడుతున్నారు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది.*


*🌻అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి. ‘నాకు తెలియదు గొంతు ఎండిపోతోంది ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు. ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం.*


*🌻ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు? అని అడుగుతుంది బాలిక. ‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు. మళ్లీ అసత్యమాడుతున్నారు. బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి.*


*🌻మీరేమో అలిసిపోయారు కదా, ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు. వారే సూర్యచంద్రులు! అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.*


*🌻దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందే నిలబడి, ‘మాతా నీళ్లు ఇవ్వండి దాహంతో చనిపోయేలా ఉన్నాను’ అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి ‘మీరెవరో సెలవివ్వండి నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా ‘నేను అతిథిని!’ అని బదులిచ్చాడు.*


*🌻మీరు అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు. ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు అంటుంది. కాళిదాసు ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు. కానీ ఆమె మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఉన్నారు. ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు? అని అడిగింది.*


*🌻ఓపిక నశించిన కాళిదాసు, ‘నేను మూర్ఖుడను ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు. ఆ అవ్వ నవ్వుతూ, ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు, అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది.*


*🌻ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. ‘కాళిదాసా! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా! కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’ అని జలమును అనుగ్రహిస్తుంది.*


*🌻విద్య, అధికారం, ధన బలముతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి.*


🙏ఓంనమఃశివాయ హరహరమహదేవశంభోశంకర🙏