24, ఫిబ్రవరి 2026, మంగళవారం

సుఖమే స్వర్గము

  


    (సుఖమే స్వర్గము. దుఃఖమే నరకము. సర్వవిధాలా దుఃఖాన్ని తొలగించుకోవాలి)



శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                           ------------


ఇప్పటివరకు అనుభవించిన దుఃఖాలేవో అనుభవించాము.

ఈ క్షణం నుండి దుఃఖమును అనుభవించకూడదు (హేయం దుఃఖమనాగతం)

అంటున్నది యోగ శాస్త్రం.


యోగ శాస్త్రం ఇంకా ఈ విధంగా చెబుతున్నది:

ప్రాపంచిక విషయాలు చాలా బలవంతమైనవి. ఇంద్రియములకు విషయములైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములన్నింటిలోనూ, మనకు ఇష్టమో అయిష్టమో ఉంటుంది. 

రాగ ద్వేషములనబడే ఆ ఇష్టానిష్టాలననుసరించి మనం ఆ,యా, విషయాలలో ప్రవర్తిస్తూ ఉంటాం.

రాగం వల్ల పుణ్య కర్మలు, ద్వేషం వల్ల పాప కర్మలు చేస్తాం. 

పుణ్య కర్మల వల్ల సుఖము, పాప కర్మల వల్ల దుఃఖము కలుగుతాయి. 

సుఖం వల్ల మళ్లీ ఆ విషయములందు రాగము,దుఃఖము వల్ల ఆ విషయములందు ద్వేషము కలుగుతాయి. 

రాగము వల్ల మళ్లీ పుణ్యకర్మలు, ద్వేషం వల్ల మళ్లీ పాప కర్మలు, చేస్తాం.

వాటిఫలితంగా మళ్లీ సుఖ దుఃఖాలు, ఈ విధంగా జనన మరణాలతో కూడిన సంసార చక్రం అనంతంగా పరిభ్రమిస్తూ ఉంటుందని యోగ శాస్త్రము చెబుతోంది.

విషయములచే ఆకర్షింపబడిన ఇంద్రియాలు బలవంతంగా మనస్సును విషయములలో ప్రవర్తింప జేస్తాయి.

ఎంత ప్రయత్నం చేసినా,ఎంత పండితుడినైనా ఇంద్రియాలు లొంగదీసుకుంటాయి, అని శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు.


శ్లో// యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత:/

ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః//

( ఓ అర్జునా!మోక్షం కొఱకు తీవ్ర ప్రయత్నం చేస్తున్న మహా పండితుడినైనా, బలవంతమైన ఇంద్రియములు, బలాత్కారంగా వాని మనస్సును ఆకర్షించి సంసారంలో పడవేయును).


కాబట్టి ఈ విషయంలో సామాన్య ప్రయత్నం చాలదు. 

గొప్ప ప్రయత్నం చెయ్యాలి.

" సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో

 దృఢ భూమి: " (పతంజలి మహర్షి)

(ఆ ప్రయత్నం చాలకాలము, నిరంతరము తపస్సు, జపము, దేవతారాధన మొదలైన సత్కర్మలను ఆచరిస్తూ దృఢపరచు కొనవలెను)


ఆ ప్రయత్నం కూడా ఎప్పుడో ముసలితనం

వచ్చాక " కృష్ణా", "రామా" అనుకుంటామంటే, సాధ్యపడదు. 

వార్ధక్యంలో దేహము యోగ సాధనకు సహకరించదు కాబట్టి, ముసలితనం రాక ముందే గట్టి ప్రయత్నం చెయ్యాలి, అంటున్నారు భర్తృహరి మహాయోగి.


శ్లో// యావత్ స్వస్థమిదం శరీర మరుజం యావచ్చ దూరే జరా/

యావచ్చేంద్రియ శక్తి రప్రతిహతా యావత్ క్షయో నాయుష:/

ఆత్మ శ్రేయసి తావదేవ విదుషా కార్య:ప్రయత్నో మహాన్/

సందీప్తే భవనేతు,కూప ఖననం ప్రత్యుద్యమ:కీదృశ://


(ఈ శరీరములో ఆరోగ్యము, స్వస్థత ఉన్నప్పుడే,ముసలితనం రాక ముందే, ఇంద్రియ పాటవం తగ్గక ముందే, ఆయుర్దాయము క్షీణింపక ముందే, తెలివి గలవాడు, తన శ్రేయస్సు కోసం మోక్షప్రాప్తికి, గొప్ప ప్రయత్నం చెయ్యాలి. దేహంలో అన్ని శక్తులు నశించిన పిదప,ప్రయత్నంచేయడము అంటే, ఇల్లు తగలబడి పోతున్నప్పుడు, నీటి కోసం అప్పుడు బావి త్రవ్వడం మొదలు పెట్టడం వంటిది).


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

24-2-'26.

కామెంట్‌లు లేవు: