5, జూన్ 2025, గురువారం

వేద ఆశీర్వచనం


 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం -‌ నవమి - ఉత్తరాఫల్గుని -‌‌ సౌమ్య వాసరే* (04.06.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మకరందము

 18-04-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇట్లు కర్మను గూర్చి భిన్నమతములను దెలిపి శ్రీకృష్ణమూర్తి అవ్విషయమున తన నిశ్చయమును తెలియజేయుచున్నారు–


నిశ్చయం శృణు వేు తత్ర 

త్యాగే భరత సత్తమ! |

త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధస్సమ్ప్రకీర్తితః || 


తాత్పర్యము:- భరతకులోత్తముడవును, పురుషశ్రేష్ఠుడవునగు ఓ అర్జునా! అట్టి కర్మత్యాగవిషయమున నా యొక్క నిశ్చయమేదియో చెప్పెదను వినుము. త్యాగము మూడువిధములుగా చెప్పబడియున్నది కదా!


వ్యాఖ్య:- (1) కర్మలను బొత్తిగా వదలివేయవలెను. (2) తపోయజ్ఞదానాది కర్మలను మాత్రము వదలరాదు - అను రెండు వాదములను జెప్పి భగవానుడు ఆ విషయమున తన తీర్పును చెప్పుచున్నాడు -


"నిశ్చయం శృణు మే' - అని చెప్పినందువలన భగవానుడు తాను పూర్ణముగ స్థిరపఱచుకొని, నిశ్చయించుకొనినదానినే వచించుచున్నారని అర్థము. ఆహా! ఇట్టి భగవన్నిశ్చయమందు జనుల కేల విశ్వాసము యుండరాదు?! సామాన్యులు ప్రకృతికి, మాయకు లోబడినవారుకావున వారి నిశ్చయములం దేవేని లోపములుండవచ్చును. కాని ప్రకృతికి అతీతుడై మాయాదోషములేని (చైతన్యరూపుడగు) పరమాత్మయొక్క భావములు అతినిర్దుష్టములై యుండును. అట్టి మహనీయుడు " నా నిశ్చయము వినుడు' అని చెప్పినపుడు ఇక జీవులు ఎన్ని చెవులతో దానిని వినవలయునో యోచించుకొనుడు! కావున భగవాను డిపుడు చెప్పబోవు త్యాగము మున్నగువానిని గూర్చిన ఉదాత్తభావములను, నిశ్చయములను కడు జాగరూకతతో విని తదనురీతి యనుష్ఠించి తరించవలెను.

ప్రశ్న:- త్యాగ మెన్నివిధములని భగవానుడు తెలియజేసిరి?

ఉత్తరము: - మూడు విధములని.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*


*397 వ రోజు*


*భీమసేనుని మనోగతము*


అప్పటికి వారు రణరంగం సమీపించారు. యుద్ధం ఘోరంగా జరుగుతుంది. ఇరుపక్షముల వారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కర్ణుడి కుమారులలో ఒకడు ఉత్తమౌజుడి చేతిలో మరణించాడు. అది చూసిన కర్ణుడు ఉత్తమౌజుని రధాశ్వములను, కేతనమును నరికాడు. ఉత్తమౌజుడు కత్తి తీసుకొని తనకు అడ్డంగా వచ్చిన కృపాచార్యుడి రధాశ్వములను నరికి వెంటనే శిఖండి రధము ఎక్కాడు. ఇంతలో అశ్వత్థామ కృపాచార్యుని తన రధము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. భీమసేనుడి పరాక్రమానికి తట్టుకోలేక కౌరవ సేనలు పారిపోసాగాయి. అది చూసి భీముడు తన సారధి విశోకుడితో " విశోకా ! అన్న ధర్మజుడు రణభూమి నుండి తొలగి పోయాడు. అన్న క్షేమం కనుగొనుటకు వెళ్ళిన అర్జునుడు కూడా రాలేదు. వారిరువురికి ఏమి జరిగిందో తెలియరాలేదు. వారికి కీడు కలిగిన ఈ యుద్ధముతో ప్రయోజనమేముంది. అయినా నేను శత్రు వినాశనం చేయక తప్పదు. అది సరే మనకు సరిపడా బాణములు ఉన్నాయి కదా! విశోకా అటు చూడు ఆ కేతనమును చూసి అందు ఉన్న రథికులను పోల్చగలవా ! " అన్నాడు. బదులుగా విశోకుడు " భీమసేనా ! మనకు అస్త్రశస్త్రల గురించి చింత లేదు. అవి విస్తారంగా ఉన్నాయి. మన వెనుక వచ్చు బండిలో ఆయుధములు ఇసుమంతైనా తరగ లేదు. నీ చేత గద ఉండగా నీకు ఈ ఆయుధములతో పని లేదు కదా ! నీ చేతి గద చాలదా శత్రు నిర్మూలనకు " అన్నాడు. ఆ మాటలకు భీముడు సంతోషించాడు. అంతలో విశోకుడు " భీమసేనా ! అటు చూడు నీ తమ్ముడు అర్జునుడు ఏనుగుల సమూహాన్ని తరుముతున్నాడు " అన్నాడు. అది విని భీముడు సంతోషంతో ఉప్పొంగి పోయి " విశొకా ! మన రథమును అర్జునుడి వద్దకు పోనిమ్ము " అన్నాడు. వెంటనే విశోకుడు రధమును అర్జునుడి వైపు పోనిచ్చాడు. రణరంగ ప్రవేశం చేసిన అర్జునుడు కౌరవసేనలను దునుమాడి తన పరాక్రమంతో వాటిని తరముతున్నాడు. మరొక వైపు భీముడు కూడా శత్రు సైన్యములను దునుమాడుతున్నాడు. అది చూసి సుయోధనుడు " భీముడు చస్తే కాని పాండవసేన పారిపోదు. ముందు వీడిని చుట్టుముట్టి చంపండి " అన్నాడు. కౌరవసేనలోని ప్రముఖవీరులు భీముని చుట్టుముట్టి ఎదుర్కొన్నారు. భీముడు విచక్షణారహితంగా శత్రుసేనను చంపుతున్నాడు. శకుని భీముని ఎదుర్కొని అతడి వక్షస్థలానికి గురిపెట్టి బాణంతో కొట్టాడు. భీముడు శకుని విల్లు విరిచాడు. శకుని వేరొక విల్లందుకుని భీముని సారధిని, రధాశ్వములను పదునారు బాణములతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. భీముడు కోపించి శక్తి ఆయుధమును శకుని మీద ప్రయోగించాడు. శకుని లాఘవంగా శక్తి ఆయుధమును పట్టుకుని తిరిగి భీముని మీదకు విసిరాడు. అది భీముని చేతిని గాయపరిచింది. అది చూసి కౌరవసేనలు ఆనందించాయి. వెంటనే భీముడు విల్లందుకుని శకుని శరీరం అంతా శరములతో నింపాడు. శకుని రధము మీద కూలిపోయి మూర్ఛిల్లాడు. అది చూసిన సుయోధనుడు శకునిని తన రధము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

చాతుర్మాస్యము

 శ్రీమాత్రేనమః           

            |చాతుర్మాస్యము |

            నాలుగునెలలకాలము చేయు కృత్యము చాతుర్మాస్యము అని తెలుసు కొనవచ్చును. వైదిక యుగమునందు నాలుగు మాసాలకు ఒక ఋతువు చొప్పున మూడు ఋతువులే పరిగణించే వారని పురాసాహిత్యము ద్వారా తెలుస్తుంది. అవి 1- వర్ష ఋతువు 2- హేమంత ఋతువు 3- వసంత ఋతువు. సంవత్సరము వానకాలమునుండి ప్రారంభించబడుచుండెను. 

అందులకే సంవత్సరానికి వర్షమని కూడా వ్యవహారములోనికి వచ్చింది. ప్రతి ఋతువు ఆరంభంలో ప్రత్యేక యజ్ఞాలు నిర్వహింపబడుచుండెను. ఫాల్గుణ పౌర్ణమి నాడు వైశ్వదేవయజ్ఞం. ఆషాఢ పౌర్ణమి నాడు వరుణ ప్రఘాసయజ్ఞం 3- కార్తీక పౌర్ణమి నాడు పాకమేoధ యజ్ఞము జరపాలని శతపథ బ్రహ్మణంలో చెప్పబడినది. క్రమంగా వర్ష ఋతువునే చాతుర్మాస్యంగా నడుపుట ప్రజల ఆచారంగా నెలకొని ఉంది. 

              ఆషాఢ శుక్ల ఏకాదశి ఈ చాతుర్మాస్యము ఆరంభించి కార్తీక శుక్ల ద్వాదశి తో పూర్తి చేయబడును. ఆషాఢ శుద్ధ ఏకాదశి ప్రథమ ఏకాదశి. దీనిని బట్టి వర్ష ఋతువు వర్ష ప్రారంభమని. పురాణములననుసరించి మహావిష్ణువు పాలసంద్రములో శేషపర్యంకంపై నిద్రిస్తాడని సంప్రదాయం. ఈ వ్రతాన్ని ఏకాదశి నుండికాని కటకసంక్రాంతి నుండి గాని , ఆషాఢ పౌర్ణమి నుండి గాని కొనసాగించ వచ్చును. ఇలా వ్రతమాచరించిన సంవత్సరంలో చేసిన పాపాలు తొలుగునని భారత యితిహాసము పేర్కొన్నది. 

            ఈ చాతుర్మాస్య విధానం గూర్చి స్కాందపురాణం , భవిష్య పురాణం మొదలగు పురాణాలు వివరంగాతెలిపినాయి. శ్రావణంలో కూరలను , భద్రపదమాసంలో పెరుగును , ఆశ్వయుజ మాసంలో పాలను , కార్తీక మాసంలో పప్పు పదార్థాలను భోజనం నుండి వదలి పెట్టాలి. చాతుర్మాస్యము అందరికీ నిత్యవ్రతం. నిమ్మ. రాజమాషాలు , ముల్లంగి , ఎర్రముల్లంగి , గుమ్మడి , చెరుకు వాడరాదు. అని స్కాంద పురాణం ఉవాచ. కొత్త ఉసిరిక చింత , గుమ్మడి మున్నగు వాటిని వదలి పెట్టాలి. పాత ఉసిరికను వెదకి సంపాదించి వాడాలి. దీనినిఅనుసరించి వర్షాకాలంలోఆపత్యాహారం నుండి ఆరోగ్య ఆహారం తీసుకొని ఆరోవ్య పరిరక్షణార్థం ఈవ్రత పరమార్థO Ani తెలుస్తుంది వర్షాకాలమంతా నేల బురదతో కూడియుండును. క్రీమీ కీటకాలకు బురద నెలవు. రోగాలు వ్యాపించడం సహజం కదా ! 

         పైన తెలుపబడిన పదార్థాలన్నీ వర్జములే ఇవి త్రిదోష ప్రకోపాలు. బయట తిరుగకుండ తమ ఉనికి పట్టులోనే ఉండి మిత పధ్యాహారముతో కాలము గడుపుటయే శ్కరమని తెలుపుటకే ఈ వ్రతం నిర్ణయించ బడింది. ఈ క్రమం అందరు ఆశ్రమవాసులకునూ ముఖ్యమని పురాణాలు తెలుపుతున్నాయి. ప్రధానముగా సన్యాసులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.  

                బుద్ధుడు చాతుర్మాస్యం ఆచరించినట్లు జాతక కథల్లో పేర్కొనబడింది. ఈ బౌద్దులు చాతుర్మాస్య ముగింపు కార్తీక మాసములో పున్నమినాడు. బ్రహ్మానందంగా ఉత్సాహం నిర్వహించు కొనేవారని బౌద్ధసాహిత్యం తెలుపుతుంది. వారణాసి ఆవ o తికా మొదలగు ప్రదేశాల్లో ఈ చాతుర్మాస్య ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేదివారని రాత్రులందు దీపాలను వెలిగించెడి వారు తమ కస్టాలు తొలగి ఆరోగ్యం చూడనందుకు యక్షుడై చిత్తుని పూజించేవారు. 

           అందమైన వస్త్రాలఅలంకారంతో రాజమార్గంలో సంచరించెడి వారు అనితెలుస్తూనేఉంది. జైనులుకూడా ఈ వ్రతాన్ని కొనసాగించేవారని జైన సాహిత్యంలో విపులముగా ఉంది. 

           సహజంగజైనులు అహింసావ్రత నిష్టులు. నేటికీ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆషాఢం కార్తీకం ఫాల్గుణ మాసంలో అష్టాగ్నికి ఆనుపూజలు నిర్వహించేడి వారని జైనీయ సాహిత్యం తెలుపుతుంది ఈ చాతుర్మాస్య మును జైనులు స్నానోత్సవముగా మిగుల వైభవం గా కొనసాగించే వారని. దీనిని చాతుర్మాసీయ మజ్జణాదు ఉత్సవం అని నేటికిని వ్యవహరిస్తారు.

బాబుదేవీదాస్ రావు.

Panchaag


 

గద్దెదించాలని

 అది 1998వ సంవత్సరం బీజేపీ ప్రధాని వాజ్ పేయిని గద్దెదించాలని కాంగ్రెస్, CPMలు చేతులు కలిపి, లోక్ సభలో ఉంచిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్, CPI (M) పార్టీల నాయకులు కలిసి కూర్చుని, బీజేపీ కూటమిపై దాడి చేస్తున్నారు. ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు బల్లలు చరుస్తూ, పరస్పరం అభినందించుకుంటు ఉన్నారు. అదే బీజేపీ నాయకుడు కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడితే మాత్రం CPM నాయకులు తీవ్రంగా ప్రతిదాడి చేస్తున్నారు. 


సరిగ్గా అప్పుడే రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ బీజేపీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ ఇలా అన్నాడు... "స్పీకర్ సార్, కాంగ్రెస్ పార్టీపై ఒక గొప్పసంస్థ తమ పుస్తకంలో ఏమి చెప్పిందో మీకు చదివి వినిపిస్తాను" అంటూ ఒక పుస్తకాన్ని  తీసి ఇలా చదవడం మొదలుపెట్టాడు....

"కాంగ్రెస్ పార్టీ అవినీతికి ఫౌంటైన్ హెడ్ లాంటిది. (కాంగ్రెస్+ సిపీఎం బెంచీల నుండి పెద్దగా అరవడం మొదలైంది). బ్రిటీష్ వాళ్ళు వదిలిన కాంగ్రెస్ పార్టీ అవినీతిలో గత 50 ఏళ్ళుగా, కొత్త రికార్డులు నెలకొల్పింది. ముంద్రా స్కామ్, చౌరత్ లాటరీ స్కామ్, బోఫోర్స్ స్కామ్, సుఖ్రం స్కామ్, హర్షద్ మెహతా స్కామ్, JMM ముడుపుల స్కామ్, హవాలా స్కామ్ వంటి స్కామ్స్ లో కాంగ్రెస్ మంత్రులు చిక్కుకున్నారు. భారత ప్రజాస్వామ్యంలోని ప్రతి సంస్థను అవినీతి కాంగ్రెస్ దుర్వినియోగం చేసింది"

ఆ స్పీచ్ ని తట్టుకోలేని కాంగ్రెస్, సిపిఎం పార్టీలు సభలో ఒక్కసారిగా లేచి "స్పీకర్ సర్, ఊరు పేరు లేని పుస్తకాలలోని అసత్యాలని ఫెర్నాండేజ్ గారు చదవడానికి మేం ఒప్పుకోము" అంటూ గోల చేశారు.


జార్జి ఫెర్నాండెజ్ మాట్లాడుతూ "దయచేసి నన్ను చదవనీయండి. పుస్తకం పేరును చివర్లో నేనే చెప్తాను" అంటూ, మళ్ళీ చదవ సాగాడు.

"సెక్యులరిజం ముసుగులో కాంగ్రెస్ పార్టీ వివిధ సమయాల్లో దేశంలో అల్లర్లు సృష్టించింది. తమ గూండాలతో ఢిల్లీలో 3000 సిక్కుల్ని ఊచకోత కోయించింది. ఇలాంటి హానికరమైన కాంగ్రెసుని భూమి నుండి తుడిచిపెట్టడం ముఖ్యం". ఇక  తట్టుకోలేని కాంగ్రెస్, సిపిఎంలు ఫెర్నాండేజ్ పై అరుస్తూ, ఆ పుస్తకం పేరు చెప్పకుండా, చదవనీయమని పట్టుబట్టారు.


అప్పుడు పెర్నాండెజ్ గారు  "సరే, స్పీకర్ సర్! గౌరవ CPM సభ్యులు ఇంతగా పట్టుబట్టారు కాబట్టి, చెబుతున్నాను...

ఈ పుస్తకం మరేదో కాదు, లోక్‌సభ ఎలక్షన్స్ ముందు ఇదే  CPM వాళ్ళు జారీచేసిన CPI(M) మేనిఫెస్టో". అంతే సభలో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. కమ్యూనిస్టులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఫెర్నాండేజ్ గారు అందుకుంటూ, "ఏం జరిగింది, ఎందుకీ నిశ్శబ్దం...??  మీరేగా పుస్తకం పేరు చెప్పమన్నారు, పేరు వినగానే, మీ గొంతులు మూగ పోయాయెందుకు....?? సిగ్గు పోయిందా మీకు....?? మీ సొంత మానిఫెస్టోని మీరే చదవలేదా...?? చదివినా, మీ భావజాలం మీకే నచ్చలేదా...?? ఇలాంటి భావజాలం గల మీరు, మళ్ళీ అదే కాంగ్రెసుతో సెక్యూలరిజం పేరుతో, చేతులు కలిపినందుకు మీరంతా సిగ్గుతో చచ్చిపోవాలి. ఆ పార్టీ అవినీతిలో ఉన్న అన్ని రికార్డులు చేరిపేసింది. ఇకనైనా మీరు ఆలోచించి, మీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని నేను కోరుతున్నాను. ఒకవేళ మీరు మీ మార్గాన్ని చక్కదిద్దుకోకపోతే, మీ పార్టీ ఓ గత చరిత్రగా మిగిలిపోతుంది" ...... అంటూ ముగించారు.

⛔ ఆయన చెప్పినట్లుగానే తర్వాతి కాలంలో నిజంగానే కమ్యూనిస్టులు చాలా రాష్ట్రాల్లో అంతమవడం మనం చూశాం. 

ఈ రోజు జాతీయవాది, దేశ భక్తుడు, మాజీ భారత రక్షణ శాఖ మంత్రి కీర్తిశేషులు జార్జి ఫెర్నాండెజ్ గారి పుట్టినరోజు సందర్భంగా నివాళులు 🙏🙏💐.....

(సేకరణ)

3, జూన్ 2025, మంగళవారం

ఎక్కిళ్లు హరించుటకొరకు

 వరసగా వచ్చు ఎక్కిళ్లు హరించుటకొరకు అద్భుత యోగాలు - 


 * నల్లేరు కాడలు తెచ్చి కుమ్ములో ఉడకబెట్టి రసముపిండి ఆ రసము 5ml తేనే 5ml కలిపి పూటకొక సారి రోజూ రెండుసార్లు తీసుకున్న యెడల ఎక్కిళ్లు హరించును 


 * నెమలిపింఛం కాల్చి మసిచేసి ఆ మసి , తేనె , తమలపాకులరసం సమభాగములుగా కలిపి పూటకు 5 గ్రాములు చొప్పున రోజుకి మూడుపూటలా ఇచ్చుచుండిన యొడల ఎక్కిళ్లు హరించును . 


• శోంఠి , తేనె కలిపి ఒక చిన్న ఉసిరి కాయ అంత ఉండ చేసి బుగ్గన పెట్టుకొని రసం మింగుతూ ఉండాలి. ఇలా రెండు నుంచి మూడు సార్లు చేయుచున్న ఎక్కిళ్ళు తగ్గును. 

    

పైన తెలిపిన యోగాలలో ఏదో ఒక సులభ యోగాన్ని పాటించి ఎక్కిళ్ళు సమస్య నివారించుకోవచ్చు. ఇది ప్రధానంగా వాతదోషం పెరగడం వలన ఈ సమస్య ఏర్పడును. 


గమనిక -

           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .

                  కాళహస్తి వేంకటేశ్వరరావు 

                         9885030034 

               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

సుభాషితము

 👌సుభాషితము👌



ప్రత్యాఖ్యానే చ దానే చ 

సుఖదుఃఖే ప్రియాప్రియే! 

ఆత్మౌపమ్యేన పురుషః

ప్రమాణమధిగచ్ఛతి!!


మొదట మానవుడు ఇతరులను విమర్శించుట, తిరస్కరించుట, సుఖమును కానీ దుఃఖమును కానీ కలిగించుట, ఇష్టమైన పని చేయుట లేక అయిష్టమైన పని చేయుట మొదలైనవి తనపట్ల జరిగితే ఎట్లా ఉంటుందో, దానిని ప్రమాణంగా తీసుకొని ఇతరుల పట్ల తాను ప్రవర్తించాలి.

⚜ శ్రీ శని శింగనాపూర్

 🕉 మన గుడి : నెం 1130


⚜ మహారాష్ట్ర : అహమ్మద్ నగర్


⚜  శ్రీ శని శింగనాపూర్



💠 ఇళ్లకు ముందు తలుపులు లేని, దుకాణాలు ఎల్లప్పుడూ తాళం తీసివేసి ఉంచబడే మరియు స్థానికులు ఎప్పుడూ సురక్షితంగా ఉన్న  ఒక గ్రామాన్ని ఊహించుకోండి.

ఇది భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని శని శింగనాపూర్ కథ, గ్రామ సంరక్షకుడిగా పరిగణించబడే శని దేవుడు శనిపై వారి అచంచల విశ్వాసం కారణంగా గ్రామస్తులు భద్రతతో వుంటారు 


💠 శని శింగనాపూర్ దేవాలయం శని గ్రహంతో సంబంధం ఉన్న శని భగవానుడి యొక్క ప్రసిద్ధ దేవస్థానం.  ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని అహెమ్దానగర్ జిల్లాలో ఉంది.


💠 ఈ ఆలయం భారతదేశం నలుమూలల నుండి స్థానికులు మరియు భక్తులలో బాగా ప్రసిద్ధి చెందింది.  

గుడితో పాటు, శింగనాపూర్ ఒక చిన్న గ్రామం, ఇది గ్రామం మొత్తంలో ఏ ఇంటికి తలుపులు లేనందున ప్రసిద్ధి చెందింది మరియు అయినప్పటికీ గ్రామంలో ఎటువంటి దొంగతనం నివేదించబడలేదు.


💠 పురాణాల ప్రకారం, సుమారు 300 సంవత్సరాల క్రితం, భారీ వర్షాలు మరియు వరదల తరువాత, ఒకప్పుడు గ్రామం గుండా ప్రవహించే పనస్నాల నది ఒడ్డున ఒక భారీ నల్లటి రాతి పలక కొట్టుకుపోయి కనిపించింది. 

స్థానికులు 1.5 మీటర్ల బండరాయిని కర్రతో తాకినప్పుడు, దాని నుండి రక్తం కారడం ప్రారంభమైంది.

ఆ రాత్రి తరువాత, శని గ్రామాధికారి కలలో కనిపించి, అది తన సొంత విగ్రహం అని వెల్లడించాడు.


💠 అతను గొర్రెల కాపరికి తాను "శనీశ్వరుడు" అని, మరియు ఒక ప్రత్యేకమైన నల్ల రాయి తన స్వయంభు రూపం అని చెప్పాడు. గొర్రెల కాపరి ప్రార్థించి, తనకు ఆలయం నిర్మించాలా అని ప్రభువును అడిగాడు. దీనికి, శని దేవుడు ఆకాశమంతా తన పైకప్పు కాబట్టి పైకప్పు అవసరం లేదని మరియు అతను బహిరంగ ఆకాశం కింద ఉండటానికి ఇష్టపడతానని చెప్పాడు.

 ప్రతి శనివారం రోజువారీ పూజ మరియు 'తైలాభిషేకం' చేయమని గొర్రెల కాపరిని కోరాడు. 

మొత్తం గ్రామానికి దోపిడీదారులు, దొంగలు లేదా దొంగల భయం ఉండదని కూడా ఆయన వాగ్దానం చేశాడు.


💠 పట్టణం మధ్యలో పైకప్పు లేని గడపపై గ్రామస్తులు భారీ రాయిని ఏర్పాటు చేసిన తర్వాత, వారు అన్ని తలుపులు మరియు తాళాలను పారవేయాలని నిర్ణయించుకున్నారు. వారికి ఇకపై వాటి అవసరం లేదు.


💠 కొత్త నిర్మాణాలు కూడా ఈ ప్రోటోకాల్‌లను గౌరవించాలి. 

2015 సెప్టెంబర్‌లో మాత్రమే ప్రారంభించబడిన మరియు గ్రామస్తుల నుండి ఇంకా ఒక్క ఫిర్యాదు కూడా రాని పోలీస్ స్టేషన్‌కు ముందు తలుపు లేదు; 


💠 యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ 2011లో శని శింగనాపూర్‌లో భారతదేశంలోని మొట్టమొదటి "తాళాలు లేని" శాఖను ప్రారంభించింది, గ్రామస్తుల నమ్మకాలకు సంబంధించి పారదర్శకత స్ఫూర్తితో గాజు ప్రవేశ ద్వారం మరియు అస్పష్టంగా కనిపించే రిమోట్-నియంత్రిత విద్యుదయస్కాంత లాక్‌ను ఏర్పాటు చేసింది.


💠 ఇక్కడి స్థానికులు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు, వారు పట్టణంలో లేనప్పుడు తమ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలని పొరుగువారిని కూడా అడగరు. దొంగలకు వెంటనే అంధత్వంతో శిక్ష పడుతుందని, నిజాయితీ లేని ఎవరైనా ఏడున్నర సంవత్సరాల దురదృష్టాన్ని ఎదుర్కొంటారని వారు నమ్ముతారు. వాస్తవానికి, ఒక గ్రామస్తుడు తన ఇంటి ప్రవేశద్వారం వద్ద చెక్క అద్దాలను ఏర్పాటు చేసినప్పుడు, మరుసటి రోజే అతనికి కారు ప్రమాదం జరిగిందని స్థానిక పురాణం చెబుతోంది.


💠 కాబట్టి, శనైశ్వరుడిని నేటికీ, పైకప్పు లేకుండా బహిరంగ ప్రాంగణంలో చూడవచ్చు. నేటికీ, ఏ ఇళ్ళు, దుకాణాలు, దేవాలయాలకు తలుపులు లేవు.

శని భయం కారణంగా, ఈ శని ఆలయానికి ఒక కిలోమీటరు వ్యాసార్థంలో ఉన్న నివాస గృహాలు, గుడిసెలు, దుకాణాలు మొదలైన నిర్మాణాలకు తలుపులు లేదా తాళాలు లేవు.


💠 శని శింగనాపూర్‌ను ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శనేశ్వరుని ఆశీస్సుల కోసం ప్రార్థిస్తూ సందర్శిస్తారు. ఈ ప్రదేశం శనివారాల్లో రద్దీగా ఉంటుంది. 

శని త్రయోదశి కూడా స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. అదేవిధంగా ' అమావాస్య' రోజు వచ్చే శనివారం శనైశ్వరుడికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది మరియు ఆ రోజుల్లో ఆయన ఆశీస్సులు కోరుకునే భక్తులు ఈ ఆలయానికి భారీ సంఖ్యలో వస్తారు. 



💠శని దేవుడి విగ్రహం ఐదున్నర అడుగుల ఎత్తైన నల్లటి శిలను బహిరంగ వేదికపై ఏర్పాటు చేశారు, ఇది శని దేవుడిని సూచిస్తుంది. 

విగ్రహం పక్కన త్రిశూలం ఉంచబడింది మరియు దక్షిణం వైపున నంది (ఎద్దు) విగ్రహం ఉంది. ముందు భాగంలో శివుడు మరియు హనుమంతుడి చిన్న చిత్రాలు ఉన్నాయి .



💠 శని శింగనాపూర్ ఆలయం షిర్డీ నుండి 65 km


రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం -259*

 *తిరుమల సర్వస్వం -259*

*ద్వాదశ ఆళ్వారులు-23*


 *నమ్మాళ్వార్ కు శిష్యరికం* 


 ఆ పుణ్యపురుషునితో వేదాంత విషయాలపై కొంత తడవు చర్చ జరిగిన తరువాత వారే శఠకోపయోగిగా పిలువబడే 'నమ్మాళ్వార్' అని మధురకవి ఆళ్వార్ గ్రహించారు. వారిని తనకు పరమాత్మునిచే పంపబడ్డ గురువుగా భావించి; తనను శిష్యునిగా స్వీకరించమని నమ్మాళ్వార్ వారిని వేడుకొన్నాడు. జిజ్ఞాసువైన శిష్యుడు లభించడం పట్ల సంతుష్టి చెందిన నమ్మాళ్వార్ అందుకు సమ్మతించడంతో వారికి శిష్యునిగా మారి, జీవితాంతం వారికి శుశ్రూష చేసి, తన ధర్మసందేహాలను నివృత్తి చేసుకోవడమే గాకుండా; నమ్మళ్వార్ వద్దనుండి అనేక ధర్మసూక్ష్మాలను కూడా అవగతం చేసుకున్నారు.


 నమ్మాళ్వార్ అత్యంత చిన్నతనం లోనే పరమపదాన్ని చేరుకోవడంతో వ్యాకులచిత్తుడైన మధురకవి అదే ప్రదేశంలో వారికి ఒక ఆలయం నిర్మించి, తన జీవితాంతం అందులోనే పూజాదికాలు నిర్వహిస్తూ తాను కూడా విష్ణుసాయుజ్యాన్ని పొంది ఆళ్వార్ గా వినుతి కెక్కారు.


 వీరు రచించిన పదకొండు పాశురాల సంకలనం *'కణ్ణినుణ్ శిరుత్తాంబు'* గా ఖ్యాతినొంది నాలాయిర దివ్యప్రబంధంలో భాగమైంది.

 మధురకవి ఆళ్వార్ ను ద్వాదశ ఆళ్వారులలో ఒకరిగా పరిగణించే విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. కొందరు మధురకవి ఆళ్వార్ స్థానంలో, శ్రీమద్రామానుజాచార్యుల వారిని ద్వాదశ ఆళ్వారులలో ఒకరిగా భావిస్తారు. వీరి గురించిన సమగ్ర సమాచారాన్ని మునుపటి ప్రకరణాలలో తెలుసుకున్నాం.


 రామానుజుల వారికున్న పెక్కు నామాలు ఎలా వచ్చాయో ఈరోజు తెలుసుకుందాం.


 *రామానుజుల వారి నామాంతరాలు* 


 సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతి ద్వారా ప్రశంస లందు కునేంత గొప్పగా బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించడం వల్ల *'శ్రీభాష్యకారులు'* గా ఖ్యాతినొందారు.


 శ్రీరామచంద్రునికి తమ్ముడైన లక్ష్మణునిలా, శ్రీమహావిష్ణువు తల్పమైన ఆదిశేషువులా అంకితభావంతో హరియాజ్ఞను అమలుపరుస్తాడని భావించి; మేనమామచే నామకరణం చేయబడిన జన్మనామం *'రామానుజుడని'* (రామునికి అనుజుడు, అంటే 'తమ్ముడు' అని అర్థం) పిలువ బడ్డారు.


 శ్రీరంగనాథుని ఆదేశానుసారం రంగనాథాలయంలో పెక్కు సేవలను, ఉత్సవాలను ప్రవేశపెట్టి నందువల్ల *'ఉడయవర్లు'* గా వినుతికెక్కారు.


 'భూతపురి' అనే నామాంతరం కలిగిన శ్రీపెరంబుదూరులో జన్మించి చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే మహత్కార్యాలను అకుంఠిత దీక్షతో, విజయవంతంగా చేపట్టడం వల్ల; *'భూతపురి ముని'* గా వ్యవహరింపబడ్డారు.


 సర్వసంగ పరిత్యాగియై భిక్షాటన కొనసాగిస్తూ, 'తిరుప్పావై' ను పఠిస్తూ ప్రజలలో భక్తిభావాన్ని ఇనుమడింప జేయడం వల్ల *'తిరుప్పావై జియ్యరు'* బిరుదాన్ని పొందారు.


 శ్రీరంగనాథునితో వివాహం జరిగితే, సుందరాచల వాసియైన సుందరబాహుస్వామికి చక్కెరపొంగలిని, వెన్నభాండాలను నైవేద్యంగా సమర్పించు కుంటానని గోదాదేవి మ్రొక్కుకుంది. కానీ శ్రీరంగనాథునితో వివాహం జరిగిన వెంటనే ఆమె దేవునిలో ఐక్యమవ్వడం వల్ల ఆమె మ్రొక్కు అసంపూర్తి గానే మిగిలిపోయింది. చెల్లెలి మ్రొక్కును అన్నగారిలా నిబద్ధతతో తీర్చడం వల్ల రామానుజులు వారు *'గోదాగ్రజుని'* గా పరిగణింప బడతారు.


 ఒకానొకప్పుడు తన గృహంలో ఆశ్రయం పొందుతున్న తన గురువు గారైన తిరుక్కచ్చి నంబిని, తన భార్య చులకనభావంతో చూడడంతో; ఎంతగానో కలత చెందిన రామానుజులవారు ఆమెను పరిత్యజించి, సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. వారి గురుభక్తికి మెచ్చిన కంచి వరదరాజస్వామి రామానుజులవారిని *'యతీంద్రుని'* గా సంబోధించడంతో ఆ నామాంతరం కూడా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

18-03-గీతా మకరందము

 18-03-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - కర్మనుగూర్చిన కొందఱి యభిప్రాయములను చెప్పుచున్నారు – 


త్యాజ్యం దోషవదిత్యేకే 

కర్మ ప్రాహుర్మనీషిణః | 

యజ్ఞదానతపఃకర్మ 

న త్యాజ్యమితి చాపరే || 


తాత్పర్యము:- కొందఱు బుద్ధిమంతులు (సాంఖ్యులు) దోషమువలె కర్మ విడిచిపెట్టదగినది అని చెప్పుదురు. మఱికొందఱు యజ్ఞము, దానము, తపస్సు మున్నగు కర్మలు విడువదగనివి అనియు చెప్పుదురు.


వ్యాఖ్య:- కర్మ ఉపాధికి (శరీర, ఇంద్రియ, మనంబులకు) సంబంధించినదిగావునను ఉపాధి భ్రాంతిజన్యమైనది గనుకను, ఆత్మ సర్వసాక్షికావునను, కర్మ దోషముపగిది త్యజింపదగినదని కొందఱి (సాంఖ్యుల) మతము. కర్మ బొత్తిగా వదలినచో జీవునకు చిత్తశుద్ధి యెట్లు కలుగుననియు, అసలు దేహయాత్రయే యెట్లు జరుగుననియు భావించినవారై కొందఱు చిత్తశుద్ధికరములగు తపో యజ్ఞ దానాది కర్మలు వదలదగినవి కావని చెప్పుదురు. ఈ ప్రకారముగ జనులలో కర్మనుగూర్చిన భిన్నాభిప్రాయములను భగవానుడు వ్యక్తపఱచి ఇవ్విషయమున తనయొక్క నిర్ణయమును రాబోవు శ్లోకమున తెలియజేయుచున్నాడు.


ప్రశ్న:- కర్మనుగూర్చి కొందఱి యభిప్రాయమేమి?

ఉత్తరము: - కొందఱు కర్మను దోషమువలె త్యజించవలెననియు, మఱికొందఱు తపోయజ్ఞదానాది కర్మలను త్యజించరాదనియు చెప్పుచున్నారు.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వం – తృతీయాశ్వాసం*


*396 వ రోజు*

కృష్ణుడు తలదించుకుని ఉన్న అర్జునుడిని చూసి " అర్జునా ! నీ అన్న ప్రసన్నుడైనాడు. అతడి అనుమతి తీసుకుని మనం యుద్ధానికి వెడదాము. కర్ణుని చంపడమే మన ప్రథమ కర్తవ్యము. రణరంగమున వీరవిహారమొనరించి కర్ణుని వధించి ధర్మజుడి మనసుకు ఆహ్లాదం కలిగించు . అసలు విషయం తెలుసుకొనక ధర్మజుడు తొందర పడి నిన్ను నిందించినందుకే కదా ఇలా జరిగింది. ఆ మాటలకు కోపించి నీవు నీ అన్నను చంపిన ఏమయ్యి ఉండేది. దైవానుగ్రహం వలన ఘోరం జరుగకుండా ఆగి పోయింది " అనగానే అర్జునుడు కళ్ళ వెంట ధారాపాతంగా నీరు కారుతుండగా ధర్మజుడి కాళ్ళ మీద పడ్డాడు. ధర్మరాజు కూడా అర్జునుడిని పైకి లేవనెత్తి కన్నీళ్ళు తుడుచుకుంటూ గట్టిగా అర్జునుడిని హృదయానికి హత్తుకుని " అర్జునా ! ఆ కర్ణుడు నా విల్లు రథము విరిచి ములుకులవంటి మాటలతో నా మనసు గాయపరిచాడు. నాశరీరాన్ని తన వాడి అయిన బాణాలతో బాధించాడు. అలాంటి దుర్మార్గుని నీవు చంపక ఉన్న నేను బ్రతికి ఉండి ఏమి ప్రయోజనము " అన్నాడు. అర్జునుడు " మహారాజా ! నేను ఈ రోజు కర్ణుడిని చంపి నేలను పడవేయక నీ ముఖము చూడను. కృష్ణుడిని సారథిగా పొందిన అర్జునుడు ఆడిన మాట తప్పడు " అని కృష్ణుడిని చూసి " కృష్ణా! ఈ రోజు అర్జునుడు కర్ణుడిని చంపుతాడు అని నీ మనసున సంకల్పించు ఆ సంకల్ప బలంతో నేను కర్ణుడిని సంహరిస్తాను " అన్నాడు. కృష్ణుడు " తధాస్తు " అన్నాడు. కృష్ణుడు " ధర్మజా ! నీ తమ్ముడు అర్జునుడిని దీవించి పంపు " అన్నాడు. ధర్మరాజు " అర్జునా ! అనాలోచితంగా నేను అన్న మాటలకు బాధపడకు. శ్రీకృష్ణుడి అనుమతితో నీవు నన్ను అన్న మాటలకు నేను బాధపడను. విజయా ! నీవు కర్ణుడిని గెలిచి విజయుడివి అన్న పేరును సార్థకం చేసుకుని తిరిగిరా " అన్నాడు.


*కర్ణవధ కొరకు సంకల్పించుట*


కృష్ణార్జునులు రధారూఢులై రణరంగముకు బయలుదేరారుకాని అర్జునుడి మనసులో భీతి బెరుకు ఆవహించాయి. అది గమనించిన కృష్ణుడు " అర్జునా ! నీవు అమరులకు అజేయుడవు. నీకు భుజబలము, అస్త్రబలము దైవ బలము ఉన్నాయి. నీ పరాక్రమానికి తట్టుకోలేక భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. ద్రోణుడు ప్రాణాలు విడిచాడు. సైంధవుడు రూపు మాసి పోయాడు. ఇక మిగిలింది కర్ణుడు అతడిని చంపి సుయోధనుడి నమ్మకాన్ని వమ్ము చెయ్యి. అతడిని నమ్మే సుయోధనుడు ఈ ఘోర నరమేధానికి దిగాడు. ఇంకా కృపాచార్యుడు, అశ్వథ్థామ, శల్యుడు, కృతవర్మ కూడా చావ వలసిన వారే. కృపాచార్యుడిని, అశ్వత్థామను బ్రాహ్మణులని వదిలినా కృతవర్మను నా బంధువని వదలకు. శల్యుడు మీ మేన మామ. అతడు పరుల పక్షాన ఉన్నందున చంపతగిన వాడే. కర్ణుడు మీ కష్టాలకు మూల కారకుడు. లక్షాగృహ దహనము, కపటజూదము, పాండవసతికి జరిగిన అవమానము, ఇంకా సుయోధనుడు చేసిన సమస్త అకృత్యములకు మూలము అతడే. కర్ణుడు సభలో ద్రౌపదిని అన్న మాటలు దుస్సహము అవి నీవింకా మరువ లేదు కదా " నీ మగలు నిన్ను జూదమున ఓడి చేత కాక చేతులు ముడిచి కూర్చున్నారు. ఈ కురు సభలో మగటిమి గల మగవాడిని మగనిగా ఎన్నుకో " అన్నది కర్ణుడే. నేను సంధికై వెళ్ళిన సమయాన సుయోధనుడికి అతడి తమ్ములకు నా పై పగ రగిల్చి నన్ను బంధింప వచ్చుటకు కారణం కర్ణుడే. లోక భీకరంగా పోరు సల్పుతున్న నీ కుమారుడు అభిమన్యుడి విల్లు విరిచి అతడి మరణానికి కారకుడైంది కర్ణుడే. నీవు కర్ణుడిని చంపిన మిగిలిన రాజులు చావగా మిగిలిన దృతరాష్ట్ర కుమారులు నీ ఎదుట ఇక నిలువరు. విజయలక్ష్మి మిమ్ము వరించగలదు " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! నీ తోడు ఉండగా నాకిక కావలసినది ఏముంది. ఈ రోజు నా చేతిలో కర్ణుడి చావు తధ్యము. నా ప్రతాపానికి సుయోధనాదులు కపటజూదం ఆడించినందుకు విచారించాలి. కర్ణుడి మరణం చూసి నాడు విదురుడి మాట విననందుకు కలత పడాలి. ధృతరాష్ట్రకుమారులు కర్ణుడి వధ చూసి రాజ్యం మీద ఆశ వదులు కోవాలి. కర్ణవధ విన్న నా అన్న ధర్మజుడి ముఖంలో ఆనందం చూడాలి " అన్నాడు.



*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సింధు లోయ లిపి

 సింధు లోయ లిపి: ఆంగ్లేయులు, కమ్యూనిస్ట్ చరిత్రకారులు దీన్ని ఎందుకు చదవకూడదని కోరుకున్నారు? 🔰

చరిత్రకారుడు ఆర్నాల్డ్ జె. టోయ్న్‌బీ ఇలా అన్నారు - "ప్రపంచ చరిత్రలో ఏ దేశ చరిత్రతోనైనా ఎక్కువగా తారుమారు చేయబడిందంటే, అది భారతదేశ చరిత్రే."

భారతదేశ చరిత్ర సింధు లోయ నాగరికతతో ప్రారంభమవుతుంది, దీనిని హరప్పా నాగరికత లేదా సరస్వతి నాగరికత అని కూడా అంటారు. క్రీ.పూ. 3500లో ప్రస్తుత సింధు నది ఒడ్డున ఒక విశాలమైన పట్టణ నాగరికత ఉందని చెప్పబడింది. మొహెంజోదారో, హరప్పా, కాళీబంగాన్, లోథల్ మొదలైనవి ఈ నాగరికతలోని నగరాలు.

గతంలో ఈ నాగరికత సింధు, పంజాబ్, రాజస్థాన్ మరియు గుజరాత్ మొదలైన ప్రాంతాలకు విస్తరించిందని చెప్పేవారు, అయితే ఇప్పుడు దీని విస్తరణ మొత్తం భారతదేశం, తమిళనాడు నుండి వైశాలి (బీహార్) వరకు, నేటి మొత్తం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్, మరియు (పారస్) ఇరాన్ భాగం వరకు కనుగొనబడింది. ఇప్పుడు దీని కాలం క్రీ.పూ. 7000 కంటే కూడా ప్రాచీనమైనదిగా గుర్తించారు.

ఈ ప్రాచీన నాగరికతకు చెందిన ముద్రలు, పలకలు మరియు కుండలపై కనిపించే వ్రాతను సింధు లోయ లిపి అంటారు. ఈ లిపి ఇప్పటికీ తెలియదు మరియు చదవబడలేదు అని చరిత్రకారులు వాదిస్తున్నారు. అయితే సింధు లోయ లిపికి సమకాలీనమైన మరియు పురాతనమైన అన్ని లిపులు, అంటే ఈజిప్టు, చైనీస్, ఫోనిషియన్, అర్మేనిక్, సుమేరియన్, మెసొపొటేమియన్ మొదలైనవన్నీ చదవబడ్డాయి.

ప్రస్తుతం, కంప్యూటర్ల సహాయంతో అక్షరాల పునరావృత విశ్లేషణ ద్వారా మార్కోవ్ పద్ధతిలో ప్రాచీన భాషలను చదవడం సులభం అయింది.

సింధు లోయ లిపిని ఉద్దేశపూర్వకంగా చదవలేదు, దాన్ని చదవడానికి ఎలాంటి సరైన ప్రయత్నాలు చేయలేదు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ICHR), మొదట ఆంగ్లేయుల నియంత్రణలో, తరువాత కమ్యూనిస్టుల నియంత్రణలో ఉన్నప్పుడు, సింధు లోయ లిపిని చదవడానికి ఎలాంటి ప్రత్యేక ప్రణాళికను అమలు చేయలేదు.

అసలు సింధు లోయ లిపిలో ఏముంది? ఆంగ్లేయులు మరియు కమ్యూనిస్ట్ చరిత్రకారులు సింధు లోయ లిపిని ఎందుకు చదవకూడదని కోరుకున్నారు?

ఆంగ్లేయులు మరియు కమ్యూనిస్ట్ చరిత్రకారుల దృష్టిలో సింధు లోయ లిపిని చదవడంలో ఈ క్రింది ప్రమాదాలు ఉన్నాయి:

 * సింధు లోయ లిపిని చదివిన తర్వాత, దాని ప్రాచీనత మరింత పురాతనమైనదిగా నిరూపించబడుతుంది. ఈజిప్టు, చైనీస్, రోమన్, గ్రీక్, అర్మేనిక్, సుమేరియన్, మెసొపొటేమియన్ కంటే కూడా పాతదిగా తేలుతుంది. దీనివల్ల ఇది ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికత అని తెలుస్తుంది. భారతదేశం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది, ఇది ఆంగ్లేయులు మరియు కమ్యూనిస్ట్ చరిత్రకారులకు సహించదు.

 * సింధు లోయ లిపిని చదవడం ద్వారా అది వైదిక నాగరికత అని రుజువైతే, ఆంగ్లేయులు మరియు కమ్యూనిస్టులు వ్యాప్తి చేసిన ఆర్య-ద్రవిడ యుద్ధ ప్రచారం కూలిపోయే ప్రమాదం ఉంది.

 * ఆంగ్లేయులు మరియు కమ్యూనిస్ట్ చరిత్రకారులు తప్పుగా ప్రచారం చేసిన 'ఆర్యలు బయటి నుండి వచ్చిన ఆక్రమణదారుల జాతి, మరియు వీరు ఇక్కడి స్థానిక నివాసితులను అంటే సింధు లోయ ప్రజలను చంపేసి లేదా తరిమేశారు మరియు వారి గొప్ప నాగరికతను నాశనం చేశారు. ఆ ప్రజలే అడవులలో దాక్కుని, దక్షిణ భారతీయులు (ద్రవిడులు) అయ్యారు, శూద్రులు మరియు ఆదివాసులు అయ్యారు', మొదలైనవన్నీ తప్పు అని రుజువు అవుతుంది.

కొందరు నకిలీ చరిత్రకారులు సింధు లోయ లిపిని సుమేరియన్ భాషతో అనుసంధానించి చదవడానికి ప్రయత్నించారు, కొందరు ఈజిప్షియన్ భాషతో, కొందరు చైనీస్ భాషతో, కొందరు వాటిని ముండా ఆదివాసుల భాషతో, అంతేకాకుండా, కొందరు వాటిని ఈస్టర్ ద్వీపం ఆదివాసుల భాషతో అనుసంధానించి చదవడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

సింధు లోయ లిపిని చదవడంలో ఈ క్రింది సమస్యలు ఉన్నాయని చెప్పబడింది:

అన్ని లిపులలో అక్షరాలు తక్కువగా ఉంటాయి, ఉదాహరణకు ఆంగ్లంలో 26, దేవనాగరిలో 52 మొదలైనవి, అయితే సింధు లోయ లిపిలో సుమారు 400 అక్షర చిహ్నాలు ఉన్నాయి. సింధు లోయ లిపిని చదవడంలో ఎదురయ్యే ఒక ఇబ్బంది ఏమిటంటే, దీని కాలం క్రీ.పూ. 7000 నుండి క్రీ.పూ. 1500 వరకు ఉంది, ఈ కాలంలో లిపిలో అనేక మార్పులు జరిగాయి, మరియు లిపిలో శైలీపరమైన వైవిధ్యం చాలా ఎక్కువగా ఉంది. రచయిత లోథల్ మరియు కాళీబంగాన్‌లో సింధు లోయ మరియు హరప్పా కాలానికి చెందిన అనేక పురావస్తు ఆధారాలను పరిశీలించారు.

భారతదేశంలోని అత్యంత ప్రాచీన లిపులలో ఒకటి బ్రాహ్మీ లిపి. ఈ లిపి నుండే భారతదేశంలోని ఇతర భాషల లిపులు ఉద్భవించాయి. ఈ లిపి వైదిక కాలం నుండి గుప్త కాలం వరకు వాయువ్య భారతదేశంలో ఉపయోగించబడింది. సంస్కృతం, పాలి, ప్రాకృతం యొక్క అనేక గ్రంథాలు బ్రాహ్మీ లిపిలో లభించాయి.

చక్రవర్తి అశోకుడు తన ధర్మాన్ని ప్రచారం చేయడానికి బ్రాహ్మీ లిపిని స్వీకరించాడు. చక్రవర్తి అశోకుని స్తంభాలు మరియు శిలాశాసనాలు బ్రాహ్మీ లిపిలో వ్రాయబడి భారతదేశం అంతటా ప్రతిష్టించబడ్డాయి.

సింధు లోయ లిపికి మరియు బ్రాహ్మీ లిపికి మధ్య అనేక ఆశ్చర్యకరమైన సారూప్యతలు ఉన్నాయి. అదేవిధంగా, బ్రాహ్మీ మరియు తమిళ లిపికి కూడా పరస్పర సంబంధం ఉంది. ఈ ఆధారంగా, సుభాష్ కాక్ మరియు ఇరావతం మహదేవన్ సింధు లోయ లిపిని చదవడానికి ఒక సరైన ప్రయత్నం చేశారు.

సింధు లోయ లిపిలోని సుమారు 400 అక్షరాల గురించి, వాటిలో కొన్ని వర్ణమాల (అచ్చులు, హల్లులు, చిహ్నాలు, సంఖ్యలు), కొన్ని సంయుక్త అక్షరాలు మరియు మిగిలినవి చిత్రలిపి అని నమ్ముతారు. అంటే, ఈ భాష అక్షరాలు మరియు చిత్రలిపి కలయిక. ప్రపంచంలో సింధు లోయ భాష అంత శక్తివంతమైన మరియు సుసంపన్నమైన భాష మరొకటి లేదు.

ఎడమ నుండి కుడికి వ్రాయబడుతుంది, అదేవిధంగా బ్రాహ్మీ లిపి కూడా కుడి నుండి ఎడమకు వ్రాయబడుతుంది. సింధు లోయ లిపికి చెందిన సుమారు 3000 పాఠాలు లభించాయి.

వీటిలో 400 అక్షర చిహ్నాలు ఉన్నప్పటికీ, 39 అక్షరాలు 80 శాతం సార్లు ఉపయోగించబడ్డాయి. బ్రాహ్మీ లిపిలో 45 అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 39 అక్షరాలను బ్రాహ్మీ లిపిలోని 45 అక్షరాలతో సారూప్యత ఆధారంగా మ్యాప్ చేయవచ్చు మరియు వాటి ధ్వనిని గుర్తించవచ్చు.

బ్రాహ్మీ లిపి ఆధారంగా సింధు లోయ లిపిని చదివినప్పుడు అన్ని సంస్కృత పదాలు వస్తాయి, అవి - శ్రీ, అగస్త్య, మృగ, హస్తీ, వరుణ, క్షమ, కామదేవ, మహాదేవ, కామధేను, మూషిక, పగ, పంచ మశక, పితృ, అగ్ని, సింధు, పురం, గృహ, యజ్ఞ, ఇంద్ర, మిత్ర మొదలైనవి.

ముగింపు ఏమిటంటే:

 * సింధు లోయ లిపి బ్రాహ్మీ లిపికి పూర్వపు లిపి.

 * సింధు లోయ లిపిని బ్రాహ్మీ ఆధారంగా చదవవచ్చు.

 * ఆ కాలంలో సంస్కృత భాష ఉండేది, దీనిని సింధు లోయ లిపిలో వ్రాశారు.

 * సింధు లోయ ప్రజలు వైదిక ధర్మం మరియు సంస్కృతిని అనుసరించారు.

 * వైదిక ధర్మం అత్యంత ప్రాచీనమైనది.

హిందూ నాగరికత ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన మరియు మూల నాగరికత. హిందువుల మూల నివాసం సప్త సైంధవ ప్రదేశం (సింధు-సరస్వతి ప్రాంతం), దీని విస్తరణ ఇరాన్ నుండి మొత్తం భారతదేశం వరకు ఉంది. వైదిక ధర్మాన్ని అనుసరించే వారు బయటి నుండి రాలేదు మరియు వారు ఆక్రమణదారులు కారు. ఆర్య-ద్రవిడ వంటి రెండు వేర్వేరు జాతులు లేవు, వాటి మధ్య యుద్ధం జరగలేదు.

జీవితాలూ పాడుచేసుకోకూడదు.”

 కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని Beach కి తీసుకెళ్లాడు కొడుకు. అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. 


దూరంగా పిల్లలు తడి ఇసుకతో ఇళ్లు కట్టుకుంటున్నారు. Beach అంతా Rush గా ఉంది. 


"ఎలా ఉంది కొత్త సంసారం" అని అడిగాడు తండ్రి. 


కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది. 


ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలయింది. అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయటంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టం అయింది. అందరూ కలిసి వాన్ని కొట్టబోయారు. పెద్దలు వచ్చి వాళ్లను విడిపించి సర్ది చెప్పారు. 


“నిన్న రాత్రి చాలాసేపు మీరు ఏదో విషయంలో గొడవ పడుతున్నారు. అర్ధరాత్రి వరకూ మీ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి” అని తండ్రి అన్నాడు. 


“అబ్బే అదేం లేదు మామయ్య గారు” అంది కోడలు. 


ఆయన నవ్వాడు “మీకన్నా పాతికేళ్లు పెద్దవాన్ని నా దగ్గర దాచవద్దు. ఏ విషయంలో జరిగింది గొడవ”


“నా Computer ముట్టుకోవద్దని చెబుతూనే ఉంటాను. తనకి Laptop ఉంది కదా. అనవసరంగా నా దాన్ని కెలుకుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి తయారు చేసుకున్న File మొన్న Delete అయిపోయింది” నిష్ఠూరంగా అన్నాడు కొడుకు. 


కోడలు వెంటనే ”ఎంతో Neatness గా సర్దుకున్న నా Shelf లో బట్టలన్నీ మొన్న మీరు చిందర వందర చేయలేదా? అయినా మీ Watch నా పట్టుచీరల మధ్యన ఎందుకుంటుంది?” అంది కోపంగా. 


“పట్టుచీరలు చిందరవందర చేయటం, Computer లో File Delete చేయటం ఒకటేనా?” అన్నాడు మరింత కోపంగా కొడుకు. 


ముసలాయన నవ్వాడు “నిన్న కూడా మీరు మొదట్లో చిన్న స్వరంతోనే మాట్లాడుకొని, ఆవేశం పెరిగాక పక్క గదిలో నేనున్నానని కూడా మర్చిపోయి నాకు వినిపించేంత గట్టిగా మాట్లాడుకున్నారు”


ఇద్దరూ సిగ్గుతో తలవంచుకున్నారు. ఈలోపు అప్పటి వరకూ ఆడుకుంటూన్న పిల్లలు అక్కడ నుండి వెళ్లిపోయారు. పెద్దాయన అటే చూస్తూ “ఆ పిల్లలు కొట్టుకోవడం చూసారు కదా. మీకేమైనా అర్థం అయిందా?” అని అడిగాడు. అర్థం కానట్టు చూసారు ఇద్దరూ. 


“ఎలాగూ కూలిపోయే ఇసుక గూళ్ల కోసం పిల్లలందరూ కొట్టుకున్నారు. చీకటి పడేసరికి ఆ గూళ్లని అలాగే వదిలేసి వెళ్లిపోయారు. మన జీవితాలు కూడా అంతే. కొంతకాలం బ్రతుకుతాం ఆపై అన్నీ వదిలేసి వెళ్లిపోతాం. ఈ కొద్దికాలం ఎంత సంతోషంగా ఉండాలి? ఎలా సంతోషంగా ఉండాలి? అని ఆలోచించాలి తప్ప Delete అయిపోయిన File కోసం, నలిగిపోయిన పట్టు చీరల కోసం కొట్టుకుని మనసులూ, జీవితాలూ పాడుచేసుకోకూడదు.”


“వివాహం అంటేనే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం”


నిజమే కదా మీ అభిప్రాయం కామెంట్ రాయండి

అనగనగా

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


🌸 *అనగనగా...* 🌸


*ఓ యువకుడు ఓ మంచి ఉద్యోగం కోసం ఓ పెద్ద కంపెనీకి ఇంటర్వూకు వెళ్ళాడు. చక్కగా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు..*


*చివరి పరీక్షకు డైరెక్టరు దగ్గరికి వెళ్ళాడు.*


*డైరెక్టరు : "నీవు చదువుకునే రోజుల్లో ఏదైనా స్కాలర్ షిప్ వచ్చిందా?"*


*యువకుడు: "లేదండీ! మా అమ్మ-నాన్నగారే అన్ని ఫీజులు కట్టే వారు..."*


*డైరెక్టరు: "మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు?"*


*యువకుడు: "వ్యవసాయం చేస్తూ... నన్ను చదివించారు...."*


*డైరెక్టరు: "అయితే నీ చేతులను ఒకసారి నాకు చూపించు."*


*యువకుడు: తన చేతులను చూపించాడు... అవి చాలా సున్నితంగా నాజూకుగా సుతి-మెత్తగా ఉన్నాయి.*


*డైరెక్టరు: "నువ్వు ఎప్పుడైన నీ తల్లిదండ్రులకు వారు చేసే పనిలో సహాయపడ్డావా?"*


*యువకుడు:" లేదండీ! వారు నన్ను కష్టపడనివ్వకుండా మంచిగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించమని చెప్పేవారు... నేను అలాగే చేశాను."*


*డైరెక్టరు: "నిజంగా నువ్వు ఈ ఉద్యోగానికి అన్ని అర్హతలు ఉన్నావాడివి. అయితే నాదొక చిన్న విన్నపం. నువ్వు చేస్తాను అంటేనే చెపుతాను."*


*యువకుడు: "తప్పకుండా చేస్తాను చెప్పండి సర్!"* 


*డైరెక్టరు: "ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తరువాత నీవు ఒక్కసారి నీ తల్లిదండ్రుల చేతులను పరిశీలించి చూడు. ఆతర్వాత మీ తల్లిదండ్రులకు మూడురోజులు విరామము ఇచ్చి... వారు చేసే పనిని నీవు సరిగ్గా మూడు-రోజులు చేసి రా! తప్పకుండా నువ్వు ఈ ఉద్యోగంలో చేరవచ్చు...."*


*యువకుడు: "అలాగే సర్!" అని.. తల్లిదండ్రులకు సహాయపడటానికి వెళ్లి వారిని చూడగానే విపరీతంగా ఏడ్చాడు... వారి చేతులు చూడగానే కాయలుగట్టి... కాళ్లకు, చేతులకు ముల్లు గుచ్చుకొని రక్తం కారుతూ... గరుకుగా... చాలా ఘోరంగా కనపడ్డాయి...*


*ఆ చేతులలో తన మొహాన్ని పెట్టి వెక్కివెక్కి ఏడ్చాడు.....వారి కష్టాన్ని తలచుకుని వారు చేసే పనిని తానే ఆ మూడు రోజులు తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమతో.... ఇష్టముతో.... కష్టపడి తన-డైరెక్టరు పెట్టిన పరీక్షను పూర్తి చేశాడు.*


*మరుసటిరోజు ఆఫీసుకు కళ్ళల్లో నీళ్ళతో వెళ్ళి ఆ డైరెక్టరు పాదాలకు నమస్కరించాడు....*


*"మీరు నా కళ్ళు తెరిపించారు సర్! నా తల్లిదండ్రుల కష్టాన్ని నాకు కళ్ళకు కట్టినట్లు చూపించారు. మీరు నాకు ఈ ఉద్యోగాన్ని ఇస్తే, వారిని కంటికి రెప్పలా ఏ లోటూ లేకుండా కాపాడుకుంటాను." అన్నాడు*


*దానికి డైరెక్టరు ఇలా సమాధానం ఇచ్చారు......*


*"ఇంట్లో తల్లిదండ్రుల కష్టం తెలిసిన వారికే ఆఫీసులోని పై అధికారుల కష్టాలు అర్థంఅవుతాయి.... కాబట్టి ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి ఉన్నవారికే మా ఆఫీసులో ఉద్యోగాలు ఇవ్వాలని నీకు అన్ని అర్హతలు ఉన్నా కూడా ఇలాంటి చిన్న పరీక్ష పెట్టడం జరిగింది... ఇప్పుడు నీవే ఈ ఉద్యోగానికి 100%అర్హుడవు."* 


*కాబట్టి చదువుకొనే బిడ్డలందరూ తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే... తమ తల్లిదండ్రులు డబ్బులు పెట్టి మనల్ని చదివిస్తున్నారుకదా! అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా, అసలు ఆ ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు పడే కష్టాన్ని ఒక్కసారి తలచుకుని చక్కగా చదువుకుని ప్రయోజకులు కండి.....!*


🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻