🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️
*🌷ఆదివారం 1 ఫిబ్రవరి 2026🌷*
_*మాఘ పురాణం - 14వ*
_*అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*1వ తేదీ ఆదివారం*
*వేకువఝామున*
*చదువు కొనుటకు*
```
మాఘ పురాణం పధ్నాలగవ అధ్యాయములో…. పూర్వం, గంగానది ఒడ్డున నివసించిన ఒక బ్రాహ్మణుడు, సంతానం లేని లోటుతో బాధపడుతూ, శ్రీహరిని పూజించి వరం కోరుకున్నాడు. అతని నిష్టకు మెచ్చిన శ్రీహరి, కుమారుడిని వరంగా ఇచ్చాడు. కానీ, ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. నారదుడి ద్వారా కుమారుడు పన్నెండేళ్లకే మృతి చెందుతాడని తెలుసుకున్న బ్రాహ్మణుడు, భార్యతో కలిసి విచార సముద్రంలో మునిగిపోయాడు. అయితే, భార్య ధైర్యం చెప్పి, మరణం తప్పనిదని, శోకించడం వ్యర్థమని చెప్పింది. తన భక్తి నిజమని నిరూపించాలని బ్రాహ్మణుడు మళ్లీ శ్రీహరిని ఆరాధించాడు.
అతని భక్తికి మెచ్చిన శ్రీహరి, కుమారుడికి సుదీర్ఘ జీవితాన్ని వరంగా ఇచ్చాడు. ఈ కథ, ధైర్యం, భక్తి యొక్క ఫలితాలను చాటిచెప్పడమే కాకుండా, మాఘమాస వ్రతం యొక్క మహిమను కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే, ఈ వ్రతం ద్వారా ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు కలుగుతాయని పూర్వకాలపు ఋషులు చెప్పేవారు. అంతేకాకుండా, ఈ వ్రతం మనసుకు శాంతిని, ఆత్మకు తృప్తిని కలిగించి, జీవితంలోని కష్టాలను దాటే శక్తినిస్తుంది.```
*విప్రుని పుత్ర ప్రాప్తి*```
గృతృనమద మహర్షిని చూసి జహ్నముని యిట్లనెను. “మహర్షీ! మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా?, నా సందేహమును తీర్చుమ”ని అడుగగా మహర్షి ఇట్లు చెప్పెను.
“జహ్నమునీ! వినుము మాఘమాస వ్రతమును ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు, పరలోక సుఖములు కలుగును. వారి కష్టములు తీరును, అందు వల్ల సంతుష్టుడైన మానవుడు ఇంకను హరి ప్రీతికరములగు వ్రతములను ఆచరించి జ్ఞానియై సత్కర్మల నాచరించి ముక్తినందును. అటువంటి కథని ఓక దానిని చెప్పెదను వినుము అని ఇట్లు పలికెను..
‘పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. అతడు వేద వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి దయజ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్య ఉత్తమురాలు. వారిరువురికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికిని లోటులేదు. పుత్రుడు లేరని విచార పడుచున్న ఆ బ్రాహ్మణుడు ఓక నాడు భార్యతో “గుణవంతుడు అయిన పుత్రుడొక్కడు అయినను మనకు కలుగలేదు, అట్టి పుత్రుడు ఒక్కడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచారపడెను”.
అప్పుడు ఆమె ‘నాధా! నీవు తగిన పూజను చేయలేదేమో? అందువలన మనకు సంతానము కలుగలేదు అని అనుకొందును’ అని సమాధానము ఇచ్చెను.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు ‘ప్రియా కష్టతరమైన తపమును ఆచరించి అయినను, శ్రీమన్నారాయణుని సంతుష్టి పరచెదను. పుత్ర వరమును కోరుదు’నని చెప్పెను.
కష్టతరమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్ర వరమును కోరెదననియు పలికెను.
ఆ దంపతులు ఇరువురు తపమాచరించ వలెనని గంగాతీరమునకు పోయిరి.
బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరినిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను.
కొంత కాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు నాలుగు చేతులయందును శంఖమును, చక్రమును, గదను ధరించియుండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమను మణి భూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితోనుండెను. శాంత భూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగ ఉండెను. నారద మహర్షి స్తుతించుచుండగా అప్సర కాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీసమేతుడై గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను.
తనను గమనించక తీవ్రతరమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వుతో “విప్రా! నేను నీకు వరమునీయవచ్చితిని, నీ తపమునుమెచ్చితిని” అని పలికెను. ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై, బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను.
అతనికి ఎట్టి వరమునైన ఈయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా నా బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని జూచెను. ఆనంద పరవశుడైన అతడు శ్రీమన్నారాయణ మూర్తిని ఇట్లు స్తుతించెను.```
*విప్ర కృత విష్ణు స్తుతి*
నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |
నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ ||
గోవిందాయసురేశాయ అచ్యుతాయ వ్యయాచ |
కృష్ణాయవాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే ||
లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |
అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిలరూపిణే ||
యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |
జలస్థాయ స్థలస్థాయ సర్వగాయా మలాత్మనే ||
సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్స్ర్వాఘనాశినే నమః |
కాలాయ కలయే కామితార్థ ప్రదాయచ ||
నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |
విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే ||
సురాధ్యక్షాయ సిద్దాయ శ్రీధరాయ నమో నమః |
హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే ||
పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే |
ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః ||
జనార్థనాయ జై త్రాయ జితామిత్రాయ జీవినే |
వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమః ||
జ్ఞానాయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |
ధురంధరాయధుర్యాయ ధరాధారాయతే నమః ||
నారాయణాయశర్వాయ రాక్షసా నీకవైరిణే |
గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే ||
కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే |
కేశవాయ నమస్తేస్తు నమోదామోదరాయచ ||
సంకర్షణాయ శర్వాయ నమస్ర్తైలోక్యపాలినే |
భక్తప్రియాయ హరయే సమస్సర్వార్తి నాశివే ||
నానాభేద విభేదాయ నానారూప ధరాయచ |
నమస్తే భగవాన్ విష్ణో పాహిమాంకరుణాకర ||```
శ్రీ మన్నారాయణుని ప్రత్యక్షముగ చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగ చెప్పిన యీ స్తోత్రము అందరు చదువుట శ్రేయస్కరము.
జహ్నుమునీ! ఆ బ్రాహ్మణుడు అష్తోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతిస్తూ ఆనంద పరవశుమై నమస్కరించుచు నిలిచియుండెను, భగవంతుడు వరమును కోరుకొనమనెను.
శ్రీహరి మాటలను విన్న ఆ విప్రుడు “స్వామీ! నీ పదములనందు నాకు నిశ్చలమైన భక్తిని ఇమ్ము, ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమునిచ్చి, నాకు ముక్తినొసగుమని కోరెను.
శ్రీహరి “నీవు కోరినట్లే వరము నిచ్చితిని, నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివినవారికి నేను శీఘ్రముగ ప్రసన్నుడనగుదు”నని పలికి యంతర్థానయ్యెను.
బ్రాహ్మణుడు నష్టద్రవ్యమిక్కిలి లాభము అందినవానివలె సంతసింసించు తన ఇంటికి చేరెను.
కొంత కాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను.
కొంతకాలమునకు నారద మహర్షి వాని యింటికి వచ్చెను. బాలుని జూచి వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములేయని చెప్పి తన దారిని తాను పోయెను.
ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విశచుచుండెను. విచార వదనముతో ఆహారమును తీసికొనక విచారించుచుండెను. “నాధా నీవు త్రీవ్ర తపమొనర్చి వరముగా నీ పుత్రుని పొందితిని చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు పండ్రెండు సంవత్సరములు జీవించి విధ్యాభ్యాసము చేయుచు మరణించును కదా! నేనీ పుత్ర శోకము నెట్లు సహింపగలను?” అని భర్తతో పలికెను.
ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు నామెనోదార్చి నిశ్చయించెను. ఆమె నూరడించుచు యిట్లనెను. ప్రియా దుఃఖింపకుము, దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది అది యెవరిని విడువదు. మన పుత్రుడు పదుమూడవయేట మృతినందునని యిప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును యెప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తరువాతనైనా మరణింపక తప్పదు కదా! మరి ఈ ముందు వెనుకలు వయస్సులకు కలదు కాని మృత్యువునకు లేదు కదా. కావున నీవును శోకింపకుము జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో నీకు విచారమేల? నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు.
అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మననుసరించి జన్మించును, మరణించును, కనిపించినది నశింపక నిలుచునా? కావున శోకింపుము” అని ఆమెను ఊరడించెను మరియు నిరర్థకమైన దుఃఖమును విడువుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగ ఉండుము” అని పలికి మరల గంగా తీరమున చేరి నియమ నిష్ఠలతో శ్రీహరిని సర్వ ఉపచారములతో పూజించుచుండెను.
శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను.
శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచియుండెను.```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*మాఘపురాణం పధ్నాలగవ* *అధ్యాయము సంపూర్ణము*
*🌷సేకరణ🌷*
*న్యాయపతి నరసింహారావు*