1, జూన్ 2025, ఆదివారం

నిజమైన శివాభిషేకం.

 శివాభిషేకం 

----------------


ఓ రాజుపై ఓ రోజు శత్రురాజు దండెత్తాడు. ఈ రాజు ఓడిపోయాడు.


నిండుగర్భవతి అయిన తన రాణితో గుఱ్ఱమెక్కి పారిపోయాడు.


మంత్రి కూడా పారిపోయి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.


శత్రుసైన్యం రాజు వెంట పడ్డారు....


అడవిలో ఓ బోయవాని గుడిసెలో రాణిని దిగబెట్టి...


"నేను ఎలాగూ శత్రుసైన్యం చేతిలో మరణిస్తాను. నీకు పుట్టబోయే బిడ్డను పెంచి పెద్ద చెయ్." అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు....


శత్రు సేనలు వెంటాడి రాజును పట్టుకోవడంతో రాజు కథ ముగిసింది.


గుఱ్ఱంపై రాజుకు ముందు భాగంలో రాణి కూర్చోవడం వల్ల, ఆ సేనకి రాణి ఉన్నట్టు తెలియలేదు.


అందువల్ల వారు వెను తిరిగి వెళ్లిపోయారు.


ఆ బోయవాళ్లు ఆ రాణిని చేరదీసి కన్న కూతురిలా చూసుకున్నారు.


కానీ వారికి ఆమె రాణి అనే విషయం తెలియదు.


త్వరలోనే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.

ప్రసవం కాగానే తల్లి కన్ను మూసింది.


12 ఏళ్ళు గడిచాయి....


ఆ రాచబిడ్డ బోయపిల్లలతో పెరిగి, బోయవాడిలాగే ఉన్నాడు...


రాజ్యప్రజలు మాత్రం శత్రురాజుతో ఎన్నో ఇబ్బందులు పడుతూ... మన మంచి రాజును కాపాడుకోలేకపోయామనే విచారంలో ఉన్నారు...


రాజుతో సహా రాణి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారని మంత్రికి తెలుసు....


ప్రస్తుతం వారి జాడను కనుక్కోవడానికి అంతటా గాలిస్తున్నాడు...


ఎట్టకేలకు బోయపల్లెలో రాజకుమారుడు మాత్రమే ఉన్నాడని కనుగొన్నాడు...


మంత్రి ఆ బోయవాళ్లకు జరిగిన విషయం అంతా చెప్పి, ఆ రాచబిడ్డను తనకు అప్పచెప్పమని కోరుతాడు....


వారు రాజ్య పరిస్థితిని అర్థం చేసుకుని బిడ్డను మంత్రికి అప్పగిస్తారు.


రాచబిడ్డ మాత్రం రానని మొండికేస్తాడు...


మంత్రి ఆ బిడ్డను తన వొళ్ళో కూర్చోబెట్టుకుని జరిగిన విషయమంతా వివరించి చెబుతాడు. 


నీ జీవితం ఈ అడవిలో గడపవలసింది కాదు... నీవు రాజ్యాన్ని పరిపాలించాల్సినవాడివి... మేము నీ నాయకత్వంలో శత్రువులతో పోరాడి గెలిచి, తిరిగి మన రాజ్యాన్ని పొందాలనుకుంటున్నాము.... అని నచ్చచెప్పి తనతో పాటు తీసుకెళ్లి విలువిద్యను, యుద్ధతాంత్రాలను నేర్పిస్తాడు. 


ఆ రాకుమారుడు మంత్రి సహకారంతో సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. రాజవంశ వారసుడు వచ్చాడని విధేయులైన ప్రజలు అతని చుట్టూ పోగయ్యారు...


శత్రురాజు పై యుద్ధానికి వెళ్లారు. అవలీలగా యుద్ధంలో గెలిచారు కూడా.


* * *


తత్త్వమసి.... 

నీవే బ్రహ్మవు...  

అంటోంది ఛాందోగ్యం.... 


అదే నిజమైతే మరి సాధన ఎందుకు?


మనం బ్రహ్మమయ్యే ఉన్నప్పటికీ, మనం బ్రహ్మమే అనే స్పృహలో లేము.


మన గురించి మనం ఎరుగం.


మన గురించి మనకు నిజంగా తెలిసినట్లయితే....


ఈ దుఃఖాలను, ఈ కోరికలను, ఈ భయాలను అనుభవించం.


మనం అలలు అలలుగా విడిపోకుండా.... ఆనందసముద్రంలో ఏకం కాలేమా?


ఆ స్థితి ఒకటి ఉందనే స్పృహ లేకుండా తత్త్వమసి "అది నీవే అయి ఉన్నావు" అనే ఋషివాక్కును ఎలా అంగీకరించగలం?


* * *


ఆ బాలుడు...

రాజకుమారుడుగా మారాడా?

మార్చబడ్డాడా?


బోయ బాలుణ్ణి అనుకునేటప్పుడు కూడా అతడు రాజకుమారుడే.


అవునా? కాదా?


ఆరంభంలో అతడికి కూడా ఆ సంగతి తెలియదు.

అందువల్ల అతడు వేటగాడులా జీవించాడు.


అతను ఎప్పుడైతే తనను గురించి మంత్రి (గురువు ) ద్వారా సత్యాన్ని తెలుసుకున్నాడో...


ఎప్పుడూ రాజకుమారుడే అయిన తాను స్వానుభవంతో తాను రాజకుమారుడే అనే వాస్తవాన్ని తెలుసుకున్నాడు.


ఇక్కడ బోయవాడు, రాజకుమారుడు అని ఇద్దరు లేరు. ఒకడు వేరొకడుగా మారలేదు. మొదట తానెవరో తెలియక జీవించినవాడే అతడు.


తెలియని అతడు వేటగాడిలా తక్కువస్థాయిలో జీవించాడు.


తెలుసుకున్న అతను రాజుగా ఉచ్ఛ స్థితికి ఎదిగాడు.


తరువాత శత్రురాజును (అహంభావాన్ని) గద్దె దింపడానికి పోరాడాడు (ఆత్మ విచారణ చేసాడు)


"తత్వమసి" అది నీవే అని గుర్తుకు తెచ్చేవాడే గురువు.


దానిని సదా మననం చేసుకుంటూ దానిని స్థిరపరచుకోవడమే సిద్ధి.


రమణునికి మధురైలో గుర్తుకు వచ్చింది.

అరుణాచలంలో పాతాళ లింగం వద్ద ఆ జ్ఞాపకాన్ని స్థిర పరచుకున్నాడు.


గురువు ద్వారా శ్రవణం.

నీకు నీవే మననం.

ఇదే గురుశిష్య సంబంధ ప్రయోజనం


మందులు ఎప్పటి వరకు వాడాలి అని అడిగితే, జబ్బు తగ్గేవరకు వాడాలి అంటాడు వైద్యుడు.


మననం ఎప్పటివరకు అంటే, తెలుసుకున్నది స్థిరమయ్యేవరకు అంటాడు గురువు.


గురువుతో గడపడం

సద్గ్రంథ పఠనం

జ్ఞానాంబ దర్శనం

అరుణాచల ప్రదక్షిణం


ఇవన్నీ "మననం"(గుర్తుకు తెచ్చుకోవడం) లో భాగమే.


* * *


బోయవాడి ముసుగులో ఉన్న రాకుమారుడిలా మనమంతా ప్రాపంచిక జీవితాన్ని గడుపుతూ జీవాత్మ ముసుగులో ఉన్నాం. 


నిజానికి మనమంతా కూడా బ్రహ్మమే. 

మన వేషం ఏదైనా, సత్యం మనలోనే ఉంది. 


మంత్రి వచ్చి నీవు రాజ కుమారుడివి అని గుర్తు చేసినట్టు, నీవు బ్రహ్మమే అని గురువొచ్చి గుర్తుచేస్తాడు. 


తాను రాకుమారుడే అని తెలిసినప్పటికీ రాజు కావడానికి యుద్ధ తంత్ర కళను నేర్చుకుని శత్రువులను నిర్మూలించి రాజయ్యాడు.


అదే విధంగా ఆత్మానుభవం పొందటానికి కర్మ భక్తి జ్ఞానమనే సాధనా మార్గాలతో చిజ్జడగ్రంథిని ఛేదించాలి. అనగా పరమ శత్రువైన అహాన్ని అంతం చేసి ఆత్మసామ్రాజ్యనేత కావాలి.


అందుకే ఉపనిషత్తులు జ్ఞానిని "సామ్రాట్" అన్నాయి.


* * *


హఠయోగం - కర్మమార్గం.

శరణాగతి - భక్తిమార్గం.

విచారణ - జ్ఞానమార్గం.


వారి వారి స్వభావాన్ని అనుసరించి, ఆయా మార్గాన్ని ఎన్నుకుని తరిస్తుంటారు. 


* * * 


రాతిని శిల్పంగా మలుచుకున్నట్లు, 

హఠయోగి తనను తాను బ్రహ్మంగా మలచుకుంటాడు.


మంచుగడ్డ నీరుగా మారుకున్నట్టు

భక్తియోగి భావసంపద వల్ల జీవాత్మ కరిగి, బ్రహ్మంగా మారుకుంటాడు.


అద్దంలో తనను తాను చూసుకుని తన జుట్టును, బొట్టును సవరించుకున్నట్టు, గురుబోధ అనే అద్దం సహాయంతో తనలో తాను విచారణ చేసి తనను తాను తెలుసుకుని బ్రహ్మంగా మారుకుంటాడు.


* * *


గురువుతో సహవాసమే(సత్సంగమే) జ్ఞానమార్గం.


మొక్కని అంటుకట్టినట్టు... 

గురువును అంటిపెట్టుకుని ఉంటే, కొంతకాలానికి తన హృదయంలో జ్ఞానపుష్పం వికసిస్తుంది.


గురుసన్నిధిలో, దైవసన్నిధిలో మంచుగడ్డ(వ్యక్తిత్వభావన) దానికదే కరుగుతుంది...


అలా గురుసన్నిధిలో గడిపి బాబు అనే బాలుడు కరిగి జ్ఞానశిశువు అయ్యాడు.


అలా దైవసన్నిధిలో గడిపి గదాధర్ అనే బాలుడు కరిగి పరమహంస అయ్యాడు.


కరగడానికి ముందు తాను సిద్ధపడాలి.

దేవుని వద్దకు అడగడానికి వెళతాడేగానీ, కరగడానికి వెళ్ళడు.


కరగడానికి ఇష్టపడడు.


తాయుమానవర్ అనే సిద్ధుడు అంటారు-

"రాయి కూడా ఒకప్పుడు కరుగుతుంది. కానీ నా మనసు కరగడం లేదు." అని. 


కర్మలోనో, భక్తిలోనో, జ్ఞానంలోనో 

మన మనసు కరిగి నీరైపోవాలి. ఆ నీటితో శివునికి అభిషేకం చేయాలి. 

అదే నిజమైన శివాభిషేకం.


* * *


జ్ఞానశిశువు

9533667918

Panchaag


 

*4.ఎఱ్ఱా ప్రెగడ

 *****************************

    *తెలుగు కవుల చరిత్ర*

          *4.ఎఱ్ఱా ప్రెగడ*

    ***************************

     సీస పద్య మాలిక 

     ------------------------

భూమీశుడై వెల్గు ప్రోలయవేమన

      ఆస్ధానకవి *ఎఱ్ఱనార్యు* 

       డనఘ

రమ్యముగ రచించెరామాయణము

శైలి

     సులభము కవిరత్న తెలుగు

     లోన,

భారతమారణ్య పర్వ మనువ

దించె

       తొలుత నే కవిసూరి తెలుగు

       లోన,

తే.గీ.

తనరు "శంభుదాసుడు" ప్రబంధ

పరమేశ్వ

రు డను ఘనమగు బిరుదాంకి

తుడు సహజ క

విత్వ అద్యైతి *ఎఱ్ఱన*"విబుధు

డనఘ.

రచన-దామర్ల నాగేశ్వరరావు 

9908568099.

*****************************

పెళ్లిళ్లలో భోజనాలు

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🌹ఈరోజుల్లో చాలా పెళ్లిళ్లలో భోజనాలు 

🌹🌹🌹🌹🌹🌹


ఒకప్పటి పెళ్లి వేరూ. 

అక్కడ వడ్డించిన పెళ్లిభోజనాలూ వేరు !! 

ఆకాలంతో.. ఇప్పటికాలాల పెళ్లిళ్లు భోజనాలు ఎందుకు పోలుస్తారు అనుకుంటారేమో! .. 


పేళ్ళిళ్ళైనా... భోజనాలైనా.... అప్పుడు ఇప్పుడూ ఒకేలాగే ఉండాలిగా !.. ఉండవంటారా ?.. నిజమే !


ఈ రోజుల్లో పెళ్లిళ్ల లో (ఒక సామాన్యజీవి ) పెట్టె భోజనాల విషయం మాత్రమే ఇక్కడ ప్రస్తావించి చూద్దాం!!


నేటి పెళ్లిళ్లలో మనందరమూ #నాతో సహా చూసే హడావిడి ఈవిధంగా ఉంటుంది...


పెళ్లి మొదలవుతుందో లేదో #కాటరింగ్ వాడు వాడి పనివాళ్ళచేత వాడి #విద్యను ప్రదర్శించడం మొదలెడతాడు ... 


పనీర్ టిక్కా ....కట్ మిర్చీ...., టమాటో సూప్.... , లేదా లేమన్,ఆరెంజ్ లాంటి కృత్రిమ జూస్ లతో కడుపు నింపేస్తాడు .. 


ఒకప్పుడు పెళ్లికొచ్చినవారికి అందరికీ ఆడ మగ తేడా లేకుండా చేతికి ఓ #గులాభీ పువ్వు,చేతిలో #నాణేలు లాంఛనముగా అందిస్తూ ఆడవారికి ప్రత్యేకముగా #చందన లేపనాలు కాళ్లకు #పారాణీ ,అందరికీ అత్తరు జల్లులు కురిపిస్తూ... #ఆహ్వానం పలికేవారు ... 


ఇప్పుడంతా #ఫాషన్ షో ... ప్చ్ ,,,,   


ఇప్పుడు .....పెళ్లి జరిగింది ,

పెళ్లి జరిపించిన పెద్దలు వచ్చి వధూవరులను #ఆశీర్వదించమనడం లేదు ... 


పెళ్లికొచ్చిన జనాలు బంధువర్గం తమకుతామే బారులుదీరి #సినిమాటిక్కెట్టు క్యూ లైనుల్లో నిలబడి విసుక్కుంటూ....ముందుకు నడుస్తుంటారు.


మనసంతా వధూవరులను ఆశీర్వదిద్దామన్న ధ్యాసే మరిచే సన్నివేశాలు చోటు చేసుకుంటూ ... 


ముఖాలపై బలవంతపు ప్లాస్టిక్ చిరునవ్వులతో అలా అలా


కార్యం జరగకముందే

పందిరి ముందున్న జనం మొత్తం #మాయమయ్యి భోజనాల "బఫె" దగ్గర గుంపులు గుంపులుగా గుమి గూడతారు. గుంపులో గోవిందా అనీ. 


అసలు అక్కడ వడ్డించబోయే కూరలేంటో,

వాటి పేర్లేమిటో కూడా వచ్చినవాడికెవ్వడికీ అర్థం కావు .

చిత్రవిచిత్రమైన వంటకాలతో #రంజిపజేసేస్తారు .  


ఒకపక్కన .. 

దోస, పెసరట్టు , ధై వడా పానీపూరి ,చాట్ ,బజ్జీలు 

మరొపక్కన .. అది శుభకార్యమో లేక టిఫిన్ సెంటరో అర్ధం కాదాయే🤣


ఎనిమిది,పది రకాల మిఠాయిలు,ఐస్ క్రీములు 

ఇంకోపక్కన ... పనస ,నారింజ, మామిడి ,జామ ,అంగూర అబ్బో ఒక్కటేమిటి !


ఇక అన్నం పెట్టె వరుసకు వచ్చి నిలబడితే ... 

మూడు రకాల అన్నం ,


చేతిలో #చిప్పలు పట్టుకుని...

అడుక్కు తినే వాళ్ళలాగా వెళ్ళాలి ..అమ్మా అన్నం పెట్టమ్మా అనే అరుపులొక్కటే ఉండవక్కడ


ఆ భోజనాలు వండిన'వాడెవడో తెలియదు ,

వడ్డించేవాడు మాత్రం ఒక డ్రెస్సు /బూట్లు వేసుకొని నిలబడి ఉంటారు...


వాడు వేసే వడ్డీoపుకీ... నాలుగు సార్లు వడ్డించిన వారి దగ్గరకు ఆకలయ్యి వెళితే...


వాడు కిందమీదకి మనలను పరికించి చూస్తారు.


ఐదు రకాల పచ్చళ్ళు , 

30 రకాల వంటకాలు సరే!.. 

ఎలాగూ వచ్చాము కదా అనీ కలిపి ముద్ద నోట్లో పెడితే!...

ఏదీ ... ముద్ద లోనికి దిగదే ?


వంటల్లో సరియైన ఉప్పు ఉండదు! .

కారమూ, మసాలా దినుసులు సరైన పాళ్లలో ఉండవూ ,

రుచీ ఉండదో... పాడూ ఉండదూ😢 ...


దప్పికయ్యి నీటి కోసం చూస్తే...అక్కడ ఇచ్చేవాడుండడు..


ఓ 100,200 అడుగులెయ్యాలి నీటి కోసం

ఈమధ్య చిన్న చిన్న నీటి బాటిల్స్ వరద భాదితులకు ఇచ్చినట్టుగా ఇస్తున్నారనుకోండీ .


ఆఖరున చూస్తే ... 

కడుపు తరుక్కు పోతుంది ... ప్లేట్ లలో ఆశ ,ఆగడు తో పెట్టుకున్న పదార్ధాలు... తినేది 30% శాతం.... అలాగే వ్యర్థంగా పడేసేదీ 70% శాతం


1} ఏది ఎలా ఉన్నా ... పెళ్లిళ్లు చేసే వారు ... ఆ పెళ్ళికి వచ్చినవారు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వచ్చి కూర్చొని వధూవరులను #ఆశీర్వదించి వెళ్లేవిధంగా చూడాలి .


2) పదులు,వందల రకాల వంటలు లేకున్నా ... 

రెండు మూడు రకాలు పెట్టినా సరే .. రుచిగా ,శుచిగా #వచ్చిన_అతిధులకు #కడుపు_నిండా_భోజనం_పెట్టి పంపితే .. వాళ్ళు మనసారా మిమ్ముల #దీవిస్తారు !!


3) అసలు #పెళ్లిభోజనం అంటే #పప్పన్నం అన్న మాట .. 

ఎప్పుడో చాలామంది మరిచిపోయారు.🙏🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ సర్వం శ్రీమన్నారాయణ అర్పణమస్తు🍎

చం ద్రో ద యం!!

 శు భో ద యం 🙏


చం ద్రో ద యం!!

"హరిదంభోరుహలోచనల్, గగన రంగాభోగ రంగత్తమో/

భరనేపథ్యము నొయ్యనొయ్య సడలింపన్, రాత్రి శైలూషికిన్/

వరుసన్ మౌక్తికపట్టమున్, నిటలమున్,వక్త్రంబునుందోచెనా/

హరిణాంకాకృతి వొల్చె,రేకయి, సగంబై ,బింబమై,తూర్పునన్;

వసుచరిత్రము-4ఆ:17 ప: రామరాజ భూషణుడు.


         రాయల అష్టదిగ్గజ కవులలోమేటి,శ్లేషకవిత్వంలో ఘనాపాటి.రామరాజభూషణకవి విరచిత వసుచరిత్రము లోనిదీ పద్యరత్నం.

విషయం సూర్యోదయం.

         ఆకాశంలో తూరుపురేఖలను సవరిస్తూ ఉదయిస్తున్న సూర్యబింబం క్షణక్షణం తనరూపం మార్చుకుంటూ చంద్రవంకవలె దర్శనమిస్తూ,రంగస్ధలంలో తెఱదించుతూఉండగా కనువిందుచేసే నట్టువకత్తె ఆకారంగా గోచరిస్తున్నాడట.

         వెనకటి రోజులలో కూచిపూడి భాగవతులు భామాకలాపం ప్రదర్శించేవారు.వాళ్ళు నాట్యగత్తెను బహుచిత్రంగా రంగస్థలమీద ప్రవేశపెట్టేవారు.పైనుండి క్రిందకు తెఱదింపేవారు.అది కూడామధ్యలో ఆగి ఆగి పాత్రను ప్రేక్షకులకు చూపేవారు.ఆక్రమంలో ముందుగా శిరస్సుకేశపాశమునందలంకరణములు, తదుపరి,ఫాలభాగము, ఆవెనుక,కనులు నాశిక, పెదవులు, మెడ ,ఇత్యాదిగా క్రమశః అవయవప్రదర్శన చేస్తూ చివరకు మొత్తం పాత్రను చూపేవారు.

         సూర్యోదయంకూడా ఆవతుగా ఉన్నదట.

"రాత్రియను నట్టువకత్తె,గగనమను రంగస్థలమున నాట్యమాడువేళ,దిగంగనలు(దిక్కులనేవనితలు)చీకటితెఱను క్రిందికి దించు చుండగా క్రమశః ముత్యాలపట్టెడ(శిరోభూషణము) ఫాలభాగము,మొగము,ను కనబడినట్లు,చీకటిని చేధించుచు ,తొలుత రేఖామాత్రమయి, ఆవెనుకసగభాగమయి, ఆపై పరిపూర్ణబింబమయి సూర్యభగవానుడు.కనువిందు చేసెను.

రూపకానుప్రాణిత, ఉత్ప్రేక్షాలంకారము.

కఠినపదములకు అర్ధవివరణ:


హరిత్-దిక్కు,

అంభోరుహలోచన-వనిత;

రంగము-ప్రదర్శనావేదిక;

శైలూషి-నాట్యకారిణి;

మౌక్తికపట్టము-ముత్యాలశిరోభూషణము;

వక్త్రము-వదనము(నోరు)

హరిణాంకాకృతి-చంద్రునిబోలినయాకారము;


                               స్వస్తి !🙏🙏👌👌👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌞ఆదివారం 1 జూన్ 2025🌞*

``

          *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది...

``

      *వాల్మీకి రామాయణం*                

             *55వ భాగం*    

```

అప్పుడు సుగ్రీవుడు “రామా! నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మా వాలి పౌరుష పరాక్రమాలు అంటే ఏమిటో విన్నావు కదా. ఇది విన్న తరువాత కూడా నువ్వు వాలిని చంపగలను అని అనుకుంటున్నావా? చంపగలిగే ధైర్యం ఉందా? వాలి ఎన్నడూ ఎవరి చేత ఓడింపబడినవాడు కాదు, జీవితంలో ఓటమి అన్నది తెలీదు వాలికి. వాలి పేరు చెబితేనే పారిపోతారు. 15 సంవత్సరాలు రాత్రి-పగలు గోలభుడు అనే గంధర్వుడితో యుద్ధం చేసి ఆయన్ని సంహరించాడు. నేను ఇంకొక విషయం చూపిస్తాను, ఇక్కడ 7 సాల వృక్షములు వరుసగా ఉన్నాయి కదా. మా వాలి రోజూ సంధ్యావందనం అయ్యాక ఇక్కడికి వచ్చి ఈ పెద్ద సాల వృక్షాన్ని చేతులతో కుదుపుతాడు. ఆ కుదుపుకి లేత చిగురుటాకులు కూడా రాలిపోయి ఆ చెట్టు మోడుగా నిలబడుతుంది. వాలి బలం గురించి విన్నాక కూడా నీకు వాలిని చంపగలను అన్న ధైర్యం ఉందా రామా?” అన్నాడు.


సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక చిన్న నవ్వు నవ్వి…. “మీ వాలి చాలా గొప్పవాడు అని చెబుతున్నావు కదా. వాలిని మా అన్నయ్య చంపగలడు, అని ఏమి చేస్తే నువ్వు నమ్ముతావు?” అని అడిగాడు.


అప్పుడా సుగ్రీవుడు “మా వాలి ఈ ఏడు చెట్లని కుదిపెయ్యగలడు. రాముడు పోనీ అంత చెయ్యక్కరలేదు, బాణం పెట్టి ఒక సాల వృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను. ఆనాడు దుందుభి యొక్క శరీరాన్ని మా అన్నయ్య విసిరేస్తే అది యోజనం దూరం వెళ్ళి పడింది. రాముడిని ఈ అస్థిపంజరాన్ని తన కాలితో తన్నమనండి, 200 ధనుస్సుల దూరం కాని రాముడు తంతే నేను నమ్ముతాను” అని లక్ష్మణుడితో అన్నాడు. 


అప్పడు రాముడు… “సరేనయ్యా అలాగే చేస్తాను. నీకు నమ్మకం కలిగించడం కోసం నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను” అన్నాడు.

```

*రాఘవో దుందుభేః కాయం పాద అంగుష్ఠేన లీలయా।*

*తోలయిత్వా మహాబాహుః చిక్షేప దశ యోజనం॥*

```

సుగ్రీవుడు చెప్పినట్టుగా రాముడు ఆ దుందుభి కళేబరాన్ని తన బొటన వేలితో తంతే అది 10 యోజనాల దూరం వెళ్ళి పడింది. అప్పుడు రాముడు సుగ్రీవుడి వంక నమ్మకం కుదిరిందా అన్నట్టు చూశాడు. 


కాని సుగ్రీవుడు “ఆనాడు వాలి 

ఈ కళేబరాన్ని విసిరినప్పుడు ఇది రక్తమాంసాలతో పచ్చిగా, చాలా బరువుగా ఉంది. అప్పటికే మా అన్నయ్య ఈ దుందుభితో చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు, దానికితోడు తాగి ఉన్నాడు, తన భార్యలతో రమిస్తూ బయటకి వచ్చాడు, కావున అనేకరకములుగా బడలిపోయిన శరీరంతో ఉన్నాడు. కాని రాముడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, మద్యాన్ని సేవించి లేదు, పరీక్షకి నిలబడుతున్నాను అనే పూనికతో ఉన్నాడు. ఆనాడు మా అన్నయ్య విసిరింది ఒక పచ్చి శరీరం, అది ఒక యోజనం వెళ్ళి పడింది. ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కళేబరం, దానిని 10 యోజనాలు తన్నడంలో పెద్ద గొప్పేముంది. ఆ సాల వృక్షాన్ని కూడా కొట్టమను, అప్పుడు నాకు కొంత నమ్మకం కలుగుతుంది. అప్పుడు మనం వాలిని సంహరించడానికి వెళదాము” అన్నాడు.


అప్పుడు రాముడు ఒక బంగారు బాణాన్ని చేతితో పట్టుకొని, వింటినారికి సంధించి, గురి చూసి ఆ 7 సాల వృక్షముల వైపు విడిచిపెట్టాడు. కనురెప్ప మూసి తెరిచే లోపల ఆ బాణం 7 సాల వృక్షాలనీ పడగొట్టేసి, ఎదురుగా ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని తొలిచేసి, భూమిలో పాతాళ లోకం వరకూ వెళ్ళి, మళ్ళి తిరిగొచ్చి రాముడి యొక్క అమ్ములపొదిలో కూర్చుండిపోయింది.


రాముడి శక్తి ఏమిటో చూసిన సుగ్రీవుడు వెంటనే రాముడి పాదాలకి తన శిరస్సు తగిలేటట్టు పడిపోయాడు. 


అప్పుడాయన కిరీటం రాముడి పాదాల మీద పడిపోయింది. అప్పుడా సుగ్రీవుడు “రామా! నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు. నేను ఏమో అనుకున్నాను, ఇంక వాలి ఏమిటి. నువ్వు బాణ ప్రయోగం చేస్తే వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడి శిరస్సు కూడా కింద పడిపోతుంది. నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైనది కాదు, వాలి దగ్గరికి వెళదాము పద” అన్నాడు.


“తప్పకుండా సుగ్రీవా, బయలుదేరదాము” అని అందరూ బయలుదేరారు. 


ముందు సుగ్రీవుడు వేగంగా వెళుతున్నాడు, ఆయన వెనకాల రామలక్ష్మణులు, సుగ్రీవుడి మంత్రులైన హనుమంతుడు, నీలుడు, నలుడు మొదలైన వారు వెళుతున్నారు.

```

*సర్వే తే త్వరితం గత్వా కిష్కింధాం వాలినః పురీం।*

*వృక్షైః ఆత్మానం ఆవృత్య హి అతిష్ఠన్ గహనే వనే॥*

```

ముందు వెళుతున్న సుగ్రీవుడు కిష్కింద పట్టణంలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన వారందరూ దట్టమైన చెట్ల చాటున, పైకి కనపడకుండా దాగి ఉన్నారు. 


లోపలికి వెళ్ళిన సుగ్రీవుడు గట్టిగా కేకలు వేసి వాలిని బయటకి రమ్మన్నాడు. 


సుగ్రీవుడు ఇంత ధైర్యంగా పిలిచేసరికి వాలి ఆశ్చర్యంతో బయటకి వచ్చి “ఏరా బుద్ధిహీనుడా మళ్ళీ వచ్చావు, నా ప్రతాపం ఏమిటో చూద్దువు కాని, రా” అన్నాడు. 


అప్పుడా వాలి తన పిడికిలిని బిగించి సుగ్రీవుడి శిరస్సు మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడి నవరంధ్రముల నుండి రక్తం ఏరులై పారింది. 


సుగ్రీవుడు తేరుకొని వాలిని కొట్టడం ప్రారంభించాడు, వాలి కూడా సుగ్రీవుడిని కొడుతున్నాడు. ఇద్దరూ అలా మోచేతులతో పొడుచుకుంటున్నారు, పాదాలతో కొట్టుకుంటున్నారు, శిరస్సులతో కుమ్ముకుంటున్నారు. అలా కొంత సేపు కొట్టుకున్నాక, ఇంకా బాణం వెయ్యడం లేదు, రాముడు ఎక్కడున్నాడని సుగ్రీవుడు అటూ ఇటూ చూశాడు. కాని రాముడు కనపడలేదు. ఇంక వాలితో యుద్ధం చెయ్యలేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీదకి పారిపోయాడు. అప్పుడు వాలి కూడా తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు.


సుగ్రీవుడు ఆ ఋష్యమూక పర్వతం మీద ఒక శిల మీద కూర్చొని, ఒంట్లోనుండి కారిపోతున్న రక్తాన్ని తుడుచుకుంటూ, ఆయాసపడుతూ, రోదిస్తూ ఉన్నాడు. 


ఇంతలో లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడికి వచ్చాడు. వాళ్ళని చూడగానే సుగ్రీవుడు “ఏమయ్యా! నేను నిన్ను వాలిని చంపు, అని అడిగానా. నువ్వు వాలిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేస్తేనే కదా నేను యుద్ధానికి వెళ్ళాను. ‘నేను వాలిని చంపను’ అని నువ్వు ఒకమాట చెబితే నేను వెళతానా? ఎందుకు కొట్టించావయ్యా నన్ను ఇలాగా?” అని రాముడిని ప్రశ్నించాడు.


అప్పుడు రాముడు… “సుగ్రీవా! నేను ఇంతకుముందెన్నడూ వాలిని చూడలేదు. నువ్వు వాలితో యుద్ధం చేస్తున్నప్పుడు వాలి మీద బాణం వేద్దామని అనుకొని వచ్చాను. తీరా వాలి బయటకి వచ్చాక నేను విస్మయం చెందాను. ఎందుకంటే నువ్వు, వాలి ప్రతి విషయంలో ఒకేలా ఉన్నారు. మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్వినీ దేవతలు దెబ్బలాడుకున్నట్టు ఉంది. మీలో ఎవరు వాలి, ఎవరు సుగ్రీవుడో నాకు తెలీలేదు. పోని కంఠ స్వరంలో మార్పు ఉంటుందేమో అని చూశాను, కాని ఇద్దరూ ఒకేలా అరిచారు. ఇద్దరూ ఒకేలా పరిగెడుతున్నారు, ఒకేలా అలంకారం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే వేగంతో కొట్టుకున్నారు. నేను ఎలాగోలా నిర్ణయించుకొని, ఇతడే వాలి అయ్యుంటాడు అని బాణ ప్రయోగం చేశానే అనుకో, సుగ్రీవా! అది తగిలినవాడు ఈ లోకమునందు ఉండడు. ఒకవేళ ఆ బాణము పొరపాటున నీకు తగిలిందనుకో, నువ్వు నేను కూడా ఉండము.

```

        *రేపు...56వ భాగం*

 

*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

ఆదివారం🌞* *🌹01 జూన్ 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌞ఆదివారం🌞*

  *🌹01 జూన్ 2025🌹*  

    *దృగ్గణిత పంచాంగం*     

                 

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః* 

*జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం*


*తిథి  : షష్ఠి* రా 07.59 వరకు ఉపరి *సప్తమి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం   : ఆశ్లేష* రా 09.36 వరకు ఉపరి *మఖ*


*యోగం : ధ్రువ* ఉ 09.11 వరకు ఉపరి *వ్యాఘాత* 

*కరణం   : కౌలువ* ఉ 08.00 *తైతుల* రా 07.59 ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు:*

ఉ 07.00 - 09.00 మ 02.00 - 04.00*

అమృత కాలం  : *రా 07.58 - 09.36*

అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.31*


*వర్జ్యం          : ఉ 10.11 - 11.49*

*దుర్ముహూర్తం  : సా 04.52 - 05.45*

*రాహు కాలం    : సా 04.59 - 06.37*

గుళికకాళం       : *మ 03.21 - 04.59*

యమగండం     : *మ 12.05 - 01.43*

సూర్యరాశి : *వృషభం*

చంద్రరాశి : *కర్కాటకం/సింహం*

సూర్యోదయం :*ఉ 05.41*

సూర్యాస్తమయం :*సా 06.47*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.34 - 08.10*

సంగవకాలం         :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం    :     *10.47 - 01.24*

అపరాహ్న కాలం    : *మ 01.24 - 04.00*


*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ శుద్ధ షష్ఠి*

సాయంకాలం       :*సా 04.00 - 06.37*

ప్రదోష కాలం         :  *సా 06.37 - 08.48*

రాత్రి కాలం           :*రా 08.48 - 11.43*

నిశీధి కాలం          :*రా 11.43 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య చంద్ర కళా స్తోత్రం*🌝


*సువర్తుల చతుష్కోణ* 

*మండలాఢ్యౌ తమోపహౌ |*

*గోధూమతండులప్రీతౌ* 

*సూర్యచంద్రౌ గతిర్మమ ||*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

దైవంతోకాసేపు విధిరాత*

 💥 *దైవంతోకాసేపు విధిరాత* 


ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది.


ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు.


ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి..!


" మీరేంచేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి. లేదంటే నేనూ చనిపోతాను" అని కన్నీరుపెట్టుకుంది..!


దానికి ఇంద్రుడు...

"దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మ కదా..! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను.నువ్వేం దిగులు పడకు..!" అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు.


ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ..!

"నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను. దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు..! కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం పద.!" అంటూ బయలుదేరారు.


వీరిరాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు.

"నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే..! కానీ..! చిలుక ప్రాణం చివరి దశలో ఉంది..! మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం..! మనం ముగ్గురం శివుని ప్రార్థిస్తాం పదండి..! " అన్నారు.


ముగ్గురూ శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు.

" ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను..! మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి..! " అంటూ అందరూ బయలుదేరారు.


ఇంద్ర,బ్రహ్మ,విష్ణువు,శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాదారంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు.


"అయ్యో..! అదేమి పెద్ద పనికాదు. మాములుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను,వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. ఏ ఆకు రాలి క్రిందపడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు. పదండి వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకకు కాపాడుదాం..! " అని అన్నాడు .


యముడు , అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది.ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం వ్రాసి ఉంది ఇలా..!


"ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది..! "అని వ్రాసి ఉంది.


ఇదే విధి..! విధిని ఎవ్వరూ మార్చలేరు. జీవించి ఉన్నప్పుడే ఇతరులమీద ప్రేమను చూపండి. ద్వేషించకండి. మన సహాయాన్ని ఇతరులకు అందివ్వడం నేర్చుకోండి.

🙏🙏🙏🙏

31, మే 2025, శనివారం

నౌకాగ్ర కాకవత'

 నౌకాగ్ర కాకవత'




కాకులకు గల సహజ గుణం ఒకచోట వాలి కొంతసమయం ఉండి మరల లేచి ఇంకొక చోటికి వెళ్ళుతాయి. అంటే ఒకచోట స్థిరంగా వుండవు. అలాగే ఒక కాకి ఒక నౌకమీద అంటే నౌకమీద వుండే స్తంభం మీద వాలిందట కొంతసమయం అది అక్కడ వున్నది. కానీ కాకికి తెలియకుండా ఒక సంఘటన జరిగింది అదేమిటంటే ఆ నౌకని నడిపే నావికుడు అతివేగంగే నౌకను సముద్రంలోకి తీసుకొని వెళ్ళాడు. ఈ విషయం తెలియని కాకి తన స్వభావానుసారం నౌక స్తంభం మీదినుంచి లేచి ఇంకొక చోటికి వెళ్ళటానికి యెగిరి వెళ్ళింది. కానీ దానికి ఆ స్తంభం తప్పించి ఆ పరిసరాలలో ఎత్తయిన ప్రదేశం అంటే భవంతులు కానీ, చెట్లు కానీ ఏవి కనుచూపు మేరలో కనిపించలేదు. అంతే కాదు చుట్టూ లోతయిన సముద్రం. పొరపాటున సముద్రంలో పడితే అంతం తప్పదు. కొంచం సేపు గాలిలో యెగిరి మరలా ఆ నౌక స్తంభంమీదనే వాలింది. కొద్దిసేపయినా తరువాత తన సహజ స్వభావంతో మరల గాలిలో యెగిరి అంతటా తిరిగి చూసింది కానీ పరిస్థితి అట్లానే వున్నది. అలాగ మరలా మరలా తిరిగి తిరిగి చివరకు తెలుసుకున్నది తనకు ఆ నౌక స్తంభం తప్ప వేరే ఆధారం లేదని. కానీ ఈ విషయం తెలుసుకోవటానికి ఆ కాకి చాలాసార్లు ఆ నౌక స్తంభం మీది నుంచి లేచి గాలిలో ఎన్నో సార్లు తిరిగిన తరువాత కానీ తనకు ఆ నౌక స్తంభం తప్ప వేరే గతి లేదని తెలుసుకోగలిగింది. కాబట్టి 




సాధక మన మనస్సు కూడా ఆ కాకి లాంటిదే ఎప్పుడు ఒక చోట నిలువదు ఒకచోటి నుండి ఇంకొక చోటికి అంటే ఒక విషయం మీదనుండి ఇంకొక విషయం మీదకు వెళుతూ ఉండటం దాని సహజ లక్షణం. ఆ లక్షణాన్ని వదిలి దానికి భగవంతుడు తప్ప ఇతర విషయాలు లేవనేవిధంగా సాధకుడు సద దైవ జ్యానంలో ఉండాలి ఎలాగంటే కాకికి ఒక్క నౌక స్తంభం తప్ప ఇంకొకటి కనపడనట్లు సాధకుని మనస్సుకు భగవంతుడు తప్ప ఇంకొక విషయం లేదు అనే విధంగా సాధకుడు ప్రవర్తిస్తే సాధకుని మనస్సు సదా భగవంతుని మీదనే ఉంటుంది. కాకపొతే ఇది చెప్పినంత సులువు కానే కాదు. అతి కఠోరమైన, నిరంతమైన కఠోర తప్పస్సు చేస్తేనే అది సాధ్యం. నేను ఆలా చేయగలనా అనే సందేహం ప్రతి సాధకునికి కలుగుతుంది. కానీ మిత్రమా నిత్య దీక్షాపరుడైన సాధకుడు తప్పకుండా సాధించగలడు. అరిషడ్వార్గాలను వదిలి ఇప్పుడే సాధన మొదలు పెట్టు తప్పకుండా నీ లక్ష్యం నెరవేరుతుంది. ఎందుకంటె సదా సర్వేశ్వరుడు సాధకునితోటె ఉంటాడు.  




ఓం తత్సత్ 




ఓం శాంతి శాంతి శాంతిః

విశ్వేశ్వరా

 శు భో ద యం🙏


                  విశ్వేశ్వరా!!


శా.

నీ విన్నాణము చిత్రమే, మకుటరత్నీభూతజైవాతృకా!/

గ్రైవేయీకృతకాద్రవేయ! గళరుద్రాక్షీభవద్బాడబా!/

సేవాస్వీకృత భూత రాక్షస పిశాచీప్రేత! నేత్ర ప్రభా/

శ్రీవిన్యస్త కృశాను! పార్వతమృగాక్షీదార! విశ్వేశ్వరా!

23

     -కవిసామ్రాట్. విశ్వనాధసత్యనారాయణ.


        మనం నేడు విశ్వనాధ వారి విశ్వేశ్వర శతకంలోని ఈపద్యం పరిశీలిద్దాం

       చిత్రవిచిత్రమైన ఊహలకు వ్యంగ్య

మర్యాదలకు ఆటపట్టైన శతక మిది.

విశ్వప్రతిభకు ముకురాయమానం.

          

               "కిరీటంలో తురాయిగా చంద్రుని అలంకరించుకోవటం.కంఠ హారంగా వాసుకిని అలంకరించుకోవటం,

మెడలో రుద్రాక్షగా గరళాన్ని నిలుపుకోవటం, సేవక సముదాయంగా

భూతప్రేత పిశాచములను నియమించటం, తృతీయ నేత్రంగా ఫాలభాగాన అగ్నినిధరించటం, కోయపిల్ల పార్వతిని భార్యగా స్వీకరించటం, ఏవిటయ్యా?ఈతిక్కపనులు?

        అంటూ హేళన జోడించి వ్యంగ్యంగా విశ్వరుని మహిమలను నుతించటం ,విశ్వనాధకుదక్క ,మరెవరికి సాధ్యం?

    మహాకవీ! నీకూ, నీప్రతిభకూ,

శత సహస్ర వందనాలు!!


                       స్వస్తి !!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

గమ్మత్తైన_పద్యం

 #గమ్మత్తైన_పద్యం🌹

💥💥💥

పూర్వం ఒక రామ భక్తుడు.... రాముడంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు ఎత్తడు.

ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.

ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని. సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు.

"విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో" అంటూ.

❤️గవీశపాత్రో నగజార్తిహారీ

కుమారతాతః శశిఖండమౌళిః।

లంకేశ సంపూజితపాదపద్మః

పాయాదనాదిః పరమేశ్వరో నః॥

 ఆశ్చర్య పోయాడు చదవగానే.

అందులో ఏమని చెప్పబడింది? పరమేశ్వరః నః పాయాత్ అని. 

అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి విశేషణాలు. అర్ధం చూడండి...

♦️గవీశపాత్రః ... గవాం ఈశః గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.

నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.

శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ.

అనాదిః ... ఆది లేని వాడూ ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ,

అటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.

♦️అర్ధం తెలియగానే మతి పోయింది. వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది. అది పట్టుకుని తెగ తిరిగాడు.

చివరికి ఒకాయన "అది విష్ణువుని కీర్తించేదే ... ఏమీ అనుమానం లేదు" అని అతడిని ఓదార్చాడు.

ఇది మరో ఆశ్చర్యం.

అనాది అనే మాటలో ఉంది అంతా. కిటుకు చూడండి ....

పరమేశ్వరుడు ఎలాటివాడూ అంటే అనాదిః అట. అంటే ఆది లేని వాడు. అంటే పరమేశ్వరలో ఆది అక్షరం లేనివాడు.

ఇప్పుడు ఏమయ్యింది? రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!

గవీశపాత్రః ... లో గ తీసెయ్యండి .. వీశపాత్రః అవుతుంది. విః అంటే పక్షి అని అర్ధం. వీనామ్ ఈశః వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి .... గజార్తి హారీ ... గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.

కుమారతాతః .... ఆది అక్షరం తీసేస్తే ... మారతాతః .... మన్మధుని తండ్రి అయిన విష్ణువు.

శశిఖండ మౌళి: ... మొదటి అక్షరం లేకపోతే శిఖండమౌళిః... నెమలిపింఛము ధరించిన విష్ణువు.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: ... క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు ... అంటే బ్రహ్మ రుద్రేంద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు.

అతడు మనలను కాపాడు గాక ....

గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .... విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

ఇప్పటికి అతడు శాంతించాడు.

సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి. సర్వదేవతలలో విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు. సర్వ దేవతలలో శివుని దర్శించగలిగితే వాడు శైవుడు. ఇది మన భారతీయ కవితా వైభవము.

🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

కపిలారణ్యం

 కపిల మహర్షి పేరు మీదే కపిలారణ్యం ! అదే నేటి కాలిఫోర్నియా ! 


పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ వంటి అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారు..


సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు.


ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖ రేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.)


కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)

(సగర పుత్రులు బూడిద కుప్పలు గా

మారిన ప్రదేశం) మరియు హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి.


వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తోలి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే దీని పురాతన నామం మహాబలి భూమి, ఇప్పుడది మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందింది. ఈ మలిపునగరానికి దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం.

బలిచక్రవర్తిని శ్రీ మహా విష్ణువు పాతాళానికి అధిపతి గా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి.


భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా స్వరంగం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము. రాముడి ఆజ్ఞ మింద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజింతారు. మధ్య అమెరికా, హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని Lost City of the Monkey God‘ గా వ్యవహరిస్తారు.


అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారు (Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు 1939 లో వెళ్ళడించారు.) “సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ" అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు. భూమినుండి 50000 యోజనాల దూరంలో పాతాళం ఉన్నది.

ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, Oregonలో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీకూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే.


మూల అమెరికాయులు (రెడ్ ఇండియన్లు) విగ్రహారాధన చేస్తారు. ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడు తుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది.


Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారతదేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం The light of India లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు.

వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఉన్నది. వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలు అవుతుంది. ఇంచుమించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరి పోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు.


వారి పండగలు కూడా మన దశరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియ చెయ్య వలసిన అవసరం ఉన్నది.

పేదవాడా

 దారిద్ర్య! శోచోమి భవన్తమేవం 

అస్మచ్ఛరీరే సుహృదిత్యుపిత్వా |

విపన్నదేహే మయి మన్దభాగ్యే 

మమేతి చిన్తా క్వ గమిష్యసి త్వమ్||


ఓ పేదవాడా! నువ్వు చాలా కాలంగా మన శరీరంలో స్నేహితుడిలా ఉన్నావు, కానీ నేను చనిపోయిన తర్వాత, 'నీకు ఎవరు ఆశ్రయం ఇస్తారు? నువ్వు ఎక్కడికి వెళ్తావు?' నాకు చాలా ఆందోళనగా ఉంది!


మృచ్ఛకటికమ్.

పందిరి నాశ్రయించక

 ఉ॥

పందిరి నాశ్రయించక సువాసన గల్గియు జాజితీవలున్ 

సుందరి నాశ్రయించక సుశోభితమౌ యపరంజిభూషలున్ 

ముందటిరాజుఁ జేరక సమూర్జిత కైతల 

పండితాళియున్ 

వందిత భర్తఁ గూడక నపారగుణాన్విత యయ్యు జాయయున్ 

పొందగబోరు శేముషి ప్రమోదము నందుచు సృష్టి నెచ్చటన్ 

*~శ్రీశర్మద*

పార్వతీపరమేశ్వరుల విహారపు పద్యం

 పార్వతీపరమేశ్వరుల విహారపు పద్యం

తెనాలి రామలింగ కవి ఉద్భటారాధ్యచరిత్రమనే కావ్యంలో చెప్పిన పద్యం—


తరుణ శశాంక శేఖర మరాళమునకు సార గంభీర కాసారమగుచు

కైలాసగిరి నాథ కలకంఠ భర్తకు కొమరారు లేమావి కొమ్మయగుచు

సురలోక వాహినీ ధర షట్పదమునకు ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు

రాజ రాజ ప్రియ రాజకీరమునకు మానిత పంజరస్థానమగుచు


ఉరగ వల్లభ హార మయూరమునకు

చెన్ను వీడిన భూధర శిఖరమగుచు

లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి

అద్రినందన బొల్చె విహారవేళ. ఈ పధ్య భావార్ధమును సోదాహరణము గా ఎవరైనా తెలియజేయండి!