21, నవంబర్ 2022, సోమవారం

ప్రలంబాసుర వధ

 Srimadhandhra Bhagavatham -- 78 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


ప్రలంబాసుర వధ

ఒకనాడు కృష్ణుడు, బలరాముడు గోపబాలురు అందరూ కలిసి ఆడుకుంటున్నారు. వారు రెండు జట్లుగా విడిపోయారు. ఒక జట్టుకు బలరాముడు నాయకుడు. రెండవ జట్టుకు కృష్ణుడు నాయకుడు. కృష్ణుడు చాలా చమత్కారి. జట్ల ఎంపిక చేసుకునే ముందు కృష్ణుడు బలరాముని ఓ చెట్టు చాటుకు తీసుకువెళ్ళి ‘అన్నయ్యా ! ఈవేళ గోపబాలురలో ప్రలంబుడు అనే రాక్షసుడు ప్రచ్ఛన్న రూపంలో వచ్చి చేరాడు. వాడు నా జోలికి రాడు. నిన్ను చంపుదామనే వచ్చాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. వాడిని నేను నా జట్టులో పెట్టుకుని వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉంటాను. వాడిని నీ జట్టులోకి కోరవద్దు’ అని చెప్పాడు. ఆమాట చెప్పిన తరువాత ఇద్దరూ వెనక్కి వచ్చారు. ప్రలంభాసురుడికి కడుపులో ఒక బెంగ ఉన్నది. కృష్ణుడు మీదికి గతంలో చాలామంది రాక్షసులు వచ్చి మడిసిపోయారు. కృష్ణుడికి ప్రమాదం తెచ్చిన వారు ఎవరూ లేరని ప్రలంబాసురునికి తెలుసు. కృష్ణుడి జోలికి వెళ్ళడం కన్నా బలరాముని జోలికి వెళ్ళడం తేలిక అనుకున్నాడు. బలరాముడికి ఏదైనా ప్రమాదం చేసేస్తే అన్నగారిని విడిచి ఉండలేక కృష్ణుడు తానే ప్రమాదం కొని తెచ్చుకుంటాడని అతడు భావించాడు. బలరాముడికి ఏదయినా ప్రమాదం తెద్దామనే ఆలోచనలో ఉన్నాడు. తన అన్నగారిని, తనను నమ్ముకున్న వాడిని, తనకోసమని అవతారమును స్వీకరించిన వాడిని, తాను పడుకుంటే పరుపయిన వాడిని, తాను కాలుపెడితే పాదపీఠమయిన వాడిని, తాను కూర్చుంటే పైన గొడుగయిన వాడిని, తాను నడుస్తుంటే ఛత్రము పట్టిన వాడిని ఈశ్వరుడు అంత తేలికగా వదిలిపెడతాడా? తనవారన్న వాళ్ళని ఈశ్వరుడు వెయ్యి కళ్ళతో కాపాడుకుంటాడు. ప్రలంబుడిని తన జట్టులో పెట్టుకున్నాడు.

ఆట ప్రారంభం అయింది. ఈరోజున కృష్ణుడు బృందం ఓడిపోయింది. బలరాముడి బృందం గెలిచింది. బలరాముడి బృందాన్ని కృష్ణుడి బృందం మోయాలి. ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రలంబుడు బలరాముడిని తాను మోస్తానని ముందుకు వచ్చాడు. బలరాముడికి అర్థం అయి సరే మొయ్యి అన్నాడు. అక్కడ ఒక నియమం పెట్టబడింది. ఎవరు ఎవరిని మోసినా అక్కడ గీయబడిన గీతవరకు తీసుకువెళ్ళి అక్కడ వదిలెయ్యాలి. అక్కడవరకు మాత్రం మొయ్యాలి. సరేనని బలరాముడిని ప్రలంబుడు ఎక్కించుకున్నాడు. ‘పర్వతమంత బరువు ఉన్నాడే' అని అనుకుంటున్నాడు. పరుగెడుతున్న ప్రలంబుడు గీతదాటి వెళ్ళిపోతున్నాడు. పైన కూర్చున్న బలరాముడు, ప్రలంబుని ఆగమని అరుస్తున్నా వాడు ఆగడం లేదు. ఇంకా బాలుడి రూపంలో మొయ్యలేనని రాక్షసుడు అయిపోయాడు. తమ్ముడు ముందుగానే చెప్పాడు ఏ భయం లేకుండా బలరాముడు వాడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. ప్రలంబాసురుని తల బ్రద్దలై వాడు నేలమీద పడిపోయి మరణించాడు. పైనుంచి దేవతలు బలరాముడి మీద పుష్పవృష్టి కురిపించారు.

ఈలీలలో మనం తెలుసుకోవలసిన గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఒకటి ఉన్నది. సాధారణంగా భగవంతుడిని ఏమీ చేయలేక, భగవంతుని భక్తులను హింసించే ప్రయత్నం కొంతమందిలో ఉంటుంది. భగవంతుడే అటువంటి వాళ్ళ మృత్యువుకు మార్గమును తెరుస్తాడు. ఆ భక్తుడిని ఆయనే, బలరాముడిని కృష్ణుడు రక్షించుకున్నట్లు రక్షించుకుంటాడు. భగవద్భక్తులను హింసించడం, తిరస్కరించడం, భగవంతుని పట్ల ప్రేమగా ఉన్నట్లు నటించడం పరమ ప్రమాదకరం. దాని వలన ఈశ్వరానుగ్రహమును పొందరు. బలరాముడిని చంపితే కృష్ణుడు చనిపోతాడన్న ప్రలంబుడి ఊహ ఎంత ప్రమాదకరమో భగవద్భక్తుల జోలికి మనం వెళ్ళగలము, వాళ్ళను ఉపేక్షించవచ్చు, వాళ్ళని ప్రమాదం లోనికి తీసుకువెళ్లవచ్చు భగవంతుడిని ఏమీ చేయలేం కాని భక్తులను ఏమైనా చేయవచ్చని అనుకోవడం అవివేకం. ఈశ్వరుడు భక్తులను కంటిని రెప్ప కాపాడినట్లు కాపాడుతూనే ఉంటాడు. భగవంతుని వలన వారు అటువంటి రక్షణ పొందుతారని భాగవతులయిన వారందరికీ కూడా ఒక గొప్ప అభయమును ఇస్తూ ఈశ్వరుడు ప్రలంబవధ అనబడే ఈ లీలను చేసి, మనకందరికీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఇన్ని గొప్ప విషయములను ఆవిష్కరించి ఉన్నాడు.

గోపికా వస్త్రాపహరణం

భగవానుడు కృష్ణుడిగా అవతరించి చేసిన లీలలు అనేకము ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాపహరణ ఘట్టము పరమ ప్రామాణికమయినది. ఆ ఘట్టములో మనం తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. అది తెలుసుకుంటే మనం ప్రతినిత్యము చేసే కర్మ అనగా పూజాదికములలో పొరపాట్లనుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమయిన మార్గమును చూపించగలిగిన లీల.

బృందావనంలో ఉండే గోపకాంతలు అందరూ కూడా కృష్ణ భగవానుడినే పతిగా పొందాలని నిర్ణయం చేసుకున్నారు. అది ఒక విచిత్రమయిన విషయం. గోపకాంతలు అటువంటి పూజనొక దానిని చేశారు. వారు కృష్ణుడిని భర్తగా పొందడానికి కృష్ణుడి వ్రతం చేయలేదు. ఇది వ్యాసుని సర్వోత్కృష్టమయిన ప్రతిపాదన. వారు మార్గశీర్షమాసములో ఒక వ్రతము చేసారు. యథార్థమునకు భాగవతంలో గోపకాంతలు మార్గశీర్ష మాసంలో చేసిన వ్రతం కాత్యాయనీ వ్రతం. వీరందరూ కలిసి కాత్యాయనీ దేవిని ఉపాసన చేశారు. కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించి ఆయనను ఉద్ధరించింది. పార్వతీ దేవికి కాత్యాయని అని పేరు. పార్వతీదేవిని ఉపాసన చేశారు. కృష్ణుడిని ఉపాసన చేసి కృష్ణుని భర్తగా పొందాలి. మధ్యలో కాత్యాయనీ దేవి పేరుతో పార్వతీదేవిని ఉపాసన చేసే కృష్ణుడు ఎలా భర్త అవుతాడు? ఇందులోనే ఒక చమత్కారం, ఒక రహస్యం ఉన్నది. శాస్త్రంలో మనకు శ్రీమన్నారాయణుడే నారాయణిగా ఉంటాడు. నారాయణి అని పార్వతీదేవిని పిలుస్తారు. నారాయణ నారాయణి అన్నాచెల్లెళ్ళు. వీరిద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. పరమశివుడు అభిషేక ప్రియత్వంతో ఉంటాడు. కృష్ణుడికి కళ్యాణం జరగడానికి ముందు గోపకాంతలు అందరూ కాత్యాయనీ వ్రతం చేస్తారు. గోపకాంతలు ప్రతిరోజూ ఇసుకతో కాత్యాయనీ దేవి మూర్తిని చేసేవారు.

కాత్యాయని మహామాయే మహాయోగే నదీశ్వరి

నందగోపసుతం దేవీ పతిం మే కురుతే నమః!

అదీ వాళ్ళు చేసిన సంకల్పం. వారందరూ లౌకికమయిన భర్తను అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్నది ఈ మాయ అనబడే తెర తొలగి జీవ బ్రహ్మైక్య సిద్ధి కొరకు పరాత్పరుని యందు ఐక్యము అవడం కోసమని అమ్మా! నీ అనుగ్రహం కలగాలి. మాకు కృష్ణుడిలో కలిసిపోయే అదృష్టం కలగాలని దానిని భార్యాభర్త్రు సంబంధంగా మాట్లాడుతున్నారు. ఆ వ్రతమును ముప్పదిరోజుల పాటు మార్గశీర్షంలో చేయాలి. ప్రతిరోజూ గోపకాంతలు నిద్రలేచేవారు. అందరూ కలిసి ఎంతో సంతోషంగా యమునానది తటము దగ్గరికి వెళ్ళేవారు. అక్కడ ఒక పెద్ద కడిమి చెట్టు ఉండేది. కడిమి చెట్టు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమయినది.అమ్మవారికి ‘కదంబ వనవాసిని’ అని పేరు. అక్కడ సైకతంతో అమ్మవారి ప్రతిమ చేశారు. ఒకసారి అమ్మవారికి తిరిగి గతంలో తాము చేసిన ప్రార్థన చేసి స్నానం చేయడం కోసమని యమునా నదిలోనికి దిగారు. ఇంతమంది కలిసి వివస్త్రలై యమునా నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు. వారు అలా స్నానం చేస్తున్న సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయమును తెలుసుకుని గోపకాంతలు కాత్యాయనీ దేవి ఉపాసన చేసి ఫలితమును అడుగుతున్నారు. ఫలితము ఇవ్వడానికి కృష్ణుడు వస్తున్నాడు. వాళ్ళ భక్తి అంత గొప్పది. వారు చేసిన కర్మయందు తేడా వచ్చింది. ఆ దోషము ఉన్నంతసేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది. ఫలితమును ఇవ్వడం కుదరదు. ఈశ్వరానుగ్రహం కలిగడానికి ప్రతిబంధకముగా ఉన్న దానిని ఈశ్వరుడు తీసివేస్తాడు. ఈ ప్రతిబంధకమును కాత్యాయనీ దేవి తియ్యాలి. ప్రతిబంధకమును తొలగించడానికి కృష్ణుడు వస్తున్నాడు. దీనిని బట్టి కాత్యాయని, కృష్ణుడు వేర్వేరు కాదని మనం అర్థం చేసుకోవాలి. కాత్యాయని ఆడది, కృష్ణుడు పురుషుడు అదెలా కుదురుతుందని అనుమానం రావచ్చు. పరమేశ్వరుడికి రూపం లేదు ఆయన జ్యోతి స్వరూపము. కంటితో మేము చూడకుండా ఉండలేము అన్నవారి కోసమని ఒక సగుణమయిన రూపం ధరించి పరమాత్మ ఈ భూమిమీద నడయాడాడు తప్ప అదే ఆయన స్వరూపము అంటే అది ఎప్పుడూ ఆయన స్వరూపం కాదు. ఇక్కడ అంతటా ఉన్నవాడు సాకారత్వమును పొంది ఫలితమును ఇవ్వడానికి వస్తున్న కృష్ణుడు గోపాలబాలురందరినీ పిలిచి మీరందరూ నిశ్శబ్దంగా ఇక్కడినుండి వెళ్ళిపోండి అన్నాడు. నిజంగా కృష్ణావతారం స్త్రీల మాన మర్యాదలను పాడుచేసే అవతారం అయితే కృష్ణుడు అలా అని ఉండేవాడు కాదు. కృష్ణుడు చెప్పిన మాట ప్రకారం వారు అక్కడినుండి వెళ్ళిపోయారు. వారికి వ్యామోహం లేదు. కృష్ణుడు ఏమి చేస్తాడో చూడాలన్న తాపత్రయం లేదు. ఈయన మాత్రం గోపకాంతల వస్త్రములనన్నిటిని పట్టుకుని కడిమిచెట్టు ఎక్కి కూర్చున్నాడు. స్త్రీలు అందరూ నీళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు

కొంటివి మా హృదయంబులు, గొంటివి మానంబు; లజ్జ గొంటివి; వలువల్

గొంటి; వికనెట్లు సేసెదొ, కొంటెవు గద !నిన్ను నెఱిగికొంటిమి కృష్ణా!

ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన దోషము వాళ్లకు తెలియదు. వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకు వద్దామని అనుకున్నారు. వస్త్రములు కనపడలేదు. ఏమయినవా అని చూస్తే చెట్టుమీద కృష్ణుడు కనపడ్డాడు. వాళ్ళు అడిగింది సాంసారికమయిన లౌకికమయిన భర్త్రుత్ర్వం కాదు. ఆ వ్రతంలో ఆయనలో ఐక్యమవడమును అడుగుతున్నారు. ఇప్పుడు ఏమని అంటున్నారు? కొంటె కృష్ణా! ఏమి పనులయ్యా ఇవి? మేము ఎలా బయటకు వస్తాము? నీవు ఇలాంటి తుంటరి పనులు చేయకూడదు. మా వస్త్రములు మాకిచ్చేసి ఇక్కడినుండి నీవు వెళ్ళిపో’ అన్నారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

కామెంట్‌లు లేవు: