12, జులై 2024, శుక్రవారం

సత్కార్యాలతోనే

 *సత్కార్యాలతోనే జన్మ సాఫల్యం*


ఒకరిని ద్వేషించటం వ్యర్ధమైన విషయం. అందరిలోనూ వ్యాపించిఉన్న ఆత్మతత్వం, చైతన్యం ఒకటేనని గ్రహించగలగాలి. ఇది స్వయంగా శంకరులు గ్రహించి, ఆ విషయాన్ని గ్రహించగలిగే అవకాశాన్ని మనకు కలుగచేసారు. ఒకనాడు వారి శిష్యులతోబాటు గంగ స్నానానికి వెళుతూవుండగా చండాలుని రూపంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆచార్యులు అతడిని దూరంగా ఉండు అన్నారు. దానికతడు అయ్యా ! తమరు దూరంగా ఉండమన్నది ఈ దేహాన్నా లేక సర్వవ్యాపకమైన ఈ ఆత్మనా ? అని అడిగాడు. అప్పుడు శంకరులు అతని జ్ఞానమునకు ఆశ్చర్యము చెంది ఈ రూపంలో దర్శనమిచ్చింది సాక్షాత్తు విశ్వనాధుడే అని గ్రహించి నమస్కరించాడు. అందుచేత శంకరులు తనకు అందరూ సమానమే, వ్యత్యాసము లేదు అన్నారు. కాబట్టి సర్వమానవులలోయున్న చైతన్యమొక్కటేనని గ్రహించి ఆ విధంగా ఆచరణచేయాలి. 

ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు నేను కర్తను అనే భావన ఉండకూడదు. ఒక విధిని ఆచరిస్తున్నప్పుడు నేను త్యాగబుద్ధితో చేస్తున్నాననే భావన కూడా ఉండకూడదు. త్యాగం సాత్వికంగా ఉండాలి. పరమేశ్వరార్పణమస్తు అనే భావనతో చేయాలి. ఆ విధంగా చేస్తే ఏ భయమూ ఉండదు. అంతా భగవంతునికే చెందుతుంది. ఆ విధంగా కర్మలను ఆచరించేవారి జన్మ ధన్యమవుతుంది. 

వేదాంత శ్రవణం చేసినా సరైన భావన రాకపోతే వాని జన్మ నిష్ఫలం. ఆత్మోద్ధరణ అనేది అందరికీ కావాలి. మంచి జరుగవలెనని తలచినప్పుడు ప్రవృతి మార్గంలో పోతే జరగదు. అందువలనే శంకరులు లోకోపకారం కొరకై అందరిని నివృత్తి మార్గంలో సత్కార్యాలు చేయాలనీ జన్మ సాఫల్యం పొందాలని ఆపేక్షించారు. శంకరులు రచించిన ఏదైనా ఒక స్తోత్రాన్ని శ్రద్ధతో పఠించి మననం చేసి ఆ పాఠాన్ని ఆచరిస్తే ధన్యులవుతారు. కాబట్టి సర్వులూ శంకరులు నిర్దేశించిన నివృత్తి మార్గం అనుసరించి శ్రేయోవంతులు అవ్వుగాక. 


--- *జగద్గురు శ్రీశ్రీ విధుశేఖరభారతీ మహాస్వామివారు*


|| हर नमः पार्वतीपतये हरहर महादेव ||

కామెంట్‌లు లేవు: