11, జులై 2020, శనివారం

నిత్యా ఈశ్వర దర్శనం

ఈశ్వరుడు, మనిషికి ఎనిమిది ప్రత్యక్ష రూపాలలో నిత్యమూ దర్శనమిస్తూనే ఉన్నాడంటాడు కాళిదాస మహాకవి. ‘అభిజ్ఞాన శాకుంతలమ్’ నాటకం నాంది శ్లోకంలో.
యా సృష్టి – స్రష్టురాద్యా, వహతి విధిహుతం
యా హవిః – యా ఛ హో త్రీ,
యే ద్వే కాలం విధత్తిః, – శ్రుతి విషయ గుణా  
యా స్థితా వ్యాప్య విశ్వం,
యాం-ఆహుః సర్వ బీజ ప్రకృతిః – ఇతి,
యయా ప్రాణినః – ప్రాణవంతాః,
ప్రత్యక్షాభిః – ప్రపన్నః – అనుభిః – అవతు – వః
తాభి రష్టాభి రీశః!
ఈశ్వరుడికి ఎనిమిది ప్రత్యక్ష స్వరూపాలు. మొదటిది సృష్టికర్త సృష్టించిన మొదటిసృష్టి. అంటే జలం. నీరు. రెండవది, యథావిధిగా హోమం చేయబడ్డ హవిస్సును దేవతల కందజేసే అగ్ని. ‘అగ్నిముఖావై దేవాః’ అని శ్రుతి.
మూడోది, యా చ హోత్రీ. యజ్ఞం చేసె యజమాని రూపం. యజ్ఞంలోక క్షేమం కోసం మాత్రమే చేసె పుణ్య కార్యం కనుక ఆ యజ్ఞం జరిగేంతసేపూ, యజ్ఞకర్త అయిన యజమానిని శివుడి ప్రత్యక్ష రూపంగా భావిస్తారు. యాజమాన-ఆహ్వాయా మూర్తిః విశ్వస్య శుభాదాయినీ. యజమాని అనే పేరుగల మూర్తి జగత్ సంక్షేమం చేకూర్చగలదు.
నాలుగూ, అయిదూ రూపాలు కాలాన్ని నియంత్రించే సూర్య చంద్రులు. ఆరో ప్రత్యక్షరూపం, శబ్ద విషయం గుణంగా కలిగి విశ్వమంతా వ్యాపించి నిలిచినా ఆకాశం. ఏడోది, ఈ పృథ్వి. ఇది సర్వబీజాలకూ వృద్ధికి మూలం కదా, ఈశ్వరుడి ఎనిమిదో ప్రత్యక్షరూపం వాయువు. యయా ప్రాణినః ప్రాణవంతః. దేనివల్ల నయితే ప్రాణులకు ప్రానమనేది కలుగుతుందో, ఆ ప్రాణవాయువు ఈశ్వర స్వరూపమే గదా!
ఈ ఎనిమిది ప్రత్యక్ష రూపాలుగల ఆ ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక, అని మహాకవి కాళిదాసు ప్రార్థన.
ఆ స్వామి మనల్ని తప్పకుండా కాపాడుతాడు.

కామెంట్‌లు లేవు: