12, ఏప్రిల్ 2021, సోమవారం

తప్పక చదువ వలసిన కొన్ని

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

తెలుగులో తప్పక చదువ వలసిన కొన్ని పుస్తకాల కోసం వ్రాద్దామని కూర్చున్నాను. *“లోకో భిన్న రుచిః”* అన్నారు కదా మన పెద్దలు. కనుక, ఏవో కొన్ని పుస్తకాలను ఉదహరిస్తూ, ఇంతకు మించిన ఉత్తమ సాహిత్యం లేదు అని చెప్పడం వివేకమనిపించుకోదు.  కానీ, మనం చదివిన పుస్తకాలలో గొప్పగా అనిపించిన వాటికోసం మాత్రం, బలంగా బల్లగుద్ది గట్టిగానే చెప్పుకోవచ్చు.  ఇప్పుడు నేను చెప్పబోయే పుస్తకాలు అటువంటి వాటిలో కొన్ని. 

 

“మంచినీళ్ళు త్రాగుతారా అనకూడదు, పుచ్చుకుంటారా అనాలి” వంటి మన తెలుగువారి భాష, అలవాట్ల గురించి తెలుసుకోవాలన్నా, వడ్లగింజలు, కలుపు మెక్కలు, మార్గదర్శి వంటి అద్భుతమైన కథలను మనకు అందించిన ఓ అసలు సిసలు తెలుగు రచయిత జీవితాన్ని చూడాలన్నా, అచ్చ తెలుగు అందాలను చదివి ఆనందించాలన్నా,  శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఆత్మకథ… *“అనుభవాలూ - జ్ఞాపకాలూనూ”* చదవాలి.

 

తెలుగుభాషకు చెప్పలేనంత సేవ చేసి కూడా, ఏమాత్రం ప్రచారం ఆశించని మహానుభావుడొకాయన ఉన్నారు.  అసాధారణ పాండిత్యం, అబ్బురపరిచే రచనా సామర్ధ్యం ఉన్నా అత్యంత వినయసంపన్నుడుగా మెలగిన సాహితీమూర్తి ఆయన.  ఏ పుస్తకానికైనా ముందుమాట రాయాల్సి వస్తే, వినయం ఉట్టి పడేలా *“మనవి మాటలు”* అని శీర్షిక పెట్టేవారు. ఆ పరిచయ వాక్యాల చివరిలో *“భాషా సేవకుడు”* అని మాత్రమే తనని తాను సంబోధించుకునేవారు. ఉత్తమ స్థాయి పాత్రికేయునిగా వాసికెక్కిన ఆ  తిరుమల రామచంద్రగారి ఆత్మకథే “హంపీ నుంచి హరప్పా దాకా”.  గత శతాబ్దంలో వచ్చిన ఆత్మకథలలో అత్యున్నతమైనదిగా పరిగణింపబడే ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి. 

 

ఈ శతాబ్దంలో జీవించిన వారిలో “మహాత్మా గాంధీయే అత్యున్నతుడు” అని యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 1999 లో ఒక మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో గాంధీగారిపై తన ఆరాధనా భావాన్ని చాటుకున్నాడు. విఖ్యాత రచయిత “జార్జ్ బెర్నార్డ్ షా” గాంధీతో పోల్చడానికి హిమాలయా పర్వతం ఒకటే సరిపోతుందన్నాడు. “దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య సాధనలో గాంధీజీ ఆదర్శాలకీ భాగముందని" నెల్సన్ మండేలా ఆ మహాత్మునకు నమస్కరించాడు. దలైలామా, అంగ్ సాన్ సూకీ, మార్టిన్ టూథర్ కింగ్‌లకు ఆయనే స్ఫూర్తి.  వకీలు అయ్యుండి కోర్టు హాలులో మాట్లాడలేక నాలుక పిడచకట్టుకుపోతుంటే, చుట్టూ ఉన్నవారు నవ్వుతుంటే తల దించుకున్న ఒక సాధారణ మనిషాయన. ఆ తరువాత కాలంలో ఆయన నోటి వెంట మాట రావడమే ఆలస్యం 30 కోట్లమంది మారుమాట్లాడక ఆ మాటను అనుసరించే స్థాయికి చేరుకున్నాడు.  ఆ గాంధీ మహాత్ముని జీవితంలో మూడొంతులు భాగం తెలుసుకోవాలంటే ఆయన ఆత్మకథ “సత్యశోధన” చదవాలి.

 

“తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి”, “ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చింది”, “డామిట్ కథ అడ్డం తిరిగింది” ఇలా తెలుగువారి నోళ్ళలో నానే ఎన్నో నానుడులకు వెనకనున్న కథాకమామిషులను, గిరీశం లెక్చర్లు, మధురవాణి నవ్వు, రామప్ప పంతులు కోతలు, ఆడవేషంలో చుట్టకాల్చే శిష్యుడు, చీపిరికట్ట తిరగేసి కొట్టే పూటకూళ్ళమ్మ, సజ్జనుడైన సౌజన్యారావు పంతులు గారు, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష” అనే అగ్నిహోత్రావధాన్లు ఇలా అందరినీ, అన్నిటినీ ఒక చుట్టు చుట్టి రావాలంటే *“కన్యాశుల్కం”* నాటకాన్ని చదవాలి.

 

ఒక చిన్న తండా నాయకుని కొడుకు జగజ్జేతగా మారిన వైనాన్నీ, ఆ జగజ్జేత జీవితాన్నీ, మనస్సుని తెలుసుకోవాలంటే తెన్నేటి సూరి గారి “చెంఘీజ్ ఖాన్” నవల చదవాలి.

 

తెలుగువారి మహాభారతంగా కీర్తించబడేది, కవిసమ్రాట్ విశ్వనాథ వారి మహోన్నత సృష్టి, అరుంధతీ ధర్మారావుల జీవితం చుట్టూ అల్లిన మనిషి చరిత్ర, ముళ్ళపూడి వెంకటరమణ గారు “నా తల్లీ, తండ్రీ గురువు దైవం ఈ పుస్తకమే” అని చెప్పుకున్న *“వేయిపడగలు”* ను తెలుగు వచ్చినవారంతా చదవాలి.  ఆ మాటకొస్తే విశ్వనాథ వారి ప్రతీ పుస్తకాన్నీ తెలుగువాడన్న ప్రతీవాడూ వదలకుండా చదవాలి.

 

ఎక్కడికో మండుటెండలో వెళ్ళాల్సిన పనిబడితే, బస్సు ప్రయాణానికి డబ్బుల్లేక, ఆ ఎండ బాధ తెలియకుండా ఉండటానికి పుస్తకం చదువుకుంటూ నడిచిన ఘట్టాన్ని” నాకు అలవాటైన 11వ నెంబరు బస్సెక్కాను”, “ఎర్రని ఎండలో 58 పేజీలు నడిచాను” అంటూ సరదా మాటలతో నడిపించిన వారు ముళ్ళపూడి వారు. విషాదకరమైన విషయం చెబుతున్నా, చదివేవారిని బాధపడనివ్వకుండా దానికి హాస్యపు ముసుగు కప్పేస్తాడాయన.  కొన్ని వందల సరదా విసుర్లు, సినిమా కబుర్లు కలగలసిన రచనే, ఆయన బాపూ గారితో కలిసి ఆడిన *“కోతికొమ్మచ్చి”.*

 ఈ పుస్తకం మూడు భాగాలనూ చదవాలి.


రెండు జెడల సీత, ఒక జడ ముందుకి, ఇంకొక జడ వెనక్కీ వేసుకుని నడుస్తుంటే, తను వెళుతుందో, వస్తుందో తెలియడం లేదంటాడు బుడుగు.  ఇక జాటర్ ఢమాల్, పక్కింటి లావుపాటి పిన్నిగారు, సీగాన పెసూనాంబా, రాచ్చసుడూ పదమూడో ఎక్కం ఇలా ఒకటని చెప్పడానికి లేదు, పుస్తకం నిండా నవ్వులే. ముళ్ళపూడి వారి మాటలు, బాపూ గారి గీతలు కలిపి తెలుగు హాస్య సాహిత్యంలో త్రివిక్రముడంతగా ఎదిగిన రచన "బుడుగు". 


రాజు మరణించె నొక తార రాలిపోయె

కవియు మరణించె నొక తార గగన మెక్కె

రాజు జీవించె రాతివిగ్రహము లందు

సుకవి జీవించె ప్రజల నాలుకల యందు


అంటూ ఈ భూమి మీద ఉన్న సుకవులందరికీ తన ఒక్క పద్యంతో వెలకట్టలేని గౌరవాన్ని, శాశ్వతమైన కీర్తిని కట్టబెట్టిన “నవయుగ కవిచక్రవర్తి” శ్రీ గుఱ్ఱం జాషువా గారు. 


నివసించుటకు చిన్న నిలయమొక్కటి దక్క

గడన సేయుట కాశపడను నేను 

ఆలు బిడ్డలకునై యాస్తి పాస్తులు గూర్ప

పెడత్రోవలో పాదమిడను నేను

నేనాచరింపని నీతులు బోధించి

రానిరాగము తీయలేను నేను

సంసార యాత్రకు చాలినంతకు మించి

గ్రుడ్డి గవ్వయు కోరుకొనను నేను

 “కుల మతాలు గీచుకున్న గీతలు జొచ్చి

పంజరాన గట్టు వడను నేను

నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు

తరుగు లేదు విశ్వనరుడ నేను”  అంటూ తానొక విశ్వనరుడనని ఎలుగెత్తి చాటారు జాషువా గారు.  ఈ కవికోకిల కవితా విశ్వరూపం చూడాలంటే వారి సర్వలభ్యరచనలు ఒక్క పుస్తకంలో దొరికే సంకలనాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కోవాలి.

 

“అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల…” అంటూ ఉమర్ ఖయ్యాం రుబాయితులను తేనెతో కలిపి తెలుగువారితో త్రాగించిన మరో కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారు. వారి “పానశాల”లో పద్యాలను మనం కూడా తాగి మత్తెక్కిపోవాలి.

 

ఏ దేశచరిత్ర చూచినా

ఏమున్నది గర్వకారణం

నరజాతి చరిత్ర సమస్తం

పరపీడన పరాయణత్వం

 

ప్రపంచ మొక పద్మవ్యూహం!

కవిత్వ మొక తీరని దాహం!

 

నిప్పులు చిమ్ముకుంటూ

నింగికి నే నెగిరిపోతే,

నిబిడాశ్చర్యంతో వీరు-

 

నెత్తురు కక్కుకుంటూ

నేలకు నే రాలిపోతే

నిర్దాక్షిణ్యంగా వీరే...

 

నేను సైతం

ప్రపంచాగ్నికి

సమిధనొక్కటి ఆహుతిచ్చాను!

 

నేను సైతం

విశ్వవృష్టికి

అశ్రువొక్కటి ధారపోశాను!

 

నేనొక దుర్గం!

నాదొక స్వర్గం!

అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం!

ఇలా ఒకటా రెండా ఆ పుస్తకం నిండా మహోత్కృష్టమైన కవితలే. ఎందరో కవులను పుట్టించిన ఆ మహాకవి శ్రీశ్రీ గారి పుస్తకం… మహాప్రస్థానాన్ని చదివి తీరాలి.

 

హిందూమతాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఏ సందేహాలున్నా అవన్నీ పటాపంచలు అయిపోవడానికీ, ఇక ఇంతకుమించిన ప్రామాణికమైన బోధలు లేవని పూర్తి విశ్వాసం కలిగించగల కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వాముల వారి “జగద్గురు బోధలు” పది పుస్తకాల సెట్టును పట్టుకునే ఇంటికి వెళ్ళాలి.  అసలు వేదములలో ఏముంది. వేదాంగములంటే ఏమిటి? ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి.  ఇవన్నీ సంక్షిప్తంగా సాధికారికంగా తెలుసుకోవాలంటే పరమాచార్య గారి ఉపన్యాసాల సంకలనం *వేదములు* చదవాలి.

 

ఒక ఆంగ్లేయుడు సత్యాన్వేషణ కోసం చేసిన పయనాన్ని, చివరికి తన గమ్యమైన అరుణాచలాన్ని చేరుకున్న వైనాన్నీ తెలుసుకోవాలంటే పాల్ బ్రంటన్ రచనకు తెలుగుసేత అయిన “రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ”ను తప్పక చదవాలి.

 

సంఘజీవన విధానం మీద, మన అలవాట్ల మీద సెటైర్ ఎలా వెయ్యాలో తెలుసుకోవాలన్నా, సరదా కథనంతో వెళుతూనే చెంపలు ఛెళ్ళుమనిపించే చమక్కులు కురిపించాలన్నా, ఆ జంఘాలశాస్త్రిని పుట్టించిన పానుగంటి లక్ష్మీనరసింహరావు గారి “సాక్షి” వ్యాసాలను మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి.

 

రెండేళ్ళుగా వర్షాలు లేక తిరుమలలో నీటికి కటకట ఏర్పడితే… వరుణ యాగం చేసి కుండపోత వర్షం కురిపించిన పద్మభూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి గురించీ, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థను ఓ IAS అధికారి పట్టాలెక్కించిన విధానం గురించీ, అపర చాణక్యుడిగా పేరుగాంచిన పి.వి. నరసింహారావు మనస్తత్వం గురించీ, తెలుగు వారి ఆరాధ్య కథా, ప్రజా నాయకుడు ఎన్టీయార్ పరిపాలనా విధానాల గురించీ, ఇలా ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే ఇంకెన్నో విషయాలున్న పి.వి.ఆర్.కె ప్రసాద్ గారి )  "దాహం కర్తా, హరిః కర్తా", "అసలేం జరిగిందంటే” పుస్తకాలు కనబడగానే కొనేసుకోవాలి.

 

ఇంకా…

ఆది శంకరుల నుండి జిడ్డు కృష్ణమూర్తి వరకూ ఉన్న భారతీయ తత్వవేత్తల గురించి, కార్ల్‌మార్క్, ఫ్రెడరిక్ నీషే, ఆర్ధర్ షోపనార్ వంటి పాశ్చాత్య తత్వవేత్తల గురించి, వాళ్ళ తత్వసారాల గురించి సులభంగా తెలుసుకోవాలంటే త్రిపురనేని గోపీచంద్ “తత్వవేత్తలు” పుస్తకాన్ని చదవాలి.

 

భగవద్గీత చదవాలి అనుకునే వారికి అమృత తుల్యమయినది, ప్రతిపదార్థ, తాత్పర్య, వ్యాఖ్యలతో కూడినది అయిన శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానంద స్వాములవారి “గీతామకరంద” గ్రంథాన్ని పారాయణ చేయాలి.

 

కృష్ణలో మునకలేస్తూ, కాస్త ఆశ్చర్యం, ఇంకాస్త ఆనందంతో అమరావతి పట్నంలో తిరుగుతున్న అనుభూతి కావాలంటే, సత్యం శంకరమంచి గారి “అమరావతి కథలు”ను తోడు తీసుకెళ్ళాలి,

 

ఆధ్యాత్మిక భావనలు ఉన్నవారెవరికైనా సరే, ఉన్నత స్థాయి ఆనందాన్ని కలిగించే ఉత్తమ స్థాయి పుస్తకం... పరమహంస యోగానంద గారి “ఒక యోగి ఆత్మకథ”.  మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, యుక్తేశ్వర్ గిరి వంటి యోగి పుంగవుల గురించి, మరెందరో మహిమాన్వితుల యోగ సాధనల గురించి మనకు తెలియజేసే ఆధ్యాత్మిక ఆత్మకథ ఈ *“ఒక యోగి ఆత్మకథ”.* 

 

కథలు రాయాలి అనే కోరిక ఉన్నవాళ్ళు, కథ రాయడానికి ఏమేం సరంజామా కావాలో తెలుసుకోవాలనుకునేవాళ్ళు, భారతీయ పాశ్చాత్య కథకుల కథన రీతుల వివరాలు గ్రహించాలనుకునేవాళ్ళు కచ్చితంగా చదవవలసిన పుస్తకం వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి “కథాశిల్పం”.

 

“రచన అన్నది అరటిపండులా ఒలిచి చదువరి చేతుల్లో పెడితే అతని మెదడుకు పనే ఉండదు.  అందులో కవిత్వమూ ఉండదు.  అతడు కాసేపు ఆలోచించి అర్థం చేసుకోవడమే మంచిది” అని సముద్రాల గారితో మల్లాది వారన్నారట, ఒకానొక సందర్భంలో.  మల్లాది వారి రచనలన్నింటిలోనూ ఇదే అంతస్సూత్రంగా ఉన్నట్టు ఉంటుంది.  80 యేళ్ళ క్రితమే పేరొందిన అన్ని పత్రికలలో వారి రచనలు, వ్యాసాలు అచ్చయ్యేవి.  స్వయానా సరస్వతీదేవే కొన్ని విషయాల మీద మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ వ్యాసాలు చదువుతుంటే.  నా కవి మిత్రులు, మన కథకులు, చలవ మిరియాలు మొదలైన శీర్షికలతో వారు వ్రాసిన వ్యాస పరంపరకు పుస్తక రూపమే... *“చలవ మిరియాలు”.* 

 

మాయాబజార్, మిస్సమ్మ, పాతాళభైరవి ఇలా తెలుగులో ఎన్నటికీ నిలచిపోయే చిత్రాలకు మాటలు పాటలూ రాసినవారు, గుండమ్మకథ, అప్పు చేసి పప్పుకూడు వంటి సినిమాలకు గీతకర్త పింగళి నాగేంద్రరావు గారు.  వారు సినిమాలలోకి రాక పూర్వం నాటక రచన కూడా చేశారు. అందులో తొమ్మిది నాటకాలు రెండు సంపుటాలుగా వచ్చాయి. 

“తెలుగు వారల మాట 

భళియనగ చెల్లాలి

తెలుగుజెండా గగన 

గగనాల యెగరాలి

తెలుగుతల్లీ నీకు జోహార్

 

తెలుగువారల కీర్తి

తళతళల మెరవాలి

తెలుగువారే దేశదేశల నేలాలి

తెలుగుతల్లీ నీకు జోహార్”

 

అని పింగళివారు తను రాసిన నారాజు అనే నాటకంలో ఒక పాత్రచేత చెప్పిస్తారు.  తన మాతృ భాషమీద మమకారాన్ని చాటుకుంటారు.

 

తెలుగు సినీ కవిసార్వభౌముడైన వేటూరి సుందరరామమూర్తి గారు సినిమారంగంలోకి రాకపూర్వం చేసిన రచన సిరికాకొలను చిన్నది, అనే సంగీత రూపకం.  సుమారు యాభై ఏళ్ళ క్రితం ఆకాశవాణిలో ప్రసారమయ్యి శ్రోతలను విపరీతంగా ఆనందపరచిన ఈ వేటూరి రచన తరువాత కాలంలో పుస్తకంగా అచ్చయ్యింది. అలానే ఎందరో సినీ ప్రముఖుల గురించి వేటూరిగారు హాసంపత్రికలో వ్రాసిన వ్యాస పరంపరకు పుస్తకరూపం కొమ్మకొమ్మకో సన్నాయి.  ఈ రెండూ చదివితే కవిత్వంతో ఈ వేటూరి ఎంత ఎత్తుకు వెళ్ళాడో వచనంలోనూ అంతెత్తుకు వెళ్ళాడన్న విషయం అర్థమవుతుంది.

 

కవి అంటే కృష్ణశాస్త్రేనేమో అన్నంతగా తెలుగువారిని సమ్మోహ పరచిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. 

 “సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?

చంద్రికల నేల వెదజల్లు చందమామ?

ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?

ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?” 

 

“నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు - నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?” వంటి ఆయన కవిత్వ పంక్తులు నోటికి రాని నిరక్షరాస్యులు కూడా ఆరోజులలో ఉండేవారు కారట.  ఆయన కవితా సంపుటులన్నీ కొనుక్కొని చదువుకొవాలి.  కుదరని పక్షంలో కనీసం కృష్ణపక్షం అయినా చదువుకోవాలి,

 

తెలుగులో హాస్యం అంటే గుర్తుకువచ్చే మొదటి పేరు భమిడిపాటి కామేశ్వరరావు గారిది.  మన వేష భాషల మీద, అలవాట్ల మీద, మనస్తత్వం మీద వారు వేసినన్ని హాస్యోక్తులు మరే హాస్య రచయితకూ సాధ్య పడలేదు.  ‘‘మన లిపిలోనే మన అనైక్యత తెలుస్తుంది. క-చ-ట-త-ప ఈ అక్షరాలు చూడండి.  విడివిడిగా దేని తలకట్టు దానిదే.  హిందీలో అయితే ఈ అక్షరాలకు పైన ఓ గీత పెట్టి కలుపుతారు. మనం?  అబ్బే! కచట తపల గాళ్లం.  మన అక్షరాల్లాగా ఎవడి పిలక వాడిదే. ఇంకోడితో కలిసే ప్రసక్తే లేదు.’’ ఇలా సాగుతుంది వారి వరస. అన్నీ తగాదాలే, మన తెలుగు, లోకో భిన్న రుచిః మొదలైన పుస్తకాలు చదువుతున్నంత సేపూ పెదాలు విచ్చుకునే ఉంటాయి.  

 

చందమామ పత్రికకు సంపాదకునిగా దశాబ్దాల పాటూ పనిచేసి ఈనాటి ఎందరో సాహితీకారులకు పరోక్షంగా ప్రేరణగా నిలచినవారు... కొడవటిగంటి కుటుంబరావు గారు. సమాజం గురించి తెలుసుకోవాలంటే కుటుంబరావు గారి కథలు, నవలలు చదవాలి.  సాహిత్యం కోసం తెలుసుకోవాలంటే వారి సాహిత్య వ్యాసాలు చదవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కొడవటిగంటి కుటుంబరావు గారి పుస్తకాలన్నీ చదవాలి.

 

కవిగా ఆరుద్రని అందరికీ చేరువ చేసిన రచన *“త్వమేవా౽హమ్”.* 1948లో రజాకార్లచే చెరచబడ్డ స్త్రీకథనం కృష్ణాపత్రికలో చదివి “త్వమేవాహం” మొదలుపెట్టారు ఆరుద్ర.  ఈ కావ్యం చదివిన శ్రీశ్రీ, “ఇక నే పద్యాలురాయనవసరంలేదు” అని ప్రశంసించారు ఆరుద్రని. 

“నువ్వు ఎక్కదలచుకొన్న రైలు

ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు” అనే ప్రసిద్ధ కవితా వాక్యం ఈ పుస్తకంలోనిదే.

 

చలంగారి హృదయం తెలుసున్నవాళ్ళకి, ఆయన ఆరాటం దేనిగురించో ఎరిగున్నవాళ్ళకే చలం రచనలు అర్థమవుతాయి. స్త్రీ స్వేచ్ఛ కోసం పరితపించినవాడు చలం. తన మైదానం నవలతో తెలుగునేలపై  ఒక పెద్ద అలజడి సృష్టించిన రచయిత ఇతను.  ఈయన పుస్తకాలన్నీ చదువవలసినవే అయినా, ప్రేమలేఖలు మాత్రం ముందుగా చదవవలసిన పుస్తకం.

 

నేను పుట్టకముందే 

నెత్తిమీద నీలితెర

కాళ్ళకింద ధూళిపొర

ఇవి తెలుగువారిని రెండో మారు జ్ఞానపీఠం ఎక్కించిన విశ్వంభర కావ్యానికి ఆరంభాక్షరాలు.

మానవుడే నాయకునిగా, విశాల విశ్వంభరే రంగస్థలంగా, ప్రకృతి నేపథ్యంగా, తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యంలేని మనిషి కథకు వచన కవితారూపమే ఈ విశ్వంభర అని కృతికర్త నారాయణ రెడ్డి గారు కవితా వస్తువేమిటో చెప్పుకొచ్చారు.

 

మూడోమారు తెలుగువారికి జ్ఞానపీఠం తీసుకువచ్చిన వారు రావూరి భరద్వాజ గారు. మంగమ్మ అనే నాటకాల కంపెనీలో పనిచేసే స్త్రీ తన తెలివి తేటలతో, అందచందాలతో తెలుగు సినిమా పరిశ్రమలో మంజరి అనే ప్రఖ్యాత 

కథానాయకురాలిగా ఎదిగి, తిరిగి అథః పాతాళానికి పడిపోయిన కథే, 

*పాకుడు రాళ్ళు.* 

 

పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై

పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి

కలికి వెన్నెల లూరు చలువ దోసిళ్ళతో

లతలకు మారాకు లతికి యతికి

పూల కంచాలలో రోలంబములకు రే

పటి భోజనము సిద్ధ పరచి పరచి

తెలవారకుండ మొగ్గలలోన జొరబడి

వింత వింతల రంగు వేసి వేసి

తీరికే లేని విశ్వ సంసారమందు

అలసి పోయితివేమొ దేవాధిదేవ!

ఒక నిమేషమ్ము కన్నుమూయుదువు గాని

రమ్ము!  తెరచితి మా కుటీరమ్ము తలుపు!!

అంటూ సృష్టికార్యంలో అలసిపోయావా స్వామీ అంటూ భగవంతుడి మీదే కరుణ చూపించిన కవి కరుణశ్రీ గారు. 

“ఊలుదారాలతో గొంతు కురి బిగించి

గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి

ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము

అకట! దయలేనివారు మీ యాడువారు.” అంటూ విలపించే పువ్వుల బాధని మన మనస్సులకు గుచ్చుకునేలా చేసిన కవితా ఖండిక పుష్పవిలాపం. తెలుగు పద్యం సొగసు తెలియాలంటే కరుణశ్రీ గారి *ఉదయశ్రీ* చదవాల్సిందే. 

 

పుట్టపర్తి నారాయణాచార్యులు గారు 14 భాషలలో ప్రవీణులు. ఎంత ప్రావీణ్యం అంటే..ఆ 14 భాషలలో ఆశు కవిత్వం చెప్పగలిగినంత.  వారు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషలలోని కావ్యాలను తెలుగులోకి అనువదించారు.  విశ్వనాథ వారి ఏకవీరను మళయాళంలోకి అనువాదం చేసారు.  పుట్టపర్తి వారి జీవితంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఆయన రాసిన పుస్తకాన్ని ఆయనే పాఠ్యాంశంగా చదువుకోవాల్సి రావడం!

శివతాండవం చదువుతుంటే మనకు తెలియకుండానే అక్షరాలన్నీ సంగీతంతో కలిసి పరిగెడుతుంటాయి. అందుకేనేమో ఆ శివతాండవం కవిసమ్రాట్ విశ్వనాథుని ఆనంద పరవశుని చేసింది.  కవికోకిల జాషువా చేత పుట్టపర్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవ్వడు? అనిపించింది.

 

“ఓ నిజాము పిశాచమా! కానరాడు

నిన్ను బోలిన రాజు మా కెన్నడేని;

తీగెలను తెంపి, అగ్నిలో దింపినావు

నా తెలంగాణ, కోటి రత్నాలవీణ”

అని నినదించిన మహాకవి దాశరథి. “దాశరథి వ్రాసిన పద్యాలు బోలెడు - అందులో నోటు చేయదగినవి కోకొల్లలు” అని ‘ఆరుద్ర’చే కొనియాడబడిన కవితావన పారిజాతం మన దాశరథి. నిజాం చెరనుండి తెలంగాణా విముక్తికై పోరాడిన కవనయోధుడతడు. “మహాంధ్రోదయం” కోసం తన కవిత్వంతో “అగ్నిధార”లు కురిపించి “రుద్రవీణ”లు మ్రోగించినవాడు.  లక్ష్యం నెరవేరాక,  చల్లబడ్డ మనస్సుతో సినిమా పాటలలో వేయి వేణువులు మ్రోగించి, ముత్యాల జల్లులు కురిపించినవాడు.  ఆ కవితాగ్ని కాంతిలో దాశరథి విశ్వరూపాన్ని చూడాలంటే ఆయన సాహిత్యాన్ని చదవాల్సిందే.

 

"నేనింతా ఓ పిడికెడు మట్టే కావచ్చు - కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది!" అంటూ నినదించిన మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ.

"శేషేన్

నీ పోయెమ్సు చూసేన్

పసందు చేసేన్

నీది పద్యమా లేక ఫ్రెంచి మద్యమా" 

అంటూ ఆయనను కవితాత్మకంగా పొగిడి మురిసిపోయారు "శ్రీశ్రీ".

 

ఈ షోడశి పుస్తకంలో... సుందరకాండ కుండలినీ యోగమని, లంకానగరం మూలాధారమని, సీతాదేవియే కుండలినీశక్తి అని, స్వామి హనుమే కుండలినీ యోగము అనుష్ఠించు యోగి అని వేదోపనిషత్తులనుండి మంత్రశ్లోకాలను ఉదహరిస్తూ నిరూపిస్తారు రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ గారు. 

 

అనువాద హనుమంతుడంటూ బాపూరమణలు పిలుచుకునే నండూరి రామ్మోహనరావు గారి రచనా శైలి చాలా సరళంగా ఉంటుంది. మార్క్‌ట్వైన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెరీఫిన్ మొదలైన వాటికి నండూరి వారి అనువాదాలు అనువాదపు వాసన తగలకుండా గుబాళిస్తుంటాయి.  ఇవి కాక ఇంకొన్ని అనువాదాలయిన రాజూ-పేద, విచిత్ర వ్యక్తి, కాంచనద్వీపం వంటి పుస్తకాలు పిల్లలతో చదివిస్తే వాళ్ళ ఊహాశక్తి, భాషా పటిమ రెంటినీ పెంచినవాళ్ళమవుతాం.

 

ఆరు సారా కథలు, రత్తాలు రాంబాబు, రాజు-మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త వంటి రచనలతో తెలుగు సాహిత్యంలో స్థిర నివాసం ఏర్పరచుకొన్న రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు.  రావి శాస్త్రిగా సుప్రసిద్ధులు.  ఈనాటి రచయితలు ఎందరికో స్ఫూర్తి. ఆయన రచనాశైలి కూడా వేరెవ్వరీ అందనంత విశిష్టమైనది.  కేవలం మళ్ళా మళ్ళా చదువుతూ ఆనందించ వలసినది.

 

ఇంకొక సుప్రసిద్ధ కథా రచయిత చాసోగా పిలవబడే చాగంటి సోమయాజులు గారు.  ఎందుకు పారేస్తాను నాన్నా, ఎంపు, జంక్షన్‌లో బడ్డీ వంటి ఆయన కథలు… కథను ఎలా నడిపించాలి అన్న విషయంలో ఔత్సాహిక కథకులకు మార్గదర్శనం చేస్తాయి.

 

అందరికీ అర్థం కాని కథలు, అర్థం అయినా తిరిగి ఇదీ ఆ కథ అని చెప్పలేని కథలు, మనసు పొరల్లోకి తవ్వుకుంటూ వెళ్ళే కథలు... త్రిపుర కథలు.   పాము, భగవంతం కోసం వంటి కథలు చదివిన తరువాత మరలా ఈ వాస్తవిక ప్రపంచంలోకి రావడానికి చాలా సమయం పడుతుంది.  త్రిపుర పేరుతో రచనలు చేసిన రచయిత అసలు పేరు  రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు గారు.

 

ఇంకా తెలుగు అందాన్ని అక్షరాలలో పెట్టి పరుగులు పెట్టించిన  వేలూరి శివరామశాస్త్రి గారి కథలు,

 

తన "గాలివాన" కథతో తెలుగు కథకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన పాలగుమ్మి పద్మరాజు గారి కథలు,

 

*"చివరకు మిగిలేది"* అనే నవలతో తెలుగు సాహిత్యం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉండిపోయే స్థాయిని సంపాదించుకున్న బుచ్చిబాబు గారు రాసిన కథలు,

 

ఆనందాన్ని, హాయిని కలిగించే భానుమతి గారి “అత్తగారి కథలు”, 

 

ఇలా వీరందరి కథలూ చదివి తీరాల్సిందే.

ఇప్పటివరకూ చెప్పుకున్న పుస్తకాల రచయితలెవ్వరూ ఇప్పుడు భూమి మీద లేరు. ఇప్పుడు ఉన్న రచయితల్లో కూడా తారాపథాన్ని అందుకున్నవాళ్ళు ఇద్దరు ఉన్నారు.  అప్పట్లో లక్షలాది తెలుగు పాఠకులకు వాళ్ళిద్దరి పుస్తకాలే తెలుగు సాహిత్యానికి ప్రవేశద్వారాలుగా ఉండేవి. వారిలో ఒకరు,

 

*యండమూరి వీరేంద్రనాథ్ గారు.* ఒక తరం నవలా సామ్రాజ్యానికి ఆయనే చక్రవర్తి.  వెన్నెల్లో ఆడపిల్ల, అంతర్ముఖం వంటి నవలలు ఎప్పటికీ క్లాసిక్సే.  ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, అభిలాష, ఒక రాధ ఇద్దరు కృష్ణులు మొదలైన తెలుగు సినిమాలన్నీ యండమూరి నవలలకు వెండితెర రూపాలే. “విజయానికి అయిదు మెట్లు” తెలుగులో వచ్చిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలలోకెల్లా అత్యంత విజయవంతమైన పుస్తకం.

 

ఇంకొక ప్రసిద్ధ రచయిత, షాడో సృష్టికర్త అయిన *మధుబాబు గారు.* డిటెక్టివ్ సాహిత్యంలో ఎందరో రచయితలు ప్రఖ్యాతులైనా అగ్రస్థానం మాత్రం మధుబాబు గారిదే.  షాడో గంగారాంతో కలసి దేశవిదేశాల్లో చేసిన విన్యాసాలు చదివి ఆనందించవలసిందే కానీ ఇలా చెప్పుకుంటే తనివితీరేది కాదు.  డిటెక్టివ్ నవలలే కాదు  కాళికాలయం, వీరభద్రారెడ్డి వంటి ఎన్నో జానపద నవలలు కూడా మధుబాబు గారి మార్క్‌తో తెలుగు సాహిత్యంలో నిలబడిపోయాయి. 

 

ఇంకా…

 

ప్రజాకవి కాళోజీ గారి “నా గొడవ”, డైరక్టర్ వంశీ గారి “పసలపూడి కథలు”, యద్దనపూడి సులోచనారాణి గారి “జీవన తరంగాలు”, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి “నత్తలొస్తున్నాయి జగ్రత్త”, మాదిరెడ్డి సులోచన గారి “పూల మనసులు”, రంగనాయకమ్మ గారి “బలిపీఠం”, పొత్తూరి విజయలక్ష్మి గారి “హాస్య కథలు”, కె.ఎన్.వై. పతంజలి గారి “కథలు- పతంజలి భాష్యం”, శ్రీరమణ గారి “మిథునం”, “బంగారుమురుగు” కథలు, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి “అమృతం కురిసిన రాత్రి” రాసిన ఇలా చదవ వలసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి.

 

రామాయణం 24 వేల శ్లోకాలూ టీకా తాత్పర్యాలతో సహా కావాలనుకునేవాళ్ళకు పుల్లెల శ్రీరామచంద్రుడు గారి రామాయణం, టి.టి.డి వాళ్ళు ప్రచురించిన ఆంధ్రమహాభారతం పదిహేను పుస్తకాల సెట్టు, వారి ప్రచురణే అయిన పోతన భాగవతం, రామకృష్ణమఠం వారు సులభశైలిలో అర్థమయ్యేలా ప్రచురించిన ఉపనిషత్తుల పుస్తకాలు, శృంగేరీ పీఠాధిపతుల సూచన మేరకు కాకతీయ సిమెంట్స్ వారు ప్రచురించిన పురాణ అనువాదాలు ఇలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.

 

ఇప్పటికి కొందరు రచయితలను, కవులను తలుచుకుంటూ కొన్ని పుస్తకాలను మాత్రమే ప్రస్తావించాను.  ఇలాంటి ఇంకొక పది వ్యాసాలు వ్రాసినా ఇంకా గుర్తుచేసుకోవలసిన, చదవ వలసిన మంచి పుస్తకాలు మిగిలే ఉంటాయి.  అంత గొప్ప సాహిత్యం ఉంది మన భాషలో.


ఇప్పటికి మాత్రం ఈ పుస్తకాలతో సరిపెడుతూ, నా ఉత్సాహానికి అడ్డుకట్ట వేసుకుంటున్నాను.

*స్వస్తి! - రాజన్ పి.టి.ఎస్.కె* 

(#RajanPTSK Rajan PTSK)

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

కామెంట్‌లు లేవు: