19, నవంబర్ 2023, ఆదివారం

ధర్మేశ్వరాలయం

 🎻🌹🙏ఈ కార్తీకమాస సందర్బంగా వారణాసిగా పిలువబడే ప్రసిద్ధ ఆలయాలు కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రం 


కాశీలోని ఆ ఆలయాల గురించి.. ఈ మాసమంతా అందులోని రోజుకో ఆలయ విశిష్టత తెలుసుకుని భక్తి పారవశ్యంతో తరిద్దాము..


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


     🌹    ధర్మేశ్వరాలయం     🌹


🌸పార్వతీ దేవి కాశీలో ఉన్న ప్రముఖ శివ లింగములను గూర్చి చెప్పుమని శివుని అడిగెను. శివుడు ఆనందంగా చెప్పసాగెను. ఒకానొకప్పుడు యమరాజు ఆనందవనం (కాశీ) లో శివ లింగమును ప్రతిష్ఠించి శివుని ప్రత్యక్షము చేసుకొనుటకై తీవ్రమైన తపస్సు చేసెను. అమితమగు శీతోష్ణస్థితులకు కూడా చలించక తపస్సు కొనసాగించెను.


🌿యమరాజు యొక్క తపస్సు తీవ్రత అంతకంతకు పెరిగెను. ఒంటి కాలు మీద నిల్చొని ఎన్నో సంవత్సరములు, కాలి బ్రొటనవేలు మీద నిల్చొని మరెన్నో సంవత్సరములు కఠోరమగు తపస్సు చేసెను.


🌸చివరకు శివుడు ప్రత్యక్షమై 'ధర్మరాజు' అని యమరాజుకి బిరుదునిచ్చెను (సంధ్యావందనం వంటి కొన్ని మంత్రములలో యమాయ ధర్మ రాజాయ... అని చదువుచుందురు). యమరాజు స్థాపించిన లింగమునకు ధర్మేశ్వర్ లింగమని ఆ శివుడే పేరు పెట్టెను.


🌿శివుని దివ్య రూపమును ప్రత్యక్షముగా చూసిన యమరాజు నోట మాట రాక ఏమియునూ అడుగలేకుండెను. మునిగియుండెను. యమరాజు సంభ్రమాశ్చర్యములతో నుంచుని ఉండగా..


🌸అంతట శివుడు కల్పించుకొని, 'నువ్వు దర్మనిర్ణేతవై, మరణించిన వారందరి ఔర్వదేహిక గతికి సరియైన న్యాయ నిర్దేశనం చేయవలెను. పాపములు చేసిన వారు శిక్షలననుభవించునట్లు, పుణ్య కర్మలు చేసిన వారు స్వర్గమునకు వెళ్లునట్లు పక్షపాత రహితంగా నిర్ణయము చేయవలెను.


🌿కాశీలో నివసిస్తూ నిత్య పూజాది పుణ్య కర్మలు చేసినవారి పాపములు (ఎన్ని జన్మలందైనను) ప్రక్షాళనమగునట్లుగా పరిగణించవలెను. పాపములు చేసిన వారికి యమరాజుగా, పుణ్య కర్మలు చేసిన వారికి ధర్మరాజుగా ఉండవలెను', అని చెప్పెను.


🌸ధర్మ కూపంలో స్నానమాచరించి ధర్మేశ్వర లింగమును పూజించిన పాపములు వారి ప్రక్షాళనమవును. యమరాజు శివుడు చెప్పినట్లు చేయుటకు అంగీకరించెను. (కాశీ ఖండం, 78 వ అధ్యాయం). కాశీలో నివసిస్తూ, దైనందినంగా పూజాది నిత్య కర్మలు చేసేవారి పాపములు ప్రక్షాళనమవునని ఇప్పటికీ నమ్ముదురు.


    🌹  ధర్మేశ్వర్ ఉన్న స్థలం   🌹


🌿వారణాసి యందున్న మీర్ ఘాట్ డోర్ నంబర్: డి-2/21 లో ధర్మేశ్వర్ లింగమును దర్శించవచ్చు. ప్రసిద్ధమైన దశాశ్వమేధ్ ఘాట్ నుండి వెళ్లవచ్చు. భక్తులు, దశాశ్వమేధ్ విశ్వనాథ్ వీధి దాకా రిక్షాలో వెళ్ళి, అక్కడి నుంచి విశాలాక్షి గౌరి (విశాలాక్షి) మందిరము యొక్క దారిగుండా నడుస్తూ చేరుకోవచ్చు.


🌸విశ్వేశ్వరుని (విశ్వనాథుని) దర్శనం సంపూర్ణం చేసుకొన్న భక్తులు, అక్కడి నుండి సరస్వతి పాటక్ గేట్ వైపు నడుస్తూ విశాలాక్షి మందిరానికి వెళ్లే దారిలో ధర్మేశ్వర్ ని చేరవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీర్ ఘాట్ దాకా పడవలో వెళ్లి, అక్కడి మెట్లెక్కి చేరుకోవచ్చు.


🌿లింగ పురాణమందున్న 3, 7వ అధ్యాయములలో ధర్మేశ్వర్ లింగమును పూజించిన భక్తుల కోరికలన్నియూ నెరవేరునని స్తుతించబడెను. ధర్మేశ్వర్, ధర్మ కూపం, విశాలాక్షి మందిరాలున్న ప్రదేశమంతా ఒక గొప్ప శక్తి పీఠం. ఆ ప్రదేశములో చేసిన ఎటువంటి ప్రార్ధనలు లేక పూజలైనను, అత్యంత ఫలదాయకములు.


🌸ఈ మందిరం ఉదయం 5:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు తెరచియుంచబడును. ఉదయం 5:00 గంటలకు, సాయంత్రం 7:00 గంటలకు హారతులనిచ్చెదరు.


🌿కార్తీక మాసం శుక్ల పక్ష అష్టమి (అమావాస్య తరువాత ఎనిమిదవ రోజు) రోజున ధర్మేశ్వర్ లింగమును పూజించటం అత్యంత శుభప్రదమని నమ్ముదురు.


🌸ఈ మందిరమునకు సమీపమున ధర్మ కూపం (బావి) ఉన్నది. ధర్మ కూపమందు స్నానం చేసి శ్రీ శ్రాద్ధ కర్మలు చేసిన, గయలో శ్రాద్ధ కర్మలు చేసినదానికి సమానమగు ఫలం కలుగును.


🌿రేపు మరో  ప్రసిద్ధ ఆలయాన్ని ప్రస్తావిస్తూ చక్కటి విశేషాలని మరో కొత్త పోస్టులో చూద్దాము..స్వస్తి..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కామెంట్‌లు లేవు: