ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లాగును వీక్షిస్తున్న పాఠకులకు కృతజ్ఞతలు. రోజు రోజుకు పెరుగుతున్న వీక్షిణికుల సంఖ్య నాకు కొండత అండగా వుంది. దయచేసి మీరు మీ మీఅభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్రాయగలరు. అది నాకు ఈ బ్లాగును ముందుకి తీసుకొని పోవటానికి సాయపడుతుంది. మీరు సహృదయంతో సూచనలను చేయ మనవి. ఈ బ్లాగ్ తెలుగు సాహిత్యలోకానిది మీరు దీనిలో భాగస్వాములు కండి.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
28, జూన్ 2023, బుధవారం
హనుమ రోజూ సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో .... ఈ రోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను .... నేనే స్వయంగా వంటచేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అంది సీతమ్మ .... పిలు పిలు .... నీకే అర్థం అవుతుంది అన్నాడు రామచంద్రుడు నవ్వుతూ. అన్నట్టుగానే సీతమ్మ స్వయంగా వంటచేసి .... హనుమను భోజనానికి పిలిచింది .... తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ .... కడుపునిండా తిను నాయనా .... మొహమాటపడకు అని చెప్పింది ..
"సరేనమ్మా" అని చెప్పి హనుమ తలవంచుకుని భోజనం చేయసాగాడు .... సీతమ్మ కొసరి కొసరి వడ్డిస్తోంది .... హనుమ వద్దు అనకుండా .... వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతాతింటున్నాడు. .... కాసేపట్లో సీతమ్మ స్వయంగాచేసిన వంటంతా అయిపోయింది .... సీతమ్మ కంగారు పడి అంఃతపురవాసుల కోసం వండినవంటతెప్పించింది .అదీ అయిపోయింది .... తలవంచుకునే ఆహరం కోసం నిరీక్షీస్తూన్నాడు .... హనుమ ఆవురావురమంటూ .... సీతమ్మకి కంగారు పుట్టి .... "రోజూ ఏం తింటున్నావు నాయనా" .... అని అడిగింది వినయంగా ...
"రామ నామం తల్లీ" .... వంచిన తలెత్తకుండా జవాబిచ్చాడు హనుమ .... సీతమ్మ త్రుళ్లిపడింది .... నిరంతరం రామనామం భుజించేవాడు .... భజించేవాడు .... శివుడొక్కడే గదా .... సీతమ్మతల్లి తేరిపార జూసింది .... అపుడు కనిపించాడు సీతమ్మకి .... హనుమలో శంకరుడు .... శంకరుడే హనుమ .... నిత్యం రామనామం ఆహరంగా స్వీకరించే వాడికి .... తాను మరి ఏమి పెట్టగలదు!
సీతమ్మ ఒక అన్నపు ముద్దను పట్టుకుని .... రామార్పణం అని ప్రార్థించి వడ్డించింది .... ఆ ముద్దని భక్తితో కళ్లకు అద్దుకోని స్వీకరించి .... అన్మదాత సుఖీభవా అన్నాడు హనుమ త్రుప్తిగా .... హనుమలోని పరమేశ్వరుడుకి భక్తితో నమస్కరించింది సీతమ్మతల్లి ....
తొలి ఏకాదశి
"తొలి ఏకాదశి!"*
"మహావిష్ణువు" యోగ నిద్రకు ఉపక్రమించే రోజు. అందువల్ల ఈ ఏకాదశిని "తొలి ఏకాదశి" లేదా "శయన ఏకాదశి" అని అంటారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం మాసాలు ముగిశాక కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్ర లేస్తాడు. దీన్నీ చిలుకు ద్వాదశి , ఉత్తాన ద్వాదశి అని అంటారు. అందుచేత ఈ నాలుగు మాసాలు విష్ణువుని ఎవరైతే అర్చిస్తారో వారికి హరిపద ప్రాప్తి కలుగుతుంది.
తొలి ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసము ఉంటారు. పీఠాధిపతులు, మఠాధిపతులు, ఏటీశ్వరులు చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు.
మహావిష్ణువుకు అత్యంత ప్రేమ పాత్రమైన "తులశమ్మ" దగ్గర పద్మం ముగ్గువేసి, దీపం వెలిగించి, వివిధరకాల పండ్లను నివేదిస్తారు.
శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని శ్రీహరికి ఇష్టమైన "పేలపిండి" ని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు.
స్వామి అలంకార ప్రియుడు కనుక మహావిష్ణువుకు "జాజి" పూలతో అలంకారం చేసి, "శాంతాకారం భుజగశయనం, పద్మనాభం" అంటూ మహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే "తొలి ఏకాదశి."
*పేలాల పిండి!*
ఇది రైతుల పండుగ కూడా. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎలాంటి తెగుళ్లు సోకకూడదని, ఏ ఆటంకాలు ఎదురవకూడదని వేడుకుంటారు.
*తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి, అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు.*
"తొలి ఏకాదశి" రోజు రైతులు పూజ పూర్తిచేసి పొలానికి వెళ్లి పని చేసుకుంటారు. ఈ రోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది. కొత్త కూలీలను మాట్లాడ్డం లాంటి పనులు చేస్తారు. కొత్త ఒప్పందాలు ఈ రోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు.
పూజలు
🕉️🙏शुभोदयः।🙏🕉️
इक्षुरापः पयो मूलं
ताम्बूलं फलमौषधम्। भक्षयित्वापि कर्तव्यः स्नानदानादिकाः क्रियाः ॥
ఇక్షురాపః పయో మూలం తాంబూలం ఫలమౌషధమ్।భక్షయిత్వాపి కర్తవ్యః స్నానదానాదికాః క్రియాః ॥
నీరు, చెరకు, పాలు, దుంపలు, పాన్, పండ్లు మరియు ఔషధాలను పవిత్ర గ్రంథాలలో వర్ణించారని చాణక్యుడు ఈ శ్లోకంలో చెప్పాడు. అందుకే వాటిని తిన్న తర్వాత కూడా ఒక వ్యక్తి మతపరమైన పని చేయవచ్చు. సాధారణంగా భారతీయులకు నీరు, పాలు, పండ్లు మరియు మందులు పూజ చేసిన తర్వాత మాత్రమే తినాలని నమ్ముతారు, అయితే అనారోగ్యం లేదా మరేదైనా స్థితిలో పాలు, నీరు, పండ్లు, దుంపలు, తమలపాకులు, చెరకు వంటివి తీసుకోవాలని చాణక్యుడు చెప్పాడు. ముందు వీటిని తినడం ద్వారా ఒక వ్యక్తి అపరాధ భావాన్ని పొందలేడని చాణక్యుడు చెప్పాడు. ఒక వ్యక్తి ఈ ఏడు వస్తువులను సేవించిన తరువాత పూజలు మరియు మతపరమైన పనులు చేయవచ్చును.
Chanakya Niti - 8/2.
Acharya Chanakya says that for those who are patients, taking sugar cane, sugar cane juice, water, milk, herbs, pan, fruits and medicines are allowed before taking bath and before performing puja and other rituals and such acts are nottreated as sin and dharma sastras permit such exemptions.
हरिः ॐ।
ఆకలి లేనివారికోసం
ఆకలి లేనివారికోసం సులభ యోగాలు -
* మిరియాలను నూరి తీసిన రసం గాని మిరియాల కషాయం కాని తీసుకొనుచున్న అగ్నిమాంద్యం , ఆకలి లేకపోవటం వంటి సమస్య తొలగి జీర్ణశక్తి వృద్ది అగును.
* వేడిగా ఉన్న అన్నం వార్చిన గంజిలో కొంచం పొంగించిన ఇంగువ , సౌవర్చ లవణం కలిపి తాగుచున్న అగ్నిమాంద్యం తొలగును .
* యవాక్షారం , శొంఠి సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 5 గ్రాముల చొప్పున ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న మంచి ఆకలి కలుగును.
* బెల్లం , జీలకర్ర సమాన భాగాలుగా కలిపి తినుచున్న ఆకలి పెరుగును .
* పిప్పళ్లు చూర్ణం చేసి బెల్లముతో కలిపి తీసుకొనుచున్న ఆకలి పెరుగును .
* కరక్కాయ , పిప్పళ్లు , సౌవర్చ లవణం సమపాళ్లలో తీసుకుని నూరి చూర్ణం చేసి పెరుగు పైన ఉండే నీటితో కలిపి సేవించుచున్న అగ్నిమాంద్యం తొలగి ఆకలి పెరిగి జీర్ణశక్తి వృద్దిచెందును.
పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా చేయగలరో చూసుకుని పాటించి అగ్నిమాంద్యం సమస్య నుంచి విముక్తి పొందగలరు.
అగ్నిమాంద్య సమస్య ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు -
తినవలసినవి -
తేలికైన పాతబియ్యపు అన్నం , పెసలు , పేలాలు , పెసర కట్టు, చిన్న చేపలు , లేత ముల్లంగి , వెల్లుల్లి , లేత అరటికాయలు , లేత మునగకాయలు , పొట్లకాయ , బీరకాయ , వంకాయ , నక్క దోసకాయ , కాకరకాయ , అల్లం , చుక్కకూర, చెంచలికూర , ఉశిరికాయ , దానిమ్మపండు , నారింజపండు , పలచని మజ్జిగ , తాంబూలం , వేడినీళ్లు సేవించవలెను , తేనె , కారం , నూనె , చేదు , వగరు పదార్థాలు , వ్యాయమం .
తినకూడనవి -
కొత్తబియ్యం , చేపలు , బచ్చలికూర , ఎక్కువుగా నీరు తాగరాదు , కంద , ఆలుగడ్డ మొదలగు దుంప కూరలు , నేరేడు పండ్లు , గోధుమలు , పిండివంటలు , మాంసపదార్దాలు , పాలు , పాలతో వండిన పదార్దాలు , చారపప్పు , ఎక్కువుగా నూనె ఉండు పదార్థాలు , పూర్తిగా ఉడకని పదార్ధాలు మరియు అన్నం , మద్యపానం, ముందు తినిన పదార్దాలు పూర్తిగా అరగకముందే మరలా భుజించటం , అమిత భోజనం , నిద్రపోకుండా మేలుకుని ఉండటం, మలమూత్ర నిరోధం .
పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఔషధ యోగాలు వాడుచున్న సమస్య త్వరగా పరిష్కారం అగును.
మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
మార్కెట్ కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయము*
*మార్కెట్ కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయము*
ఈ రెండు న్యాయాలు భక్తుడికి భగవంతుడికి మధ్య సంబంధ బాంధవ్యాలను తెలుపుతుంది.
ముందుగా మర్కట కిశోర న్యాయము:
మర్కటము అంటే కోతి అని మీకందరికీ తెలిసియుండగలదు. ఈ వానరాలు చెట్ల మీద గెంతుతూ ఉంటాయి. అవి చిటారు కొమ్మకు వెళ్లి ఒక కొమ్మ నుండి మరో కొమ్మ మీదకు ఎగిరి దూకుతూ ఉంటాయి. ఒక్కోసారి తల్లి కోతి కడుపుకు అతుక్కుని పిల్ల కోతి ఉంటే భీతి అన్నదే లేకుండా తల్లి కోతి ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు ఎగిరి దూకుతుంది. గోడల మీద దాటుతుంది. తన తల్లి కోతిని ఆ పిల్ల కోతి ఎట్టి భయము లేకుండా అలాగే అతుక్కుని ఉంటుంది. మా అమ్మ కిందపడితే నేను కూడా కింద పడిపోతానేమో అనే సందేహము దానికి ఏ కోశానా ఉండదు.
అలాగే మనము భగవంతుని ఒక కోతి పిల్ల తన తల్లి మీద ఎటువంటి సంకోచం లేకుండా తన తల్లి ఉంది తనకు ఏమీ కాదని భావిస్తుందో అలా భగవంతుని మీద మనము అనన్య ఏకాగ్రతతో ఎటువంటి సంకోచం లేకుండా స్థిర చిత్తముతో నమ్మాలి.
అంటే భక్తి భావనలో భక్తుడు కూడా భగవంతుని ఎల్లప్పుడు అట్టి పట్టుకొని ఉండాలి. అలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోను భగవంతుడు కాపాడగలడన్న పూర్తి నమ్మకంతో వ్యవహరించాలి. ఏ కోశానా అపనమ్మకం ఉండకూడదన్నట్టు.
మార్జాల కిశోర న్యాయం :
మార్జాల మంటే పిల్లి. మీరందరు పిల్లలను పెట్టిన పిల్లిని చూసే ఉందురు.
ఒక్క రెండు రోజులు ఇక్కడ ఉన్న పిల్లి అక్కడ తన పిల్లలకు రక్షణ లేదు అనిపించిందా లేదా ఏ కుక్క శబ్దమో మరేదైనా విని పసిగట్టిందా వెంటనే తన పిల్లలను నోట గరచుకుని సురక్షితం అనిపించే మరో చోటుకు మార్చివేస్తుంది.
అంటే ఇక్కడ పిల్లలను కాపాడే పని పిల్లిది.
మనము నమ్మిన భగవంతుడు ఒక పిల్లి తన పిల్లలను రక్షించడానికి ఎన్ని ఇళ్ళు మారుస్తుందో అలాగే దైవము మన వెంట ఉండి అన్నీ తానై నడిపిస్తాడన్న భావన. దీనినే మార్జాల కిశోర న్యాయము అంటారు
ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 104*
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 104*
శరదృతువు ప్రవేశించింది. ఆనాడు పౌర్ణమి.
పాటలీపుత్రవాసులు ప్రతి సంవత్సరమూ ఆ పున్నమినాడు కౌముదీ మహోత్సవమును జరుపుకుంటారు. బ్రహ్మసృష్టి ప్రారంభించిన అనంతరం వేల సంవత్సరాల తర్వాత తానే పురుషుడు - ప్రకృతిగా రూపాంతరం చెంది మైథున కార్యం ద్వారా మానవజాతిని సృష్టించాడు. ఆనాటి నుంచే ఆడా-మగా కలయికతో సృష్టి మొదలైంది. బ్రహ్మ నుంచి అవతరించిన రతీమన్మథులు కామమునకు అధిదేవతలై జీవులను తమ మథనబాణ ప్రయోగాలతో మోహపరవశులను గావిస్తూ జీవుల అభివృద్ధికి కారకులవుతున్నారు.
ఆ విధంగా మానవజాతి వృద్ధి చెందడానికి, తమ తమ వంశాలు అభివృద్ధి చెందడానికి కారణాభూతులైన కామదేవతలు రతీమన్మథుల ప్రీత్యర్థం సంవత్సరాని కొకసారి జరిపే పండగే కౌముదీ మహోత్సవం. దీనినే 'కాముని పున్నమ' అని కూడా అంటారు. పాటలీ పుత్రవాసులు ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.
ఆనవాయితీ ప్రకారం ఈ యేడాది కౌముదీ మహోత్సవం మరింత ఘనంగా జరుపుకోవాల్సిందిగా చంద్రగుప్తుడు చాటింపు ద్వారా నగరప్రజలకు తెలియపరిచాడు.
చక్రవర్తి స్వయంగా చాటింపు వేయించేసరికి నగరపౌరులు మరింత ఉత్సాహంతో ఆనాడు 'కాముని పున్నమీ' పండుగ జరుపుకోవాలని నిశ్చయించుకొని ప్రతి ఇంటినీ పూలమాలలతో, రంగురంగుల ముగ్గులతో శోభాస్కరంగా అలంకరించుకున్నారు. అరటి బోదెలతో, మామిడి తోరణాలతో నగరమంతటా అలంకరణలు చేశారు. స్త్రీలు, పురుషులు కొత్త బట్టలు ధరించి వయసు తారతమ్యాలను పాటించకుండా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ, పన్నీరు చిలకరించుకుంటూ ఆటలూ, పాటలతో ఆ రోజంతా సంతోషంతో పరవాళ్ళు తొక్కారు.
చంద్రగుప్తునికి ఎప్పటికప్పుడు చారులవలన వార్తలు అందుతున్నాయి. ప్రజలు మహాసంబరంగా ఆ ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు ఎంతగానో ఆనందించాడతను.
కౌముదీ దీపమహోత్సవంలో అత్యంత ముఖ్యమైన వేడుక దీపోత్సవం. సాయం సంధ్యావేళలో నగరం అంతటా దీపాలతో అలంకరిస్తారు. ప్రతి ఇంటినీ దీపాలతో అలంకరిస్తారు. అంతేగాక శోణనదీతీరంలో ఆకుదొప్పలతో వేలాది దీపాలు వెలిగించి వాటిని నదీ ప్రవాహంలో విడిచిపెడతారు. ఆ విధంగా దీపకాంతులతో మెరిసిపోయే నగర వైభవాన్ని చూడడానికి దేవేంద్రుడికి ఉన్న వెయ్యి కళ్ళయినా చాలవని ప్రతీతి. రాజభవనమైన సుగాంగ ప్రాసాదము కూడా ప్రత్యేక దీపాలంకరణతో ఇంద్రభవనాన్ని తలపింపజేస్తుంది. అంతట మహోన్నతమైన దీపోత్సవంలో రాజు-ప్రజలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటారు. అది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ.
ఆ సంవత్సరము ఆ ఆనవాయితీకి గండిపడింది.
ఆ సాయంత్రంవేళ దీపోత్సవాన్ని నిషేధిస్తూ నగరమంతటా చాటింపు వేయించాడు చాణక్యుడు. ఆ ఆదేశాన్ని దిక్కరించిన వారికి దేశబహిష్కార శిక్ష విధించబడుతుందని హెచ్చరిక జారీ అయింది. ఆ శాసనానికి భయపడిన ప్రజలు దీపోత్సవాన్ని మానుకున్నారు. ఒక్క ఇంట్లో కూడా నిత్యవసరానికి మించి ఒక్క దీపం కూడా అదనంగా వెలిగించబడలేదు. దీపాలు వెలిగించనందుకు నగరవీధులన్నీ వెలవెలబోయాయి.
ఆ విషయాలేవీ తెలియని చంద్రగుప్తుడు ఆ దీపోత్సవాన్ని కళ్లారా తిలకించి ఆనందించాలన్న ఆకాంక్షతో ఆ రాత్రి ప్రథమఝాము వేళ సుగాంగ ప్రాసాదము పైభాగము మీదికి చేరుకుని అక్కడినుంచీ నగరాన్ని పరిశీలించాడు.
'ఏముందక్కడ ? ఒక్క దీపం కూడా లేక నగరం బోసిపోయి కనిపిస్తోంది. తానీ దీపోత్సవాన్ని జరుపుకోమని ప్రజలను ఆదేశిస్తే, ప్రజలు దీపాలెందుకు వెలిగించలేదు ? ఏమిటి కారణం ? రాజాధిక్కారమా ?' అని ఆలోచిస్తూ చంద్రగుప్తుడు బిగ్గరగా "ప్రతీహారీ....." అని పిలిచాడు. మరుక్షణం ద్వారపాలకుడు వచ్చి నమస్కరించాడు.
"ఈనాడు కౌముదీ దీపమహోత్సవం, దీపోత్సవం ఘనంగా జరుపుకోవాలని మేము ప్రజలను ఆదేశించాము కదా ! నగరంలో ఎవ్వరూ దీపాలు ఎందుకు వెలిగించలేదు ?" అసహనంగా ప్రశ్నించాడు చంద్రుడు.
"చిత్తం. ప్రభువుల ఆదేశాన్ని యీ సాయంత్రం వరకు ప్రజలు పాటించారు. ఆ తర్వాతే... దీపోత్సవం నిషేధించబడింది. ఈ నిషేధాన్ని పాటించని వారికి శిక్ష .... దేశ బహిష్కారం...." చెప్పాడు ప్రతీహారి.
చక్రవర్తి విస్తుబోతూ "నిషేధమా ? చక్రవర్తులమైన మాకు తెలియకుండా నిషేధమా ? ఎవరు ? ఇంతటి దుస్సహాసానికి ఒడిగట్టినe వారెవరు ?" గద్దించాడు ఆగ్రహంతో.
"ఆర్య చాణక్యుల వారు...." చెప్పారు ప్రతీహారి.
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
ఈ రోజు పదము
204వ రోజు: (సౌమ్య వారము) 28-06-2023
మన మాతృ భాష సేవలో
ఈ రోజు పదము:
సంతానవతి : కరవీరి, కుటుంబిని, కృమిల, కొదమరి, జీవసువు, బహుసుత, విజాత.
ఈ రోజు పద్యము:
ఊరక సజ్జనుండొదిగి యుండిననైన దురాత్మకుండు ని/
ష్కారణ మోర్వలేక అపకారము చేయుట వాని విద్యగా/
చీరలు నూరుటంకములు చేసెడివైనను పెట్టెనుండగా/
చేరి చినింగిపో గొరుకు చిమ్మట కేమి ఫలంబు? భాస్కరా!
ఎంతో విలువైన బట్టలు పెట్టెలో ఉండగా చిమ్మట పురుగు వాటికి చిల్లులు పెట్టి కొరికి పాడుచేస్తుంది. దానివల్ల ఆ పురుగుకి ఏమి లాభం లేదు. వాటికి పాడు చెయ్యటం ఒక స్వభావము. అలాగే ఎవ్వరినీ ఏమీ పల్లెత్తు మాట అనక తన ఇంట తానున్న సజ్జనుణ్ణి నిష్కారణంగా దుర్జనుడు అపకారం చేసి బాధ పెడతాడు. వాడికి వచ్చే లాభం ఏమీ లేదు. అది చెడ్డవాని గుణం.
మంగళసూత్రం - సుమంగళి
మంగళసూత్రం - సుమంగళి
పాలక్కాడ్ జిల్లాలోని మంజపర బ్రాహ్మణ సమూహానికి చెందిన ఆర్.జి. వెంకటాచలం కంచి మఠానికి పెద్ద భక్తుడు. చాలా పెద్ద పెద్ద పదవులనలంకరించి ఇప్పుడు చెన్నైలో జీవిస్తున్నారు. కాని తమ జన్మస్థలం అంటే వల్లమాలిన అభిమానం. దాదాపు యాభైలక్షల రూపాయలు విరాళాలు సేకరించి మంజపరలోని గురువాయురప్పన్ దేవస్థానాన్ని పునరుద్ధరింంచారు. వారికి పరమాచార్య స్వామివారితో అనుభవాలు కోకొల్లలు. భక్తిపారవశ్యంతో వారు ఎప్పుడూ ఈ సంఘటనను గుర్తు చేసుకుంటారు.
ప్రతి సంవత్సరమూ వారు పరమాచార్య స్వామివారి అనుగ్రహం కోసం వచ్చేవారు భిక్షావందనంతో. 1988లో రహదారుల ప్రయాణానికి కొంచం ఆటంకం ఏర్పడడంతో ఆయన రావాల్సిన రోజుకు రారు అని అందరూ తలచారు. కాని ఏలాగో వారు కాంచీపురం చేరుకున్నారు. స్వామివారి దర్శన సమయంలో అతణ్ణి, “నీ సంపాదన ఎంత?” అని అడిగారు. వారు సమాధానం చెప్పగానే వారికి స్వామివారి ఆదేశం అందింది.
”నువ్వు ఇక ఎప్పుడు భిక్షావందనం చెయ్యడానికి వచ్చినా, కొన్ని మంగళసూత్రాలను చెయ్యించి నీతోపాటు తీసుకుని రా” అని చెప్పారు.
ఆయన కొద్దిగా అలోచనలో పడ్డారు. ఏ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళసూత్రాలను చెయ్యించాలి. స్మార్త, తెలుగు, అయ్యర్ ఇలా చాలా చాలా ఉన్నాయి కదా. ఏ రకంగా తయారు చేయించాలి? ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది అని.
వెంటనే స్వామివారు “ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏ సంప్రదాయమైనా పరవాలేదు. తీసుకుని రా” అని చెప్పారు. వెంకటాచలం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతను ఈ విషయమై తన మనసులో ఆలోచిస్తున్నాడు. స్వామివారిని అడగనేలేదు. మరి స్వామివారికి ఎలా తెలిసిసింది? అడగకముందే స్వామివారు సమాధానం ఇవ్వడం అతణ్ణి ఆశ్చర్యచకితుణ్ణి చేసింది.
ఈ సంఘటన జరిగి మూడు సంవత్సరాలు గడిచిపోయింది. ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా భిక్షావందనానికి శ్రీమఠానికి వచ్చారు. ఆరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కొద్ది దూరంలో నిలబడి వెంకటాచలం తనవంతు కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక పెద్ద ముత్తైదువ బహుశా పేదరాలు, స్వామివారితో ప్రాధేయపూర్వకంగా మాట్లాడుతోంది. స్వామివారి ముఖమండలంలో అనంతమైన శాంతి గోచరిస్తోంది.
వెంకటాచలం తనవంతు రాగానే మహాస్వామి వారిముందు నిలబడి, “స్వామివారి ఆదేశం ప్రకారం మంగళసూత్రాలను తెచ్చాను” అని చెప్పాడు. స్వామివారు చేతివేళ్ల శబ్ధంతో ఆ సుమంగళిని దగ్గరకు రమ్మన్నారు. వెంకటాచలం వైపుకి తిరిగి “ఆమె కుమార్తెకి పెళ్ళి అట. మంగళసూత్రం కావాలి అట. తీసుకో ఇక్కడే నీ చేతులతోనే ఆమెకి ఇవ్వు” అని ఆదేశించారు. వెంకటాచలం చాలా సంతోషించారు.
“సార్, నేను చాలా పోగొట్టుకున్నాను. జీవనం సాగించడానికి కూడా కష్టపడ్డాను. అయినాకూడా, ఎప్పుడూ తిరుమాంగల్యాలు చెయ్యించడం మానలేదు. అది పరమాచార్య స్వామి వారి ఆజ్ఞ కదా? మరి ఎలా వదిలిపెట్టగలను? స్వామివారి ఏమి తెలియదా? అంతా తెలుసు. నా భార్య ఏ బాధాలేకుండా సుమంగళీగానే కన్ను మూసింది. మరి ఇంతకంటె ఇక ఏమి అడగాలి ఆ సర్వేశ్వరుణ్ణి?” అని కంఠం గాద్గదికమవుతుండగా వారి అనుభవాన్ని చెప్పుకొచ్చారు వెంకటాచలం.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
గురుపౌర్ణమి
ఊళ్ళో పెళ్ళికి ఏవో హడావిడి చేశాయి అన్నట్లు సాయిబు గుళ్ళలో మొదలైన షిర్డీ గురు పౌర్ణమి ఉత్సవాలంటా వీళ్ళు కొత్త కొత్త అర్థాలు చెప్పుతున్నారు
వ్యాసపౌర్ణమి గురుపౌర్ణమి అనగా ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే పర్వదినం వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి.
చాలా మంది తెలియక ఎలా పడితే ఆలా ఎవరికి పడితే వారికి పూజ చేస్తున్నారు. అసలు గురు పూజ మొదట ఎవరికీ చెయ్యాలి ఎలా చెయ్యాలి అని పెద్దలు ఒక పద్దతిని తీసుకొనివచ్చారు.
అదే వ్యాస పౌర్ణమి నాడు జగద్గురువులైన వేదవ్యాసులవారికి చేసే గురు పూజ.
సాధారణంగా గురుస్వరూపాలకి ఆరాధన ప్రక్రియ లేదు కానీ ఏ మహాపురుషుడి వలన వేద విభాగం జరిగిందో, సమస్త వాఙ్మయం భూమిమీదకు వచ్చిందో అట్టి జగద్గువులైన వేదవ్యాసులవారికి శిష్యులు మరియు మిగతా గురు పరంపర అంతా కలిసి ఒకరోజు కృతజ్ఞతగా పూజ చేస్తారు.
అదే గురు పౌర్ణమి. పువ్వు జ్ఞానానికి గుర్తు. కాబట్టి అటువంటి జ్ఞానం మనందరికీ కలగాలని ఆరోజున శ్రీకృష్ణ పరమాత్మ ఫోటోని, వ్యాసుల వారి ఫోటోని కానీ లేదా వ్యాస పాదుకల దగ్గర శిష్యులు, మిగతా గురుపరంపర ఒక్కో పువ్వుని సమర్పిస్తారు.
వేద వ్యాస మహర్షుల వారు మన జాతికి చేసిన సేవ అంతా యింతా కాదు. కలియుగంలో వేదాన్ని పూర్తిగా చదవలేరని, కనీసం అర్ధం కూడా చేసుకోలేని రోజులువస్తాయని భవిష్యత్తు దర్శనం చేసి ఒక వేదాన్నినాలుగు వేదాలుగా విభజించి, అవి కూడా పఠనం చేయలేకపోతారేమోనని అష్టాదశ పురాణాలను పంచి పెట్టారు, పంచమ వేదమైన మహాభారత ఇతిహాసాగ్రంధాన్ని ఇచ్చి ఒక్కొక్క వేదాన్ని ఒక్కో శిష్యుడి ద్వారా ప్రచారం గావించి, పురాణాలను శూత మహర్షుల చేత ప్రచారం చేయించారు.
ఒకవేళ కలియుగంలో ఈ గ్రంధాలని కూడా మనుషులు అర్ధం చేస్కోగలరో లేదో అన్న దూరదృష్టితో సమస్త వేద, పురాణ, ఉపనిషదుల యొక్క సారాంశమైన శ్రీకృష్ణ భగవానుడి కథలను, హరి నామ వైభవాన్ని శ్రీమద్భాగవతంలో నిక్షిప్తం చేసి ఎప్పుడు భక్తితత్పరతతో ఉండే తన కుమారుడైన శుకమహర్షుల వారి చేత ప్రచారంగావింపబడి సమస్త మానవాళిని ఉద్ధరించిన మహాపురుషుడు వ్యాస మహర్షి.
వ్యాసుమహర్షుల వారు ఇచ్చిన వాఙ్మయాని ఆధారం చేసుకొని తర్వాతి కాలంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, అన్నమాచార్య, రామదాస, మహర్షులవంటి మహాత్ములు గురుపరంపరగా భగవానుడి యొక్క కథలను, గుణవిశేషాలను శిష్యులకి ప్రచారం గావించి సనాతనధర్మాన్నిమానవాళికి అందించారు, నేటి కి మన గురువు చే అందిపుచ్ఛుకుంటునం
సమస్త వాఙ్మయం వ్యాస ఉచ్చిష్టమ్ అంటారు పెద్దలు అంటే ఎవరు ఏ వాఙ్మయాన్ని చెప్పిన అది వ్యాసులవారు ఏది చెప్పారో దాని నుంచే చెప్పబడింది తప్ప వేరుగా ఏది లేదు అని. అంత గొప్ప వాఙ్మయాన్ని ఇచ్చారు. మనకి ఇంతటి భక్తి, జ్ఞాన బోధనలు చేసి, గురు పరంపరను తీస్కొని వచ్చి సనాతన ధర్మాన్ని ప్రచారంగావించిన అటువంటి మహాపురుషుడికి గురుపౌర్ణమి రోజున పూజ చేసుకోవడం మన అదృష్టం.
అలాంటి గొప్ప అదృష్టం ని అందిపుచ్ఛుకొకుండ మన పురాతనమైన సంస్కృతి ని వేదాలను అపహస్యం చేస్తు మన వేద పండితుల ను గురువర్యులను పక్కున పెట్టి ముస్లిం బాబా లను సాయిబులను గురువులను చేస్తున్నాం
మన భారత దేశ సనాతన ధర్మం ని భ్రష్టు పట్టిస్తున్నం మన వేలితో మన కంటినే పొడుచుకుని గుడ్డివలం అవుతున్నాం ఇక నుంచైనా మారుద్దాం మన ధర్మాన్ని సంస్కృతి ని వేదాలను మనకు అందించిన గురువులను గుర్తించి వారిని గౌరవించి మన సనాతన ధర్మాన్ని మనమే రక్షించుకుందాం
శ్రీమన్నారాయణుడి అంశావతారమైన వ్యాస మహర్షులవారిని గురు పౌర్ణమి రోజున స్మరించినందువలన మన పాపరాశి దగ్దమైపోతుంది.
- శ్రీ గురుభ్యోనమః
అద్వైత సత్యం
అద్వైత సత్యం
ద్వైతం అనేది వ్యావహారికం. అద్వైతం అనేది పారమార్థికం. భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటేగానీ మనం భగవంతుడిని పూజించలేం. జ్ఞానం వచ్చేంత వరకు ద్వైతం ఉపయోగపడుతుంది. జ్ఞానం వచ్చాక అద్వైతం మాత్రమే ఉంటుంది.
నిద్రలో కల కంటున్నంతసేపు అది కల అని తెలియదు. బాహ్యస్మృతిలోకి వచ్చాక మాత్రమే అది కల అని తెలుస్తుంది. ద్వైతంలో ఉన్నా, విశిష్టాద్వైతంలోకి వెళ్లినా, ఆఖరికి అద్వైతంలోకి రావలసిందే. ఎందుకంటే, జగత్తు అంతా మిథ్య, బ్రహ్మం ఒక్కడే అంటే అందరూ అర్థం చేసుకోలేరు. ఈ ఉపాసనలు, ఆరాధనలు అద్వైతం కోసమే. కాబట్టి ఏ సిద్దాంతం ఆచరిస్తున్నా చివరికి అద్వైతానికి చేరుకోవాల్సిందే.
ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా ఏ వ్యత్యాసమూ లేదు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే. కానీ రూపాలు, నామాలు అనేకం ఉన్నాయి. ఆ రూపాల వెనకాల ఉండే చైతన్యరూపం మాత్రం ఒక్కటే. మనం ఈశ్వరుణ్ణి ఆరాధించినా, విష్ణువును ఆరాధించినా ఫలంలో ఎటువంటి తేడా లేదు. ఈశ్వరుడు ఎటువంటి ఫలాన్నిస్తాడో, విష్ణువు కుడా అదే ఫలాన్నిస్తాడు. ఇతర దేవతలు అదే విధమైన ఫలాన్ని ప్రసాదిస్తారు.
మనం వినాయకచవితికి గణపతిని, నవరాత్రికి అమ్మవారిని, శివరాత్రికి శివుణ్ణి, ఇలా ఏ పర్వదినానికి తగ్గట్టు ఆ దేవుడుని పూజిస్తాం. అలాగని మనం నలుగురు దేవతలను ఆరాధించినట్టు కాదు. ఒకే దేవుణ్ణి నాలుగుమార్లు పూజించినట్టు. మరి ఎందుకని అన్ని రూపాలు అంటే, సాధకులను అనుగ్రహించడం కోసం భగవంతుడు వారికి రుచించిన రూపంలో వస్తాడు, అందుకనే ఇన్ని రూపాలని ఆదిశంకరులు చెబుతారు.
చాతుర్మాస్యలు
🕉 *రేపటినుండి చాతుర్మాస్యలు*
చాతుర్మాస్యము- అవశ్య కర్తవ్యము
*ఆషాఢే తు సితే పక్షే*
*ఏకాదశ్యా ముపోషితః|*
*చాతుర్మాస్య వ్రతం కుర్యా*
*ద్యత్కించిన్నయతో నరః’’||*
చాతుర్మాస్యం గురించి ఇతిహాసం ఒకటి ప్రాచుర్యంలో ఉంది. బ్రహ్మ దేవుడు సృష్టి నిర్మాణం చేస్తూ అలసిపోయి నిదురించాడట. అది గమనించిన దేవతలు ఒక యజ్ఞం చేసి, అందులోనుంచి ఉద్భవించిన హవిస్సును బ్రహ్మకు ఇచ్చారట. అది ఔషధంలా పని చేసి ఆయన అలసటను పోగొట్టిందట. ఆ యజ్ఞమే వ్రతంగా చెప్పబడింది. నియమనిష్ఠలతో, శ్రద్ధతో
నిర్వహించే కర్మానుష్ఠానమే వ్రతం.
బ్రహ్మ సృష్టి కార్యం చేస్తూ ‘ఏకం’, ‘ద్వే’, .త్రీణి’, ‘చత్వారి’ అంటూ నాలుగు సార్లు ఆజ్యాన్ని సమర్పించి, చివరగా ఒక సమిధను కూడా వేశాడు. ఫలితంగా-దేవతలు, దానవులు, పితరులు,
మానవులు అనే నాలుగు రకాల జీవులను సృష్టించి, వారికి రోమములు, మజ్జ మాంసములు, ఎముకలను కూడా ఇచ్చాడు. ‘మాసం’ అనే పదానికి జ్ఞానం అనే అర్థం ఉంది. ‘ఈ నాలుగు రకాల
జీవులలో జ్ఞానాన్ని ఉంచడం కూడా ఈ వ్రత దీక్ష లక్ష్యం’ అని తైత్తరీయ బ్రాహ్మణం అంటోంది. మరొక నిర్వచనం ప్రకారం చతుర్ముఖుడైన బ్రహ్మ లక్ష్మితో కలిసి సృష్టి చేశాడు. ‘చతుః+ మా+అస్యం చాతుర్మాస్యం’. నాలుగు లక్ష్ములు ముఖాలుగా- నాలుగు వేదాలు చెప్పినవాడు బ్రహ్మ. వేదలక్ష్మే శ్రీవిద్య. ఈ నాలుగు నెలలూ- ప్రతిరోజూ వేదాలను పూజించాలి. అధ్యయనం, అధ్యాపనం చేయడం ముఖ్యమైన అనుష్ఠామంగా భావన చేయాలని ఉపనిషత్తు అంటోంది.
చాతుర్మాస్య వ్రతమును ప్రతియొక్కరూ తప్పకుండ ఆచరించి తీరవలెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, విధవాస్త్రీ, రజస్వలా, ముత్తైదువ, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థ, సన్యాసి మొదలగువారు ఈ వ్రతమును వదలకుండ చేసి తీరవలెనని శాస్త్రాలు చెబుతున్నవి. ఇటీవలి కాలంలో యతులు
మాత్రమే ఆచరిస్తున్న కారణంగా- చాతుర్మాస్య వ్రతాన్ని సన్యాసులు లేదా పీఠాధిపతుల కార్యక్రమంగా భావిస్తున్నాం. వాస్తవానికి అన్ని వర్గాల వారు సర్వ ఆశ్రమాల వారు చాతుర్మాస్య వ్రతం పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
*నిత్యం కార్యం చ సర్వేషాం ఏతద్ వ్రత చతుష్టయం౹*
*నారీభిశ్చనరైర్వాపి చతురాశ్రమ వర్తిభిః॥*
*బ్రాహ్మణః క్షత్రియః వైశ్యః స్త్రియః శూద్రో ప్రతీయథా॥*
*గృహీ వనస్థః కుటచోబహూదః పరమహంసకః॥*
*నరకాన్న నిర్వర్తంతే త్యక్త్వా వ్రత చతుష్టయం॥*
చాతుర్మాస వ్రతం ఆచరించడమనేది ఇటీవలి కాలంలో వచ్చినది కాదు. యుగయుగాలుగా ఆచరణలో ఉందని విష్ణు ధర్మోత్తర, భవిష్య, స్కాంద పురాణాలలోని కథనాల వలన అవగతమవుతుంది. ఒకప్పుడు ఇప్పటిలాగా కాక నాలుగు నెలలుపాటు కొనసాగే ఋతువులు మూడే ఉండేవట. అనంతర కాలంలో రెండేసి నెలల పాటు ఉండే ఆరు ఋతువులుగా అవి మారాయి. తొలినాళ్ళలో వర్ష, హేమంత, వసంతం - అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి. వర్ష ఋతువుతోనే సంవత్సరము
ఆరంభమవుతూ ఉండేది. ఈకారణం వల్ల సంవత్సరానికి " వర్షం" అనే పేరు వచ్చింది. సంవత్సరానికి మూడు ఋతువులున్న ఆ కాలములో ఒక్క ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు. ఆషాఢ పూర్ణిమ నుండిషవరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుండి సాకమేద యజ్ఞం, ఫాల్గుణ పూర్ణిమ నుండి వైశ్వ దేవయజ్ఞము చేస్తూ ఉండేవారు. ఆనాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే అనంతర కాలం నాటికి చాతుర్మాస్య వ్రతము గా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతున్నారు. చాతుర్మాస వ్రతము పాటించేవారు. ఆహార నియమాలలో భాగంగా శ్రావణమాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగును ఆశ్వయుజమాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి. వాటిని ఆహారముగా ఏమాత్రము స్వీకరించ కూడదు. పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చును. ఈ ఆహార నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మసంబంధ రోగాల నుంచి కాపాడుకోవటానికి బాగా ఉపకరిస్తాయి. ఇలా ఎటు చూసినా చాతుర్మాస్య వ్రతదీక్ష అనేది మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రతదీక్ష అని పురాణ వాఙ్మయం వివరిస్తోంది.
*ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్*
*వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్*
*దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః*
చతుర్మాసాలు అంటే, ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల సమయం నాలుగు నెలలు. ఆషాఢ, శ్రావణ, బాధ్రపద, ఆశ్వయుజ మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి. చివరిది దేవ ఉత్థాన ఏకాదశి. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తాడు. విష్ణువు శయనించే కాలంలో సాధకులు భూశయనం చేయటం, ఆకుకూరలు, వెల్లుల్లి, సొరకాయ, టమాట, ఆవనూనెల సేవనం మానివేయటం, నిరంతర జప, తప, హోమ, పురాణ కథా శ్రవణాల్లో కాలం గడపటం, రోజూ ఒకే పూట భోజనం చేయటం, ఏకాదశులలో పూర్తిగా ఉపవాసదీక్ష చేయటం వంటి దీక్షా ధర్మాలను పాటిస్తారు. పీఠాధిపతులు, దీక్షితులు ఒకే స్థానంలో నివసించటం, క్షురకర్మలు నిషేధించడం వంటి నియమాలు పాటిస్తారు. శ్రావణ, బాధ్రపద మాసాలు గృహస్థుల నియమాలకు సరైనవని పద్మపురాణం
తెలుపుతోంది. బాధ్రపద కృష్ణ ఏకాదశిని అజా మ ఏకాదశి అంటారు. ఇది సమస్త పాపాలను
తొలగిస్తుందంటారు.
హరిశ్చంద్ర మహారాజు సత్యం, ధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్ల పాలైనప్పటికీ చాతుర్మాస్యవ్రతాన్ని మరువలేదని, చివరికి విజయం చేకూరిందని చెబుతారు. చాతుర్మాస్యవ్రతము త్యజించినచో
మహాదోషము.
*అవ్రతేన నయేద్యస్తు చాతుర్మాస్యమనుత్తమం॥*
*సపాపీ నరకం యాతి యావదాభూత సంప్లవం॥*
వ్రతము చేయకుండ ఎవరైతే ఈ చాతుర్మాస్యాన్ని గడిపెదరో అటువంటివారు మహాప్రళయకాలపర్యంతము నరకములో పడతాడు. వ్రతము చేయుట వలన మహాపుణ్యము లభిస్తుంది.
*ఇదం వ్రతం మహాపుణ్యం*
*సర్వపాపహరం శుభం॥*
*సర్వాపరాధ శమనం*
*సర్వోపద్రవనాశనం॥*
ఇతర వ్రతములు
*పరాకం షష్టకాలం చ తథా ధారణపారణం౹*
*లక్షవర్తివ్రతం చైవ భీష్మ పంచకమేవ చ॥*
*తథాలక్షనమస్కారవ్రతం లక్ష ప్రదక్షిణమ్॥*
*చాతుర్మాస్యే వ్రతాన్యాహుః ఏతత్ కామ్యమితీరిత॥*
శాకాదివ్రతములే కాక, పరాకవ్రతము, షష్ఠకాల వ్రతము, ధారణ పారణ వ్రతము, లక్ష ఒత్తులవ్రతము, భీష్మపంచకవ్రతము, లక్ష నమస్కార వ్రతము, లక్ష ప్రదక్షిణ వ్రతము, తులసీ, గో ప్రదక్షిణము, గోదానము ఇత్యాది వ్రతములు కూడా చేయుట వలన విశేషపలములు లభించును.
*శ్రావణే వర్జయేత్ శాకం దధి భద్రపదే తథా౹*
*దుగ్ధ మాశ్వయుజే మాసి కార్తికే ద్విదళాం తథా॥*
శ్రావణ మాసంలో కూరగాయలను, భాద్రపద మాసంలో పెరుగును, అశ్వయుజ మాసంలో పాలు, పాలపదార్ధాలనూ, కార్తీకంలో రెండు బ్రద్దలుగా విడివడే పప్పుధాన్యాలూ లేదా పప్పుతో చేసిన
పదార్ధాలనూ త్యజించాలి. దీనికి కారణాలు ఏమిటంటే, ఋతువులు మారుతున్న సమయంలో వ్యాధులు ప్రబలుతాయి. ముఖ్యంగా గ్రీష్మం నుంచి వర్ష ఋతువు, ఆపైన శరదృతువు కాలంలో వీటి ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. ఈఋతువుల సంధ్య కాలాన్ని యమద్రంష్టలని అందుకే అన్నారు. శాస్త్ర రీత్యా ఆషాఢంలో కామోద్దీపకం హెచ్చు. అందుకే నూతన దంపతులను దూరంగా ఉంచుతారు. భాద్రపదంలో వర్షాలతో నదులలో నీరు బురదమయంగా ఉంటుంది. ఆ నీరు తాగితే రోగాల బారిన పడతారు. అజీర్ణం లాంటి వ్యాధులు ప్రాప్తిస్తాయి. వీటిని నియంత్రించడానికి నియమిత ఆహారం, ఉపవాసాలు ఈ నాలుగు మాసాల్లో చెయ్యాలి. వీటినే చాతుర్మాస్య నియమంగా- ఆరోగ్య రీత్యా చెప్పడం జరిగింది. ఈ నాలుగు నెలల్లో ఎన్నో పండుగలు, పర్వాలు పేరిట కట్టడి చేయడం కూడా జరిగింది. వ్రతాలు, మహాలయ పక్షాలు, శరన్నవరాత్రులు, కార్తీక స్నానాలు, శివారాధనలు ఇలా ఏర్పాటు చేసినవే.
శాక వ్రతము:-
శాక వ్రతములో సకల కూరగాయలను మ త్యజించవలెను. దశవిధములైన శాకములు. శాకములనగా కేవలము కూరగాయలని అర్థము కాదు. చెట్టుకు సంబంధించిన, మూలము, పత్రము, కరీరము, మొలకలు, చెట్టు అగ్రభాగము, ఫలములు, కాండము, వేరు, పండు, దంటు, చెక్క, పూవు, తొక్క, మొగ్గుచిగురు, ఆకులు, ఆకుకూరలు, కరివేపాకు, ఇవే మొదలైనవాటిని శాకవ్రతములో వర్జ్యము.
శాకవ్రతములో స్వీకరించుటకు యోగ్యములు:-
బేడలు, తులసీ, అతసీ, బ్రాహ్మీ, మిరియాలు, జీలకర్ర, ఎండుశొంఠి, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ఇంగువ, ఎండిన ఉసిరికాయ ఉపయోగిస్తారు.
ప్రప్రథమముగా చాతుర్మాస్య వ్రతసంకల్పమును చేసుకొనవలెను. ప్రథమ మాసములో శాక వ్రతమును, ద్వితీయ మాసములో దధి వ్రతమును, తృతీయ మాసములో క్షీర వ్రతమును, నాల్గవ మాసములో 'ద్విదల' మరియు బహుబీజ వ్రతమును
ఆచరించవలెను.
కర్కాటక సంక్రమణం నుండి కానీ, అషాఢ శుక్ల దశమి, ఏకాదశి, పూర్ణిమ తిథి నాడు ప్రారంభించి
కార్తీక శుద్ధ ద్వాదశి, పౌర్ణమికి సమాప్తి చేయవలెను.
*సుప్తే త్వయిజగన్నాథ జగత్సుప్తం భవేదిదం౹*
*విబుద్ధే చ విబుద్ధ్యేత ప్రసన్నోభవ మేకచ్యుత॥*
*చతురో వార్షికాన్ మాసాన్ దేవ దేవ జగత్పతే౹*
*నిర్విఘ్నం సిద్ధిమాయాతు ప్రసాదాత్ తవకేశవ॥*
*గృహీతే॑స్మిన్ వ్రతే దేవ పంచత్వం యదిమేభమే౹*
*తదాభవేత్ సుసంపూర్ణం ప్రసాదాత్తే జనార్దన॥*
ఈ విధముగా ప్రార్థించవలెను. పంచగవ్య శుద్ది చేసుకొని, అచమన, ప్రాణాయామ,
సంకల్పంతో శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర రూపాణాం ప్రీతిం కామయమానః చాతుర్మాస్య వ్రతాంగ శాకవ్రత, దధివ్రత, క్షీరవ్రత ద్విదళ వ్రతాఖ్య చతుర్విధ వ్రతం స్వీకరిష్యే.
శాకవ్రత సంకల్పము
(ఆషాఢ శుక్ల ద్వాదశీ- పూర్ణిమ):
*శాకవ్రతం మయాదేవ గృహీతం పురతస్తవ।*
*నిర్విఘ్నం సిద్ధి మాయాతు ప్రసాదాత్ తే రమాపతే॥*
శాక సమర్పణ:-
*ఉపాయనమిదం దేవ వ్రత సంపూర్తి హేతవే౹*
*శాకంతు ద్విజవర్యాయ స హిరణ్యం దదామ్యహం॥*
దధివ్రత సంకల్పము :
(శ్రావణ శుక్ల ద్వాదశీ-పూర్ణిమ)
*దధిభాద్రపదే మాసి వర్ణయిష్యే సదాహరే॥*
*ఇమంకరిష్యే నియమం నిర్విఘ్నం కురు కేశవ॥*
దధివ్రత సమర్పణము:-
*ఉపాయనమిదం దేవ వ్రత సంపూర్తి హేతవే౹*
*ద్విజవర్యాయ దాస్యేంహంస హిరణ్యం ఘనం దధి॥*
క్షీర వ్రత సంకల్పం
(భాద్రపద శుక్ల ద్వాదశీ-పూర్ణిమ)
*క్షీరవ్రతమిదం దేవ గృహీతం పురతస్తవ౹*
*నిర్విఘ్నం సిద్ధిమాయాతు ప్రసాదాత్ తే రమాపతే॥*
క్షీరవ్రత సమర్పణ :-
*ఉపాయనమిదం దేవ వ్రత సంపూర్తి హేతవే౹*
*క్షీరంతు ద్విజవర్యాయ స హిరణ్యం దదామ్యహం॥*
ద్విదళవ్రత సంకల్పము:-
(ఆశ్వయుజ శుక్ల ద్వాదశీ)
*కార్తికే ద్విదలంధాన్యం వర్ణయిష్యే సదాహరే॥*
*ఇమంకరిష్యే నియమం నిర్విఘ్నం కురు కేశవ॥*
ద్విదళ సమర్పణ :-
*ఉపాయనమిదం దేవ వ్రత సంపూర్తి హేతవే౹*
*ద్విదలం ద్విజవరాయ స హిరణ్యం దదామ్యహం॥*
చాతుర్మాస్యవ్రత సమర్పణ
*ఇదం వ్రతం మయాదేవకృతం ప్రీత్యై తవప్రభో౹*
*న్యూనం సంపూర్ణతాం యాతు త్వత్ప్రసాదాత్ జనార్ధన॥*
అదీ కాకుండా, పరివ్రాజకులు గ్రామాల్లో సంచరిస్తే, వారి బాగోగులు చూడడానికి పల్లెవాసులకూ, గృహస్థులకూ ఇబ్బంది. ఎందుకంటే వారంతా వ్యవసాయ పనుల్లో మునిగి ఉంటారు. అందువల్ల పరివ్రాజకులు ఏదో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని, నాలుగు మాసాలపాటు తమ సమయాన్ని భగవత్ చింతనతో పాటు ధర్మప్రచారానికే వినియోగించాలని నియమం ఏర్పాటు చేశారు. అందరూ ఆరోగ్యవంతమైన జీవితాలు గడపాలని హిందూ ధర్మశాస్త్రాలు ఆకాంక్షించాయి. ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమయమైన కుటుంబవ్యవస్థ, సాంఘిక వ్యవస్థలతో ప్రజలంతా మనుగడ సాగించాలన్న సదుద్దేశంతో మన పూర్వ ఋషులు సంస్కృతి, సంప్రదాయం పేరుతో ఏర్పరచిన వ్రతం ఇది. జీవితంలో ఒక్కసారి చాతుర్మాస్య వ్రతాన్ని అనుసరించినా, దాని ఫలితాన్ని కలకాలం అనుభవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.
సుభాషితమ్
. 🕉️
_*సుభాషితమ్*_
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*వేధా ద్వేధా భ్రమం చక్రే*
*కాన్తాసు కనకేషు చ*।
*తాసు తేష్వనాసక్తః*
*సాక్షాద్భర్గో నరాకృతిః॥*
తా𝕝𝕝
బ్రహ్మ.....మానవులకు రెండు విధములైన భ్రమలని కల్పించెను అవి స్త్రీల యందు మరియు బంగారము యందు.....ఈ రెంటి యందు ఆసక్తి లేనివాడు సాక్షాత్తు మనుష్య రూపంలో ఉన్న శివుడే.
బ్రాహ్మీ మూర్తి! విశ్వనాధ!!
బ్రాహ్మీ మూర్తి! విశ్వనాధ!!
శ్రీ వాడపల్లి రామమోహనరావుగారు.సాహితి సౌజన్యంతో.
విశ్వనాథవారిని బ్రాహ్మీమూర్తి అని పండిత లోకం కీర్తించింది. ఈ బ్రాహ్మీమూర్తిమత్వం విశ్వనాథకు కేవలం సంస్కృతాంధ్ర సారస్వతాలలో ఆయనకున్న గొప్ప అభినివేశానికి సంబంధించినది మాత్రమే కాదు.ఆయనలోని ఆలోచనావిధానం పరిపక్వస్థితిని గాంచి రసాలూరుతూ పరిమళాలు వెదజల్లే, భావసమాహారంగా వెలువడిన ఆయన రచనలలో కనబడే తానెంచుకున్న వస్తువు యొక్క ఔన్నత్యం,భావౌన్నత్యం,భాషా ప్రౌఢిమ ఇవన్నీ కలిసిన ఒకానొక మేలుకలయికగా నిలచిన ఒక మహాతత్త్వం అనిపిస్తుంది. ఇంకా ఆలోచించి చూస్తే అది మాత్రమే కాదేమో అని మళ్ళీ! ఇదంతా ఆయన పూర్వజులనుంచి వచ్చిన మహాసంస్కార ఫలం. ఆయన గురువుల నుంచి నేర్చిన 'సదసద్వివేక చతురత.' తన తండ్రిగారు శోభనాద్రిస్వామి పిలిచి అబ్బాయీ!
"వ్రాసిన రామచంద్రు కధ వ్రాసితివం చనిపించుకో..."
అన్న తండ్రి యాజ్ఞ యును, జీవుని వేదన - ఈ రెండూ కలిసి ఆయనకు సారస్వతాభినివేశమూ,భావౌన్నత్యమూ ఇచ్చేయి. రామాయణ కల్పవృక్ష రచనకు పురికొల్పాయి సరే. కాని ఇక్కడ జీవుని వేదన అన్నది ఇంకా పరిశీలన చేయాల్సి ఉందేమో. ఈ జీవుని వేదన ఇంతటితో ఆగిందా!లేదనిపిస్తుంది. వేదవర్గీకరణ,అష్ఠాదశ పురాణాలు,మహాభారత రచన ఇన్ని చేసిన వ్యాస మహర్షికి జీవుని వేదన శాంతించలేదు. నారదుణ్ణి రప్పించుకుంది.నారదుని సలహా మీద శ్రీమద్భాగవత రచన చేసినప్పుడు గాని ఆయన జీవుడు శాంతించ లేదు. ఎన్నో చారిత్రక ఇతివృత్తాలను తీసుకుని వాటి ద్వారమున ఉజ్వల ప్రాచీనభారత చరిత్రకు సంబంధించిన వాస్తవాలు పురాణవైరగ్రంథమాల రూపంలో తెచ్చే బృహత్ప్రయత్నం చేశారు విశ్వనాథ. తన కిష్టమైన వైదిక జీవనవిధానానికి సంబంధించిన ఎన్నో ఇతివృత్తాలను చేపట్టి తత్త్వం,తర్కం అనే రెండు పంచకళ్యాణులను పూన్చిన తన రచనారధాన్ని నడిపారు.జీవితంలోని గహనమైన దుఃఖాలను తవ్వుకుని తవ్వుకుని రచనలు చేశారు. వీటివల్ల జీవుని వేదన పెరిగిందే గాని తరుగ లేదు. ఓ పక్క రామాయణ రచన సాగుతూనే ఉంది. మరో పక్క ఆ జీవుని వేదన పెరుగుతూనే ఉంది.
మొన్నటి వ్యాసంలో తన కావ్యానంద ప్రధమ ముద్రణ 1972 లో జరిగిందని వ్రాశాను. అంటే అప్పటికి కావ్యానందము రచన ప్రారంభించి సంవత్సరం పై మాటే. నిజానికి ఈ కావ్యవిమర్శనా రచనలు నాలుగు భాగాలు.
కావ్యానందము
కావ్యపరీమళము
సాహిత్య సురభి
సాహిత్యోపన్యాసములు.
ఈ నాలిగింటిలో కావ్యానందము మకుటాయమానమైన రచన. ఇతర రచనలన్నీ తన జీవితంలో ముందు సాగగా కావ్యానందము తన జీవుని వేదన పరాకాష్టనొందిన సమయానమ్మవారు తనలో చేరి రాయించినదనిపిస్తుంది.
ఆయన తన కల్పవృక్ష అవతారికలో నన్నయతిక్కనలు తనను ఆవేశించారని రాశారు.కాదేమో!
ఆయన వచనంలో కాని పద్యంలో కాని వాక్య విన్యాసం,పదాలను తన భావనలకనుగుణంగా సరిపోయేవి - అంటే తన భావనను యధాతధంగా దింపే పదాలను పొందుపరచి చెప్పదలుచుకున్న విషయం సూటిగా చెప్పేతీరు,ఆ భాష చూస్తుంటే - భాష మళ్ళీ గొప్ప గ్రాంధీకమో,వ్యాకరణపరిష్కృత శిష్టవ్యావహారికమో కూడా పూర్తిగా కాదు.చాలా మామూలు వ్యవహారశైలిలో ఉంటుంది. చెప్తున్నది ఆయన కాదేమో,ఆయన్ను ఆవేశించిన సరస్వతీదేవి చెప్తూంది అనిపిస్తుంది.ఇందులో ఏదో అతిశయోక్తిగా చెప్పాలన్న ఉద్దేశమేమీ లేదు. ఈ గ్రంథం, కావ్యానందం ఒక కథావస్తు సహితమైనది కాదు. కథాబలం వల్ల ఇష్టంగా చదవటానికి కావలసిన అంశాలిందులో లేనే లేవు.రాసిన ప్రతి వాక్యంలోనూ ఒక చంటిపిల్లవాణ్ణి కూర్చోపెట్టి అమ్మ ప్రేమ మీరగా చెప్పిన తీరు ద్యోతకమౌతుంది.కొన్ని కొన్ని వాక్యప్రయోగాలు ఆయనవి ఆనందం వల్లనా,దుఃఖం వల్లనా? ఎందుకు వస్తున్నాయి అన్నది తెలియనీయకుండా కన్నీళ్ళు తెప్పిస్తాయి.ఇది నిజం! ఆయన చేపట్టిన ఏ విషయాన్నైనా దాని మూలభావన నిరూపణకు ఆయన కొనసాగించే భావనాక్రమం,దానికోసం వాడే భాష - ఒకదానికోసం ఒకటి అన్నట్టు దర్శనం అవుతుంది. అది ఎంత ప్రేమాస్పదంగా ఉంది అనిపిస్తుంది.
నిన్నటి వ్యాసంలో ఆఖరి పేరాలో ఆయన మాటలు చూడండి.."రెండువందల యేండ్లనుండి....పరిమిత సంఖ్యాకులయందైనా దాని యచ్చత్వం అది నిలబెట్టుకొనుచునే యున్నది...ఈ కొత్తమార్పును కూడ తట్టుకొన గలదు. కాని దైవమనుకూలించక...😢 ఈ వాక్యాలలో సారస్వతం ఒకదేవతామూర్తిగా ఆవిర్భవించిన వైనం కనబడుతుంది.ఆ దేవత కన్నీళ్ళు కారుస్తున్నట్టు...
పోతనగారు. "కాటుక కంటినీరు చనుకట్టుపయిన్ బడ ఏల యేడ్చెదో..."అని ఓదారుస్తున్నప్పుడు శోకమూర్తియైన అమ్మవారు ఇక్కడ గోచరిస్తుంది. అక్కడ. "ఇమ్మనుజేశ్వరాధములకమ్మా" లని అనుకుంటున్నాడేమో అని ఆవిడ ఏడ్చింది.
ఇక్కడ నేరుగా తనను హత్య చేస్తారేమో అని ఏడుస్తూన్నట్టు అనిపిస్తుంది. ఐతే ఇక్కడ ఆవిడ దుఃఖ స్వరూపం వేరు. తను హత్యకు గురైతే తనను నమ్ముకున్న తన బిడ్డలగతేంటనే ఈవిడ దుఃఖం.నేను లేకపోతే మీరెలా బ్రతుకుతార్రా అబ్బాయీ! అన్న తల్లి వేదన. విశ్వ నాథవారి జీవుని వేదన పరాకాష్ట పొందినవేళ స్వయంగా అమ్మవారే వచ్చి తన జీవుని ఆవేశించి పలికించిన పలుకులు కావ్యానందం అనిపిస్తుంది. ఈ గ్రంథంలో ఆఖరు
వ్యాసం "స్వయంభువు" అన్న శీర్షికన వ్రాసినది. ఇది చాలా ఉత్కంఠ కలిగించే చర్చ. దీనిగురించి మరోసారి వ్రాస్తాను. కాని ఈ వ్యాసం చివర శ్లోకం చూస్తే జీవుని వేదన పరాకాష్ట పొందిన మీదట అమ్మవారు జోకొడితే పొందిన శాంతి వల్ల చిన్నపిల్లవాడి నోటినుంచి వచ్చే '...ఊఊఊ...'అనే శబ్దాలవంటిదనిపిస్తుంది.
"అర్చామీతి ధియా యదేవకుసుమం భిత్త్వాజనో ముచ్చతే
నధ్యామీతి.ధియా తదేవ వికిరన్ భస్మీకృతో మన్మథః
యశ్చాభ్యాంతర వృత్తి మాత్ర రసికో సాక్షాత్స్వయంభూ పుమాన్
సస్స్వామీ మమదైవతం తదితరో నామ్నా పినామ్నాయతే.
అమ్మవారు జీవుని ఆవేశించి కొనిపోయి వృత్తి వృత్తిమాత్ర రసికుడైన పరమేశ్వర విభూతి స్వయంభువుగా ఇక్కడ ఆత్మలో ప్రతిష్ఠించుకున్న స్వామి ఎదుట నిలబెట్టింది. పరమశాంతిని పొందిన భావన!
అందుకే విశ్వనాథ బ్రాహ్మీమూర్తి!
🌺🙏🌺
వసుచరిత్రలోని
వసుచరిత్రలోని
శబ్దచమత్కారాలు!!
శుక్తిమతీ వర్ణనం!
శబ్ద చమత్కారాలకు పుట్టినిల్లు 'వసుచరిత్ర' శుక్తిమతిని నదిగా, స్త్రీగా వర్ణించే పద్యం
లో చక్కటి శ్లేష వైచిత్రి గోచరిస్తుంది.
జీవనమెల్ల సత్కవి నిషేవిత మాశయమెల్ల నచ్ఛతా
పావనతా, గభీరతల పట్టు ప్రచారములెల్ల విశ్వ ధా
త్రీ వలయ త్రికాల ఫల దేశిక ముల్నవ కంబు లెల్ల ము
క్తావళి విభ్రమాస్పదము, లానది పెంపు నుతియింప శక్యమే
అర్థము:--ఆమె జీవితమంతా కవుల పొగడ్తలతో నిండింది. ఆశయాలన్నీ
స్వచ్ఛత,పావనత,గాంభీర్యానికి నిలయం.ఆమె నడవడిక,భూమండలానికి మూడు లోకాలలోనూ శుభఫల సూచకం.ఆమె అందం
జీవన్ముక్తుల్ని కూడా మోహ విభ్రాంతుల్ని చేసేది. ఇది స్త్రీ పరమైన అన్వయం.
నదీపరంగా చూస్తే నీటిపక్షులతో(జీవనమంటే జలమనీ,కవులంటే నీటి పక్షులని
అర్థం వుంది.)
జల పక్షులు స్వచ్చమైన,పవిత్రమైన, లోతైన,జలాశయాలతో కూడినవి.ముత్యాల
సమూహానికి ఆధారభూతమైన శంఖాలతో ప్రవేశించేవి. ఇందులో సమాసోక్త అలంకారం వుంది. సంస్కృత,తెలుగు భాషా శ్లేషలు,మిశ్రమ భాషా శ్లేషలు,సంధిలో శ్లేషలు,జాతీయాల్లో శ్లేషలు యిలా ఎన్నో విధాల శ్లేషలు ప్రయోగించాడు భట్టుమూర్తి.
------------------- స్వస్తి--