20, ఫిబ్రవరి 2025, గురువారం

విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (56)*


*అజో మహార్హః స్వాభావ్యో*

*జితామిత్రః ప్రమోదనః ।*


*ఆనందో నందనో నందః*

*సత్యధర్మా త్రివిక్రమః ॥* 


*ప్రతి పదార్థం:~*


*523) అజః: - జన్మము లేనివాడు.*


*524) మహార్హః: - పూజింపదగిన వాడు*


*525) స్వాభావ్యః: - స్వభావ పరంగా ప్రభువు; జీవులచే సదా ధ్యానింప  తగినవాడు*


*526) జితామిత్రః : - కామక్రోధాదులను జయించిన వాడు; అమిత్రులను జయించినవాడు;*


*527) ప్రమోదనః : - భక్తులకు ఆనందము కలిగించువాడు; సదానంద స్వరూపుడు*


*528) ఆనందః : - ఆనంద స్వరూపుడు.*


*529) నందనః : - సర్వులకు ఆనందము నొసగువాడు.*


*530) నందః: - సమస్త సుఖ సంతోష భోగములతో పరిపూర్ణుడైన వాడు;*


*531) సత్యధర్మా - తన ధర్మమును సత్యముగా (తప్పక) నిర్వర్తించువాడు .*


*532) త్రివిక్రమః: - మూడు అడుగులతో ముల్లోకముల అంతటా వ్యాపించినవాడు;*


*తాత్పర్యము:~*


*పుట్టక లేనివాడును, చక్కగా పూజించుటకు అర్హుడైన వాడును, నిరంతరమును  తన స్వస్వరూపాత్మలో యుండువాడును, జయింపబడిన శత్రువులు కలవాడును, సర్వ శత్రు సంహారకుడును, ఆనందము కలిగించువాడును, ఆనంద స్వరూపుడును, తన్నాశ్రయించినవారికి ఆనందము కలిగించువాడును, సమస్త సుఖ శాంతులతో కూడినవాడును, సత్యమునకు ధర్మమునకు మూలమైనవాడును, మూడు పాదములచేత ముల్లోకములను ఆక్రమించినవాడును, త్రివిక్రముడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*


*పాఠకులందరికీ శుభం భవతు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

       ‌        *సూచన*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*చిత్త నక్షత్రం 4వ పాదం జాతకులు పై 56వ శ్లోకమును, నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు మంచి ఫలితాలు పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఈ శ్లోకంలో శంకరులు సాయుజ్య ముక్తికి దగ్గర సాధనమైన శివ సాన్నిధ్యమును గూర్చి , తత్తరపాటును ప్రదర్శించారు. కైలాసానికి చేరి శివునికి నమస్కరిస్తూ  తన కాలాన్ని సుఖంగా గడపాలనే‌ ఆకాంక్షనూ వెలిబుచ్చారు.*


*శ్లోకం: 24*


*కదవా కైలాసే _ కనకమణి సౌధే సహగణైః*

                       

*వసన్ శంభో రగ్రే  _ స్ఫుటఘటిత మూర్థాంజలి పుటః*

                       

*విభో ! సాంబ ! స్వామిన్ ! _ పరమ శివ ! పాహీతి నిగదన్*

                       

*విధాతృూణాం కల్పాన్ _ క్షణమివ వినేష్యామి సుఖతః !!*


*పదవిభాగం :~*


*కదా _ వా _ కైలాసే _ కనకమణి సౌధే _ సహ _ గణైః _ వసన్ _ శంభోః _ అగ్రే _ స్ఫుట ఘటిత మూర్థాంజలి పుటః _ విభో, _ సాంబ _ స్వామిన్ _ పరమశివ _ పాహి _ ఇతి _ నిగదన్ _ వధాతృూణాం _ కల్పాన్ _ క్షణమ్  _ ఇవ _  వినేష్యామి  _ సుఖతః.*


*తాత్పర్యం :~*


*కైలాస పర్వతమునందు , మణులతో నిర్మింప బడిన భవనము నందు శివుని ముందు నిలబడి , తలపై చేతులనుంచి నమస్కరిస్తూ  "ఓ సాంబా ! ఓ స్వామీ ! ఓ పరమశివా ! నన్ను రక్షించు" అంటూ ప్రార్థిస్తూ వుంటే బ్రహ్మ కల్పములు  కూడా క్షణ కాలమువలె ఎప్పుడు సుఖంగా గడుపుతానో కదా ! అని శంకరులు తమ తహ తహను వెలిబుచ్చారు.*.


*వివరణ :~*


*ఎక్కువగా సంతోషాన్నిచ్చే కాలక్షేపాలతో దీర్ఘకాలం కొద్దిగా, ఇష్టం లేని పనులు చేయడంలో కొద్ది కాలం సైతం దీర్ఘకాలముగా కనబడడం మనందరికీ అనుభవసిద్ధమే.  నచ్చిన వినోదాలతో గడిపేటప్పుడు కాలం ఎంతయిందో ఎవరూ గుర్తింపరు. గాఢమైన సుషుప్తి సుఖంలో కాలం ఇట్టే గడచి పోతుంది.*


*ఇక్కడ శంకరులు తాను కైలాసం వెళ్ళి , శివుని సన్నిధిలో ప్రమథ గణాలతో నిలిచి , శివునికి నమస్కరిస్తూ  "ప్రభూ ! రక్షించు, స్వామీ ! కాపాడు " అంటూ పెక్కు యుగాల కాలాన్ని నిముషములా గడుప గలనని వారు ఊహల్లో తేలిపోయారు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

షట్కర్మ విధానం

 ప్రాచీన భారతీయ యోగవిద్యలో షట్కర్మ విధానం  - సంపూర్ణ వివరణ.


    ప్రాచీన భారతావనిలో యోగవిద్యకు అత్యంత ప్రాముఖ్యత కలదు.  యోగవిద్యలో "హఠయోగం" అనే యోగవిద్యకు అత్యంత ప్రాముఖ్యం కలదు. ఈ హఠయోగాన్ని ప్రచురపరచిన వారిలో శ్రీ గోరక్ష నాథులు ప్రధానులు . ఈ శ్రీ గోరక్షనాధులు మత్స్యేంద్ర నాథుల శిష్యులు అనియు , గోరక్ష నాథుల శిష్యులు శాoభువులు అనియు అనేక గ్రంథాలలో రాయబడి ఉంది. గోరక్షనాధులు శ్రీ స్వాత్మా రామయోగీంద్రులకు హఠయోగమును భోధించిరి . వీరు హఠయోగ ప్రదీపిక అను గ్రంథమును రచించిరి.


           "హ" అనగా సూర్యనాడి "ఠ " అనగా చంద్రనాడి "హఠ" అనగా సూర్యచంద్ర నాడుల సమగోగ్యము . రాజయోగము శ్రేష్టమైనది మరి హఠయోగము గురించి అడగగా హఠయోగులు చెప్పు సమాధానం ఏమనగా ఈ సంప్రదాయము నందు ప్రాణకళ , చిత్తకళ అను రెండు యోగమార్గములు కలవు.  హఠయోగం ప్రాణకళ , రాజయోగమే  చిత్తకళ . ఆయుర్వేదం నందు అంతఃపరిమార్జనము , బహిహపరిమార్జనము  , శస్త్రప్రణిధానము అని చికిత్సలు మూడు విధానములు హఠయోగము నందు కూడా ఈ మూడే ప్రధానములు . అంతః పరిమార్జన అనగా ఆయుర్వేదము నందు పంచకర్మ విధానము . ఇదియే హఠయోగము నందు షట్కర్మ విధానం .


          ఇప్పుడు మీకు హఠయోగము నందలి షట్కర్మ విధానం గురించి సంపూర్ణముగా వివరిస్తాను.


  ధౌతి , వస్తి , నేతి , త్రాటకము , నౌలి , కపాలభాతి  ఈ ఆరింటిని కలిపి షట్కర్మలు అంటారు.


 *  ధౌతి -


        నాలుగంగుళముల వెడల్పు ఇరవై మూరల పొడుగు కలిగిన వస్త్రమును నీటియందు తడిపి వర్తిగా చుట్టుచూ నోటి మార్గమున కొంచెంకొంచెం మింగి ఆరు అంగుళముల కొన బయటవైపు మిగులునట్లు చూసుకుని మింగుట ఆపి కడుపునందలి అవయవములను కుడిపక్కగానో , ఎడమపక్కగానో నీటి సుడి వలే వేగముగా చుట్టవలెను . ఈ విధముగా చేసి మెల్లమెల్లగా గుడ్డను బయటకి లాగవలెను. ఈ విధముగా చేయుటవలన మర్దన జరిగి శరీరము నందలి 72000 నాడులు మధించబడి ప్రక్కమూలల యందు ఉండు దోషములు బయటకి వచ్చును.


        ఈ ధౌతి పద్దతిలో జలధౌతి , సూత్రధౌతి , వస్త్రధౌతి , పవనధౌతి అను నాలుగు విధములైన ధౌతి కర్మములు కలవు. తైల , ఘృతాది ఔషదాలు శరీర అంతర్భాగము నందు మర్దన చేయుట కూడా ఈ ధౌతి ప్రక్రియ నందే చేరును .


 *  వస్తి  -


              ఈ వస్తి క్రియ నందు వస్తి నిరూహము , అనువాసము అని రెండు రకాలు కలవు.


    గుద ద్వారము నుండి వస్తి యంత్రము ద్వారా కషాయాదులతో చేయు ప్రతిక్రియ నిరూహవస్తి అనబడును.


     ఆయా రోగ నాశకరము అగు తైలాదులతో వస్తి యంత్రముతో చేయు ప్రతిక్రియ అను వాసనవ వస్తి అనబడును.


          చిటికెన వ్రేలు దూరనంతటి రంధ్రములు గలదియు , 8 అంగుళాల పొడవు గలదియు నునుపైనదియు , వెదురుతోగాని , తగరము మొదలగు లోహములతోగాని తయారుచేయబడిన నాళమును గ్రహించి దానికి తైలమును పూసి తెలివిచేత గుద ద్వారమున మెల్లగా లోపలికి చొప్పించి నాభి లోతుగల నీటి యందు ఉత్కఠాసనం న ఉండి నాళము గుండా నీటిని లోపలికి పీల్చి తరువాత చెప్పబోవు నౌళి కర్మచే కడుపును జాడించి నీటిని బయటకి వదులుట .దీనినే వస్తికర్మ అందురు.


         దీనిలో జలవస్తి , వాయువస్తి అని రెండు రకాల పద్ధతులు కలవు. కొందరు గుదము నందు నాళమును ప్రవేశపెట్టకుండానే వస్తికర్మ చేయుదురు. నాళము ఉపయోగించి చేయుటయే నిరపాయకారము .


      ఈ వస్తికర్మలో తిరిగి మూడు విధములు కలవు. అందులో వరసగా నిరూహవస్తి , అనువాసవ వస్తి , ఉత్తర వస్తి అని కలవు.


       ఉత్తర వస్తి అనగా సీసముతో తయారు అయిన సన్నని నాళమును పన్నెండు అంగుళముల పొడవుగలదిగా గ్రహించి పురుషుడి మూత్రనాళము నందు లోపలికి చొప్పించి పాలు , తైలం , జలములను యుక్తిచేత నాళము గుండా పంపి నౌలి ప్రక్రియ ద్వారా జాడించి మెల్లగా బయటకి వదులున్నట్లు చేయుట . ఈ పద్దతిని మూత్రాశయ దోష నివారణ కొరకు చేయుదురు . దీనిని యోగులు "వజ్రోలి" అని పిలిచెదరు.


         ఈ వజ్రోలి సిద్ధిపొందిన యోగుడు శుక్రధారణమును , శుక్రస్తంభమును గలవాడై చిరకాలమును యవ్వనవంతుడు అయి ఉండునని హఠయోగ సిద్ధాంతము .


 *  నేతి  -


            దీనినే ఆయుర్వేదము నందు నస్యకర్మ అందురు. మూరెడు పొడవు , మూడు పెనలు వేసిన నూలుతాడుకు నెయ్యి పూసి మెల్లమెల్లగా ముక్కు రంధ్రము నుంచి లోపలికి పంపి పైకి పీల్చి నోటి మార్గము నుంచి ఆ తాడును బయటకి లాగి మెల్లమెల్లగా ముందుకు వెనక్కు అంటూ ఉండవలెను . ఈ విధానం వలన శిరఃకపాలం శోధించబడును . దివ్యదృష్టి కలుగును. మెడకొంకులకు కలుగు రోగములను శీఘ్రముగా హరించుట యందు ఈ నేతి కర్మ శ్రేష్టమైనది.


 *  త్రాటకము  -


           ఏకాగ్రత చిత్తుడు అయ్యి నిశ్చలమైన దృష్టి వలన సూక్షమైన లక్ష్యమును కన్నీరు స్రవించువరకు చూడవలెను . దీనివలన వాయవు , నేత్రము స్థిరత్వము పొందును. ఇలా దీక్షగా చేసి కొంచెముసేపు కనులు మూసి తరువాత తటాలున తెరిచి ఎదురుగా నిర్మలమైన ఆకాశమును ఏకాగ్రత చిత్తుడై సూర్యబింబము కనుపడినట్లు తోచువరకు చూడవలెను. ఈ త్రాటకము నాశిక కొనవద్ద సిద్ధించినచో  ఇలా సిద్దిపొందిన సాధకునకు సకలవ్యాధులు నివర్తించును. భ్రూమధ్యమము నందు సిద్ధించిన ఖేచరీ , దివ్యదృష్టి, యోగసిద్ధి కలుగును.


         ఈ త్రాటక ప్రక్రియ వలన నేత్రరోగములు తగ్గును. తంద్ర మొదలగు వ్యాధులు తగ్గును. ఈ త్రాటక ప్రక్రియ అత్యంత రహస్యమైనది.


 *  నౌలి  - 


          ఈ నౌలి ప్రక్రియ నందు భుజములను వంచుకొని కడుపునందలి అవయవములు కుడిపక్కగా నైనా , ఎడమ పక్కగా నైనా నీటి సుడి వలే అతివేగముగా చుట్టవలెను . దీనిని సిద్ధులు నౌలి కర్మగా వ్యవహరిస్తారు . ఈ నౌలి ప్రక్రియ ఆచరించటం వలన అగ్నిమాంద్యము పోగొట్టబడును. వాతాది సకలరోగాలను నశింపచేయును . హఠ క్రియలకు కిరీటము వంటి ప్రక్రియ ఇది.


 *  కపాల భాతి  -


          కమ్మరి వారివద్ద ఉండు గాలి తిత్తి వలే ఉచ్వాస , నిశ్చ్వాసాలను వేగముగా చేయుటనే కపాల భాతి అందురు. ఈ ప్రక్రియ వలన కఫదోషాలు పోగొట్టబడును .


          షట్కర్మలు వలన శరీరం యెక్క లావు , శరీరం నందలి మలాది దోషాలను పోగొట్టుకొని శరీరాన్ని శుద్ది చేసుకొనిన పిమ్మట ప్రాణాయామం చేయవలెను . షట్కర్మలు ఆచరించిన తరువాత చేయు ప్రాణాయమం వలన యోగము అత్యంత త్వరితముగా సిద్ధించును . ఈ షట్కర్మలు మాత్రమే కాకుండా కొంతమంది యోగులు కిలికర్మ , చక్రికర్మ , వజ్రోలి , శంఖ ప్రక్షాళనం మొదలగు శోధన కర్మలను కూడా అభ్యసించుదురు.


             శంఖ ప్రక్షాళన అనగా నోటితో జలమును తాగి మలద్వారం గుండా బయటకి పంపుట. లేక నాశికా రంధ్రము గుండా జలమును గ్రహించి వేరొక ముక్కు రంధ్రము నుండిగాని నోటి మార్గము ద్వారా గాని బయటకి పంపుట. ఇటువంటి విద్యలు కేవలం గురుముఖంగా మాత్రమే నేర్చుకొని సాధన చేయవలెను . ఇందులో మరికొన్ని యోగ ప్రక్రియలు కూడా కలవు. వాటి గురించి చెప్తాను .


         సూర్యభేదనము , ఉజ్జయని , సీతార్కరి , శీతలీ , భస్త్రిక , భ్రామరీ , మూర్చ, ప్లావిని , భుజకీకరణము మొదలగు కుంభకముల గురించి జాలంధర , ఉడ్యాన , మూలబంధనం వంటి యోగ విద్యలను కేవలం గురుముఖంగా మాత్రమే నేర్చి అభ్యసించవలెను . ఇందు సిద్ధి కలిగినవారికి ముసలితనము పొయి పదహారు సంవత్సరముల కలిగిన పడుచువారు వలే మారుదురు.


            అపానవాయువును మీదికి లేపి మూలాధారం పైకి ఆకర్షించుట వలన ప్రాణవాయువును కంఠము క్రిందికి తీసుకొని వెళ్లగలిగిన సిద్దుడు వృద్ధుడు అయినప్పటికి పదాహారు సంవత్సరాల పడుచువానిగా మారును అని కొన్ని రహస్య యోగ గ్రంథాలలో ఉన్నది. ఇచ్చట వాయవు అనగా పాశ్చాత్త్యులు చెప్పినట్లు కేవలం ఉచ్చ్వాస , నిశ్చ్వాసాల చే లోపలికి వెలుపలికి పోవు గాలి కాదు . ఆయుర్వేదం నందు యోగ శాస్త్రము నందు చెప్పబడిన సంకోచ వికాసాది రూపము కలిగిన చలనశక్తి .


       ఈ సందర్భమున మీకు ఒక హఠయోగి గురించి చెప్తాను . ఆయన పేరు శ్రీ యోగి ఓరుగంటి నరసింహం గారు . వీరు డిసెంబర్ 29 తారీఖు 1942 వ సంవత్సరము నందు లాహోరులో జరిగిన అఖిల భారత ఆయుర్వేద సమ్మేళనం నందు సభాపతి సమక్షంలో పైన చెప్పిన వజ్రోలి కర్మ సహాయముతో 40 తులముల పాదరసమును మూత్రమార్గముచే లోపలికి ఆకర్షించి తిరిగి అదే మార్గమున బయటకి విసర్జించి అందరిని ఆశ్చర్యచకితులను చేసినారు . 


       ఇంతగొప్ప యోగులు కలిగిన మన కర్మభూమి పాశ్చాత్త్యా సంస్కృతి మోజులో పడి మన మూలలను నాశనం చేసుకుంటున్నాము.


 

అత్యంత సులభమైన ఆయుర్వేద చిట్కాలు మరియు సులభ ఔషధాల సంపూర్ణ వివరణ కోసం నేను రచించిన గ్రంథములు చదవగలరు .

 

 గమనిక  -


     నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

నాకేం తక్కువ

 నాకేం తక్కువ (జీవనోపాధి-1 )

ఇటీవల నేను ఒక కేసులో కూకట్పల్లి కోర్టుకు వెళ్ళటానికి మలక్పేట్ ఎమ్ యమ్ టి యస్ రైలు ఉదయం 8-15 ని. కు ఎక్కాను. నాకు ఒక చిన్న కంపార్టుమెంట్లో సీటు దొరికింది. అందులో ఒక 40 సం. మహిళ మరిఒక మహమ్మదీయ ప్యాసింజరులు మాత్రమే వున్నారు. రైలు బయలుదేరంగానే నేను ఆమెతో మాట్లాడాను. ఆమె కూరగాయలు అమ్ముతానని చెప్పింది. ఆ చిన్న కంపార్టుమెంటులో ఆమె నేను ఇంకొక మహమ్మదీయుడు తప్ప వేరే ఎవరు లేరు. నేను కాలక్షాపాకిని ఆమె వ్యాపారాన్ని గురించిన వివరాలు అడిగాను. తాను వారాసిగూడలో ఉంటున్నానని ఆమె భర్త 20 ఏళ్ళ క్రితం మరణించాడని ఆమెకు ఒక కుమారుడు వున్నాడని తాను తన కుమారుడు కలిసి ఉంటున్నట్లు చెప్పింది. ఆమె మాటలు విన్నతరువాత నా మనస్సు ఒకింత బాధ పడింది పాపం ఆమె చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయి కుమారునితో బాధపడుతున్నది అని నేను అనుకున్నాను.  కానీ ఆమె ముఖంలో ఎంతో ఆత్మధైర్యం కనిపించింది. ఇక వ్యాపారనిగూర్చి ఆమె చెప్పిన విషయాలు. కూరగాయలకన్నా ఆకు కూరలలోనే ఎక్కువ లాభం వస్తుందని అన్నది. తాను శంషాబాద్ ఉదయం 5గంటలకు ఇతర కూరగాయల వర్తకులతో కలిసి Rs.50 ఇచ్చి అందరం ఆటోలో వెళుతామని అక్కడ వున్న కూరగాయలలో లాభసాటివి ఏవి ఉన్నాయో చూసుకొని ఎత్తుకుంటానని  (కొంటానని) చెప్పింది. ఆకుకూరలు 5రూపాయలకు 5 కట్టలు ఇస్తారని వాటిని తాను 10 రూపాయలకు 3 లేక 4 కట్టలు అమ్ముతానని అన్నది. ఇప్పుడు కరివేపాకు కూడా ఎక్కువ ఖరీదు అయినదని అన్నది అందుకే కరివేపాకు తక్కువగా ఇస్తున్నట్లు చెప్పింది. బుడంకాయలు (దోసకాయలు) 20 రూపాయలకు కిలో  కొని పావు కిలో 20 రూపాయలకు అమ్ముతానని అదే కిలో కొనేవారికి 60 రూపాయలకు ఇస్తాను అన్నది. ఈ రోజు తాను ఒక 1000 రూపాయల సరుకు ఎత్తుకున్నానని దానిని అమ్మితే 5నుండి 6 వందల రూపాయల లాభం వస్తుందని అన్నది. కాగా తాను ఒక్కతే ఎవ్వరి సహాయం లేకుండా కూరగాయలు స్టేషన్లో దింపుకోగలనని చెప్పింది ఈ రోజు టమాటా 150 రూపాయలకు తొట్టి అయ్యిందని ఒక తొట్టిలో 23 నుండి 25 కిలోల వరకు సరుకు ఉంటుందని తెలిపింది. తాను 2లేక 3 రోడ్లు తిరిగితే మొత్తం మాలు అమ్ముడుపోతుందని అన్నది. తాను ఇంకా మైకు కొనుక్కోలేదని నోటితోనే అరుస్తున్నట్లు  త్వరలోనే మైక్ కొనుక్కోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. కొంతమంది కేవలం ఆకు కూరల వ్యాపారాలు చేస్తున్నారని నిజానికి అమ్ముడు పొతే ఆకుకూరలు చాలా మంచిదని లాభసాటి అని అన్నది. తాను ఆ రోజు బీరకాయలు, దోసకాయలు, దొండకాయలు, టమాటా, పచ్చిమిర్చి ఒక రెండు ఆకు కూరలు కొనినట్లు తెలిపింది. మొత్తము కూరలు ఒక గంట లేక రెండు గంటలలో అమ్మగలనని తనకు ఒక నాలుగు చక్రాల బండి ఉందని 1000 రూపాయల నుంచి 2000 వరకు పెట్టుబడి పెడితే 500 నుంచి 1000 రూపాయల వరకు లాభం వస్తుందని అన్నది. తాను  ఇంటికి వెళ్లి భోజనం చేసి కూరగాయల విక్రయానికి వెళతానని అన్నది. అప్పుడు సమయం ఉదయం 8-20 అవుతున్నది. అంటే ఉదయం 9 నుంచి 10 వరకు వ్యాపారం చేస్తుందన్నమాట. కూరలు ఏమైనా మిగిలితే సాయంత్రం ఒక అరగంట తిరిగితే చాలని అన్నది. రైలు విద్యానగర్ స్టేషన్లో ఆగితే అక్కడ వేరే కంపార్టుమెంటులోంచి దిగిన ఒక అతనును చూపించింది అతను  రోజుకు 5నుంచి 8 వేలు సంపాయిస్తాడని అతను విద్యానగర్లో ఒక అపార్టుమెంటులో సెల్లార్లులో వ్యాపారం చేస్తున్నాడని తెలిపింది. ఆమె మాటలు వింటే నాకు దిమ్మతిరిగింది రోజుకు 5 వేలు అంటే 5 x 30 నెలకు లక్షా యాభై వేలు కనీసం లక్షరూపాయల పైమాటే  ఎట్టిపరిస్థితిలో తగ్గవు. ఏ వుద్యోగం చేసిన కూడా ఒక విద్యావంతుడు ఆ రకంగా సంపాయించలేడు. కేవలం కొంచం పెట్టుబడితో అంటే 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల పెట్టుబడితో ఎంతో లాభాలు ఆర్జించవచ్చు అని తెలుసుకొని నేను నోరుఎళ్లపెట్టాను. ఏమాత్రం చదువు లేని ఒక సామాన్యురాలి కృషికి నేను ఆనందపడ్డాను. " కృషితో నాస్తి దుర్భిక్షం " అని అన్నారు కదా కష్టపడితే తప్పకుండ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కి ఎదగగలరు అని అంతంలో సందేహం లేదు. పాల వ్యాపారం చేసి ఇంజనీరింగ్ కాలేజీలు కట్టి అసంబ్లీలో గొంతెత్తిన రాజకీయ నాయకుడు నా  మెదిలాడు. ఆమె నెలసరి 25వేలు నుంచి 30 వేలు వరకు సంపాయిస్తున్నట్లు, తన పోషణ ఏరకంగాను ఇబ్బందిగా లేదని ఇంటి కిరాయి కట్టి ఆనందంగా జీవనం సాగిస్తున్నట్లు తెలిపింది. నాకేం తక్కువ సార్ అని అన్నది. నిజమే కేవలం రోజుకు 3,4 గంటల కష్టంతో చక్కగా ఎవరి మీద ఆధారపడకుండా జీవించటం కన్నా స్వచ్ఛ యేమివున్నది. తనకు ఏమాత్రం ఇబ్బంది వున్నా ఆ రోజు వ్యాపారానికి వెళ్ళదు అడిగే వారు ఎవ్వరు లేరు. అదే ఎక్కడైనా వుద్యోగం చేస్తే సెలవులు ఇవ్వటానికి యెంత ఇబ్బంది పెడతారు. రోజుకు 8 గంటలు కస్టపడినా కూడా ఆమె సంపాదన అంతవుంటుందా అనేది సందేహాత్మకమే.

 మనసుంటే మార్గం ఉండదా అంటే తప్పకుండ ఉంటుంది. మనలో చాలామంది నేను చదువుకున్నాను నాకు ఉద్యోగం ఇంకా రాలేదు అనే దిగులుతో ఉండటమే కాకుండా ఆత్మ హత్యలు చేసుకునే వారిని కూడా మనం చూస్తున్నాము. కొంచం. పెట్టుబడి కొంచం లోకజ్ఞానం ఉంటే చాలు జీవితంలో ఎదగటానికి. 

ఒక్కవిషయం వ్యాపారం అనేది మనం అనుకునే అంత తేలిక అయిన పని కాదు అందులో వుండే రిస్కు అందులో ఉంటుంది. మనం ఆ రిస్కుని ఎదురుకోగల సామర్థ్యం ఉంటేనే జీవితంలో ముందుకు పోగలము. 

మన సమాజంలో ఆకలితో ఉన్నామంటే ఎవ్వరు సాయం చేయరు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తే ఎద్దేవా చేసేవారు కోకొల్లలు. అరె వాడు ఇంజనీరింగ్ చదివాడు చివరకు కూరగాయలు అమ్ముతున్నాడు వాడికిదేం గతిరా  చదువుకున్నంత మాత్రాన ఉద్యోగం రావద్దు. ఆ వీడికి వచ్చిన అత్తెసరు మార్కులకు వుద్యోగం ఎవడు ఇస్తాడు వీడికి ఈ కూరగాయల వ్యాపారమే సరైనది అని ఒకరు ఇలా కాకుల్లాగా పొడుచుకునే  వారు బోలెడు మంది వుంటారు. నిజంగా నీకు కూరగాయల వ్యాపారం లాభసాటి నేను చేస్తాను అంటే నీవు చేయవలసింది నీవు వుండే కాలనీకి దూరంగా వెళ్లి అక్కడ చేయి అక్కడ నీ చదువు నీ తల్లిదండ్రుల స్థితిగతులు ఎవ్వరికీ తెలియవు.. నేను అందరకు చెప్పేది ఒక్కటే కష్టపడే తత్త్వం వున్నవారికి ఏపనైనా ఒకటే. డిగినీటి ఆఫ్ లేబర్ తెలిసినవాడు జీవితంలో ముందుకు వెళ్లగలడు. ధైర్యసాహసే లక్ష్మి. అన్నారు పెద్దలు. ఉదర నిమిత్తం బహుకృత వేషం అని మన గురువుగారు ఆది శంకర భగవానులు పేర్కొన్నారు.

నోటు: ఈ కధనం చదివి మనలో ఏవక్కరు అయినా తమ జీవితాన్ని సుగమంగా చేసుకొని నిరాశావాదాన్ని వీడి చక్కటి జీవితాన్ని గడిపితే ఈ వ్యాసకర్త కృషి ఫలించినట్లే. 

ఇంకొక కధనంతో ఇంటోకసారి  కలుద్దాం. 

ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*భక్తి..బంధుత్వం..*


"మేము స్వామివారి కి బంధువులం అవుతామండీ..ఈరోజు ఇక్కడ నిద్ర చేయాలని అనుకున్నాము..మేము ఉండడానికి ఏదైనా గది ఇస్తారా?.." అని ఆ దంపతులు అడిగారు..ఇద్దరిదీ వయసు ముప్పై ఏళ్ల లోపలే..శ్రీ స్వామివారికి వారికి  ఏవిధంగా బంధుత్వం వున్నదో కూడా తెలిపారు.. గది కేటాయించాము..ఇద్దరూ స్నానాదికాలు ముగించుకొని తిరిగి మందిరం లోనికి వచ్చారు..ఆరోజు శనివారం కనుక, శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్ళడానికి వీలు లేదు కనుక..దూరం నుంచే నమస్కారం చేసుకున్నారు..


"మాకు వివాహం జరిగి నాలుగేళ్లు అవుతున్నది..ఇద్దరమూ డెంటల్ డాక్టర్ల గా నెల్లూరు లో ప్రాక్టీస్ చేస్తున్నాము..సరిగ్గా జరగడం లేదు..ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నాము..దుబాయ్ లో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్ నుంచి మమ్మల్ని రమ్మనమని కబురు వచ్చింది..వెళ్లాలని అనుకుంటున్నాము..కానీ గత మూడు నెలలుగా ఏదో ఒక అడ్డంకి వలన మేము అక్కడికి వెళ్లలేక పోతున్నాము..మాకున్న ఈ ఆర్థిక సమస్యలు తీరిపోయి..దుబాయ్ వెళ్ళడానికి వీలుకుదరాలని స్వామివారికి విన్నవించుకుందామని వచ్చాము.." అని చెప్పారు..సాయంత్రం పల్లకీ సేవ ఎన్నిగంటలకో అని అడిగి తెలుసుకున్నారు..పల్లకీ సేవ లో తామిద్దరం పాల్గొంటామని చెప్పారు..సరే అన్నాను..


ఆరోజు సాయంత్రం ఏడు గంటలకు పల్లకీ సేవ ప్రారంభం అయింది..దంపతులిద్దరూ భక్తిగా పాల్గొన్నారు..పల్లకీ మందిరం చుట్టూ తిరిగే మూడు ప్రదక్షిణాల లోనూ అతనే పల్లకీని మోశాడు..పల్లకీ సేవ తరువాత, అన్నదాన సత్రానికి వెళ్లి, అన్నప్రసాదం స్వీకరించి వచ్చారు..వాళ్లకోసం గది ని కేటాయించినా కూడా ఆ రాత్రి మండపం లోనే పడుకుంటామని చెప్పి, అక్కడే నేలమీద  నిద్ర చేశారు..


ప్రక్కరోజు ఆదివారం తెల్లవారుఝామున లేచి..స్నానం చేసి..శ్రీ స్వామివారి మండపం చుట్టూ ప్రదక్షిణాలు చేసి వచ్చారు..ప్రభాత పూజ, హారతులు అయిపోయిన తరువాత..ఇద్దరూ శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, సుమారు పది నిమిషాల పాటు నిలబడ్డారు..తమ కోర్కెను శ్రీ స్వామివారికి విన్నవించుకున్నామని ఇవతలికి వచ్చి నాతో చెప్పారు..


"ఎందువల్లో తెలీదండీ..శ్రీ స్వామివారి సమాధి వద్ద మా బాధలు విన్నవించుకున్న తరువాత..మా మనసులకు ప్రశాంతత వచ్చింది.." అన్నారు..మధ్యాహ్నం దాకా మందిరం లో గడిపి..తిరిగి నెల్లూరు వెళ్లిపోయారు..


పదిహేను రోజులు గడిచిపోయాయి..మేము దాదాపుగా ఆ దంపతుల గురించి మర్చిపోయాము..ఒకరోజు శ్రీ స్వామివారి బంధువు మరొక వ్యక్తి మందిరానికి వచ్చాడు..మాటల మధ్యలో ఈ దంపతుల ప్రస్తావన వచ్చింది..పదిహేను రోజుల క్రిందటే వాళ్లిద్దరూ వచ్చి వెళ్లారని తెలిపాను..గత నాలుగైదు నెలలుగా వాళ్లిద్దరూ తీవ్రమైన ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్నారని..మానసికంగా కూడా వత్తిడి లో ఉన్నారనీ..అప్పుడు ఆ అమ్మాయి తల్లి గారు వాళ్ళను మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామివారిని శరణు కోరమని చెప్పిందనీ..ఆవిడ మాట ప్రకారం వాళ్లిద్దరూ ఇక్కడకు వచ్చారని..తెలిపాడు..శ్రీ స్వామివారికి మ్రొక్కుకున్న మూడు రోజుల్లోనే దుబాయ్ నుంచి మళ్లీ పిలుపు వచ్చిందని..మరో వారం లోపలే ఆ దంపతులు దుబాయ్ వెళుతున్నారని..టిక్కెట్లు కూడా బుక్ చేసుకున్నారని.." ఆ వచ్చిన వ్యక్తి తెలిపాడు..


ప్రస్తుతం ఆ దంపతులిద్దరూ దుబాయ్ లో లక్షణంగా ఉన్నారు...శ్రీ స్వామివారి దయ వలన ఆ భార్యా భర్తల కోరిక నెరవేరిందని అనుకున్నాము..బంధుత్వం కన్నా..వాళ్లిద్దరూ కనపరచిన భక్తి విశ్వాసాలే వాళ్ళను శ్రీ స్వామివారికి దగ్గర చేసాయి.. ఎందుకంటే శ్రీ స్వామివారు భక్త సులభుడు కదా!..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*పొల్లుపోని మాట..*


శ్రీ స్వామివారితో మా తల్లిదండ్రుల పరిచయాని కంటే ముందుగానే శ్రీ చెక్కా కేశవులు గారికి సాన్నిహిత్యం ఉండేది..మాలకొండలో శ్రీ స్వామివారు తపోసాధన చేసే రోజుల్లో..శ్రీ స్వామివారికోసం ఒక మంచం, దోమతెర ఇత్యాదులు తీసుకొచ్చి ఇచ్చారు..శ్రీ కేశవులు గారు అత్యంత భక్తిగా శ్రీ స్వామివారిని కొలిచేవారు..తరువాత కాలంలో మా తల్లిదండ్రులు శ్రీ స్వామివారిని నమ్మి కొలవడం..అదే క్రమం లో చెక్కా కేశవులు గారు కూడా మా అమ్మా నాన్న గార్లతో పరిచయం పెంచుకొనడం జరిగిపోయాయి..శ్రీ స్వామివారు ఆశ్రమం నిర్మించుకోవడానికి శ్రీ కేశవులు గారు విజయవాడ వద్ద స్థలం ఇస్తామన్నారు.. కానీ శ్రీ స్వామివారు సున్నితంగా తిరస్కరించారు..మొగలిచెర్ల లోని ఫకీరు మాన్యాన్ని తన ఆశ్రమ వాసానికి అనువైనది అని నిర్ధారించుకొని..అక్కడ ఆశ్రమం నిర్మాణం చేశారు..ఆశ్రమ నిర్మాణానికి శ్రీ బొగ్గవరపు మీరాశెట్టి దంపతులు ఆర్ధిక సహకారం అందించారు..


శ్రీ స్వామివారు మొగలిచెర్ల లో ఆశ్రమం లో స్థిరపడ్డ తరువాత..శ్రీ కేశవులు గారు తరచూ మొగలిచెర్ల వచ్చేవారు..మా ఇంట్లోనే బస చేసేవారు..అలానే శ్రీ మీరాశెట్టి దంపతులు కూడా వచ్చి వెళ్లేవారు.. నావరకూ నాకు, అటు కేశవులు గారివద్ద కానీ...ఇటు మీరాశెట్టి గారి వద్ద కానీ బాగా చనువు ఉండేది..వాళ్ళూ నన్ను ఆదరించేవారు..ఎప్పుడైనా మొగలిచెర్ల లోని మా ఇంటివద్ద నుండి శ్రీ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళడానికి మా తల్లిదండ్రులకు వీలు కుదరని పక్షంలో..కేశవులు గారితో కలిసి నేను ఆశ్రమానికి వెళ్ళేవాడిని..కేశవులు గారికోసం నాన్నగారు గూడుబండి (ఎడ్ల బండి) సిద్ధం చేయించేవారు..మీరాశెట్టి గారు వాళ్ళ ఊరు నుండి వచ్చే దారిలోనే శ్రీ స్వామివారి ఆశ్రమం ఉండేది కనుక..వారు వస్తూ వస్తూ నే శ్రీ స్వామివారి ఆశ్రమం వద్ద కలిసి వచ్చేవారు..మీరాశెట్టి దంపతులు ఎన్నడూ ఎడ్లబండి ఎక్కేవారు కాదు..ఆ దంపతులిద్దరూ కాలినడకనే (సుమారు పదకొండు కిలోమీటర్లు రానూ..మళ్లీ అంతే దూరం పోనూ..) వచ్చి వెళ్లేవారు..


ఒకసారి శ్రీ కేశవులు గారు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి మొగలిచెర్ల వస్తూ ఉండగా..కందుకూరు లో వారికొక మనిషి పరిచయం అయ్యాడు..మాటల సందర్భం లో అతనికి వివాహం జరిగి ఏడు సంవత్సరాలైందనీ..సంతానం కలుగ లేదనీ..తాను తన భార్యా దిగులు చెందుతున్నామనీ చెప్పాడు..(1975 నాటి ముచ్చట ఇది)..అతని పేరు హరి చౌదరి.. శ్రీ కేశవులు గారు తాను మొగలిచెర్ల లో తపస్సు చేసుకుంటున్న శ్రీ దత్తాత్రేయ స్వామివారిని కలవడానికి వెళుతున్నాననీ..తనతో పాటు వచ్చి, ఆ స్వామివారి దగ్గర ఆశీర్వాదం పొందితే..ఫలితం ఉంటుందనీ చెప్పారు..అతనూ సరే నన్నాడు..ఇద్దరూ కలిసి, మొగలిచెర్ల బస్ ఎక్కి వచ్చేసారు..మా ఇంటికి వచ్చిన తరువాత..శ్రీ కేశవులు గారికోసం నాన్నగారు బండి కట్టించారు..కేశవులు గారు నన్నూ తనతో రమ్మన్నారు..నేనూ ఉత్సాహంగా బయలుదేరాను..కేశవులు గారు, వారితోపాటు హరి చౌదరి, వీళ్లద్దరితో పాటు నేనూ ముగ్గురం శ్రీ స్వామివారి ఆశ్రమానికి సాయంత్రం ఐదు గంటలకు చేరాము..శ్రీ స్వామివారు ధ్యానం లో వున్నారు..గది తలుపులు వేసి ఉన్నాయి..గంట గడిచింది..రెండు గంటలు పూర్తి అయ్యాయి..శ్రీ స్వామివారు బైటకు రాలేదు..చీకటి పడింది..ఆశ్రమం లో ఉన్న వంట గదిలోంచి లాంతరు తీసుకొచ్చి వెలిగించాను..మరో గంట గడిచింది..శ్రీ స్వామివారు రాలేదు..ఇక ఈరోజుకు శ్రీ స్వామివారిని కలిసే అవకాశం లేదని ముగ్గురమూ వెనక్కు వచ్చేసాము..


ఆరోజు రాత్రికే హరి చౌదరి తనకు శ్రీ స్వామివారి వద్ద ఆశీర్వాదం పొందే ప్రాప్తం లేదని..పైగా తెల్లవారి అత్యవసర పనులున్నాయనీ..రాత్రికే ఆఖరి బస్ కు  కందుకూరు వెళ్ళిపోయాడు..తెల్లవారింది..మళ్లీ శ్రీ కేశవులు గారు ఆశ్రమానికి వెళ్ళొస్తానన్నారు..బండి సిద్ధం కాగానే..కేశవులు గారు, నేనూ ఇద్దరమూ ఆశ్రమానికి వచ్చాము..చిత్రంగా శ్రీ స్వామివారు ఆశ్రమ బైట నిలబడి వున్నారు..శ్రీ కేశవులు గారిని చూడగానే..

"కేశవులు గారూ..నన్ను ప్రశ్నలు చెప్పేవాడిగా మారుద్దామనుకుంటున్నారా?..తలరాతను నేను మార్చగలనా?..." అన్నారు..


కొంచెం సేపు కేశవులు గారు మౌనంగా వుండి.."స్వామీ..అతను చాలా బాధపడుతుంటే..చూడలేక మీ వద్దకు తీసుకొచ్చాను..మీరు ఆశీర్వదిస్తే..అతనికి సంతానం కలుగుతుందని నేనే నచ్చ చెప్పాను..తీరా ఇక్కడికొస్తే..మీరు ధ్యానం లో వున్నారు.." అన్నారు..


స్వామివారు పెద్దగా నవ్వి.."నేను చేసేదేముంది..అతనికి సంతానయోగం ఉంది..మరో ఏడాది కి పిల్లలు పుడతారు..ఆ మాటే చెప్పండి మీరు..పిల్లలు పుట్టిన తరువాత ఈ ఆశ్రమానికి వచ్చి ఆశీర్వాదం పొందమని చెప్పండి.." అన్నారు..ఆ తరువాత కేశవులు గారితో దాదాపు గంటసేపు ఇతర విషయాలు మాట్లాడారు..కేశవులు గారు కూడా ఎంతో సంతోషం తో, తృప్తితో..శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకున్నారు..నేనూ శ్రీ స్వామివారి పాదాలకు నమస్కారం చేసాను..

"చదువుకోసం ఎప్పుడు కనిగిరి కి పోతున్నావు?.." అని నన్ను అడిగారు.."వచ్చే ఆదివారం దాకా సెలవులున్నాయి..ఆదివారం మధ్యాహ్నం వెళతాను.." అన్నాను.."వెళ్లేముందు రోజు మీ అమ్మానాన్న తో పాటు ఇక్కడకు రా!" అన్నారు..సరే అన్నాను..


శ్రీ కేశవులు గారు ఆరోజు తిరిగి విజయవాడ వెళ్లిపోయారు ..పోతూ పోతూ కందుకూరు లో హరిచౌదరి కి శ్రీ స్వామివారు చెప్పిన మాట చెప్పి వెళ్లారు..ఆ ప్రక్క సంవత్సరం అనగా 1976, మే 6వతేదీ శ్రీ స్వామివారు సిద్ధిపొందారు..తరువాత ఆగస్ట్ నెలలో హరి చౌదరి కి మొదటి సంతానంగా అమ్మాయి పుట్టింది..మరో మూడు నెలలకు హరి చౌదరి దంపతులు బిడ్డనెత్తుకొని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..శ్రీ స్వామివారి సమాధి వద్ద బిడ్డను పడుకోబెట్టి..కన్నీళ్లు పెట్టుకున్నాడు..


శ్రీ స్వామివారు చెప్పిన మాట పొల్లుపోలేదు.."సంతానం కలిగిన తరువాత ఆశ్రమానికి వచ్చి ఆశీర్వాదం పొందమని " చెప్పారే కానీ..తాను నేరుగా కలుస్తానని చెప్పలేదు..హరి చౌదరి తన కూతురికి "దత్త లక్ష్మి" అని పేరు పెట్టుకున్నాడు..


శ్రీ కేశవులు గారు మొగలిచెర్ల వచ్చినప్పుడు..ప్రతిసారీ ఈ సంఘటన గుర్తు చేసుకునే వారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*హరిదాసుని అంతరంగం..*


"అయ్యా!..మా అబ్బాయి కి పెళ్లి సంబంధం కుదిరింది..ఈ స్వామివారి సన్నిధిలో చేయాలని మొక్కుకున్నాము..వచ్చేనెల లో ముహూర్తం ఉందని పురోహితుల వారు చెప్పారు..ఆరోజు ఆదివారం అయింది..ఇక్కడ పెళ్లి చేయించడానికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా?..చెప్పండి.." అంటూ నెల్లూరు జిల్లా కొండాపురం మండలం మఱ్ఱిగుంట నివాసి రామదాసు అడిగాడు..రామదాసు వాళ్ళు హరిజనులు..


ఒక్క రామదాసు మాత్రమే కాదు..మొగలిచెర్ల గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్న చాలా గ్రామాల్లోని చాలా మందికి శ్రీ స్వామివారి మీద విపరీతపు భక్తి భావం నెలకొని వున్నది.. వాళ్లకు ఏ కష్టం కలిగినా..ముందుగా గుర్తుకొచ్చేది శ్రీ దత్తాత్రేయ స్వామివారే..తమ బిడ్డల నామకరణం నుంచి..వివాహం దాకా..ప్రతి శుభకార్యమూ శ్రీ స్వామివారి సమక్షంలోనే జరిపించాలని వారి కోరిక..అప్పుడే తమకూ.. తమ పిల్లలకూ క్షేమదాయకమని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం..కులమతాల ప్రసక్తి ఈ క్షేత్రం వద్ద వినపడదు..అందరూ యథేచ్ఛగా శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకోవచ్చు..ఎక్కువ, తక్కువ, బేధ భావం లేదు..వారి వారి భక్తి విశ్వాసాల స్థాయిని బట్టి వారి వారి కోరికలు సఫలం అవుతూ ఉంటాయి..


శ్రీ స్వామివారి మందిరం వద్ద  వివాహం చేసుకోవాలంటే పాటించాల్సిన నియమ నిబంధనలు తెలియచేసాము..అన్నీ శ్రద్ధగా విన్నాడు రామదాసు..


"ఆరోజుల్లో ఇన్ని నియమాలు లేవు.." అన్నాడు..

నాకు అతని మాట అర్ధం కాలేదు.."ఎన్నాళ్ల క్రిందటి సంగతి నువ్వు చెప్పేది?..ఈ నియమాలు పెట్టి సుమారు పది,పన్నెండు సంవత్సరాలు అవుతున్నది.." అన్నాను..


"ఇప్పటి సంగతి కాదు..ముప్పై ఐదేళ్ళ  క్రిందట.. నా పెళ్లి కూడా ఇక్కడే చేసుకున్నాను..ఆరోజుల్లో మమ్మల్ని ఏ కాగితాలూ..ఏ సర్టిఫికెట్లు అడగలేదు..మేము వారం రోజుల ముందు వచ్చి..ఇక్కడ పూజారి గారితో మాట్లాడుకున్నాము..భజంత్రీలతో మాట్లాడుకున్నాము..మళ్లీ ముహూర్తానికి వచ్చి పెళ్లి చేసుకున్నాము..ఇప్పుడన్నీ కొత్త కొత్త నిబంధనలు పెడుతున్నారు..సరేలే..రోజులు మారాయి..అందుకు తగ్గట్టే మారాలి.." అని ధోరణిగా మాట్లాడసాగాడు..


రామదాసు తల్లిదండ్రుల కాలం నుంచే శ్రీ స్వామివారిని భక్తి ప్రపత్తులతో కొలిచేవారు..రామదాసు పుట్టిన తరువాత..తరచూ మొగలిచెర్ల వచ్చి, శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళుతుండే వారు..రామదాసు వివాహం కూడా శ్రీ స్వామివారి సన్నిధిలోనే జరిగింది..రామదాసు కు పెళ్లి జరిగిన ఆరేడు సంవత్సరాల దాకా సంతానం కలగలేదు..సంతానం కోసం శ్రీ స్వామివారికే మొక్కుకున్నాడు..తనకు సంతానం కలిగితే..ఆ పిల్లల పెళ్లిళ్లు కూడా శ్రీ స్వామివారి సన్నిధిలోనే చేస్తానని ప్రమాణం చేసాడు..ఆ తరువాత సంవత్సరం లోపే రామదాసు కు మొగపిల్లవాడు పుట్టాడు..మరో రెండేళ్లకు ఆడపిల్ల పుట్టింది..తాను శ్రీ స్వామివారి వద్ద అనుకున్న మాట ప్రకారమే..కుమారుడి వివాహాన్ని శ్రీ స్వామివారి సన్నిధి లో చేయడానికి రామదాసు ప్రస్తుతం వచ్చాడు..


ఆ తరువాతి ఆదివారం ఉదయం కుమారుడి వివాహం లక్షణంగా జరిగిన తరువాత.."అయ్యా..నా చిన్నతనం నుంచీ ఇక్కడకు వస్తూ వున్నాము..ఆ దత్తాత్రేయుడు మమ్మల్ని అన్ని విషయాల్లో కాపాడుతున్నాడు..మా ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా ముందుగా స్వామి దగ్గరకి వచ్చి..సమాధి కి మొక్కుకొని వెళతాము..ఈరోజు కూడా ఆ స్వామి దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాడు..ఆ స్వామి దయ వుంటే..వీడికి పుట్టబోయే సంతానం వివాహం కూడా ఇక్కడే జరిపిస్తాము.." అన్నాడు భక్తిగా..ఆ మాట చెపుతున్నప్పుడు అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి..


రామదాసు లో ఉన్న అపరిమితపు భక్తే అతనికి ఎల్లవేళలా రక్ష!..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*అన్నదమ్ములు..ఆస్తిపంపకం..*


"మీకు తెలిసిన మంచి లాయర్ ను నాకోసం మాట్లాడతారా?..ఒక సలహా కావాలి.." అని నన్ను అడిగాడు రాజగోపాల్..


రాజగోపాల్ వాళ్ళ నాన్న గారు లక్ష్మీనరసారెడ్డి గారితో నాకు బాగా దగ్గర స్నేహం ఉన్నది..లక్ష్మీనరసారెడ్డి గారికి ఇద్దరూ మొగపిల్లలే..వివాహం జరిగిన ఏడు సంవత్సరాల దాకా పిల్లలు పుట్టకపోతే..మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి సమాధి వద్ద లక్ష్మీనరసారెడ్డి మొక్కుకున్నారు..ఆ మరుసటి సంవత్సరమే సంతానం కలిగింది..మొగపిల్లవాడు..అతనికి వేణుగోపాల్ అని పేరు పెట్టుకున్నారు..ఆ మరుసటి సంవత్సరం మళ్లీ మొగపిల్లవాడు పుట్టాడు..అతనికి రాజగోపాల్ అనీ పేరు పెట్టుకున్నారు..శ్రీ స్వామివారి దయవల్లే తనకు సంతానం కలిగిందని చాలా సార్లు చెప్పుకునేవారు లక్ష్మీనరసారెడ్డి.. ప్రతి సంవత్సరం శ్రీ స్వామివారి దర్శనానికి ఖచ్చితంగా వచ్చి వెళ్లేవారు లక్ష్మీనరసారెడ్డి..


లక్ష్మీనరసారెడ్డి వ్యవసాయం చేసేవారు..తల్లుదండ్రుల నుంచి సంక్రమించిన ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ..అంచెలంచెలుగా కష్టపడి దానిని పాతిక ఎకరాలకు పెంచుకోగలిగారు..ఇద్దరు కుమారులనూ ఉన్నంతలో బాగానే చదివించారు..ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు..పెద్దవాడు హైదరాబాద్ లో..రెండవవాడు బెంగళూరు లో వుంటున్నారు..ఇద్దరికీ వివాహాలు జరిగాయి..ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు..


లక్ష్మీనరసారెడ్డి గారు తనకున్న ఆస్తిని మూడు భాగాలు చేసి, తనకూ తన భార్యకు ఒక భాగం ఉంచుకొని..మిగిలిన రెండు భాగాలూ ఇద్దరు కుమారులకూ సమానంగా వచ్చేటట్లు వీలునామా వ్రాసారు.. చిన్నవాడైన రాజగోపాల్  తన అన్నయ్య వాటాకు వచ్చిన భూమి తనకు కావాలని..తన వాటాకు వచ్చిన దానిని అన్నయ్యకు ఇవ్వమని కోరాడు..ఈ చిన్న విషయం కారణంగా ఆ కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయి..అన్నదమ్ములిద్దరూ పంతాలకు పోయారు..లక్ష్మీనరసారెడ్డి గారికి మనసుకు కష్టం వేసింది..


సరిగ్గా ఆ సమయంలోనే రాజగోపాల్ నన్ను సలహా అడిగాడు..అంతకుముందే లక్ష్మీనరసారెడ్డి నాతో చెప్పివున్నారు కనుక, అతనిని కూర్చోబెట్టి నచ్చచెప్ప బోయాను..కానీ ఆ పిల్లవాడు వినలేదు..తాను కోర్టుకు వెళతానని ఖరాఖండిగా చెప్పేసాడు..ఇక చేసేదేమీలేక మౌనంగా ఉండిపోయాను..


ఆ తరువాత ఆదివారం నాడు లక్ష్మీనరసారెడ్డి గారు భార్యతో సహా మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..శ్రీ స్వామివారి విగ్రహానికి పూజలు చేయించుకొని..శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి.."స్వామీ!..సంతానం లేని నాడు నిన్ను వేడుకుంటే..నాకు సంతానాన్ని ప్రసాదించావు.. ఈనాడు ఆ సంతానమే నాకు మనోవేదన కలిగిస్తున్నారు..ఈ సమస్యను నువ్వే పరిష్కరించాలి..నా చేతుల్లో ఏమీ లేదు..నిన్నే నమ్ముకున్నాను..నా కుటుంబంలో వచ్చిన ఈ పొరపొచ్చాలు సమసిపోయి..అందరూ కలిసిమెలిసి ఉండేటట్లు నువ్వే అనుగ్రహించు.." అని వేడుకున్నారు..సమాధి మందిరం నుంచి బైటకు వచ్చి.."ఇక అంతా ఆ స్వామివారిదే భారం ప్రసాద్ గారూ..నేను పూర్తిగా ఆ మహానుభావుడి మీదే నమ్మకం పెట్టుకున్నాను.." అన్నారు..


మరో వారం గడిచింది..మళ్లీ ఆదివారం నాడు..లక్ష్మీనరసారెడ్డి గారు మందిరం లోపలికి వస్తూ కనిపించారు..నేరుగా నేను కూర్చున్న చోటుకు వచ్చి.."స్వామివారు నా మొర ఆలకించారు ప్రసాద్ గారూ..రెండురోజుల్లో సమస్య తీరిపోయింది..చిన్నవాడు మనసు మార్చుకున్నాడు..మొన్న బుధవారం నాకు ఫోన్ చేసి.."నాన్నగారూ మీ ఇష్టప్రకారమే పంపకాలు చేయండి..నాకేమీ అభ్యంతరం లేదు..ఇప్పుడే అన్నయ్య తో కూడా మాట్లాడాను..నేను శనివారం మన ఊరికి వస్తున్నాను..ఆదివారం అందరం కలిసి మొగలిచెర్ల వెళ్లి, శ్రీ స్వామివారిని దర్శించుకుని వద్దాము.." అన్నాడండీ.. వాడిలో ఈ మార్పు తీసుకొచ్చింది స్వామివారే.." అన్నారు..ఇంతలో లక్ష్మీనరసారెడ్డి గారి ఇద్దరు కుమారులూ, భార్యా..వచ్చేసారు..అందరూ కలిసి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొన్నారు..


నేను కుతూహలం పట్టలేక, రాజగోపాల్ ను ప్రక్కకు పిలచి, " లాయర్ సలహా కావాలన్నావు కదా..ఈలోపల ఏమి జరిగింది?.." అన్నాను..అతను ఏమీ మాట్లాడకుండా..శ్రీ స్వామివారి పటం వైపు చూపించి..ఒక నమస్కారం పెట్టాడు.."పోయిన సోమవారం రాత్రి నిద్ర పెట్టలేదండీ..ఎవరో వచ్చి నేను చేస్తున్నది తప్పు అని పదే పదే చెప్పినట్లు ఆలాపన వచ్చింది..ఆ ప్రక్కరోజూ అదే జరిగింది..తట్టుకోలేకపోయాను..బుధవారం నాడు అన్నయ్య తో..నాన్నగారితో మాట్లాడిన తరువాతే నాకు మనసుకు శాంతి కలిగింది..ఆస్తి కోసం పంతాలకు పోతే..అనుబంధాలు దెబ్బతింటాయని తెలిసొచ్చింది.." అన్నాడు..


లక్ష్మీనరసారెడ్డి గారికి సంతానాన్ని ప్రసాదించిన శ్రీ స్వామివారు..ఆ కుటుంబం లో వచ్చిన మనస్పర్ధలనూ దూరం చేశారు..ఆ మాటే లక్ష్మీనరసారెడ్డి గారు చెప్పుకుంటూ వుంటారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

19, ఫిబ్రవరి 2025, బుధవారం

పిప్పి పన్ను బాధ

 పిప్పి పన్ను బాధ హరించుటకు సిద్దయోగాలు  - 


 *  కర్పూర తైలం ( టర్పంటైన్ ) లో దూది తడిపి ఆ దూదిని పిప్పిపన్ను పైన పెట్టి నొక్కి పట్టి ఉంచిన పిప్పిపన్ను బాధ తగ్గును . 


 *  జిందా తిలిస్మాత్ రెండు చుక్కలు దూది పైన వేసి పిప్పిపన్ను రంధ్రములో పెట్టిన పిప్పిపన్ను బాధ తగ్గును. 


 *  కుప్పింటాకు చెట్టు ఆకు పసరు పిప్పిపన్ను రంధ్రములో వేసిన పిప్పిపంటి లోని పురుగు చచ్చి ఉపశమనం కలుగును. 


 *  జిల్లేడు పాలు రెండు చుక్కలు దూదికి అంటించి పిప్పి పన్ను రంధ్రము నందు ఉంచిన పిప్పిపన్నులోని పురుగు చచ్చిపడిపోవును. 


   గమనిక  - 


        దంతములు వదులుగా అవ్వడం , దంతముల తీపి , తీవ్రమైన నొప్పి , చిగుళ్లు బలహీనత , చీము , రక్తం కారడం వంటి సమస్యలు ఉన్నవారికి ఒక దంత చూర్ణం తయారుచేసి ఇస్తాను. 40 రోజుల్లోపే సమస్య చాలావరకు నయం అగును. ఇది పూర్తిగా మూలికలు , భస్మాలు ఉపయోగించి చేయడం వలన ఎటువంటి చెడుఫలితాలు కలగవు. దంతసమస్యలు అన్ని సంపూర్ణంగా నయం అగును. 

చిగుళ్లు మరియు దంతాలు బలంగా తయారయ్యి గట్టిగా ఉండును.


 

  గమనిక  -


     నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

మహా వాక్యాలు

 మహా వాక్యాలు

ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద మహావాక్యము

అహంబ్రహ్మస్మి యజుర్వేద మహావాక్యము

తత్త్వమసి సామవేద మహావాక్యము

అయమాత్మాబ్రహ్మ అథర్వణ మహావాక్యము


ప్రజ్ఞానం బ్రహ్మ


ఋగ్వేద మహావాక్యముగా ప్రజ్ఞానం బ్రహ్మ ప్రసిద్ధికెక్కినది.అతి ప్రాచీనమైన ఋగ్వేదములో సృష్టిమూలమును తెలియజేస్తూ ఈ బ్రహ్మాండము పరబ్రహ్మము నుండి జనించినదని, ఈ చరాచర సృష్టికి శుద్ధ చైతన్యము బ్రహ్మమేనని తీర్మానించినది. బ్రహ్మమే సర్వజ్ఞతను కలిగియున్నది. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులను నడిపించే చైతన్యము బ్రహ్మము. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు తన పరిధిలోని గ్రహములను తన చుట్టూ భ్రమింపచేసుకొనే శక్తియే ఈ శుద్ధ చైతన్యము. ఆద్యంతములు కానరాని ఈ అనంత సూర్య మండలములను వ్యక్తావ్యక్తమైన ఈ ఆకాశములో పయనింపచేసే శక్తి కూడా ఈ బ్రహ్మయొక్కశుద్ధ చైతన్యమేనని వివరించినది. సృష్టికి ముందు తరువాత ఉండేది ఆత్మ ఒక్కటేనని తెలియజేసింది.


అహంబ్రహ్మాస్మి


యజుర్వేద మహావాక్యము ‘అహంబ్రహ్మాస్మి’.

అనగా నేనే పరబ్రహ్మమని జీవుడు భావించడం. అనేక జన్మలలో జీవుడు పరిభ్రమిస్తున్నాడు. కాని అన్ని జన్మలలోను స్వరూపము ఆత్మగా వెలుగొందుతున్నది. తనకు లభించిన దేహమనే ఉపాధిలో జ్ఞానమును ప్రోది చేసుకొని ‘నేనే ఆత్మస్వరూపుడను’ అనే సత్యాన్ని దర్శించి ముక్తిని పొందుతాడని ఈ యజుర్వేద మహావాక్యము విశదపరచింది. ఉత్కృష్టమైన మానవ జన్మలో ఆత్మశోధన ధర్మాచరణతోనే సాధించగలమని తెలియజేసింది. ధర్మబద్ధమైన కోరికలతో జీవించి తాను తరించి సమస్త ప్రకృతిని తరింపజేయాలని నొక్కి చెప్పింది.



తత్త్వమసి


సామవేద మహావాక్యము ‘తత్త్వమసి’.

చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, నీలోనే వుండి, నీవైయున్నదని నిర్వచించడం చాలా ఆశ్చార్యాన్ని, తృప్తిని కలిగిస్తుంది. శంకర భగవత్పాదులు చాటి చెప్పిన అద్వైతము ఈ మహావాక్యమునుండే ఆవిర్భవించినది అని భావించడం మనం వినియున్నాము. ‘ఏక మేవ అద్వితీయం’, ఉన్నది ఒక్కటే! అదే పరబ్రహ్మము. అది నీలోన, అంతటా వ్యాపించి ఉన్నదనే ఒక గొప్ప సత్యాన్ని అద్వైతము ఆవిష్కరించినది. ఆత్మ పరమాణు ప్రమాణమైనది. అటువంటి పరమాణువునుండే ఈ బ్రహ్మాండము ఆవిర్భవించినది. కావున ఈ బ్రహ్మాండములో భాగమైన నీవే ఆత్మవు అని వర్ణించింది.



అయమాత్మాబ్రహ్మ


నాల్గవ వేదమైన అథర్వణ మహావాక్యము ‘అయమాత్మాబ్రహ్మ’.

ఈ వాక్యము కూడా ఆత్మయే బ్రహ్మమని తెలియజేస్తోంది. జీవాత్మ పరమాత్మలు ఒక్కటేనని విచారించింది. ఈ వేదములోనే ప్రణవ సంకేతమైన ఓంకార శబ్దమును మానవాళికి అందించినది. లౌకిక వస్తు సమదాయములన్నీ వివిధ నామములతో సూచించబడినట్లే అనంత విశ్వమును ఓంకారమనే శబ్ద సంకేతముతో సూచించినది. 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

బ్రాహ్మణులపై

 బ్రాహ్మణులపై బ్రాహ్మణేతర స్నేహితుడి దృక్పథం


ఒక నడకలో, ఒక స్నేహితుడు ఫోన్‌లో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌తో మాట్లాడుతున్నాడు.


“శాలిగ్రామ్‌లో బ్రాహ్మణులు ఎక్కువగా నివసించే వీధిలో మాత్రమే ఇల్లు వెతకండి. అది కొంచెం ముందు లేదా వెనుక ఉన్నప్పటికీ, నేను సర్దుబాటు చేసుకోగలను!”


నాకు ఇది చాలా వింతగా అనిపించింది మరియు అతనిని కారణం అడిగాను. అతను నాకు ఈ క్రింది అంశాలను ఇచ్చాడు:


1. బ్రాహ్మణులు నివసించే వీధిలో, తగాదాలు ఉండవు. రాజకీయ పార్టీ జెండాలు, నీటి పైపులైన్ల గురించి వివాదాలు లేదా అనవసరమైన తగాదాలు ఉండవు.

2. చేపలు మరియు మాంసం మిగిలిపోయిన వాటిని బయట వేయరు కాబట్టి, ఆ ప్రాంతంలో వీధి కుక్కలు మరియు పిల్లులు తక్కువగా ఉంటాయి.

3. వీధులు శుభ్రంగా ఉంటాయి. మురుగునీటి లీకేజీ ఉంటే, వారు వెంటనే మెట్రో వాటర్‌కు ఫోన్ చేసి దాన్ని సరిచేస్తారు. విద్యుత్ కోత ఉంటే, వారు వెంటనే విద్యుత్ బోర్డును సంప్రదిస్తారు.

4. మీరు వారితో మాట్లాడినప్పుడు పదవీ విరమణ చేసిన మామలు ప్రస్తుత వ్యవహారాలపై విలువైన అంతర్దృష్టులను అందిస్తారు.

5. మన పిల్లలు తమ పిల్లలతో కలిసి ఉంటారని మనం నమ్మవచ్చు.

6. మన పిల్లలు తమ పిల్లల్లాగే సాధారణ పెరుగు అన్నం తినడం ద్వారా పాఠశాలలో అధిక మార్కులు సాధించే కళను నేర్చుకుంటారు.

7. వారు తమ సొంత పిల్లల్లాగే తమ ఆహారాన్ని ఇతరులతో పంచుకుంటారు.

8. పిల్లలు పరిశుభ్రమైన జీవన విధానం అయిన “మది ఆచారం” నేర్చుకుంటారు.

9. వారి పిల్లలతో చదువుకోవడం ద్వారా, మన పిల్లలు TOEFL మరియు GRE లకు సిద్ధమవుతారు మరియు చివరికి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళతారు.

10. ధూమపానం, మాదకద్రవ్యాలు లేదా మద్యానికి గురికాకుండా ఉంటారు.

11. మనం వేరే చోటికి వెళ్లినా, ఆ వీధిలోని ప్రజలు ఎల్లప్పుడూ మమ్మల్ని తనిఖీ చేస్తారు మరియు మాతో సంబంధంలో ఉంటారు.

12. పొంగల్ మరియు దీపావళి వంటి పండుగలను గొప్పగా మరియు సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు.

13. కనీస జీతంతో ఇంటిని ఎలా నిర్వహించాలో మనం నేర్చుకోవచ్చు.

14. వారు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మరియు ఏదైనా అధికారిక పనికి సరైన విధానాల గురించి జ్ఞానం కలిగి ఉంటారు.

15. మన మహిళలు వారి నుండి ఉచిత వంట చిట్కాలను పొందుతారు మరియు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు! (ఆ విధంగా నాకు “ఈయ సోంబు రసం” మరియు “కచట్టి పులికుళంబు” పరిచయం అయ్యాయి. నేటికీ, అందుకే నా కొడుకు పూర్తిగా శాఖాహారిగా ఉన్నాడు!)

16. కొన్నిసార్లు, నేను కూడా అనుకుంటున్నాను—నా కోడలిగా అయ్యర్ అమ్మాయి ఎందుకు ఉండకూడదు? వారు తమ కుమార్తెలను అంత పరిపూర్ణతతో పెంచుతారు!

17. ఇంట్లో ఎప్పుడూ కర్ణాటక సంగీతం లేదా భరతనాట్యం నేర్చుకునే ఎవరైనా ఉంటారు. మన పిల్లలకు ఆసక్తి ఉంటే, వారు కూడా నేర్చుకోవచ్చు.

18. వివాహాల సమయంలో, వారు మమ్మల్ని చేర్చుకుంటారు మరియు మమ్మల్ని కుటుంబంలా చూసుకుంటారు.

19. కుటుంబంలో మరణం సమయంలో కూడా, వారు దానిని నిశ్శబ్దంగా మరియు గౌరవంగా నిర్వహిస్తారు, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా.


నేను ఆశ్చర్యపోయాను మరియు అతని వైపు చూస్తూనే ఉన్నాను.


నేను అడిగాను, “సార్, నేను బ్రాహ్మణుడిని అని మీకు తెలుసా?”


“ఓహ్, నిజంగానా? క్షమించండి, నాకు తెలియదు! నేను ఏదైనా తప్పు చెప్పానా?”


“ఇది సరైనదా లేదా తప్పు అనే దాని గురించి కాదు. నేను కూడా ఆలోచించని చాలా విషయాలను మీరు జాబితా చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది! దీన్ని నా ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేయవచ్చా?"


"ఖచ్చితంగా! నేను నిజం మాత్రమే మాట్లాడాను! ఎందుకంటే, నా కొడుకు మాంబళం అగ్రహారంలో పెరిగాడు మరియు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఇదంతా అతను అనుబంధించిన బ్రాహ్మణుల 'ప్రభావం' వల్లనే!" అని అతను బిగ్గరగా నవ్వుతూ అన్నాడు.


చాలా ధన్యవాదాలు సార్... అందరికీ బ్రాహ్మణుల పట్ల అలాంటి దృక్పథం ఉంటే, నేను ఈ సమాజంలో పుట్టినందుకు చాలా గర్వపడతాను!


🙏🙏🙏😁😁😁

తాళపత్ర గ్రంధాలు

 🙏పూర్వకాలపు తాళపత్ర గ్రంధాలు🙏

పూర్వకాలంలో వాడిన తాళ పత్రాలు ఇప్పటికి గ్రంథాలయాలలో భద్రపరచారు. ఇన్నివేల సంవత్సరాలనుండి ఎలా ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది.పూర్వకాలంలో కాగితాలు లేవు.అవి ఇన్ని వేల సంవత్సరాలు ఉంటాయి అని నమ్మకం లేదు. అసలు మన పూర్వీకులు తాళ పత్రములను ఎలా తయారుచేసేవారో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.అప్పట్లో తాళ పత్రములను గ్రంధములుగా తయారుచేసిన విధానం పరిశీలిద్దాము.

సాహిత్యం, కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ముందుతరాలకు అందించడానికి మన పూర్వికులు ఎంచుకున్న గొప్ప మాధ్యమం తాళపత్ర గ్రంథాలు. వివిధ రోగాలను నయంచేసే ఆయుర్వేద విజ్ఞానంతోపాటు పురాణేతిహాసాలు, పంచాంగాలు, శాస్ర్తాలు, లౌకిక గ్రంథాలు, వ్యాకరణాలు.. అన్నిటినీ తాళపత్రాలపైనే గ్రంథస్థం చేశారు. బృహత్‌ గ్రంథాల రచనకూ తాటాకులనే ఉపయోగించారు. అందుకే.. ఆ చారిత్రక ప్రతులు విలువైన సాంస్కృతిక సంపదగా నిలుస్తున్నాయి.

తయారీ విధానం..

తాళపత్రాల తయారీకి ప్రధాన ముడిసరుకు భూలోక కల్పవృక్షంగా పేరున్న తాటిచెట్లే. ఇందుకోసం 10 నుంచి 15 మీటర్ల ఎత్తు పెరిగే తాటిచెట్ల నుంచి ఒక మీటరు పొడవుతో పొరలు పొరలుగా ఉండే ఆకులను సేకరిస్తారు. ఎక్కువ పొరలు ఉన్న ఆకులు రాతకు అనుకూలంగా ఉంటాయి. చాలా కాలం మన్నుతాయి. ఇలా సేకరించిన ఆకులను శుభ్రపరిచి ఎండబెట్టి, తాటి రేకులుగా తయారుచేస్తారు. తాటి ఆకుల నుంచి రాయడానికి అనుకూలంగా ఉండే ‘తాళపత్రాలు’ తయారుచేయడం అన్నది ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఎందుకంటే, అమూల్యమైన జ్ఞాన సంపదను నిక్షిప్తం చేసుకున్న తాళపత్రాలు వందల ఏండ్లు మన్నేలా కాపాడుకోవాలి. అందుకే, వీటి తయారీలో ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ఇందుకు రకరకాల పద్ధతులు.

 ముందుగా తాటి ఆకులను నీడలో ఆరబెడు తారు. అవి మెత్తగా తయారవడానికి నువ్వుల నూనెను దట్టంగా పట్టిస్తారు.

› ఆకులను ఎండబెట్టిన తర్వాత మట్టిలో కానీ, ఇసుకలో కానీ 15 రోజులపాటు ఉంచుతారు. తర్వాత బయటికి తీసి శుభ్రపరుస్తారు. ఆకులకు చెదలు పట్టకుండా పసుపు రాస్తారు.

› తాటి ఆకులు సన్నగా, మృదువుగా మారడానికి వేడినీళ్లలో ఉడికిస్తారు. ఎక్కువ కాలం మన్నేలా ఆ నీటిలో పసుపు వేస్తారు. అనంతరం వాటిని ఎండలో ఆరబెడుతారు.

ఆకు పరిమాణాన్ని బట్టి ఒక్కో తాళపత్రంపై ఆరు నుంచి ఎనిమిది వరుసలు రాసేవారు. రెండువైపులా కలిపి నాలుగైదు పద్యాలను లిఖించేవారు. ఎడమవైపు పైభాగంలో తమ ఇష్టదైవాల చిత్రాలు వేసేవారు. ఇలా రాసిన పత్రాలను ఒక దగ్గర చేర్చి, గ్రంథాలుగా మారుస్తారు. ఇందుకోసం పత్రాలకు రెండు వైపులా (కొన్నిటికి ఒకవైపు మాత్రమే) రంధ్రాలు చేస్తారు. పత్రాలు విడిపోకుండా ఆ రంధ్రాల గుండా సన్నని తాడును దూర్చి ఆకులను బంధిస్తారు. ఈ పత్రాలు వంగిపోకుండా, విడిపోకుండా తాటిమట్టలు, టేకు చెక్కలను రక్షణగా వాడుతారు. ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమల రావు తాళపత్ర గ్రంథాల సేకరణ, పరిరక్షణ కోసం 30 ఏండ్లుగా కృషి చేస్తున్నారు. భారతదేశం అంతటా పర్యటించి వేల సంఖ్యలో తాళపత్రాలను సేకరించారు. వాటి వివరాలతో ‘తెలుగు రాతప్రతులు’ అనే పుస్తకాన్నీ రచించారు. ప్రాచ్య లిఖిత భాండాగారం, చెన్నై మ్యూజియం, వరంగల్‌లోని గిరిజన విజ్ఞాన పీఠాలలోనూ వేలాది తాళపత్ర గ్రంథాలున్నాయి.

సున్నితమైన మొనగలిగిన ‘ఘంటం’తో ఆకులపై అక్షరాలను చెక్కే పద్దతి పూర్వం ఉండేది. రాసేవారు నేల మీద కూర్చుని, ఘంటాన్ని కుడిచేతిలో పట్టుకుని.. ఆకుపై కావలసిన అక్షరాలను చెక్కుతారు. అయితే, తాటి ఆకుపై ఘంటంతో చెక్కిన అక్షరాలు సరిగ్గా కనిపించవు. అందుకే, ఆ అక్షరాలపై ప్రత్యేకంగా తయారుచేసిన బూడిద పూస్తారు. ఇందుకోసం కొబ్బరి చిప్పలు, గడ్డి కాల్చగా వచ్చిన నల్లటి బూడిదకు పసుపు, నువ్వుల నూనె కలుపుతారు. ఈ మిశ్రమాన్ని పత్రాలపై రాసిన అక్షరాలపై పూస్తారు. అక్షరాల చుట్టూ అధికంగా ఉన్న రంగును వస్త్రంతో శుభ్రం చేస్తారు.ఇంత కష్టపడితేగాని తాళ పత్రం తయారుగాదు. వేల సంవత్సరాలు మన్నిక కలిగి ఉన్నవి

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఇష్టాలు మారుతున్నాయి

 🙏🕉️శ్రీమతేనమఃశుభోదయం🕉️🙏              🏵️ఇష్టాలు మారుతున్నాయి, కానీ ప్రేమ మారకూడదు.. కష్టాలు వస్తుంటాయి, కానీ నమ్మకం కోల్పోకూడదు.. మాటలు మారతాయి, కానీ ఇచ్చిన మాట మరువకూడదు.. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది.. ఎందుకంటే ఏ బంధమైన మన అని మనం అనుకుంటే సరిపోదు.. ఎదుటి వారు కూడా మన అని అనుకున్నప్పుడే ఆ బంధం బలపడుతుంది🏵️నువ్వు ఎంత గొప్పవాడివి అనేది నీ పుట్టుకలోనో, నీ చదువులోనో, నీ డబ్బులోనో, నీ పొగడ్తలోనో కాదు.. నువ్వు ఇతరులను ఎలా అర్ధం చేసుకున్నావు, ఎలా గౌరవిస్తావు అనే దానిలో ఉంది🏵️నీ కోసం నీ జీవితం మొత్తంలో నీ కన్నా ఎక్కువగా ఆలోచించే వారు.. నువ్వు బాగుంటే చాలని తపన పడేవారు ఒక్క రైనా ఉంటే చాలు నీ జీవితం ధన్యమైనట్లే..అలాంటి వారు నీవు తిరిగి ఏదో చేయాలి అని ఆశించరు..నీవు చేయవలసిందల్లా నీపై ఎదుటి వారు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడం..మంచి ఆలోచనతో ముందుకు సాగడం🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్యసలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510*🙏🙏🙏

కలములు లేవు వాక్పటిమఁ గైకొని వ్రాయుదమన్న ధీమతిన్

 చ.కలములు లేవు వాక్పటిమఁ గైకొని వ్రాయుదమన్న ధీమతిన్

వెలుగులు జిందు యంత్ర పరి వేష్టిత మీ చరవాణి చక్రమే

కలదని నమ్మ సర్వము కకావికలమ్మగు వంతఁ గూర్చెడున్

దలఁపఁగ పూర్వసత్కవుల ధారణ నెన్నఁగ మేలు  భారతీ!౹౹ 55


చ.పరభృత రాగ వల్లరు లవాంఛిత మయ్యెను దిక్కు లేని యీ

కరభృత నాద వైఖరులె గానము లయ్యె నిదేమి మాయ?యె

ద్దరి చరవాణి దూషిత వితర్కిత భాషణ లెంచగా మనో

హరములుగా జనాళికిల హారములై చనె నేల భారతీ?౹౹56

నేటి వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  - షష్ఠి -  స్వాతి-‌‌  సౌమ్య వాసరే* (19.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*