23, ఆగస్టు 2022, మంగళవారం

ధర్మాకృతి

 ధర్మాకృతి : గిణి


సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ఉద్యోగధర్మాన శ్రీస్వామినాథన్ బాల్యము విల్లుపురము, తిండివనం చిదంబరం, ఫిరంగిపేట, వికరవాండి మొదలైన గ్రామాల్లో గడిచింది. ముందు జీవితమంతా గ్రామగ్రామంగా విజయం చేయబోతున్నారనేందుకు సూచనేమో ఈ త్రిప్పట.

పెద్దకుమారుడు కలిగిన తొమ్మిదేళ్ళ తరువాత ఇక పుత్రులు కలగరేమో బెంగపడుతున్న సమయంలో పుట్టిన వారవడంతో శ్రీస్వామినాథన్ అంటే తల్లిదండ్రులకు ఎంతో ముద్దు, గారాబం. డానికి తోడు చురుకుదనం, మంచి నడవడి, చక్కదనం, మంచి మాటకారితనం, ఇవన్నీ కలసి వారిపై మరింత ఆదరాన్ని కలుగజేశాయి. ఇన్ని వన్నెలున్న తమ కుమారుని పంచవన్నెల రామచిలుకకు కన్నడ పర్యాయపదమైన ‘గిణి’ అనే పేరుతో పిలుచుకోసాగారు. 


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఏకాదశులు

 *ఏకాదశులు వాటి విశిష్టతలు*


ఏకాదశి అనగానే హిందువులకు గుర్తుకు వచ్చేవి తొలఏకాదశి ముక్కోటి ఏకాదశి. కొంతమంది ఏకాదశికి ఉపవాసం ఉంటారు. ప్రతి నెలలోనూ రెండు సార్లు ఏకాదశులు వస్తాయి. వీటిలో దేని ప్రత్యేకత దానిదే.  ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి. 1. శుక్లపక్షము 2. కృష్ణ పక్షము … పక్షానికొక ఏకాదశి చొప్పున్న .. ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులుంటాయి.


ప్రతి నెల పౌర్ణమికి,అమావాస్యకు ముందు ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఆషాడ శుక్ల ఏకాదశిని ప్రధమ ఏకాదశిగా పరిగణిస్తారు. సంవత్సరం మొత్తంలో ఇలాంటి శుద్ధ ఏకాదశులు 12 వస్తాయి. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తంలో ఇలాంటి బహుళ ఏకాదశులు 12 వస్తాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ…. హిందువులు ముఖ్యంగా నాలుగు ఏకాదశులను విశేషంగా పరిగణిస్తారు. అవే


1. ఆషాడ శుద్ధ ఏకాదశి ( తొలి ఏకాదశి / శయనేకాదశి )

2. కార్తీక శుద్ధ ఏకాదశి

3. పుష్య శుద్ధ ఏకాదశి ( వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి )

4. మాఘ శుద్ధ ఏకాదశి ( భీష్మ ఏకాదశి ) వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి.


చైత్రమాసం నుంచి వచ్చే ఏకాదశుల పేర్లు – వాటి ఫలాలు ఓసారి చూద్దాం

చైత్రశుద్ధ ఏకాదశి (పున్నమి ముందు వచ్చే ఏకాదశి) – ‘కామదా’ – కోర్కెలు తీరుస్తుంది.

చైత్ర బహుళ ఏకాదశి (అమావాస్య ముందు వచ్చే ఏకాదశి) – ‘వరూధిని’ – సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.

వైశాఖ శుద్ధ ఏకాదశి – ‘మోహిని’ – దరిద్రుడు ధనవంతుడు అవుతాడు.

వైశాఖ బహుళ ఏకాదశి – ‘అపరా’ – రాజ్యప్రాప్తి.

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి – ‘నిర్జల” – ఆహార సమృద్ధి.

జ్యేష్ఠ బహుళ ఏకాదశి – ‘యోగిని’ – పాపములను హరిస్తుంది.

ఆషాఢ శుద్ధ ఏకాదశి – ‘దేవశయనీ’ – సంపత్ ప్రాప్తి(విష్ణువు యోగనిద్రకు శయనించు రోజు- తొలిఏకాదశి).

ఆషాఢ బహుళ ఏకాదశి – ‘కామికా’ కోరిన కోర్కెలు ఫలిస్తాయి.

శ్రావణ శుద్ధ ఏకాదశి – ‘పుత్రదా’ – సత్సంతాన ప్రాప్తి.

శ్రావణ బహుళ ఏకాదశి – ‘ఆజా’ – రాజ్య పత్నీ పుత్ర ప్రాప్తి, ఆపన్నివారణ.

భాద్రపద శుద్ధ ఏకాదశి – ‘పరివర్తన’ (యోగనిద్రలో విష్ణువు పక్కకు పొర్లును, అందుకే పరివర్తన యోగసిద్ధి).

భాద్రపద బహుళ ఏకాదశి – ‘ఇందిరా’ – సంపదలు, రాజ్యము ప్రాప్తించును.

ఆశ్వయుజము శుక్ల ఏకాదశి – ‘పాపంకుశ’ – పుణ్యప్రదం.

ఆశ్వయుజము బహుళ ఏకాదశి – ‘రమా’ – స్వర్గప్రాప్తి.

కార్తీక శుద్ధ ఏకాదశి – ‘ప్రబోధిని’ – (యోగనిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు) జ్ఞానసిద్ధి.

కార్తీక బహుళ ఏకాదశి – ‘ఉత్పత్తి’ – దుష్టసంహారం (మురాసురుని సంహరించిన కన్య విష్ణుశరీరం నుండి జనించిన రోజు).

మార్గశిర శుద్ధ ఏకాదశి – ‘మోక్షదా’ – మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

మార్గశిర బహుళ ఏకాదశి – ‘విమలా’ -(సఫలా) – అజ్ఞాన నివృత్తి.

పుష్య శుద్ధ ఏకాదశి – ‘పుత్రదా’ – పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

పుష్య బహుళ ఏకాదశి – ‘కళ్యాణీ’ (షట్ తిలా) ఈతిబాధా నివారణం.

మాఘ శుద్ధ ఏకాదశి – ‘కామదా’ (జయా) – శాపవిముక్తి.

మాఘ బహుళ ఏకాదశి – ‘విజయా’ – సకలకార్య విజయం.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి – ‘ఆమలకీ’ – ఆరోగ్యప్రదం.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి – ‘సౌమ్య’ – పాపవిముక్తి

(కొన్నికొన్ని పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో కొన్ని బేధాలున్నాయి. వాటిని ఇక్కడ ప్రస్తావించట్లేదు)


24 ఏకాదశులలోనూ – సౌరమానంలో ప్రసస్తమైన ధనుర్మాసంలో (మార్గశిర/పుష్యమాసాల్లో) వచ్చే శుక్లపక్ష ఏకాదశిని “వైకుంఠ ఏకాదశి”గా కీర్తిస్తున్నాం. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు.  సౌరమానం ధనుర్మాసం కాగా, అందులో వచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానానుసారిణి, శ్రీమన్నారాయణునకు సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను. కన్నులు వేర్వేరు ఐనా దృష్టి మాత్రం ఒక్కటే అయినట్లుగా సూర్యచంద్రులు వేర్వేరు అయినా….. కాంతితత్త్వం ఒక్కటే అనే మహాతత్వాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది.


వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర, పుష్య మాసాల్లో వస్తుంది. రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకొని వైకుంఠము చేరి, హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశినాడు శ్రీహరిని ప్రార్థించి, తమ బాధను విన్నవించారు. స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి, అభయం ఇచ్చుట జరిగింది. దేవతల బాధా నివారణకి ఈ ఏకాదశియే మార్గం చూపింది.


🚩 * 🚩

22, ఆగస్టు 2022, సోమవారం

వందే కృష్ణం జగద్గురుం

 కృష్ణ తత్వాన్ని చక్కగా వివరించిన "కార్తికేయ 2 " సినిమా లోని కొన్ని అద్భుతమైన మాటలు..


కృష్ణుడు అంటే సత్యం, ఆనందం, పరబ్రహ్మ స్వరూపం. అన్ని దైవ స్వరూపాలు ఆత్మ తత్వాన్ని బోధించేవే.


కృష్ణుడు దేవుడు అనే భక్తితో కన్నా ఒక గురువుగా స్వీకరిస్తే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను దాటి అద్భుతాలు చూడొచ్చు


గీతతో కోట్లమందికి దారిచూపించిన 

అతనికన్నా గురువెవ్వరు..?


రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా

 గొప్ప ఆర్కిటెక్ట్ ఎవ్వరు..?


నమ్మినవారి కోసం 

ఎంతటి వలయాన్నైనా ఛేదించే అతనికన్నా గొప్ప నమ్మకస్తుడు ఎవరు..?


యుద్ధం చేస్తే ఇన్ని లక్షల మంది తెగటారిపోతారు, 

ఇన్ని లక్షల లీటర్ల రక్తం ఏరులై పారుతుంది, యుద్ధం వద్దు సంధి ముద్దు అని చెప్పి ఒప్పించాలని శతకోటి ప్రయత్నాలు చేసిన అతనికన్నా ముందుచూపున్న గొప్ప శాంతిదూత ఎవరు...?


చూపుతోనే మనసులోని మాటచెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు


వేణుగానంతోనే గోవుల్ని, గోపికల్ని కట్టిపడేసే అతనికన్నా గొప్ప మ్యూజిషియన్ ఎవరు..?


నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు....?


ధర్మం కోసం 

యుద్ధం చేయమని చెప్పిన అతన్నిమించిన వీరుడెవరు...?


 నమ్ముకున్న వాళ్ళ వెంట ఉండి విజయమో వీర స్వర్గమో కర్త్యవం ముఖ్యం 

ఫలితం దైవాధీనం అని చెప్పి నడిపించిన అతనికన్నా 

గొప్ప దార్శనికుడు ఎవరు...?


కరువూ కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవ్వరు..?


హోమ యాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న    కైమటాలజిస్ట్ ఎవరు..?


అన్ కంట్రోలబుల్ ఆర్.పి.యం.తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతన్ని మించిన   కైనటిక్ ఇంజనీర్ ఎవరు..?


మరణం ఎప్పటికైనా తథ్యం అని గీత ద్వారా చెప్పి నడిపించే అతనికన్నా 

గొప్ప విరాగి ఎవరు..?


అతనొక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, మ్యూజిషియన్, మేజిషియన్, దార్శనికుడు అనంతంలో నిండియున్న సృష్టి...


వందే కృష్ణం జగద్గురుం

విజయం సాధించి తీరుతాం

 చక్కని కథ. విధి చేసేది ఎప్పుడూ మన మంచికే. 


*ఒక ధనవంతుడు ఉండేవాడు. ఒక సెలవు రోజున పడవ తీసుకుని సరదాగా సముద్రంలో ఒంటరిగా షికారుకి వెళ్లాడు. అతను సముద్రంలో కొంచెం దూరం చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్రమైన తుఫాను వచ్చింది.*  


 *తుఫాను వల్ల అతని పడవ పూర్తిగా ధ్వంసమవ్వడంతో అతను సముద్రంలోకి దూకేశాడు. లైఫ్ జాకెట్ ఉండడం వల్ల నీటిలో తేలుతూ, తుఫాను శాంతించిన తర్వాత ఒక ద్వీపానికి చేరుకున్నాడు. కానీ, ఆ ద్వీపంలో మనుషుల జాడ లేదు. చుట్టూ సముద్రం తప్ప ఏమీ కనిపించడంలేదు.*   


 *అప్పుడా వ్యక్తి "నా జీవితంలో నేను ఎవరికీ చెడు చేయనప్పుడు నాకే ఎందుకిలా జరిగింది అని" బాధపడ్డాడు. ఆ తర్వాత "తనను మరణం నుండి రక్షించిన భగవంతుడు, తీరం చేరుకునేందుకు కూడా దారిని చూపిస్తాడని" మనసులో దేవుణ్ణి గట్టిగా విశ్వసించాడు.* 


 *ఆ ద్వీపంలోనే ఒంటరిగా నివసిస్తూ అక్కడ పండే ఆకులు, పండ్లు తింటూ బతకడం అలవాటు చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత నెమ్మదిగా అతనిలోని ఆశలు నీరుగారిపోవడం మొదలైంది. కానీ దేవుడిపట్ల అతని విశ్వాసం మాత్రం తగ్గించుకోలేదు. దాంతో తన జీవితమంతా ఈ దీవిలో గడపక తప్పదని నిర్ణయించుకుని ఆ ద్వీపంలో తాను నివసించేందుకు ఓ గుడిసె నిర్మించుకోవడం ప్రారంభించాడు.* 


 *గుడిసె నిర్మాణం పూర్తవ్వగానే మళ్ళీ అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది. అతని గుడిసెపై పిడుగు పడి గుడిసె కాలిపోసాగింది.* 


 *ఇదంతా చూసి విస్తుపోయిన ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ "దేవుడా! ఎంతవరకు నీకిది న్యాయం, ఎన్ని కష్టాలు ఎదురైనా నీపై ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోలేదు. నిన్నే నమ్ముకున్నాను. నువ్వెందుకు నాపై దయ ఎందుకు చూపడంలేదు స్వామీ" అంటూ నిరాశనిస్పృహలలో కూరుకుపోయి ఏడవడం ప్రారంభించాడు.* 


 *అంతలో అకస్మాత్తుగా ఒక పడవ ఆ ద్వీపం సమీపంలోకి వచ్చింది.* 


 *పడవలోంచి ఇద్దరు వ్యక్తులు దిగి వచ్చి మిమ్మల్ని రక్షించేందుకు వచ్చామని చెప్పారు. కాలిపోతున్న గుడిసె దూరం నుంచి మాకు కనబడి ఈ నిర్జనద్వీపంలో  ఎవరో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. మీరు మీ గుడిసెను కాల్చిఉండకపోతే, ఇక్కడ మీరున్న విషయం మాకు తెలిసి ఉండేది కాదని అన్నారు.* 


 *అప్పుడు ఆ వ్యక్తి కళ్లలో నీళ్ళు తెచ్చుకుని ఆ భగవంతుని క్షమాపణలు కోరుతూ "ఓ ప్రభూ! నన్ను రక్షించడానికి నువ్వే పిడుగు రూపంలో నా గుడిసెను తగలబెట్టావని నేను గ్రహించలేకపోయాను. నువ్వు నా సహనాన్ని పరీక్షించావు. కానీ, నేనే అందులో విఫలమయ్యాను. నిశ్చయంగా నిన్ను నమ్మినవారిని తప్పకుండా కాపాడతావని నువ్వు నిరూపించుకున్నావు. దయచేసి నన్ను క్షమించు ప్రభూ" అని మనసులోనే నమస్కరించుకున్నాడు.* 

 

 *ఈ కథలోని నీతి* 


 *“సుఖంలోనైనా, దుఃఖంలోనైనా, తనను నమ్మినవారితో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. సహనం కోల్పోయినప్పుడు మనిషికి ఒక్కోసారి దేవుడిపై కోపం వస్తుంది. కానీ, మనిషిపై దేవుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోడు. ఆయన ఎల్లప్పుడు మంచినే చేస్తాడు. జీవితంలో అప్పుడప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. మనం, నిరాశతో దేవుడు లేదా విధిపై కోపం తెచ్చుకుంటాము. విశ్వాసాన్ని కోల్పోతాము. దాని కారణంగా మన ఆత్మవిశ్వాసం కూడా క్షీణించిపోయే అవకాశముంటుంది. కానీ, ఆ తర్వాత మనకు నెమ్మదిగా అర్థమవుతుంది. ఆ దేవుడు/విధి చేసింది మంచిదేనని. లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాణ్ణి కాదని.* 


 *కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా, దుఃఖం ఎంత కృంగదీసినా, కరోనాలు కాటు వేయాలని చూసినా, సమస్యలు ఎంత తొక్కేయాలని చూసినా ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా, భగవంతుడిపై భారముంచి, పట్టుదలతో మన పని మనం చేసుకుంటూ వెళితే తప్పకుండా విజయం సాధించి తీరుతాం


🌻🌞🌻🌞🌻🌞🌻🌞🌻

తక్షణ కర్తవ్యం.

 *భగవత్ సాన్నిధ్యం*


పరమానందకరమైనది, చిట్టచివరి గమ్యం భగవత్‌ సాన్నిధ్యం. దాన్ని కోరుకోవడం మానవ సహజం. కానీ, కోరుకున్నంత సులువుగా అది లభించదు. ‘భగవత్‌ సాన్నిధ్యం సులభంగా లభించడం కోసం ముందుగా సాధువుల సన్నిధికి చేరుకోవాలి’ అని మహాత్ముల అభిప్రాయం.


సాధుల హృదయము నాయది

సాధుల హృదయంబు నేను, జగముల నెల్లన్‌

సాధుల నేనే యెరుగుదు

సాధులెరుంగుదురు నాదు చరితము విప్రా!


పై భాగవత పద్యాన్ని అనుసరించి ‘సాధువుల హృదయమే నాది. అదే నేను’ అని పేర్కొన్నాడు శ్రీమహావిష్ణువు. 


సౌకర్యం ఏమంటే భగవంతుడు శరీరధారి అయి మనకు కనిపించకపోయినా, సాధువులు ఎక్కడో ఒకచోట కనిపిస్తారు. నిజమైన సాధువు కోసం అన్వేషించాలి. భగవత్‌ విభూతి నిండిన సాధువులు మన అదృష్టం కొద్దీ లభించారా భగవంతుడికి మనం సన్నిహితులం కావడం అంత కష్టమైన పనేం కాదు. అందుకే సాధు సజ్జన సాంగత్యానికి అంత ప్రాధాన్యం.


నిజమైన సాధువులు ఎలా ఉంటారో, వారిని ఎలా గుర్తుపట్టాలో ముందుగా తెలుసుకోవలసి ఉన్నది. సంత్‌ కబీర్‌దాస్‌ సాధువు గురించి గొప్పమాట సెలవిచ్చాడు.


నిరబైరీ నిహకాంమతా, సాయి సేతీ నేహ

విషియా సూఁన్యారా రహై, సంతహి కా అంగ్‌ ఎహ్‌


‘ఎవరి మీదా పగలేకపోవడం, ఏ కోరికలూ లేకపోవడం, విషయ సుఖాలపై ఆసక్తి లేకపోవడం, దైవం పట్ల దృఢమైన భక్తి సాధువు సహజ గుణాలు’ అని కబీర్‌ ప్రవచించాడు. 


అంతేకాదు, ఎంతమంది దుర్జనులు చుట్టూ ఉన్నా సాధువు మారడు. గంధపు చెట్టును పాములు ఎన్నో ఆశ్రయించినా, అది తన సహజ స్వభావమైన చల్లదనాన్ని వదులుకోదు కదా! అలాగే తమచుట్టూ ఎలాంటి వ్యక్తులున్నా వారి సహజ స్వభావంలో ఎలాంటి మార్పూ రాదు! ఎంతదూరం నుంచి చూసినా సాధువును గుర్తించవచ్చు. 


వారి శరీరం శుష్కించి ఉంటుంది. చూపు ఎప్పుడూ పైకి ఉంటుంది (ఊర్ధ దృష్టి). లోక వాసనలుండవు. ఎప్పుడూ సంచారం చేస్తూనే ఉంటారు. అందుకే కబీర్‌ ‘కబీర్‌ హరికా భావతా’ అనే దోహాలో ఈ లక్షణాలనే పేర్కొన్నాడు.


సాధువు ఎలా ఉంటాడో, ఏ లక్షణాలను చూసి అతణ్ని సాధువుగా గుర్తించాలో కూడా వివరించాడు కబీర్‌దాసు. 


‘ఎల్లప్పుడూ శ్రీహరిని భజిస్తూ ఉంటాడు. దైవానికి దూరమయ్యాననే బాధ అతణ్ని ఎప్పుడూ పీడిస్తూ ఉంటుంది. తనను గురించి ధ్యాస ఉండదు. నిదురపోతున్నట్టు కూడా కనిపించడు’ అంటాడు. 


అంతేకాదు, ‘వజ్రవైడూర్యాలు ఒకచోట రాశిగా పడనట్టు, రాజహంసలు ఒకేచోట గుంపుగా కనిపించనట్టు, సింహాలు ఒకేచోట సంచరించనట్టుగా.. సాధువులు కూడా జట్లుజట్లుగా మనకు తారసపడర’ని కబీర్‌ అభిప్రాయం.


ఆహ్వానించినంత మాత్రాన సాధువులు ఎవరి ఇండ్లకూ రారు. సద్గుణ సంపన్నులని తమకు విశ్వాసం కలిగినవారి ఇండ్లకే విచ్చేస్తారు. ఎవరింటికి సాధువుల రాకపోకలు జరుగుతూ ఉన్నాయో కనుక్కొని వారింటికి వెళ్లాలి. ఆ ఇంటి యజమానులు ఫలానా వాళ్లు సాధువులు అని నిర్ధారించుకున్న తర్వాతే కదా వారిని ఆహ్వానిస్తున్నది! అప్పుడు సాధువులు ఎవరో నిర్ధారించుకునే శ్రమ చాలావరకు తగ్గుతుంది. 


అయితే, మారుతున్న కాలాన్ని బట్టి చాలామంది సాధువుల రూపంలో, పాదపూజల నెపంతో తారసపడుతూ ఉంటారు. పైపై మెరుగులు, పటాటోపాల మాయలో పడకుండా నిజమైన సాధువును గుర్తించడం సాధకుడి బాధ్యత! సద్గురువు మార్గదర్శనంలో నిజమైన సాధువు ఎవరో తెలుసుకోవడం ఉత్తమం. 


సాధువులు ఎలా ఉంటారో, వారికి ఎలాంటి లక్షణాలుంటాయో కనిపెట్టిన తర్వాత గాని సాధకులు ముందడుగు వేయకూడదు. 


నిజమైన సాధువు తారసపడితే మాత్రం వారి అనుగ్రహం కోసం ఎన్నాళ్లు ఎదురుచూసినా తప్పులేదు. ప్రయత్నపూర్వకంగా వారిని దర్శిస్తూ ఉండాలి. వారితో మర్యాదగా సంభాషించాలి. వారి ఉపదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలి. వాళ్లు పెట్టే పరీక్షలను తట్టుకోవాలి. ఇన్ని చేస్తేగానీ, సాధువు అనుగ్రహం లభించదు. వారి చల్లని దృష్టి సోకితే మాత్రం జీవితం సార్థకమవుతుంది. భగవత్‌ సాన్నిధ్యం సులభతరమవుతుంది.


ఇక సాధువులను గుర్తించి వారి ఉపదేశాలను పాఠించడమే తక్షణ కర్తవ్యం.

పవిత్రమైనవే

 🙏🌷💞 శ్రీ మాత్రే నమః శుభోదయం💞🌷🙏.              🌹 బురదలో ఉన్నప్పటికీ కలువపువ్వు పవిత్రమైనవే🌹 విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే🌹 జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జన్నాన్ని ఎవ్వరినీ అంచనా వేయకూడదు🌹 మనమీద మనకే నమ్మకం పెరగాలంటే అంతరాత్మకి జవాబుదారీగా ఉండాలి🌹 మనమీద ఇతరులకు నమ్మకం పెరగాలంటే మన తప్పులకు మనమే బాధ్యత వహించాలి🌹 బండరాయి సైతం ఓర్పు వహిస్తే ఆలయంలో విగ్రహంగా పూజలు అందుకుంటుంది🌹 మనిషి కూడా సహనంతో ఉంటే సాధించలేనిది ఏదీ లేదు🌹🌹🌹 మీ అల్లంరాజు భాస్కర రావు

శ్రీ విజయ ఆయుర్వేదిక్

గోకవరం బస్ స్టాండ్

Rajhamundry

9440893593🙏🙏🙏🙏

గురు దక్షిణ :---

 గురు దక్షిణ  :---


“తప్పదు నాన్నా.  అంతకన్నా నాకు వేరే దారి లేదు". కొడుకు మాటలకు ఖిన్నుడైపోయాడు రాఘవ రావు. జానకమ్మ ఎటూ చెప్పలేక కొయ్యబొమ్మలా నిలబడిపోయింది. తల్లీ, తండ్రి ఇద్దరికేసి మరోమారు చూసి బాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు రాజేష్.

రాజేష్ వెళ్ళిన రెండు నిముషాల వరకూ భార్యా, భర్తా ఇద్దరూ అలానే గుమ్మం కేసి చూస్తూ ఉండిపోయారు.  ముందుగా జానకమ్మ తేరుకుని నిట్టూర్పు విడిచి వంటింట్లోకి వెళ్ళింది. రాఘవ రావు కండువా భుజమ్మీద వేసుకుని పార్కుకి బయల్దేరాడు. పదినిముషాలలో పార్కుకి చేరుకున్నాడు.  అప్పటికే అతని మిత్రులు పరమేశం, సుబ్బారావు బెంచి మీద కూర్చుని ఉన్నారు. సుబ్బారావు పక్కకు జరిగి ‘రా రాఘవా’ అని ఆహ్వానించాడు.

మ్లానవదనంతో కూర్చున్న రాఘవరావు ని చూసి , ఇంటి దగ్గర ఏదో అయ్యిందని గ్రహించారు మిత్రులు ఇద్దరూ.  కాసేపు లోకాభిరామాయణం మాట్లాడారు వాళ్ళు ఇద్దరూ. తర్వాత పరమేశం అన్నాడు “చూడు రాఘవా, నువ్వు ఏదో విషయం గురించి బాధపడుతున్నట్టున్నావు.

నీ బాధ నీ సన్నిహితులుతో పంచుకుంటే కొంత వరకూ ఉపశమనం కలుగుతుంది.  మన ముగ్గురి మధ్యా రహస్యాలు లేవుగా.”  రాఘవ రావు దీర్ఘంగా నిట్టూర్చి “మా అబ్బాయి ఇల్లు అమ్మేయమంటున్నాడు.” అన్నాడు.  “కారణం?” అడిగాడు సుబ్బారావు. “ఎనభై లక్షల, త్రీ బెడ్ రూమ్ ప్లాట్ అరవైకే వస్తోందట. మళ్ళీ ఈ అవకాశం రాదుట.  నేను ఈ ఇల్లు అమ్మితే వచ్చే డబ్బు, వాడి దగ్గర ఉన్న డబ్బు కలిపి ఆ ప్లాట్ కొంటాడట.  అదీ సంగతి.” అని కండువాతో మొహం తుడుచుకున్నాడు రాఘవ రావు.  మిత్రులు ఇద్దరూ ఆలోచనలో పడ్డారు.  కాసేపటికి సుబ్బారావు అడిగాడు “మీ ఆవిడ ఏమంది?”

“తల్లి ప్రేమ కదా, కొడుకు వైపే మాట్లాడింది.  ఎలాగూ చివర దశలో వాడి దగ్గరకు చేరవలసిన వాళ్ళమే కదా అని అంది.”

“రాఘవా, నువ్వు చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నావు. ఆ మమకారం ఉంటుంది. కానీ పరిస్తితుల్ని బట్టి మనం నడచుకోవాలి.  నీకు ఒక్కగానొక్క కొడుకు.  అతణ్ణి

కాదని అంటే, రేపు నిన్ను చూడటానికి కూడా రాడేమో ఆలోచించు.  ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాంగా” అన్నాడు పరమేశం.  సుబ్బారావు కూడా పరమేశం లాగే కొడుకు దగ్గరకు వెళ్ళడమే మంచిదని సలహా ఇచ్చాడు.  ఒక అరగంట కూర్చుని ఇంటికి వచ్చాడు రాఘవ రావు. అన్యమనస్కంగానే భోంచేసి పడుకున్నాడు.  కానీ ఎంతకూ నిద్ర రావడం లేదు.  గతం పదే పదే గుర్తుకు వస్తోంది .

పంచాయతీ ఆఫీస్ వెనక ఉన్న ఖాళీ స్థలాల్ని తక్కువ రేటుకి ఇస్తున్నారని, మాస్టార్లందరూ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. అందరూ రెండు వందల గజాలు స్థలం తీసుకుంటే, రాఘవరావు భార్య కోరిక మీద నాలుగు వందల గజాల స్థలం తీసుకున్నాడు. జానకమ్మకు మొక్కలంటే ప్రాణం. అందుకే స్థలం మధ్యలో ఇల్లు కట్టుకుని చుట్టూ ఉన్న జాగాలో చాలా మొక్కలు వేసుకున్నారు. రాఘవరావు స్కూల్ లో ఉంటే, జానకమ్మే ఇంటి నిర్మాణం పనులు చూసేది.  పనివాళ్ళతో సమంగా తానూ ఎండలో నిలబడి వారిచేత పనులు చేయించేది.  వాస్తవానికి, రాఘవరావు కన్నా జానకమ్మే ఇంటి కోసం కష్ట పడింది.  ఒక ఆదివారం నాడు భార్యా భర్తలు ఇద్దరూ కడియం వెళ్లి రక రకాల పూల మొక్కలు, మామిడి, పనస, సపోటా మొక్కలు చిన్న వాన్ మీద తెచ్చుకున్నారు.  మిగతా మాస్టర్లు

‘వాళ్ళిద్దరికీ చాదస్తం అని’  విమర్శించినా వాళ్ళ ఇల్లు నందన వనంలా పెరిగాక అభినందించ కుండా ఉండలేక పోయారు. అందరూ బోరింగ్ పైపులు వేయించుకున్నా, రాఘవరావు మాత్రం నుయ్యి తవ్వించుకున్నాడు .

నూతి పళ్ళెం దగ్గరనుండి తూములు ఏర్పాటు చేసి నీళ్ళు మొక్కలకు చేరేటట్లు చేసాడు. ఉదయమే నూతి దగ్గర స్నానం చేసి, సూర్యుడికి నమస్కరించి ఇంట్లోకి వచ్చేవాడు. మామిడి చెట్టు బాగా పెరిగి పెద్దది అయ్యాకా దానికి సిమెంట్చప్టా చేయించాడు.  రాఘవరావు స్కూల్ నుంచి వచ్చాక మామిడి చెట్టుకింద ఉన్న చప్టా మీద కూర్చుంటే, జానకమ్మ కాఫీ తీసుకు వచ్చి ఇచ్చేది.  ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగేవారు.  సెలవు రోజుల్లో మిత్రులు వస్తే వాళ్ళ మీటింగ్ కూడా మామిడి చెట్టుకిందే.  వేసవికాలం సాయంత్రాలలో భార్యా భర్తలు ఇద్దరూ ఆ చెట్ల మధ్యే కూర్చుని మాట్లాడుకునే వారు.  టీచర్స్ కాలనీ లో ఏ శుభకార్యం జరిగినా రాఘవరావు ఇంటి నుండే మామిడి ఆకులు తెచ్చుకుని తోరణాలు కట్టుకునే వారు.  సపోటా పళ్ళు కూడా రాఘవరావు మిత్రులు అందరకు పంపించేవాడు.  రెండు పడక గదులు, ఒక హాలు, వంటగది అన్నీ విశాలంగా ఏర్పాటు చేసుకున్నాడు రాఘవరావు.

పాతిక ఏళ్ల అనుబంధం ఉంది ఆ ఇంటితో వాళ్ళిద్దరికీ.  ఎన్నో అందమైన అనుభూతులు, జ్ఞాపకాలు ఉన్నాయి.  వాటిని ఒక్కసారిగా వదులుకోవాలంటే రాఘవరావు తట్టుకోలేక పోతున్నాడు.  కానీ తప్పదు.

కొడుకు కోరిక తీర్చాలి. ఏం చేస్తాం? అని మధనపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు రాఘవరావు.


కొడుకు తరచూ ఫోన్లు చేయడం, భార్య కూడా పదే పదే చెప్పడంతో రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లుచూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు. పాతిక ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫాషన్ కి అనుగుణంగా లేదని కొందరు, ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ వదిలేసారని మరి కొందరు వెనక్కి వెళ్ళిపోయారు.  ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు.  జానకమ్మ బెంగ పెట్టుకుంది, కొడుకుకి సాయం చేయలేకపోతున్నామని.  ఒక రోజు షావుకారు వెంకటరావు వచ్చాడు ఇల్లు చూడటానికి.  ప్రతి గది పరిశీలన చేసాడు. దొడ్డి అంతా టేపు తో కొలిచాడు.  భార్యాభర్తలు ఇద్దరూ అతను ఏం చెబుతాడా? అని ఆతృతగా చూస్తున్నారు. చివరికి పెదవి విప్పాడు షావుకారు.

“మాస్టారు, ఇల్లు కట్టి పాతిక ఏళ్ళు అయ్యింది, అంటే పాతదాని కిందే లెక్క.  ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి.  మీరు ఏభై లక్షలు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు. ఏమంటారు?”


రాఘవరావు మౌనం వహించాడు. జానకమ్మే అంది. ‘ఇక్కడ గజం రేటు పదివేలకు పైమాటే.  అలా చూసినా, నాలుగు వందల గజాలకు నలభై లక్షలు, ఇంటికి పదిహేను, మొత్తం ఏభై ఐదు లక్షలు రాదంటారా?”  ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు. “చూడండి అమ్మా, మీ లెక్కలు మీకు ఉంటాయి. కొనేవాడి లెక్కలు కోనేవాడికుంటాయి. నేను ఇక్కడ ఒక అపార్ట్ మెంట్ కట్టాలని అనుకుంటున్నాను. అప్పుడు ఇల్లు తీసెయాలి. అందుకని స్తలం రేట్ కి కొందామని నా ఉద్దేశ్యం. అందుచేత నలభై లక్షలకు మాత్రమే నేను కొంటాను.  ఆలోచించండి “ అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు.

అతను వెళ్ళాకా భార్యాభర్తలు ఇద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.

చివరకు జానకమ్మే నిర్ణయం ప్రకటించింది . “మనం ఆలస్యం చేసేకొద్దీ అబ్బాయికి వచ్చిన అవకాశం చేజారి పోతుంది. నలభై లక్షలకు షావుకారికే ఇల్లు ఇచ్చేద్దాం.  మిగతా డబ్బుకి అబ్బాయే తంటాలు పడతాడు”

ఆ రాత్రే కొడుక్కి ఫోన్ చేసింది, ఇల్లు నలభై లక్షలకు షావుకారికి ఇద్దామనుకుంటున్నామని .

రాజేష్ అలాగే చెయ్యమని చెప్పాడు.  మర్నాడే రాఘవరావు షావుకారికి కబురుచేసి తమ అంగీకారం చెప్పాడు.  వారం రోజుల్లో రాఘవరావు ఇల్లు షావుకారు పరం అయ్యింది.  రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు పట్టుకుని హైదరాబాదు వెళ్ళిపోవడం చాలా స్పీడుగా జరిగిపోయింది.  నెలరోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లితండ్రుల్ని హైదరాబాదుకి  తీసుకునివెళ్లాడు. భారమైన హృదయాలతోనే వెళ్ళారు రాఘవరావు, జానకమ్మ.

కొన్నాళ్ళకు మనవల ఆట పాటలతో ఇంటి గురించి మర్చిపోయారిద్దరూ.  మరో నెల రోజులకు కొడుకు కొన్న ప్లాట్ లోకి మారారు అందరూ.  రెండు పడక గదులే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాఘవరావు. కొడుకుని అడిగితే  ‘మనం ఆలస్యం చేయడంవలన, మూడు పడక గదుల ప్లాట్ చేజారిపోయిందని ‘ చెప్పాడు రాజేష్.  కొడుకు, కోడలు మనవలు ఒక గదిలో, రాఘవరావు జానకమ్మ ఒక గదిలో పడుకునే వారు. మూడు నెలలు ముచ్చటగా గడిచాయి.  ఒకరోజు మనవడు ‘నానమ్మా , నేను నీ దగ్గరే పడుకుంటానని’ పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసాడు.  జానకమ్మ ఎంతో

సంతోషించి వాడిని దగ్గరకు తీసుకుని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది.  పది రోజులు తర్వాత మనవరాలు కూడా ‘నానమ్మా, నేనూ నీ దగ్గరే పడుకుంటానని’  జానకమ్మ దగ్గరకు వచ్చేసింది.  ఆ విధంగా రాఘవరావు పడక హాలులోని దివాను మీదకు మారిపోయింది.

ఆరునెలలు గడిచాయి.  పిల్లల ఫీజులు కట్టడానికి కొడుకు, కోడలు గొడవ పడటం చూసి, తన పెన్షన్ లో దాచుకున్న ఏభై వేలు పట్టుకొచ్చి కొడుకుకి ఇచ్చాడు

రాఘవరావు. మరో ఆరునెలలు గడిచేసరికి రాఘవరావు తన పెన్షన్ లోంచి ఐదువేలు తన దగ్గర ఉంచుకుని మిగతా ఇరవైవేలు కొడుకుకి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు.  ఇంటి ఖర్చులకి రాజేష్ సంపాదన సరిపోవడం లేదని సుమిత్ర కాన్వెంట్ లో టీచర్గా చేరింది.  వంట చెయ్యడం, మనవలు ఇద్దరినీ కాన్వెంట్ కి తయారు చేయడం జానకమ్మ డ్యూటీ గా మారిపోవడం జరిగింది. జానకమ్మకు శ్రమ ఎక్కువ అయ్యింది ఇంటి పనితో.  శివపురంలో వాళ్ళు ఇద్దరే ఉండేవారు.  వంట తక్కువ, పని కూడా తక్కువే .  విశ్రాంతిగా ఉండేది.  ఇక్కడ విశ్రాంతి అన్న మాటే లేదు. పని ..పని ..పని. 

మరో ఆరు నెలలు గడిచాయి. మనవలు ఇద్దరూ పెందరాలే పడుకోకుండా స్కూల్ విషయాలు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం చేస్తూ జానకమ్మకు నిద్ర పట్టకుండా చేయడంతో ఆమె పడక కూడా హాలు లోకి మారింది. రాఘవరావు దివాను మీద, జానకమ్మ నేలమీద చాప వేసుకుని పడుకుంటున్నారు. ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్టు “ఇదేమిటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు?” అని అడిగాడు.  మనవల గురించి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని జానకమ్మ ‘మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను’ అంది.

శీతాకాలం వచ్చింది.  టైల్స్ మీద చాప వున్నా జానకమ్మ చలికి తట్టుకోలేక పోతోంది.  అది చూసి రాజేష్ బజారు నుండి చిన్న పరుపు తీసుకు వచ్చి తల్లికి ఇచ్చాడు. దానికే చాలా మురిసిపోయింది జానకమ్మ.  ఒకసారి సుమిత్ర తల్లి తండ్రులు హైదరాబాద్ వచ్చారు. రాజేష్ వాళ్లకు ఎంతో మర్యాదలు చేసాడు.  పిల్లల పడకలు తల్లి తండ్రుల గదిలోకి మారాయి. రాజేష్, మావయ్య అత్తయ్య పిల్లల గదిలో పడుకున్నారు.  రాఘవరావు, జానకమ్మ

యధావిధిగా హాలు లోనే పడుకున్నారు. మొత్తం వంట పనంతా జానకమ్మ మీదే పడింది.  సుమిత్ర , తల్లి తండ్రులు వారం రోజులు ఉన్నారు.  జానకమ్మ వళ్ళు హూనం ఐపోయింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు సుమిత్ర తండ్రి అన్న మాట రాఘవరావు దంపతుల్ని మరీ బాధించింది. ‘బావ గారు, అక్కయ్య గారు అదృష్టవంతులు. చక్కగా కొడుకు దగ్గర వుండి సుఖ పడుతున్నారు’ అని.  అమ్మమ్మ, తాతయ్య వెళ్లి పోగానే మనవలు మల్లీ వాళ్ళ గదిలోనే పడుకో

సాగారు.  దాంతోరాఘవరావు, జానకమ్మ లకు ఒక విషయం పూర్తిగా అర్ధమయ్యింది.  కొడుకు, కోడలు కావాలనే తమని హాలు లోకి పంపించారని.  ఆ రాత్రి దంపతులు ఇద్దరూ చాలా సేపు బాధపడ్డారు.  శివపురం వదిలి కొడుకు దగ్గరకు వచ్చి చాలా పొరపాటు చేసామని.  రెండేళ్ళు గడిచాయి. వంటరి తనంతో రాఘవరావు, పని ఎక్కువై , విశ్రాంతి లేక జానకమ్మ ఆరోగ్యం దెబ్బతింది. తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక కుమిలి పోతున్నారు వాళ్ళిద్దరూ.  ఈ మధ్యనే పరమేశం కూతురు దగ్గరకు వచ్చి రాఘవరావుని చూడటానికి రాజేష్ ఇంటికి వచ్చాడు.  ఆ సమయానికి రాజేష్ ,సుమిత్ర ఉద్యోగాలకు వెళ్ళారు.  పిల్లలు కాన్వెంట్ నుంచి ఇంకా రాలేదు.  రాఘవరావు, జానకమ్మలను చూసిఆశ్చర్య పోయాడు, ఆపై బాధ పడ్డాడు.


 “ఏమిటి రాఘవా ఇది?  ఇద్దరూ ఇలా అయి పోయారేమిటి? ఏమిటి అనారోగ్యం? డాక్టర్కి చూపించు కున్నారా?“ “ఆ ఏమీలెదు, కొద్దిపాటి నీరసం. అంతే.” అన్నాడు రాఘవరావు చిన్నగా నవ్వుతూ. ఆ నవ్వు సహజంగా లేకపోవడం గ్రహించాడు పరమేశం. ఈ లోగా పిల్లలు ఇద్దరూ వచ్చారు.  వాళ్లకు టిఫిన్ పెట్టి, పాలు ఇవ్వడం పనిలో మునిగిపోయింది జానకమ్మ.  ఒక పావుగంట ఉండి వెనుదిరిగాడు పరమేశం.  శివపురం వచ్చాకా సుబ్బారావు దగ్గర బాధపడ్డాడు పరమేశం. “మన రాఘవ పరిస్తితి ఏమీ బాగోలేదు.  ఇద్దరూ చిక్కి పోయారు.  కొడుకు వాళ్ళని

పట్టించుకోవడం లేదనిపిస్తోంది. ఇంటి బాధ్యత అంతా జానకమ్మ మీద పడింది.  చాలా శ్రమ పడుతున్నారు ఇద్దరూ. కాళ్ళూ, చేతులూ ఆడుతున్డగానే ఇలా ఉంటే, రేపు ఓపిక తగ్గిపోతే వాళ్ళ పరిస్తితి ఎంత దుర్భరమో అనిపిస్తోంది.”

కొద్దిసేపు మౌనం వహించాడు సుబ్బారావు.  తర్వాత పరమేశంతో చిన్నగా మాట్లాడాడు. ఆ మాటలకు పరమేశం చాలా సంతోషించాడు.

రెండు నెలలు గడిచాయి.  ఒకరోజు రాజేష్ ఇంటికి మిదున్, సాత్విక్ వచ్చారు.  “మేము శివపురంలో రాఘవరావు మాస్టారు దగ్గిర చదువుకున్నాము.  వచ్చే ఆదివారం మా స్కూల్ పూర్వ విద్యార్ధుల సమావేశం ఉంది.  ఆ రోజున మా గురువులు అందరినీ సన్మానించాలని నిర్ణయించాము. మాస్టారికి ఆహ్వానం పత్రిక ఇద్దామని వచ్చాం.” చెప్పాడు మిదున్.  నాన్నగారు పూజ చేసుకుంటున్నారు, కూర్చోమని చెప్పి లోపలకు వెళ్ళాడు రాజేష్. పదినిముషాలకు రాఘవరావు హాలులోకి వచ్చాడు.  మిదున్, సాత్విక్ లేచి రాఘవరావు కి నమస్కరించి, తాము వచ్చిన

పని చెప్పారు.  “నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు?” అడిగాడు రాఘవరావు.

“పరమేశం గారు చెప్పారు సర్ . వచ్చే శనివారం ఉదయమే వచ్చి కారులో మిమ్మల్ని, మేడం గారిని తీసుకుని వెళ్లి, తిరిగి హైదరాబాద్లో దిగబెడతాం” వినయంగా చెప్పాడు మిదున్.  తప్పకుండా వస్తానని వాగ్దానం చేసాడు రాఘవరావు.

ఆరు రోజులు గడిచాకా శనివారం ఉదయమే మిదున్, సాత్విక్ ఇద్దరూ ఏ.సి. కారు తీసుకుని వచ్చి రాజేష్ అపార్ట్ మెంట్ కి వచ్చారు. ఫంక్షన్ అయ్యాకా వెంటనే వచ్చేయమని రాజేష్ , సుమిత్ర మరీ మరీ చెప్పారు.  అలాగే అని చెప్పి కారు ఎక్కారు రాఘవరావు, జానకమ్మ.  వాళ్ళు ఇద్దరికీ చాలా ఆనందంగా ఉంది.  శివపురంలో అందరిని కలవ వచ్చని, రెండోది ఆ జైలు నుంచి బయటకు వస్తున్నామని.  పరమేశం కూడా ఫోన్ చేసి చెప్పాడు’ రెండురోజులూ మా ఇంట్లోనే ఉండాలని’.  చిన్న పిల్లలు పండగకు తాత గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా ఉంటారో, రాఘవరావు, జానకమ్మ కూడా అంత హుషారుగాను ఉన్నారు.  విజయవాడలో భోజనాలుచేసి, సాయంత్రానికి శివపురం చేరుకున్నారు నలుగురూ.  పరమేశం ,గిరిజ ఏంతో ఆదరంగా వాళ్ళని ఇంటిలోకి తీసుకువెళ్ళారు. మిదున్, సాత్విక్ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు.  ఒక అరగంటకు సుబ్బారావు, పద్మలత వచ్చారు.  మిత్రులు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసాడు పరమేశం.  మూడు జంటలూ కబుర్లు చెప్పుకుంటూ తృప్తిగా భోజనం చేసారు. మిత్రులు ముగ్గురి కళ్ళల్లో ఆనంద భాష్పాలు కదలాడాయి.  “నేను హైదరాబాద్ వెళ్ళాకా ఏం కోల్పోయానో ఇప్పుడు నాకు బోధపడింది” అన్నాడు రాఘవరావు.  మిత్రులు ఇద్దరూ ఆప్యాయంగా అతని భుజాల మీద చేతులు వేసారు.  ఆ రాత్రి రాఘవ రావు, జానకమ్మ చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఒక స్తిరమైన నిర్ణయానికి వచ్చారు ఇద్దరూ.  మర్నాడు ఉదయం శివపురం హైస్కూల్ లో జరిగిన పూర్వ విద్యార్ధుల సభ చాలా బాగా జరిగింది.  ముందుగా తమకు విద్య నేర్పిన గురువులు అందరికీ 

పాదాభివందనం చేసి, ఆ తర్వాత వేదిక మీదకు వెళ్ళారు. రాఘవరావు, మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి, సంస్కారానికి అబ్బురపడ్డారు.  అమెరికాలో, ఆస్ట్రేలియా, సింగపూర్ లలో ఉన్నవాళ్ళు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులు అందరినీ పేరు పేరునా పలకరించి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది.  పూర్వ విద్యార్ధుల తరపున వరుణ్ మాట్లాడుతూ “ఈ సమావేశానికి మూలకారకులు మిదున్, సాత్విక్.   వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నా అందరినీ కాంటాక్ట్  చేసి ఇక్కడికి రప్పించారు. వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  మమ్మల్ని వృద్ధిలోకి తీసుకువచ్చిన మా గురువులు అందరికీ నా నమస్సులు.” అని అన్నాడు. తర్వాత గురువులు అందరికీ ఘనంగా సన్మానంచేసి, వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్ధులు.  రాఘవరావు మాట్లాడుతూ, ”మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించే మేము మీకు చదువు చెప్పాం. అది గురువుగా మా బాధ్యత.  మీరు మన ఊరికి, మన స్కూలుకి  పేరు తెచ్చినట్టుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి.  మీరు అందరూ పిల్లా, పాపలతో సుఖంగా ఉండాలి.  మీరు మాకు చేసిన సత్కారం, సరస్వతీదేవికి చేసిన సత్కారంగా నేను భావిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.  చివరగా మిదున్ మాట్లాడుతూ” మన బాచ్ ఫ్రెండ్ స్నిగ్ధ డాక్టర్ గా తణుకులో ప్రాక్టీసు చేస్తోంది.  ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకి వైద్య సహాయం అందిస్తానని వాగ్దానం చేసింది.  ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి” అని అన్నాడు.

అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు.  రాఘవరావు ఇంటిముందు ఆగాడు మిదున్.  రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు.  తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసి ఉన్నాయి.  గురువు గారికి స్వాగతం అని బోర్డు ఉంది. మిదున్, రాఘవరావు చేయి

పట్టుకుని లోపలకు తీసుకువచ్చాడు.  “మాస్టారు, మీ ఇల్లు మీకు అప్పచెబుతున్నాం. మీరు, అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి.  షావుకారు దగ్గరనుండి మేము దీన్ని కొన్నాం. చాలా కాలంక్రితమే పరమేశం గారు నాకు, మీరు ఎంత బెంగగా, దిగులుగా ఉన్నారో చెప్పారు. మేము ఈ రోజు ఇలా విదేశాలలో ఉంటూ లక్షలూ, కోట్లు సంపాదిస్తున్నామంటే దానికి

మూలం మీరు పెట్టిన జ్ఞాన భిక్షే. మీకు గురుదక్షిణ చెల్లించుకోవాలనే నేనూ, నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం.  మీ స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు.  మీ

ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ స్నిగ్ధ ఉంది.  మన వూరి నుండి తణుకు పది నిముషాల ప్రయాణం.  మీరు ఆనందంగా ఉండడమే మా అందరి కోరిక.  కాదనకండి.” అని రాఘవరావు రెండు చేతులూ పట్టుకున్నాడు.  కళ్ళమ్మట ఆనందభాష్పాలు కారుతుండగా రాఘవరావు, మిదున్ ని దగ్గరకు

తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు.  వెంటనే ఇంట్లోకి వెళ్లి, ప్రతిగుమ్మాన్ని తడిమి తడిమి చూసుకుని మురిసిపోయాడు. దొడ్లోకి వచ్చి, మామిడిచెట్టు కింద ఉన్న చప్టా మీద కూర్చున్నాడు. లేచి ప్రతి చెట్టుని ముట్టుకుని పరవశించి పోయాడు.  తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవుదూడ , చాలాసేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు.  ఐదు నిముషాలు గడిచాక పూర్వ విద్యార్ధులు అందరూ రాఘవరావు దగ్గర శెలవు తీసుకుని వెళ్ళిపోయారు. రాఘవరావు, మిత్రబృందం మిగిలారు.  పరమేశం, సుబ్బారావు ల చేతులు పట్టుకుని  ‘మీ ఋణం ఎలా తీర్చుకోను’ అన్నాడు రాఘవరావు బరువెక్కిన హృదయంతో.

“రోజూ మనం కలుసుకుని ఆనందంగా మాట్లాడుకోవడమే” అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.

ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానకమ్మ.  ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది.


""పైసజారనీకు ప్రాణమున్నంతకు

పైసపోయెనేని ప్రాణమాగు

పైసలోనగలదు పరమార్ధమంతయు,

పైసెయిలనువెలసె ప్రాణమగుచు!!


అదీ కథలోని నీతి!

 విశ్రాంతజీవులందరూ,

తస్మాత్ జాగ్రత....


మీ కంటు చివరి వరకు ఒక ఇల్లు ఉండడానికి ఉంచు కొండి. మీరు మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించవచ్చు... చివరి దశలో మిమ్మల్నీ ఒక పనిమనుషులు గా మీ పిల్లలు వాడు కొంటారు. విదేశాలకు వెళ్లి 6నెలలు పిల్లలకు మనవళ్లు మనవరాళ్లకు ఊడిగం చేసి రావాల్సి వస్తది.... ఎందుకంటే విదేశాల్లో పనిమనుషులు దొరకరు ఒకవేళ దొరికిన వాళ్లు చాలా కాస్ట్లీ... ఫ్రీ గా వచ్చేది అమ్మ నాన్న లు,అత్త మామలు... ఆర్నెల్ల ముందు ఫైట్ బుక్ చేసుకుంటే చాలా చౌకగా పడతాది.. 6 నెలలు వాడుకున్నంత వాడుకోవచ్చు.. ముఖ్యంగా తల్లులకు ఎక్కువ పని. అందరూ పిల్లలు అలా లేరు కొందరు మాత్రమే...? సీనియర్ సిటిజన్స్ చివరి రోజుల్లో స్వేచ్ఛగా ఆనందంగా హ్యాపీగా బతకండి...

సేకరణ:

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

చితి - చింత

 శ్లోకం:☝

*చితా చింతా సమాహ్యుక్తా*

   *బిందుమాత్ర విశేషతః |*

*సజీవం దహతే చింతా*

   *నిర్జీవం దహతే చితా ||*


భావం: చితి - చింత అనే పదాలు రెండూ సమానాలే! ఒక సున్న మాత్రమే తేడా రెండింటికి. తగులబెట్టటంలో కూడా ఎక్కువ తేడా లేదు. చితి నిర్జీవులని మాత్రమే తగులబెడుతుంది. కానీ చింత సజీవంగా ఉన్నవారిని తగులబెడుతుంది! దీనిబట్టి చింతతో పోల్చి చూస్తే చితి అంత అమంగళకరమైన పదమేమి కాదు! అని భావం.

21, ఆగస్టు 2022, ఆదివారం

ధర్మాకృతి

 ధర్మాకృతి : అవతారము  


శ్రీమచ్చంద్రకిశోర శేఖర గురోరత్రావతారాచ్చ్రియా 

నామ్నాసౌ జయవత్సరో జయతి తన్మాసోపి సన్ మాధవః 

సాక్రుష్ట ప్రతిపత్తిధిర్విజయతే సర్వాదిమో వాసరః 

మాంగళ్యం మృదు భంచమైత్రమభవల్లగ్నంచ పంచాననమ్!! 


– గురు కృపాలహరీ 


జితేంద్రియులై, సర్వదిక్కులు విజయం చేయనున్న స్వామి జయనామ సంవత్సరంలో జన్మించి, ఆ సంవత్సరపు పేరు సార్ధకం చేశారు. వసంతవల్లోకహితం చరంతః అన్న వివేక చూడామణి వాక్యములను యదార్థం చేసిన స్వామి వసంతకాలంలో మాధవమాసంలో జన్మించారు. నిత్యం నారాయణ స్మరణ చేయనున్న వారు కృష్ణ ప్రతిపత్తున జన్మించడం న్యాయంగానే ఉంది. ఆద్యంతరహితుడు ఆదివారం నాడు ఆవిర్భవించారు. నక్షత్రమో, మంగళమై మృదువై మిత్ర దైవత్వమై యింపొందిన అనూరాధా నక్షత్రము చతుశ్శిష్య సమేతంగా ఆదిశంకరులు ఒకే మూర్తిగా అవతరించారనే విషయం సూచించడానికేమో పంచానన లగ్నం తమ జననానికి ఎన్నుకొన్నారు. 


స్వామి జననం జయనామ సంవత్సర వైశాఖ కృష్ణ ప్రతిపత్తిధి. ఆదివాటం అనురాధానక్షత్రం నాడు అనగా క్రీ.శ. 1894 మే మాసం 20వ తారీఖున పగలు 1.16ని.కు దక్షిణార్కటు జిల్లా విల్లుపురం గ్రామంలో హనుమాన్ కోయిల్ వీధిలోనున్న చిన్న ఇంట్లో జరిగింది. వీరు శ్రీసుబ్రహ్మణ్యశాస్త్రి మహాలక్ష్మమ్మల రెండవ సంతానం. పెద్ద కుమారుడు గణపతికి అప్పటికి తొమ్మిదేళ్ళు. “ఒంటి కన్ను కన్నూ కాదు, ఒంటి కొడుకు కొడుకూ కాదు” అనే సామెతననుసరించి పుత్రులకై పుణ్యదంపతులు కులదైవమైన స్వామిమలై స్వామినాథస్వామికి మొక్కుకొన్నారు. కులదైవముయొక్క అనుగ్రహంతో జనించిన కుమారునికి ఆ పేరే పెట్టుకొన్నారు. వారి సత్యసంకల్పం చూడండి. స్వామి తరువాతి కాలంలో అనేక కోట్లమంది భక్తులకు కులదైవమయినారు. 


శ్రీవారు జన్మించిన ఆ ఇల్లు ప్రస్తుతం శ్రీమఠం అధీనంలో ఉంది. అక్కడ వేదపాఠశాల నిర్వహించబడుతోంది. అహర్నిశలు వేదశాస్త్ర అభివృద్ధికై కృషి సలిపిన మహాస్వామి పుట్టిన ఇల్లు నిరంతర వేదఘోషతో నిండి ఉండడం ఎంతో సబబుగా ఉంది.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఆస్తి

 ఆస్తి : 

వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. 

పెద్దయ్యారు..పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్లకు..ఒకరు గోవింద్ ..ఇంకొకరు శ్రీనాథ్..

 ఇద్దరి పుట్టిన ఊరు బాసర.. అక్కడే చదువు, సంస్కారం నేర్చుకున్నారు..

 

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం ఇద్దరికీ.. గోవింద్ స్కూల్ టీచర్.

 శ్రీనాథ్ కి సెక్రటేరియట్ లో ఉద్యోగం... ఏరా అంటే ఏరా అనే సాన్నిహిత్యం వాళ్ళది... 


జీవితం మాత్రం శ్రీనాథ్ ని కొంచెం డబ్బున్న వాడిగా మార్చింది..గోవింద్ పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్ గా ఉండి పోయాడు..అద్దె ఇల్లు, సిటీ బస్ ప్రయాణం మామూలు విషయం గోవింద్ కి..కానీ ఎప్పుడూ తన స్థితి కి బాధ పడలేదు..


పెళ్లయిన తరువాత చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ జీవితాల్లో... 


గోవింద్ భార్య  సరళ..పేదింటి అమ్మాయి.. గోవింద్ మేనమామ కూతురే.. అందలం ఎక్కాలని ఆశ సరళ కు..కానీ తీరేదెలా ?


ఎప్పుడయినా సరళ హంగులు, ఆర్భాటాలు కావాలని అడిగితే నవ్వి ఊరుకునే వాడు గోవింద్.. మన దేశం లో నూటికి 40 మందికి ప్రతి రోజూ తిండి లేదు..వాళ్ళతో పోలిస్తే మనం నయమే కదా అంటాడు..పాపం సరళ కోరికలు తీర్చలేనందుకు కొంచెం బాధ పడుతూ ఉంటాడు అప్పుడప్పుడు..


ఆడవాళ్లు  తమ పక్కన వాళ్ళతో పోల్చుకుని తమ జీవితాలలో లేనివి ఏమిటో ఇట్టే తెలుసుకుంటారు... వాళ్లకు ఉన్న గొప్ప విషయాలను  మాత్రం అంతగా పట్టించు కోరు.. ఇక్కడ కూడా అదే జరిగింది... సొంత ఇల్లు, సొంత కారు లేవని బాధ సరళకు....  


శ్రీనాథ్ భార్య లక్ష్మి.. మంచి కుటుంబం నుండి వచ్చింది.. దాన ధర్మాలు చేయటం అలవాటు..దైవ భక్తి మెండుగా ఉంది...ఉన్న సంపద ను చూసి మిడిసి పాటు లేదు లక్ష్మికి...  లక్ష్మి, సరళ కూడా స్నేహితులయ్యారు. 

ఇళ్లకు రాక పోకలు కూడా బాగానే ఉన్నాయి...  లక్ష్మి కి సరళ అమాయకత్వం బాగా నచ్చుతుంది.. పిచ్చి పిల్ల.. సంపదలు ఉన్నా , సఖ్యం మరియు సౌఖ్యం ఉండాలి జీవితం లో ..అదే చెప్పింది చాలా సార్లు.. నువ్వెన్నయినా చెప్పు లక్ష్మీ... డబ్బులున్న దారే వేరు..చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని జీవితాలు ఎందుకు ? ఎవరికి ఉపయోగ పడినట్లు..?? 

రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.. నలుగురూ పెద్దవాళ్ళయ్యారు...


అది ఆగస్ట్ నెల.. ఆ నెలలో శ్రీనాథ్  రిటైర్ అవుతున్నాడు...మరుసటి నెల సెప్టెంబర్ లో గోవింద్ రిటైర్మెంట్ ..


ఆగస్ట్ 31 వ తారీకు రానే వచ్చింది..శ్రీనాథ్, లక్ష్మి ఇంటికి వచ్చి మరీ పిలిచారు.. రిటైర్మెంట్ ఫంక్షన్ కి రావాలని... పిలవక పోయినా గోవింద్ వెళ్ళేవాడే.. ఇప్పుడు సరళ కూడా వెంట వెళ్ళింది... శ్రీనాథ్ యూడీసీ గా రిటైర్ అయ్యాడు.. ఫంక్షన్ బాగా జరిగింది సెక్రటేరియట్ లో వాళ్ళ డిపార్ట్మెంట్ లో.. చాలా మంది శ్రీనాథ్ ని మెచ్చుకున్నారు..మంచి వాడు.. పని లో చురుకుదనం చూపించే వాడని.. అతను రిటైర్ అవటం డిపార్ట్మెంట్ కి తీరని లోటుగా గుర్తు చేసుకున్నారు..


స్నేహితుడి తరపున గోవింద్ మాట్లాడాడు... మరో జన్మంటూ ఉంటే శ్రీనాథ్ కి మళ్ళీ స్నేహితుడుగా పుట్టాలని..స్నేహానికి ప్రాణం ఇచ్చే శ్రీనాథ్ తనకు తన కుటుంబం లో మనిషని చెప్పాడు.. అందరూ ఆనందించారు...


ఆ రాత్రి దగ్గర్లో ఉన్న కామత్ హోటల్ లో భోజనం చేశారు శ్రీనాథ్, గోవింద్ కుటుంబాలు... చాలా రోజుల తరువాత సరళ బయట భోజనం చేసింది.. ఆమెకు నిజంగా అసూయగా ఉంది.. శ్రీనాధ్ ది మంచి ఉద్యోగం.. రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా చేసారు..అందరూ పొగిడారు ఆయనను..


వచ్చే నెల లో తన భర్త గోవింద్ రిటైర్మెంట్ వుంది.. మామూలు స్కూలు టీచర్ గా చేరి ఇప్పుడు ఒక స్కూల్ హెడ్మాస్టర్ గా రిటైర్ అవుతున్నాడు.. అప్పుడు ఫంక్షన్ యెలా జరుగుతుందో ఏమో ?? శ్రీనాథ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లా ఆర్భాటంగా ఎలాగూ జరగదు...కనీసం లో కనీసం తల దించు కోకుండా జరిగితే చాలు...అలా చాలా మంది దేవుళ్ళకు మొక్కింది..


రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ సరళ లో ఆందోళన పెరిగి పోతూ వచ్చింది... ఇద్దరూ వెళ్లి శ్రీనాథ్ ని, లక్ష్మి నీ పిలిచారు ఫంక్షన్ కి..మనసులో మాత్రం, న్యూనతా భావం నిండి ఉండటం వలన ,  సరళ వాళ్లు రాక పోతే బాగుండునని చాలా సార్లు అనుకుంది.. గోవింద్ మాత్రం మామూలుగానే  ఉన్నాడు.. మామూలు రోజుల్లాగే రిటైర్మెంట్ రోజు వచ్చింది..


ఆ రోజు మామూలు గా స్కూల్ కి వెళ్లి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నాడు పిల్లలకు.... అదే తన ఆఖరి క్లాసు కావటం తో రుద్ధమైంది ఆయన గొంతు..  కష్టం మీద క్లాసు కానిచ్చి స్టాఫ్ రూమ్ కి వచ్చాడు గోవింద్..


సాయంత్రం నాలుగు గంటలయ్యింది..  ఆ పాటికే సరళ ను , పిల్లలను తీసుకుని శ్రీనాథ్ వాళ్లు కూడా స్కూల్ కి వచ్చారు.


శ్రీనాథ్ కి చాలా సంతోషంగా ఉంది..గోవింద్ రిటైర్ అవుతున్నాడు.. వాడూ ,తను కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాలి..ప్లాన్ వేసుకున్నాడు.


సరళ కు బెంగగా ఉంది..ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది తనకు.. ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండును..అనుకుంది.


తలవొంపులుగా ఫంక్షన్ జరుగుతుంది ..తను తట్టుకోలేదు...మామూలు స్కూల్ టీచర్ రిటైర్ అయితే కొన్ని వేలమంది, లక్షల మంది టీచర్లు ఉన్నారు భర్తీ చేయటానికి... టీచర్  రిటైర్మెంట్ అంత గొప్ప విషయం కాదు.. తొందరగా ముగించి ఇంటికి చేరుకోవాలని ఆరాటం సరళకు.. పిల్లలు కూడా వచ్చారు..తండ్రి రిటైర్మెంట్ చూడడానికి...


సరళ వాళ్ళను స్టాఫ్ రూం లో కూర్చో బెట్టారు..మిగతా టీచర్లు..


అప్పటి వరకూ పెద్దగా జనం లేరు . విద్యార్థులు , టీచర్లు అందరూ కలిసి ఒక వంద మంది ఉంటారు.. వాళ్ళు రోజూ స్కూల్లో ఉండే వాళ్లే కదా.. సరళ కు పెద్దగా సంతోషం కలగ లేదు ... ఇంకో పది నిముషాలకు ఫంక్షన్ మొదలవుతుందనగా ...ఎక్కడినుండి వచ్చారో..దాదాపు ఇంకో వంద మంది పైనే జనం వచ్చారు..వాళ్లు పిల్లల బంధువులని తెలిసింది... 


ఫంక్షన్ ఆరుబయట చెయ్యాలని నిర్ణయం చేశారు...అందరూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు..చాలా మంది నుంచునే ఉన్నారు...ఫంక్షన్ అయ్యేంత వరకూ..


ఎక్కడి నుండో పల్లకీ ని తీసుకు వచ్చారు... మాస్టారు గోవింద్ ను పిల్లలు పల్లకీ లో కూర్చుండ బెట్టారు.. కొంత మంది టీచర్లు, పిల్లల బంధువులు పల్లకీ మోయటానికి సిద్ధ పడ్డారు... సరళ కు అంతా కల గా ఉంది... పల్లకీ లో  గోవింద్ ని కూర్చో బెట్టి లేప బోతుండగా ఎవరో అరిచారు..

మాస్టారి గారి ధర్మ పత్ని ని కూడా పల్లకీ లో కూర్చో బెట్టాలని.. అందరి బలవంతం మీద పల్లకీ లో కూర్చుంది సరళ.. గోవింద్ తో...పెళ్లి రోజు తరువాత మళ్లీ ఇన్నాళ్ళకు...పల్లకీలో ఎక్కడం.. సరళ కు సంతోషం తో కళ్ల వెంట నీళ్ళు వచ్చాయి..


పల్లకీ లేచింది..చిట్టి చేతులతో పిల్లలు కూడా పల్లకీ మోస్తున్న వాళ్ళకు సాయపడుతున్నారు.. ఆ దృశ్యం మనోహరం గా ఉంది.. కాలం కొన్ని క్షణాలు అలా ఆగిపోతే బాగుండునని అనిపించింది సరళ కు.. గోవింద్ కి భాధ గానూ, సంతోషం గానూ ఉంది..పిల్లలూ జాగ్రత్త .. మీరు ఇబ్బంది పడకండి అంటూ వాళ్ళను వారిస్తున్నాడు..అయినా వాళ్లు వినటం లేదు ...


ఇంతలో పల్లకీ ని దింపారు.. ఎందుకో అర్థం కాలేదు సరళ కు, గోవింద్ కు... 


కారు దిగి నెమ్మదిగా వచ్చి నమస్కారం చేశాడు గోవింద్ కి ఆ వచ్చినాయన... గోవింద్ కాళ్ళకు దండం పెట్టాడు.. ఆ వచ్చినాయన జిల్లా ఎస్పీ గారు.. వెంట పది మంది పోలీసులు..  ఈ లోపల ఇంకో కారు వచ్చి ఆగింది.. వచ్చింది జిల్లా 

జడ్జ్ గారు..ఆయన కూడా తన వాళ్ళతో వచ్చారు.. 


జిల్లా ఎస్పీ, జడ్జ్ గారు, 

మిగతా వాళ్లు పల్లకీ మోస్తుండగా నిర్ణీత స్థలానికి చేరారు..


నీళ్ళు, కాళ్ళు  కడిగే ఇత్తడి పళ్ళెం వచ్చాయి...ఎక్కడి నుండో... ఎస్పీ, జడ్జ్ గార్లు గోవింద్ మాస్టారి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నారు... కొంత మంది ఆడవాళ్ళు హారతి ఇచ్చారు గోవింద్ కి, సరళ కు.. ఆ రోజు పూల వాన కురిపించారు అందరూ  వారిద్దరి మీద..


పిల్లలు మాస్టారు గోవింద్ గారి గురించి మాట్లాడుతూ ఏడ్చేసారు.

ఇంచుమించు టీచర్ల పరిస్థితి కూడా అంతే..అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.. జిల్లా ఎస్పీ,జడ్జ్ కూడా మాట్లాడారు. తమ జీవితం లో తాము సాధించిన విజయాలు అన్నీ గోవింద్ మాస్టారి వలనే అని గర్వంగా చెప్పారు.. ఆయన పక్కన కూర్చోవటం కూడా వాళ్లకు మనస్కరించక నుంచునే ఉన్నారు..చాలా సేపు... 


అప్పటి వాతావరణం చెప్పటం కష్టం.. శ్రీనాథ్ సంతోషం చెప్పనలవి కాదు..తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం..అది.. వాడికి జరిగినా తనకూ జరిగినట్లే... 


శ్రీనాథ్ మాట్లాడుతూ చెప్పాడు..ఇక్కడున్న ఇన్ని వందల మంది లో  తనొక్కడే గోవింద్ ని ఆప్యాయంగా ఒరేయ్  అని పిలువ గల అర్హత  కలవాడవటం  సంతోషంగా ఉందని అన్నాడు..


చివరగా గోవింద్ మాట్లాడాడు..

పిల్లలందరికీ నా ఆశీస్సులు... ఒకప్పటి నా విద్యార్థులు ఈ నాడు జిల్లా కు జడ్జ్ గానూ, ఎస్పీ గానూ ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ..ఇలా పిల్లల్ని మంచి ఉన్నత స్థితి లో చూడటం తనకు గర్వ కారణం అనీ, ఈ పిల్లలే తన ఆస్తి ,ఐశ్వర్యం , వీళ్ళే నా సర్వస్వం అంటూ ...మాట్లాడలేక పోయాడు.

 

నాకు ఇంత గొప్ప వరం ఇచ్చిన భగవంతుడిని కోరేదొకటే అన్నాడు.. నా పిల్లలందరికీ మంచి భవిష్యత్తును, దీర్ఘాయువును ఇమ్మని కోరాడు..


పిల్లలను పట్టుకోవడం ఎవరి తరం కాలేదు..అంతలా అభిమానించారు  గోవింద్ మాస్టారును.. 


ఫంక్షన్ ముగిశాక  అందరూ కలిసి వచ్చి గోవింద్ ని ఇంటి వరకూ దిగ బెట్టారు....వెళ్ళలేక వెళ్ళారు పిల్లలందరూ...


ఆ రోజు రాత్రి  శ్రీనాథ్ , లక్ష్మి వారి పిల్లలూ గోవింద్ ఇంట్లోనే ఉండి పోయారు...


భోజనాలు అయిన తరువాత గోవింద్ పాతికేళ్ల  కొడుకు సుబ్రహ్మణ్యం,  తల్లితో అన్నాడు... నాన్న గారికి ఇంత ఆస్తి ఉందని నాకు ఇంత వరకూ తెలియదమ్మా ....


నాకూ ఇంత వరకూ తెలియదురా  అన్నది సరళ ఎంతో సంతోషంగా.. .


శ్రీనాథ్ కల్పించుకుని అన్నాడు..

వీడు కుబేరుడికి ఏం తీసిపోడు.. మనః స్ఫూర్తిగా చెపుతున్నాను.. 


సరళ గోవింద్ వంక చూసింది.. గోవింద్ ...మనకు ఈ సంపద చాలు సరళా  ఈ జన్మకు ...  అన్నాడు..


ఆకాశం లో ఒక మెరుపు మెరిసింది.. గురువులు పూజ్య నీయులు .. వారు ప్రోగు చేసుకున్న  అస్తి పిల్లల అభిమానమే... అన్నట్లుగా... 


🌸🌸🌹🌹

ముఖ్యగమనిక

 ముఖ్యగమనిక:

మీరు రైలులో ప్రయాణం చేసేటప్పుడు మీకు "అత్యవసరంగా మందులు" అవసరమైతే....ఏంచేస్తారు..రైలులో అత్యవసరంగా వైద్యులు దొరుకుతారేమెాగానీ... "ప్రాణాపాయం "నుండి కాపాడే మందులు దొరకవు....

దానికొరకే ఒకవ్యక్తి నడుంబిగించాడు....

అతడే..." విజయ్ మెహెతా " ఈ వ్యక్తి మీకు కావలసిన ప్రాణాపాయ నివారణ మందులను పొందడానికి మీరు అతనికి ఫోన్ చేస్తే....తరువాత వచ్చే స్టేషన్లో వాటిని అందజేస్తారు అదీ ఎటువంటి 'ప్రత్యేక రుసుము' లేకుండా వాటిని అందజేస్తారు ఇప్పటికి భారతదేశం మెత్తంలో ప్రస్తుతానికి 400 వందల స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నది...

మీరు చేయవలసిన ఫోన్ నం.

విజయ్ మెహెతా ...09320955005

అందరికీ పంపండి..ప్రయాణికుల ప్రాణాలను కాపాడండి...

విజయం అంటే ఏమిటి?*

 🍀🌺🍀

*అదృష్ట వంతులు మాత్రమే                      చదవగలరు!*


    *విజయం అంటే ఏమిటి?*

                  ➖➖➖✍️


*మన దేశం నుండి    ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీ     లో విద్యార్థులతో మాట్లాడుతూ….    “విజయం అంటే ఏమిటి?” అని అడిగితే ఒక యువతి “విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం!”అన్నది.*


*అపుడు ఆ ప్రొఫెసర్    “అయితే ఇరవైఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో చెప్పండి?” అంటే ఎవరూ చెప్పలేదు.*


* [ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి]*


*బ్రతకడానికి కొంత డబ్బు కావాలి కానీ , డబ్బే బ్రతుకు కాదు!                అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట.* 

   

*మరో యువకుడు లేచి “విజయం అంటే బలం / శక్తి”  అన్నాడు.* 


*అలా అయితే    అలెగ్జాండర్ , నెపోలియన్, ముస్సొలిని, హిట్లర్ , స్టాలిన్ , బిన్ లాడెన్ ... వీళ్ళంతా బలవంతులు, ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా, వీళ్ళు జీవితం లో సంతోషంగా వుండగలిగారా ?  వీళ్ళ జీవితాలు ఎలా గడిచి , ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా ! తన బలంతో , తన ముష్టిఘాతాలతో మహా బలవంతులను మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్ , తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల  కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు. అయితే విజయమంటే బలం / శక్తి సంపాదన కాదు అన్నమాట.* 


*మరో యువతి “విజయమంటే ప్రఖ్యాతి, అందం!” అంది. అయితే కేట్ మోస్ , జీన్ ష్రింప్టన్ , సోఫియాలారెన్ , మార్లిన్ మన్రో ...లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు.  భారత్ విషయానికొస్తే , పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే , అమితాబ్ బచ్చన్ తో సహా , ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకొనని హిందీ సినిమా హీరో నే లేడు. డానీ, కబీర్ బేడీ , మహేష్ భట్ లతో ఆమె ప్రేమ , పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర , రాజేష్ ఖన్నా , అమితాబ్ బచ్చన్ .. ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే. కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి , నమ్మిన వాళ్ళు మోసం చేస్తే , తాగుడుకు బానిస అయ్యి , ఒక దశలో కాలికి కురుపు లేచి , అది ఒళ్ళంతా ప్రాకి , ఏ శరీరం కోసం అయితే అంతమంది మగ వాళ్ళు పిచ్చిక్కెపోయారో , అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే , ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని , జనం ఆమెను తాళ్ళతో కట్టి  , ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని కంప్లైంట్ చేస్తే , కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు. అయితే అందం , ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట!*


*మరోసారి మరొకరు “విజయమంటే అధికారం” అని అన్నారు.* 


*”అయితే కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి!” అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు.* 


*మా అనంతపురంలో  ఒకప్పుడు రాష్ట్రపతి గా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి , పందులు దొర్లుతున్నాయి. విజయం అంటే అధికారం కాదు అన్న మాట.*


*చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీ లో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు  - “విజయం అంటే ఏమిటి?”  అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు , “మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా?” అందరూ 'తెలుసు’ అన్నారు. “వాళ్ళ అవ్వ , తాతల పేర్లు తెలుసా?” అని అడిగితే అయిదారుమంది “తెలుసు” అన్నారు. “వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా?”*


*‘తెలియదు’ అన్నారు.*


*అపుడు ప్రొఫెసర్ గారు “శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , బుద్ధుడు , ఆదిశంకరుడు , అందరూ…?”* 


*”ఓ , తెలుసు!” అని ముక్తకంఠం తో బదులిచ్చారు.* 


*”మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు?”అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి , ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు* *తిరుగుతుండగా ఇలా అంది : “సార్ , మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను.* *మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం , రాముడు , కృష్ణుడు , బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం ఇదే…. తమ కోసం కాకుండా సమాజ హితం కోసం తపించిన ఋషులు, మునులు చిరంజీవులైనారు.

  తమ కోసం , తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది , ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే!”*


*”నా గురించి నేను దు:ఖించక పోవడమే నా ఆనందానికి కారణం!” అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట , “ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు , అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క '' [ Only they live who live for others , the others are more dead than alive]  అని వివేకానంద 1896 లో అన్న మాట ఇదే కదా.*✍️

                               ….సేకరణ.

.          *సర్వం భగవతార్పణమస్తు*

             


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

బంగారు_మురుగు

 *బంగారు_మురుగు*


శ్రీరమణ గారు రచించిన మిథునం కథా సంకలనం లోనిది.


నాకు ఆరేళ్ళప్పుడు మా బామ్మకి అరవై ఏళ్లు.


మా అమ్మానాన్న ఎప్పుడూ పూజలూ పునస్కారాలూ, మళ్ళూ దేవుళ్ళూ గొడవల్లో వుండేవారు. స్వాములార్లు, పీఠాధిపతులూ -ఎత్తే పల్లకీ, దింపే పల్లకీలతో మా ఇల్లు మఠంలా వుండేది. 


అమ్మ తడిచీర కట్టుకుని పీఠాన్ని సేవిస్తూ – నే దగ్గరకు వెళితే దూరం దూరం తాక్కూడదు అనేది.


బామ్మకి యీ గొడవలేం పట్టేవి కావు. అమ్మ నాన్న చుట్టం పక్కం అన్నీ నాకు బామ్మే. మా బామ్మకి కాశీ రామేశ్వరం అన్నీ నేనే. ఓకంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం.


మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు వుండేది. అది మా స్థావరం. రోజులో మూడొంతులు అక్కడే మా కాలక్షేపం. మానుకి రెండు తొర్రలుండేవి. 


పై తొర్రలో రెండు రామచిలకలు కిలకిలలాడుతూ కాపరం చేస్తుండేవి. ఇంకో తొర్రలో బామ్మ నాకోసం చిరుతిళ్ళు దాచేది. 


కొమ్మకి తాళ్ల ఉయ్యాల వుండేది. నీడన ఆవుదూడ కట్టేసి వుండేది. దానికి బామ్మ పచ్చి పరకలు వేస్తూ వుండేది. కాకులు పడేసిన బాదంకాయలు వైనంగా కొట్టి నాచేత బాదం పప్పులు తినిపించేది.  


ఆ బాదం చెట్టు మా ఇద్దరికీ తోడూ నీడా. ఊరు లేచేసరికి వాకిలంతా తీర్చిదిద్ది ముగ్గులు పెట్టేది బామ్మ. రాత్రి నాకు జోలపాడుతూ రేపటి ముగ్గు మనసులో వేసుకునేది. ముగ్గులు అయ్యేదాకా నేను బామ్మ వీపు మీద బల్లిలా కరుచుకు పడుకుని కునుకు తీస్తుండేవాణ్ణి. 


“అసలే నడుం వంగిపోయె… పైగా ఆ మూట కూడా దేనికి”  అని మా అమ్మ అంటే “వాడు బరువేంటే. వాడు వీపున లేపోతే ముగ్గు పడదే తల్లీ, చూపు ఆనదే అమ్మా” అనేది బామ్మ.


సమస్త దేవుళ్ళకీ మేలుకొలుపులు పాడుతూ వాకిలి నాలుగు దిక్కుల్నీ ముగ్గుతో కలిపేది. అప్పుడు మా మండువా లోగిలి నిండుగా పమిటకప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తయిదువులా వుండేది. “పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్లు లేవరా” అని అడిగితే “పిచ్చి సన్నాసీ దేవుళ్ళు నిద్దరోతారా! దేవుడు నిద్దరోతే యింకేమైనా వుందీ-! మేలుకొలుపులూ మనకోసమే చక్రపొంగలీ మనకోసమే” అనేది బామ్మ.


తెల్లారగానే నూనె రాసి, నలుగు పెట్టి కాకరపందిరికింద ముక్కాలిపీట మీద కూచోపెట్టి mవేడినీళ్ళు పోసేది.


 “చిక్కిపోయాడమ్మా పిల్లాడు… పొడుగు సాగుతున్నాడో ఏమో” అని బామ్మ రోజు నలుగు పెడుతూ దిగులుపడేది. ఒంటి మీద చిన్న గాటో, దెబ్బో, పొక్కో కనిపిస్తే “అఘాయిత్యం వెధవ్వి ఎక్కడ తగిలించుకున్నావ్?” అని గారాబంగా కేకలేసి తెగ దిగులుపడిపోయేది. నాకప్పుడు ఎంతో హాయిగా అనిపించేది.


నెలకోసారి భజంత్రీవాడు వచ్చేవాడు బాదం చెట్టుకింద నేను, మా బామ్మ తలపని చేయించుకునేవాళ్ళం. ముందు నావంతు.


“ఒరేవ్ జాగ్రత్తగా చెయ్ – పిల్లాడి క్రాపు తెల్లదొర క్రాపింగ్ లా వుండాలి” అని హెచ్చరికలూ, సలహాలూ యిస్తూ ఎదురుగా కూర్చునేది బామ్మ. అయినా వాడి పద్ధతిలో వాడు తిరపతి మెట్లతో డిప్ప కొట్టుడు కొట్టేసేవాడు. 


తనవంతు వచ్చినపుడు చేతిన వున్న బంగారుమురుగుతీసి నా చేతికి తొడిగేది. స్నానం చేశాక కుంకుడురసంతో ఆ బంగారు మురుగుకి మెరుగు తెప్పించి తన చేతికి వేసుకునేది. మెరుస్తున్న చేతిని తృప్తిగా చూసుకునేది.


బజారు చిరుతిళ్లు తినకూడదని నా మీద గట్టి ఆంక్ష వుండేది. ఆరోగ్యం కంటె కుటుంబమర్యాద దెబ్బ తింటుందని - నాకవేం తెలిసేవి కావు. బెల్లపు జీళ్లు, పీచుమిఠాయి, జంతికలు, తేగలూ కొనుక్కు తినాలని నాలిక పీకేది. బామ్మని అడిగితే “ఓస్ అంతే కదా పద” అనేసి కోరినన్ని కొనిపెట్టేది. మరికొన్ని బాదంచెట్టు భోషాణంలో దాచిపెట్టేది. బామ్మ నా పాలిట వరాలిచ్చే దేవత!


మనవడికి అడ్డమైన గడ్డీ కొనిపెడ్తోందని తెలిసిబామ్మకి డబ్బు దొరక్కుండా ఇంట్లో కట్టడి చేశారు దీని మీద ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయి.


బామ్మ మీద నిఘా వేసినా నా చిరుతిళ్ళకి లోటు రాకుండా చూస్తోంది. బియ్యం ఒళ్లో పోసుకెళ్ళి నాకు జీళ్లు, తేగలూ నైవేద్యం పెట్టేది. 


అదీ తెలిసిపోయింది. బియ్యం డబ్బాకి తాళం పడింది. దాంతో నా నోటికి కూడా, అత్తగారి ఆటకట్టిందని అమ్మ సంతోషించింది.


”ఇంటి దీపానివి, చక్రవర్తివి , నీకీ కరువేంటి నాయనా” అని బామ్మ బాధపడింది.


ఓ రోజు పీచుమిఠాయి వాడు ఊళ్లోకి వచ్చాడు. వాడు రోజూ రాడు. సంతరోజు మాత్రమే వస్తాడు. మూడువైపులా రేకు, ఓవైపు సరుకు కనిపించేలా అద్దం వున్న డబ్బా -విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా పీచుమిఠాయి పొత్తులు – వాడు డబ్బా చప్పుడు చేస్తూ “పిచ్మిఠా” అని చిత్రంగా అరుస్తూ వీధిన వెళ్తుంటే నా నోరెంత వూరిందో బళ్లో వున్న నాకు తెలుసు - ఇంట్లో వున్న మా బామ్మకి తెలుసు.


“పిచ్మిఠా” అరుపు దూరం అవుతున్న కొద్దీ నాలో బెంగ ఎక్కువవుతోంది. ఆ క్షణంలో బామ్మ బడిగుమ్మంలో ప్రత్యక్షమైంది.


పంతులుగారు ప్రభవ విభవలు చెప్పిస్తున్నారు. బామ్మ రాకతో ప్రమోదూత దగ్గర ఠక్కున వల్లింపు ఆగి తరగతి నిశ్శబ్దం అయింది. 


నరసింహం పంతులుగారంటే గండభేరుండం! పిల్లలూ, పెద్దలూ హడిలి చచ్చేవారు. ఆయనకి బుర్రమీసాలు, కళ్లద్దాలు, గుండూ పిలక, చేతిలో బెత్తం, నాలుగువైపులా చూడగల మిడిగుడ్లూ వుండేవి. 


మా బామ్మ బడిగుమ్మంలోకి వస్తూనే “ఒరే నరసింహా, నా మనవణ్ణి పంపరా” అంది. ఆయన నా వైపు చూసి "పోరా" అనే లోగానే పలకా పుస్తకంతో నిలబడి వున్నాను. “పో…” అనడమేమిటి తొర్రలో రామచిలకలా తుర్రున దాటుకున్నాను.


అవతల వీధి చివర "పిచ్మిఠా" వాడు నా కోసమే నిలబడి వున్నాడు. అప్పటికే వాడితో బేరసారాలు పూర్తిచేసింది బామ్మ. రెండు మిఠాయి పొత్తులూ, నాలుగు పుంజీల జీళ్లు ఇప్పించింది. జీళ్లు జేబులో పోసుకుని, బామ్మ కొంగుచాటు చేసుకుని మిఠాయిలు రెండూ మింగేశాను. ఆ రంగుకి నోరు ఎర్రగా హనుమంతుడి మూతిలా అయిపోయింది.

“ఈ మొహంతో ఇంటికెళ్తే ఏవన్నా వుందీ..” అంటూ కాసేపు బజారు పెత్తనం చేయించి, బడిగంట కొట్టాక బావిదగ్గర మూతి కడిగి, కొంగుతో తుడిచి ఇంట్లో ప్రవేశపెట్టింది.


తెల్లారి పొద్దున దేవతార్చనలో వుండే బుల్లి కంచుగంట కనిపించలేదని అమ్మ కంగారుగా వెదికేస్తోంది.

“ఎక్కడికి పోతుంది… ఎలికముండలు లాక్కెళ్ళి వుంటాయి…” అని బామ్మ పట్టీ పట్టనట్టు సద్దేస్తూ మాట్లాడుతోంది.


“అయినా ఎలికలు గంటనేం చేసుకుంటాయి బామ్మా” అంటే “పిల్లికి కడతాయ్ వెధవాయ్” అని అరిచి నా నోరు నొక్కి బయటకులాక్కెళ్ళింది.


తొర్రలో దాచుకున్న నాలుగు పుంజీల జీళ్లు రెండ్రోజుల్లో పూర్తయినాయి.


మళ్లీ సంతరోజు వచ్చింది. ఇంట్లో పెద్ద గాలిదుమారం లేచింది. నాన్న అరుపుల ముందు బామ్మ ముద్దాయిలా నిలబడి వుంది. వాకిట్లో పీచుమిఠాయి వాడు నిలబడి వున్నాడు. క్రితం వారం వాడికి బామ్మ కంచుగంట యిచ్చిందట. ఆ లెఖ్ఖల్లో వాడు మనకి నాలుగు మిఠాయిలు, ఆరుపుంజీల జీళ్ళు ఇంకా బాకీ వున్నాట్ట! అవి యిచ్చేసి వెళ్తామని సరాసరి వాడు ఇంటికి వచ్చాడు. అదీ గొడవ. సడీచప్పుడు చెయ్యదనుకున్న గంట గణగణా బామ్మ గుండెల్లో మోగింది.


“దేవుడి గంటనే పాపభీతి కూడా లేకపోయె…” అంది అమ్మ నిష్ఠూరంగా.


“అంత పాపభీతి పడాల్సిందేముందీ… అయినా దేవుడు ఘంటలో వుంటాడా? …. పసివాళ్ళ బొజ్జలో వుంటాడుగాని…” బామ్మ సాయకారం తీసింది.


“ఈ మెట్ట వేదాంతాలకేం లెండి… ఇట్లాగే వదిలేస్తే అవ్వా మనవడూ కలిసి ఆ చేతిమురుగు కూడా కరిగించేసుకు తింటారు.” అంది అమ్మ , నాన్నకి బోధపడాలని. 


నాన్న కలిగించుకు మాట్లాడేలోగా బామ్మ, కోపంగా గొణుక్కుంటూ చరచరా వెళ్లి బాదం చెట్టుకింద కూచుంది.f నేను వెనకే భయం భయంగా వెళ్ళా… కొంచెం దూరంగా నిలబడ్డా.


”నువ్వు కాదుగాని……. నీతో నా చావుకొచ్చిందిరా. ఇన్నేళ్ళోచ్చి ఆఖరికి నా బతుకు దొంగ బతుకైపోయింది. ఫో అసలు నా చాయలకి రావద్దు… మీ అమ్మా నాన్నా వున్నారుగా… వాళ్ళతోనే వూరేగు… నాది అనుకుంటే దుఃఖం… కాదు అనుకుంటే సుఖం…” అంటూ బామ్మ బావురుమని ఏడ్చింది.


కంటి ధార ఎండిన బాదం ఆకుల మీద టపటపా రాలాయి. పిడుగులు రాలున్నంత చప్పుడు నా చెవికి… దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది, దిక్కులేని వాళ్ళకి?


ఒక్కసారి బేర్ మని పెద్దగా ఏడ్చాను.


బామ్మ తటాలున చేతులు జాపి ఒళ్ళోకి లాక్కుంది. అక్కడే చెట్టుకింద ఎండాకుల మీద బామ్మ ముడుచుకు పడుకుంది. నేను బామ్మ పక్కనే వొదిగి దిగాలుగా కూచున్నా, బామ్మ గుర్రుపెట్టి నిద్రపోయింది. బామ్మ మీద గండుచీమలు పాకుతుంటే వాటిని దులిపేస్తూ  - వెన్ను మీద చెయ్యివేసి నా పక్కలో కూచునే బామ్మలా కూచున్నాను. కాకి రాల్చిన రెండు బాదంకాయలు గుండుమీద పడితే బామ్మ ఉలిక్కిపడి లేచింది. నాకు నవ్వొచ్చింది. సంగతి అర్ధంకాగానే బామ్మ కూడా పక్కున నవ్వింది. ఆ నవ్వు కొండంత ధైర్యమై నన్ను వరించింది.


రాలిన బాదంకాయల్ని పప్పులు వొలిచే పనిలో పడింది. “ఒరే, మీ అమ్మకి ఈ మురుగు చెరిపించి ఒక జత ఒంటిమిరియం గాజులు చేయించుకోవాలని ఎప్పట్నించో ఆశ… చూశావా అటు తిప్పి ఇటుతిప్పి… బోడిగుండుకీ బొటనవేలుకీ ముడిపెట్టినట్టు…ధోరణి నా నగమీదికి లాగింది…” బాదంపప్పులు పెడుతూ బామ్మ మాటలు.


నాకు అర్ధం కాకపోయినా “ఔనౌను…’ అన్నాను ఆరిందాలాగా ఆమెని సంతోషపెట్టడానికి.


దసరా రోజులు వచ్చాయి.

ఒక పెద్ద పీఠం - మందీ మార్బలంతో మా ఇంట్లో దిగింది. 


స్వాములారు, శిష్యగణం, సేవకులు, వంటలక్కలు, గున్న ఏనుగు, నాలుగు ఆవులూ వాటి దూడలూ, జింకపిల్ల, రెండుపల్లకీలు, ఇవిగాక బోలెడు సాధన సామాగ్రి నాలుగు గూడు బళ్ళ నిండా దిగాయి.


ఇల్లంతా ఆక్రమించుకుని సిపాయిల్లాగా వాళ్ళే ఎక్కడెక్కడ ఏమేమిటి ఎట్లా అమర్చుకోవాలో చూసుకుంటున్నారు. నేను, బామ్మ పరాయివాళ్లలా చోద్యం చూస్తున్నాం.


” ఇవాల్టినించి మన కొంప సర్కస్ డేరా అనుకో” అంది బామ్మ.


వాళ్లు మాట్లాడే భాష కూడా చిత్రంగా వుంది. మా నాన్నని ‘గృహస్థు’ అని పిలిచేవాళ్ళు. సామాజికులు, పూర్ణదీక్షాపరులు, శిష్యపరమాణువులు, పాదరేణువులు… ఏమిటో నాకు అర్ధంకాని మాటలు చాలా వినిపించేవి.


అంటే ఏవిటని బామ్మని అడిగితే ‘అంతా మనుషులేరా అబ్బీ- వుత్తినే… అదో ఆడంబరం” అన్నది బామ్మ.


గున్న ఏనుగుకి రోజు బెల్లం బుట్ట. అరటిపళ్ళ గెల అందించేవారు. దాని సేవకి ఇద్దరు మావటీలు, శ్రీ మావటీ గారిని మంచి చేసుకుని నన్ను ఒక్కసారైనా ఏనుగు ఎక్కించాలని బామ్మ తంటాలు పడ్డది కాని వారు సాధ్యపడదన్నారు. పల్లకీలపైన వుండే శాటిన్ వస్త్రం చుట్టేసి, పల్లకీలని దేవిడీలో జాగ్రత్త చేశారు.


పల్లకి ఎక్కించమని హటం చేస్తే “ఆ సన్నాసి పల్లకీ మనకెందుకురా - నీ పెళ్ళికి దీని జేజెమ్మ లాంటి పూసల పల్లకీ పెట్టించి ఊరూ, పేటా ఊరేగిస్తా…” అని బామ్మ సముదాయించింది. 


అందరూ నిద్దర్లు పోయాక సాములారి జింకచర్మం మీద నన్ను కాసేపు పడుకోపెట్టింది బామ్మ. బలె మెత్తగా నూ, తమాషాగానూ వుంది. జింకపిల్లతో ఆడుకోవాలనిపించేది కాని బామ్మ దాన్ని శత్రువర్గంగా భావించి దూరంగా వుంచేది.


మా ఇంట్లో అర్చనలూ, దీక్షలూ, హోమాలూ ఘోటకంగా సాగుతున్నాయి. వచ్చే పోయే భక్తులు, బంధువులు అంతా కోలాహలంగా వుంది.


స్వామివారు వెండి రేకులు తాపడం చేసిన సిహాసనం మీద కూచుని తావళం తిప్పుతూ వుండేవారు. ఎప్పుడూ గంభీరంగా వుండేవారు. ఎప్పుడేనా ఒక చిరునవ్వు ప్రసాదించేవారు భక్తులికి. అలౌకిక విషయాల్లోనూ, లౌకిక వ్యవహారాల్లో కూడాతలదూర్చేవారు. వంటలూ – పిండివంటలూ, కూరలూ, పులుసులూ అన్నీ ఏమేం ఎట్లా చెయ్యాలో ఆయనే చెప్పేవారు.


చెప్పడం అనకూడదుట ఆదేశించారు అనాలిట! 


చూట్టానికి వచ్చారనకూడదు దర్శనానికి వచ్చారనాలిట.

“పాదాలివ్వండి స్వామీ” అని ప్రాధేయపడేవాళ్ళు. వాళ్ళకి ప్రాప్తం వుంటే పాదాలిచ్చేవారు. లేనివాళ్ళు పాంకోళ్ళకి మొక్కి వెళ్ళిపోతుండేవారు.


సాములారు భోజనం చేశాక (అపచారం, భిక్ష స్వీకరించాక) వెండి గొలుసుల ఉయ్యాలబల్ల మీద పట్టు బాలీసుల మీద వాలి అరమోడ్పు కన్ను లతో భుక్తాయాసం తీర్చుకునేవారు.


వింజామరలు విసరడానికి మేవంటే మేమని వంతులకోసం పోట్లాడుకునేవాళ్ళు భక్తులు.

“జార్జి చక్రవర్తిదే భోగం – మళ్లీ మీ స్వామివారిదే భోగం” అనేది శిష్యుల దగ్గర మా బామ్మ. వాళ్ళు దానికెంతో గర్వపడేవాళ్ళు.


సాయంత్రం ఆయన వేదాంత విషయాలు బోధించేవారు. అర్ధం అయినా కాకపోయినా అంతా శ్రద్ధగా వినేవాళ్ళు. 


అయ్యవారికి శాలువలు, అమ్మవారికి పట్టువస్త్రాలు, పళ్లు, రొక్కం కానుకలుగా సమర్పించుకునేవాళ్ళు.


ఒకరోజు శిల్కులాల్చీ, నాలుగు వేళ్ళకీ ఉంగరాలు, మెడలో పతకపు గొలుసుతో ఆర్భాటంగా గుర్రబ్బండి దిగాడొక భక్తుడు. వస్తూనే స్వామి వారి పాదాలమీద వాలాడుస్వామివారు వాత్సల్యంతో వందనం స్వీకరించారు. జోడించిన ఉంగరాల చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకుని “ఎట్లా వుందిరా వ్యాపారం” అని అడిగారు.


“అంతా తమ దయ”అన్నాడా భక్తుడు.


“రాహువు ఇల్లు మారుతున్నాడు. ఇక నీకు తిరుగులేదురా పట్టిందంతా బంగారమే” అన్నారు స్వామి భక్తుడి చేతులు వదిలిపెడుతూ – భక్తుడి నడిమి వేలునున్న ఎర్రరాయి వుంగరం స్వామి చేతిలోకి వచ్చింది.


పక్కనే వున్న శిష్యుడి దోసిట్లో వేసి “అమ్మవారికి ముక్కెర చేయించండి” అని చిరునవ్వుతో  ఆదేశించారు. ఆ భక్తుడికి వేలు వూడినంత బాధ కలిగింది. 


పెదాలు తడారిపోయినాయి. బిక్కచచ్చి “తమ చిత్తం” అన్నాడు ఎప్పటికో తేరుకుని.


“కాదు తల్లి ఆజ్ఞ” అన్నారు స్వామి గంభీరంగా.


మనోవాక్కాయ కర్మలమీద స్వామివారు ప్రసంగం కొనసాగించారు. బామ్మ నవ్వాపుకోలేక సభలోంచి జారుకుంది. శిష్యుడు ఎదురైతే “మీ దేవుడికి పట్టిందంతా బంగారమే” అని ఎగతాళి చేసింది.


లోగడ విడిది చేసినపుడు ఆయన చూపు బామ్మ బంగారుమురుగు మీదపడిందిట. “తల్లి చిట్టికాసులపేరు కావాలని గోల చేస్తోంది- నువ్వు చెయ్యివిదిలిస్తే తల్లి కోరిక తీరుస్తా…” అన్నారుట స్వామి బామ్మతో.


“అయ్యో… ఆ తల్లికి నేనిచ్చే పాటిదాన్నా సాక్షాత్తూ మహాలక్ష్మి ఆమెకేం తక్కువస్వామీ” అని బామ్మ భక్తిభావంతో సవినయంగా సమాధానం చెప్పిందట.

“ఒరేవ్ హనుమంతుడి ముందా కుప్పిగంతులు? ఇచ్చేదాన్నయితే ఆనాడు గాంధీగారు గుమ్మంలోకొచ్చి సొరాజ్జెమ్ కోసం జోలెపట్టిన రోజే యిద్దును కదా… మహా మహా ఆయనకే ఇవ్వలేదు… ఈ సర్కస్ కంపెనీకి యిస్తానా…” అంది బామ్మ.


అది తీర్ధప్రసాదాల సమయం.

భక్తులంతా కాళ్ళకి మొక్కి, తీర్ధం పుచ్చుకుని మళ్ళీ మొక్కి వెళ్తున్నారు. నేనూ వెళ్ళి చెయ్యి జాపా. స్వాములారు హూగ్రంగా గుడ్లురిమి “పో అవతలికి ” అని గసిరారు. చొక్కా తొడుక్కుని మొక్కడం, తీర్ధాలు తీసుకోడం మహాపచారంట! ఇంకేముంది కొంపలు మునిగి పోయినట్టు అందరూ హాహాకారాలు చేయడం మొదలెట్టారు. ఆ సందట్లో నా లాగూ చొక్కా విప్పేసి ఒంటిమీద నూలుపోగు లేకుండా ఆయన ముందు నిలబెట్టారు. అయినా ఆయన కటాక్షించలేదు. నన్ను బయటకి పంపెయ్యమని తీర్ధపు శంఖుతో సైగచేశారు. తెలియక జరిగిన అపచారానికి మన్నింపు కోరాలని అమ్మ వెళ్ళి ఆయన ముందు నిలబడితే – మరీ రెచ్చిపోయి “ఇవ్వాళ అమృతం ఎవరికీ ప్రాప్తం లేదు… అపచారానికి ప్రాయశ్చిత్తం…” అన్నారు కఠినంగా – శంఖుకింద పెట్టేసి తావళం అందుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు.


భక్తులు, శిష్యులు అంతా నన్ను దోషిని చూసినట్టు చూస్తున్నారు. ఇదంతా చూస్తున్న మానాన్నలో సహనం చచ్చిపోయింది. నన్ను బయటికి బరబరా లాక్కెళ్ళి, పూనకం వచ్చిన మనిషిలా చావకొట్టారు. ఒంటిమీద అచ్చాదన కూడా లేదేమో వొళ్ళంతా వాతలు తేలాయి. గుక్కపెట్టి పరుగెత్తాను. 


బామ్మ పరుగు పరుగున ఎదురొచ్చి రెండు చేతులా నన్నెత్తుకుని గుండెలకు పొదువుకుంది. భయం, బాధ, ఉక్రోషం, ఒంటరితనం ఇవన్నీ ఆవరించిన నాకు మా బామ్మ వెయ్యి చేతులు నాకోసం జాపిన అమ్మవారిలా కన్పించింది - గబగబా బాదంచెట్టు కిందకి తీసుకెళ్లింది వాతలు చూసింది. వలవలా ఏడ్చింది. ఒళ్ళంతా నిమిరింది. పై కొంగు కప్పింది. “ఆ బడుద్ధాయికి నిన్ను కొట్టేందుకు చేతులెలా వచ్చాయిరా దూర్వాసపు పుటకా వాడూనూ…” అంటూ నాన్నని తిట్టింది. 


నా ఏడుపు ఎక్కిళ్ళ స్థాయికి తగ్గింది. బామ్మ మాత్రం బుసలు కొడుతోంది. 


ఇంతలో స్వాములారి అంతరంగిక శిష్యుడు ముడిధోవతులు ఆరెయ్యడానికి పెరడువైపు వచ్చాడు.


“దీక్షితులు ఇట్రా” అని గద్దింపుగా పిలిచింది. ఆ పిలుపుకి ఆయన వులిక్కిపడ్డాడు. ఆ సంబోధన… ఆ ధాటీ – దీక్షితులు గారంటే స్వాములోరి తర్వాత స్వాములారంతటివాడు. 


పెద్దాయన అలవాట్లు, ఇష్టాయిష్టాలు, వేళావేళలు, కళాకళలూ అన్నీ తెలిసినవాడు. స్వామివారికి జలుబుచేస్తే దీక్షితులు గారికి తుమ్ములు వస్తాయి. అలాంటిది వారి సంబంధం – దీక్షితులు సంకోచిస్తూనే నాలుగడుగులు బామ్మ వైపు వేశాడు.


“ఏం స్వాములారయ్యా బోడి సాములారు… పసివెధవకి ఎలా వాతలు తేలాయో చూడు… పైన చొక్కా వుంటేనే అంట్ల వెధవ అయిపోయాడా అభం శుభం తెలీని పసిబిడ్డ….? ఆ మాటకొస్తే దేహశుద్ధి లేని పుండాకోర్లు చాలా మందున్నారు మీ గుంపులో… చేతనైతే వాళ్ళ చర్మాలు వొలిపించి తీర్థాలు పోయమను. వూరిఖే బృహదారణ్యాలు భగవద్గీతలూ వల్లిస్తే లాభం లేదు… మానికతో జొన్నలు కొలిస్తే బలం వస్తుందా? దంచాలి వండాలి తినాలి హరాయించుకోవాలి- అప్పుడొస్తుంది బలం… ఔనా? మీ పీరాయ్ కి చెప్పు… నాకేం భయం లేదు… వాడి బోడి శాపం నన్నేం చేయదు…” – బుసలు కొట్టే బామ్మ మాటలకి దీక్షితులు బుర్ర తిరిగిపోయింది. పిలక తడుముకుంటూ పిల్లిలా జారుకున్నాడు. 


అయినా బామ్మ ఆగలేదు.

“ధిక్కారము సైతునా అని వేమూరి గగ్గయ్యలా, గుడ్లూ వీడూనూ…పిచికమీద బ్రహ్మాస్త్రం అనీ, ఒక పక్క ఎకరాలు హరించిపోతున్నా తెలీడం లేదు… అరిశెల్ని అప్పాల్ని వదల్లేనివాడు అరిషడ్వర్గాల్నేం వదుల్తాడు…” స్వాములారిని, మా నాన్న ని కలగలుపుగా దీక్షితులు వెళ్ళిన అరగంటదాకా బామ్మ తిడుతూనే వుంది.


రాత్రి అమ్మ నన్ను గట్టిగా కరుచుకుని కంటినిండా ఏడ్చింది. నూనె రాసింది. నాన్న రోజంతా అన్నం తినలేదు.


“ముందే వుండాలి నిగ్రహం… ఉపోషం వుంటే పిల్లాడి వాతలు పోతాయా… అంత తామసం కూడదు” అని బామ్మ మందలించింది. తలదించుకున్నారు గాని నాన్న మారు మాట్లాడలేదు.


స్వాములారి మీద కాదు యావత్తు పీఠం మీద బామ్మ కత్తి కట్టింది. పాకశాలలో వంటవాడి మీద దాష్టీకం చేసి నాలుగు చిట్టిగారెలు కొంగులో వేసుకొచ్చి వేడివేడిగా నాచేతతినిపించింది. దీక్షితుల్ని పనిమాలా పిలిచి “ఇదిగో మహా నివేదన కాకుండానే చిట్టిగారెలు పిల్లాడికి పెట్టా….చెప్పుకో దిక్కున్నచోట.. మొక్కకి చెంబుడు నీళ్ళు పొయ్యడం… పక్షికి గుప్పెడు గింజలు జల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్న వాడికి పట్టెడన్నం పెట్టడం ఇదే నాకు తెలిసిన బ్రహ్మసూత్రం-” సవాలు చేసింది బామ్మ, పాపం దీక్షితులకి బామ్మంటే సింహస్వప్నం అయింది – ఎప్పుడు పిలిపిస్తుందో తెలీదు – ఏం తిడుతుందో తెలీదు.


రెండోరోజు సాయంత్రం వేదాంత సభలో నన్ను పిలిచి ఒళ్ళో కూచోపెట్టు కున్నారు స్వామి వారు. జామపండు యిచ్చి “మొత్తం తినాల్రా” అని తినిపించారు. నాకు పులిమీద కూచున్నట్టుంది. రుద్రాక్షలు గుచ్చుకుంటున్నాయి. అయినా ఎటూ కదలడానికి లేదు. తర్వాత మరికాస్త ముద్దుచేసి వారి పాంకోళ్ళు తొడిగించి నడవమన్నారు. నేను ఠక ఠకా చప్పుడు చేస్తూ సభలో తప్పటడుగులు వేస్తుంటే “ఏవమ్మో, నీ మనవడు బాలకృష్ణుడు…” అన్నారు స్వాములారు పెద్దగా నవ్వుతూ, శిష్యులంతా ఆమోదిస్తున్నట్టు ముఖాలు వికసింపచేశారు.


“అంతా తమరి వాత్సల్యం. పసివాడి అదృష్టం” అంది బామ్మ. ఈ సంఘటన తర్వాత దీక్షితులు సుఖంగా ఊపిరి పీల్చుకున్నాడు.


ఆ పీఠం మరోచోటికి తరలింది.

బామ్మ మేలుకొలుపులు పాడుతూనే వుంది. ముగ్గులు వేస్తూనే వుంది. కాని నా చిన్న తనం బామ్మ వీపు మీంచిజారిపోయింది. నా కంచం నాదే – నా మంచం నాదే. హైస్కూలు చదువులో పడ్డాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందనీ, నాకు వడకపోగు వెయ్యాలనీ నిర్ణయించారు.


వారం ముందుగానే సందడి ప్రారంభమైంది. గురుపరంపరతో బాటు బంధువులతో ఇల్లు నిండింది. మా అత్తయ్య, మామయ్య వాళ్ళమ్మాయి కల్యాణి వచ్చారు. 


కల్యాణికి పదేళ్ళుంటాయి. ప్రతి ఇంట్లోలాగే మేనత్త కూతురు కాబట్టి “నీ పెళ్లాం వచ్చిందిరోయ్” అని పాత సరసం ఆడారందరూ.


అత్తయ్య వస్తూనే బామ్మని చూసి “ఏమిటే అమ్మా అంతగా చిక్కిపోయావ్…” అని బాధ నటించింది.


“నేను చిక్కేదాన్ని కాదు లేవే ఎవరికీ – నువ్వు బాధపడకు” అంది వ్యంగ్యంగా బామ్మ.


“చూడు… ఆ చేతులు పుల్లల్లాగా అయిపోయాయ్… బావిలో చేద వేసినపుడు ఆ మురుగు జారి నూతిలో పడ్తుందేమో చూసుకో…” – సలహాగా అత్తయ్య అంటే

“నువ్వు వెయ్యి చెప్పు, లక్ష చెప్పు… చచ్చినా నా చేతి మురుగు నీకివ్వను…” తెగేసినట్టు అన్నది బామ్మ.


అత్తయ్య కస్సున లేచింది ఆ మాటకి. “అంటే నీ ముష్టి మురుగు కోసం పడి చస్తున్నానా” “ముష్ఠిది కాదది బంగారపుది – సువీ అంటే రోకలి పోటని తెలుసులేవే…” అందిబామ్మ.


“ఒక్కగానొక్క ఆడపిల్లని… కన్న కూతుర్ని … దయాపేక్షలు లేవు. మీ పెట్టుపోతలకి మేం ఎప్పుడైనా ఏడ్చామా….” అని గద్గద స్వరంతో అత్తయ్య విజృంభించింది.


తల్లీ కూతుళ్ళ వాదులాట విని అమ్మ లోపల్లోపల ఆనందపడ్డది. మాటా మాటా మరీ పెరక్కుండా నాన్న సర్దుబాటు చేశారు.


నా చెవిలో నాన్న బ్రహ్మోపదేశం చేశారు. మెడలో జందెపు పోగు, చెవులకి బంగారు పోగులు నాకు కొత్త అలంకారాలైనాయి.


బాదం చెట్టు పండుటాకులు రాలుస్తూ కొత్త ఆకులు తొడుగుతోంది. తొర్రలో పాత చిలకలు ఎగిరిపోయి కొత్త చిలకలు వచ్చి వాలున్నాయి. బామ్మకి అరణంగా యిచ్చిన ఆవుదూడకి అయిదో కారు దూడ పుట్టింది.


కంటిచూపు తగ్గినా బాగా చెయ్యి తిరిగిన బామ్మ ముగ్గులు గడితప్పకుండా వేస్తూనేవుంది.


పీఠాధిపతుల తాకిడి తగ్గింది. తాతలనాటి క్షేత్రాలు తరిగిపోయాయి. అంటుమామిడి తోట గృహస్థు పేరు మీద లేదిప్పుడు. దేవిడీకి గోడలు తప్ప పైపెంకులు లేవు. 


ఒంట్లో ఓపిక తగ్గినా బామ్మ మాట చురుకు తగ్గలేదు

“మా ఉయ్యాల వెండి గొలుసుల్ని గున్న ఏనుగు మింగేసింది” అని చాలా సరసంగా చెప్పి నవ్వేది.

అమ్మకి అకాల వార్ధక్యం వచ్చింది. తడి చీరెల శిక్ష తప్పింది. నాన్న నిర్లిప్తంగా వుంటున్నారు. 


అప్పటి వైభవం లేదు, అట్లాగని దరిద్రమూ లేదు. నాకు తెలిసిన వైభవం బామ్మ – బాదంచెట్టూ అని ఇప్పుడూ వున్నాయి. “నాది అనుకుంటే దుఃఖం కాదు అనుకుంటే సుఖం” బామ్మ చెప్పిన బ్రహ్మసూత్రం నిజమే అన్పించింది.


నా ఎఫ్.ఎ.పూర్తయింది. బందర్ లో సర్కారు ఉద్యోగం వచ్చింది.

అయినవీ కానివీ పెళ్లి సంబంధాలు రావడం మొదలైంది. మేనత్త కూతురు కల్యాణి ప్రస్తావన వచ్చింది. కాని బామ్మ ససేమిరా వద్దంది.

“ఆ పిల్ల పేరుకి కళ్యాణేగాని వుత్త నత్తగవ్వ – దాని తల్లి గడుసు దయ్యం – దాంతో నువ్వా సుఖపడలేవ్- పరాయి సంబంధమే చేసుకుందాం” అని బామ్మ స్పష్టంగా చెప్పింది.


అత్తయ్యా వాళ్ళు కూడా నా కాళ్ళు కడిగి పిల్లనివ్వడానికి, పుట్టింటి బంధం నిలిచిపోవాలనీ ఏ మాత్రం ఆరాటపడలేదు. వాళ్లకి ఒక్కతే పిల్ల. పైపెచ్చు కావలసినంత వున్న వాళ్ళు. మాకిప్పుడు ఈనాములూ లేవు, నేను బారిస్టర్ నీ కాదు.


చూసిన రెండు మూడు సంబంధాల్లో – చిన్నప్పుడు చదువు చెప్పిన నరసింహం పంతులుగారి ద్వారా వచ్చిన సంబంధం నచ్చింది.

బామ్మకి మరీ నచ్చింది. తాంబూలాల దాకా వచ్చాక నాలుగు కాసుల బంగారం దగ్గర తేడా వచ్చింది. అటూ యిటూ నరసింహం గారు మాటలు నడిపారు గాని చివరికది చినికి చినికి గాలివాన అయింది. పెద్దవాళ్ళ మధ్య సొమ్ము కంటె పంతాలు అడొచ్చాయి.


“పిల్ల పొందిగ్గా వుందిరా…పచ్చగా దొరసానిలా వుంది… కళ్ళు కజ్జికాయల్లా వున్నాయి… నాలుగు కాసుల బంగారం ఒక్క ముద్దుకి చెల్లు…” అంటూ బామ్మ తెగ వూరించడం మొదలుపెట్టింది.


లోపల పంతం పెట్టుకుని పైకి మాత్రం ‘వాడిష్టం’ అని నాలిక చివర మాట అంటున్నారు అమ్మా, నాన్న.


నేను ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డాను. బాదం చెట్టుకింద ఒంటరిగా కూచోబెట్టి బామ్మ హితోపదేశం మొదలు పెట్టింది. “పిల్ల పేరు గాయత్రి….”


“అయితే…”


“రోజు పదిసార్లు పిలిచినా చాలు పుణ్యం పురుషార్ధం… పది మందిలో పుట్టి పెరిగినపిల్ల…”


“అయితే…”


“ఒరే కోర్నాసీ దూటకూరకీ, ముగ్గులకి బోలెడు ఓర్పూ, ఓపికా కావాలా పనితనమూ ఉండాలి… పిల్లకి రుక్మిణీ కళ్యాణం కంఠతా వచ్చుట- టీకా తాత్పర్యంతో సహా“.


“అయితే…”


“అయితేనా? ఇష్టమైన వాడి కోసం ఏదైనా చేసే జాణతనం వుందని…నువ్విట్టాగే మీనమేషాలు లెక్కేస్తూ కూచుంటే చివరికి ఆ పిల్లే నిన్ను లేవదీసుకు పోతుంది…. సరేనా..” అంది నాకు రోషం తెప్పించాలని.


అయినా నేనేమీ చలించలేదు. మర్నాడు ప్రయాణం రోజు వెళ్ళబోతూ నాన్న ముందు మౌనంగా నిలబడి మాట్లాడ్డానికి తటపటాయిస్తుంటే ఆయనే అందుకుని “నీ ఇష్టంరా… నేనేం నిధి నిక్షేపాలిచ్చానని నీ మీద పెత్తనం చెలాయిస్తాను. నువ్వు అన్ని విధాలా స్వతంత్రుడివి… నీకు యిష్టమైతే మాదేముంది… వచ్చి పీటల మీద కూచుంటాం…” అన్నారు.


విషయం తేలిపోయింది.

రకరకాల ఆలోచనలతో రాత్రంతా నిద్రపట్టలేదు. బామ్మ ఒక రాత్రి వేళ చీకట్లో తడుముకుంటూ నాగదిలోకి వచ్చింది. నా మంచం మీద కూచుంది. మెల్లగా లేపాలని తడుముతోంది – “లేచే వున్నాలే చెప్పు…” అన్నాను.


“నువ్వు నిద్రపోవని తెలిసే వచ్చా, చూడబ్బాయ్ మీ నాన్న కి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ… మీ అమ్మకి మొగుడు చెప్పింది వేదం – ఈ కోపతాపాలు 

నాలోజులుంటాయ్, ఆనక పోతాయ్…. మిగిలేది నిక్షేపంలాంటి పిల్ల… అంచేత నిష్కర్షగా గాయత్రినే చేసుకుంటానని తేల్చి మరీ వెళ్ళు….”


నేను ఏమీ చెప్పకుండా అటు తిరిగి పడుకున్నాను.

“ఒరేవ్ అధిక మాసాలతో ఎనభై దాటేశా… నీ పెళ్ళి చూడాలని ప్రాణం ఉగ్గపట్టుక్కూచున్నా. ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి. – నువ్వు ఆకు వక్క వేసుకుంటే అమ్మడు నోరు పండాలి – అదీ ఇదీ అయి ఆనక మీ కడుపు పండాలి. నేను మళ్లీ నీ ఇంటికి రావద్దూ…” బామ్మ గొంతు జీరపోయింది. కన్నీటి చుక్క నాగుండె మీద వెచ్చగా రాలింది.


ఉద్యోగం ఊరు చేరగానే గాయత్రి సంబంధమే ఖాయం చేయమని నాన్న కి మూడు ముక్కల ఉత్తరం రాశా - పోస్టు చేయకుండానే “ముహూర్తం నిశ్చయమైంది… వున్న పళంగా పదిహేను రూజుల సెలవుపెట్టి రమ్మని” టెలిగ్రాం వచ్చింది.

ఇంట్లో అడుగు పెడుతుండగానే బామ్మ ఎదురొచ్చి “దిగివచ్చార్రోయ్ … నీలాంటి అల్లుణ్ణి వదులుకుంటారా…. ఏదో కాస్త బెట్టు చేశారు..పాపం వాళ్ళదీ పెద్ద కుటుంబం – నాలుక్కాసులు ఒక్క ముద్దుకి చెల్లురా అంటే నువ్వూ విన్నావు కాదు… చివరకి మన నరసింహం సానుకూలం చేశాడు…” అని తెగ సంబరపడిపోతూ చెప్పింది.


నాన్న, అమ్మ దిగిరాకుండా మాట నెగ్గించుకున్నందుకు విజయగర్వంతో వున్నారు. ఎవరినీ నొప్పించకుడా కోరిన పిల్ల దొరికినందుకు “థాంక్ గాడ్” అనుకున్నాను. అది మా దొరివారి ఊతపదం.


కలతలూ కలహాలూ లేకుండా పెళ్ళి అయిపోయింది. ఒళ్లంతా కళ్ళు చేసుకుని బామ్మ మా పెళ్లి చూసి ఆనందించింది. “ఒరేయ్ ఎప్పుడో నీ చిన్నప్పుడు స్వాములారి పల్లకి ఎక్కించమని హటం చేశావ్ జ్ఞాపకం వుందీ? ఇహ ఊరేగు బతుకంతా సుఖంగా అందరి కళ్ళూ మీ మీదే వుండేట్టు ఊరేగండి” అని బామ్మ మా జంటని దీవించింది.

అక్కర తీరింది.


మర్నాడు “నామనవడు నచ్చాడా పిల్లా” అని బామ్మ కొంటెగా అడిగితే – ఔను కాదు అనకుండా, “మీ మనవడు నాకిప్పుడు మూడొందల అరవై కాసులు బాకీ -ఎట్లా తీరుస్తాడో ఏమో…” అందట బుంగమూతి పెట్టి – పెళ్ళికూతురు.

ఆ మాటకి అదిరిపడి “హారి పిడుగా” అని బామ్మ గాయత్రిని ముద్దుపెట్టుకుంది.


బందరులో కాపరం పెట్టాం – బామ్మ మాటలో చెప్పాలంటే ముగ్గులోకి దిగాం. ఒంటి గది – కొత్త కాపరం – బామ్మ దీవెనలా పూసల పల్లకిలో ఊరేగుతున్నట్టుంది.

ఆవిడ కాళ్ల గోరింటాకు అతడి కాళ్ళకి ఎట్లా పండుతుందో అనుభవమైంది, నేను తాంబూలం నమిల్తే గాయత్రి నోరు ఎందుకెరుపెక్కునో ఎరుకైంది. 


బామ్మని బందరు వచ్చి నా దగ్గర వుండమన్నాను.

“నా వూరు, నా నేల… ఇక్కడే మట్టయిపోవాలిరా… మీ అమ్మ దొడ్డ ఇల్లాలు… నాకేం తక్కువ జరగదులే-” అది దర్జాగా.


బామ్మ చివరి క్షణాల్లో చూడ్డానికి వెళ్లాం. మాట స్పష్టత లేదు. “కొత్త కాపరం బావుందా” అని అడిగింది. ఇద్దరం తల వూపాం. “కాపరం, కత్తిపీట కొత్తల్లో కంటే కొంచెం పదును పడ్డాకే బావుంటాయిరా…” అంది మాట పెగుల్చుకుని – మేం నవ్వితే బామ్మ పెదవి కదిలింది. ముఖం వెలిగింది . మా ఇద్దరి చేతులూ చేతిలోకి తీసుకుంది- “ఒక మొక్కకి చెంబెడు నీళ్ళు… గింజలు.. అన్నం పెట్టా… ఆ ఫలం నాకు దక్కింది. నా బతుకు హాయిగా వెళ్ళిపోయింది… నేను ఇపుడో… కాసేపో…” – బామ్మ మాటలకి నాకు దుఃఖం పొర్లుకొచ్చింది.


“నిన్ను వదలి ఎక్కడికి పోతావ్రా వెర్రి నాగన్నా… అలా వెళ్ళి కాసేపు పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా…” అంటూ ధైర్యం చెప్పి బామ్మ వెళ్ళిపోయింది.


భరించలేనంత శూన్యం నాలో నిండుకుంది. అమ్మ నాన్న చుట్టం పక్కం దయ దేవుడూ అన్నీ, అంతా, అందరూ ఒక్కసారి వదలి వెళ్ళిపోయి నట్టయింది.


వెళ్ళి పిచ్చిగా బాదంచెట్టు చుట్టూ తిరిగాను. డెబ్బై ఏళ్ళ ఆ పిచ్చి మొద్దుకి బామ్మ పోయిందని తెలియదు. రేపట్నించి చెంబెడు నీళ్ళెవరు పోస్తారు? పై తొర్రలో కిలకిలలాడే చిలకలకి తెలియదు బామ్మ పోయిందని – రేపట్నించి గుప్పెడు గింజలు ఎవరు జల్లుతారు? చిన్నప్పుడు మేము చిరుతిళ్ళు దాచుకున్న తొర్రలో చెయ్యి పెట్టి వెదికాను. దాన్నిండా బాదంకాయలు దాచి వున్నాయి. రేపట్నించి రాలిన బాదం కాయలు ఎవరు ఏరతారు?


బాదం చెట్టుని చుట్టుకున్న బామ్మ జ్ఞాపకాలు ఎన్నేళ్ళయినా మర్చి పోలేను. ఆ చెట్టు నీడలో నా చిన్నతనం చెక్కుచెదరకుండా వుంది.

కర్మ కాండ ముగిసింది. 


బామ్మ ఆరోప్రాణంగా చూసుకున్న బంగారు మురుగు తూకానికి పెడితే అది గిల్టు నగ అని తేలింది. 


అమ్మ, నాన్న, అత్తయ్య అంతా మొహమొహాలు చూసుకున్నారు.


మనవడికి మంచి పెళ్ళాం రావాలని బంగారు మురుగు కరిగించిందని వాళ్ళకి తెలియదు. పెళ్ళి పెద్దగా కథ నడిపిన నరసింహంపంతులుగారు చెప్పేదాకా నాకూ తెలియదు

బామ్మ మా ఇంటికి వస్తుంది – అన్న మాట ప్రకారం ఆవిడ బంగారు మురుగు ఆవిడకే… గాయత్రి సాక్షిగా!


(ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక -24-09-93)

ఆహ్లాదకరమైన ఆలోచనలు

 🙏🌺🧡 శ్రీ మాత్రే నమః శుభోదయం🧡🌺🙏.         ❣️ఆహ్లాదకరమైన ఆలోచనలు❣️ స్ఫూర్తినిచ్చే ప్రేరణలు❣️ మాంచి సంగీతం❣️ చక్కని పుస్తకాలు❣️ మాంచి స్నేహితులు❣️ మాంచి కృషి❣️అవన్నీ మనల్ని సంతోషంగా❣️ ఉంచుతాయి అని గమనించండి❣️ ఉన్నవాటిని కాపాడుకుంటూ❣️ కొత్తవాటిని సమీకరించుకొండి❣️ ఇతరులు నీగురించి ❣️ఏ మాట్లాడుకుంటున్నారు❣️ ఏ ఆలోచిస్తున్నారని❣️ విచారించాల్సిన అవసరం లేదు❣️ ఎందుకంటే జీవితం చాలా చిన్నది❣️ ప్రతీ క్షణాన్ని ఆస్వాదించండి❣️ ఆనందంగా ఉండండి❣️ ఉన్నదానితో సరిపెట్టుకుంటే❣️ ప్రతీ చోటు స్వర్గమే❣️ లేనిదాని కోసం ఆరాటపడుతు❣️ వేసే ప్రతి అడుగు నరకమే❣️❣️❣️❣️ మీ అల్లంరాజు భాస్కర రావు

శ్రీ విజయ  ఆయుర్వేదిక్ 

 గోకవరం బస్ స్టాండ్

Rajhamundry

9440893593

🙏🙏🙏🙏🙏

శాస్త్రవేత్తలకే_అంతుచిక్కని_సైన్స్_మహాభారతంలో

 శాస్త్రవేత్తలకే_అంతుచిక్కని_సైన్స్_మహాభారతంలో


 ఏంటో_చూద్దాం_పదండి


●మహాభారతం వ్యాసుడు రచించి 5,000 సంవత్సరాలు అవుతుంది. అని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.


మరి రామాయణం అంతకు పూర్వం కొన్ని వేళ సంవత్సరాల క్రితం జరిగింది కద, దాన్ని లెక్క కట్టలేదే, 


5 వేల సంవత్సరాలకు పూర్వం ప్రపంచంలో ఎక్కడ అ ఏ భాష లేదు, ఏ లిపి లేదు, అలాంటి సమయంలో ఇప్పటికీ సాధ్యం కానీ ఈ విధంగా గ్రంధాన్ని రచించడం గొప్ప విషయం.


●మహాభారతం మించిన ఇతిహాసం, అంత సాహిత్యం ఇంకోటి రాలేదు, ఇంతటి 5000 సంవత్సరాల తర్వాత కూడా అంత గొప్ప సాహిత్యం, లేదు రాదు.


● భారతం అప్పటి గొప్ప చరిత్రను తెలియజేస్తుంది, ఇప్పటికీ అందని *సైన్స్ 

కనుక్కోలేని విషయాలను ఎన్నో మనకు మహాభారతం తెలియజేస్తుంది.


మహాభారతం పైన ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి, మహాభారతం నిజంగా జరిగిందా? లేదా ఊహా?


●చాలామంది మహాభారతం ఒక కల్పన అని అనేస్తూ ఉంటారు.


అలా అనడం కాదు దానికి ఆధారాలు కూడా చూపించాలి, మనకు తెలియని వాటిని ఊహలు అని ఎలా అనగలం.


● మన దౌర్బాగ్యం ఏంటంటే మనవారు చేయకపోయినా, విదేశీయులు పరిశోధన చేసి మనకు తెలియ చేశారు.


అవేంటో_చూద్దాం_పదండి


●మహాభారతంలోని ఆదిపర్వం లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.


●ముఖ్యంగా ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టుక వ్యాసుడు నియోగ ధర్మం ద్వారా అంబా, అంబాలిక లకు కనడం. దాసికి విదురుడు జన్మించడం.


●ఇందులో ఏం విచిత్రం ఉంది అంటున్నారా?*


●ఇక్కడ ముగ్గురికి పుత్రుల జన్మించడం జరిగింది మరి దీన్ని వ్యాసుడు ఎలా నిర్ణయం చేశాడు.

1974లో  అయోవ యూనివర్సిటీలో డోనాల్డ్ లాకె అనే ఇద్దరూ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు, స్త్రీ పురుష సంభోగ సమయంలో వారి మానసిక స్థితి లే బిడ్డ లింగాన్ని నిర్ణయిస్తాయి, అని ప్రపంచానికి తెలియజేశారు.


నేడు_మనం_వాడే_స్పెర్మ్_డొనేషన్_ఆనాటి_నియోగపద్ధతి_ఒకటే.

ఈ ఆ పిండం కింద పడింది.


●వ్యాసుడు వచ్చి ఆ పిండాన్ని 101 కుండల్లో ఆవు నెయ్యి నింపి, ఒక పద్ధతి ద్వారా దాచి ఉంచాడు, గాంధారిని ప్రతిరోజు వాటిని తాకమని చెప్పేవాడు, మాతృ తల్లి ప్రేమ స్పర్శ ద్వారా ఆ కుండలలోని పిండాలు బయట కూడా పెరిగాయి.


●వీటిని నేటి ఆధునిక  వైద్యులు మూడు రకాలుగా విభజించారు.


 పిండాలను_ముక్కలు_చేయడం_మెడికల్_భాషలో_1_స్లైసింగ్_ఎంబ్రియో


2_ఆర్టిఫిషియల్_యూటర్నెస్_కృతిమ_గర్భాన్ని_పోలిన_వాతావరణాన్ని_నిర్మాణం_చేయడం. 


3_మదర్_టచ్


●టెస్ట్ ట్యూబ్ బేబీ లు వశిష్ఠుడు, అగస్త్యుడు. ద్రోణాచార్యుడు , క్రుతుడు, కృపి. స్త్రీ బీజం నుంచి అండ కణాన్ని  సేకరించి , గర్భాశయం బయట చుట్టూ పోషకాల నుంచి వీర్యకణాలను వదలడం అనేది 5 వేల సంవత్సరాల క్రితమే తెలుసు అంటే ఆశ్చర్యమే కదా!


●ద్రోణుడిని కుంభసంభవుడు అని అంటారు అంటే ప్రత్యేకమైన కుండ లో పుట్టిన వాడు అని అర్థం.


శిఖండి_పాత్ర

౼౼౼౼౼౼౼౼

Transgender  Trans Sexual లింగ మార్పిడి

మహాభారతం కాలం నాటికే ఇది ఉంది .భీష్ముడిని చంపేందుకు అంబా శిఖండి గా మారింది. మొదటి అడ పిల్లగా పుట్టి మగవాడి లక్షణాలు గల పాత్ర శిఖండి. ఇప్పుడూ మనం చెప్పుకునే Transsexualism ఇపుడు Surgery లు చేసుకోవడం కూడా చూస్తున్నాం. ఒక యక్షుడు ఆమెకు సైకియాట్రిక్ Treatment చేయటం జరిగింది. అడ పిల్లగా పుట్టి పూర్తిగా మగ వాడిలా మారడం.


బృహన్నల_పాత్ర

౼౼౼౼౼౼౼౼౼౼

Temporary Trans-Sexualisum ఇప్పటి మోడర్న్ సైన్స్ లో Hermaphroditism

అంటారు. కొంతకాలం స్త్రీగా ఉండి పురుషుడు గా మారే ప్రక్రియ ఇది ఉర్వశి శాపం వలన అర్జునుడు అజ్ఞాతవాసంలో  శాపం ఆయనకు అదే మేలు చేసింది.


ఇద్దరు తల్లుల గర్భంలో కొన్నాళ్ళు పెరిగిన బలరాముడు

యోగ మాయ ద్వారా రోహిణి గర్భం లోకి మార్పు  ఎంబ్రీయో

ఇదీ చూసి ఎలా పుడతారు అండి మహాభారతం ట్రాష్ అని వెటకారంగా మాట్లాడుతారు


Effortless Reciprocal IVF అని ఈ మధ్య ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది మీరు గానీ 3 నవంబర్ 2018 ఈనాడు పేపర్ తీసి అందులో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే అమెరికాలో ఇద్దరు యువతులు ప్రేమించి వివాహం చేసుకున్నారు. కదా! 

యువతులు నిజమే  వాళ్ళిద్దరికీ పిల్లవాడిని అనాలనిపించింది కానీ ఇద్దరు యువతులు కదా ఎలా కంటారు ప్రకృతి ఒప్పుకోదు కదా! 


Bedford Hospital In Texas వాళ్ళు చేశారు.

IVF ద్వారా ఎంబ్రియో కొన్నాళ్లు ఒక తల్లి గర్భంలో మరికొన్నాళ్లు ఇంకో తల్లి గర్భంలో పెరిగిన బిడ్డనుకన్నారు.


జరాసంధుడు_పాత్ర

౼౼౼౼౼౼౼౼౼౼౼౼

జర అనే రాక్షసి చేత సంధి చేయబడ్డాడు కాబట్టి జరాసంధుడు అయ్యాడు.


ఈమధ్య మోడన్ మెడిసిన్ లో Replantation Surgery యాక్సిడెంట్లు జరిగినప్పుడు వారి శరీరంలోని ఏదైనా ఒక భాగం తెగిపోతే దాన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి సర్జరీ చేస్తే ఆ తెగిపోయిన భాగాన్ని శరీరానికి అతికించవచ్చు దాన్ని  మళ్ళీ యదావిధిగా చేయవచ్చు.


1962 లో బోస్టన్ లో తెగిన చెయ్యిని అతికించారు, Award కూడా పొందాడు.


అర్జునుడు_సమ్మోహన_శక్తి

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

ఉత్తర కుమారుడి తో పాటు కౌరవుల మీద యుద్దం చేసే సమయం.

 

1770 లో Mesumer ద్వార వచ్చినా Mesumerisum BV పట్టాభిరామ్, ఆంధ్రప్రదేశ్, PC సర్కార్.


మహాభారత యుద్దం సమయం అస్త్రా శాస్త్రాలూ

బ్రహ్మాస్త్రం,  నారాయస్త్రం, పాశుపతాస్త్రం etc


06-Aug-1945 హీరోషిమా నాగసాకి అణు విస్ఫోటనం


●Physics సూత్రాలు 

నాసతో విద్యతే బహో నా భావవన్ విద్యతే సతః అంటే ఉన్నదాన్ని పూర్తిగా నాశనం చేయలేము, లేని దాని నుంచి పుట్టించలేం.


●పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి పదార్


●ఓపెన్ హైమర్ అణుబాంబు గురించి అడిగితే గీతా లో దివి సూర్య సహస్రశ్చ అనే శ్లోకాన్ని విదేశీయుడు వివరించాడు.

ఆటంబాంబ్ విస్ఫోటనం తో సమానం శ్రీ కృష్ణుని విశ్వరూప సందర్శనం అంధుడైన  ధృతరాష్ట్రుడు ఈ విశ్వరూపన్ని చూసినట్టు మహాభారతం చెబుతోంది. అంటే అందులకు కూడా కంపించెంత శక్తి అదీ. మహాభారతంలో 


భారతీయులు ఇలాంటివి ఎన్నో చేసి చూపారు ఆధునికకాలంలో నేను చేశాను అని చెప్పడం జరిగింది.


AA Garbosky Scientists హర్యానా లోని  అస్తిపంజరాలు సేకరించి వాటిలో *రేడియో యాక్టివిటీ* ఎంత ఉందో పరిశోధన చేశాడు

ఆశ్చర్యంపోయి ఇలా అన్నాడు. 

మహాభారతంలో ఇప్పుడు మనం వాడే అన్నిటికంటే గొప్ప ఆయుధాలను వాడారు కానీ వాటిని అయోగ్యులకు తెలియకూడదు అని గుప్తంగా ఉంచారు అని చెప్పారు.


●మాక్రో, మైక్రో  వైజేశన్ శరీరం పెరగటం వరల్డ్ ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రచయిత ఆసిమ్మం కూడా వివరించారు, స్థూల పెద్ద, సూక్ష్మ చిన్న రూపం.


ఎందరో విదేశీయులు మహాభారతంలోని గుర్తించిన విషయాలను మనం గుర్తించలేకపోయారు. మన ఊహకు కూడా అందనంత సైన్స్ టెక్నాలజీ మన గ్రంథాల్లో ఉంది.


ఇలాంటి విషయాలను తెలుసుకోలేని మూర్ఖులు అసలు మహాభారతంలో, పురాణాల్లో ఏముందండి అంతా ట్రాష్, పుక్కిటి పురాణాల్లో అని చెప్తారు ఇప్పుడు అలాంటి వారే పాశ్చాత్యులు చెప్తే నోర్లు వెళ్ళబెట్టి చూస్తారు.


మన దౌర్భాగ్యం ఏంటంటే మన పురాణ ఇతిహాసాల పైన పాశ్చాత్యులు పరిశోధనలు చేసి వాటిని మేమే నూతనంగా కడుక్కున్నాము అంటే వాటిని నమ్మి మనం కూడా వారికి జైజైలు కొడుతున్నాము.


ఇప్పటికైనా నా ఆలోచిద్దాం భావితరాలకు మన పురాణ ఇతిహాసాల లోని గొప్పదనాన్ని వివరింద్దాము.


జై_హింద్

కృష్ణం_వందే_జగద్గురుమ్