22, సెప్టెంబర్ 2020, మంగళవారం

కథ

 *👉"గురువుగారు….దేవుడ్ని అనేక మంది అనేక కోరికలు కోరుకుంటారు కదా.. అవన్నీ దేవుడు తీరుస్తాడంటారా?"*


*"అందరూ కోరుకునేవి తీరుస్తాడో లేదో తెలీదు కానీ ఒక కథ చెప్తా విను"* 


ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి

ప్రసన్నంగా నవ్వుతూ *"తథాస్తు"* అన్నాడు. 


శిష్యుడు గురువు గారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు. 


*" ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షం తో చెప్తుంటే నాకు వినబడి తథాస్తు అన్నాను."*


*"ఏమిటా కోరిక గురువు గారూ"*


*"తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని."*


*"వచ్చే జన్మలోనా"*


*"కాదు ఈ జన్మలోనే"*


శిష్యుడు పగలబడి నవ్వాడు, *"గురువు గారూ ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ.. అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "*


*" అర్హతకేం నాయనా.. జీవితమంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవ రాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా"*


*" అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది"*


*" ఏమో.. భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు."*


ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. 


శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.


సంవత్సరం తరువాత. 


శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ.. ఈ వింత

విన్నారా….శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!!!" 


గురువు గారు నవ్వి, "చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. అయింది కదా.." 


"అంటే.." 


అవున్నాయనా… ఆ మహా వృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు.. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో

ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహా వృక్షం పాదరక్షలు గా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. 


శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, 

భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం జరిగాయి.

ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది." అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం 

చేశాడు శిష్యుడు. 


భగవంతుడి లీలలు మనకి అర్ధం కావు.

🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: