3, ఆగస్టు 2020, సోమవారం

రామాయణమ్.19

అంశుమంతుడు తన పినతండ్రులు వెడలిన దారిలో ప్రయాణంచేసి వారు భస్మరాశిగా మారిన చోటికి వెళ్లగా అక్కడ ఆతనికి బూడిదకుప్పలు,ఒక చోట మేయుచున్న అశ్వము కనిపించాయి.
.
తన పిన తండ్రులకు జల తర్పణములివ్వవలెనని చుట్టూ కలియచూశాడు ఎక్కడా చుక్క నీరుకూడా కనపడలేదు.
.
అప్పుడు అంశుమంతునకు ఆతని పిన తండ్రుల మేనమామ గరుత్మంతుడు కనపడి వీరికి మామూలు నీటితో తర్పణము విడువరాదు పావనగంగోదకము తో ఇచ్చిన తర్పణము మాత్రమే వీరికి పుణ్యలోకాలు కలుగచేస్తుంది .
.
ప్రస్తుతమునకు నీవు ఈ గుర్రము తీసుకొని వెళ్ళి యాగమును పూర్తిచేయించుము అని తెలిపినాడు అప్పుడు అంశుమంతుడు యాగాశ్వాన్ని తీసుకొని తన పట్టణము చేరుకొన్నాడు.
.
అంశుమంతుని ద్వారా సగరచక్రవర్తి ఈ వార్తను విన్నవాడై తీవ్రమైన వేదనతో దుఃఖిస్తూ గంగను భువికి తెచ్చే ఉపాయము కానరాక మిన్నకుండినాడు.
.
కొంతకాలానికి అంశుమంతుడు రాజైనాడు.ఆయనకు దిలీపుడు అనే కొడుకు కలిగాడు.
.
దిలీపుడు కూడా గంగను తెచ్చే మార్గము కనుగొనలేకపోయాడు.
.
ఆ దిలీప మహారాజుకు పరమ ధార్మికుడైన భగీరధుడు పుత్రుడుగా జన్మించాడు.
.
భగీరధుడి మనస్సులో తన పూర్వీకుల అధోగతి గురించి తీవ్రంగా మధనపడుతూ ఉండేవాడు,
.
ఒకరోజు ఆయన తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి గోకర్ణక్షేత్రానికి వెళ్లిపోయాడు .
అక్కడ ఆయన తన చేతులు పైకెత్తి ,నెలకొక్కసారి మాత్రమే భోజనం చేస్తూ వేలసంవత్సరాలు తపస్సుచేసాడు..
.
ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై గంగ భూమికి వచ్చునట్లుగా అనుమతించి ,ఇక్ష్వాకు వంశానికి సంతానలోటు లేకుండా వరమిచ్చి అంతర్ధాన మయ్యాడు.
.
ఇక్కడే ఒక చిక్కు వచ్చిపడ్డది భగీరధుడికి !
.
తీవ్రమైన వేగంతో గంగ భూమిమీద దూకినప్పుడు ఆమెను భరించే సమర్ధత ఒక్క పరమశివుడికే మాత్రమే ఉన్నది .
.
వేరే దారిలేక మరల శివానుగ్రహంకోసం ఒక సంవత్సరకాలం కేవలం బొటనవేలును ఆసరాగా చేసుకొని నిలబడి ఘోరతపస్సుచేశాడు..
.
పరమశివుడు ప్రత్యక్షమై ఆతని అనుగ్రహించాడు.
.
గంగను ఆకాశం నుండి దిగమని ప్రార్ధించాడు భగీరధుడు! 
.
అహంకారంతో శివుడు ఎట్లా తట్టుకుంటాడో చూద్దామని ఒక్క ఉదుటున అతివేగంగా భూపతనం చెందింది గంగ. మహాశివుడిని తోసుకుంటూ పాతాళానికి వెళ్ళాలని గంగ ఆలోచన.
శివుడు అదిగ్రహించి తన జటాజూటంలో గంగను బందీ చేశాడు.
.
అక్కడనుండి బయటపడే దారిలేక విలవిల లాడింది గంగ.
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: