23, అక్టోబర్ 2022, ఆదివారం

గోళీసోడా తాగు

 

గోళీసోడా తాగు
తిరునల్వేలికి చందిన శివం పరమాచార్య స్వామివారి భక్తుడు. స్వామివారి దర్శనార్థమై అప్పుడప్పుడు కాంచీపురం వస్తుంటాడు. ఎప్పుడు దర్శనానికి వచ్చినా, స్వామివారి దగ్గరకు వెళ్ళడం కాని, వారితో మాట్లాడడం కాని చేసేవాడు కాదు. కేవలం స్వామివారి ముందు కూర్చుని వారిని చూస్తూ సంతోషపడేవాడు. ఒక్కోసారి అలా కొన్నిరోజులపాటు చేసేవాడు. ఈ శివన్ చాలా సాత్వికుడు. ఆహారపు అల్వాట్లు కూడా చాలా సాత్వికమైనవే. ఎప్పుడూ నుదుటన విభూతి పెట్టుకునేవాడు. అతని ఆహార్యము, పనులు చూడగానే చాలా భక్తి తత్పరుడు అని ఎవరికైనా తెలుస్తుంది.
ఒకసారి దర్శనం తరువాత సెలవు పుచ్చుకోవడానికి స్వామివద్దకు వెళ్ళాడు. సమాన్యంగా స్వామివారు వెళ్ళమన్నట్టు చేతితో సంజ్ఞ చేసేవారు. కాని ఆరోజు శివంతో స్వామివారు, “బయలుదేరుతున్నవా? సరే కనీసం వెళ్ళే దార్లో సోడా అయినా తాగు” అని సెలవిచ్చారు.
శివం తన ఊరికి బయలుదేరాడు. చంగల్పేట్ కు వచ్చి తిరునల్వేలికి బయలుదేరాడు. అదే బస్సులో ఆకతాయిలైన ఒక నలుగురు యువకులు కూడా ఎక్కారు. చాలా అల్లరి చేస్తూ ప్రయాణీకులతో గొడవపడుతూ వారికి ఇబ్బంది కలిగిస్తూ ప్రయాణిస్తున్నారు. శివం తనపాటికి తాను ఊరికే కూర్చున్నాడు. ఆ తిరునల్వేలికి వెళ్ళే బస్సు మధురై దరిదాపుల్లో ఉండగా, ఒక చిన్న గ్రామంలో ఆపారు. శివం బస్సులో నుండి బయటికి చూడగా, ఒకచిన్న అంగడిలో గోళీసోడా వరుసగా పేర్చబడి ఉంది. పరమాచార్య స్వామివారు మాటలు గుర్తుకురావడంతో, అతడికి కూడా కొద్దిగా దాహంగా అనిపించడంతో బస్సుదిగి వెళ్ళి సోడా తాగడానికి అంగడి దగ్గరకు వెళ్ళాడు.
సోడాతాగి బస్సు ఎక్కి తన సీటువద్దకు రాగానే అక్కడ ఉండాల్సిన తన సంచీ కనబడలేదు. అతని సంబంధించిన వస్తువులు, డబ్బు మొదలైనవి అందులోనే ఉంచుతాడు. ఆ గాభరాలో ఉండాగా ఆ నలుగురు యువకులు అమర్యాదగా అతడిపై అరుస్తూ, “నీ సంచీ వెనుకనున్న సీట్లలో పడేసాము. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. మాకు ఈ సీటు కావాలి” అని నిర్లక్ష్యంగా చెప్పారు.
శివం తన సంచీ ఉన్న సీటు దగ్గరికి వెళ్ళి కూర్చుని ప్రయాణం కొనసాగించాడు. సరిగ్గా గంట ప్రయాణం తరువాత అతను పర్యాణిస్తున్న ఆ బస్సుకు పెద్ద ప్రమాదం జరిగింది. అతను ఇంతకు ముందు కూర్చున్న సీట్లో కూర్చున్న ఇద్దరు కుర్రవాళ్ళు మృత్యువాత పడ్డారు.
శివం ఆ సంఘటనను చూసి మ్రాన్పడిపోయాడు. ఎప్పుడూ లేనిది పరమాచార్య స్వామివారు సోడా తాగమని ఎందుకు చెప్పారో, ఆ బస్సు అక్కడ ఎందుకు ఆగిందో, అతను ఆ అంగడిలోని సోడాను ఎందుకు చూసాడో, దాహార్తిగా అనిపించి బస్సు దిగి సోడా ఎందుకు తాగాడో అన్నీ అతనికి అర్థమై కళ్ళముందు మెదలసాగాయి.
పరమాచార్య స్వామివారి కారుణ్యం అంత గొప్పది.

కామెంట్‌లు లేవు: