5, జూన్ 2023, సోమవారం

శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం

 🕉  మన గుడి : 🕉️





🔆 కృష్ణా జిల్లా : " మాచవరం"


👉 శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం 



💠 విజయవాడలోనే కాక రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు అమితంగా కొలిచే దేవాలయాల్లో మాచవరంలోని దాసాంజనేయ స్వామి ఆలయం ప్రముఖంగా పేర్కొనవచ్చు. 


💠 700 ఏళ్ళ చరిత్ర కలిగిన గొప్ప దేవాలయం .

విజయ నగర సామ్రాజ్యాన్ని పాలించిన సాలువ ,తులువ వంశ రాజులకు పూజనీయ, గురు స్థానంలో ఉన్న వ్యాస రాయలవారు (వ్యాస తీర్ధులు )ప్రతిష్ట చేసి,నిర్మించిన ప్రసిద్ధ దేవాలయం.


💠 పూర్వం వ్యాసరాయలనే హనుమద్భక్తుడు పాదచారిగా పర్యటిస్తూ తాను బసచేసిన ఊళ్ళలో హనుమంతుని విగ్రహాలను ప్రతిష్టించే వాడని, ఆ పర్యటనలో విజయవాడ చేరుకొని ఆంజనేయ స్వామి ప్రేరణపై ప్రస్తుతం వున్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతానికి వచ్చి అక్కడ శంఖు - చక్రాదులతో తనకి లభించిన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించి శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు.



💠 క్రీ.శ. 1509 లో వ్యాస తీర్ధ మహాశయులు పాద చారియై దేశాటనం సాగిస్తూ భగవద్ భక్తీని ప్రబోధించారు .ఆ యాత్రలో విజయవాడ వేంచేసి ఇంద్ర కీలాద్రి వేంచేసి ఉన్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మ వారిని దర్శించారు .

అప్పుడు ఒక వింత సంఘటన జరిగింది  అంటారు.. 

ఆంజనేయస్వామి  ఒక వానర వేషంలో తీర్ధుల వద్దకు వచ్చి ,సౌజ్నలతో తన వెంట రమ్మని కోరింది .

అలా ఆ వానరం కొండలు గుట్టలు దాటించి ఇప్పుడున్న మాచవరం వద్దకు తీసుకు వెళ్ళింది .అప్పుడు వానర రూపం లోని ఆంజనేయస్వామి తీర్ధుల వారిని శంఖ చక్రాలతో ఉన్న తన విగ్ర హాన్ని ప్రతిష్టించి ,ఆలయ నిర్మాణం చేయమని కోరారు .

వ్యాస తీర్ధుల వారు స్వామి ఆనతిచ్చినట్లే విగ్రహ ప్రతిష్టచేసి దేవాలయ నిర్మాణం పూర్తి చేశారు .



💠 విజయ నగర సామ్రాజ్య పతనం తర్వాత ఈ అలయం ముస్లిముల పాలనలో ధ్వంసం అయ్యింది.

తదననంతరం సుమారు 150సంవత్స రాల క్రితం శ్రీ దున్న వీరాస్వామి అనే కాంట్రాక్టర్ విజయవాడ –ఏలూరురోడ్డు మార్గాన్ని నిర్మిస్తుండగా ఒక రోజు శ్రీ ఆంజనేయస్వామి వారు ఆయన స్వప్నంలో సాక్షాత్కరించి తన విగ్రహం ఉన్న చోటు ను చూపించి ,అక్కడ త్రవ్వి విగ్రహాన్ని బయటకు తీసి గుడి కట్టించమని ఆదేశించారు .


💠 వీరయ్య గారు అత్యంత భక్తీ శ్రద్ధలతో ఆ ప్రదేశానికి కూలీలను తీసుకొని వెళ్ళి త్రవ్వించారు .అక్కడ భూమిలో గంధ సింధూరం తో పూర్తి గా అలంకరింప బడ్డ శ్రీ మారుతి స్వామి విగ్రహం కనిపించింది .

ఆయన ఆ విగ్రహాన్ని బయటికి తీయించి ,ఇప్పుడు దేవాలయం ఉన్న చోట ఒక రావి చెట్టు కింద పాక వేసి అందులో స్వామిని ప్రతిష్టించి పూజాదికాలు నిర్వహించి భక్తులకు స్వామి దర్శనానికి వీలు కల్పించారు 


💠 అదే నేడు అత్యంత వైభవం గా విలసిల్లుతున్న మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం.


💠 శ్రీ దాస ఆంజనేయస్వామి విగ్రహం మూడు అడుగుల పొడవు ఉండి శ్రీ రాముడి ముందు మోకాళ్లపై కూర్చుని అతని రెండు చేతులు అంజలి గటించి  స్వామికి నమస్కరించినట్లు ఉంటుంది. 

ఇక్కడ ప్రతిరోజు అనేక మంది తాము కొత్తగా కొన్న వాహనాలకు పూజలు చేయిస్తారు 



💠 శ్రీ దాస ఆంజనేయుడు ఇక్కడ శ్రీరాముని ముందు మోకాళ్లపై కూర్చున్న దాసు (విద్యార్థిగా) కనిపిస్తాడు. 

అతని రెండు చేతులు అరచేతులతో ముడుచుకున్న అంజలిలో అతని ప్రభువుకు ప్రణామాలు సమర్పించడం కనిపిస్తుంది. 

అతని ప్రకాశవంతమైన కుండలం పరిమాణంలో పెద్దది మరియు మిరుమిట్లు గొలిపేది.


💠 ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని విద్యా, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్నింటా కూడా విజయం చేకూరుతుందని భక్తుల నమ్మకం. 

నగరంలో ఏ చోట కొత్త వాహనాలు కొనుగోలు చేసినా ఈ ఆలయం వద్ద వాహన పూజను జరిపించటం కూడా ఆనవాయితీగా వుంది. 



💠 హనుమత్ జయంతి ఈ ఆలయంలో జరుపుకునే ప్రదాన పండుగ. 

ఆకు (తమలపాకు) పూజను ఎంతో గౌరవప్రదంగా నిర్వహిస్తారు.



💠 ఆలయం దర్శనం ఉదయం 6:00 గంటలు నుండి రాత్రి 9:30 గంటలు వరకు


     

💠 మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయం విజయవాడ పండిట్ నెహ్రు బస్‌స్టేషన్ నుండి 3 కి.మీ దూరంలో ఏలూరు రోడ్డులో ఉంది .

కామెంట్‌లు లేవు: