10, ఆగస్టు 2023, గురువారం

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-14🌹

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-14🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *శ్రీహరి శ్వేతవరా7హ రూపము ధరించిన వృత్తాంతము* 


పూర్వకాలమందు ఒకానొకనాడు సనకసనందనాదులు వైకుంఠానికి బయలుదేరారు. శ్రీమహావిష్ణువు యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనమునకై వారు వెడలసాగిరి. సనకసనందనాదులు మహాభక్తులు నిరంతరము విష్ణుకధా శ్రవణాసక్తులు భగవత్ దైవానురాగాను రక్తులు.


ఆ మునులు బాలుర వేషములో వెడలినారు. ద్వారపాలకులు వారు లోనికి వెడలుటకు అభ్యంతరము తెలిపిరి. వారు ‘‘మేము చాలా ముఖ్యులము, లోనికి వెడలి తీరవలసినదే’’ అనిరి.


 ‘‘ససేమిరా లోపలికి వెడలుటకు వీలు లేనేలేదన్నారు.’’ ఆ యిరువు ద్వారపాలకులూను.


మునులు కోపము శాపమునకు దారి తీయును గదా! వారిద్దరూ ద్వారపాలులవైపు తీవ్రముగా చూచి మీకింత కండ కావరమా! మమ్ములను శ్రీమహావిష్ణువును దర్శించకుండ చేతురా? చూచుకొనుడు మా శక్తి! మీరిద్దరూ రాక్షసులై పోయెదురుగాక అని శాపమిచ్చినారు. ద్వారపాలకులు కంపించినారు.


 ఇదేమి శాపమని విలపించి తమ్ము క్షమించవలసినది వారిని కోరారు.


అంతట మునులు కొంత అనుగ్రహించి మూడు జన్మలందు మీరు రాక్షసులుగ నుండి శ్రీమహావిష్ణువునకు శత్రవులుగ వ్యవహరించిన పిదప మరల మీ పూర్వస్థానములను పొంది శ్రీమహావిష్ణువును కొలువగలరు అనగా ఆ ద్వారపాలక భక్తులు అందుకు అంగీకరించిరి. 


తరువాత వారు తొలిజన్మగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించిరి.


హిరణ్యాక్షుడు పరమ దుర్మార్గుడు. అడ్డూ అదుపూ లేక అతడు చెడు పనులు చేసేవాడు, ఒకసారి భూమండలము యావత్తు చాపగా చుట్టేసి దానిని రసాతల లోకానికి తీసుకునిపోయి దాచేశాడు. దేవతలు ఈ విపత్తును చూచి వెంటనే శ్రీమహావిష్ణువు వద్దకు వెడలి ప్రార్థించారు. 


అభయమిచ్చాడు నారాయణుడు, తాను శ్వేతవరాహ రూపము ధరించాడు. హిరణ్యాక్షుని సంహరించాడు. బ్రహ్మ మున్నగువారు శ్వేత వరాహమును మనసారా స్తుతించారు. 


భూమండలాన్ని రక్షించిన నీవు భూలోకములోనే వుండవలసినదిగా కోరుతున్నామన్నారు. శ్వేతవరాహస్వామి సరేనని తనకు నివాసస్థలముగా శేషాచలాన్ని ఎన్నుకొని అక్కడ ఉండసాగాడు. 


వరాహ స్వామికి చాలమంది భక్తులేర్పడిరి. అందులో వకుళాదేవి ముఖ్యురాలు.


*వకుళాదేవి కథ*


అది ద్వాపర యుగము. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారమును చాలించే సమయము ఆసన్నమవుతున్నది. ద్వారకావాసులా సంగతి తెలుసుకొని విచార సాగరములో మునిగిపోయారు. 


వారు శ్రీకృష్ణుని చెంతకేగి స్వామీ! నిన్ను వదలి మేము ఏ విధముగా నుండగలము? ఉండలేము అనిరి. శ్రీకృష్ణుడు ఓదార్చి కలియుగమందు మీరందరూ నన్ను ధ్యానించి నాయందు చేరుటకు అవకాశమున్నది’ అని వారిని పంపించినాడు.

యశోద కోరిక

యశోద శ్రీకృష్ణుని కంటికి రెప్పగా చూచుకొని పెంచినది. తన ప్రాణమే కృష్ణుడుగ ఆమె భావించుచుండెను. ముద్దుల శ్రీకృష్ణుని యెడల ఆమె మధురానురాగము మరి ఎవ్వరునూ చూపి యుండలేదు. శ్రీకృష్ణునకున్నూ యశోద అంటే అనుపమానమయిన ప్రేమ, శ్రీకృష్ణుడు అవతారము చాలించునున్నాడనే విషయము యశోదకి కూడా తెలిసింది. 


ఆమె శ్రీకృష్ణుని పిలచి ‘‘నాయనా! కృష్ణా! నీ వలన నాకు యెన్నో విధముల ఆనందము చేకూరినది. కానీ నాకు ఒక్కలోటు మాత్రము యింకనూ వున్నది. నీకు జరిగిన వివాహములలో ఒకదానిని కూడ చూడడం నాకు వీలుపడలేదు. నీ వివాహం చూడాలనే కోరిక నాలో వుండిపోయింది’’ అని యన్నది, 


శ్రీకృష్ణుడు ‘‘అమ్మా! నీ కోరిక కలియుగములో తీరగలదు. శ్రీవేంకటేశ్వర అవతారమును కలియుగమున దాల్చెదను.


నీవిక యీ శరీరమును వీడి వకుళ మాలికవై శేషాచలమునకు వెళ్ళి వరాహస్వామిని అర్చిస్తూవుండు అన్నాడు. ఆమె అట్లే యన్నది. ఆ యశోద శరీరమును వీడి వకుళాదేవిగా మారింది. 

శేషాచలము చెంతనుండే వరాహస్వామిని అర్చించసాగింది. యామె మనస్సు వెన్న. మహాభక్తురాలు


 *శంఖచక్రధర గోవిందా, శాoగగదాధర గోవిందా, విరజాతీరస్థ గోవిందా, విరోధిమర్ధన గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.||14||* 


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: