11, ఫిబ్రవరి 2021, గురువారం

పది నిమిషాలు

 పది నిమిషాలు గృహిణి ముందు కూర్చుంటే

జీవితం చాలా కష్టం అనిపిస్తుంది 


పది నిమిషాలు తాగుబోతు ముందు కూర్చుంటే

జీవితం చాలా సరళం అనిపిస్తుంది


పది నిమిషాలు సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే

ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది


పది నిమిషాలు నాయకుడి ముందు కూర్చుంటే 

మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది


పది నిమిషాలు జీవిత బీమా చేసే ఏజెంటు ముందు కూర్చుంటే 

చస్తేనే మంచిది అనిపిస్తుంది


పది నిమిషాలు వ్యాపారుల ముందు కూర్చుంటే 

మన సంపాదన చాలా తక్కువ, దేనికీ సరిపోదు అనిపిస్తుంది.


పది నిమిషాలు అధికారుల ముందు ముందు కూర్చుంటే 

ఈ ప్రపంచం మరీ స్లో అనిపిస్తుంది.


పది నిమిషాలు శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే 

మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది.


పది నిమిషాలు ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే 

మనం మళ్లీ విద్యార్థులం కావాలని అనిపిస్తుంది.


పది నిమిషాలు రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే 

వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది.


పది నిమిషాలు సైనికుల ముందు కూర్చుంటే 

వారి ముందు మన త్యాగం, సేవల ముందు ఏమీ లేదనిపిస్తుంది.


పది నిమిషాలు స్నేహితుని 

ముందు కూర్చుంటే 

జీవితం స్వర్గంలా ఉంటుంది.

కండు మహర్షి

 మన మహర్షులు- 17


కండు మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


కండుముని చిన్నప్పటి నుంచి గౌతమీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు.


 ఆయన ఆశ్రమం పూల చెట్లతో, మంచి మంచి రుచిగల పండ్లతో చక్కటి లతలతో ఎప్పుడూ వసంతమాసంలా ఉండేది. అక్కడ జంతువులన్నీ ఒకదానితో ఒకటి స్నేహంగా ఉండేవి.


కండు మహర్షి తపస్సు చాలా కఠినంగా ఉండేది. ఆయన వేసవికాలంలో నిప్పుల మధ్య కూర్చుని, శీతాకాలంలో చల్లటి నీళ్ళల్లో కూర్చుని తపస్సు చేశాడు. 


ఆయన తపస్సుకి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన తపస్సు గురించి విని ఇంత ధైర్యం, ఇంత నిష్ఠ, ఇంత నియమం ఎక్కడా, ఎప్పుడూ చూడలేదని మూడు లోకాల్లోనూ చెప్పుకునేవారు.


తన స్థానం ఎవరు తీసేసుకుంటారోనని ఇంద్రుడికి ఎప్పుడూ భయమే కదా! కండు మహర్షి తపస్సుకి భయపడి ప్లమోచన అనే పేరుగల అప్సరస ను వెళ్ళి కండు మహర్షి తపస్సుని భగ్నం చెయ్యమన్నాడు ఇంద్రుడు. ఆయన చెప్పినట్లు చెయ్యకపోతే శపిస్తాడని భయం కదా..! అక్కడికీ ప్లమోచన నాకన్న బాగా ఆడిపాడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్లని పంపించండి అంది. ఇంద్రుడు నువ్వే వెళ్ళు నీకు తోడుగా కామం, వసంతం

 చక్కటి చల్లగాలుల్ని పంపిస్తాను పని పూర్తిచేసుకుని రా! అని చెప్పాడు. ఇంకేం చేస్తుంది ప్లమోచన బయలుదేరి భూలోకానికి వచ్చింది ప్లమోచన ఆశ్రమంలో అడుగుపెట్టగానే వసంతం వచ్చేసింది. చెట్లన్నీ పువ్వులతో

నిండిపోయి కిందపడి నేలంతా పూలు పేర్చినట్లయ్యింది. మన్మథుడు కండు మహర్షి మీద బాణం వేశాడు. 


కండు మహర్షి కళ్ళు తెరిచి చూశాడు.

ఇంకేముంది తపస్సు మానేసి మాయలో పడిపోయాడు. కండు మహర్షి ప్లమోచనతో వందసంవత్సరాలు కలిసి ఉన్నాడు. చాలాసార్లు ప్లమోచన నేను దేవలోకం నుంచి వచ్చాను. .నన్ను పంపించెయ్యండి అని చెప్పింది. కాని కండు మహర్షి వినలేదు. కొంతకాలం పోయాక కండు మహర్షి యోగదృభష్టితో చూసి ఫ్లమోచనని నా తపస్సు నాశనం చేశావు, అయినా, నీ తప్పులేదు, నువ్వు ఇంద్రుడు పంపితే వచ్చావు కాబట్టి శపించకుండా వదిలేస్తున్నాను. వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో..అన్నాడు


కండు మహర్షి ప్రమోచనలకి కలిగిన పుత్రిక పేరు మారిష, ప్రచేతసుడు మారిషని పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి పుట్టినవాడు దక్షప్రజాపతి.


కండు మహర్షి ఇంద్రుడి మోసం తెలుసుకుని అక్కడి నుంచి పురుషోత్తమ క్షేత్రం వెళ్ళి అక్కడ మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు.


 ఇంతకుముందు కంటే కఠినమైన తపస్సు చేశాడు.


శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై కండు మహర్షిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు..


 కండు మహర్షి విష్ణుమూర్తిని అనేక విధాలుగా స్తోత్రం చేసి స్వామీ! ఈ సంసార సాగరం నుంచి తప్పించి పరమపదాన్ని చేరుకునేలా చెయ్యమని అడిగాడు.


 విష్ణుమూర్తి వరమిచ్చి అంతర్జానమయ్యాడు


కండు మహర్షికి 'కంథు మహర్షి' అని పేరు కూడా ఉంది. 


మంచి తపస్సంపన్నుడయినా మధ్యలో మాయలో పడి మళ్ళీ తన తప్పు తెలుసుకుని

 పశ్చాత్తాపంతో మహా ఉగ్రమైన తపస్సు చేసి శ్రీహరి చరణాల దగ్గరికి చేరుకుని దివ్యపదవిని

పొందాడు. 


అంటే ఏమిటన్నమాట... తెలియక తప్పు చేసినా తెలిశాక పశ్చాత్తాపపడి, అయ్యో తప్పుచేశానే అని బాధపడి, ఆ తప్పుని సరిదిద్దుకుని ఇంకెప్పుడూ తప్పులు చెయ్యకుండా అభివృద్ధిలోకి వెళ్ళడం చాలా గొప్పతనం..... 


శ్రీ రాముడు యుద్ధానంతరం అయోధ్యకు వచ్చాక ...

శ్రీ రామ దర్శనము చేసిన ఋషులలో అగస్త్య, వాల్మీకి ఋషులుతో పాటు .. ఈ కండు మహర్షి దక్షిణము నుంచి వచ్చాడని ఉత్తర రామాయణము చెబుతుంది. .


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కౌశిక మహర్షి

 మన మహర్షులు- 16


కౌశిక మహర్షి 


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


కౌశిక మహర్షి 

 వేద వేదాంగ విదుడు, ధర్మ శాస్త్రజ్ఞుడు, మహాజ్ఞాని అని పేరు పొందాడు.


 చిన్నతనంలోనే ఉపనయనం చేసుకుని ఎప్పుడూ జపం చేసుకుంటూ వుండేవాడు.


కౌశికుడు హిమవతపర్వతానికి ఒక వైపు జపం చేసుకుంటూ వుండేవాడు. ఎండ చలి అనుకోకుండా లాభనష్టాలు చూసుకోకుండా ఎప్పుడూ తపస్సులోనే గడుపుతూ ఉండేవాడు. అలా వేయి సంవత్సరాలు గడిచిపోయాయి.


విసుగు విరామం లేకుండా చేస్తున్న అతడి తపస్సుకి సావిత్రీదేవి ప్రత్యక్షమై ఏంకావాలని అడిగింది కౌశికుణ్ణి, కౌశికుడు మాట్లాడలేదు. ఎన్నిసార్లడిగా అతడు మాట్లాడలేదు. సావిత్రీదేవి కూడా కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఉండిపోయింది.


తన జపం పూర్తయ్యాక గాయత్రీమాతకి నమస్కారం చేసి స్తోత్రం చేశాడు కౌశికుడు అమ్మా! ఆదరించి నన్ను ఆశీర్వదించు అన్నాడు. నా జపనిష్ఠ పెరిగేటట్లు, నేను చేసే జపం నీకిష్టమయేటట్లు అనుగ్రహించమన్నాడు.


నాయనా! శాశ్వత బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. ధర్మదేవత యమ కాల మృత్యువులు నీ దగ్గరకి వస్తారు. నీకు శుభం జరుగుతుంది అని కౌశికుడికి చెప్పి సావిత్రీదేవి అంతర్జానమయింది


జపంలోనే నూరు దివ్య సంవత్సరాలు గడిపాడు కౌశికుడు. 


జ్ఞానసిద్ధిని పొంది

జ్ఞాన స్వరూపుడయ్యాడు.


ధర్మదేవత కౌశికుడి దగ్గరకి వచ్చి నీ జపానికి నాకెంతో సంతోషంగా వుంది. నీకు ఏ పుణ్య లోకం కావాలో కోరుకో అక్కడికి పంపిస్తానన్నాడు.


జపకర్మకు అనువుగానున్న ఈ శరీరం విడిచి నేను ఎక్కడికీ వెళ్ళనన్నాడు కౌశికుడు


ఈ శరీరం శాశ్వతం కాదు. దీని మీద మోహం విడిచిపెట్టు. పుణ్యలోకాలకి వెళ్ళు అన్నాడు ధర్మదేవత. ఇంకా ఇలా అన్నాడు. అంతా నీ యిష్టంకాదు. సమయం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోవాల్సిందే! అదిగో యమ కాల మృత్యువులు వచ్చారు చూడమన్నాడు ధర్మదేవత.


యమ కాల మృత్యువులకి ధర్మదేవతకి నమస్కారం చేసి ఎవరికి కలగని భాగ్యం

నాకు కలిగింది. మీ నలుగురి దర్శన భాగ్యం కలగడం నా అదృష్టం అన్నాడు కౌశికుడు


 అదే సమయానికి ఇక్ష్వాకు మహారాజు కౌశికుడి దగ్గరకు వచ్చి ధనధాన్యాలేమైన కావాలా? అని అడిగాడు. 


నేను నీకిచ్చే వాడ్నే కాని నీ నుంచి తీసుకునే వాడిని కాదన్నాడు కౌశికుడు.


మహారాజు మునీంద్రా! నేను క్షత్రియుణ్ణి కాబట్టి యుద్ధం తప్ప ఇంకేది ఆశించను అడగకూడదు కూడా, నువ్వు బ్రాహ్మణుడివి కనుక నీకు ఏమన్నా కావాలంటే అడగవచ్చు ఇది ధర్మం. నువ్వే అడుగు ఏంకావాలో అన్నాడు


ఇద్దరూ ఇలా వాదించుకుంటూ చివరికి కౌశికుడు తనకు జపం వల్ల వచ్చిన ఫలాన్ని రాజుకిచ్చి, రాజు యాగపుణ్యఫలాన్ని తను తీసుకున్నాడు.


యమ కాల మృత్యువులు ధర్మదేవత ఇక్ష్వాకు రాజుని, కౌశికుణ్ణి అభినందించారు


 వాళ్ళిద్దరు ఆ నలుగురికి సాష్టాంగ నమస్కారం చేశారు. దేవతలు, ఇంద్రుడు లోకపాలకులు అందరు వాళ్ళని అభినందించడానికి వచ్చారు పర్వతాలు, సముద్రాలు దేవర్షులు కూడా వచ్చారు. ఇదంతా విని విష్ణుమూర్తి

కూడా వచ్చేశాడు. దేవతలు వీళ్ళందరి మీద పుష్పవర్షం కురిపించారు. 


అప్సరసలు నాట్యం

చేస్తుండగా, తుంబుర నారదులు వీణ వాయిస్తుండగ, గంధర్వులు గానం చేస్తుండగ,

జయ జయధ్వానాలు ఆకాశమంతటా వినిపించాయి


కౌశికుడు ఇక్ష్వాకురాజు ఒకేసారి ఇంద్రియాల్ని అరికట్టి అయిదు వాయువులు మనసులో నిలిపి, అక్కడ నుంచి భ్రూమధ్యానికి చేర్చి యోగబలంతో మొదట కౌశిక మహర్షిలోంచి తేజస్సు బ్రహ్మరంధ్రం నుంచి బయటకి వచ్చి, తనలాగే వచ్చిన ఇక్ష్వాకురాజు యొక్క తేజస్సుకి స్వాగతం చెప్పి రెండు తేజస్సులు కలిసి బ్రహ్మదేవుడి ముఖంలో ప్రవేశించాయి. అక్కడ ఉండి ఇదంతా చూస్తున్న దేవతలు, దేవర్షులు దిక్పాలకులు ఉత్తమగతులంటే ఏమిటో తెలుసుకున్నామని ఆనందించారు.


బ్రహ్మ అక్కడున్న వాళ్ళందరితో కౌశిక ఇక్ష్వాకు రాజులు బ్రహ్మసాయుజ్యం పొందడాన్ని చూసిన మీరు కూడ ధన్యులయ్యారు. మీకు శుభవవుతుందని చెప్పాడు.


 చూశారా! కౌశిక మహర్షి సావిత్రీదేవి ఉపాసన చేసి గొప్ప బ్రహ్మర్షి అవడమే

కాకుండా బ్రహ్మసాయుజ్యాన్ని పొందాడు.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

మొగలిచెర్ల

 *కడ దాకా స్వామితోనే...*


"మా మనవరాలికి సంబంధం కుదిరింది..వివాహం వచ్చే నెలలో చేయాలని అనుకుంటున్నాము..ఇక్కడే ..ఈ స్వామివారి సన్నిధిలోనే చేయాలని కూడా అనుకున్నాము..ముహూర్తం బుధవారం నాడు..ఆరోజుకు మాకు రెండు రూములు కేటాయించండి..ఉదయం పది గంటలకు ముహూర్తం సమయం..మధ్యాహ్నం భోజనాలు పెట్టుకొని వెళ్లిపోతాము..ఆరోజు ఇక్కడ వుండే భక్తులకు కూడా మా దగ్గరే భోజనం చేయమని మీరు చెప్పండి.." అని ఆ దంపతులు నాతో చెప్పారు..కొన్ని దశాబ్దాలుగా ఆ దంపతులు మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వస్తూనే వున్నారు..


ఆ దంపతులకు స్వామివారితో నేరుగా పరిచయం ఉంది..శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల్లో..వీళ్లిద్దరి వివాహం మాలకొండలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో జరిగింది..ఆరోజుల్లో మాలకొండలో ప్రత్యేక కళ్యాణ మంటపం లేదు..నరసింహ స్వామివారి మందిరం వద్ద ఉన్న మంటపం లోనే వివాహాలు జరిగేవి..అక్కడ వివాహం చేసుకొని..గర్భాలయం లోకి వెళ్లి శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని..ఆపై కొండమీద  ఉన్న లక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని రావడం కొత్తగా పెళ్ళైన దంపతులకు ఒక ఆనవాయితీగా ఉండేది..వీళ్లిద్దరి వివాహం జరిగిన శనివారం రోజు మాలకొండకు పెద్దగా భక్తులు రాలేదు..వచ్చిన కొద్దిమంది కూడా మధ్యాహ్నమే తిరిగి వెళ్లిపోయారు..ఈ కొత్త దంపతులు లక్ష్మీ అమ్మవారిని చూసి..కొండదిగి వస్తూ..కొండకింద ఉన్న శివాలయం వైపు వెళ్లారు..ఆ సమయానికే శ్రీ దత్తాత్రేయ స్వామివారు శివాలయం లోని శివలింగం ముందువైపు పద్మాసనం వేసుకొని ధ్యానం లో వున్నారు..వీళ్ళిద్దరూ శివాలయం లోకి అడుగుపెట్టేసరికి..స్వామివారు ధ్యానం లోంచి లేచి..వీళ్ళను చూసారు..ఇద్దరూ అప్రయత్నంగా స్వామివారికి నమస్కారం చేశారు..స్వామివారు ఆశీర్వదించారు..అలా మొదటిసారి స్వామివారిని దర్శించుకున్నారు..ఆ తరువాత స్వామివారు మొగిలిచెర్ల చేరి ఆశ్రమం నిర్మించుకున్న తరువాత ఒకటి రెండు సార్లు కలిశారు..స్వామివారి మీద అపరిమిత భక్తి విశ్వాసం కలిగాయి..స్వామివారు సిద్ధిపొందిన తరువాత కూడా తరచూ మొగిలిచెర్ల వచ్చేవారు..తమ కుమారుడి వివాహం కూడా మొగిలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరం వద్దే చేశారు..తమ మనుమరాలి వివాహం జరిపించే క్రమం లో ఇక్కడకు వచ్చారు..


"స్వామివారిని మొదటిసారిగా చూసిన రోజు నుంచీ..మా భార్యాభర్తలకిద్దరికీ ఆయన మీద గురి కుదిరింది..ఆరోజే మా పెళ్లి జరిగింది..అదేమి చిత్రమో గానీ..రెండేళ్ల తరువాత మేమిద్దరమూ మాలకొండకు వెళ్ళాము..ఆరోజు కూడా స్వామివారు శివాలయం లోనే మాకు దర్శనం ఇచ్చాడు..మాతో ఒక్క మాట మాట్లాడలేదు..చెయ్యెత్తి ఆశీర్వదించాడు..మేమూ నమస్కారం చేసుకొని వచ్చేసాము..స్వామివారు మొగిలిచెర్ల వచ్చిన తరువాత..మేమిద్దరం మొగిలిచెర్ల వచ్చాము..మీ అమ్మా నాన్న గార్లను కలిసాము..స్వామివారిని చూద్దామని వచ్చాము అని చెప్పాము..మేము కూడా ఆయన దగ్గరకే వెళుతున్నాము..మాతో రండి..అని మీ తల్లిదండ్రులు చెప్పారు..అందరమూ ఈ స్థలానికి వచ్చాము..అప్పటికి స్వామికి గది కూడా లేదు..పూరిపాకలో వున్నాడు..మమ్మల్ని చూడగానే..నవ్వి.."శ్రీధరరావు గారూ మీతో పాటు వీళ్ళను కూడా తీసుకొచ్చారా..? " అన్నాడు..మేమిద్దరం నమస్కారం చేయగానే..ఆశీర్వదించారు..కొద్దిసేపు కూర్చుని మేము తిరిగి వచ్చేసాము..ఇప్పటిదాకా ఈస్వామినే నమ్ముకొని ఉన్నాము..ఇద్దరు బిడ్డలు పుట్టారు..అబ్బాయి పెళ్లి ఇక్కడే చేసాము..కూతురు పెళ్లి కూడా ఇక్కడే చేసాము..ఆ స్వామిదయవల్ల మా బిడ్డలు కూడా ఈ స్వామినే కొలుస్తారు..ఇంతవరకూ మా జీవితం లో ఏ లోటూ లేదయ్యా..ఆయన చల్లటి చూపు మామీద వున్నదని అనుకుంటున్నాము..ఇట్లా కాలూ చెయ్యీ ఆడుతున్నప్పుడే..మమ్మల్ని తీసుకెళ్లు స్వామీ అని వేడుకున్నాము..అదొక్కటే కోరిక.." అన్నారు..


ఆ దంపతులు ధన్యజీవులు అనిపించింది..అనుకున్న విధంగానే వారి మనుమరాలి వివాహం మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దే జరిగింది..స్వామివారి సమాధి ని దర్శించుకున్న తరువాత.."అయ్యా..ఈసారి మేము మళ్లీ స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు..అన్నదానం జరిపించు..ఆ ఖర్చు మేమే భరిస్తాము.." అని చెప్పాడు..అలాగే అన్నాను..కానీ మరో రెండు నెలల లోపే ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చి..హాస్పిటల్ లో చేర్చే లోపలే కన్నుమూసాడు..ఒక్కరోజు కూడ ఆ మందులు వాడలేదు..మంచాన పడలేదు..ఒక రకంగా సుఖమైన మరణమే అది..ఆయన కోరుకున్నది కూడా అదే..


"ప్రతి సంవత్సరం మా నాన్న గారి జ్ఞాపకార్ధం ఈ స్వామివారి సన్నిధిలో ఒక ఆదివారం మధ్యాహ్నం అన్నదానం జరిపించాలని అనుకుంటున్నాను..ఆ అవకాశం ఇవ్వండి.." అని వాళ్ళ కుమారుడు అడిగాడు..సరే అన్నాను..గత ఆరేళ్లుగా అతను క్రమం తప్పకుండా అన్నదానం చేస్తున్నాడు..తండ్రి మరణించిన సంవత్సరం లోపే తల్లి కూడా మరణించింది.."స్వామివారు మా తల్లిదండ్రులను చల్లంగా చూసాడు..ఏ బాధా పడకుండా ఇద్దరూ కాలం చేశారు.." అని అంటూవుంటాడు వాళ్ళ కుమారుడు..


నిజమే..త్రికరణ శుద్ధిగా స్వామివారిని నమ్మిన వారికి ఏ ఇబ్బందీ రాకుండా ఆయనే వేయి చేతులతో కాపాడుతూ ఉంటాడు.. ప్రతిసారీ మేము ఈ నిజాన్ని పలురకాలుగా గ్రహిస్తూ ఉంటాము..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

మౌని అమావాస్య

 _*రేపు మౌని అమావాస్య*_


*మౌని అమావాస్య అనగానేమి ? మౌని అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి ?*


పుష్యమాసంలో అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు. ఇది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వస్తుంది. మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్రస్నానాలు ఆచరిస్తారు.  స్నానం యొక్క పవిత్రత రెండు లేదా ఎక్కువ నదులు కలిసేచోట చేస్తే పెరుగుతుంది.  మరో ముఖ్య విషయం మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది.


*మౌని అమావాస్య విశిష్టత*


మౌని అమావాస్య ఫిబ్రవరి 11 వ తేదీ అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ప్రారంభమై.. ఫిబ్రవరి 12వ తేదీన అర్థరాత్రి ముగియబోతోంది. 


*మౌని అమావాస్య సమయం ఈ కింది విధంగా ఉంటుంది*


అమావాస్య తిథి మొదలయ్యే సమయం ; 01:08AM, 11 ఫిబ్రవరి 2021

అమావాస్య తిథి ముగిసే సమయం ; 00.55 ఎఎం, 12 జనవరి 2021


*మౌని అమావాస్య ప్రాముఖ్యత*


మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు , సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి , దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు.  ఏమీ చెప్పవలసిన అవసరం కానీ , చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు.


గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. దీనివల్ల ఆరోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది.


గంగానదిలో స్నానం చేయటానికి కూడా మౌని అమావాస్య కూడా మేటి రోజు. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు.  వారు పుష్య పూర్ణిమ నాడు మొదలుపెట్టి , మాఘ పూర్ణిమ నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈ రోజు ఎంత ముఖ్యమైనదంటే 2017 సంవత్సరంలో , 5 కోట్ల కన్నా ఎక్కువ మంది భక్తులు అలహాబాద్ సంగమ్ ఘాట్ల దగ్గర చేరి పవిత్రస్నానం ఆచరించారు.


మౌని అమావాస్య రోజును మాఘి అమావాస్య అని కూడా అంటారు. ఇది ఉత్తరభారతం వారు పాటించే క్యాలెండర్ లో మాఘమాసంలో వస్తుంది


*మౌని అమావాస్య ఆధ్యాత్మిక విశిష్టత*


మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మౌని అమావాస్య పదాలను మౌని , అమ మరియు వాస్యగా విడగొట్టవచ్చు.

మౌనికి అనువాదం - మాట్లాడకుండా మౌనంగా ఉండటం , అమ - చీకటి మరియు వస్య - కామం. అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకడం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని , కామాన్ని తొలగించుకోవాలని.

చంద్ర దేవుడు లేదా చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈ రోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు.

భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు - *'మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు , అందుకని దానికి సరిగ్గా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీమీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు.'*

శరీరాన్ని , మనస్సును , ఆత్మను శుద్ధిచేసుకునే పవిత్రనదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు.


*మౌని అమావాస్యను ఎలా జరుపుకోవాలి?*


సాంప్రదాయంగా , భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు. మౌనవ్రతం చేస్తారు మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్తపడతారు. గంగానదిలో స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు.  మీరు సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే , మీరు అదే ఫలితం కోసం ఈ కింది ఆచారాలను పాటించవచ్చు. 


మీరు గంగానదిలో స్నానం చేయలేకపోతే

మీ ఇంట్లో గంగానది నీళ్ళు కొంచెం ఉన్నట్లయితే , అందులో కొన్ని చుక్కలను స్నానం చేసే నీళ్ళకి జతచేయండి. మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని చదవవచ్చు.

*'గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి ,*

*నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు'*

పై మంత్రం భారత ఉపఖంఢంలోని అన్ని పవిత్రనదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశలను మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది.


*పితృపూజ*


పితృపూజ చేయటానికి మౌని అమావాస్య మంచిరోజు. ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని , వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ , వారి ఆశీస్సులు కూడా కోరవచ్చు.


*ధ్యానం*


ధ్యానం చేయండి మరియు మంత్రాల ఉఛ్చారణలు మరియు సంగీతం కూడా ఉదయం వినండి. ఇది మిమ్మల్ని శాంతపరిచి మనస్సును నియంత్రిస్తుంది.


*రుద్రాక్షలు*


చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలను ఈరోజు మీరు ధరించవచ్చు. కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా పదహారు ముఖి అయివుండాలి. ఇవి వేసుకున్నవారికి ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది.


*మూన్ స్టోన్*


మూన్ స్టోన్ ను మనస్సుకు సానుకూలత ఏర్పడటానికి వాడవచ్చు.

జంతువులకి ఆహారం పెట్టడం కుక్కలు , ఆవులు మరియు కాకుల వంటి జంతువులకి ఈరోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు.


*శనీశ్వరుడు*


మౌని అమావాస్య నాడు శనేశ్వరుడిని కూడా పూజిస్తారు. ప్రజలు నువ్వులు లేదా తిల్ నూనెతో ఈ రోజు శనేశ్వరుడికి అభిషేకం చేస్తారు.


*దానాలు*


ఈరోజు కొంత డబ్బును మీరు పేదలకు మరియు అవసరమైనవారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం , బట్టలు ఇవ్వవచ్చు

10, ఫిబ్రవరి 2021, బుధవారం

ఆర్తితో ప్రార్థన చేసి

 కావ్య కంఠ గణపతి ముని ఒకసారి అరుణాచలం వెళ్లారు. వారితోపాటు వారి తమ్ముడు కూడా వచ్చాడు. ఆయనకు జఠరాగ్ని ఎక్కువ. ఆ పిల్లాడు అన్నయ్యా ఆకలేస్తోంది అంటున్నాడు. ఆ రోజున ఏకాదశి తిధి. అందుకని ఆయన తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక డజను అరటిపళ్ళు కొన్నారు. వాడు అవన్నీ తినేశాడు. తినేసి ఒక గంట గడిచేసరికి మళ్ళీ అతడు అన్నయ్యా ఆకలేస్తోంది అన్నాడు. అపుడు గణపతి ముని బ్రాహ్మణుల ఇంటి ముందుకు వెళ్లి 'భవతీ బిక్షామ్ దేహీ' అంటూ ఎవరైనా అన్నం పెడితే తమ్ముడికి పెడదామని యాచన చేస్తున్నారు. ఆ రోజు ఏకాదశి. ఎవ్వరూ అన్నం పెట్టలేదు. వీడు ఏడుపు. అపుడు ఆయన ఒక శ్లోకం చదివారు. బ్రాహ్మణ గృహంలో ఎవరైనా అకస్మాత్తుగా వస్తే పెట్టడాడనికి కొద్దిగా అన్నం ఉండేటట్లుగా వండాలి."ఆఖరికి కలియుగంలో వీళ్ళ అన్న పాత్రలలో అన్నం కూడా లేదన్నమాట! ఒక్కడు కూడా అన్నం పెట్టలేదు" అని ఆయన అనుకున్నారు.


ఆయన ఒక ఇంటి ముందునుంచి వేడుతున్నారు. ఆ ఇంటి అరుగుమీద ఒక వృద్ధ బ్రాహ్మణుడు పడుకుని ఉన్నాడు. ఆయన గభాలున లేచి కావ్య కంఠ గణపతి మునిని పట్టుకుని అన్నాడు. 'నీవు బాగా దొరికావు. నా భార్య కు ఒక నియమం ఉంది. అందరూ ఏకాదశి వ్రతం చేసి మరునాడు ఉదయం పారణ చేస్తే నా భార్య ఏకాదశి నాడు రాత్రి భోజనం చేస్తుంది. కానీ భోజనం చేసేముందు ఆవిడకు ఒక నియమం ఉంది. ఆవిడ ఎవరైనా ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది. ఇవ్వాళ తిరువణ్ణ మలైలో యాత్రికులు కూడా దొరకలేదు. ఎవ్వరూ దొరకలేదు. నువ్వు ఆకలని తిరుగుతున్నావు. మా ఇంట్లో కి రా! అని తీసుకు వెళ్ళాడు. ఆ ఇంట్లోని ఇల్లాలు స్నానం చేసి రండి.భోజనం వడ్డిస్తాను' అంది.

కావ్యకంఠ గణపతి ముని, ఆయన తమ్ముడు గబగబా వెళ్లి స్నానం చేసి తడిబట్టతో వచ్చారు. ఆవిడ మడి బట్టను ఇచ్చింది. అవి కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. ఆవిడ షడ్రషోపేతమైన భోజనం పెట్టింది.

 భోజనం ఐన తరువాత ఆవిడ చందనం ఇచ్చింది. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే భోజనం అయ్యాక చందనం పెట్టాలి. వారు అది చేతులకి రాసుకుని లేవాలి. అది ఇంటి యజమానే తీస్తే దానివలన ఎంతో గొప్ప శ్రేయస్సు ను పొందుతాడు. వాళ్ళు చందనం రాసుకున్నాక ఆవిడ తాంబూలం ఇచ్చింది.

 వీళ్ళు కడుపునిండా తినేసారేమో కళ్ళు పడి పోతున్నాయి. 'అమ్మా , ఇంక ఎక్కడికీ తిరగలేం. ఈ రాత్రికి మీ అరుగుమీద పడుకుంటామమ్మా!' అన్నారు. ఆవిడ సరేనని ఆవిడ తలుపు వేసేసింది. వీళ్ళిద్దరూ పడుకుని నిద్రపోయారు. గాఢ నిద్ర పట్టేసింది. వీరు నిద్రించిన ఇల్లు అరుణాచలం లో అయ్యంకుంట్ల వీధిలో ఉంది. 


మరునాడు సూర్యోదయం అవుతుంటే వారికి మెలకువ వచ్చింది. ఇద్దరూ నిద్ర లేచారు. 'అమ్మయ్య రాత్రి ఈ తల్లి కదా మనకి అన్నం పెట్టింది' అనుకుని అరుగుమీద నుండి లేచి చూసారు. అది వినాయకుడి గుడి. అక్కడ ఇల్లు లేదు. వాళ్ళు తెల్లబోయి 'రాత్రి మనం షడ్రషోపేతమైన భోజనాలు తిన్నాము. ఇక్కడ రత్నకింకిణులు ఘల్లుఘల్లు మంటుంటే ఎవరో ఒక తల్లి మనకి అన్నం పెట్టింది. ఆ తల్లి ఇల్లు ఏది'అని చూసారు. కలకాని కన్నామా అనుకున్నారు. పక్కకి చూస్తే రాత్రి ఆవిడ ఇచ్చిన తాంబూలాలు ద్రవ్యంతో కూడా ఆ పక్కనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. ఎవడు ఆర్తితో ప్రార్థన చేసి, ఎవడు ఆర్తితో పూజ చేస్తున్నాడో , వాడు నోరు తెరచి అడగవలసిన అవసరం లేకుండా, వాడి అవసరాలు తీర్చడానికి భగవంతుడు వాడి వెనుక తిరుగుతూ ఉంటాడు. వాడికి ఈశ్వరుని అనుగ్రహం ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. దానికి ప్రకటనలు అక్కర్లేదు. కాబట్టి అంత స్వచ్ఛమైన భక్తితో , అమ్మవారిపట్ల కృతజ్ఞతతో బ్రతికేవాడు ఎవడున్నాడో వాడిని అమ్మ యే కాపాడుతూఉంటుంది. ఈ స్థితికి ఎదిగితే వాడు చింతాకు పతాకాన్ని అమ్మవారి మెడలో పెట్టినట్టు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

చక్కటి విడిది.. రూ.200లకే

 *చక్కటి విడిది.. రూ.200లకే*


వసతిరూ. 40వేలకే పెండ్లి మండపంతో పాటు 15 గదులు 


సకల హంగులతో కాచిగూడ తుల్జాభవన్‌


వైద్యం కోసమని రోగులు,  సిటీ అందాలను  చూసేందుకు పర్యాటకులు నిత్యం నగరానికి వస్తుంటారు. ఒక్కోసారి ఇక్కడే విడిది చేయాల్సి ఉంటుంది. లాడ్జిల్లో రూమ్స్‌ తీసుకుంటే.. ఆర్థిక భారం తప్పదు. ఒక్కరోజు ఉండాలన్నా.. ఎక్కువ మొత్తంలో రుసుము చెల్సించాల్సి వస్తుంది.  ఇది పేదలు, సామాన్యులకు కొంత ఇబ్బందే. అలాంటి వారి కోసం ఇంటిని మరిపించేలా చక్కటి వసతి కల్పిస్తున్నది కాచిగూడలోని తుల్జాభవన్‌. తెలంగాణ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ భవన్‌లో నామమాత్రపు ధరతో అంటే నలుగురికి రోజుకు రూ. 200కే  వసతి కల్పిస్తున్నారు.  


ఇతర రాష్ట్రాల పర్యాటకులు..

నగరం నడిబొడ్డున ఉండటం, పార్కింగ్‌ రవాణా సౌకర్యం, తక్కువ చార్జీ ఉండటం వల్ల ఈ భవన్‌ మంచి ప్రాచుర్యం పొందింది. వివిధ రాష్ట్రాల నుంచి యాత్రికులు, వివిధ వైద్యశాలలకు వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులు నిత్యం ఇక్కడ బస చేస్తుంటారు. ఎక్కువగా  ఏపీ, బెంగళూరు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ , పంజాబ్‌, కర్ణాటక, హర్యానా, గోవా తదితర రాష్ర్టాల నుంచి వచ్చే  టూరిస్టులు ఇక్కడే విడిది చేస్తారు. అలా వచ్చే ఆదాయంతోనే భవనాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నారు. అయితే ఈ విడిది కేంద్రంలో తక్కువ చార్జీలతో సకల సౌకర్యాలు ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా నగరానికి వచ్చే గ్రామీణ ప్రాంతాల వారికి ఈ భవనం గురించి తెలియకపోవడం వల్ల వసతి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. 


వివాహ వేడుకలకు.. 

శతాబ్దాల కిందట నిర్మించిన ఈ భవనానికి కొత్త హంగులు సమకూర్చారు. మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. సకల  సౌకర్యాలు కల్పించారు. టూరిస్టుల కోసం ప్రత్యేక వంటశాల గదిని నిర్మించారు. ప్రస్తుతం 18 గదులు అందుబాటులో ఉండగా, అన్నింటిల్లో బాత్‌రూంలను ఏర్పాటు చేశారు. ఇటీవలే పేదల సౌకర్యార్థ్ధం *తక్కువ ఖర్చుతో పెండ్లిళ్లు చేసుకోవడానికి టెంట్‌ సామాన్లు, 15 గదులను కేవలం రూ.40 వేల ప్యాకేజీతో ఇస్తుండటం విశేషం.*


ఆలయం.. గ్రంథాలయం.. 

ఈ తుల్జాభవన్‌లో పురాతన రామాలయం ఉంది. ఏటా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఇక యువత, నిరుద్యోగులు, పాఠకుల కోసం గ్రంథాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం పలు స్వచ్ఛంద సంస్థలు వైద్యశిబిరాలు నిర్వహిస్తుంటాయి.   


ఎంతో మేలు...

పేద, మధ్యతరగతి ప్రజల కోసం తక్కువ ఖర్చుతో *పెండ్లిండ్లు చేసుకోవడానికి కేవలం రూ.40 వేల ప్యాకేజీ ఇవ్వడం శుభసూచికం.* కొన్ని నెలలుగా మధ్యతరగతి ప్రజలు ఈ భవన్‌లో పెండ్లిళ్ల్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు బయట లాడ్జిలతో పొల్చితే ఇక్కడ కేవలం రూ.200 చెల్లిస్తే నలుగురికి వసతి కల్పిస్తున్నారు -పట్లూరి సతీశ్‌, యాత్రికుడు 


అనేక  సౌకర్యాలు అందుబాటులో..

నగరంలోని వివిధ ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులకు అందుబాటు ధరలో అంటే *నలుగురికి రోజుకు కేవలం రూ.200లకే  తుల్జాభవన్‌లో వసతి కల్పిస్తున్నాం.* వివిధ పనుల కోసం వచ్చే పర్యాటకులు ఇక్కడ వసతి పొందడానికి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. నగరం నడి బొడ్డున ఉండటం వల్ల ఇక్కడి నుంచి ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా ఉన్నది. వసతి పొందాలనుకునే వారు -9491000687, 8309481306 నంబర్లలో  సంప్రదించవచ్చు.  -ఎ.బాలాజీ(దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, కాచిగూడ తుల్జాభవన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)

అక్క పలకరింపు

 అక్క పలకరింపు: 


శా. ప్రారంభించిన వేదపాఠములకున్ బ్రత్యూహ మౌనంచునో

     ఏరా తమ్ముడ! నన్నుఁ జూడఁ జనుదే వెన్నాళ్ళనోయుండి చ

     క్షూరాజీవ యుగమ్ము వాఁచె నినుఁ గన్గోకున్కి మీ బావయున్

     నీరాకల్ మదిఁ గోరు జంద్రు పొడుపున్ నీరాకరంబుంబలెన్


నిగమశర్మ  అక్క పలకరింపు అంటూ, మధ్యలో ఈ పద్య ప్రవేశం ఏమిటా అని ఆశ్చర్య పోతున్నారా ?  వద్దండీ,  అంతగా ఆశ్చర్యం వలదు.  బహుశా మీరందరూ వినే ఉంటారు ఈ విషయం గురించి.  ఒక ఇరవై, ఇరవై రెండు సంవత్సరాల కు పూర్వం  ఈ విషయం  తెలుగు పాఠ్యాంశంలో కూడా  చదువుకుని ఉండచ్చు.  అయినా  మరొకసారి  చూద్దాం ఏమిటో ! 


పై పద్యం తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము అనే ప్రబంధపు తృతీయాశ్వాసం లోనిది.  చాలా చక్కని పద్యాలున్న ఈ ప్రబంధంలో పండరీపురంలోని పాండురంగ విఠలుని మాహాత్మ్యమూ, లీలలూ, ఆయన భక్తుల కథలూ మొదలైనవి వర్ణించబడ్డాయి. ఆ స్వామి ప్రభావాన్ని వివరించడంలో భాగంగా చెప్పిన నిగమశర్మోపాఖ్యానము  లోనిది పై పద్యం.    


పూర్వం పిఠాపురంలో నిగమశర్మ అనే ఒక బ్రాహ్మణ యువకుడుండేవాడు. పేరు మాత్రం గొప్పగా నిగమశర్మ (నిగమములు = వేదములు) అని వుంది కాని అతనికి లేని పాడు బుద్ధులు లేవు. జూదరి, వేశ్యాలంపటుడు. వాడి ప్రవర్తన మార్చడానికి వాడి భార్యా, తల్లీతండ్రులూ ఎంతో శ్రమపడతారు. కానీ వాడిది పిల్లి శీలము. చదువులు చిలుక చదువులు. వాడు తాత తండ్రులు సంపాదించిన ఆస్తి అంతా వేశ్యలకు ధారపోశాడు. తల్లి నగలు తాకట్టు పెట్టాడు. దొరికిన చోట్లల్లా అప్పు చేశాడు. బంధువులను యాచించాడు. ఈ రకంగా భ్రష్టు పట్టిపోయిన వీషయం తెలుసుకొని అతని అక్క, తమ్మునికి మంచిబుద్ధి చెప్పడానికి భర్తనూ, పిల్లలనూ తీసుకొని పుట్టింటికి వస్తుంది. అలా వచ్చి, తమ్ముని సంబోధిస్తూ బుద్ధి గరిపే సందర్భంలో మాట్లాడిన తొలి మాటలను వివరించే పద్యం ఇది.


ఇక్కడ నిగమశర్మ అక్కను గురించి విపులంగా ముచ్చటించుకొని తీరాలి. ఎందుకంటే, ఈమె తెలుగు సాహిత్యంలో మర్చిచిపోలేని పాత్రల్లో ఒకటి. తెనాలి కవి ఈమెకు పేరేమీ పెట్టలేదు. అయినా ఏమి, ఎంతో పేరు ఆమెకు ఆమే సంపాదించుకున్నది. పెద్దన వరూధినిలాగా, తిమ్మన సత్యభామలాగా, గురజాడ మధురవాణిలాగా, కలకాలం గుర్తుండిపోయే పాత్ర ఈ అక్కది. ఇప్పుడు చెప్పుకున్న మిగతా నాయికలందరూ ఆయా కావ్యాల్లో చాలా దీర్ఘమైన కార్యక్రమాలే నిర్వహించారు గాని, నిగమశర్మ అక్క మాత్రం కావ్యంలోని ఒక చిన్న ఉపాఖ్యానంలో ఒక క్షణం పాటు జిగేల్మని మెరిసి పోయిన మెరుపు మాత్రమే. అయినా మరపు రాని మగనాలు. పుట్టింటికి వచ్చిన ఎన్నో రోజుల తర్వాత గాని తమ్ముడు ఇంటికి వచ్చి ఆమెను కలవడు. ఈ లోపల ఆమె ఆ ఇంట్లోనిర్వహించిన వ్యవహారం – ఒక ముఖ్యమైన నేపథ్యం. ఆ తర్వాత, తమ్ముడు వచ్చిన పిమ్మట అతనితో మాట్లాడబోయే ముందు జరిగిన తతంగం మరో నేపథ్యం. ఈ రెండు నేపథ్యాలూ ఆమె పాత్రను ఎంతో అద్భుతంగా ప్రోత్తుంగపరచినవి.


తల్లిదండ్రులు ముసలివారు. తమ్ముడు ఇల్లు పట్టకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతుండె. మరదలు చిన్నపిల్ల. అట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లు ఎలా వుండాలో అలానే వున్నది. ఈమె వచ్చి తల్లిదండ్రులను ఊరడిస్తూ ఉపచారాలు చేస్తూ కొంత కొంత వారికి ఉపశమనం కలిగించింది. వెనక బట్టిన దేవతార్చనను పునరుద్ధరించింది. అతిథి అభ్యాగతులను ఆదరించడం మొదలు పెట్టింది. తల్లి తన దగ్గర తమ్ముడికి కనబడకుండా వుంచుకున్న డబ్బులను జాగ్రత్త చేసింది. దాసదాసీలను అభిమానంగా దగ్గరకు తీసింది. 


పశుపోషణాదికాన్ని స్వయంగా పర్యవేక్షించడం ప్రారంభించింది. ఇంట్లో పెద్ద గ్రంధాలయం వున్నట్లున్నది – పుస్తకాలను వరసగా పేర్చడమూ, ఇతరులు తీసుకుపోయిన పుస్తకాలను తిరిగి రాబట్టడమూ, చినిగినవాటిని మరమ్మత్తు చేయడమూ – దాని పనులను భర్తకు పురమాయించింది. ఇంటి మరమ్మత్తులకు – మెత్తడమూ, అలకడమూ,సర్దడమూ – స్వయంగా పూనుకుంది. రాజానుగ్రహంతో వచ్చిన గ్రామభోగాలను స్వాధీనంలోకి తెచ్చుకున్నది. తప్పిదారిన మడీ మట్రా, చేనూ చెట్టూ – వీటికి జాగ్రత్తగా కాపలా నియమించింది.


ఇదీ, ఆమె పుట్టింటికి వచ్చిన తర్వాత కావించిన నిర్వహణ. (పాపం, ఇన్ని చేస్తున్నా కాపురానికి వచ్చి యౌవనారంభంలో వుండి, భర్త ఆదరణకు నోచుకోని మరదలి స్థితికి “వగచి వగచి కడుపు చుమ్మలు జుట్టి కన్నీరుట్టిపడగా” బాధపడుతూనే వున్నది). పైన తెల్పిన మొదటి నేపథ్యం ఇది.

ముఖ్యంగా మన తెలుగిండ్లలో ఆడపడుచులకు వుండే స్వతంత్రం చెప్పనలవి గానిది. పెండ్లయి అత్తింటికి పోయినా పుట్టింటి ధ్యాస వుంటూనే వుంటుంది వారికి. అన్నలూ, తమ్ములూ, వారి కాపురాలూ క్షేమంగా వుండాలని కోరుకునేది ఆడబడుచే. పుట్టింట్లో ఏ శుభకార్యం జరిగినా, అన్ని మర్యాదలూ దర్జాగా జరిపించుకొని, ఇతరులకు చెప్పుకుని మురిసిపోయేది ఆడబడుచే. ఆ స్వతంత్రంతోనే తమ్మునికి బుద్ధి గరపడానికి వచ్చింది ఆమె. ఆ చొరవతోనే ఇల్లంతా ఒక దోవకు తెచ్చింది మళ్ళీ.


ఇంతలో ఒకరోజు ఉన్నట్టుండి “చుక్క తెగిపడిన వడుపున” ఇంటికి వచ్చాడు నిగమశర్మ. చాలా రోజుల తర్వాత చూసింది గదా అని కౌగిలించుకోబోయింది కాని, వాడి వంటినిండా నఖక్షతాలున్నాయిట. వాటిని చూసి అసహ్యించుకుంది. పాపం మనసులో కూడా అపవిత్రతకు తావీయక దేవతార్చనలు గావించుకునే ఇంటి ఇల్లాలు గదా. ఐనా వాడిని విముఖుని చేసుకోరాదనే సంగతి తెలుసు. మేనల్లుని ఎత్తుకోమని అందించింది. నిమిషంలో శాకపాకాలు తయారు చేస్తాను, మీ బావతో కలిసి భోంచేద్దువు గాని, స్నానం చేసి రమ్మంది. అతనికి చేయవలసిన ఉపచారాల కోసం మరదలికి కనుసైగ చేసింది. అభ్యంగన స్నానం చేయించింది. ఉతికిన ధోవతీ, ఉత్తరీయమూ ఇప్పించింది. తల తానే శుభ్రంగా తడి లేకుండా తుడిచింది. ఒంటికి గంధం రాచింది. తలలో పూలు తురిమింది. బావా తలిదండ్రుల పంక్తిలో కూర్చోబెట్టి షడ్రసోపేతమైన భోజనం వడ్డించింది. అనంతరం, అరుగు మీద కూర్చుని వుండగా మరదలి చేత తాంబూలపు చిలకలు ఇప్పించింది. తనూ తమ్ముని దగ్గరకు చేరింది. చంటి పిల్లవాడిని ఎత్తుకుని, వాడికన్నా ముందువాడు తన పక్కపక్కనే తిరుగుతూ వుండగా, తమ్ముడి తలముడి విప్పింది. ఈరువానతో (పెద్ద పండ్లు గల దువ్వెన) తలవెండ్రుకల చిక్కు తీసి దిగ దువ్వి, కుచ్చు విడదీసి పైకెత్తి, పేలను గాలించి గోరుముక్కులతో నలిపింది. లేచి శుభ్రంగా (గరగరగా) చేతులు కడుక్కొని వచ్చింది. మరదలు తనకు తాంబూలం ఇస్తే నోట పెట్టుకున్నది. మరదలు విసనకర్రతో విసురుతూ పక్కన నిలబడి వుండగా, దాసీ తెచ్చిన పీటపై కూర్చుని, బిడ్డ చనుబాలు త్రాగుతూ వుండగా, కుడివైపుకు కొంచెము ఒత్తిగిల్లి, పద్మవనంలో కొలువున్న లక్ష్మీదేవిలా కూర్చొని, తమ్మునికి హితబోధ ప్రారంభించింది. ఇది రెండో నేపథ్యం.


ఎంతో సహజంగా, మనోహరంగా, సాంసారికంగా, ఆత్మీయంగా వున్నది గదా ఈ దృశ్యం. ఇంత చక్కని ఛాయాచిత్రాలతో, ఎంతో ప్రతిభతో నిగమశర్మ అక్కను తెలుగు సాహిత్యంలో చిరంజీవిని చేశాడు రామకృష్ణ కవి. అక్క ఇక ఉపదేశం ప్రారంభించింది. ఆ సందర్భంలోని మొట్టమొదటి పద్యం మనం పైన చదువుకున్నది.


ఉపదేశం తిట్టడంతో గానీ, తప్పులెంచడంతో గాని, ఆమె మొదలు పెట్టలేదు. ఏరా తమ్ముడూ, మా ఇంటికి రావడమే మానేశావు. నీకోసం నేనూ, మీ బావా కళ్ళు కాయలు కాచేట్టు ఎన్నో రోజుల్నించీ ఎదురు చూస్తున్నాము, నెలపొడుపు కోసం సముద్రం ఎదురు చూస్తున్నట్లు. కొత్త వేదపాఠాలేమైనా ప్రారంభించావా? వాటికి ఆటంకం కలుగుతుందనా రావడం మానేశావు. నిన్ను చూసి ఎంత కాలమయిందో గదా! అంటూ ప్రారంభించింది. ఆత్మీయతను చూపిస్తూనే ఎంతో సున్నితంగా ఎత్తిపొడుస్తూ, వాడి మనస్సు విరగకుండా మొదలు పెట్టింది.

ప్రారంభించిన వేదపాఠాలకు విఘ్నం కలుగుతుందనా రావడం లేదు అని అడగడం ఎందుకు? ఆమెకు తెలియకనా వాడు వేదపాఠాలను పక్కనబెట్టి చాలా రోజులే అయిందని. అయినా తెలీనట్లే అడిగింది. వాడు రాగానే తిట్లకు లంకించుకోవడం సరిగాదు. నువ్వేమిటి నాకు చెప్పేది అని వాడు విదిలించుకొని పోకుండా, ఎంతో ఆప్తంగా కొడుకుని ఎత్తుకోమని ఇవ్వడం, స్వయంగా వడ్డించడం, తల దువ్వడం లాంటి పనుల్తో వాడి మనసులో విరసపు భావం తొలగించేందుకు జాగ్రత్త పడింది. నెలపొడుపు కోసం సముద్రంలాగా నేనూ మీ బావా ఎదురుచూస్తున్నామని చెప్పడం ఎంతో అందంగా వుంది. ఇది ఏదో ఆషామాషీగా వేసిన పోలిక కాదు. చంద్రుడు సముద్ర మధన సమయంలో – అందులోంచి పుట్టాడనేది ప్రసిద్ధం. అందువలన వారిది తండ్రీకొడుకుల సంబంధం. కొడుకు ఉదయించి, క్రమంగా మిన్నందుతుంటే తండ్రికి ఎంతో సంతోషం. అందుకనే పున్నమి రోజున సముద్రంలో వచ్చే ఆటుపోట్లు – సముద్రుడు కొడుకు ఉన్నతికి ఉప్పొంగడంగా కవులు ఉత్ప్రేక్షించారు. నీ శ్రేయం కోరేవాడు తండ్రి. అతని మాటలు నువ్వెట్లా వినడం లేదు? అక్కా బావలు, తలిదండ్రుల తర్వాత అంతటివారు. నీ శ్రేయస్సు కోరేవారు. నీ ఉన్నతిని కాంక్షించేవారు. నీ అభ్యుదయానికి ఆనందించేవారమైన మా మాటలయినా విను నాయనా, అని ధ్వని.


ఒక్కసారి, ఆమె ప్రవర్తనా, ఆమె గృహ నిర్వహణ చేసిన తీరూ, మాట్లాడే ధోరణీ, కూర్చున్న వైఖరీ – ఇవన్నీ మనసులోకి తెచ్చుకొని, ఆమె చెప్పిన ఈ పద్యం తలచుకుంటే ఎంతో ఉజ్జ్వలంగా కన్పట్టక మానదు. ఆ పద్యంతో ప్రారంభించి ఒక పది పద్యాలలో అతని వంశ ప్రతిష్ఠనూ, ఇంటి దుస్థితినీ, భార్య పరిస్థితినీ, వచ్చిన దుష్కీర్తినీ వివరించి, అతను కాదనడానికి వీల్లేని పరిస్థితిని కల్పించి, తాత్కాలికంగానైనా తన మాటలకి ఒడబడేటట్లు మాట్లాడింది – అదీ నిగమశర్మ అక్క అంటే. అక్కడ ఆమె చేత ఉపదేశం చేయించిన తీరూ, మనం పైన అనుకున్న రెండు నేపథ్యాల కల్పనా – ఇవి రామకృష్ణుని అద్భుత ప్రతిభకూ, లోకజ్ఞతకూ నిదర్శనాలు. ఈ ఒక్క పద్యమే కాదు, ఆ సందర్భంలోని పద్యాలన్నీ ఆణిముత్యాలే!


నిగమశర్మ అక్కని ఇంత గొప్పగా చిత్రించి కూడా ఆవిడకో పేరు ప్రసాదించలేదు! అదే మరి రామకృష్ణుని కొంటెతనం :-) ఇంతకన్నా కొంటెతనం మరొకటి ఉంది. ఈవిడగారు ఎంత నచ్చచెప్పినా మారినట్టు నటిస్తాడే కానీ నిజంగా మారడు నిగమశర్మ. ఓ రోజు డబ్బు దస్కం మూటగట్టుకొని చక్కా ఉడాయిస్తాడు. పొద్దున్న విషయం తెలిసిన ఇంటిల్లపాదీ ఏడవడం మొదలుపెడతారు. నిగమశర్మ పారిపోయినందుకు కాదు, పోతూ పోతూ తమ తమకిష్టమైన వస్తువులు తీసుకుపోయాడనిట! ఆఖరికి ఇంత తెలివీ వ్యక్తిత్వమూ ప్రదర్శించిన ఆ నిగమశర్మ అక్కగారు కూడా తను కొత్తగా చేయించుకున్న ముక్కెర పోయిందని లబోదిబోమంటుందిట! మనుషులలో ఉండే సంకుచిత స్వభావాన్ని వెటకారం చెయ్యడమే రామకృష్ణుని పరమోద్దేశం. అతనికి పాత్రల ఔచిత్యంతో పనేలేదు.


తెలుగు అక్కలందరికీ ఒక ప్రతినిధిలా నిలిచిపోవాలనేమో, ఈ పాత్రకి పేరుపెట్టకుండా "నిగమశర్మ అక్క" అని ఊరుకున్నాడు తెనాలి రామకృష్ణుడు!


      

ఈ శీర్షికను వ్రాసిన శ్రీ  రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు కూడా చివరగా వ్రాసిన మాటల్లో  చక్కని వ్యంగం తో కూడిన హాస్యాన్ని జోడిస్తూ ఇలా అంటారు "  


"అక్క సద్బుద్ధిమాట లాదరించి నిగమశర్మ నాల్గునా ళ్ళింటిలో వివేకము దెచ్చుకొన్న వానివలె నుండి, యొకనాటి రాత్రి చేతికి దొరకిన యింటి సొమ్ముల నెల్ల హరించి మూటగట్టుకొని పండుకొన్న "పడుకకును జెప్పక" పాఱిపోయెను. అప్పుడింట నందఱు నేడ్చిరి. వారితోడ నక్కయు నేడ్చినది. ఎందుకనుకొన్నారు? తమ్ముఁడు చెడెనే యని కాదు; ఇల్లు మునిఁగెనే యని గాదు; తన ప్రయత్నము వ్యర్థమాయెనే యనియునుగాదు! మఱి "క్రొత్తగా చేయించుకొన్న ముక్కర" పోయెనే యని 'దుర్వారయై' యడలెనఁట!


పరిహాసము పవిత్ర వస్తువునుగూడ గమనింపదేమో!

.G.B.K.S.Saneevi

అర్చకత్వం

 FWD...  "అర్చకత్వం" అంటే అంత సులభం కాదు ? ఎందుకు అంటున్నాను అంటే కొంతమంది మహానుభావులు ఏముందండీ మీ నోరే గా  నాలుగు మంత్రాలు చదవడం మేగా   మాలాగా గొడ్డు చాకిరి లేదు అంటారు .కానీ  అర్చకత్వం చేసేవారి మానసిక సంక్షోభం, ఒక వయస్సు వచ్చేటప్పటికీ వాళ్లు తీసుకునే సాత్వికఆహారపు అలవాట్ల కి శారీరక దౌర్బల్యం, మానసిక సంక్షోభం ఇవన్నీ కలిసి 40 ఏళ్ల వాడిని 60 ఏళ్ళ వాడిని చేస్తాయి. ఇవన్నీ  మహానుభావులకి తెలియదు. సుఖంగా కూర్చున్నదే వాళ్ళకి తెలుస్తుంది

తెల్లవారకట్ట నిద్ర లేచిన అర్చకుడు కాలకృత్యాలు నెరవేర్చుకుని దేవలయం ద్వారాలు తెరచి విగ్రహం దగ్గరనుండీ అంతా శుభ్రం చేసుకొని , అభిషేకం , అర్చనా పూర్తి అయ్యే సరికి నీరసం నిస్సత్తువ తో  ఇంటికి పోయి కాఫీ/టీ తాగుదామని అనుకొనే లోపల , భక్తులు వొచ్చి పూజచేయమని అడగంగానే అప్పుడు వారితో ఇప్పుడే వస్తానండి  ఇంటికి వెళ్ళి కొంచెము కాఫీ తాగివస్తా అంటే ! స్వామి త్వరగా రండి మాక పనిఉంది అంటారు . కొంతమందైతే 

మాకు త్వరగా అర్చన చేసిపోస్వామి అంటారు..

అలా వొచ్చిన వారికి  పూజ చేస్తూనే తీర్ధం, శఠారీ పెడుతూ  ఆకలిని చంపుతూ పూజని పూర్తిచేసి బడలిక తీర్చుకున్న అర్చకుడు ఎవరినో ఒకరిని అక్కడ పెట్టి అవసరాలను తీర్చుకొని.. దేముడికి భోగము పెట్టి, వచ్చిన వారి గోత్ర నామాలను చెప్పి అర్చన మొదలు పెట్టిన తరువాత ఎవరో ఒకరు తమకు కూడా అర్చన మొదలు పెట్టమని మొదటి భక్తుడు ఉరిమి చూస్తూ ఉండగా రెండవ భక్తుడి గోత్రనామాలను చెపితే మొదటి భక్తుడు తన ముని మనవారళ్ళ పేర్లతో సహా చెప్పమని వత్తిడి చేస్తే కంఠం నెప్పి వచ్చినా మారు మాట్లాడకుండా అన్నీ చెప్పి పూజ చేసి తీర్ధ మంత్రంతో మూడుసార్లు వేయకుండా ఒకసారి వేసినందులకు కోపంగా చూసే కళ్ళను తప్పుంచుకుంటూ ప్రసాదం ఇచ్చి సంభావన ని చూసి నిరాసక్తంగాను ఒక్కొక్కప్పుడు ఆనందంగానూ చూసే లోపు కమిటీ మెంబర్లు వస్తే వాళ్ళ పేర్లమీద పూజచేసి ఒక కంట వాళ్ళ ప్రవర్తనను గమనిస్తూ మధ్యలో వాళ్ళు వేసే అడ్డదిడ్డమైన ప్రశ్నలకు మాట్లాడకుండా అర్చన చేసి ప్రసాదం ఇచ్చిన తరువాత వారు తిట్టినా కోప పడక వారి సలహాలను పాటిస్తూ  అని వాళ్ళని తృప్తి పరచి హమ్మయ్యా అని కూర్చునే లోపల భక్తుల వస్తే పూజ లేదా తీర్ధం ఇచ్చి వాళ్ళ సమస్యలను విని సలహాలు ఇచ్చే సరికి ఆకలి నకనకలాడతూ ఇంత ప్రసాదమో లేక ఫలమో తిందామటే ఉండొచ్చూ ఉండొక పోవచ్చు అనుకుంటూ ఉన్నదాంట్లో తృప్తి పడే లోపు కమిటీ లేదా  పంపిన గుఢాచారికి సరైన సమాధానమచ్చే సరికి తలప్రాణం తోకకి వస్తుంది అప్పటికి సమయం మధ్యాహ్నం 12:00 ఇక గుడిని కట్టేద్దామనుకునే లోపల భక్తులు వస్తే వారికి ప్రసాదం పెట్టి  నీరసంగా గుడి తలుపులు వేసి ఇంటికి పోయి మహా నైవేద్యం తెచ్చి స్వామికి నైవేద్యం పెట్టి తాను తినేసరికి మధ్యాహ్నం2:00 కాస్తంత నిద్రపోయి సాయంత్రానికల్లా ఇంటి కోసం, గుడి కోసం  సరుకులను తెచ్చే సరికి గుడితీసే సమయం ప్రారంభం , ఆరాత్రి 9:00 గంటలకి గుడి మూసి ఇంటికి వచ్చి నిద్రపోయే సరికి  రాత్రి 11:00 గంటలు ఇదీ ఒక గుళ్ళోని అర్చకుని రోజువారీ వ్యవహారం, ఇంకొటి సెలవులు అవేమీ ఉండవు,  పైగా అదనంగా తిట్లు రాజకీయాలు భరించాలీ, తన కుటుంబం కోసం తాను నమ్మిన దేవత & దేవుని కోసం. పొరపాటున బయట టిఫిన్ తిన్నాడా ఇక పని ఐపోయి నట్టే ఇదీ ఒక సాధారణ అర్చకుని కధ కాదు కాదు ఇది ఒక అర్చకుని వ్యధ, ప్రతీ గుడి తిరుపతో,యాదగిరి గుట్టో కాదు!థూపదీపాలకు నోచుకోని గుళ్ళు,ఒక రోజు కూడా భో(క్త)జనానికి దొరగని "బాపని ఇళ్ళు" ఎన్నో ఉన్నాయీ మన(దేశం) తెలుగు రాష్ట్రాల్లో...

* ఇదేనయ్యా అర్చకుల బాధలు..ఇంకా వ్రాయాలంటే ఎన్నో ఉన్నాయి కాని మీరు చదవలేరు..అందుకే ముగిస్తున్నాను..🙏

అనలసంబంధ. .. భాషా చమత్కారము

 "అనలసంబంధ వాంఛనాకగునయేని

అనల సంబంధ వాంఛనా కగునుజూవె’’


ఇది కవి సార్వభౌముడు  శ్రీనాథుడి ‘శృంగార నైషధం’లో వాడిన భాషా చమత్కారం. 


యిది నలదమయంతుల పరిణయము గురించిన వృత్తాంతము.  


నలుడ్ని దమయంతి వరించింది. అతనినే పెళ్లి చేసుకోవాలనుకుంది. దమయంతీ స్వయంవరం ప్రకటించారు. దిక్పాలకులు కూడా ఈ స్వయంవరానికి బయలుదేరారు. 


వారు దారిలో నలుడ్ని కలిశారు. ‘‘ఓ నలమహారాజా, నువ్వు వెళ్లి దమయంతికి నచ్చచెప్పి మాలో ఒకర్ని వివాహమాడమని చెప్పు’’ అన్నారు.


నలుడు వెళ్ళి దమయంతికి ‘దిక్పాలకులలో ఒకర్ని పెళ్లిచేసుకోమని’ చెప్తాడు. దమయంతి వినదు. 


అప్పుడు శ్రీనాథుడు పై పంక్తుల్ని రాశాడు- రెండూ ఇంచుమించు ఒకే వాక్యం- కానీ అర్థాలు వేరు:


మొదటి పాదం- అనల సంబంధం- అంటే నలుడు కాని వానితో సంబంధం!


రెండవ పాదం- అనల సంబంధం- అంటే అగ్నితో సంబంధం (అనల అంటే అగ్ని).


నలుడుకానివాడితో నాకు సంబంధం ఏర్పడి (పెళ్ళి అయితే)- నాకిక అగ్నితోనే సంబంధం! అంటే ఆత్మాహుతి తప్పదు అని భావం. 


యిలాంటి భాషా చమత్కారము శ్రీనాథునికి అందెవేసిన చేయి.

ఓం కారం ప్రణవ లక్షణము

 ఓం కారం ప్రణవ లక్షణము వక పరిశీలన. ఓ అనగా జీవుడుని దానికి ౦ పూర్ణమే జీవ లక్షణము. ప్రతీ అక్షరమునకు పూర్ణమే మూలం యిది లేని అక్షర శక్తి పలుకుట శబ్దమునకు జీవం తెలియదు. తెలుగు భాషగొప్పదనమునకు కారణం త్రిలింగ రూపము మూలమని లింగాకారం ప్రణవమే.౦ లింగార లక్షణము పూర్ణ తత్వం గల లింగరూపధారి పరమేశ్వరుడు. మహేశ్వర సూత్రములు భాష గురించి పరమేశ్వరుని ెఢమరకం నిండి వెలువడిన పూర్ణ శబ్ద లక్షణము తత్వం గురించి తెలిపిరి. ఋషులకు మహేశ్వర అనుగ్రహం వలననే పూర్ణ శక్తి తెలిసినది. మనకు కూడా అంతే. భాష ఔన్నత్యమునకు పూర్ణమే ౦ మూలం. అందుకు అమ్మ మ అనే పదమే మూలం. అమ్మ అనే మెుదటి

పూర్ణ స్వరముతో సృష్టి చైతన్యం మెుదలు. ప్రణవరూపం అర్ధం తెలియుట యే శుద్ద ఙ్ఞానము. అది నిర్మలము అనగా లింగాకారము మౌనమునకు సంకేతం తపస్సుకు మూలం మౌనం. మౌనం పరిశీలన మాత్రమే ఙ్ఞానం తో పరిశీలన. సూక్మగ్రాహి మాత్రమే మౌని. దానికి ప్రణవమే మూలం. ఉశ్ఛ్వాస నిశ్వాసములే ప్రణవ మూలం యిది ఓం కారము. పెదవులు కలుపకుండా ఓంకార జపం మౌని లక్షణమునకు తొలి రూపము. ఆపై పెదవులు కదుపులుట ఆపై అక్షర పరబ్రహ్మమును సా మ గానం సాధన ద్వారా శబ్దము శక్తిని తెలియుట. అన్ని అక్షర శబ్ద లక్షణములు మానవులకు అవసరమే. యిది శూన్యంలో వాయు రూపములో ప్రాణం. ఎంతవరకూ అనగా వాయు తత్వము గల ప్రాంతము వరకు ప్రయాణము.వాయు లక్షణము శబ్ద శక్తికి మూలమా, కాదు. వాయురూపములేకపోయిననూ శబ్దము యెుక్క అగ్ని తత్వమును వ్యాప్తికి ఆటంకం లేదు.అది హవిస్సు ఎలక్ట్రానిక్ రూపములో. ప్రణవాక్షరమునకు ముక్కు ప్రధానము దీని చిహ్నమును ఌకారము ఓ శబ్దమునకు మూలం. వాటికి పదార్ధ శక్తి లం జీవ గుర్తు ఓ రెండింటికి ౦ పూర్ణమే లం పృధ్వి తత్వం. ఓం పృధ్వి రూపరూప లం పదార్ధ చైతన్యలక్షణము జీవ తత్వం. లలితా సహస్రం కూడా యిదే విషయాన్ని తెలుపు చున్నది. ఓం లం రం హం శ్రీం యని. తెలుగు భాష పూర్ణము తీయనైనది. వేద మునకు మూలం పూర్ణ స్వరము యిది లేని స్వరం జీవంలేనిది. పూర్ణాత్ పూర్ణమిదం, యిదం యిది యనగా యీ అనే పూర్ణ శక్తి జీవ శక్తిని తెలియుట. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 *స్వయం ప్రకటిత దీక్ష*


"నలభై ఒక్క రోజుల పాటు ఇక్కడే వుండిపోదామని వచ్చాను..స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటాను..నాకోసం ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లూ వద్దు..ఆహారం  కూడా ఒక్కపూట మాత్రమే తీసుకుంటాను..నేను ఒక కోరిక అనుకోని ఇలా నిష్ఠగా ఉండాలని అనుకున్నాను..నాకు అవకాశం కల్పించండి.." అన్నాడు ఆ వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం.."మీ పూర్తి వివరాలు ఇవ్వండి..మీ గురించి తెలిసిన వాళ్లేవారైనా ఇక్కడ ఉన్నారా?..మేమూ విచారించుకొని చెపుతాము.." అన్నాను..మొగిలిచెర్ల గ్రామం లో తనకు దూరపు బంధువులున్నారనీ..వాళ్ళను అడిగి తన గురించి తెలుసుకోవచ్చుననీ చెప్పి, వాళ్ళ పేర్లు ఇచ్చాడు..మా సిబ్బందిని పిలిచి ఆ వివరాలు కనుక్కోమని చెప్పాను..అతని పేరు మాధవరావు..మొగిలిచెర్ల గ్రామం లో అతని బంధువులు ఉన్నమాట వాస్తవమే..ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం అనీ..వ్యవసాయం లో నష్టాలు రావడం..ఇతరత్రా కారణాల వల్ల ఆర్ధికంగా దెబ్బతిన్నారనీ..చెప్పుకొచ్చారు..వ్యక్తిగతంగా మంచివాడే అని చెప్పారు..


"ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం ఉంటుంది..నువ్వు వుండదల్చుకొన్న నలభై ఒక్క రోజులూ ఇక్కడే భోజనం చెయ్యి..జాగ్రత్తగా ఉండు.." అని చెప్పాను.."చాలా సంతోషమయ్యా..స్వామివారి సేవ చేసుకుంటాను.." అన్నాడు..ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకల్లా అతను స్వామివారి మందిరం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి చేసేవాడు..ఆ తరువాత మందిరం వెలుపల ఉన్న బావి వద్దకు వెళ్లి మళ్లీ స్నానం చేసి..నేరుగా స్వామివారి మందిరం లోకి వచ్చి..అర్చకస్వాములు ఇచ్చే ప్రభాత హారతి ని కళ్లకద్దుకొని..మంటపం లోకి వెళ్లి ఒక ప్రక్కగా కూర్చునేవాడు..మరొక గంట తరువాత..స్వామివారి మందిరం శుభ్రంగా చిమ్మి పెట్టేవాడు..మా సిబ్బంది కుంకుమను పొట్లాలు కడుతుంటే..అందులో సహాయం చేసేవాడు..మధ్యాహ్న హారతి కళ్లకద్దుకొని..అన్నదాన సత్రానికి వెళ్లి మితంగా భోజనం చేసి వచ్చేవాడు..ఎవరితోనూ అనవసరపు విషయాలు మాట్లాడేవాడు కాదు..


ఇరవై రోజులు గడిచిపోయాయి..ఒక ఆదివారం సాయంత్రం నేనూ మా సిబ్బందీ మందిరం తాలూకు లెక్కలు చూసుకుంటూ వున్నప్పుడు..నా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.."మీతో కొంచెం సేపు మాట్లాడాలి..ఇప్పుడు వీలవుతుందా..? " అన్నాడు..పది నిమిషాల వుండమన్నాను..మరో పదినిమిషాల తరువాత..ఇద్దరమూ మందిరం లో ఓ ప్రక్కగా కూర్చున్నాము.."ఇప్పుడు చెప్పు నీసమస్య.." అన్నాను.."అయ్యా..నేను ఇక్కడికి వచ్చేముందు చాలా బాధల్లో వున్నాను..మాది పెద్ద కుటుంబం..మా నాన్నకు ముగ్గురు ఆడపిల్లలు..నేనొక్కడినే మగ సంతానం..కొన్నాళ్ల క్రితం వరకూ బాగానే ఉన్నాము..వ్యవసాయం లో..ముఖ్యంగా పొగాకు సాగు చేసి దెబ్బతిన్నాము..అప్పుల పాలై పోయాము..ఆడపిల్లల్లో ఇద్దరికి వివాహం చేసాము..ఒక అమ్మాయికి చేయాలి..వరుసగా మూడేళ్లు నష్టాలు రావడం తో..దిక్కుతోచలేదు..మా బంధువుల ద్వారా ఈ స్వామివారి గురించి విని..ఇక్కడ దత్తదీక్ష తీసుకొన్న వారి వద్ద అనుభవాలు తెలుసుకొని..నాకు నేనే దీక్ష లో ఉండాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాను..మీరూ సహకారం ఇచ్చారు..దత్తదీక్ష నియమాలే పాటిస్తున్నాను..స్వామిని పూర్తిగా నమ్ముకున్నాను..నన్నూ నా కుటుంబాన్నీ ఒడ్డున పడేయమని రోజూ ప్రార్ధిస్తున్నాను..ఇంకొక్క ఇరవై రోజులు కూడా ఇంతే నిష్ఠతో ఉంటాను..ఒక సందేహం వచ్చి ఇప్పుడు మిమ్మల్ని పిలిచాను..మా చెల్లెలికి సంబంధం వచ్చిందని కబురు వచ్చింది..నేను వెళ్లి రావాలి..ఇలా దీక్ష లో వున్నాను కదా..మా ఊరు వెళ్లవచ్చా..?" అని అడిగాడు..ఇవే నియమాలు పాటిస్తూ..నీ పని చూసుకొని వచ్చేయి..అని చెప్పాను..స్వామివారి సమాధి కి నమస్కారం చేసుకొని..నాకు ధన్యవాదాలు తెలిపి..వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు..


మరో మూడురోజుల తరువాత తిరిగి వచ్చాడు..యథావిధిగా మందిరం వద్ద తన దీక్ష కొనసాగించాడు..నలభై రోజులు పూర్తి అయిన రోజున..అతని తల్లిదండ్రులు అక్కచెల్లెళ్ళు వాళ్ళ సంసారాల తో సహా అందరూ వచ్చారు..స్వామివారికి పొంగలి పెట్టుకొని..సమాధి దర్శనం చేసుకొని వెళ్లారు..రెండు మూడు నెలకోసారి మాధవరావు  స్వామివారి మందిరానికి రావడం మాత్రం మానలేదు..రెండేళ్లు తిరిగే సరికి..మాధవరావు స్వంత ట్రాక్టర్ లో తన కుటుంబం తో సహా స్వామివారి మందిరానికి వచ్చాడు.."ఇక్కడ నలభై రోజుల పాటు దీక్ష గా ఉన్నందుకు..స్వామివారు తనమీద కరుణించారనీ..ఏ పొగాకు సాగులో తాను నష్టపోయానో..అందులోనే మంచి లాభాలు వచ్చాయని..అప్పులు కూడా మొత్తం తీరిపోయాయనీ..మూడో అమ్మాయికి కూడా పెళ్లి చేసేసామనీ..సంతోషంగా చెప్పుకొచ్చాడు..ఇక నుంచీ ప్రతి సంవత్సరం అందరితో పాటు దత్తదీక్ష తీసుకుంటానని చెప్పాడు..అదే పాటిస్తున్నాడు..స్వామివారి అపార కరుణకు మాధవరావు నోచుకున్నాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)

9, ఫిబ్రవరి 2021, మంగళవారం

మూత్రపిండములలో రాళ్లు

 మూత్రపిండములలో రాళ్లు కరిగించు గొప్ప ఔషధ యోగములు  - 


 *  కానుగ గింజలలోని పప్పు మూడు గ్రాములు తీసుకుని పొడిచేసి 60 మిల్లీలీటర్ల ఆవుపాలలో కలిపి లోపలికి తీసుకొనుచుండిన మూత్రపిండాలలోని రాళ్లు పడిపోవును .


 *  యవాక్షరం , బెల్లం సమాన భాగాలుగా కలిపి రెండు గ్రాముల చొప్పున రోజుకొకసారి ఒక వారం నుంచి పదిరోజులపాటు తినిన రాళ్లు కరిగి పడిపోవును . దీనితో పాటు బూడిదగుమ్మడికాయ రసం కూడా వాడిన ఫలితం తొందరగా కనిపించును.


 *  వేపాకు నీడలో ఎండించి కాల్చి భస్మం చేసి పూటకు ఒకటిన్నర గ్రాము చొప్పున ఒకరోజు నిలువ ఉంచిన నీళ్లతో కలిపి తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాయి కరిగిపోవును . రెండుపూటలా తీసికొనవలెను .


 *  రణపాల ఆకు రసము 6 గ్రాములు కాచిన వెన్న 13 గ్రాములు కలిపి ప్రతినిత్యము తాగుచున్న రాళ్లు కరుగును.


 *  పల్లేరు చూర్ణం ఒక స్పూన్ , కొండపిండి చూర్ణం ఒక స్పూన్ ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాళ్లు నివారణ అగును.


 *  పొద్దుతిరుగుడు పువ్వు చెట్టు వేర్లు పొడి 25 గ్రాములు తీసుకుని ఒక లీటర్ తియ్యటి మజ్జిగతో కలిపి తీసుకొనుచున్న రాళ్లు కరుగును.


 *  పూటకు రెండు వెల్లుల్లి రేకల గుజ్జు తినుచున్న మూత్రాశయపు రాళ్లు కరుగును. అలా అప్పుడప్పుడు తినుచున్న రాళ్లు పుట్టవు .


  మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు  -


 తినవలసిన ఆహారపదార్దాలు  -


  పాతబియ్యపు అన్నం , యవలు , గోధుమలు , ఉలవలు , పెసలు , మజ్జిగ , ఆవునెయ్యి , ఆవుపాలు , పెసరకట్టు , ఉలవకట్టు , అల్లం , తియ్యని కల్లు , చక్కెర , ముదురు గుమ్మడికాయ , బూడిద గుమ్మడికాయ , పొట్లకాయ , కొండపిండికూర , పల్లేరుకూర , చిర్రికూర , పెరుగుతోటకూర , ఖర్జురము , వెదురుమొలకలు , కొబ్బరికాయ , తాటిముంజలు , నక్కదోసకాయ , మేకమాంసం .


 తినకూడని ఆహార పదార్ధాలు  -


    మలబద్ధకర ఆహారాలు , చద్ది అన్నం , బిరుసుఅన్నం , తాంబూలం , ఎక్కువ ఉప్పు గల ఆహారపదార్థాలు , ఎక్కువ నూనె , పిండివంటలు , నువ్వులపిండి , పులుసు , ఇంగువ , నువ్వులు , ఆవాలు , మినుములు , మామిడికాయ , వెల్లుల్లి మొదలగు వేడివస్తువులు , మలబద్దకాన్ని కలిగించు వస్తువులు , కోడిమాంసం , పందిమాంసం , చేపలు , మద్యం , మైథునం , అతిశ్రమ , మూత్రము , వీర్యము నిరోధము చేయరాదు . 


         పైన చెప్పిన ఆహారపదార్ధాలు పాటిస్తూ ఔషధాలను వాడగలరు .


  

         మరిన్ని సులభయోగాలు నా గ్రంథాల యందు ఇవ్వడం జరిగినది.

 

    గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ఈడబ్ల్యూఎస్

 ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు  పొందడానికి  రాష్ట్ర  ప్రభుత్వం జారీచేసే  #EWS_సర్టిఫికేట్  మీ స్థానిక  ఈసేవ / మీసేవ కేంద్రాల్లో  తీసుకోండి..


EWS  సర్టిఫికెట్  పొందడానికి  అర్హతలు..

************************************


1 ) కుటుంబ  వార్షిక  ఆదాయం  8 లక్షలు  లోపు  ఉండాలి...


2 ) కుటుంబాన్నికి  5  ఎకరాల  లోపు  భూమి  ఉండాలి..


3 )  గ్రామీణ  / నాన్ మున్సిపాలిటీ ఏరియాలో 200 గజాల కంటే ఎక్కువ ఇల్లు జాగా ఉండకూడదు...


4 ) మున్సిపాలిటీ ఏరియాలో 100 గజాల కంటే ఎక్కువ  ఇల్లు జాగా ఉండకూడదు...


5 ) పట్నం ప్రాంతాల్లో  1000 చదరపు అడుగుల  ఇల్లు అంతకంటే ఎక్కువ సైజు కలిగిన ఫ్లాట్  ఉండకూడదు..


EWS  అప్లికేషన్ ఫార్మ్  క్రింద గూగుల్   డ్రైవ్ లింక్ నుంచి డౌన్లోడ్  చేసుకోవచ్చు...


https://drive.google.com/file/d/1rLo7oyXKg8PkWmFS0IhHq0OZpG7-60k8/view?usp=drivesdk


కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10%  ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్లు విద్య,ఉద్యోగాల్లో  ఈ EWS  సర్టీఫికేట్ వున్న వారికి వర్తిస్తుంది కావున అందరు ఈ యొక్క సర్టీఫికేట్ పొందగలరు...


ఈ సమాచారం అందరికీ  షేర్  చేయగలరు

ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం

 ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం... కానీ


మాకు గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు. కార్పొరేట్ హాస్పిటల్ ముద్దు.


గవర్నమెంట్ టీవీ చానల్స్ డీడీ చూడము. ప్రైవేట్ చానల్స్ కార్తీకదీపం ముద్దు.


గవెర్ణమెంట్ BSNL సెల్ ల్యాండ్ లైన్ వాడం. ప్రైవేట్ జియో ఎయిర్టెల్ సంస్థల సెల్ వాడుతూ ప్రైవేటీకరణ వద్దు అని పోస్టులు పెడతాం.


ఏర్ ఇండియా విమానాలు ఎక్కం.ప్రైవేట్ ఇండిగో  విమానాలు అంటే ముద్దు.


ఆర్టీసీ బస్ లు మాకు వద్దు. ప్రైవేట్ రవాణా ముద్దు.


ప్రభుత్వ పోస్ట్ ఆఫీసు వద్దు. ప్రైవేట్ కొరియర్ ముద్దు.


ప్రభుత్వ స్కూళ్లు వద్దు. ప్రైవేట్ స్కూల్స్ ముద్దు.


అయినా ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం..

Forwarded as received