11, ఫిబ్రవరి 2021, గురువారం

కండు మహర్షి

 మన మహర్షులు- 17


కండు మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


కండుముని చిన్నప్పటి నుంచి గౌతమీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు.


 ఆయన ఆశ్రమం పూల చెట్లతో, మంచి మంచి రుచిగల పండ్లతో చక్కటి లతలతో ఎప్పుడూ వసంతమాసంలా ఉండేది. అక్కడ జంతువులన్నీ ఒకదానితో ఒకటి స్నేహంగా ఉండేవి.


కండు మహర్షి తపస్సు చాలా కఠినంగా ఉండేది. ఆయన వేసవికాలంలో నిప్పుల మధ్య కూర్చుని, శీతాకాలంలో చల్లటి నీళ్ళల్లో కూర్చుని తపస్సు చేశాడు. 


ఆయన తపస్సుకి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన తపస్సు గురించి విని ఇంత ధైర్యం, ఇంత నిష్ఠ, ఇంత నియమం ఎక్కడా, ఎప్పుడూ చూడలేదని మూడు లోకాల్లోనూ చెప్పుకునేవారు.


తన స్థానం ఎవరు తీసేసుకుంటారోనని ఇంద్రుడికి ఎప్పుడూ భయమే కదా! కండు మహర్షి తపస్సుకి భయపడి ప్లమోచన అనే పేరుగల అప్సరస ను వెళ్ళి కండు మహర్షి తపస్సుని భగ్నం చెయ్యమన్నాడు ఇంద్రుడు. ఆయన చెప్పినట్లు చెయ్యకపోతే శపిస్తాడని భయం కదా..! అక్కడికీ ప్లమోచన నాకన్న బాగా ఆడిపాడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్లని పంపించండి అంది. ఇంద్రుడు నువ్వే వెళ్ళు నీకు తోడుగా కామం, వసంతం

 చక్కటి చల్లగాలుల్ని పంపిస్తాను పని పూర్తిచేసుకుని రా! అని చెప్పాడు. ఇంకేం చేస్తుంది ప్లమోచన బయలుదేరి భూలోకానికి వచ్చింది ప్లమోచన ఆశ్రమంలో అడుగుపెట్టగానే వసంతం వచ్చేసింది. చెట్లన్నీ పువ్వులతో

నిండిపోయి కిందపడి నేలంతా పూలు పేర్చినట్లయ్యింది. మన్మథుడు కండు మహర్షి మీద బాణం వేశాడు. 


కండు మహర్షి కళ్ళు తెరిచి చూశాడు.

ఇంకేముంది తపస్సు మానేసి మాయలో పడిపోయాడు. కండు మహర్షి ప్లమోచనతో వందసంవత్సరాలు కలిసి ఉన్నాడు. చాలాసార్లు ప్లమోచన నేను దేవలోకం నుంచి వచ్చాను. .నన్ను పంపించెయ్యండి అని చెప్పింది. కాని కండు మహర్షి వినలేదు. కొంతకాలం పోయాక కండు మహర్షి యోగదృభష్టితో చూసి ఫ్లమోచనని నా తపస్సు నాశనం చేశావు, అయినా, నీ తప్పులేదు, నువ్వు ఇంద్రుడు పంపితే వచ్చావు కాబట్టి శపించకుండా వదిలేస్తున్నాను. వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో..అన్నాడు


కండు మహర్షి ప్రమోచనలకి కలిగిన పుత్రిక పేరు మారిష, ప్రచేతసుడు మారిషని పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి పుట్టినవాడు దక్షప్రజాపతి.


కండు మహర్షి ఇంద్రుడి మోసం తెలుసుకుని అక్కడి నుంచి పురుషోత్తమ క్షేత్రం వెళ్ళి అక్కడ మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు.


 ఇంతకుముందు కంటే కఠినమైన తపస్సు చేశాడు.


శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై కండు మహర్షిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు..


 కండు మహర్షి విష్ణుమూర్తిని అనేక విధాలుగా స్తోత్రం చేసి స్వామీ! ఈ సంసార సాగరం నుంచి తప్పించి పరమపదాన్ని చేరుకునేలా చెయ్యమని అడిగాడు.


 విష్ణుమూర్తి వరమిచ్చి అంతర్జానమయ్యాడు


కండు మహర్షికి 'కంథు మహర్షి' అని పేరు కూడా ఉంది. 


మంచి తపస్సంపన్నుడయినా మధ్యలో మాయలో పడి మళ్ళీ తన తప్పు తెలుసుకుని

 పశ్చాత్తాపంతో మహా ఉగ్రమైన తపస్సు చేసి శ్రీహరి చరణాల దగ్గరికి చేరుకుని దివ్యపదవిని

పొందాడు. 


అంటే ఏమిటన్నమాట... తెలియక తప్పు చేసినా తెలిశాక పశ్చాత్తాపపడి, అయ్యో తప్పుచేశానే అని బాధపడి, ఆ తప్పుని సరిదిద్దుకుని ఇంకెప్పుడూ తప్పులు చెయ్యకుండా అభివృద్ధిలోకి వెళ్ళడం చాలా గొప్పతనం..... 


శ్రీ రాముడు యుద్ధానంతరం అయోధ్యకు వచ్చాక ...

శ్రీ రామ దర్శనము చేసిన ఋషులలో అగస్త్య, వాల్మీకి ఋషులుతో పాటు .. ఈ కండు మహర్షి దక్షిణము నుంచి వచ్చాడని ఉత్తర రామాయణము చెబుతుంది. .


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: