9, జనవరి 2021, శనివారం

దారంతో కట్టిన పూలు

 దారంతో కట్టిన పూలు


చెన్నై నుండి ఒక భక్తుడు చాలా పూలు తెచ్చి శ్రీమఠంలో ఒక పెద్ద రాశిగా పోసాడు. అందులో చాలా రకాలైన పూలు ఉన్నాయి, గుబురుగా కట్టిన మల్లెదండలు, పరిమళం వెదజెల్లే చాలా రకాలైన రంగురంగు పూలతో కళాత్మకంగా తీర్చిదిద్దిన దండలు ఉన్నాయి. కాని, వాటిని శ్రీచంద్రమౌళీశ్వరునకు అలంకరించడానికి పనికిరావు. ఆ పూలదందలన్నీ దారంతో కట్టబడ్డాయి అరటి బెరడు దారంతో కాదు. శ్రీమఠంలో దారంతో కట్టిన మాలలను చంద్రమౌళీశ్వరునకు అలంకరించరు. ఆ భక్తుని నిరాశ మాటలలో చెప్పలనవి కాదు. అతను చాలా ప్రయాసతో ఆ పూలను తెచ్చాడు కాని ఒక చిన్న మల్లె దండ కూడా అలంకారానికి పనికిరాదు.


పరమాచార్యస్వామి వారు పూజ ముగించుకుని బయటకు వచ్చారు. వెళ్తూ బుట్టలలో ఉన్న పూలను చూసారు.


మహాస్వామి వారు పరిచారకులతో ”వీటిని ఎందుకు పూజకు తీసుకుని రాలేదు?’ అని అడిగారు.


”వాటన్నింటిని దారంతో కట్టారు” అని చెప్పారు.


వాటిని తెచ్చిన ఆ భక్తుడు అక్కడ నిలబడి ఉన్నాడు. తన అజ్ఞానానికి స్వామి వారు ఏమంటారో అని కొంచం ఆందోళనగా ఉన్నాడు. కాని మహాస్వామి వారు కరుణా సముద్రులు.


”దారంతో కట్టిన పూలు స్వామి అలంకరణకు పనికిరావు. కాని నాకు పనికివస్తాయి” అని అన్నారు.


అక్కడున్న భక్తులు ఆనందపడ్డారు. పరమాచార్య స్వామి వారు ఒక చెక్క పీఠంపైన కూర్చున్నారు. తెచ్చిన పూలను మాలలను స్వామి వారికి అలంకరించారు. అది చూడడానికి పూలంగి సేవ లాగా కనపడింది. ఆ దృశ్యాన్ని చూసి భక్తులు ఆశ్చర్యచకితులయ్యారు.


”సాక్షాత్ తిరుపతి వెంకటాచలపతి” అన్నాడొక భక్తుడు.


”సాక్షాత్ తిరుచెదూర్ మురుగన్” అన్నారు మరొకరు.


”సాక్షాత్ కంచి కామాక్షియే” అన్నారింకొకరు.


ఒక వేదాంతి పారవశ్యంతో అన్నాడు. “ఈ ప్రపంచం జగన్ మిథ్య అని చెప్పేవారందరూ ఒక్క క్షణం అలోచించండి. ఈ క్షణం వాస్తవం సత్యం. బ్రహ్మం సత్యం. దేవుడు ఉన్నాడు అన్నది నిజం (సగుణ బ్రహ్మం పరమ సత్యం). దేవుడు గుణాహితుడై పరిపూర్ణ గుణములచేత ప్రకాశించి ఉన్నాడు. పెరియవ... రూపహితుడైన దేవుడు. దైవం మానవ రూపంలో అన్నది నిజం (సగుణం ... సద్గుణం). గుణముల చేత ప్రకాశించువారే శ్రేష్టమైనవారు. పెరియవ సగుణబ్రహ్మం... బ్రహ్మానందం”


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

కామెంట్‌లు లేవు: