9, జనవరి 2021, శనివారం

మర్కటం - మాటలు

 మర్కటం - మాటలు


వేసవి కాలంలోని ఒక సాయింత్రం. పరమాచార్య స్వామివారు మేనాలో కూర్చుని భక్తులకు దర్శనం ఇస్తున్నారు. స్వామివారి దర్శనానికి చాలామంది వచ్చారు. భక్తులు సమర్పించిన పళ్ళబుట్టలు, ఎండుద్రాక్ష, కలకండ, తేనె సీసాలు మొదలైనవన్నీ మేనా ముందు నేలపైన ఉన్నాయి. 


హఠాత్తుగా కోతుల దండు ఒకటి దాడికి దిగింది. పళ్ళని తిని మొత్తం చిందరవందర చేసి తేనెసీసాలను తోసి కిష్కింద చేస్తున్నాయి. అవి మహాస్వామి వద్దకు వెళ్ళి వారికి హాని చేస్తాయి అని శిష్యులు భయపడ్డారు. 


కాని మహాస్వామివారి ముఖపద్మంలో రేఖామాత్రమైనా విరక్తి లేదు. వాటిని ఏమీ చెయ్యవద్దని చేతి సైగలద్వారా ఆజ్ఞాపించారు. స్వామివారిని కాపాడుకోవాలని చేతులలో కర్రలు పట్టుకుని వస్తున్నవారల్లా ఆ కర్రల్లాగే స్థాణువులై నిలబడిపోయారు. 


కొద్దిసేపటి తరువాత ఆ కోతులన్నీ వచ్చిన పని ముగించుకుని రామకార్యార్థమై వెళ్ళిపోయాయి. అవి వెళ్ళగానే స్వామివారు భక్తులకి ఒక సంఘటనను చెప్పారు. 


తంజావూరు జిల్లాలో ఒక గ్రామంలోని ప్రజలు ఈ కోతుల బాధ భరించలేకపోయేవారు. అనుకోకుండా దొరికిన ఒక కోతిని ఒకతను కర్రతో కొట్టాడు. దానికి తగిలిన దెబ్బలవల్ల అది కొన్ని రోజులకి మరణించింది. తరువాత తనకి కలిగిన ఆడపిల్లకి మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. ఆ పిల్లకి వివాహం చెయ్యవలసిన వయసు వచ్చింది. అతను మహాస్వామివారి వద్దకు వచ్చి అతను చేసిన పాపాన్ని చెప్పుకుని బాధపడ్డాడు.


“మట్టితో కోతిబొమ్మను తయారుచేసి మీ ఊరి గ్రామదేవత గుళ్ళో ఇవ్వు. మనఃస్పూర్తిగా ఒప్పుకున్నవాడికే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చెయ్యి” అని చెప్పారు. స్వామివారు చెప్పినట్లే జరిగింది. తరువాత ఆ అమ్మాయికి చక్కగా మాట్లాడగలిగే పిల్లలు పుట్టారు.


కోతులను ఎప్పుడు కొట్టరాదు. వాటి మీద జాలి చూపించాలి. అవి రామణ్ణి సేవించుకున్న కోతుల పరంపరలో నుండి వచ్చాయి. అవి మనకు ఇబ్బంది కలిగించినా ‘ఆంజనేయుడు’ అని తలచి వాటిని వదిలిపెట్టాలి.


ఈ కథనంతా విని భక్తులు కరిగిపోయారు. పరమాచార్య స్వామివారే బోధించినందుకు ఆనందపడ్డారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

కామెంట్‌లు లేవు: