25, మార్చి 2025, మంగళవారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఈ శ్లోకంలో పార్వతీ పరమేశ్వరులను మయూరీ మయూరములుగా  నిరూపించి శంకరులు ప్రార్థించారు.*


*శ్లోకము - 54*


*సంధ్యా ఘర్మ దినాత్యయో హరికరాఘాత ప్రభూతానక*

            

*ధ్వానో వారిద గర్జితం దివిషదాం దృష్ఠిచ్ఛటా చంచలా*

            

*భక్తానాం పరితోష బాష్ప వితతిః వృష్టిర్మయూరీ  శివా*

            

*యస్మి న్నుజ్జ్వల  తాండవం  విజయతే  తం నీలకంఠం భజే !!*


*పదవిభాగం :~*


*సంధ్యా  = సాయంకాలము*

*ఘర్మ దినాత్యయః = వర్షారంభకాలముగను*

*హరికరాఘాత = విష్ణువు యొక్క హస్తముల వాయింపు చేత*

*ప్రభూత ఆనక ధ్వానః  = పుట్టిన మద్దెల యొక్క ధ్వని*

*వారిద గర్జితం = ఉరుముగను*

*దివిషదాం దృష్టిచ్ఛటా  = దేవతల యొక్క చూపులో పరంపర*

*చంచలా = మెరుపుగను*

*భక్తానాం పరితోష బాష్ప వితతిః = భక్తుల యొక్క ఆనందాశ్రుధార*

*వృష్టిః = వర్షముగను*

*మయూరీ = ఆడనెమలిఖను*

*శివా = పార్వతీదేవి*

*యస్మిన్ = ఏ నీలకంఠుడను నెమలియందు*

*ఉజ్జ్వల = ప్రకాశమానమైన*

*తాండవం విజయతే = తాండవమను నృత్యము సర్వోత్కృష్టముగా ఉన్నదో*

*తం నీలకంఠం భజే = ఆ శివుని కొలచుచున్నాను.*


*తాత్పర్యము :~*


*మహేశ్వరా ! సంధ్యాకాలమే, వర్షారంభ సమయము. విష్ణువు సంతోషంతో వాయించే మద్దెల నాదమే, ఉరుములు. దేవతలందరూ ఆనందంతో ఆశ్చర్యంతో ఆటూ ఇటూ తిప్పుకుంటూ చూసే చూపులే మెరుపులు. భక్తులు ఆనందంతో వెలువరించే బాష్పాంబువులే, వర్షం.   అమ్మవారు మయూరి, ఈ పరిస్థితులలో ఆనంద తాండవం చేసే నెమలి వంటి శివుని భజిస్తాను.*


*గమనిక :~*


*నెమలి వర్షాకాలం ప్రారంభం కాగానే ఆడు నెమలితో కలసి నృత్యం చేస్తుంది. శివుడు సంధ్యా కాలంలో పార్వతితో కలసి నాట్యం చేస్తాడు.( అలంకారం = రూపకం ).*


*ఈశ్వరుణ్ణి ప్రదోషకాలంలో  మనం ధ్యానించాలని శంకరుల వారి అభిప్రాయంగా గ్రహించాలి.*


*వివరణ:~*


*స్కాందపురాణములో దేవతలు ప్రదోష కాలంలో ఈశ్వరుని సేవిస్తారని ఇలా తెలిపారు.*


*కైలాస పర్వతభవనంలో  ముల్లోకాలకూ తల్లియైన పార్వతిని సువర్ణ పీఠములో ఉంచి, ఈశ్వరుడు నాట్యం చేయాలని కోరుకుంటాడు. ప్రదోష కాలంలో దేవతలు ఈశ్వరుని సేవిస్తారు.*


*శివుడు నృత్యం చేసే సమయంలో సరస్వతీ దేవి వీణను వాయిస్తుంది. ఇంద్రుడు వేణునాదం వాయిస్తాడు. బ్రహ్మ తాళం వాయిస్తాడు. లక్ష్మీదేవి పాట పాడుతుంది. విష్ణుమూర్తి మద్దెల వాయిస్తాడు. దేవతలంతా చుట్టూ నిలచి ఆ ప్రదోష సమయంలో పార్వతీ పతియైన ఈశ్వరుని సేవిస్తూ ఉంటారు.*


*పైన పేర్కొన్న విధంగా ఈశ్వరుని ప్రదోషకాలంలో సర్వదేవతలూ పూజిస్తారని తెలుస్తుంది. మనం కూడా సంధ్యా సమయంలో ఈశ్వర స్తోత్రం చేయాలని శంకరులు ఈ శ్లోకము ద్వారా సూచించారు.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

కామెంట్‌లు లేవు: