15, ఫిబ్రవరి 2021, సోమవారం

చివరకు మిగిలేది

 *చివరకు మిగిలేది ఏది*

-------------------------------------

 ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 


దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.


మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!


దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.


మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను


దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.


మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?


దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి


మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?


దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి


మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!


దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 


మనిషి: నా స్నేహితులున్నారా అందులో?


దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే


మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?


దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు


మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!


దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.


మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?


దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.


మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.


*మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు* అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. *బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు*.


మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?


దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.

 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.

అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 

పశ్చాతాపులను క్షమించాలి. 

 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.🚩🙏🏻

14, ఫిబ్రవరి 2021, ఆదివారం

మాఘ పురాణం*

 🚩 _*మాఘ పురాణం*_🚩

 🚩 _*3 వ అధ్యాయము*_🚩


       *ఆదివారం*

*ఫిబ్రవరి 14, 2021*


🕉🌞🕉🌞🕉🌞🕉🌞


 _*గురుపుత్రికాకథ*_


🕉️☘☘☘☘☘☘🕉️


మంగళదాయినీ! సర్వమంగళా! మాఘ మాసస్నాన ప్రభావముచే, పూర్వమొక బ్రాహ్మణపుత్రిక పాపవిముక్తయై, తన భర్తతో, హరిసాన్నిధ్యమునందినది. అని శివుడు, పార్వతీ దేవితో, పలికెను. అప్పుడు పార్వతీదేవి, "స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు?ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానమున పాపవిముక్తి నందిన విధానమేమి?  వివరముగ చెప్పగోరుచున్నాననగా, శివుడిట్లుపలికెను. దేవి! వినుము. పూర్వము, సౌరాష్ట్రదేశమున, బృందారకమనే గ్రామంలో, సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్రపండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు, గురు సేవచేస్తూ, విద్యాభ్యాసం చేస్తూవుండేవాళ్లు. ఆ సుదేవునికి, సర్వాంగసుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో, ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను, ఎవరికిచ్చి వివాహం చేయగలనని, అతడు విచారిస్తూవుండేవాడు.


           ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు, సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం, గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రికకూడా, సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును, చాలాదూరముపోయి, ఆ అరణ్యములో, ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువుగట్టున, యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది, పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదల రొద, అని అనేకవర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము, మొదలైనవానిచే, ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలు గుంపులు కట్టి, మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్చినమాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము, ఒక ఏకాంతమందిరములా వుందిl.


గురుపుత్రిక ఆ చెరువులోని నీరుత్రాగి, అచట వృక్షములకున్న పండ్లను తిని, ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది. ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీప్రదేశంలో, నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ వనము, నీకును నాకును నచ్చినది. మన మిద్ధరమును పడుచువారము, మన కలయిక, సుఖప్రదమగును. ఆలసించక,నావద్దకు రమ్ము, నా శరీరము, దూదికంటే మెత్తగానున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము. నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము, రమ్ము రమ్మని"పిలిచెను. సుమిత్రుడు "మంచిదానా! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు. మనము సోదరీసోదరులము, నీవు మన్మధ పరవశురాలవై, ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము, చిరకాలము నరకవాసము చేయవలసియుండును. కావున యింటికి పోదము  రమ్ము, గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో, నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము" అని పలికెను.


 గురుపుత్రిక, ఆ మాటలను విని," ఓయీ! కన్యారత్నము, సువర్ణము. విద్యాదేవత, అమృతము, స్వయముగ చెంతకు చేరినపుడు, వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక, సుఖమునందక, నేనింటికిరాను. నేనిచటనే, నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి, నేను రానిచో, మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి, దీని ఫలితము అనుభవింపుము" అని నిష్టురముగ, మన్మధావేశముతో, మాటలాడెను. సుమిత్రుడును యేమిచేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు, గురుపుత్రిక కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, ఎగురుటాకులతో, మన్మధశయ్యను తీర్చుకొని, మనోహరమైన ఆ వాతావరణములో, యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత, సమిధలు మున్నగువానిని దీసికొని, గ్రామమునకు బయలుదేరిరి. గురువు, శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి," నీవు చాల అలసినట్లున్నావు, మధురాహారమును తిని, విశ్రాంతినందుమని లోనపురాణం పెను. ఆమెయు, అట్లేయనిలోనికెగెనుv.


  తండ్రియామెను, కాశ్మీరదేశవాసియగు బ్రాహ్మణునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు, ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి, నేలపై బడి, దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక, సుదేవుడును, మిగుల దుఃఖించెను. అయ్యో! సుఖములనందవలసిన వయసులోనే, బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన, ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా, అని పలువిధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు, వాని భార్య, దుఃఖించుచుండగా, దృడవ్రతుడను యోగి, ఆ ప్రాంతమున దిరుగుచు, సుదేవుని, రోదనధ్వనిని విని, వాని వద్దకు వచ్చి, ''జ్ఞానస్వరూపా! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు, తన దుఃఖకారణమును చెప్పి, మరల దుఃఖించెను. యోగి సుదేవుడను, భార్యపుత్రికలను చూచి, క్షణకాలము ధ్యానయోగమునంది, యిట్లు పలికెను. "ఓయీ! వినుము నీ కుమార్తే9 పూర్వజన్మలో, క్షత్రియకులమున జన్మించినది. వ్యభిచారిణియై, చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి, యౌవన వతి యగు ఆమె, తన జారుల మాటలను విని, తన భర్తను వధించెను. భర్తను వధించి, భయపడి, శోకించి, ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతిహత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ దోషమువలన, ఈమెకీ జన్మమున, యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె, పవిత్రమైన నీ వంశముననెట్లు జన్మించినదాయని, నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు, వినుము. ఈమె తన పూర్వజన్మలో, మాఘమాసమున, సరస్వతీ నదీతీరమున, గౌరీవ్రతము నాచరించువారితో కలసి, వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా, నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున, నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును, స్వేరిణియై, నీ శిష్యులతో, అధర్మముగ, రమించెను. ఈ దోషమువలన, నీమె తమ కర్మఫలములను, యిట్లననుభవించుచున్నది. చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా!l"


సుదేవుడు, యోగిమాటలను విని, చెవులు మూసుకొని, తన కుమార్తె, పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుటను,ఈ జన్మలో కన్యయై సోదరుతుల్యుడైన తన శిష్యునితో రమించుటను, విని, మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, ''తండ్రీ! నా కుమార్తే చేసిన పాపము, యేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును? దయయుంచి చెప్పుడని, పరిపరివిధముల ప్రార్థించెను. అప్పుడా యోగి, ''ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములు, పోవుటకు, ఆమె మాంగల్యము    నిలుచునట్లును, చేయుటకొక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము. మాఘమాసమున, ప్రాతఃస్నానముచేసి, ఆ నదీతీరమునగాని, సరస్సు తీరమున,  యిసుకతో, గౌరీదేవిని జేసి, షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు, దక్షిణతో, నా గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగ, నీమముచే, ప్రతిదినముo చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములు, నశించును. మాఘశుద్ద తదియనాడు, రెండు క్రొత్తచేటలను తెచ్చి, వానిలో చీర, రవికలగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపుకుంకుమ, మున్నగు సువాసిని అలంకారములనుంచి, దక్షిణ తాంబూలములతో, వాయనము నుంచి, సువాసినీ పూజచేసి, ముత్తైదువలకిచ్చి, ఏడుమార్లు, ప్రదక్షిణ నమస్కారముల నాచరింపజేయుము. ఆ సువాసినికి, షడ్రసోపేత భోజనము పెట్టి, గౌరవింపవలయును. మాఘమాసమున, ప్రాతఃకాలస్నానముల చేతను, పైన చెప్పిన వ్రతాచరణము చేతను, ఈమెకు పాప  క్షయము కలుగును. భర్త పునర్జీవితుడై, ఈమె 

మాంగల్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు, విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి, గౌరివ్రతమాచరిoచిన సువాసిని, తన మాంగళ్యమును నిలుపుకొని, చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు, మాఘస్నానము చేసినచో, వారెట్టి వారైనను, 

హరియనుహ్రహమునొంది, చిరకాలము సుఖించి, పుణ్యలోకముల నందుదురు. అని, యోగి వివరించి, తన దారినబోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి, తన కుమార్తెచే, మాఘస్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును, భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత, సుదేవుని కుమార్తె పాపములుపోయి, ఆమె భర్త, పునర్జీవితుడయ్యెను. ఆమెయు, చిరకాలము, తన భర్తతో సుఖించి, తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి, దేహాంతమున, వైకుంఠమును చేరెను. కావున, మాఘమున, ప్రాతఃకాల స్నానము, నదిలోగాని, సరస్సునగాని, కాలువలోగాని చేసి, తీరమున శ్రీహరి నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను, యిహమున, సర్వసుఖములనంది, పరమున, వైకుంఠవాసులగుదురు సుమా, అని, శివుడు, పార్వతీదేవికి, మాఘస్నాన మహిమను వివరించెను.


🌹🌷🌼🛕🔔🌼🌷🌹


    🙏🙏 *సేకరణ*🙏🙏

మాఘ పురాణం

 _*🚩మాఘ పురాణం🚩*_ 

  🚩 *_2 వ అధ్యాయము_*🚩


       *శనివారం*

*ఫిబ్రవరి 13, 2021*


🕉🌞🕉🌞🕉🌞🕉🌞


*శివుడు పార్వతీ దేవికి మాఘమాస మహిమలు చెప్పుట*


🕉️☘☘☘☘☘☘🕉️


వశిష్ఠులవారు  మార్కండేయ వృత్తాంతమును , శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత , యింకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరల యిట్లు ప్రశ్నించెను. *" మహాముని ! ఈ మాఘమాస మహత్యమును యింకను వినవలయుననెడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవిండని"* ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును , నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచూ , నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందారవృక్ష సమీపమున యేకాంతముగ కూర్చునివున్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్తపాదములకు నమస్కరించి , *'స్వామీ మీవలన ననేక పుణ్య విషయములను తెలిసికొంటిని , కానీ , ప్రయాగక్షేత్ర మహత్యమును , మాఘమాస మహత్యమును వినవలెననడి కోరికవున్నది. కాన , ఈ యేకాంత సమయమందా క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నదాననని'* వేడుకొనగా , పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను , దేవి ! నీ యిష్టమును తప్పక తీర్చెదను శ్రద్దగా వినుము.


సూర్యుడు మకరరాశియందువుండగా మాఘమాసమందు ప్రాతఃకాలమున ఈ మనుజుడు నదిలో స్నానము చేయునో ఆతడు సకలపాతకములనుండి విముక్తుడగుటయే కాక , జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకరరాశి యందుండగా , ప్రయాగ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠప్రాప్తి కలుగును. అంతియేకాదు జీవనది వున్నను , లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోటకాని , తటాకమందుకాని మాఘమాసములో చేసిన ప్రాతఃకాల స్నానము గొప్పఫలము నిచ్చుటయేగాక సమస్తపాపములను విడిపోవును. రెండవరోజు స్నానముజేసిన విష్ణులోకమునకు పోవును. మూడవనాటి స్నానమువలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన యెడల ఆ మనుజునకు మరుజన్మ అనునది వుండదు. దేవీ ! మాఘమాస స్నానఫలం యింతింతయని చెప్పజాలను మాఘమాసము నందు భాస్కరుడు మకరరాశి యందుండగ యేది అందుబాటులో వున్న అనగా నదికాని , చెరువు కాని , నుయ్యి కాని , కాలువకాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతఃకాలమున స్నానమాచరించి , సూర్యభగవానునకు నమస్కరించి , తనకు తోచిన దానధర్మములుచేసి శివాలయమునగాని విష్ణ్వాలయమునగాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము యింతింతగాదు.


ఏ మానవుడైననూ తన శరీరములో శక్తిలేక , కడకు బావియందైననూ స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ ఆ కష్టములు మేఘములవలె విడిపోయి విముక్తుడగును. ఎవరైననూ తెలిసిగాని తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకరరాశియందుండగా నదీస్నానమాచరించిన యెడల అతనికి అశ్వమేధయాగము చేసినంతఫలము దక్కును. అదియునుగాక , మాఘమాస మంతయు ప్రాతఃకాలమున నదిలో స్నానముచేసి , శ్రీమన్నారాయణుని పూజించి , సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి , విష్ణు మందిరమునగాని , శివాలయమున గాని దీపము వెలిగించి , ప్రసాదము సేవించిన యెడల అతనికి తప్పక విష్ణులోకప్రాప్తి కలుగుటయేకాక , పునర్జన్మ యెన్నటికిని కలుగదు. ఇటుల ఒక్క పురుషులే గాక , స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోరపాపములుచేసి మరణాంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటె , తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీస్నానము చేసి , దానధర్మాది పుణ్యముల  నాచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరముగదా ! ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతీ !   యే మానవుడు మాఘమాసమును తృణీ కరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించెదను సావదానముగా ఆలకింపుము.


నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతఃకాలమున నదీస్నానముగాని , జపముగాని , విష్ణుపూజగాని , యధాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడద్రోయబడును. అగ్నిలో కాల్చబడును , ఱంపములచేత , ఖడ్గములచేత నరకబడును. సలసలకాగు తైలములో పడవేయబడును. భయంకరులగు యమ కింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి , కాలకృత్యములను తీర్చుకొని , నదికిపోయి స్నానము చేసి , సూర్యనమస్కారము విష్ణుపూజా చేసి తన భర్త పాదములకు నమస్కరించి , అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ అయిదవతనముతో వర్ధిల్లి యిహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు యేస్త్రీ అటులచేయదో , అట్టి స్త్రీముఖము చూచినంతనే సకలదోషములూ కలుగుటయేగాక ఆమె పంది , కుక్క జన్మలనెత్తి హీనస్థితినొందురు. మాఘమాసస్నానమునకు వయఃపరిమితిలేదు , బాలుడైనను , యువకుడైనను , వృద్ధుడైనను , స్త్రీయైనను , బాలికయైననూ , జవ్వనియైననూ , ఈ కులమువారైననూ కూడా మాఘస్నాన మాచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్ఠతో వుండిన కోటియజ్ఞములు చేసినంత పుణ్యముకలుగును. యిది అందరికిని శ్రేయోదాయకమైనది.


పార్వతీ ! దుష్ట సహవాసము చేసేవారు , బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు , సువర్ణమును దొంగలించినవారు , గురు భార్యతో సుఖించినవారు , మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు , జీవహింసచేయువారు మాఘమాసములో నదీస్నానము చేసి విష్ణువును పూజించినయెడల వారి సమస్తపాపములు నశించుటయేగాక , జన్మాంతరమున వైకుంఠప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైనవాడును కించిత్ మాత్రమైననూ దానధర్మములు చేయనివాడునూ , యితరులను వంచించె వారివద్ద ధనమును హరించినవాడును అసత్యమాడి ప్రొద్ధుగడుపువాడును , మిత్రద్రోహియు , హత్యలు చేయువాడును , బ్రాహ్మణులను హింసించువాడును , సదావ్యభిచార గృహములలో తిరిగి , తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి , గురుద్రోహి , దైవభక్తి లేనివాడును , దైవభక్తులను యెగతాళిచేయువాడును , గర్వముకలవాడై తానే గొప్పవాడినని


అహంభావముతో దైవకార్యములనూ ధర్మకార్యములనూ చెడగొట్టుచూ దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును , ఇండ్లను తగలబెట్టువాడును , చెడుపనులకు ప్రేరేపించువాడును యీ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము యెట్టి ప్రాయశ్చిత్తములూ జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవీ ! ఇంకనూ దీని మహత్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు , క్రూరకర్మములు ఆచరించువారు , సిగ్గువిడిచి తిరుగువాడు , బ్రాహ్మణదూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన యెడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతఃకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును.   యే మానవుడు భక్తిశ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతమూ స్నానములు చేసెదనని సంకల్పించునో , అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి , యెటువంటి దోషములూలేక పరిశుద్ధుడగును , అతడు పరమపదము జేరుటకు అర్హుడగును. శాంభవీ ! పండ్రెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకలదేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు , అన్ని పర్వతములలో మేరుపర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములో మాఘమాసము శ్రేష్ఠమైనదగుటచేత ఆ మాసమంతా ఆచరించెడి   యే స్వల్పకార్యమైననూ గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగానున్నదని స్నానముచేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు , జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్ళ్లోలో స్నానము చేయలేరు. కాన , అట్టివారికి యెండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలికాగనిచ్చి తరువాత స్నానము చేయించినయెడల ఆ స్నానఫలమును పొందగలరు. చలి కాగినవారు స్నానము చేసి శ్రీవారినిదర్శించిన పిదప అగ్నిదేవునికి , సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘ మాసములో శుచియైన ఒక బీదబ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల శుభఫలితము కలుగును.


ఈ విధముగా ఆచరించెడి వారినిజూచి , యే మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహా పాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులగు తండ్రిని , తల్లిని , భార్యను లేక కుటుంబసభ్యులందరినీ మాఘమాస  స్నానమాచరించునటుల   యే మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని , వైశ్యునికికాని , క్షత్రియునికి కాని , శూద్రునికికాని మాఘమాసస్నానమును చేయుమని చెప్పినయెడలవారు పుణ్యలోకమునకు పోవుటకుయే అడ్డంకులునూ ఉండవు. మాఘమాసస్నానములు చేసినవారిని గాని , చేయలేని వారినికాని , ప్రోత్సహించువారలనుకాని జూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగటయేగాక , ఆయుఃక్షీణము , వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడచుటకు ఓపికలేనివారు మాఘమాసములో కాళ్ళుచేతులు , ముఖము కడుగుకొని ,  తలపై నీళ్ళుజల్లుకొని , సూర్యనమస్కారములు చేసి , మాఘపురాణమును చదువుటగాని , వినిటగాని చేసిన యేడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పోందుదురు. పాపము , దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానముకన్న మరొక పుణ్యకార్య మేదియును లేదు. మాఘమాసము వలన కలుగు ఫలిత మెటువంటిదనగా , వంద అశ్వ మేధయాగములు చేసి , బ్రాహ్మణులకు యెక్కువ దక్షిణలిచ్చిన యెంతటి పుణ్య ఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్య ఫలము కలుగును. బ్రాహ్మణ హత్య , పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయును కడు నిష్ఠతోనున్న యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ ! మాఘమాస స్నానము వలన యెట్టి ఫలితము కలుగునో వివరించితిని గాన , నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికినీ శుభప్రదము.


🌹🌷🌼🛕🔔🌼🌷🌹


  🙏🙏 *సేకరణ*🙏🙏

పెద్దాయన మాటలు :

 ఒక పెద్దాయన మాటలు :.....


నాకు77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతోంది. నాకు 4గురు కొడుకులు.. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం...ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేనూ ఒకడిని...ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి..ముడతలుపడ్డ తన వేళ్ళతో రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన.

చిన్నకోడలి దగ్గరికి పోవడానికి ఇంక కొన్ని గంటలే సమయం ఉంది.పోయిన దీపావళికి 2వ కొడుకు పంచలు తీసిచ్చాడు.. అవి బాగా పాతబడిపోయాయి.పెద్దకొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అయింది.కొడుక్కి చెపితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను.కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు.

ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది.

చిన్నకోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది.అందరూ ఆఫీస్ కు వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి..నల్లగా ఉంటే చిన్నకొడలు కొప్పడుతుంది.


4 రోజులు గడిచిపోయాయి...హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు..కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు...బస్ దిగగానే నా చిన్నకొడలు నాకోసం స్కూటీ తెచ్చింది...నన్ను చూడగానే ' అద్దాలు ఏమయ్యాయి మామయ్యా?' అని అడిగింది...బ్యాగ్ లో ఉన్నాయి పదమ్మా! అన్నాను.తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది...పగిలిపోయాయని చెప్పాను.కోపంగా నా వంక చూసింది. తలవంచుకున్నాను.

'సరే!జాగ్రత్తగా నా వెనుక కూర్చోండి' అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది...నాకు ఇష్టమైన బాదంపాలు త్రాగించి,అద్దాల షాపు దగ్గరికి వెళ్లి అద్దాలు ఆర్దరు చేసి ఇంటికి బయలుదేరింది కోడలు.


దారి మధ్యలో ఇలా అంది.

'అందుకే మామయ్యా!మిమ్మలి ఎక్కడికీ పంపడం నాకు ఇష్టముండదు...ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజినా నీ కొడుకు..ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు. మిమ్మల్నే అనాలి'


పోనిలేమ్మా!ఎవ్వరినీ ఏమి అనకు.'అన్నాను... స్కూటీలో వెళ్తుండగా ' మామయ్యా!జాగ్రత్తగా కూర్చోండి. కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి.' అంది కోడలు.


అన్నదే తడవుగా ఆమె భుజంపై తల వాల్చుకున్నాను.

కుతురిలా చూసుకునే కోడలు భుజంపై తల వాల్చగానే కళ్ళల్లో కన్నీరు...ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది...ఇలా అడిగింది...

' నిజం చెప్పండి ! మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా!'

'లేదమ్మా! వాషింగ్ మెషిన్ లో వేస్తారు..'అన్నాను.

అబద్ధం చెప్పేసి తలవంచుకున్నాను...నన్ను ఒక టీచరులా సీరియస్ గా చూసింది..తలవంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది...

'నా బాధ మీకు అర్థం అవుతోందా.. మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్నవారి ఇంటికి మీరు ఎందుకు వెళ్లడం.ఇక్కడ నేను మీ చిన్నకొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్యా!' అంది.

కోడలి రెండు చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను...

'నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానమ్మా!మరు జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది తల్లీ!' ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగితా అన్ని నెలలకు సరిపోతుంది...నీ రుణం ఎలా తీర్చుకోను తల్లీ!

ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు... కాదు కాదు నా కూతురు...నాకు మరొక దైవం


పెద్దవారు పసిపిల్లలతో సమానం.. వారికి ఆకలి వేసి

అడిగేదాకా చూడకండి...పిల్లలకు ఆకలివేస్తుందని తెలుసుకుని అన్నం పెడతాం కదా !వీరుకూడా అంతే!

పెద్దవారు మనకు మార్గదర్శనం.....🙏🙏


ఇలా కూతురు లా చూసుకునే కోడళ్ళు ఉన్నంత కాలం వృధాశ్రామాలతో పనివుండదు.👍👍🙏🙏🙏

దధీచి మహర్షి

 మన మహర్షులు - 22


దధీచి మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷



భారతీయ సంప్రదాయంలో త్యాగానికీ, దానానికీ ఓ గొప్ప స్థానం ఉంది. 


త్యాగం, దానం అనే వాటిని అందరూ అలవాటు చేసుకోవాలని, అలాంటి వారు సమాజాన్ని ఉద్ధరించటం కోసం, లోకకల్యాణం కోసం జీవితాన్ని గడిపే మహనీయులుగా ఉంటారని మన రుషుల చరిత్రలు వివరిస్తున్నాయి. 


గొప్ప గుణాలైన త్యాగం, దానం అనే వాటిని అలవరచుకొని నిస్వార్థంగా తన ప్రాణాలను లోకకల్యాణం కోసం అర్పించిన కారణంగానే దధీచి  మహర్షి పేరు ఈ నాటికీ నిలిచి ఉంది.


 ఆ మహర్షికి సంబంధించిన కథ ఇది.



దధీచి మహర్షి తండ్రి, చ్యవన మహర్షి తల్లి సుకన్య, దధీచి చిన్నతనం నుంచీ సరస్వతీ నది దగ్గర ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు.


 

ఒకనాడు ఇంద్రుడు  ఉత్తమ

శాస్త్రాలన్నీ దధీచికి చెప్పాడు. ఇవి ఎవరికైనా చెప్తే నీ తల నరికేస్తానని కూడ చెప్పాడు.


ఇది తెలుసుకుని అశ్వినీ దేవతలు దధీచిని కలిసి ఇంద్రుడు చెప్పిన శాస్త్రాలు వాళ్ళకి చెప్పమని అడిగారు. చెప్తే ఇంద్రుడు తలనరికేస్తానన్నాడు కదా..  నీకు ఏమీ కాకుండా మేం చేస్తామని చెప్పి అశ్వినీ దేవతలు మొదట దధీచి తల తీసి వేరే చోట దాచి అతడికి గుఱ్ఱం తల అతికి శాస్త్రాలు నేర్చుకున్నారు.


ఇంద్రుడు వచ్చి దధీచి తల నరికేశాడు. అశ్వినీ దేవతలు వాళ్ళు దాచిన దధీచి తల మళ్ళీ అతికించారు. దధీచి బ్రతికిపోయాడు.


ఇలా తన శ్రేయస్సు గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ఎదుటివారి కోరికలను ఎప్పుడూ తీర్చేవాడు దధీచి.



ఇలా ఉండగా ఒకసారి దక్షప్రజాపతి యజ్ఞం చెయ్యాలని అనుకుని దధీచిని శిష్యులతో కలిసి రమ్మని పిలిచాడు. దధీచి శిష్యుల్ని తీసుకుని వెళ్ళాడు. దక్షప్రజాపతి శివుణ్ణి, శివభక్తుల్ని పిలవలేదు. 


  దధీచి దక్షప్రజాపతిని నీకీ దుర్భుద్ధి ఎలా పుట్టింది?

దేవాదిదేవుడైన శివుడు లేకుండా యజ్ఞం ఎలా చేస్తావు? అని శివుణ్ణి స్తోత్రం చెయ్యడం మొదలుపెట్టాడు.


 దక్షప్రజాపతి ఇక్కడ శివుణ్ణి తలిచే వాళ్ళుంటే వెళ్ళిపొండన్నాడు. 


దధీచి శిష్యుల్తో సహాలేచి నేనెన్ని చెప్పినా నువ్వు లెక్క చేయడం లేదు. నీ యజ్ఞం సర్వనాశనమయిపోతుంది. నువ్వు చేస్తున్న యజ్ఞానికి వచ్చిన వాళ్ళు కూడా నాశనమయిపోతారని శపించాడు. 


తర్వాత వీరభద్రుడి వల్ల దక్షయజ్ఞం నాశనమయిపోయింది.


రాక్షసులు దేవతల మీద విజృంభించి యుద్ధం చేస్తున్నారు. దేవతలు వాళ్ళ బాధపడలేక శస్త్రాస్త్రాలన్నీ దధీచికి ఇచ్చి దాచమని చెప్పి ఎక్కడికో పారిపోయారు. దధీచి సరే అని ఎక్కువకాలం దాచలేక  భస్మం చేసి మంత్రజలం తో అన్నీ మింగేశాడు. అవన్నీ జీర్ణమయిపోయి రక్తనాళాల్లోను ఎముకల్లోనూ చేరిపోయాయి.


లోక కంటకుడైన వృతాసురుడనే  రాక్షసుడిని సంహరించటానికి దేవతలు ఆయన దగ్గరకు వచ్చి అత్యంత శక్తిమంతమైన ఆ మహర్షి వెన్నెముకను ఆయుధంగా రాక్షస సంహారానికి ఉపయోగించాలని అనుకుంటున్నట్లు చెప్పగానే దధీచి మహర్షి లోకకల్యాణం కోసం ఎంతో ఆనందంగా దేవతల కోర్కెను మన్నించాడు.

తనకు తానుగా శరీరాన్ని విడిచిపెట్టి..తన అస్తులను ఆయుధాలుగా చేసికొమన్నాడు.


దేవతలు దధీచి అస్థుల్ని  వజ్రాయుధం లాంటి ఆయుధాలుగా

చేసుకుని రాక్షసుల్ని సంహరించారు.


దధీచి భార్య పేరు సువర్చల, కొడుకు పేరు పిప్పలాది. కొడుకు కూడా గొప్ప తపస్వి.


దధీచి మహర్షి ఎంత గొప్పవాడో చూశారా! 


గొప్ప తపశ్శాలే కాకుండా తను మరణించి తన ఎముకల్ని ఆయుధాలుగా ఉపయోగించుకుని రాక్షసుల్ని చంపమన్నాడు తన శరీరాన్ని మంచి పనికోసం ఉపయోగించాడు.


 గొప్పవాళ్ళెప్పుడూ వేరే వాళ్ళకోసమే బ్రతుకుతారని అర్ధమయింది కదా !


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

శాంతి మంత్రాలన్నీ

 *_మన వేదాలలో తెలుపబడిన ఏ మంత్రం లోనైనా శాంతి మంత్రాలన్నీ కూడా చివర్లో ఓం శాంతి ... శాంతి ... శాంతిః అని ముగుస్తాయి, దాని అర్థం ఏమిటి??? - దాని వలన లాభం ఏమిటి??? - ఒకసారి పరిశీలిద్దాం_*


ఏదో ఒక సందర్భంలో ... వేద పండితులు ... ఈ శాంతి మంత్రాల్ని పఠించడం మనందరం వినే ఉంటాం ...


_శాంతి మంత్రంలో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఎందుకు ఉచ్చరిస్తారో  తెలియదు, కానీ అది విన్నప్పుడల్లా మనం కూడా ఉచ్చరిస్తాము, కానీ ఎందుకో తెలియదు..._


*మనుషులకు మూడు రకాల ఉపద్రవాలనుండీ ప్రమాదం ముంచుకొస్తుంది*


_*1,ఆధ్యాత్మిక, 2,ఆది దేవిక, 3,ఆది భౌతిక,..*_

*ఇక వీటి వివరాలు పరిశీలిద్దాము...*


మొదటి " శాంతి " పదం  ... శారీరిక , మానసికపరంగా సంభవించే ఉపద్రవం ( అనారోగ్యం ) నుంచీ ఉపశమనం పొందడానికి, దీన్ని  " ఆధ్యాత్మికం " అంటారు,


రెండవ " శాంతి " పదం ... ఇతర జీవరాశులనుండీ , మనుష్యులు నుండీ ఏవిధమైన ఆపదలు / ముప్పు సంభవించకుండా సురక్షితంగా ఉండటానికి . దీన్ని 

" ఆధిభౌతికము " అంటారు,


మూడవ " శాంతి " పదం ప్రకృతి పరంగా సంభవించే ( భూకంపాలు / అగ్నిప్రమాదాలు / వరదలు / తుఫాన్లు మొదలగునవి ) ఉపద్రవాలు వలన ఏవిధమైన ఆపదలు / ముప్పు కలగకుండా ఉండటానికి . దీన్ని " ఆధిదైవికము " అంటారు,


ఈ మూడు ఉపద్రవాలనుండీ రక్షించమని వేడుకుంటూ " శాంతి " మంత్రం చివర్లో " శాంతి " పదాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తారు...

సుభాషితమ్

 🌸 *!! సుభాషితమ్!!* 🌸


శ్లో|| మిత్రద్రుహః కృతఘ్నస్య

స్త్రీఘ్నస్య పిశునస్య చ|

చతుర్ణామపి చైతేషాం 

నిష్కృతిః నైవ విశ్రుతా||


తా|| మిత్రుడికి ద్రోహము చేసిన వాడికి, 

పొందిన మేలు విస్మరించినవాడికి,

స్త్రీలకు అపకారం తలపెట్టినవాడికి,

చాడీలు చెప్పేవాడికి - 

ఈ నలుగురు చేసిన పాపాలకు నిష్కృతి లేదు.... 

{అనగా ఇవి మహాపాపాలు......}

🙏✨💖🌷

తత్ సత్ అనే పదం

 తత్ సత్ అనే పదం యొక్క విషయ పరిశీలన. ఆంగ్లంలో కూడా దట్ అది అనగా ఏ విషయమైతే నీకు తెలుసో దానిని తత్ అని సంబోధన. మరి అది అనగా ఏమి తత్వం పదార్ధ శక్తి లక్షణమా. ముందు పదార్ధం గురించి ఎవరైనా లేశమైన చెప్పియుండవలెనుకదా. లేనిచో ఏమీ తెలియదు. విషయ పరిశీలన యే తత్ త్వంగా మారి తెలిసిన తదుపరి తెలిసినది. అట్లు తెలిసినది కూడా అహం అని భావన కలిగి రజో గుణ రూపంలో దేహము తద్వారా మెూహము తద్వారా ఆసక్తి తద్వారా అనురాగం తద్వారా శాశ్వతమని మాయ అని భ్రాంతి కలుగుచున్నది. యిది బ్రహ్మ విషయంలో కూడా వస్తు తత్వం తెలిసిన తరవాత యిది కాదని చేసినది వేరు కలదని బాహ్యంలో హయంలో కానక నేతి నేతి యని దర్శించిన విషయం స్పష్టంగా తెలియు వరకు పరిశీలన చేయుచూ వుండవలెను.లేనిచో సత్యం తెలియదు.అసత్యం మాయామయం. దాని వివరణ ఉపనిషత్ రూప భగవద్గీత. సత్ తత్ యని తెలియ వలెను. అది పూర్ణము జీవము. జీవము సత్ జీవుడు.దేహాశ్రయమైన మాయ. దానికి లోబడిన సమస్తం నాశనమే. దీనిని త్రిగుణాత్మకమైన జగత్తు గా తెలియుట. కర్మ సూక్ష్మంగా  పరిశీలనతో చేయుట జీవ లక్షణము చేయు కర్మ ఫలమును అనుభవేకవేద్యం వాసన యని తెలియుచున్నది. ఎన్ని సార్లు ఎంతమంది చెప్పినా అహంకారము ప్రబలంగా వున్న వినాశనం. వక వ్యక్తి వలన కోట్లాది ధన మాన ప్రాణములు నశించుట అధర్మం. అధర్మ వర్తనులు నశించుట సృష్టి ధర్మం. ధర్మం భూమితో సమానం. శక్తిని అను ఆత్మ శక్తి కలది కావున భూ చలనం.ధరించినది కావున ధరణి. చలనం వలన సృష్టి. యిది యే తత్ యిది యే ఎల్లప్పుడూ గల సత్ రూప సత్యం. భగవద్గీత సమస్త సారం సత్యమే.అసత్యాన్ని భగవద్గీతోపనిషత్ చెప్పలేదు. ఉపనిషత్ తత్ ఉష శక్తి రూప కాంతిని దగ్గరగా పరిశీలన చేయుట. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 *తపన...ఆర్తి..*


"ఎల్లుండి శనివారం నాటికి మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి రావడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నామండీ..కానీ ఇంతలోనే అవాంతరం ఎదురైంది..మా వారికి ఆఫీస్ లో ఏదో ఎంక్వయిరీ ఉన్నదట..అందువల్ల రాలేకపోతున్నాము..మళ్లీ వీలుచూసుకొని తప్పకుండా వస్తాము.." అని బెంగుళూరుకు చెందిన మహేశ్వరి గారు ఫోన్ చేసి చెప్పారు.."అయితే..మీకొఱకు బుక్ చేసి ఉంచిన రూమ్ ను వేరే వాళ్లకు కేటాయించమంటారా.."? అని అడిగాను.."వేరే వాళ్లకు ఇచ్చేయండి..ఈసారి మేము వచ్చేముందుగా మీకు తెలుపుతాము..ఈసారికి మాకు అదృష్టం లేదనుకుంటాము.." అన్నారు మహేశ్వరి గారు..మహేశ్వరి గారి కొఱకు తీసివుంచిన రూమ్ ను వేరే వాళ్లకు ఇచ్చేసాము..


శనివారం ఉదయం పది గంటల సమయం లో శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం ముందు కారు వచ్చి ఆగింది..అందులోనుండి మధ్యవయస్కులైన దంపతులు దిగారు..వారితోపాటు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా దిగారు..మందిరం లోపలికి వచ్చి..సిబ్బంది ఉన్న టేబుల్ వద్ద నిలబడి.."ఇక్కడ ప్రసాద్ గారంటే ఎవరు?." అని అడిగారు..మా సిబ్బంది నా వైపు చూపించారు..ఆ దంపతులు నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ మొన్న మీకు కాల్ చేసి, మేము రావటం లేదు..మా కోసం ఉంచిన రూమ్ ను వేరేవాళ్లకు ఇవ్వండి..అని చెప్పిన మహేశ్వరిని నేనే..వీరు మావారు రాజరత్నం..వాడు మా అబ్బాయి కార్తీక్..అమ్మాయి సుధారాణి..మావారికి ఆఫీస్ లో పని ఉన్నది అని చెప్పాము కదండీ..కానీ ఆ ఆఫీసర్లు రావడం లేదని నిన్న మధ్యాహ్నం తెలిపారట..మొగలిచెర్ల వెళ్లి ఆ అవధూత మందిరాన్ని చూసి వద్దాము..అని మావారు చెప్పారు..అందుకని వెంటనే బైలుదేరాము..మీకు వీలుంటే మాకోసం ఒక రూమ్ ఇవ్వగలరా?.." అన్నారు.."అమ్మా..ఏవీ ఖాళీ లేవు..కాకుంటే..కామన్ రూమ్ ఒకటి ఉన్నది..సుమారు ఇరవై మంది వరకూ అందులో ఉండొచ్చు..మీరు కాకుండా..మరెవరైనా వస్తే..అందులో మీతో పాటు వుంటారు..ప్రస్తుతానికి అదొక్కటే మార్గం..అందులో వుండండి.." అని చెప్పాను.."సరేలేండి..సర్దుకుంటాము.."అన్నారు..


రూమ్ కు వెళ్లి స్నానాదికాలు ముగించుకొని వచ్చారు..సాయంత్రం జరిగే పల్లకీసేవ గురించి వివరాలు అడిగి..అందులో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేయించుకున్నారు..మధ్యాహ్నం అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి వచ్చి.."ప్రసాద్ గారూ..మీతో మాట్లాడాలి..మాకు సమయం ఇస్తారా.."? అని అడిగారు.."ఇప్పుడు ఖాళీగానే వున్నాను..చెప్పండి.." అన్నాను.."నేను చెపుతాను.." అని రాజారత్నం గారు అన్నారు.."చెప్పండి.." అన్నాను.."మా ఆఫీస్ లో నాకూ..నా పైన ఉన్న అధికారులకూ మధ్య విబేధాలు ఉన్నాయండీ..నేను ఎంత పని చేసినా..ఏదో ఒక లోపం చూపి నన్ను వేధిస్తున్నారు..నేను లంచం తీసుకోను..నా పని వరకూ నిజాయితీగా చేస్తుంటాను..అది వారికి నచ్చటం లేదు..అందువల్ల నన్ను టార్గెట్ చేసుకొని వేధిస్తున్నారు..నాకు మానసికంగా వత్తిడి గా ఉంది..వేరే డిపార్ట్మెంట్ కు వెళదామని ప్రయత్నం చేసాను..నిన్న కూడా నన్ను వేరే చోటుకి బదిలీ చేయమని అప్లికేషను ఇచ్చాను..తీసుకున్నారు..తరువాత చూస్తాం అన్నారు..ఈ పరిస్థితులు మార్చమని అందరు దేవుళ్లకూ మొక్కుకున్నాను..ఈ మధ్య సోషల్ మీడియా లో ఈ స్వామివారి గురించి చదివి..ఇక్కడికి రావాలని నిశ్చయం చేసుకున్నాను..ఇంతవరకూ నా సమస్య చెప్పాను..ఇక రెండోది వినండి..వీడు మా అబ్బాయి..ఇంజినీరింగ్ పూర్తి చేసాడు..క్యాంపస్ లోనే సెలెక్ట్ అయ్యాడు..ఈరోజుకు సరిగ్గా రెండు నెలల తరువాత ఉద్యోగం లో చేరాలి..కానీ ఈ మధ్య తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు..డాక్టర్లకు చూపించాము..మామూలు వైరల్ ఫీవర్ అని చెప్పారు..కానీ..తగ్గడం లేదు..వీడి గురించి కూడా స్వామివారికి విన్నవించుకోవాలని అనుకున్నాము.." అన్నాడు..


"రేపు ఉదయం ప్రభాతసేవ తరువాత స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, మీ సమస్య అక్కడ చెప్పుకోండి..మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది.." అని చెప్పాను..సాయంత్రం పల్లకీసేవ లో ఆ కుటుంబం పాల్గొన్నది..అందరూ స్వామివారి మంటపం లో నేల మీదే పడుకున్నారు..తెల్లవారుజామున రాజారత్నం, మహేశ్వరి గార్లు స్నానం చేసి వచ్చి మందిరం చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేశారు..వాళ్ళ అబ్బాయి కార్తీక్ మాత్రం నూట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి చేసాడు..తన సోదరుడి తోపాటు అమ్మాయి కూడా అన్ని ప్రదక్షిణాలు చేశారు..ఆ కుటుంబం మొత్తం అత్యంత భక్తి తో మసలుకున్నారు..స్వామివారి ప్రభాతసేవ పూర్తి కాగానే..రాజారత్నం గారి కుటుంబం స్వామివారి సమాధి దర్శించుకున్నారు..స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చారు..


"ప్రసాద్ గారూ..వచ్చేవారం కూడా మేము ఇక్కడకు వస్తామండీ..అలా మొత్తం మూడు వారాలు వస్తాము..ఈ క్షేత్రం లో ఎక్కడలేని ప్రశాంతత ఉన్నది..ఇక మేము బైలుదేరుతామండీ..వచ్చేవారం ఆపై వారం కూడా మాకు రూము వద్దు..మంటపం లోనే పడుకుంటాము..స్వామి సన్నిధి లోనే పడుకుంటే..స్వామికి దగ్గరగా ఉన్నట్టు ఉంది.." అని చెప్పి వెళ్లిపోయారు..


ఆ తరువాత గురువారం మధ్యాహ్నం రెండు గంటల వేళ.."ప్రసాద్ గారూ..నేను రాజారత్నం మాట్లాడుతున్నాను..స్వామివారి దయతో నాకు బదిలీ అయింది..నేను కోరుకున్న డిపార్ట్మెంట్ కే నన్ను మార్చారు..మరో మాట..అక్కడినుంచి వచ్చిన తరువాత మా అబ్బాయి అనారోగ్యం కూడా లేదు..ఉషారుగా వున్నాడు..ఎల్లుండి శనివారం మేము వస్తున్నాము..ఇంకా ఇంటికి కూడా ఫోన్ చేయలేదు..మీరు స్వామివారి దగ్గరే వుంటారు కనుక..మొట్టమొదట మీకే చెపుతున్నాను.." అన్నారు..


అనుకున్న విధంగానే రాజారత్నం గారి కుటుంబం మూడు వారాలూ వచ్చారు..మొదటి వారం లోనే వారి సమస్యలు తీరిపోయినా..ముందుగా మొక్కుకున్న విధంగా మూడు శనివారాలూ వచ్చి పల్లకీసేవ లో పాల్గొని..మంటపం లో నేల మీదే పడుకొని..ప్రక్క ఆదివారం ఉదయం ప్రదక్షిణాలు చేసి..స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్లారు..


స్వామివారి సమాధిని దర్శించుకోవాలి అనే తపన..ఆర్తి..ఉన్నవాళ్లను స్వామివారు తప్పకుండా కాపాడుకుంటారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

13, ఫిబ్రవరి 2021, శనివారం

Sathsangh


 

చక్కిటి ఉపన్యాసం


 

మన మహర్షులు -21

 మన మహర్షులు -21


 తండి మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹



 పూర్వం తండి అనే పేరుగల బ్రాహ్మణుడుండేవాడు. అతడు బ్రహ్మచర్యం తీసుకుని అన్ని వేదాలు శాస్త్రాలు చదివి యోగి, జ్ఞాని, మహర్షి అయ్యాడు.


సమాధిలో ఉండి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.


తండి పరమేశ్వరుడ్ని చూసి ఆనందంతో 'ఓ పరమేశ్వరా యోగీశ్వరులు ఎప్పుడూ ఎవరినైతే గొప్పవాడని స్తోత్రం చేసి, ప్రధానమైనవాడని భావించి, పురుషుడని పూజచేసి, అధిష్ఠాన దేవతని అర్చన చేసి, ఈశ్వరుడని ఎంచి ఊహిస్తారో అతడే నువ్వు నువ్వు ఆజుడివి, అనాదినిధనుడివి, విభుడివి, ఈశానుడివి, అత్యంతసుఖివి, అనఘుడివి నిన్ను నేను భక్తితో శరణు కోరుతున్నాను' అన్నాడు


పరమేశ్వరుణ్ణి చూసిన తండికి ఇంకా ఆనందం తగ్గక 'పరమేశ్వరా ! కామ క్రోధాలు నువ్వే, ఊర్ధ్వ అధోభాగాలు నువ్వే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నువ్వే, నిత్యానందుడవు, పరమపదమవు, దేహకర్తవు, దేహభర్తవు, దేహివి, ప్రాణుగతివి అన్నీ నువ్వే జనన మరణాలు కలిగించేది నువ్వే, దిక్కులు, యుగాలు, అయనాలు నువ్వే. రాత్రి పగలు చెవులు, కళ్ళుగా, పక్షాలు శిరస్సుగా, మాసాలు భుజాలుగా, సంవత్సరాలు పాదాలుగా అంతట నువ్వే నిండి వున్నావు,,'


ఈ విధంగా స్తోత్రం చేసిన తండి మహర్షి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు 'వత్సా నువ్వు తేజశాలివి, కీర్తిమంతుడివి, జ్ఞానివి, ఋషుల్లో గొప్పవాడివి అవుతావు. నీకేం కావాలో' అడగమన్నాడు


ఈశ్వరా! నీ దయకంటే నాకు కావలసింది ఏమీ లేదు. ఎప్పుడూ నాకు నీ పాదాల

దగ్గరే భక్తితో ఉండేటట్లు అనుగ్రహించమన్నాడు -తండి మహర్షి .


తర్వాత తండి ఒక ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు.


ఉపమన్యు మహర్షి తండి దగ్గరకు వచ్చి పరమేశ్వరుడి సహస్ర నామాలు చెప్పమని అడిగాడు .


ఇంతకు ముందు దేవతలకి పదివేల నామాలు బ్రహ్మ చెప్పాడు. వాటి నుండి వెయ్యి నామాలు స్వర్గలోకంలో వున్న వాళ్ళకోసం బ్రహ్మ ఇచ్చాడు.


 భూలోక వాసుల కోసం తండి వెయ్యి నామాలు భూలోకంలోకి తెచ్చాడు. దీన్నే 'తండి కృత శివసహస్రనామస్తోత్రం' అన్నారు 


ఇది సర్వమంగళములను సమకూర్చునది. సర్వకల్మషములను నశింపజేయునది. బ్రహ్మలకు బ్రహ్మ, పరులకు బరుడు, తేజములకు దేజము, తపములకు దపము, శాంతములకు శాంతము, ద్యుతలకు ద్యుతి, దాంతులకు దాంతుడు, ధీమంతులకు దీ, దేవతలకు దేవత, మహర్షులకు యజ్ఞములకు యజ్ఞము, శివులకు శివుడు, రుద్రులకు రుద్రుడు, యోగులకు యోగి, కారణములకు గారణము, నగు హరుని అష్టోత్తర సహస్రనామములు:


ఇలా తండిమహర్షి శివ సహస్రనామ స్తోత్రమును తెలియజేసెను. వీనిని జపించినవారు సర్వకామ్య సంసిద్ధిగాంచి ముక్తులగుదురు.

 

 దీని వివరాలు మహాభారతంలోని  అనుశాసనిక పర్వం లో లభ్యమవుతాయి.


ఋషులు ఎప్పుడు ఎదుటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. కాని వాళ్ళకి కావల్సింది ఏమీ ఉండదు. ముక్తి తప్ప...🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

భగవంతుడితో

 🛕🦚 *knvr* 🦚🛕

********************

       *శుభోదయం* 

         *శనివారం*

******************** 


ఒక రోజు రాత్రి కలలో, భగవంతుడితో, నరేంద్ర  సముద్రపు ఒడ్డున నడుస్తున్నట్టు .

అప్పటిదాకా తన  జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ కనిపిస్తున్నాయి. ప్రతి సంఘటన లో చూస్తే నాలుగు అడుగులు కనిపించాయి. రెండు అడుగులు తనవి , రెండు అడుగులు భగవంతుడివి.

కానీ ఆఖరి సంఘటన లో చాలా కష్టమైన సమయం లో చూస్తే, రెండు అడుగులే కనిపించాయి. అప్పుడు నరేంద్రకు  ఆశ్చర్యం అనిపించి

భగవంతుడిని ఇలా అడిగాడు , స్వామీ; “మీరు అన్నారు కదా, ఒక్కసారి నా భక్తుడి చేయి పట్టుకుంటే చివరిదాకా వదలిపెట్టను అని, మరి కష్టమైన సమయం లో ఎందుకు రెండు అడుగులే కనిపిస్తున్నాయి. మీరు నన్ను ఒంటరిగా వదిలేసారా ??”

దానికి భగవంతుడు ఇలా సమాధానం చెప్పారు ” నా ప్రియమైన భక్తురాలా, కష్టసమయం లో నువ్వు చూసిన రెండు అడుగులు నావే. ఆ సమయంలో నేను నిన్ను ఎత్తు కున్నాను. నేను నిన్ను ఎల్లవేళలా కంటికిరెప్పలా కాపాడుతూనే ఉంటాను.”

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️



 *నీతి:* 

భగవంతుడి పై ప్రేమ, నమ్మకం, భక్తి మనల్ని ఎప్పుడూ కాపాడతాయి. భగవంతుడు కష్టముల  నుంచి మనము బయట పడడానికి మనము బయట పడే మార్గాన్ని చూపిస్తాడు , అంతే  కాకుండా అతి కష్టమైన పరిస్థితిలో, ఆయన మనతో పాటే ఉంటూ మన కూడా కుడా నడుస్తారు

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

మొగలిచెర్ల

 *నియమం లో మార్పు..*


ప్రతి శుక్రవారం నాడు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది..అర్చకస్వాములు సిబ్బందీ అందరూ ఇందులో పాల్గొంటారు..అందుబాటులో ఉన్న భక్తులు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు..శ్రీ స్వామివారి సమాధి ని శుభ్రం చేయడం..అదీ తమ స్వ హస్తాలతో చేయడం అరుదైన అవకాశం గా భక్తులు భావిస్తారు..ఇది ప్రతివారం జరిగే ఒక తప్పనిసరి కార్యక్రమం..ఒక శుక్రవారం నాడు జరిగిన సంఘటన ఈరోజు వివరిస్తాను..


ఆరోజు ఉదయం ఎనిమిది గంటల వేళ..కార్లో దంపతులిద్దరు వచ్చారు..సరిగ్గా ఆ సమయానికి స్వామివారి మందిరం శుభ్రం చేయడానికి అర్చకస్వాములు సమాయత్తం అవుతున్నారు..ఈ దంపతులు మందిర ప్రాంగణం లోకి రావడం చూసి.."ఎవరో దూర ప్రాంతం నుంచి వచ్చినట్లు వున్నారు..వీళ్లకు అర్చన జరిపించి..వీళ్ళు దర్శనం చేసుకున్న తరువాత మనం ఆలయం శుద్ధి చేసుకుందాము.." అని అర్చకస్వాములే ఒక నిర్ణయం తీసుకొని..వేచి వున్నారు..ఆ దంపతులు మందిరం లోకి వచ్చి.."మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము..నిన్న రాత్రి మేము ఇక్కడకు వచ్చి నిద్ర చేయాలని అనుకున్నాము..కానీ మా పనుల వత్తిడి వల్ల మేము హైదరాబాద్ లో బైలుదేరడమే ఆలస్యం అయింది..అందుకని రాత్రి కందుకూరులో మా బంధువుల వద్ద ఆగిపోయి..ఉదయాన్నే స్నానాదికాలు ముగించుకొని ఇక్కడకు వచ్చాము..స్వామివారి సమాధి దర్శనం చేసుకునే అవకాశం కల్పించండి.." అన్నారు.."లోపలికి వెళ్లి దర్శనం చేసుకోండి..అర్చక స్వాములు కూడా మీకోసమే వేచి వున్నారు..మీరు త్వరగా దర్శనం చేసుకుంటే..ఆలయాన్ని శుభ్రం చేసుకోవాలి.." అని చెప్పాను.."మేమూ త్వరగా వెళ్ళాలి..ఈరోజు శుక్రవారం కదా.." అని అన్నారు..అలా ఎందుకు అన్నారో అప్పుడు అర్ధం కాలేదు..


దంపతులిద్దరూ లోపలికి వెళ్లారు..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని..స్వామివారి పాదుకులకు తమ శిరస్సు ఆనించి కొద్దిసేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నారు..ఆ తరువాత బైటకు వచ్చారు..స్వామివారి ఉత్సవ మూర్తి ముందు నిలబడ్డారు.."మీ గోత్రం తెలుపండి.." అని పూజారి గారు అడిగారు..ఆ దంపతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని.."పంతులు గారూ..మేము ముస్లిం వాళ్ళము..మాకు గోత్రం ఉండదు..నాపేరు ఖాజావలి..ఈమె నా భార్య రజియా..మా పేర్ల తోనే అర్చన చేయండి.." అన్నారు..పూజారిగారు అర్చన చేశారు..ఆ దంపతులు శుక్రవారం త్వరగా వెళ్ళాలి అని ఎందుకు అన్నారో అప్పుడు అర్ధమైంది..నమాజు చేసుకోవడానికి అని అనుకున్నాను..


ఆ దంపతులు ఇవతలికి వచ్చి..వాళ్లలో వాళ్ళు ఉర్దూ లో ఏదో మాట్లాడుకున్నారు..ఆ తరువాత నా దగ్గరకు వచ్చి.. "అయ్యా..ఇందాక మీరు మాతో మాట్లాడినప్పుడు..ఆలయం శుభ్రం చేసే కార్యక్రమం అన్నారు..ఇప్పుడు ఈ మందిరం అంతా శుభ్రం చేస్తారా..? " అని ఆ భర్త అడిగాడు.."అవును.." అన్నాను.."మేము కూడా పాల్గొనవచ్చా..?" అన్నాడు.."గర్భాలయం లో ఉన్న స్వామివారి సమాధి శుభ్రం చేయడానికి స్త్రీలను అనుమతించము..బైట ప్రాంగణం అంతా శుద్ధి చేసే పనిలో స్త్రీలు కూడా పాల్గొనవచ్చు..స్వామివారి పూజా కార్యక్రమానికి వాడే వస్తువులను కడిగి పెట్టడం వంటి పనులు స్త్రీలు చేయవచ్చు.." అని చెప్పాను...వెంటనే ఖాజావలి తన చొక్కా విప్పేసి, తన భార్య చేతికి ఇచ్చాడు..ఆరోజు ఆలయ శుద్ధి కార్యక్రమం లో ఆ ముస్లిం దంపతులు అత్యంత భక్తితో పాల్గొన్నారు..


స్వామివారి మందిరం శుభ్రం చేయడం..ఆపై స్వామివారి సమాధి వద్ద అభిషేకము నిర్వహించి..హారతి ఇవ్వడం జరిగిపోయింది...


"అయ్యగారూ..మాకు చాలా ఆనందంగా వుందండీ..స్వామివారికి నేరుగా సేవ చేసుకున్నంత సంతోషంగా ఉంది..మీరు.. మీ సిబ్బంది..మీ పూజారులు..ఎవ్వరూ మమ్మల్ని వేరుగా చూడలేదు..ప్రతి శుక్రవారం ఎన్ని పనులున్నా..నేను నమాజు చేయడం తప్పనిసరి..అటువంటిది ఈరోజు ఈ భాగ్యం కలిగింది..మాకూ మీతో సమానంగా అవకాశం ఇచ్చారు..ఇక మీదట మేము తరచూ ఈ గుడికి వస్తాము..వెళ్ళొస్తాము.." అని ఖాజావలి చెప్పాడు.."మంచిది.." అన్నాను...ఈలోపల అతని భార్య తన సంచీ లోంచి గోధుమ వర్ణం తో ఉన్న శాలువాను తీసింది.."అయ్యగారూ..ఈ శాలువాను స్వామివారి సమాధి మీద పరుస్తారా..? దీనిని హైదరాబాద్ లో ఇక్కడకు వచ్చేముందు కొన్నాము.." అన్నది..నా ప్రక్కనే నిలబడి ఉన్న పూజారిగారు ఆ శాలువాను చేతిలో తీసుకొని.."అమ్మా..స్వామివారి సమాధి పై పరుస్తాము..కాకుంటే..ఈరోజు కాదు..ఈసారి సమాధి కి అభిషేకం చేసిన తరువాత పరుస్తాము.." అని చెప్పారు.."చాలా సంతోషం.." అన్నారు ఆ దంపతులు..ఆ తరువాత వాళ్లిద్దరూ హైదరాబాద్ కు వెళ్లిపోయారు..


ఆ దంపతుల కు అత్యంత అరుదైన అవకాశాన్ని స్వామివారు కల్పించి నట్లుగా  తోచింది..నిజానికి వాళ్ళు గురువారం నాడే స్వామివారి సమాధిని దర్శించుకోవాలి అని అనుకున్నారు..కానీ వాళ్లకు శుక్రవారం నాడు ఆ భాగ్యం కలిగిస్తూ..నమాజు చేసే నియమాన్ని మారుస్తూ..దానితో పాటు తన సేవ చేసుకునే అదృష్టాన్ని కూడా కల్పించారు..ఆ దంపతుల మనస్సులో మతం కన్నా అతీతమైన భక్తిని స్థిరీకరించారు..


ఒక్కొక్కరి మనస్సులో ఒక్కొక్క అనుభవాన్ని పొందుపరుస్తారు స్వామివారు అని మరోసారి ఋజువుఅయింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

జాబాలి మహర్షి

 మన మహర్షులు - 20


 జాబాలి మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


జాబాలి మహర్షి వాల్మీకి రామాయణంలో అయోధ్య కాండలో కనిపించే ఒక గొప్ప పాత్ర. 


త్రేతాయుగంలో జాబాల అనే ఒక బ్రాహ్మణ వనిత  మృకండు మహర్షిని కొన్ని సంవత్సరాల పాటు తీవ్రంగా శుశ్రూష చేసింది. తన తపస్సు నిర్విఘ్నంగా సాగినందుకు సంతోషించి మహర్షి గొప్ప ప్రజ్ఞాశాలి, సర్వవేదాలను అభ్యసించిన వేదవేత్త, గొప్ప తపస్సంపన్నుడు అయిన కుమారుడు జన్మిస్తాడని వరం ఇచ్చాడు. అలా వరప్రభావంతో జనించిన కుమారునికి జాబాలి అని నామకరణం చేసి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. 


జాబాలికి యుక్త వయస్సు రాగానే అతని తల్లి గౌతమ గోత్రీకుడైన  హరిద్రుమతుడు అనే గురువు గారి వద్ద విద్యాభ్యాసం కోసం అప్పగించింది. 


అతనికి ఉపనయనం చేయగోరి గురువు పూజాసంకల్పం కోసం కులగోత్రాలను అడుగగా అవి తనకు తెలియవని సమాధానం ఇస్తాడు. 


మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకుని రావల్సిందిగా గురువు ఆదేశిస్తాడు.


కుమారుని సందేహాన్ని విన్న తల్లి తనకు భర్త లేడని, దాసీ వృత్తినే స్వీకరించి అనేక ప్రదేశాలలో తిరగానని, ఒక మహర్షి ఆశీర్వాదం కారణంగా నువ్వు పుత్రునిగా లభించావని తెలుపుతుంది. 


తిరుగి తన వద్దకు తిరిగి వచ్చిన జాబాలి జన్మ కథను దివ్య దృష్టితో తెలుసుకున్న హరిద్రుమతుడు అతడు కారణజన్ముడని తెలుసుకుని ఉపనయనంతో పాటు గాయత్రీ మంత్రోపదేశం చేస్తాడు.


అంతేగాక నాటి నుండి అతని పేరును సత్యకామజాబాలిగా మారుస్తాడు.


బ్రహ్మ విద్యను అభ్యసించేందుకు తగిన అర్హత కోసం అతనిని గోసేవ చేసుకొమ్మని గురువు ఆదేశిస్తాడు.


 సత్యసంధత, గురుభక్తి అచంచలమైన భక్తి విశ్వాసాలతో జాబాలి అహర్నిశలు గో సేవ చేసుకుంటూ ఉండేవాడు.


 అతని భక్తి తత్పరత, సేవాదృక్పధాలకు మెచ్చి వాయుదేవుడు వృషభరూపంలో వచ్చి మంత్రోపదేశం చేసాడు.


 అనంతరం గోవుల రూపంలో ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుడు, బృహస్పతులు వచ్చి జాబాలికి బ్రహ్మోపదేశం, వేదాలు , ఉపనిషత్తులను ఉపదేశించడం వలన జాబాలి బ్రహ్మ జ్ఞాన సంపన్నుడయ్యాడు.


 ఆత్మసాక్షాత్కారం పొందిన జాబాలి గురువు ఆదేశం మేరకు ఒక ఆశ్రమం నిర్మించుకుని నిత్యం వేదపారాయణ, సత్గంధపఠన, గురుధ్యానము నందే నిమగ్నుడయ్యేవాడు.


గురుధ్యానం, గురునామం జపించనిదే పచ్చి గంగైనా ముట్టేవాడు కాదు. జాబాలి గురుభక్తికి మెచ్చి హరిద్రుమతుడు స్వయంగా శిష్యుని ఆశ్రమానికి వచ్చి సర్వవేదసారం, బ్రహ్మజ్ఞానం ఉపదేశించి తన సర్వ తప్పశ్శక్తిని ధారపోస్తాడు. 


కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి వెలసిన తిరుమల పవిత్ర రపదేశంలో ఆశ్రమం నిర్మించుకొని ఘోరతపస్సు ఆచరించాడు.


ఆయన ఆశ్రమ ప్రాంతాన్ని జాబాలి తీర్థం అని పిలుస్తారు.


 అశేష భక్త జనావళి తమ గృహ, నక్షత్ర దోషాలను పరిష్కరించుకునేందుకు జాబాలి తీర్థం దర్శించుకుని అక్కడే ఉన్న వినాయక, ఆంజనేయ స్వామి మూర్తులను పూజించుకుంటారు. 


అనంతర కాలంలో చిత్రకూట పర్వత ప్రాంతంలో జాబాలి మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించి, ఆ స్వామి అనుగ్రహంతో పరతత్వ రహస్యాలను గ్రహించారు.


అనంతరం బ్రహ్మజ్ఞాన సాధనకు తనను ఆశ్రయించిన పిప్పలాద మహర్షికి సకల వేద సారాన్ని బోధించాడు. వీరిద్దరి నడుమ సాగిన సంవాదం జాబాల్యుపనిషత్తు పేరిట సుప్రసిద్ధం అయింది.


 రామాయణంలో అయోధ్యకాండలో తండ్రి ఆజ్ఞను అనుసరించి అడవులకు బయలుదేరుతుండగా జాబాలి మహర్షి అక్కడి వచ్చి తన వాక్పటిమ, తర్కం, అపారమైన శ్రస్తసంపదను రామునితో వాదనకు దిగి అతనిని అడవులకు వెళ్లకుండా ఆపేందుకు విఫలయత్నం చేస్తాడు.


ఆ వాదనలో ఎన్నో తత్వ రహస్యాలు, వేదవిజ్ఞానం, బ్రహ్మసూత్రాలు వచ్చి వినేవారికి సంపూర్ణ జ్ఞానోదయం అవుతుంది.


 అయితే చివరకు శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్లే యోచనలో ఎంతో పరమార్ధం ఉందన్న విషయం తపశ్శక్తి ద్వారా గ్రహించి తన వాదనను ఉపసంహరించుకుంటాడు.


 జాబాలి ఎంతో కాలం దశరథునికి ముఖ్య సలహా దారునిగా ఉంటూ ప్రజాసంక్షేమమే ధ్యేంగా సత్యం, ధర్మం, న్యాయం, అహింసలనీ నాలుగు పునాదులపై కోసల దేశంలో సుపరిపాలనను సాగించేందుకు కృషి చేసాడు.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹