13, ఆగస్టు 2020, గురువారం

కుమారచరిత్ర

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా౹౹

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || ||
                   

తనచుట్టూ పరివేష్ఠితులై యున్న మహాముని జనావళిని దయా దృక్కులతో వీక్షిస్తూ, శ్రీ మహా శిపురాణాంతర్గతమైనదీ - ముచ్చటైనదీ అనదగ్గ  సంహితను, సమ్మోహ - సమ్మోదాలతో ప్రారంభించాడు సూతమహర్షి.

అంతా శ్రద్ధాళువులై వినసాగారు.

సూత మహర్షిని శౌనకాది ఋషులు ఈ విధముగా అడుగుచున్నారు. ....

ఓ మహర్షీ! ఈ లోకంలో కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోవుచున్నారు. కొందరు సంతానము లేక మరికొందరు ధనము లేక ఋణములతోను ఇంకొందరు వ్రణములు ; ప్రమాదములు, అగ్ని బాధలు, శత్రు బాధలు పొందుచున్నారు.
 అసలు కుజుడెవరు? అతని శక్తి సామర్థ్యములు ఎలాంటివి? కుజదోష నివారణోపాయములు ఏమిటి? అని అడుగగా,

సూత మహర్షుల వారు ఋషులారా! శ్రద్ధగా వినండి, పై దోషములు గలవారుఅపర్ణాదేవి దేవి పూజ , సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనా చేసి, కుజ జన్మ వృత్తాంతము, శ్రీ అపర్ణాదేవి కళ్యాణ వృత్తాంతమును ఎవరైతే శ్రద్ధగా భక్తి తోపారాయణ చేస్తారో వారికి జన్మలగ్నవసాత్తు గాని, గోచారలగ్నవసాత్తు గాని, ద్వితీయ, చతుర్ధ, సప్తమ, అష్టమ వ్యయస్థానములలో కుజుడు ఉండుట వలన కలుగు సమస్త కుజదోషములు తొలగి కోరిన కోరికలు నెరవేరును.
ముందుగా కుజ జన్మ వృత్తాంతము చెప్పుచున్నాను. శ్రద్ధగా వినవలెను, అని సూతులవారు ఈవిధంగా ప్రారంభించిరి.

శ్రీ మహావిష్ణువు తన నాభికమలము నుండి బ్రహ్మను సృజించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు.
దక్షుడు అనగా సమర్ధుడు అని అర్ధము. ఆ దక్షప్రజాపతి తన కుమార్తెలలో ఇరవైఏడు మందిని "అశ్వని" (నక్షత్రములు) మొదలగువారిని చంద్రునకు ఇచ్చి వివాహము చేసినాడు.
 ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమె దాక్షాయణి, శ్రీమాత. పరమశివుడు ప్రతీరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు వచ్చింది. ఆ నాట్యం చూడటానికి ముక్కోటి దేవతలు వస్తారు. దక్షుడు కూడా వచ్చేవాడు.
దక్షుడు మామగారు ఐనప్పటినుండి శివుడు నాట్యం పూర్తైన తర్వాత ముందుగా దక్షుని సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు.
ఒకరోజు వీలులేక దేవతలందరినీ సాగనంపి చివరకు దక్షుని సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు ఓ పెద్దయజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను, అల్లుడిని పిలవలేదు. (కొన్ని పురాణాలలో దక్షుడు చంద్రునికి ఇచ్చిన శాప నివారణకు మహా శివుడు సాయపడ్డాడని దక్షుని కి కోపం వచ్చిందని చెప్పబడినది)
మరీచ్యాది మహర్షులు హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల ద్వారా యజ్ఞకార్యాన్ని గురించి విన్న దాక్షాయణి పరమశివుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. శివుడు పిలవని పేరంటానికి వెళ్ళడం తగదంటూనే అనుమతి ఇచ్చాడు.
 ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రమథగణాన్ని పంపించాడు. దాక్షాయణి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను (దాక్షాయణిని) చూసి దగ్గరకు వచ్చి పరమశివుని నిందించాడు.
"అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలా సంతోషం" అన్నాడు. దాక్షాయణి తండ్రికి, అక్కడ ఉన్న దేవతలందరికి పరమశివుని గొప్పతనం చెప్పి, శివనింద చేసినవాని కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించింది.
యజ్ఞకుండము దగ్గరకి వెళ్ళి యోగాగ్నిచే దగ్థమైంది. ఆవార్త తెలిసిన శివుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేసినాడు. పిమ్మట శివుడు కైలాసమునకు వెళ్ళి సతీవిరహమును పొందుచూ తిరిగి హిమవత్ పర్వతము నందు తపస్సు చేయుచుండెను.
అటుల తపస్సు చేయుచుండిన శివుని మూడవ నేత్రమునుండి శ్వేద బిందువులు నేలపై పడి, ఒక శిశువు ఉద్భవించెను. ఆ బాలుడు ఎర్రని కాంతితో దివ్య తేజస్సుతో నాలుగు భుజములతో ప్రకాశిస్తున్నాడు. దిక్కులు ప్రక్కటిల్లేలా ఏడవడం ప్రారంభిచాడు.
ఆ ధ్వనికి భూమి, ఆకాశము ఏకమవుతున్నట్లు ఉంది. ఇంతలో భూదేవి స్త్రీ రూప ధారిణి అయి ఆబాలుడిని ఎత్తుకుని స్తన్యమిచ్చినది.
శివుడు భూదేవితో నీవు చాలా పుణ్యాత్మురాలవు. నా శ్వేదబిందువు నీపై పడుటచే ఈ బాలుడు ఉద్భవించాడు. నేటి నుండి నీకుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు.
ఇతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక, తాపత్రయరహితుడై నీ పేరుతో విఖ్యాతి పొందును, అని చెప్పాడు. శివలలాటజలము భూమిపై పడి ఇతడు జన్మించుటచే (కు-భూమి యందు, జ-జన్మించినవాడు) కుజుడు అని ప్రసిద్ధి నామం కలిగెను.

భూమి కుమారుడు గాన భౌముడనియు, అగ్ని తేజస్సుచే పుట్టినవాడు (సర్వాంగములను పీడించువాడు) గాన అంగారకుడనియు ప్రసిద్ధి నొందెను. ఇతడు జన్మించిన కొన్ని క్షణములకే యువకుడై కాశీయందు ఉండి చిరకాలము శివుని గురించి తపస్సు చేసి శివానుగ్రహముచే గ్రహత్వమునొంది శుక్రలోకమునకు పైభాగమున ఉండెను.
 నాటి నుండి ఎవరు ఇతనిని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి, సర్వకామ్యసిద్ధి కలుగును. ఈ కుజ జన్మ వృత్తాంతము పరమ పావనమైనది. అని సూతుడు శౌనకాది మునులకు తెలిపెను.

ఈ వృత్తాంతమంతయు శ్రద్దగా ఆలకించుచున్న మునిపుంగవులు సూత మహర్షిని :
మహానుభావా కుజ దోష నివృత్తికి ఏ దేవతా ఆరాధనా చెయ్యవలెనో తత్ విధానము తెలియచేయ వలసినిదిగా ప్రార్ధించగా సూత మహర్షి మందహాసముతో మీ ప్రశ్నలకు సమాధానం శ్రీ సుబ్రమణ్య చరిత్ర తెలియ చేయ గలదు అని సెలవీయగా మునులందరూ ఎంతో ఉత్సుక తతో అయ్యా ఆ వృత్తాంత మంతయు మాకు సెలవీయవలసినిదిగా కోరారు . 
     
సూత మహర్షి అప్పుడు శివపుత్రుడు గాంగేయుడు అగ్నిసంభవుడు , కార్తికేయుడు , మరియు శ్రీ మహావిష్ణువు కు మేనల్లుడు గా మురుగన్ అనే నామ ధేయాలతో దేవతల సేనాని గా తారకాసురుని సంహరించిన శ్రీ సుబ్రమణ్య చరిత్ర ను ఈ విధంగా ప్రారంభించారు . 

*వల్లీశ దేవసేనేశ*
 *భక్తపాలన తత్పర*
 *దరహాస ముఖాంభోజ*
 *సుబ్రహ్మణ్య నమోస్తుతే*
******************

కామెంట్‌లు లేవు: