13, ఆగస్టు 2020, గురువారం

రామాయణమ్ .29


.
లీలగా విల్లందుకున్నాడు అవలీలగా ఎక్కుపెట్టాడు! అంతే ఒక్కసారిగా
భూనభోంతరాళాలాలు దద్దరిల్లే శబ్దంతో ఫెళఫేళారావంతో విరిగిపోయింది! .
.
తస్యశబ్దో మహానాసీన్నిర్ఘాతసమనిస్వనః
భూమికమ్పశ్చ సుమహాన్ పర్వతస్యేవ దీర్యతః.
.
ఆ ధనుస్సు విరిగినప్పుడు పిడుగుధ్వనితో సమానమైన గొప్పశబ్దం వచ్చెనట,పర్వతాలు బ్రద్ధలయితే భూమి ఎలా అదురుతుందో అలా అదిరిందట .
.
విశ్వామిత్రుడు, జనకుడు,రామలక్ష్మణులు తప్ప తక్కినవారందరూ ఆ శబ్దానికి మూర్ఛపోయారట.
.....
.
ఈ సందర్భంలో కవిసామ్రాట్ విశ్వనాధసత్యనారాయణగారు చక్కటి పదాలు వాడి ఆ సందర్భాన్ని ఎంత అద్భుతంగా మన కన్నుల ముందు ఆవిష్కరించారో చూడండి .ఆ పద్యం అర్ధం మనకు వెంటనే తెలియకపోయినా ! శబ్దచిత్రం మాత్రం కన్నుల ముందు ప్రత్యక్షమవుతుంది
.
నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛ దుద్యోతిత
స్పేష్ఠేరమ్మదమాలికా యుగప దుజ్జృంభన్మహాఘోర బం
హిష్ఠ స్ఫూర్జదుషండ మండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రా
ఘిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ ఛిన్నచాపంబునన్!
.
ఇది మీ కనుల ముందు ఊహించండి!
.
నిలకడగా వర్షం కురుస్తున్నప్పుడు దట్టమైనమబ్బులలో అగ్నికణాలమాలలు ఒక్కసారిగా బహిర్గతమై దండలుగా ఏర్పడి బ్రహ్మండమైన శబ్దంతో పిడుగులు అదేపనిగా ఒకదానివెంట మరొకటి (series) గా వస్తే ఎలా ఉంటుందో ! అలాంటి శబ్దం ఆ విల్లు విరిగి నప్పటి ఫెళఫెళారావాలు అంత తీవ్రంగా వచ్చినవట !
అంతేనా ఈ పద్యంలో ఇంకొక చమత్కారం కూడా వున్నది! రాముడు నీలమేఘశ్యాముడు ,"మేఘపటలీ నిర్గచ్చ "అని వ్రాశాడాయన .
.
మేఘమండలం నుండి వెలువడిన అని అర్ధం ! నీలమేఘశ్యాముడి చేతిలో విరిగి అంత ధ్వని పుట్టిందట!.
.
భాస్కర రామాయణం లోని పద్యమొకటి చూడండి!
.
కులగిరులెల్ల బెల్లగిలె గుంభిని యల్లలనాడె దిగ్గజం
బులుబెదిరెన్ భుజంగపతి బొమ్మరవోయె బయోధులన్నియుం
గలగె దిగంతముల్ వగిలె గన్కనిదారలు రాలె సూర్యచం
ద్రుల గతులు తప్పె మేఘములు దూలె నజాండముమ్రోసె నయ్యెడన్.
.
ఆ శబ్దానికి పర్వతాలు పెళ్లగింపబడినవట,దిక్కులుమోసే ఏనుగులు బెదిరిపోయినవట,ఆదిశేషువుకు దిమ్మతిరిగి పోయిందట,సముద్రాలు క్షోభించినవట ,భూమి అల్లల్లాడి పోయిందట ,దిక్కులు పిక్కటిల్లినవట,నక్షత్రాలు రాలిపోయినవట ,సూర్యచంద్రులు గతులు తప్పారట ..
.
అంత భయంకరమైన శబ్దం పుట్టినదట!
.
ఒక్కక్క కవి యొక్క ఊహా వైభవం ఎంత అద్భుతంగా ఉందో చూడండి.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: