16, ఫిబ్రవరి 2025, ఆదివారం

అప్పకవీయం

 🙏అప్పకవీయం 🙏

అప్పకవీయం ఒక లక్షణ శాస్త్ర గ్రంథం.ఇప్పటికి యతి ప్రాసలకు ఈ గ్రంథమే ప్రామాణికం.

అప్పకవి రచించిన యీగ్రంథముపేరు 'ఆంధ్రశబ్దచింతామణి' అని యవతారికనుబట్టియు, ఆశ్వాసాంతగద్యలనుబట్టియుఁ దెలియుచున్నది. కాని 'అప్పకవీయ'మను నామమే దీనికిఁ బ్రసిద్ధము. కృతికర్త, యిది వ్యాకరణగ్రంథమని చెప్పేకొన్నను, ఇందు ఛందోవిషయములకే ఎక్కువ ప్రాధాన్య మీయఁబడినది. ఛందోగ్రంథముగానే దీనికి ప్రసిద్ధి కల్గినది. ఛందోవిషయపరిజ్ఞానమునకే దీనిని చదువుకుందురు. సాధారణముగా విశ్వవిద్యాలయములవారు తమపరీక్షలకు ఛందస్సునకు సంబంధించిన యిందలి తృతీయ, చతుర్థాశ్వాసములనే పాఠ్యములుగా నిర్ణయించుచుందురు.

అప్పకవీయము తత్కర్త రచించిన స్థితిలో నిప్పుడున్నట్లు కానరాదు. శ్రీ రేకము రామానుజసూరిగారు స్వతంత్రించి కొన్ని సవరణలు చేసినట్లు శ్రీగిడుగువారు తెలిపియున్నారు. ఇతర సంస్కర్తలును తమకుఁ దోఁచినట్లు సంస్కరించుచున్నట్లు తర్వాతి ముద్రణములనుబట్టి తెలియుచున్నది. లక్షణవిరుద్ధములగు విషయములు పెక్కు లీగ్రంథమునఁ గానవచ్చుట కిది కారణము కావచ్చును

కాకునూరి అప్పకవి తెలుగు లాక్షణిక కవిగా సుప్రసిద్ధుడు. ఇతను మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి తాలుకాలోని కాకునూరి అగ్రహారానికి చెందినవాడు.అప్పకవి నన్నయభట్టు రచించిన 'ఆంధ్రశబ్ద చింతామణి' ఆధారంగా 'ఆంధ్రశబ్దచింతామణి' అను ఛందో గ్రంథాన్ని రచించాడు. తెలుగుభాషలో లక్షణగ్రంథాలను వాటి రచయితల పేర్లతో పిలిచే రివాజుగా ఈ పుస్తకం తెలుగు సాహితీ లోకంలో 'అప్పకవీయం' గానే స్థిరపడిపోయింది. ఈ గ్రంథాన్ని అప్పకవి ' సారపాదపం 'అని కూడా అన్నాడు. అప్పకవి పూర్వికులది కాకునూరికి సమీపంలోని ' లేమామిడి ' గ్రామం. వీరి తాత గారి తాత అక్కడే ఉండేవాడు. అప్పకవి తాతముత్తాతలంతా పండితులే. వీరి తాత పెద సోమయ్య పండితుడే కాక శ్రీమంతుడు కూడా. అప్పకవి తండ్రి వెంగన్న గొప్ప వేదపండితుడు. అప్పకవి పల్నాడుసీమలోని కామేపల్లిలో తనమేనమామల ఇంట పెరిగాడు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి వీరి వంశానికి చెందిన వారే 

కాకునూరి అప్పకవి మన్మథ నామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి (1656 ఆగస్టు 03 వ తేది) నాడు జన్మించినట్లు తానే స్పష్టంగా తన అప్పకవీయంలో పేర్కొన్నాడట.

అప్పకవి విద్యాభ్యాసం తన మేనమామల ఇంట పల్నాడు సీమలో సాగింది. మూర్తి సర్వన్న దగ్గర యజుర్వేదం, కాండూరి గిరయ్య దగ్గర వ్యాకరణం, సూరభట్టు దగ్గర సకలసిద్ధాంతాలు, కొలిచెలమల్ల సింగన్న గారి దగ్గర స్మార్తకర్మలు, రాజయోగి దగ్గర ఆగమాలు, మంచికంటి ఓబన్న దగ్గర లక్షణగ్రంథాలు చదువుకున్నాడు. అప్పకవిని లక్షణ కవిగా తీర్చిదిద్దినది ఓబన్నగారే.

విద్యాభ్యాసం పూర్తయ్యాక అప్పకవి శ్రీశైలం వెళ్ళాడు. అప్పటి ఆ ప్రాంత అధికారి అయిన భోగి విభూషణుడి ఆస్థాన కవిగా కొంతకాలం పనిచేశాడు. అక్కడే స్మార్తకర్మలకు సంబంధించి 'అపస్తంబ షట్కర్మ నిబంధనం' అను సంస్కృత నిబంధన గ్రంథాన్ని రచించాడు. కాలబాలార్ణవ సంహిత అనే జ్యోతిష గ్రంథానికి శ్లోకరూప సంగ్రహాన్ని రాశాడు. స్త్రీలకు పనికి వచ్చే 'సాద్వీజన ధర్మం' అనే ద్విపద కావ్యాన్ని, 'అనంతవ్రత కల్పం' అను కావ్యాన్ని రచించాడు. శ్రీశైల మల్లికార్జుని మీద శ్లేష గర్భితమైన నిందా స్తుతి శతకాన్ని రాశాడు. 'అంబికావాదం' అను యక్షగానాన్ని, 'కవికల్పం' అను లక్షణ గ్రంథాన్ని రచించాడు.


సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

అహల్య కథ🙏

 🙏వాల్మీకి మహర్షి చెప్పిన అహల్య కథ🙏


అహల్య విషయంలో వాల్మీకి రామాయణం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది. అయితే అహల్య చరిత్ర వేదంలో కూడా వుంది. ఇతర పురాణాలలో అనేకచోట్ల ఆ ప్రసక్తి వచ్చింది. అహల్య చరిత్రయొక్క తత్వం సమగ్రంగా తెలియాలి అంటే కొన్ని సాంకేతిక అర్ధాల్లోకి కూడా వెళ్లాలి. మానవ జీవితాలు కేవలం వీళ్ల ఇచ్ఛల చేత కాకుండా గ్రహగతుల యొక్క ప్రభావంచేత కూడా నడుస్తుంటాయి. అయితే ఈ గ్రహగతులు ఎలా నడుస్తాయి అంటే గ్రహాలకంటే పైనున్న దివ్యలోక వాసులైన దేవతల ప్రవర్తన ద్వారా!గ్రహాలు ప్రభావితాలు కావడం అంటే గ్రహములయందు అధిష్టించినటువంటి దేవతలు ప్రభావితులై వాళ్ల ద్వారా వాళ్ల అంశలతోజన్మించిన వాళ్ల యొక్క ప్రభావంలో వున్న జీవుల మీద కూడా ప్రభావం చూపుతాయి. అలాంటి ప్రభావం మామూలుగా మనందరి మీదా పడుతూ వుంటుంది. కానీ మనం అందరమూ సామాన్య జీవులం కనుక చెప్పుకోదగ్గ కథ వుండదు. ఒకానొక సృష్టి క్రమంలో యుగ సంధి కాలంలో ఒక మహత్తరమైనటువంటి సృష్టి కార్యం చేయడంకోసం ఏ జీవులు అవతరిస్తారో, వాళ్ల జీవిత చరిత్రలు సామాన్యరీతికి భిన్నంగా ఉంటాయి. అహల్య అనేటువంటి జీవి స్ర్తి జీవిగా, బ్రహ్మ మానస పుత్రిగా జన్మించింది. ఆమెను గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేసారు. మామూలుగా అందరి లాగా నడుచుకోవడం కోసం ఆ జీవి సృష్టించబడలేదు.

ఆ జీవివల్ల ప్రపంచానికి ఒక సందేశం అందాల్సి వుంది. అది ఉపాసనారీతి గురించిన సందేశం. ఆ ఉపాసనా రీతిలో మొదట ఆవిడ ఇంద్రుడ్ని ఉపాసన చేసింది. కానీ తండ్రి ఆమెను గౌతముడికి ఇచ్చి వివాహం చేసాడు. అప్పటినుంచీ ఆమె భర్తని ఉపాసన చేయాల్సి వచ్చింది. మొదట చేసిన ఉపాసన ఒకటి, తరువాత చేసిన ఉపాసన ఒకటి ఆవిడ భేద భావనలో మొదట్లో చేసిన ఉపాసనను వదిలేసింది. అది ఏమవుతుంది. దాని ఫలితం ఇస్తుంది. అటువంటప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి? అనే సాధక సందేహాన్ని నివారించదలుచుకున్నారు. ఉపాసనలో ఎక్కడా పొరపాటు పడకూడదు అనే విషయం స్పష్టంగా చెప్పడం కోసం వాల్మీకి ఆ విషయంలో అహల్యను నిందిస్తునే శ్లోకాలు రాసేసాడు. దానితో వాల్మీకి చెప్పదలచుకున్న విషయం పూర్తి అయింది

బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్న వారే. అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడికంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెపుతాడు. గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని. ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్ళి చేయమని చెపుతాడు.

ఒకరోజు అహల్య భర్తయైన గౌతముడు ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళగా ఆమె మీద కోరికతో దేవేంద్రుడు ఆమె భర్త రూపంలో వచ్చి కోరిక తీర్చమని అడుగుతాడు. ఇంద్రుడి మోసం తెలిసీ అహల్య అందుకు అంగీకరిస్తుంది.(मुनि वेशम् सहस्राक्शम् विज्ञा रघुनन्दना - సంస్కృత రామాయణం, బాలకాండ, 48వ సర్గ, 19వ శ్లోకము). అదే సమయానికి గౌతముడు తిరిగివచ్చి ఆమెని శపిస్తాడు. “ ఇహవర్ష సహస్రాణి బాహూని నిసిశ్యసి.వాయు భక్ష్యా నిరాహారా తప్యాని భస్మశాయినీ. అదృశ్య సర్వ భూతానాంఆశ్రమే అస్మిన్ నివసిష్యసి” (సంస్కృత రామాయణం, బాలకాండము, 48వ సర్గ,30వ శ్లోకము.) అనగా, “బహు సంవత్సరాలునీవు గాలిని భక్షిస్తూ ఆహారము లేక తపస్సు చేసుకుందువు. నీపైన పరాగము(బూడిద) కప్పబడుతుంది. నీవెవరికీ కనబడవు. అదృశ్య రూపమున ఇక్కడనే తపస్సు చేసికొనుము. “ , త్రేతా యుగంలో మహా విష్ణువు రాముని అవతారమెత్తి ఆయన పాదధూళిచే (ఆయన రాక వలన, దర్శనము వలన) ఆమెకు శాపవిమోచనం అవుతుందని తెలియబరుస్తాడు. (శ్రీమత్ ఆంధ్ర వాల్మీకి రామాయణము, యదాతథ అనువాదము, వావికొలను సుబ్బారావు గారు, 1932). అలాగే ఇంద్రుణ్ణి తన శరీరమంతా స్త్రీ జననేంద్రియాలతో నిండిపోయేలాగా శపిస్తాడు. వృషణాలు నేలరాలిపోయేటట్లు చేస్తాడు. కానీ ఇంద్రుడు ఇతర దేవతల సాయంతో ఒక జీవాన్ని బలి ఇచ్చి దాని వృషణాలను అతికించేటట్లు చేస్తాడు. అమ్మవారిని గురించి తపస్సు చేసి తన శరీరంపై ఉన్న స్త్రీ జననేంద్రియాలను కన్నులులాగా కనిపించేటట్లు వరం పొందుతాడు. అందుకనే ఆయన్ను సహస్రాక్షుడు అని కూడా వ్యవహరిస్తారు. “ఇట్లు అహల్య శిలగానయ్యెనని కొన్ని గ్రంధములయందు గలదు. కానియది వాల్మీకి మతముగాదు. దుఃఖభావము లేక శిలవలె యుండిన, పాపఫలమేమి అనుభవించినట్లు? కావున అహల్య స్త్రీగానుండియే తపమాచరించెను. “ - వావికొలను సుబ్బారావు గారు, వాల్మీకి రామాయణ ఆంధ్ర అనువాద కర్త.


గౌతముడు చెప్పినట్లుగానే త్రేతాయుగంలో శ్రీరాముడు తమ గురువైన విశ్వామిత్రుడు, లక్ష్మణుడితో కలిసి గౌతమ మహర్షి ఆశ్రమం గుండా సీతా స్వయంవరానికి వెళుతుంటారు. నిర్మానుష్యమైన, కళావిహీనమైన ఆ ఆశ్రమాన్ని చూచి అది ఎందుకు అలా ఉంది? అని రాముడు విశ్వామిత్రుని ప్రశ్నించగా , ఆయన వారి వృత్తాంతాన్ని రాముడికి వివరిస్తాడు. రాముడు వేంచేయటముతో అక్కడితో అహల్యకు శాపవిమోచనము కలిగినదని వివరిస్తాడు. వాల్మీకి రామాయణములో అహల్య శిలగా వుండుట, రాముడు శిలను కాలితో స్పర్శించుట అనునది లేదు, ఇక్కడ శిల అనునది , కదలకుండా , తీవ్ర తపోనిష్ఠలో వుండుటకు వ్యుత్పత్తి అనుకోవచ్చును. పరాగము కప్పబడి ఆ ప్రాంతమంతయు అహల్య అదృశ్యరూపములో అహల్య వుండెను. శ్రీరాముని పాదస్పర్శ యనిన ఇక్కడ గౌతమముని ఆశ్రమములో రాముడు పాదములు మోపుట అని భావింపవలెను. అనగా, కేవలము శ్రీరాముని ఉనికి మాత్రం చేత గౌతమముని ఆశ్రమము నందు అహల్యకు శాపవిమోచనము కలిగెనను. గౌతముడు కూడా వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి సీతా స్వయంవరంలో జయం కలిగేలా దీవిస్తాడు



విశ్వనాధవారి కల్పవృక్షంలో అహల్యకు ఇంద్రుడిపైన వ్యామోహం అణువంతైనా లేదన్నారేమిటి?అహల్య కథ వేదాదుల్లో కూడా ఉంది. అందులో కొన్ని సాంకేతికార్ధ రహస్యాలున్నాయని చెప్పుకున్నాం గదా. విశ్వనాధ సత్యనారాయణగారు వేదాలవరకు, పురాణాలవరకు వెళ్లిపోయి అహల్యా పదానికి ‘దున్నడానికి వీలుపడని క్షేత్రం’ అని అర్ధం. ఇంద్రుడు అంటే వర్షం అని సంకేతం. ఈ అర్ధాలను మనసులో పెట్టుకుని, అహల్యకి మోహం లేకపోయినా ఆమె సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించింది అని చెప్పాడు. అయితే శిలారూపం దగ్గరికి వచ్చేటప్పటికి శిలా పదాన్ని కేవలం రాయి అనే అర్ధంలో తీసుకున్నట్టయితే అర్ధం కుదరదు.

రామాయణంలో ఆ రాయికి ఆకలి దప్పులు వుంటాయి. ‘కేవలం వాయుభక్షణం చేస్తావు కాని కదలడానికి వీల్లేదు. అయినా ఆలోచనలు ఉంటాయి. అటువంటి నికృష్ట జీవితం నీకు కొన్ని వేల సంవత్సరాలు’’ అని గౌతముడు శిక్ష వేస్తాడు. అంటే ఏ సాధకుడు అయినా ఉపాసనలో పొరపాటుచేస్తే వాడికి ఇది శిక్ష. కాని నిజమైన ఉత్తమ తపస్వికి ఇది శిక్ష కాదు. ఇది సమాధికి అత్యంత అనుకూలం. వాడికి ప్రపంచంతో సంబంధం లేదు. ఆకలి దప్పులను పరిత్యాగం చేస్తే మనుస్సును పరమాత్మతో అనసంధానం చేయవచ్చు అని అహల్య భావించింది కనుక విశ్వనాధ సత్యనారాయణ ఇలా చెప్పారు. కేవలం సాధన మార్గాన్ని మాత్రమే వాల్మీకి చెప్పారు. ఇవి రెండూ రెండు దృక్కోణాలు!


*మన మతంలో ధర్మశాస్త్రానికి మరీ అంత ప్రాముఖ్యం ఎందుకు?మనది మతం కాదు. మనది ధర్మం. వేద ధర్మం మతం అనేది ఆ తర్వాత చాలా లక్షల సంవత్సరాల తరువాత పుట్టింది. ప్రకృతిలో సహజ సిద్ధమైన ఏ లక్షణం వుంటుందో అది ప్రకృతి ధర్మం. వైదేసికంగా వికాసం చెందిన మానవుడు క్రమంగా ప్రకృతికి దూరంగా జరుగుతాడు. దానివల్ల కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటాడు. అలాంటి విపత్తుల నివారణ కోసం మహాత్ములు కొన్ని నిబంధనలు ఏర్పరిచారు.ఈ నిబంధనలు గ్రంథంగా ఏర్పడ్డాయి. అవే ధర్మశాస్త్రాలు. అందుకే అవి ముఖ్యమైనవి.

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

16.02.2025,ఆదివారం

 *జై శ్రీమన్నారాయణ* 

16.02.2025,ఆదివారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయనం - శిశిర ఋతువు

మాఘ మాసం - బహుళ పక్షం

తిథి:చవితి రా12.23 వరకు

వారం:(భానువాసరే) 

(ఆదివారం)

నక్షత్రం:హస్త తె3.02 వరకు

యోగం:ధృతి ఉ7.17 వరకు

కరణం బవ ఉ11.25 వరకు

తదుపరి బాలువ రా12.23 వరకు

వర్జ్యం:ఉ9.52 - 11.38

దుర్ముహూర్తము:సా4.25 - 5.11

అమృతకాలం:రా8.26 - 10.12

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి:కుంభం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం:6.31

సూర్యాస్తమయం:5.57




పుట్టిన ప్రతి ప్రాణికీ పూర్తికాలం జీవించాలన్న కోరిక ఉంటుంది. చరాచరాలకూ అలాగే ఉంటుంది. చెట్టును కాండం మొదలు వరకు నరికినా అది మళ్ళీ చిగురించాలన్న కాంక్షతో ఉంటుంది. నిత్యం పారే నదికి ఓ కొండ అడ్డుపడ్డప్పుడు అది కొద్దిసేపు ఆగి సేదదీరుతుంది. పల్లం ఎటువైపుందో తెలిసేదాకా నిరీక్షిస్తుంది. ఆ తరవాత దారి చూసుకొని ముందుకు ప్రవహిస్తుంది.

అడవిలో మొలిచే మొక్కలకు నీళ్లు పోసేవారెవరూ ఉండరు. అలాగని అవి నిరాశకు లోనుకావు. వర్షాల ఆగమనానికై ఆశగా ఎదురుచూస్తాయి. వీలుకానప్పుడు పులి కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. దానికీ మరణభయం ఉంటుంది. ఆయుష్షు తీరేదాకా బతకాలన్న బలమైన వాంఛా ఉంటుంది.

ఒక్కోసారి వెనక్కి రావడమూ ముందుకు పోవడంలో భాగం అవుతుంది. వాస్తవానికి అది సార్వజనీనం! జీవన పయనం- ఏ దిశలో సాగుతోంది అన్నది ముఖ్యం కాదు. అది ఆరోహణా భావనతో ఉందా లేదా అన్నదే ప్రధానం. జీవచైతన్యానికి నిర్విరామంగా విస్తృతం కావడమే తెలుసు. ఆ సహజాతి సహజ గమనం పటాటోప ప్రదర్శన కాదు. ఎవరి మెచ్చుకోలు కోసమో చేసే పని అంతకన్నా కాదు.

నాన్న నేర్పిన చదువు:*

 🔔  *సంస్కృతి*  🔔


*నాన్న నేర్పిన చదువు:*


*తండ్రి:-*

।।ఓం నమః శివాయ।।

అబ్బాయీ! *పద్మము* అనే పదానికి పర్యాయవాచకాలను చెప్పు?


*కొడుకు:-*

కమలము, నళినము, తామరపూవు


*తండ్రి:-*

అంతేనా!?


*కొడుకు:-*

నాకంతే తెలుసు!!!


*తండ్రి:-*

నేను చెబుతాను చూడు - *వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము...*


*కొడుకు:-*

నాన్నా! నాన్నా! ఆగు.


*తండ్రి:-*

చెప్పు.


*కొడుకు:-*

వీటన్నిటికీ అర్థం *పద్మం* అనేనా!?


*తండ్రి:-*

అవును.


*కొడుకు:-*

మరి *నిఘంటువు* (డిక్షనరీ) వెదికితే ఇవన్నీ దొరుకుతాయా!?


*తండ్రి:-*

ఆయా డిక్షనరీ కర్తల ఓపికను బట్టి ఉంటుంది. అన్నీ అన్నిట్లోనూ దొరకకపోవచ్చు.


*కొడుకు:-*

మరి డిక్షనరీలలో కూడా దొరకని పదాలు నీకెలా దొరికాయి!?


*తండ్రి:-*

నేను *అమరకోశం* చదువుకున్నాను.  అందువల్ల నేనే స్వయంగా అనేకపదాలను సృష్టించగలను. నాకు వేరే డిక్షనరీ అవసరం లేదు.  


*కొడుకు:-*

అదెలా!?


*తండ్రి:-*

*అమరకోశం* లో కొన్ని *పర్యాయపదా* లను *అమరసింహుడు* ఉపదేశించాడు. వాటికి కొన్ని *ప్రత్యయాలు* (Suffix) జోడిస్తే వేరే అర్థాన్ని బోధించే పదాలను మనం కూడా సృష్టించుకోవచ్చును.


*కొడుకు:-*

ఎలా?


*తండ్రి:-*

చెబుతా చూడు - *1. వారి, 2.నీరమ్, 3. జలమ్, 4.సలిలమ్, 5. కమ్, 6.తోయమ్, 7. ఉదకమ్, 8. పుష్కరమ్, 9.పయః, 10.అంభః, 11. అంబు...* ఇటువంటి కొన్ని పదాలను అమరసింహుడు *నీరు* అనే అర్థంలో చెప్పాడు.


*కొడుకు:-*

అయితే!?


*తండ్రి:-*

పద్మము పుట్టేది ఎక్కడ!? నీటిలో కదా!? అందువల్ల పైన చెప్పిన పదాలకు *జ* అనే ప్రత్యయం (suffix) చేరిస్తే - *పద్మము* అనేపదానికి సమానార్థకాలైన పదాలు వచ్చేస్తాయి.  మళ్లీ చెప్పనా!?  *వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము...*


*కొడుకు:-*

చివరలో *జ* - అని ఎందుకు చేర్చాలి!?


*తండ్రి:-*

*జ* - అంటే *జాతము, జన్మించినది* అని అర్థం వస్తుంది. *జలజ* అంటే *జలములో జన్మించినది* అని అర్థం. అలాగే *నీరజ* అంటే *నీటిలో జన్మించినది* అని అర్థం. అలా పదాలు పుట్టుకొస్తాయి.


https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B


*కొడుకు:-*

*జ* అనే ప్రత్యయం కాకుండా వేరే ప్రత్యయం చేర్చవచ్చా!?


*తండ్రి:-*

*"జాతము"* అనవచ్చు.


*కొడుకు:-*

అయితే నేను చెబుతాను చూడు. *వారిజాతము, నీరజాతము, జలజాతము, సలిలజాతము, కంజాతము, తోయజాతము, ఉదకజాతము, పుష్కరజాతము, పయోజాతము, అంభోజాతము, అంబుజాతము...*


*తండ్రి:-*

భలే! నీకు కూడా పదాలను సృష్టించే కళ వచ్చేసింది.


*కొడుకు:-*

*జ, జాత* మాత్రమే కాకుండా ఇంకే ప్రత్యయాలనైనా ఉపయోగించవచ్చా!?


*తండ్రి:-*

*భవ, ఉద్భవ, సంభవ* అనే పదాలను చేరిస్తే *పుట్టినది* లేదా *పుట్టినవాడు* అనే అర్థం వస్తుంది.  ఉదాహరణకు *జలభవము, జలోద్భవము, జలసంభవము* అంటే *జలంలో పుట్టినది* అని అర్థం.  అలాగే తృతీయ *నీరభవము, నీరోద్భవము, నీరసంభవము* అని చెప్పవచ్చు. అలాగే *రుహ* అనే ప్రత్యయం చేర్చవచ్చు. *రుహము* అంటే *పెరిగేది.* 


*కొడుకు:-*

అయితే నేను చెబుతా దానితో పేర్లు - *వారిరుహము, నీరరుహము, జలరుహము, సలిలరుహము, కంరుహము, తోయరుహము, ఉదకరుహము, పుష్కరరుహము, పయోరుహము, అంభోరుహము, అంబురుహము...*


*తండ్రి:-*

బాగా చెప్పావు. ఏకసంథాగ్రాహివి. వీటన్నిటికీ కూడా *పద్మము* అనే అర్థం. ఇంతకూ ఎన్ని పదాలను సృష్టించగలవో అర్థమైందా!?


*కొడుకు:-*

నీటికి *11* పర్యాయవాచకాలు చెప్పావు. వాటికి *జ* అనే ప్రత్యయం చేర్చి, *పద్మం* అనే అర్థంలో *11* పర్యాయవాచకాలు సృష్టించగలను. *జాత* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు సృష్టించగలను. *రుహ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు సృష్టించగలను. *భవ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు చెప్పగలను, *ఉద్భవ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు చెప్పగలను, *సంభవ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు చెప్పగలను. అంటే, మొత్తానికి *పద్మము* అనే అర్థంలో ఇప్పటికిప్పుడు *66* పదాలను చెప్పగలను.


*తండ్రి:-*

మరి మొదట అడిగితే మూడే మూడు పదాలు చెప్పి, ఇంతకంటె మరేమీ చెప్పలేనన్నావు!?  ఇప్పుడేమో ఏకంగా *66* పదాలు చెప్పగలనంటున్నావు!?


*కొడుకు:-*

నువ్వు ఇలా విడమరచి చెబితే ఎందుకు చెప్పలేను!?


*తండ్రి:-*

ఇంతే కాదు, వీటితో ఇంకా ఎన్నో అర్థాలలో ఎన్నెన్నో పదాలను సృష్టించవచ్చు.


*కొడుకు:-*

అదెలా నాన్నా!?


*తండ్రి:-*

పద్మంతో సంబంధం ఉన్న పౌరాణికవ్యక్తులెవరైనా ఉన్నారా చెప్పు!?


*కొడుకు:-*

పద్మాన్ని హస్తంలో ధరించే *విష్ణువు* ఉన్నాడు. పద్మాన్ని నాభిలో ధరించిన అదే *విష్ణువు* ఉన్నాడు. పద్మంలో జన్మించిన *బ్రహ్మదేవుడు* ఉన్నాడు.  *క్షీరసాగర* మధ్యంలో *పద్మం* లో జన్మించిన *లక్ష్మీదేవి* ఉన్నది.


*తండ్రి:-*

మంచి పురాణజ్ఞానం ఉన్నదే నీకు!? సరే, ఇప్పుడు చూడు.  *పద్మం* అనే అర్థంలో నీవు *66* పదాలు చెప్పగలవు కదా!?  వాటికి చివర *హస్తుడు* అని చేర్చు. వాటన్నిటికీ *పద్మాన్ని చేతిలో ధరించినవాడు* అనే భావంలో *విష్ణువు* అనే అర్థం వస్తుంది.  అంటే ఈ క్షణంలో నీవు *విష్ణువు* అనే పదానికి పర్యాయవాచకాలు *66* చెప్పగలవు.


*కొడుకు:-*

ఓహో. బలే! అర్థమైంది. *వారిజహస్తుడు, నీరజహస్తుడు...* ఇలా అన్నమాట.  


*తండ్రి:-*

అవును.


*కొడుకు:-*

అయితే నాన్నా, *హస్తం* అనే పదంతో పాటు *కరము, పాణి* అనే పదాలను కూడా *చేయి* అనే అర్థంలోనే ప్రయోగిస్తాం కదా! వాటిని కూడా ప్రత్యయాలుగా ఉపయోగించవచ్చా!?  


*తండ్రి:-*

హాయిగా ఉపయోగించవచ్చు.  ఆవిధంగా *హస్తుడు* అనే ప్రత్యయాన్ని చేర్చి *66*, *కరుడు* అనే ప్రత్యయాన్ని చేర్చి మరో *66*, *పాణి* అనే ప్రత్యయాన్ని చేర్చి మరో *66* మొత్తం *198* పదాలను నీవు స్వయంగా సృష్టించగలవు.


*కొడుకు:-*

అయ్యో నాన్నా, డబుల్ సెంచురీకి రెండు తక్కువైనాయే!?


*తండ్రి:-*

నీటికి ఇంకా *కబంధము, వనము, భువనము, అమృతము, అప్, సర్వతోముఖము, పానీయము, క్షీరము, శంబరము...* ఇట్లా చాలా పర్యాయవాచకాలు ఉన్నాయి. నీవు అన్నీ గుర్తుంచుకోలేక కంగారుపడతావని మొదట్లో ఓ పదకొండు మాత్రమే చెప్పాను. ఆ పదాలతో *పద్మం* అనే అర్థం సాధించి, మరలా ఆ *పద్మాన్ని చేత ధరించినవాడు* అనే అర్థంలో ఇంకెన్ని *విష్ణుపర్యాయవాచకాల* ను సృష్టించవచ్చో చూడు. 


*కొడుకు:-*

బలే నాన్నా! బలే.  అలాగే *పద్మంలో పుట్టిన బ్రహ్మ* అనే అర్థంలో - పద్మం యొక్క *66* పర్యాయవాచకాలకు *జ, జాత, భవ, సంభవ, ఉద్భవ,  రుహ* అనే ఆరు ప్రత్యయాలు చేర్చితే మొత్తం *396* (66x6) పదాలను ఈ క్షణంలోనే పుట్టించగలను.


*తండ్రి:-*

ఓహో! సమస్తప్రపంచాన్ని పుట్టించిన బ్రహ్మకే అన్ని పదాలు పుట్టించావా!?  *పద్మజుడు, పద్మసంభవుడు* అంటూ వాటిని పుంలింగాలలో ప్రయోగిస్తే *బ్రహ్మ* అనే అర్థం వస్తుంది. వాటిని *పద్మజ, పద్మసంభవ* అంటూ స్త్రీలింగాలలో ప్రయోగిస్తే *లక్ష్మీ* అనే అర్థం వస్తుంది. మరి ఆ *బ్రహ్మకు తండ్రి విష్ణువు* అనే అర్థంలో మరెన్ని పుట్టించగలవో చెప్పు!? 

 

*కొడుకు:-*

*పద్మంలో పుట్టినవాడు బ్రహ్మ* అనే అర్థంలో *396* పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా! *తండ్రి* అనే అర్థాన్నిచ్చే *జనక, గురు, పితా, జన్మద* అనే నాకు తెలిసిన ఓ నాలుగు ప్రత్యయాలను ఆ *396* పదాలకు చేరిస్తే (396x4) *1584* పదాలను *విష్ణువు* అనే అర్థంలో సృష్టించగలను.


*తండ్రి:-*

మరి *లక్ష్మీదేవికి భర్త విష్ణువు* అనే అర్థంలో ఎన్ని పదాలు సృష్టించగలవు!?


*కొడుకు:-*

*పద్మంలో పుట్టినది లక్ష్మీ* అనే అర్థంలో *396* పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా! వాటికి *పతి, ప్రియ, వల్లభ, నాథ, భర్త, ప్రాణేశ* వంటి నాకు  తెలిసిన ఓ *6* ప్రత్యయాలను చేర్చి (396x6) *2376* పదాలను సృష్టించగలను. 


*తండ్రి:-*

చూశావా, నీవు విష్ణుసహస్రనామాలను రచించావు. విష్ణువుకు మొత్తం *3960* నామాలను సృష్టించావు. (1584+2376)


*కొడుకు:-*

అయ్యో, నాలుగు వేల నామాలకు ఒక 40 తక్కువయ్యాయే.


*తండ్రి:-*

*పద్మాన్ని నాభిలో కలిగినవాడు పద్మనాభుడు* అంటే *విష్ణువు* కదా! పద్మానికి *66* పర్యాయపదాలు నీకు తెలుసు కదా! వాటికి చివర *నాభుడు* అనే ప్రత్యయం తగిలించు.  *వారిజనాభుడు, జలజనాభుడు* అంటూ. కాబట్టి, *3960+66=4026* నామాలు వచ్చాయి.  మొత్తానికి ఇలా *విష్ణుచతుస్సహస్రనామాలు* సృష్టించగలవు.


*కొడుకు:-*

సంస్కృతం కొద్దిగా నేర్చుకుంటే, పదసంపదను ఇంత సులువుగా, ఇంత అపారంగా సృష్టించవచ్చా!?


*తండ్రి:-*

అవును. ఇప్పుడు చెప్పినవి కేవలం మచ్చుకు మాత్రమే. ఈవిధంగా సంస్కృతపదాలను ఇంకా వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా అలవోకగా సృష్టించవచ్చు.  ఇన్నేసి పదాలను డిక్షనరీలో చేర్చి వాటికి అర్థాలు ఎవరూ వ్రాయరు. అందువల్ల ఒక పదానికి అర్థం తెలియక డిక్షనరీ వెదికి, అక్కడ కనబడకపోతే అబ్బో అబ్బో సంస్కృతం చాల కష్టం సుమీ! అంటూ ఉంటారు.  


*కొడుకు:-*

అవును నాన్నా! ఇంతవరకు నేను కూడా ఇలాగే అనుకున్నాను.  


*తండ్రి:-*

సరే, *నళినదళేక్షణ* అనే పదం విన్నావా!?


*కొడుకు:-*

నా తరమా భవసాగరమీదను, నళినదళేక్షణ రామా అనే కీర్తనలో ప్రసిద్ధమే కదా!?


*తండ్రి:-*

*నళినదళేక్షణుడు* అంటే అర్థం ఏమిటి!?


*కొడుకు:-*

రాముడు.


*తండ్రి:-*

ఆ కీర్తన విని, ఆ కీర్తనలో రామపరంగా వాడిన పదాన్ని బట్టి *రాముడు* అంటూ రూఢి అర్థాన్ని గ్రహించావు. మరి *యౌగికార్థం* (యోగపరమైన) చెప్పు!?


*కొడుకు:-*

అదేమిటి?


*తండ్రి:-*

*నళినము* అంటే పద్మము. *నళినదళము* అంటే పద్మదళము, *ఈక్షణము* అంటే *చూపు* లేదా *కన్ను*.  కాబట్టి *నళినదళేక్షణుడు* అంటే *పద్మపు రేకులవంటి కన్నులు కలవాడు* అని అర్థం. అది యౌగికార్థం అంటే. అటువంటి కళ్లు ఎవరికి ఉన్నా సరే, వాళ్లందరూ కూడా నళినదళేక్షణులే. నీవు ఇంతవరకూ చెప్పిన పద్మపర్యాయవాచకాలు, విష్ణుపర్యాయవాచకాలు, బ్రహ్మపర్యాయవాచకాలు, లక్ష్మీదేవి పర్యాయవాచకాలు అన్నీ యౌగికపదాలే.  


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  - చతుర్థి - హస్త -‌‌  భాను వాసరే* (16.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

15, ఫిబ్రవరి 2025, శనివారం

భార్యాభర్తల బంధాని కంటే మించిన బంధం

 భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి, వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ వుంది. భర్త ఆమె చేయి పట్టుకుని, నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు. అతను ఆమె తో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమె కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..ఎలాగయినా ఆమె కి ఆ విషయం చెప్పాలి.. చివరికి ఇలా చెప్పాడు..


భర్త - నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తన తో అసలు విషయం చెప్పాడు.భార్య - (ఆ మాటలకి బదులుగా ఆమె ) ఎందుకు అని మాములుగా అడిగింది? భర్త - ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏం ఇవ్వలేదు..భార్య - (ఆమెకి కోపం వచ్చింది.) ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి, మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది..


ఆ రాత్రి, వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్త ని గట్టిగా అడిగింది..భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు.


.భర్త - నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీపైన ప్రేమ లేదు..


భార్య - ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది.. ఒక నిమిషం ఏం అవుతుందో తనకేం అర్థం కాలేదు..


భర్త - గిల్టీ ఫీలింగ్ తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు వొప్పుకునేందుకు , నువ్వు ఉండడానికి సొంత ఇల్లు , కారు అండ్ నా సంస్థ లో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు..


భార్య - చాలా కోపం తో ఆ పేపర్లు ని చింపేసింది.. ప్రేమ ని ఎప్పటికి కొనలేరు అని గట్టిగా ఏడిచేసింది..


భర్త గా తన లైఫ్ లో ఒక తెలియని వ్యక్తి లా ఆమె జీవితంలో పది సంవత్సరాలు వున్నాడు. అతని భార్య సమయం వృధా చేసానని బాధ పడుతున్నాడు. అతను తన భార్య ని అర్థం చేస్కునే ప్రయత్నం ఎప్పుడు చెయ్యలేదు.కానీ అతను జాను ని మాత్రమే ప్రేమిస్తున్నాడు.. ఏడుస్తున్న తన భార్య ని చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది..


మరుసటి రోజు, అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తు కనిపించింది. అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఏందుకుంటే ఆ రోజంతా అతని లవర్ జానూ తో కలిసి రోజంతా తిరగటం వల్ల, బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్య ని పట్టించుకోకుండా, పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు. ఉదయం, ఆమె విడాకులకు సంబధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతని నుండి ఏమి కోరుకోవటంలేదు, కానీ విడాకులు ముందు ఒక నెల రోజుల పాటు అతను తన తో వుండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది. ఆమె కారణాలు చాలా సాధారణం గా ఉన్నాయి. వాళ్ళ కొడుకుకు ఒక నెల రోజుల్లో పరీక్షలు వున్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను, వాళ్ళ భర్త ని నెల రోజులు గడువు అడిగింది. నాకు అంగీకరమే అని వాళ్ళ భర్త ఆమె తో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది, మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఏలా తీసుకువెళ్ళారు గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతి రోజు ఉదయం ఆమె ని ఎత్తుకుని వాళ్ళ బెడ్ రూమ్ నుండి హల్ వరకు తీసుకువెళ్లాలని కోరింది. అప్పుడు అతడు ఆమె కి మతిపోయిందా అని అనుకున్నాడు. వాళ్ళు కలిసివుండే చివరి రోజులలో, తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతులు గురించి అతని లవర్ జానూ కి చెప్పాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు కి అర్ధంలేనట్లుగా అతను భావించాడు. నీ భార్య, నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలాడుతుంది అని జాను అతని తో అంది.. విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి , అతని భార్యకు ఏలాంటి శారీరక సంబంధం లేదు మొదటి రోజున తాను తన భార్యను ఎత్త్తుకున్నప్పుడు, అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది.



"హేయ్..! నాన్న, అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లుకొట్టాడు". ఆ అబ్బాయి మాటలు అతనికి కు బాధను కలిగించాయి. అలా ఎత్తుకుని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తన తో ఇలా చెప్పింది. "మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగినా, నవ్వాడు.. అతను ఆఫీస్ కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరకి వచ్చింది... ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురుచూస్తుంది. తాను ఆఫీసుకు ఒక్కడే , ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. . రెండవ రోజు న , వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది..ఆమె తల తన గుండె ని తాకుతుంది..ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది.. తాను కొంత కాలంగా తన భార్య ని గమనించలేదు అని అనుకున్నాడు. ఆమె వయసు పైబడుతుందని అతను గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడుతలు కనిపిస్తున్నాయి, ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహం మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్త ని భార్య అడిగింది. అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తు తాను ఆశ్చర్యపోయాడు.. నాలుగో రోజు, తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరితనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ అంమ్మాయ్ తోనేనా నేను పది సంవత్సరాల జీవించిదని అతనికి అనిపించింది. ఐదవ మరియు ఆరవ రోజున, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నందని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జాను కి చెప్పలేదు. ఇలా నెల రోజులు తన భార్యను తీసుకుని వెళ్ళటం సులభంగా మారిపోయింది. బహుశా రోజు ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా, దృఢంగా అనిపించాడు. ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్ లు ట్రై చేసింది కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూస్ గానే ఉంది.. అప్పుడు అతనికి అర్థం అయ్యింది తను చాలా సన్నగా అయ్యింది అని.. అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని.. ఆ విషయం అతనికి బలం గా తగిలింది.. ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థం అయ్యింది.. అతనికి తెలియకుండానే అతని చేయి ఆమె తల ని తాకింది... ఆ సమయం లోనే వాళ్ళ అబ్బాయ్ వచ్చాడు.. ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్న తో ఇలా అన్నాడు.."నాన్న అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది.." అని అన్నాడు.. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ అబ్బాయిజీవితంలో విలువైన, అపురూపమైన సంఘటన.. అతని భార్య, వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకు రమ్మని సైగ చేసింది, వాడు వాళ్ళ అమ్మ దగ్గరకి వచ్చాడు.. వాళ్ళ అమ్మ ఆ అబ్బాయ్ ని గట్టిగా హత్తుకుంది.వాళ్ళ నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు. రోజులానే అతను ఆమె ని ఎత్తుకుని బెడ్ రూం నుండి హల్ కి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమ గా, సహజం గా వేసింది.. అతను ఆమె ని గట్టిగా పట్టుకున్నాడు అచ్ఛం వాళ్ళ పెళ్లి రోజులాగా, కానీ ఆమె చాలా తేలికగా వుండటం వలన అతనికి చాలా బాధ గా అనిపించిది. చివరి రోజున, అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కో అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూలుకి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకుని తనతో ఇలా చెప్పాడు, "మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయి" అని చెప్పాడు.. తర్వాత అతను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. కారు నుండి వేగం గా దిగి, డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యేకొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపొతుందెమో అని. అతను జాను వుండే క్యాబిన్ కి వెళ్ళాడు.. సారి చెప్పి , అతను తన భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదని చెప్పాడు. ఆమె(జాను) అతని వైపు ఆశ్చర్యంగా చూసి, తన నుదిటిపై చేయి వేసింది. నువ్వు బాగానే వున్నావ్ కదా? అని అడిగింది. అతను తన నుదిటి మీద వున్న ఆమె చేతిని తీసి, సారీ జాను నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవటం లేదు. మా వివాహా జీవితం నాకు విసుగుగా అనిపించేది ఎందుకంటే నాకు,తనకి ప్రేమ విలువ, గొప్పతనం తెలియలేదు. మేము ఎప్పుడు ప్రేమ గా మాట్లాడనుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు..ఎప్పుడయితే నేను తనని అలా ఎత్తుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థం అయ్యింది తను చనిపోయే దాకా నేను తనని అలానే చూసుకుంటానని అచ్ఛం మా పెళ్లిరోజు లానే....జాను హఠాత్తుగా లేచి, అతనిని ఒక చెంప దెబ్బ కొట్టింది. ఏడుస్తు తన ని బయటకి పంపి తలుపు వేసింది. ఇంక అతను ఇంటికి వెళ్తూ దారి లో పూల దుకాణం వద్ద, తన భార్య కోసం ప్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు. కార్డ్ మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది . అప్పుడు అతను నవ్వుతూ "మరణం మనల్ని దూరం చేసేవరకు... నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను ." అని రాయమని చెప్పాడు.. ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఏక్కి పైకి వెళ్ళాడు .తన భార్యను మంచం మీద చూసాడు.అప్పటికే ఆమె చనిపోయింది.ఒక్కసారి అతని కి ఏం అర్థం కాలేదు.. తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్..తన భార్య కొన్ని నెలలగా క్యాన్సర్ తో పోరాడుతుంది. తాను జాను తో బిజీగా వుండటం వల్ల ఈ విషయం తను గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకి తెలుసు. ఆమె వాళ్ళ సంసార మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంతవరకు వాళ్ళ కొడుకుకు దూరంగా వుంచి, తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా వుండాలి అనుకుంది. మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్ధం తెలుపుతాయి. భవనం, కారు, ఆస్తి, బ్యాంకు లో డబ్బు ఇవేమి బంధానికి సంబధించినవి కావు. ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందం ఇవ్వవు. మీ జీవిత భాగస్వామితో వీలునైంతవరకు సమయం కేటాయిస్తూ, ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ వుంటే ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరుగుతాయి. అప్పుడు నిజమైన, సంతోషకరమైన వివాహం బంధం నిలబడుతుంది. మనం ఏం చేసినా , ఎంత ప్రేమ గా చూసుకున్న అని వాళ్ళు వున్నప్పుడే చూసుకోవాలి.. వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమ చూసుకుందాం అన్న వాళ్ళు మనతో వుండరు..


చాలా మంది కేవలం అపార్ధాల వల్ల విడిపోతున్నారు, ఇది చదివి కొంతమందైనా తాము చేసే తప్పును తెలుసుకుని, తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాను..... ఎన్ని ఎన్ని వాలెంటైన్ డేస్ వచ్చిన ఈ వ్వాలంటైడే విషెస్ బార్యా కి చెప్పి సంతోషంగా చూసుకోండి  ఎందుకంటే ఈ సృష్టిలో భార్యాభర్తల బంధాని కంటే మించిన బంధం ఏది ఉండదు. ఈ జన్మలోనే భార్య భర్తలు మరో జన్మలో ఏమవుతామో ఎవరికీ తెలియదు భగవంతునిఅనుమతి తో ఏర్పడ్డ ఈ బంధం ఇద్దరిలో ఎవరో ఒకరు శాశ్వతంగా దూరమైన తనతో గడిపిన మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ శేష జీవితాన్ని పిల్లలతో ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ ఈ చిన్న ప్రయత్నం 🌹🌹🙏.... దయచేసి క్షమించండి గ్రూపుకు సంబంధించిన విషయం కాదు కానీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి గ్రూప్ లో పెట్టడం జరిగింది🙏🙏🙏🙏

క్యాన్సర్ కారకమయ్యే ఆహారపదార్థాలలో

 .క్యాన్సర్ కారకమయ్యే ఆహారపదార్థాలలో మైదా ప్రధానమైంది. గోధుమల ద్వారా గోధుమ పిండి, జొన్నల ద్వారా జొన్న పిండి, రాగుల నుంచి రాగి పిండి వస్తుంది. మరి మైదా పిండి వేటి నుంచి వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా?

మిల్లులో బాగా పాలిష్ చేసిన గోధుమల నుంచి పిండికి Azodicarbonmide, chlorine gas benzoyl peroxide అనే రసాయనాలు ఉపయోగించి తెల్లగా చేస్తారు. బెంజాయిల్ పెరాక్సైడ్ వాడకాన్ని చైనా, ఐరోపాలో నిషేదించారు. మైదాలో అల్లోక్సాన్ అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదాపిండి ముట్టుకోవడానికి మెత్తగానూ, చూడ్డానికి తెల్లగానూ ఉంటుంది.

దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల తయారీలో వాడతారు కొన్ని కార్యాలయాల్లో కూడా కవర్లు అంటించేందుకు, గోడలపై సినిమా పోస్టర్లు అంటించేందుకు వాడతారు. మైదా పిండి తో రవ్వ దోస, పరోటా, రుమాలి రోటి, కేకులు, పిజ్జాలు హల్వా,జిలేబి వంటి మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైనవి తయారుచేస్తారు.

మైదాపిండి నిత్యం లేదా అధికంగా వాడటం వల్ల మధుమేహం, గుండె జబ్బులు రావడం, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి.

సాధారణంగా గోధుమలు ని ఆడిస్తే వచ్చే పిండి లేత  గోధుమ రంగు లో ఉంటుంది.ఈ గోధుమపిండికి రకరకాల రసాయనాలు కలిపి మైదా పిండి తయారు చేస్తారు. రక రకాల రసాయనాలను కలపడం వల్ల చూసేందుకు తెల్లగా, పట్టుకునేందుకు మెత్తగా కనిపిస్తుంది. హోటళ్లలో తయారుచేసే వంటకాలలో మినప గుండ్లకు బదులు మైదాపిండిని విరివిగా వాడుతున్నారు. దీనివల్ల అనేక రకాల అనారోగ్యాలు పొంచి ఉన్నాయి. మైదా పిండితో తయారు చేసే వంటకాల వల్ల గుండె జబ్బులు, మధుమేహం, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మైదా పిండితో తయారు చేసే వంటకాలు క్యాన్సర్ రోగులకు మరింత ప్రమాదకరం. వీటివల్ల క్యాన్సర్ కణుతులు వేగంగా వృద్ధి చెందుతాయి. అదేవిధంగా మధుమేహం ఉన్న వారు మైదా పిండి తో తయారు చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల శరీరంలో మరింతగా చక్కెర నిల్వలు పెరుగుతాయి.థైరాయిడ్, హార్మోన్ల సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లు  అధిక బరువు ఉన్నవాళ్లు కూడా మైదా పిండి తో తయారు చేసిన వంటకాలు మానేస్తే మంచిది.

 (మరొక మాట మనం పోగొట్టుకున్న వస్తువు దొరుకుతుందేమో కానీ ఎప్పటికీ దొరకనిది జీవితం.... ఉన్నన్ని నాళ్ళు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి కనీసం చుట్టూ ఉన్న బుజ్జాయిలతోఅయినా సమయాన్ని కేటాయిస్తూ వీళ్ళతో ఉంటే పువ్వు నవ్వు లవ్వు మనదే ).

 

*సుధ కొనకళ్ళ అనువంశిక ఆయుర్వేద వైద్యురాలు సుధ కొనకళ్ళ హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సత్తుపల్లి ఖమ్మం జిల్లా*

సప్త చిరంజీవులు

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

         *సప్త చిరంజీవులు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*అశ్వత్థామా బలిర్వ్యాసో*. 

*హనుమాంశ్చ విభీషణః ।*

*కృపః పరశురామశ్చ*

*సప్త ఏతైః చిరంజీవినః ॥*


*సప్తైతాన్ సంస్మరేన్నిత్యం*

*మార్కండేయమథాష్టమం ।*

*జీవేత్ వర్షశ్శతమ్ సొపి*

*సర్వవ్యాధి వివర్జిత ॥*


*శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థాముడు, వామనుడి అనుగ్రహమువలన బలిచక్రవర్తి,  లోకహితముకై వ్యాసుడు, శ్రీరామభక్తితో హనుమంతుడు, శ్రీ రాముడి అనుగ్రహమువలన విభీషణుడు, విచిత్రజన్మము వలన కృపుడు, ఉత్క్రుష్ట తపోధనుడైన పరశురాముడు సప్తచిరంజీవులైరి।*


*వీరి తర్వాత శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుని ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై శత వర్ష ఆయుష్మంతులౌతారని పై  శ్లోక తాత్పర్యము.*


*చిరజీవులు లేదా చిరంజీవులంటే చావులేనివారని అర్థం.*


*అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు ఈ ఏడుగురు చిరంజీవులని పురాణాలు చెపుతున్నాయి.*


*పుట్టిన రోజున పాలు, బెల్లం, నువ్వులు కలిపిన మిశ్రమాన్ని దేవునికి నైవేద్యం నివేదించి, పై శ్లోకమును చదివి, ఆ మిశ్రమాన్ని  మూడు సార్లు తీర్థంలా తీసుకోవడం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోతాయని పురాణ వచనం.*


*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ముందు శ్లోకంలో హరి, బ్రహ్మవంటి దేవతలు ఈశ్వరుని సేవిస్తున్నారని చెప్పబడింది. అలా తనను సేవిస్తున్న బ్రహ్మకు, ఈశ్వరుడు చేసిన ఉపకారాన్ని చూసి, ఈశ్వరుని భజన చేయడం వల్ల, తామునూ కృతార్థులమైనామని  శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు.*


*శ్లోకం:19*


*దురాశా భూయిష్టే దురధిప గృహద్వార ఘటకే*

                  

*దురంతే సంసారే దురిత నిలయే  దుఃఖ జనకే*

                   

*మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే*

                   

*వదేయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థాః ఖలు వయమ్.*


*పదవిభాగం : ~*


*దురాశా  భూయిష్టే _ దురధిప గృహద్వార ఘటకే _ దురంతే _ సంసారే _ దురిత నిలయే _ దుఃఖజనకే _ మదాయాసం   _ కిమ్ _ న _ వ్యపనయసి _ కస్య _ ఉపకృతయే _ వద _  ఇయమ్ _ ప్రీతిః  _ చేత్ _ తవ _  శివ _ కృతార్థాః  _ ఖలు  _  వయమ్..*


*తాత్పర్యం :~*


*ఓ శివా ! దురాశతో నిండినదీ, దుష్టులైన ప్రభువుల ద్వారములందు నిలబడేటట్లు చేసేదీ, అసౌఖ్యకరమైనదీ, అంతములేనిదీ, పాపములకు నిలయమైనదీ , దుఃఖాన్ని కలిగించేది అయిన సంసారమునందు పడియున్న  నాకష్టాన్ని నీవు ఎందుకు తొలగింపవు ? బ్రహ్మ దేవునికి ఉపకారం చేయడానికా ? ఇది నీకు ప్రీతికరమైనట్లైతే మేము కూడా కృతార్థులమౌతాము. (నీ ప్రీతియే , మాకు ధన్యత చేకూరుస్తుందని భావం)*


*వివరణ :~*


*దురాశతో నిండియుంటుందట సంసారం. సంసార పోషణకు దుష్ట ప్రభువుల ఇళ్ళకు వెళ్ళి వారిని యాచించవలసి వస్తుందట. అంతు లేకుండా జనన,మరణ యాత్ర సాగుతుందట, పాపాలకు నిలయమట, దుఃఖాలను పుట్టిస్తుందట, అటువంటి సంసారంలో పడే శ్రమను  ఎందుకు పోగొట్టవని శంకరులు ఈశ్వరుని ప్రశ్నిస్తున్నారు.*


*ప్రపంచములోని ధనం,ధాన్యం, బంగారం, పశువులు, స్త్రీలు  అన్నీ ఒకే వ్యక్తికి వచ్చి పడినా, చాలుననే, భావం వుండదట.  ఆశ ఉన్న చోట పాపం, పాపమున్న చోట దుఃఖము ఉంటుంది  . సంసార పరిస్థితి ఇదీ.  అందుకే శంకరులు , తన సంసారదుఃఖాన్ని తొలగించమని, ఈశ్వరుని కోరారు..*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(52వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

      *సూర్య చంద్రవంశాలు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*తన స్త్రీత్వం పోగొట్టమని సుద్యుమ్నుడు వశిష్ఠుని వేడుకున్నాడు.*


*వశిష్ఠుడు, శివుని ఆశ్రయించి, సంగతంతా వివరించాడు. సుద్యుమ్నను సుద్యుమ్నుని చేయమని ప్రార్థించాడు.*


*శివుడు కరుణించాడు. అయితే తన మాట పొల్లుపోకూడదని, వరాన్ని ఇలా ప్రసాదించాడు. సుద్యుమ్నుడు ఒక నెల స్త్రీగానూ, ఒక నెల పురుషుడిగానూ ఉంటాడన్నాడు.*


*అలా ఉంటూనే సుద్యుమ్నుడు రాజ్యపాలన చేయసాగాడు. ప్రజలకి అది నచ్చలేదు. సుద్యుమ్నుడికి ఉత్కలుడు, గయుడు, విమలుడు అని ముగ్గురు కొడుకులు పుట్టారు. వారు ఉత్తరపథాన్ని పరిపాలించసాగారు.*


*సుద్యుమ్నుడికి ముసలితనం వచ్చింది. పరిపాలనకు తను అనర్హుడనుకున్నాడు. కొడుకు పురూరవుడికి రాజ్యాన్ని అప్పగించి, తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్ళిపోయాడు.*


*సుద్యుమ్నుడు అలా అడవుల్లో తేలాడని తెలిసి, చాలా బాధపడ్డాడు వైవస్వతుడు. మళ్ళీ కొడుకు కావాలని, యమునాతీరంలో తపస్సు చేయసాగాడు. నూరేళ్ళు చేశాడు తపస్సు.*


*అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. అతని కోరిక తీర్చాడు. భగవదనుగ్రహంతో వైవస్వతునికి ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, కరూశకుడు, అరిష్యంతుడు, వృషద్రుడు, నభగుడు, కవి తదితరులయిన పదిమంది కొడుకులు పుట్టారు. వారితో మనుసంతతి విస్తారమయింది.* 


*ఇక్ష్వాకుడు సూర్యవంశానికి మూలపురుషుడయినాడు. ఈ సంతతిలో హరిశ్చంద్రుడు, రఘువు, అజుడు, దశరథుడు, శ్రీరాముడు మొదలయిన వారంతా జన్మించారు.*


*ఇలకూ(సుద్యుమ్నుడు) బుధునకూ జన్మించిన పురూరవుడు చంద్రవంశానికి మూలపురుషుడయినాడు. ఆ వంశం కూడా అభివృద్ధి చెందింది.*


*సుకన్య:~*


*వైవస్వత మనువు కుమారుడయిన శర్యాతి వేదార్థతత్త్వవిదుడు. అతనికి ఓ కుమార్తె జన్మించింది. ఆమె పేరే సుకన్య. శర్యాతి ఒకనాడు, సుకన్యను వెంటబెట్టుకుని, వనవిహారానికి బయలుదేరాడు. చ్యవనమహాముని ఆశ్రమాన్ని సందర్శించాడు. తండ్రిని వదలి, సుకన్య ముందుకు పరుగుదీసింది. చెట్లు, పొదరిళ్ళ మధ్య విహరిస్తూ ఒక చోట ఓ పుట్టను చూసిందామె. ఆ పుట్టలో మిణుగురులా మెరస్తూ రెండు జ్యోతులు కనిపించాయి.*


*అవేమిటో? వాటిని తెలుసుకోవాలనుకున్నది సుకన్య. పక్కన పడి ఉన్న ఓ ముల్లు తీసుకుని, వాటిని పొడిచి చూసింది. పొడిచిన మరుక్షణం ఆ జ్యోతులు రక్తాన్ని స్రవించసాగాయి.*


*సుకన్యకి ఏదీ అంతుచిక్కలేదు. భయం కలిగిందామెకు. ఇంతలో శర్యాతికీ, అతని వెన్నంటి వచ్చిన పరివారానికీ మలమూత్రాలు ఆగిపోయాయి. నిరోధించినట్టుగా నిలచిపోయాయి. ఎందుకిలా జరిగిందన్నది విచారించాడు శర్యాతి.*


*మాకు తెలియదంటే మాకు తెలియదని అంతా చేతులు జోడించారు. సుకన్య అప్పుడు కలుగజేసుకుని, ముల్లు తీసుకుని, పుట్టలో పొడిచిన సంగతంతా వివరించింది. ఎంత పని చేశావన్నాడు శర్యాతి. తలపట్టుకున్నాడు. జరిగిందేమిటంటే...*


*భార్గవ మునీంద్రుడు చ్యవనుడు, తపస్సు చేసుకుంటున్నాడు. అతని చుట్టూ పుట్ట పెరిగింది. ఆ పుట్టలోంచి జ్యోతుల్లా కనిపించినవి అతని కళ్ళే! అవి కళ్ళని తెలియక సుకన్య ముల్లుతో వాటిని గుచ్చింది. దాని ఫలమే రాజుకీ, పరివారానికీ ఆ దుస్థితి.*


*చేసిన తప్పిదానికి మహాముని ఎలా ఆగ్రహిస్తాడోనని భయపడ్డాడు శర్యాతి. తన కూతురు తప్పు క్షమించమని చ్యవనుని ముందు మోకరిల్లాడతను. క్షమించాలంటే సుకన్యను ఇచ్చి తనకి వివాహం చెయ్యమన్నాడు చ్యవనుడు. తప్పకుండా అన్నాడు శర్యాతి. జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా సుకన్యను చ్యవనునికి సమర్పించి, శర్యాతి నిష్క్రమించాడక్కణ్ణుంచి.*


*(తర్వాత కథ రేపు)*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

రోటికిc గట్టె రాఘవుని ద్రోవది

 *రోటికిc గట్టె రాఘవుని ద్రోవది కుండిన పట్టణమ్మునన్*

ఈ సమస్యకు నా పూరణ. 


*శకారుడు*

పేటిక నౌదు శాస్త్రముల పెద్దల జాతకములన్ని జెప్పుదున్ 


పోటికి వచ్చె నేనుగుకు  పుత్తడి బొమ్మ పునాస కార్తెలో 


నోటికి నడ్డు లేదిచట నూరు విధమ్ముల నొక్కి చెప్పుదున్ 


రోటికిc గట్టె రాఘవుని ద్రోవది కుండిన పట్టణమ్మునన్. 


అల్వాల లక్ష్మణ మూర్తి.

15.02.2025,శనివారం

 *🙏జై శ్రీమన్నారాయణ🙏*

15.02.2025,శనివారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయనం - శిశిర ఋతువు

మాఘ మాసం - బహుళ పక్షం

తిథి:తదియ రా10.28 వరకు

వారం:స్థిరవాసరే (శనివారం)

నక్షత్రం:ఉత్తర రా12.38 వరకు

యోగం:సుకర్మ ఉ7.02 వరకు

కరణం:వణిజ ఉ9.41 వరకు

తదుపరి విష్ఠి రా10.28 వరకు

వర్జ్యం:ఉ.శే.వ.8.07 వరకు

దుర్ముహూర్తము:ఉ6.31 - 8.02

అమృతకాలం:సా4.48 - 6.32

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి:కుంభం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం:6.31

సూర్యాస్తమయం:5.56




దేహ, బుద్ధి బలాలతో సాధిస్తే కలిగేది జయం. దీనికి కుయుక్తులు, కుతంత్రాలు, నీచపు పనులు చేయవలసి రావచ్చు. కానీ నిజమైన విజయం భగవంతుడు అండగా ఉంటే దానంతట అదే లభిస్తుంది. భగవంతుడు అండగా నిలవాలంటే చేసే పనుల్లో పవిత్రత ఉండాలి. అలా లభించే విజయమే లక్ష్మీస్వరూపం. దానికి కావలసిందల్లా ధర్మవర్తన, నైతిక జీవన గమనం, ఆధ్యాత్మిక మార్గాన పయ నించడం. విద్య సైతం లక్ష్మీ స్వరూపమే. ఆ విద్యను సన్మార్గంలో వినియోగించగలగాలి. విద్య కలిగినవారు వివేకం, జ్ఞానం, సంస్కారం, సదాచారం లాంటివి కలిగి ప్రవర్తిస్తే అదే విద్యాలక్ష్మీ కటాక్షం. శ్రీ అంటే సంపద. దీనితో దేని నైనా కొనగల పొందగల వీలుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే సంయమనంతో మెలగాలి. తన దగ్గర ఉన్న ధనం సక్రమ వినియోగం అయ్యేలా చూడమనే ఆకాంక్ష రూపమే శ్రీలక్ష్మి.


ధర్మం, అగ్ని, రాజు, దొంగ- ఈ నలుగురూ ధనానికి దాయాదులు. వీరిలో జ్యేష్ఠుణ్ని... అంటే ధర్మాన్ని అవమానిస్తే మిగిలిన ముగ్గురూ కోపిస్తారు. ఫలితంగా ధర్మవర్తన లేనివాడి ధనం అగ్నిపాలో, రాజుపాలో, దొంగలపాలో అవుతుందని భావం. భక్తుల ప్రవర్తన మెచ్చి, భగవంతుడు ఇచ్చే కానుకను వరం అంటారు. భూతదయ, సేవ, త్యాగం లాంటి గుణాలు కలిగి ఉన్ననాడు భగవంతుడు కరుణించి భక్తుడికి వరాలను ఇస్తాడు. ఆ వరాలు లక్ష్మీ స్వరూపమే. అలా పొందే వరాలను వరలక్ష్మీ స్వరూపంగా పేర్కొంటారు. 'అలాంటి వరాలను నాకు 'ప్రసాదించు' అనే ఆకాంక్ష సైతం ఇందులో ఇమిడి ఉంది.

Panchaag


 

వాణిని జీవకోటి పరిపాలిని

 ఉ.ఉ.వాణిని జీవకోటి పరిపాలిని వాఙ్మయి, విశ్వ కర్తకున్

రాణిని సన్నుతించెదను రమ్యములౌ విపులార్థ శబ్దముల్

శ్రేణిగ గూర్చ, సన్మతి తరింపగ దీన జనాళి బ్రోవ గీ

ర్వాణిని కోరి మ్రొక్కెద నపార దయానిధి వేడి భారతీ౹౹ 47


మ.వెలుగుల్ జిందు కవిత్వ శక్తులవి సంవేద్యమ్ములౌ హృద్యమౌ

నిలలో సర్వ శుభ ప్రదమ్ములగు నా యీశాను గొల్వన్ మహో

జ్వల రూపమ్ము గనన్  విశిష్ట గతులన్ సంసేవ్య జిజ్ఞాస భ

క్తులకున్ మాఘము విందుసేయు నెద సంతుష్టిన్ గనన్ భారతీ!౹౹48విశ్వ కర్తకున్

రాణిని సన్నుతించెదను రమ్యములౌ విపులార్థ శబ్దముల్

శ్రేణిగ గూర్చ, సన్మతి తరింపగ దీన జనాళి బ్రోవ గీ

ర్వాణిని కోరి మ్రొక్కెద నపార దయానిధి వేడి భారతీ౹౹ 47


మ.వెలుగుల్ జిందు కవిత్వ శక్తులవి సంవేద్యమ్ములౌ హృద్యమౌ

నిలలో సర్వ శుభ ప్రదమ్ములగు నా యీశాను గొల్వన్ మహో

జ్వల రూపమ్ము గనన్  విశిష్ట గతులన్ సంసేవ్య జిజ్ఞాస భ

క్తులకున్ మాఘము విందుసేయు నెద సంతుష్టిన్ గనన్ భారతీ!౹౹48

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  - తృతీయ - ఉత్తరాఫల్గుణి -‌‌  స్థిర వాసరే* (15.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*