18, ఏప్రిల్ 2021, ఆదివారం

అవని కథ

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*నాకు నచ్చిన శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి కథ* 

            🌷🌷🌷

అవని కథ : -


    మధ్యాహ్నం అయ్యింది. ఎండాకాలం  ఎండలు దంచేస్తున్నాయి.  అప్పుడే భోజనం ముగించిన అవని భర్త  వాట్సప్ కు మెసేజ్ పెట్టింది తిన్నారా? అంటూ... జవాబు రాలేదు. మిగతా పనులు చేసుకుని కాల్ చేసింది. 

 "ఆ.. తిన్నాను. తినకుండా ఎందుకు ఉంటాను. రోజూ ఇదో వెధవ గోల నాకు. ఇన్నేళ్లనుంచి చెబుతూనే వున్నా. అయినా ఇదే తంతు. ఏదో దూర ప్రాంతంలో ఉన్నట్టు. రోజూ కొంపలోనే ఉంటాం కదా!" అని విసుగ్గా ఫోన్ కట్ చేసాడు భూపతి.

  ఒక్క నిముషం నిట్టూర్పు విడిచి, అలా నడుము వాల్చింది. ఒక్కసారి తన జీవితం అంతా వరుసగా మనసులో  మెదిలింది. 

   డిగ్రీ అయిన వెంటనే అవనికి ఒక మంచి కంపెనీలో ఆఫీసర్ గా పని చేస్తున్న భూపతి తో పెళ్లి చేశారు పెద్దలు.  పెళ్లి అవ్వగానే ఉద్యోగరీత్యా చాలా ప్రదేశాలు తిరిగారు. 


   భూపతి అదో రకం మనిషి. తను చెప్పిందే జరగాలనే తత్వం. అదీ ఒక అవని వద్దనే. బయట వాళ్ళతో ఎంతో బాగా వంగి మాట్లాడ తాడు. తను ఇలా అంటాడని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఏదైనా కొంటే మీ చెల్లెళ్లకు, అన్నయ్య లకు చెబుతావేమో ఇప్పుడే అందరికీ చెప్పకు. తర్వాత చెబుదాం అని చెప్పి, తాను మాత్రం చెప్పేవాడు వాళ్ళతో. దాంతో అవని అంటే వాళ్లందరికీ మంట. భూపతి చాలా మంచివాడు, దాపరికం లేని భోళా మనిషి. అవని మంచిది కాదు అనే అభిప్రాయం ఏర్పడింది ఇటు అత్తవారింటి వైపు, అటు పుట్టింటి వైపూ కూడా.  ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు ఆమెతో. చచ్చావా? బ్రతికావా? అడగరు. కానీ తన అవసరం ఉన్నప్పుడు బాగా మాట్లాడి పనులు చేయించుకుంటారు. 

      పెళ్ళైన కొత్తలో చెల్లెళ్ళ తో, అన్నలతో మాట్లాడడానికి కాల్ చేస్తే , లేదా వాళ్ళు కాల్ చేసినా పెట్టేయ్యి తర్వాత మాట్లాడతా అని చెప్పు అని విసుక్కునేవాడు భూపతి. దాంతో ఏం గొడవ అవుతుందోనని భయపడి పెట్టేసేది.  వాళ్లకు ఈ విషయం సూచాయగా  చెప్పినా అవనిపైనే కోపం పెట్టుకున్నారు వాళ్ళు.


    అవని పెళ్లి అయ్యాక ఏడేళ్లకు తల్లిదండ్రి చనిపోయారు. ఇక తనతో సరిగ్గా మాట్లాడే నాధుడే లేకపోయాడు. అప్పట్నుంచి తన మనసే తనకు ఫ్రెండు ఇంకా అన్నీ. 


    పెళ్లి అయిన కొత్తలో ఒక సెల్ ఫోన్ కొనిచ్చారు అవని నాన్న. అది అప్పట్లో బేసిక్ మోడల్. ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కి ఛార్జ్ వేసేవారు. తనకు ఏమీ తోచక మధ్యాహ్నం లంచ్ టైం లో కాల్ చేస్తే, ఇది అడగడానికి ఒక్క రూపాయి వేస్ట్ చేయాలా? అని అరిచినంత పని చేసాడు భూపతి.

"నాకేమీ తోచట్లేదు ఏదైనా జాబ్ చూడండి, చేస్తాను" అని అంటే

 పెద్దగా నవ్వి.. 

  "నీ తెలివితేటలకు ఇంకా జాబ్ ఏమి చేస్తావు? " అని వేళాకోళం చేసి, చూద్దాం లే అన్నాడు. 

      కానీ ఆ చూడడం ఇంతవరకూ అవ్వలేదు. అవనికి 59 ఏళ్ళు. భూపతి కి 60 నిండిపోయాయి. జాబ్ నుంచి రిటైర్డ్ అయ్యాడు కానీ స్నేహితుడితో కలిసి ఏదో చిన్న బిజినెస్ మొదలు పెట్టాడు. అతనికి బీపీ, షుగర్ అన్నీ వచ్చాయి. అందుకే ఇలా కాల్ చేస్తుంది అవని టైం కి తిన్నాడో లేదోనని.   విసుక్కున్నా పట్టించుకోకుండా లంచ్ టైం లో కాల్ చేస్తుంది.


     ఓ సారి చుట్టాలమ్మాయి చదువుకోడానికి వచ్చి ఓ రెండేళ్లు వీళ్ళింట్లో ఉంది. ఆ అమ్మాయి తో ఎంత బాగా మాట్లాడేవాడో! ఓ సారి ఆ అమ్మాయికి జ్వరం వస్తే ఎంతో హడావుడి చేసాడు. అవనికి అనారోగ్యంతో వున్నా ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు కానీ. ఏవో మందులు తెచ్చి మొహాన కొట్టేవాడు వేసుకొమ్మని. ఎలా ఉందని అడిగే వాడే లేడు.

    పిల్లలూ అంతే. వాళ్ళ అవసరాలు తీరితే చాలు. అక్కడే ఉండి అనారోగ్యంతో ఉన్నది చూస్తున్నా పట్టించుకోకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటున్న భర్తను, పిల్లల్నీ చూసి ఆశ్చర్యపోయేది అవని.  ఇంత కఠినమైన మనసుతో ఎలా ఉంటారో అర్ధం అయ్యేది కాదు ఆమెకు. తోబుట్టువులూ అంతే. కొందరి తలరాతలు అలానే వుంటాయేమో?


    ఓ సారి అన్న కూతురు ఏదో పని ఉండి వచ్చింది. చాలా ఆత్మీయురాలి గా మాట్లాడింది. అందుకే తన తో

 " అవసరం వెళ్లదీసుకుని మళ్ళీ నాతో మాట్లాడరు సరిగ్గా. నాకు అత్తింటి వైపు, పుట్టింటి వైపూ ఒకేలా వున్నారు " అంటూ చెప్పిన అవనితో

  "అందరూ అలానే వున్నారు అంటే నీలోనే లోపం ఉంది అత్తా! నేను చూడు మా ఆయన ను ఎలా గుప్పిట్లో పెట్టుకున్నానో? ఏది కావాలంటే అది కొంటారు. అత్తా వాళ్ళు నోరు మెదపరు. అలా మనలోనే ఉండాలి ఆ టాలెంట్. అందరినీ అనుకుంటే ఏమి లాభం!" అంది. 


   ఇద్దరు పిల్లలూ పెళ్లిళ్లు అయి సెటిల్ అయిపోయారు. పురుళ్ళూ పుణ్యాలు చేయించుకున్నారు అవనితో.

 ఇప్పుడు కాల్ చేస్తే మాట్లాడరు. 

"అమ్మా! నీకు లా ఖాళీగా ఉన్నామను కున్నావా? ఊరికే మాట్లాడాలంటే ఎలా కుదురుతుంది? మా ఉద్యోగాలు, పిల్లలూ చూస్కోవాలిగా!" అని విసుగు ప్రదర్శించారు. అందుకే వాళ్లకు చేయడం మానేసింది.  

  "వాళ్ళ నాన్నతో మాట్లాడతారు కానీ నాతో మాట్లాడ డానికి ఇలా విసుక్కుంటారు ఏమిటో" అనుకుని నిట్టూర్చేది.


   కొత్తగా పెళ్ళైన చెల్లెలు పెళ్లి కాగానే మొగుణ్ణి కంట్రోల్ లో పెట్టుకోవాలి అని సలహా ఇచ్చి నప్పుడు ఓ శుష్కమైన నవ్వు నవ్వుకుంది అవని. 

   కొందరు భార్య మాటలకు విలువ ఇచ్చేవాళ్లను చూసింది. ఆవిడ మాటలే తమ మాటలుగా చెప్పిన వాళ్ళను చూసింది.  ఏదైనా అడిగితే మా ఆవిడను అడిగి చెబుతా కుదురుతుందో లేదో అని భూపతితో నే అనగా వింది. కానీ భూపతి కి మాత్రం ఆ ఆలోచన ఉండదు. 

  అవతలి వాళ్ళు ఏది చెబితే అది ఓకే చేస్తాడు తనకు ఇష్టముందా లేదా అనే అలోచననే చేయడు. ఓ రోజు భూపతి స్నేహితుడు ఒకరు  "మా ఆవిడకు తోడుగా పంపు మీ ఆవిడను. తను వాళ్ళ పుట్టింటికి ఒక్కతే వెళ్ళాలి "అని అడిగితే సరేనని చెప్పేసి ఇలా వెళ్ళాలి అని చెప్పేసాడు ఇంటికి రాగానే. 

     ఆవిడ నాకు పరిచయం వున్నా వాళ్ళింట్లో వాళ్ళు తెలియదే అని అన్నా వినిపించుకోలేదు భూపతి. ఇది తమ పెళ్ళైన కొత్తలో నే జరిగిన సంఘటన. గుర్తొచ్చినప్పుడల్లా కొందరి జీవితం ఇంతేనేమో అని అనిపిస్తుంది.తమ చుట్టూ అవసరం కోసం మాత్రమే మంచిగా మాట్లాడే అవకాశవాదులే ఉండడం నిజంగా కొందరి దురదృష్టం.


  అవని కి తన చిన్ననాటి విషయాలు గుర్తుకు వచ్చాయి. నానమ్మ అంటే తనకెంతో ఇష్టం. ఆవిడ పిల్లలందరిని కూర్చోబెట్టుకుని రామాయణ, భారత, భాగవతాల్లోనుంచి కథలు చెప్పేది. ఆ కథలు చెబుతూ మనిషి ఎలా ఉండాలో కూడా వివరించేది. ఆ విషయం అంతగా తన తోబుట్టువులు పట్టించుకోలేదు కానీ తనకు మాత్రం బాగా మనసుకు హత్తుకు పోయాయి. ముఖ్యంగా నానమ్మ కృష్ణావతారం గురించి చెబుతూ...   

" ఈ మనుషులతో వుండే బంధాలు అన్నీ అశాశ్వతాలు. భగవంతుడితో వుండే ఏ బంధంతో కూడిన భావన అయినా శాశ్వతం. భార్యాభర్తలు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, పిల్లలూ ఇలా ఎవరి కోసం మనం ప్రేమించి తపన పడ్డా వాళ్ళు మన ప్రేమకు విలువ ఇవ్వకపోవచ్చు. పైగా హీనంగా చూడవచ్చు. 

    కానీ భగవంతుడు తనను ఎంతగా ప్రేమిస్తే అంతకు ఎక్కువగా కన్నతల్లి  కంటే ఎక్కువగా కళ్ళల్లో పెట్టి కాపాడుకుంటాడు. మనం జన్మల్లో మర్చిపోయినా తాను ఇచ్చిన మాట మాత్రం తప్పడు. 


    పృష్ని దంపతులు చేసిన తపస్సుకు మెచ్చిన విష్ణు భగవానుడు వరం కోరుకొమ్మంటే వాళ్ళు నీలాంటి కొడుకు కావాలి అని అడుగుతారు. నాలాంటి అంటే ఎవరూ ఉండరు కనుక నేనే మీకు మూడుసార్లు కొడుకుగా పుడతాను అని వరం ఇచ్చి, ఆ జన్మలో వారికి పృష్ని గర్భుడు అనే పేరుతో, ఆ తర్వాత వాళ్ళు అదితి,కశ్యపులుగా పుట్టినప్పుడు వారికి వామనుడిగా, వారు దేవకివసుదేవులుగా జన్మిస్తే వారికి కృష్ణ భగవానుడిగా మూడు సార్లు కొడుకుగా జన్మించాడు. వారిని తరింపజేశాడు. 


    అదే మనుషులకు ఏదైనా ఒక మేలు చేస్తే తెల్లవారేసరికి ఆ విషయం మర్చి పోయి, నువ్వు మాకు అన్యాయం చేసావు అనే అంటారు." అని చెప్పేది. తను అలానే బ్రతికింది.

  

    తను కూడా మనసులో ఏ ఫీలింగ్ లేకుండా భావాతీతంగా వుందామని ఎంతో ప్రయత్నించింది. కానీ సాధ్య పడలేదు. ఎవ్వరికీ ఏ కొంచెం బాధ కలిగినా తల్లడిల్లిపోయేది మనసు. 


     నానమ్మ మాటలు గుర్తు తెచ్చుకుని, మానసికంగా భగవంతునికే దగ్గరగా ఉండి, ఈ బంధాలను పట్టించుకోవద్దు అని ఎంతగా అనుకున్నా పూర్తిగా వదిలించు కోలేకపోతోంది అవని. అది చెప్పినంత సాధ్యమా!...


    ఇలా ఆలోచిస్తూ ఉంటే చిన్నగా కునుకు పట్టింది అవనికి. ఇంతలో పనమ్మాయి కాలింగ్ బెల్లు కొట్టింది. తలుపు తీసి ఆ పనులు అవ్వగానే టీ పెట్టి పనమ్మాయి కి ఇచ్చి, తను తెచ్చుకుని కూర్చుంది. 

  ఈ మధ్యే పెట్టుకుంది పనమ్మాయిని. ఇన్నేళ్ళుగా ఒంటిచేత్తో పనులు తనే చేసుకునేది. ఈ మధ్య  చేయడానికి శరీరం  అస్సలు సహకరించట్లేదు.  అందుకే పనమ్మాయిని పెట్టుకుందామని అడిగింది భూపతిని. ఉండేది ఇద్దరమే. ఇంతోటి పనికి పనమ్మాయి ఎందుకు అన్నాడు కానీ.. మళ్ళీ ఏమనుకున్నాడో సరేనన్నాడు. 


   వంట తనే చేస్తుంది. మిగతా పనులకు పనమ్మాయి. రాత్రి కి చపాతీలు, కూర చేసి భూపతి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఇలా ఎదురుచూస్తూ కూర్చున్నప్పుడల్లా అమ్మ చెప్పిన సంగతి గుర్తు వస్తుంటుంది అవనికి. అమ్మ వాళ్ళ చుట్టాలమ్మాయి ఎప్పుడూ భర్త కోసం చూస్తూ అతను వచ్చేదాకా తినకుండా వుండేదిట. అతనేమో కావాలని లేటుగా బయటే ఫుల్లుగా తిని వచ్చేవాడట. ఒక్కోసారి రెండు రోజులు ఇంటికి రాకుండా పోయేవాడట. ఆ మానసిక హింస, తిండి సరిగ్గా తినకపోవడం తో పిల్లలు కూడా పుట్టకముందే చనిపోయిందట ఆ అమ్మాయి. మరి నా వంతు ఎప్పుడో?ఎలానో? అని విరక్తిగా నవ్వుకుంది. 

 ఇంతలో భూపతి వచ్చాడు.


      @@@@@@@


    అవని నుంచి కాల్ వచ్చింది భూపతికి మధ్యాహ్నం. తను లంచ్ చేస్తున్నాడు ఫ్రెండ్ తో కలిసి. కట్ చేసేసాడు విసుగ్గా. మళ్ళీ కాల్. విసుగుతో స్విచ్ ఆఫ్ లో పెట్టాడు. 

    ఆ ఫ్రెండ్ కి కూడా వచ్చింది కాల్. చాలా సరదాగా మాట్లాడి పెట్టేసాడు. "రోజూ కాల్ చేస్తుంది మా ఆవిడ. నా ఆరోగ్యం గురించే ఆమె బెంగ. ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తుంది. తను నా భార్య అవ్వడం నా అదృష్టం రా! ఈ కాలం లో భర్త గురించి నిరంతరం తపన పడేవాళ్ళు ఎంతమంది! ఇంట్లో ఒక్కతే ఉంటుంది తనకు కూడా ఏమైనా అయితే! అందుకే మధ్య మధ్యలో నేనూ కాల్ చేసి మాట్లాడుతుంటాను. ఎలాగో రిటైర్డ్ అయ్యాము. ఇప్పుడు చేసేది ఏదో కాలక్షేపానికి కదా! "  అంటున్నాడు స్నేహితుడు


    ఇంతలో లంచ్ అయిపోయింది. తన క్యాబిన్ కి వెళ్లి ఫోన్ ఆన్ చేసాడు. 20 మిస్డ్ కాల్స్ ఉన్నాయి అవని నుంచి. 

ఇందాకటి స్నేహితుడి మాటల ప్రభావమో ఏమో కాల్ చేసాడు అవనికి. అవతల నో రెస్పాన్స్. అస్థిమితం అయ్యింది మనసు ఎందుకో. 


  సరే ఇంటికి వెళదాం అనుకుంటుండగా పనమ్మాయి నుంచి కాల్. "సార్! అమ్మగారు తలుపు తీయట్లేదు. కిటికీ లోనుంచి చూస్తే పూజ గది ముందు పడిపోయినట్టుగా అన్పిస్తోంది. గాభరాగా అనిపించి మీకు కాల్ చేశా" అంది.


 వెంటనే ఇంటికి వెళ్లి డూప్లికేట్ కీ తో తలుపు తీయించి లోపలికి వెళ్ళి చూస్తే పూజ గది ముందు పడిపోయి ఉంది అవని. ముట్టుకుని చూస్తే చేతులు చల్లగా తగిలాయి. వెంటనే అంబులెన్స్ కు కాల్ చేసాడు. తన ఫోన్ నుంచి అందరికీ కాల్ చేసినట్లుంది. ఎవ్వరూ లిఫ్ట్ చేయనట్టున్నారు. అంబులెన్స్ వచ్చింది. హడావుడి గా పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్ చెక్ చేసి "సారీ! గంట క్రితమే ఆవిడ ప్రాణాలు విడిచారు హార్ట్ స్ట్రోక్ తో" చెప్పారు.


   అందరికీ సమాచారం అందింది. వచ్చి ఏడ్పులు ఏడ్చారు. ఆవిడతో బంధాలు గుర్తు చేసుకున్నారు. అన్నలు, అక్కచెల్లెళ్ళు ఎంత మంచిదో ఆవని అన్నారు. 

  పిల్లలు "అమ్మా! మమ్మల్ని వదిలిపోయావా? నీ మనుమలు, మనుమరాళ్ళూ నిన్నే కలువరిస్తున్నారే" అంటూ ఏడ్చారు. 

 కానీ ఇవేవీ వినడానికి అవని దేహం నిర్జీవమై ఉంది.  ప్రతి ఒక్కళ్ళు ఆమె ఫోటో తో ఫేస్ బుక్ లో స్టేటస్ పెట్టారు. కవితాత్మకంగా వ్రాసారు ఆమెను కోల్పోయిన బాధను. ఫేస్ బుక్ లో అందరి స్నేహితుల , బంధువుల చేత ఓదార్పు పొందారు. కార్యక్రమాలు ఘనంగా చేసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసుకున్నారు. వీళ్ళ బాధకు, అవనితో వీరి బాంధవ్యానికి అందరూ జేజేలు కొట్టారు. అలా అవని ఈ అవని నుంచి నిష్క్రమించింది.


    మరణానంతరం వీరు చూపించే అతి ప్రేమ ను చూసి ఓ శుష్కమైన నవ్వు నవ్వుకుని, హమ్మయ్య  ఇప్పటికైనా ఈ అబద్ధపు అనుబంధాల నుంచి విముక్తి కలిగిందని తనకు  నిర్దేశించిన లోకానికి పయనమయ్యాడు అవని లో నుంచి వెళ్లిన జీవుడు.


    అవని మరణానంతరం అయినా తన ప్రవర్తన ద్వారా అవనిని ఎంత క్షోభ పెట్టాడో తెలుసు కుంటాడా భూపతి? ఆ కాలమే నిర్ణయించాలి


    అందుకే ఈ జీవితం మిధ్య అనే విషయం తెలుసుకుని జీవన్ముక్తులుగా పూర్తిగా మారలేకపోయినా కనీసం ప్రయత్నించాలి. అప్పుడే ఈ జీవుడు తేలికగా శరీరం నుండి బయట పడతాడు.


ఇటువంటి అవని లు ఎందరో మన సమాజంలో...

ఈ కథ అవనిలాంటి వారికి మేలు చేస్తుందనే భావనతో పంపడమైనది.

*శ్రీ రామానుజుల - జయంతి*



శ్రీ రామానుజులు సాక్షాత్తు అవతార పురుషులు...

రామానుజాచార్యుడు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతము ను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త , ఆస్తిక హేతువాది , యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి , దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ , సాటిలేని భక్తికీ , రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన యతి.


*జన్మ స్థలం , నక్షత్రం మరియు ఇతర వివరాలు :-


ఆయన క్రీస్తు శకం 1017 సంవత్సరంలో శ్రీపెరంబుదూరుగా ఇప్పుడు పేరున్న భూతపురిలో జన్మించారు. శ్రీపెరంబుదూరు చెన్నై పట్టణానికి సుమారు పాతిక కిలో విూటర్ల దూరంలో ఉంది. కలియుగం 4118 సంవత్సరం , శాలివాహన శకం ప్రకారం 1005 వ సంవత్సరం అవుతుంది. ఆయన జనన కాలానికి , కుటుంబానికీ సంబంధించిన ఇతర వివరాలు : పింగళ నామ సంవత్సరం , చైత్ర మాసం. శుక్లపక్షం పంచమి తిథి , బృహస్పతి వారం , ఆర్ద్రా నక్షత్రం , కర్కాటక లగ్నం. ఆయన తల్లి కాంతమతి , తండ్రి కేశవా చార్యులు. హరీత గోత్రం. ఆపస్తంబ సూత్ర యజుశ్శాఖా ధ్యాయులు. తండ్రి వద్దా , కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్దా ఆయన విద్యాభ్యాసం జరిగింది. విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి. గురువు తోనే భేదించి తన విశిష్టాద్వైత వాదాన్ని నెగ్గించుకొన్న ప్రతిభాశాలి. ఆయనకు ముందు నుంచే విశిష్టాద్వైతం ఉంది. దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనత. విద్యాభ్యాస కాలానికి విశిష్టాద్వైతం ఒక సిద్ధాంతంగా ఆయన విశ్వాసాలను తీర్చిదిద్దలేదు. ఆయనకు సహజంగా ఏర్పడిన విశ్వాసాలు అప్పటికే స్థిరపడి ఉన్న విశిష్టాద్వైతానికి అనుగుణంగా ఉన్నాయని , అప్పటికి విశిష్టాద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యామునాచార్యుడు రామానుజుడిని విశిష్టాద్వైత మత ప్రవర్తకుడుగా ప్రోత్సహించాడని  అంటారు. రామానుజుడు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడైనప్పటికీ , కొన్ని సంప్రదాయాలను ఆయన పాటించలేదు. ఉదాహరణకు పదునెనిమిది సార్లు తిప్పించుకొని ఎట్టకేలకు తిరుమంత్రాన్ని ఉపదేశించిన గోష్ఠీపూర్ణులనే తిరుక్కోట్టియార్ నంబి ఆదేశాన్ని కాదని ఒక విష్ణ్వాలయం గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినపడేలా ప్రకటించారు. తిరుక్కోట్టి యార్ నంబి యామునాచార్యుల శిష్యులలో ఒకరు. పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వారికి ఉపదేశించ వద్దనీ , విన్నంత మాత్రాన్నే ముక్తి కలుగుతుందనీ నంబి చెపితే *‘‘నేనొక్కడినీ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తే నేమి , అందరికీ ముక్తి కలుగుతుంది గదా !’’* అనే ఉదార భావనతో ఆయన గుడి గోపరం ఎక్కి తిరు మంత్రాన్ని అందరికీ అందించారు. 


రామానుజులు బ్రహ్మ సూత్రాల శ్రీభాష్యం , వేదాంత సారం , వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం , శ్రీరంగ గద్యం , వైకుంఠ గద్యం , శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు. దేశ వ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహా సనాధిపులను , జియ్యంగార్లను , పరమై కాంతులను నియమించారు. చాత్తాద వైష్ణవులూ , అమ్మం గార్లూ కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు. అస్పృశ్యత లాంటి దురా చారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు.  తన జీవితం ద్వితీయార్ధం శ్రీరంగంలో గడిపిన రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి శనివారం నాడు దేహ త్యాగం చేశారు. ఆయన జీవితానంతరం విశిష్టాద్వైతం *‘‘ద్రావిడ , సంస్కృతాల ప్రాబల్యాన్ని బట్టి తెంగలై , వడగలై అని రెండు శాఖలు ఏర్పడ్డాయి”* అని తిరుమల రామచంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన *‘‘భార్గవ పురాణం”* గ్రంథానికి పరిష్కర్తగా రచించిన *‘‘ఆళ్వారాచార్యుల చరిత్ర తత్త్వం”* వ్యాసంలో వ్రాశారు. (‘‘విశిష్టాద్వైతం” వివరణలో మరికొన్ని సైద్ధాంతిక విశేషాలు.)


*నామకరణం :-


శిశువు యొక్క జనన మాసం , మరియు రాశి దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ మాస రాశులతో సరితూగటం వల్ల , శిశువు మామ అయిన పెరియ తిరుమల నంబి (శ్రీశైలపూర్ణుడు), ఆ శిశువు ఆదిశేషుని అవతారమని భావించి, *"ఇళయ పెరుమాళ్"* అనే నామధేయాన్ని నిర్ధారిస్తాడు. శిశువు శరీరంపైన ఉన్న కొన్ని పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నంబికి , నమ్మాళ్వార్ తన *'తిరువోయ్మోళ్ళి'* అను గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ సాంప్రదాయాభివృధ్ధికి పాటుపడగల గొప్ప సన్యాసి , గురువు , ఈ శిశువేనన్న నమ్మకం కుదిరింది.


*ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలు :-


మొదటిది , ప్రబలంగా కొనసాగుతున్న , బౌధ్ధ , జైన , శైవ , వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ , ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ , వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.


రెండవది , ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతం లోని లోసుగులను సరిదిద్ది , విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.

ప్రస్థాన త్రయాన్ని సాధారణ జనానికి అందించడం.


*తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి :-


ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో , మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.


దేవుడిని పూజించటం , మోక్షాన్ని సాధించటం , మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.

మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో , తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.

ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు , తమకు కీడు జరిగినా , పదిమందికి జరిగే మేలుకై , తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.

వైష్ణవ సాంప్రదాయాలకు సంకేతమైన , పంచ సంస్కార కర్మ , నాలాయిర దివ్య ప్రబంధ బోధన , శరణాగతి తో కూడిన మత ప్రతిపాదన మరియు ప్రచారం , అనే ఈ మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించటం.

వేదాంతానికి మూలస్తంభాలవంటి వేదాంత సూత్రాల కు సరిక్రొత్త వ్యాఖ్యానం వ్రాయటం.


భాగవత , విష్ణుపురాణాలను రచించిన వేదవ్యాస , పరాశర మునుల అంశలతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి , వారికా నామధేయాలను ప్రసాదించి , వ్యాస , పరాశరులకు నివాళులు అర్పించటం.

ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగం లోని రాజగోపురం పైకి ఎక్కి , అందరికీ ఉపదేశిస్తాడు. గురువు *'నీవు నరకానికి వెడతావేమో'* నని అంటే అందరూ స్వర్గానికి వెడతారని బదులిస్తాడు.


*తిరుమల ఆలయ వ్యవస్థల ఏర్పాటు :-


తిరుమలలోని మూలవిరాట్టు(ధ్రువబేరం) విష్ణుమూర్తి విగ్రహం కాదని , శక్తి విగ్రహమో , శివ ప్రతిమో , సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చని వివాదం చెలరేగింది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు వద్దకు శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి వాదించి తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపుచేయించి శైవారాధనలకు అవకాశం ఇమ్మని కోరారు. పలువురు వైష్ణవుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు యాదవరాజు కొలువుకు వెళ్ళి వాదించారు. శాక్తేయులతో , శైవులతో జరిగిన వాదనలో పలు పౌరాణిక ఆధారాలను , శాస్త్ర విధానాలను సాక్ష్యాలుగా చూపించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారనీ , రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు , శైవాయుధాలు , శక్తి ఆయుధాలు పెట్టి ఏ దైవానివైతే ఆ ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి తలుపులు మూశారని ప్రతీతి. రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడవగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖ చక్రాలు ఆయుధాలుగా కనిపించాయంటారు. మొత్తానికి తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని వాదన ద్వారా నిర్ధారించడంతో తిరుమలపై వైష్ణవ ఆరాధనలకు యాదవరాజు అంగీకరించారు.

అనంతర కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. తర్వాతి కాలంలో ఏకాంగి వ్యవస్థ జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడడంలోనూ రామానుజుల పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది రామానుజులే. ఆ ఆలయం చుట్టూ ఆలయపూజారులకు అగ్రహారమిచ్చి , వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజును పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. రామానుజాచార్యులు తాను స్వయంగా పాంచరాత్ర ఆగమాన్ని పాటించే వ్యక్తి అయినా తిరుమలలో పరంపరాగతంగా వస్తున్న వైఖానస ఆగమాన్ని కొనసాగించారు. ఐతే అప్పటికి ఉన్న వైదికాచారాలతోపాటుగా ద్రవిడవేదాలను , పాంచరాత్రాగమ ఆచారాలను కొన్నింటిని తిరుమల అర్చనా విధానంలో చేర్చారు. తిరుమలలోని పలు కీలకమైన వ్యవస్థల ఏర్పాటులో , మూర్తి స్వరూపనిర్ధారణలో , ఆగమ పద్ధతుల్లో తిరుమల - తిరుపతిపైన రామానుజాచార్యునిది చెరగని ముద్ర.


*!! శ్రీమతే రామానుజాయ నమః !!*

*!!శ్రీమతే నారాయణాయ నమః !!*

పరమశివుడు

 పరమశివుడు – పంచాక్షరి


ఆంధ్రదేశంలో కొంతమంది భక్తులు ఒక శివాలయం కట్టించారు. శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకుని వెళ్ళాలని వారు ప్రయత్నించగా వారు దాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేక పోయారు. వారు ఆశ్చర్యచకితులై ఆ విషయాన్ని పరమాచార్య స్వామివారికి చెప్పడానికి కంచి వచ్చారు.


స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి తిరుచ్చి దగ్గర్లోని శ్రీ వైద్యనాథ శాస్త్రి అనబడేవారిని ఒకరిని తీసుకుని రావాల్సిందిగా చెప్పారు. వారు వైద్యనాథ శాస్త్రిగారి చెవిలో ఏదో చెప్పి ఆ భక్తులకి వారిని మీతోపాటు తీసుకువెళ్ళండి అని చెప్పారు.


వారి ఊరికి రాగానే శాస్త్రిగారు రోజూ వారి నిత్యానుష్టానం తరువాత గంటల తరబడి జపం చేసేవారు. అక్కడి కొద్దిగా కలవరపడ్దారు వాళ్ళ సమస్యను నివారించడానికి వారు ఏమి సలహా ఇవ్వలేదు అని. శాస్త్రిగారిని ఏమి అడగకుండా ఏమి జరుగుతుందో చూద్దామని ఊరకుండిపోయారు.


శాస్త్రిగారు ఆ ఊరు వచ్చిన 21వ రోజున జపం ముగించుకుని శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకుని రావాల్సిందిగా వారికి చెప్పారు. వారి దాన్ని చాలా తేలికగా కదిలించగలిగారు.


ఒక్క అడుగుకూడా ముందుకు కదలించడానికి కూడా వీలుకానంత బరువున్న ఈ శివలింగం ఇప్పుడు దూదిపింజలా చాలా తేలికగా ఉంది.


ఈ అద్భుతం ఏమిటో తమకు వివరించగలరని వారు శాస్త్రిగారిని వేడుకున్నారు. శాస్త్రిగారు వారితో తనకు కూడా ఏమి తెలియదని, పరమాచార్య స్వామివారు ఈ శివలింగం ముందు కూర్చొని ఇరవైయొక్క రోజులపాటు పంచాక్షరి జపించమని చెప్పారని అంతకు మించి తనకు ఏమి తెలియదని చెప్పారు.


పరమచార్య స్వామివారు ఈ 20వ శతాబ్ధంలో కూడా పంచాక్షరి మహామంత్ర గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూపించారు అప్పర్ కొన్ని శతాబ్ధాల క్రితం చూపించినట్టుగా.


అరవైమూడు మంది నాయనార్లలో నలుగురు నాల్వర్లుగా(అప్పర్, సుందరర్, జ్ఞానసంబంధర్, మాణిక్యవాచకర్) ప్రసిద్ధులు. అందులో ఒకరైన అప్పర్ ను శివద్వేషి అయిన జైనరాజు ఒక బండరాయికి కట్టి నదిలోకి తోసివేయించగా, నిత్యమూ పంచాక్షరి మహామంత్రమును జపించే అప్పర్ ను రక్షించడానికి ఆ రాయిని నీట మునగనివ్వక నీటిపైన తేల్చి రక్షించాడు పరమశివుడు.


పంచాక్షరీ మంత్రరాజం యజుర్వేదాంతర్గతమైన రుద్రంలో వస్తుంది. 'నమశ్శివాయ' అనే ఆ మంత్రంలో శివశబ్దం దాని జున్ను. పాపపరిహారానికి పంచాక్షరిని మించిన విద్య లేదు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సుంద‌ర‌కాండ- *రామయ్యకు శుభవార్త*

 శ్రీ‌శ్రీ‌శ్రీ‌

           *రామాయ‌ణ*

*దివ్య‌క‌థా పారాయ‌ణ‌ము*


*శ్రీరామ న‌వ‌మి* 

*ప‌ర్వ‌దినం వ‌ర‌కు*


           *6వ‌రోజు*


    *సుంద‌ర‌కాండ- *రామయ్యకు శుభవార్త*

               ***

          🌸🌸🌸🌸🌸


శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి.

                ***

మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !

వాతాత్మజం వానరయూధ ముఖ్యం

శ్రీరామదూతం శిరసా సమామి

              ***


సీతామాత‌ దర్శనం, ఆమె ఆశీస్సులు అంద‌డంతో హ‌నుంతుడు ప‌ట్ట‌రాని సంతోషంతో గంతులు వేశాడు.  ఇక పనిలో పనిగా రావణునిచూసి రావ‌ణుడి శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను తెలుసుకోవాల‌నుకున్నాడు. రావ‌ణుడితో ముఖాముఖి మాట్లాడాల‌నుకున్నాడు. అలాగే యుద్ధ వ్యూహంతో లంకను పరిశీలించాల‌ని నిశ్చయించుకొన్నాడు. అలా చేయడం వల్ల రావణుని హెచ్చరించడానికీ, లంక రక్షణా వ్యవస్థను తెలుసుకోవడానికీ వీలవుతుందనుకున్నాడు. అంతే గాకుండా ఆ ప్రయత్నంలో లంకకు వీలయినంత నష్టం కలిగించవచ్చు. ఇలా సంకల్పించిన హనుమంతుడు వెంటనే ఉగ్రాకారుడై వనాన్ని ధ్వంసం చేశాడు, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ పిడిగుద్దులు గుద్ది మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు.


ఈ వింత వాన‌రాన్ని బంధించమని రావణుడు అపార సైన్యాన్నిపంపాడు. హనుమంతుడు 

 జయత్యతిబలో రామో, 

లక్ష్మణశ్చ మహాబల:,

 రాజా జయతి సుగ్రీవో,

 రాఘవేణాభిపాలిత:,

 దాసోహం కోసలేంద్రస్య, 

రామస్యా క్లిష్ట కర్మణః,

 హనుమాన్ శత్రు సైన్యానాం,

 నిహన్తా మారుతాత్మజః అని జయఘోష చేశాడు -


 మహా బలవంతుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణునకు జయము. రాఘవుల విధేయుడైన కిష్కింధ ప్రభువు సుగ్రీవునకు జయము. నేను శ్రీరామ దాసుడను, వాయుపుత్రుడను, హనుమంతుడను. శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాను. వేయి మంది రావణులైనా యుద్ధంలో నన్నెదిరించలేరు. వేల కొలది శిలలతోను, వృక్షాలతోను సకల రాక్షసులను, లంకాపురిని నాశనం చేస్తాను. నా పని ముగించుకొని, సీతమ్మకు నమస్కరించి వెళతాను. రాక్షసులు ఏమీ చేయలేక చూచుచుందురు గాక - ఇలా గర్జిస్తూ హనుమంతుడు ముఖద్వారానికి బిగించిన ఇనుప గడియతో రాక్షసులనందరినీ చావగొట్టాడు. పర్వతాకారంలో దేహాన్ని పెంచి, చైత్య ప్రాసాదాన్ని కూలగొట్టి, ఆ ప్రాసాద పెద్ద స్తంభాన్ని పరిఘలా త్రిప్పుతూ అందరినీ చావగొట్టాడు.

అప్పుడు రావణుడు, ప్రహస్తుని కుమారుడు మహా బలశాలీ అయిన జంబుమాలిని పంపాడు. హనుమంతుని చేతి పరిఘతో జంబుమాలి శరీరం చూర్ణమయ్యింది. ఆపై అగ్నివలె తేజరిల్లే యుద్ధవిద్యా నిపుణులైన ఏడుగురు మంత్రి పుత్రులు పెద్ద సేనతో కలిసి హనుమంతునిపై దండెత్తారు. హనుమంతుడు భయంకరంగా గర్జించి కొందరిని అర‌చేతితోను, కొందరిని ముష్టిఘాతాలతోను, కొందరిని తన వాడిగోళ్ళతోనూ చంపగా లంకాప‌ట్ట‌ణ వీధులు  రాక్ష‌సుల‌ రక్త మాంసాలతో నిండిపోయాయి.

 పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే గొప్ప సేనా నాయకులు తమ సేనలతో వచ్చి వన ముఖ ద్వారంపై కూర్చున్న హనుమంతునిపై విజృంభించారు. వారంతా కూడా హనుమ చేతిలో ప్రాణాలు కోల్పోయారు. రణ భూమి అంతా రాక్షస, వాహన కళేబరాలతోను, ఆయుధ, రథ శకలాలతోను నిండిపోయింది.

*అక్ష‌కుమారుడితో భీకర‌స‌మ‌రం*

ఇక  లాభం లేద‌నుకుని అక్షకుమారుడు సకలబలములతో హనుమంతుని సమీపించాడు. వారి మధ్య జరిగిన యుద్ధం సురాసురులను సంభ్రమపరచింది.  అక్షకుమారుడు హ‌నుమంతుడిపై  బాణాల వ‌ర్షం కురిపించాడు. అవి హనుమంతుని చాలా నొప్పించాయి. అతని పరాక్రమానికి హనుమంతుడు ముచ్చటపడ్డాడు. అంతటి పరాక్రమశాలిని, తేజోమయుని చంపడానికి తటపటాయించాడు. కాని అతనిని ఉపేక్షిస్తే తనకు పరాభవం తప్పదని తెలిసికొని హనుమంతుడు విజృంభించాడు. ఆకాశానికెగిరి వాయువేగంతో సంచరిస్తూ అరచేతితో అక్షకుమారుని గుర్రాలను చరచి చంపేశాడు. తరువాత, గరుత్మంతుడు మహా సర్పాన్ని పట్టుకొన్నట్లుగా అక్షకుమారుని కాళ్ళను గట్టిగా చేజిక్కించుకొని, గిరగిర త్రిప్పి నేలకు విసరికొట్టాడు. అక్షకుమారుని శరీరం నుగ్గునుగ్గయ్యింది.

*ఇంద్ర‌జిత్తుతో యుద్ధం:*

అక్ష‌కుమారుడు మ‌ర‌ణించిన సంగ‌తి తెలుసుకుని రావణుడు కలవరపడడ్డాడు. ఇదెక్క‌డి వాన‌రం అని త‌ల‌ప‌ట్టుకున్నాడు. పెక్కు జాగ్రత్తలు చెప్పి, త‌న కుమారుడైన‌ ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మవర సంపన్నుడు, ఇంద్రాదులకు కూడా నిలువరింప శక్యంగాని పరాక్రమశాలి, మంత్ర తంత్ర యుద్ధవిద్యానిపుణుడు. అతడు తండ్రి యైన రావ‌ణాసురుడికి నమస్కరించి, రణోత్సాహంతో పొంగిపోతూ, సేనలు లేకుండా ఒకడే దివ్యరథాన్ని అధిరోహించి హనుమంతునిపైకి వెళ్ళాడు. వారిద్దరి మధ్య యుద్ధం చిత్ర విచిత్ర రీతులలో సకల గణాలకు సంభ్రమం కలిగించింది. ఒకరిని ఒకరు జయించడం అశక్యమని ఇద్దరికీ తెలిసిపోయింది. ఇక లాభం లేదు, కనీసం ఆ వానరుని బంధించాలని సంకల్పించి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది హనుమంతుని బంధించింది. బ్రహ్మ హనుమంతునకిచ్చిన వరం ప్రకారం ఆ అస్త్రం అతనిని బాధించకుండా మరుక్షణమే తొలగిపోయింది. అయినా బ్రహ్మదేవునిపట్ల గౌరవసూచకంగా ఆ అస్త్రానికి కట్టుబడిపోయినట్లుగా హ‌నుమంతుడు నటించాడు. ఆ విధంగా రావణునితో మాట్లాడే అవ‌కాశం దొరుకుతుంద‌ని అనుకున్నాడు. రాక్షస సేనలు హనుమంతుని బంధించి, బాధిస్తూ రావణుని సభా ప్రాంగణానికి తీసుకుపోయాయి.


*రావణునితో సంవాదం :*

బ్రహ్మాస్త్రానికి వశుడైనట్లు నటించి, హనుమంతుడు రావణుని సభాభవనంలోకి ప్రవేశించి రావణుని చూశాడు. రావణాసురుని సభాప్రాంగణం మణిమయమై శోభిల్లుతున్నది. రావణుని కిరీటం, ఆభరణాలు, వస్త్రాలు, అత్యద్భుతంగా ఉన్నాయి. మహా తేజశ్శాలి, వీరుడును అయిన‌ రావణుడు పది శిరస్సులు క‌లిగి ఉన్నాడు. ద‌శ కంఠుడు. మణిమయాలంకృతమైన ఉన్నతాసనంపై కూర్చొని ఉన్నాడు. మంత్రాంగ నిపుణులైన నలుగురు మంత్రులచే పరివేష్టితుడై కాటుక కొండవలె ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అనుకొన్నాడు. - ’ఆహా! ఈ రావణుని రూపం అత్యద్భుతం. ధైర్యం నిరుపమానం. సత్వం ప్రశంసార్హం. తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు. ఈ అధర్మానికి ఒడి గట్టకపోతే సురలోకానికి సైతం ప్రభువయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు కృద్ధుడైనచో సమస్త జగత్తునూ సముద్రమున ముంచి ప్రళయం సృష్టించగల సమర్ధుడు గదా!’ అనుకున్నాడు.

రావ‌ణుడు హ‌నుమంతుడిని చూశాడు. 

హనుమంతుడు ఎవరు? ఎందుకు వచ్చాడు? ఇత‌నిని ఎవరు పంపారు? - తెలిసికోమని రావణుడు మంత్రులను ఆదేశించాడు. హనుమంతుడు రావణునకు ఇలా చెప్పాడు - రాజా! నేను సుగ్రీవుడి మంత్రిని. రాముని దూతను. హనుమంతుడనే వానరుడను. నీ కుశలము తెలిసికొమ్మని సుగ్రీవుడు స్నేహ భావంతో చెప్పాడు. రాముని పత్ని సీతను అప‌హ‌రించితెచ్చి నువ్వు పెద్ద తప్పిదం చేశావు. దీని వలన నీవు చేసుకొన్న పుణ్యమంతా నిష్ఫలమై పోతున్న‌ది. వాలిని రాముడే సంహరించాడు. రాముని బాణాల ధాటికి నీవు గాని, మరెవరు గాని నిలువజాలరు. ఈ అకృత్యం వలన నీకు, లంకకూ చేటు దాపురించింది. రాముడు మానవుడు. నీవు రాక్షసుడవు. నేను వానరుడను, నాకు పక్షపాతం లేదు. కనుక నా మాట విని సీతను రాముడికి అప్పగించి రాముని శరణు వేడుకో. రాముని క్రోధానికి గురియైనవానిని ముల్లోకాలలో ఎవరూ రక్షింపజాలరు. - అని హితవు చెప్పాడు.

ఆ మాట వింటూనే రావణుడు కోపించి ఆ వానరుని చంపమని ఆదేశించాడు. అంతలో విభీషణుడు అడ్డుపడి - దూతను చంపడం రాజ ధర్మం కాదు అన్నాడు.  అంతే కాకుండా హ‌నుమంతుడు తిరిగి వెళ్ళకపోతే నువ్వు శతృవులతో యుద్ధం చేసి వారిని ఓడించే అవకాశం కోల్పోతావు. కనుక, హ‌నుమంతుడిని దండించి వదిలివేయ‌మ‌ని  సూచించాడు. ఆ మాటలకు కాస్త నెమ్మదించిన రావణుడు ఆ వానరుని తోకకు నిప్పంటించి వూరంతా త్రిప్పమని ఆదేశించాడు..

*లంకా దహనం*

హ‌నుమంతుడి హిత‌వ‌చ‌నాలు రావ‌ణుడికి న‌చ్చ‌లేదు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. రాక్షస కింకరులు హనుమంతుని తోకకు పాత గుడ్డలు చుట్టి నిప్పు పెట్టారు. ఊరంతా త్రిప్పసాగారు. ఈ అవకాశం చూసుకొని హనుమంతుడు లంకా నగరాన్ని నిశితంగా పరిశీలించాడు. జరిగిన సంగతి విన్న సీతాదేవి  క‌ల‌వ‌ర‌ప‌డింది. హనుమంతుని చల్లగా చూడమని అగ్నిదేవుని ప్రార్థించింది. తన తోక కాలుతున్నా గాని ఏ మాత్రం బాధ లేకపోవడం సీతమ్మ మహిమ వలన అని, తన తండ్రి వాయుదేవుని మిత్రుడైన అగ్ని కరుణ వలన అని గ్రహించిన హనుమంతుడు ఆ అగ్నికి లంకను ఆహుతిన సంకల్పించాడు. తన బంధాలను త్రెంచుకొని, ఒక పరిఘతో రాక్షస మూకను చావబాదాడు. పైకెగిరి, మండుతున్న సూర్యునిలా విజృంభించాడు. ప్రహస్తుని ఇంటితో మొదలుపెట్టి లంకలోని అద్భుతభవనాలకు నిప్పంటించాడు. ఒక్క విభీషణుని ఇల్లు తప్ప లంకలో భవనాలను బుగ్గిపాలు చేశాడు.


అప్పుడు ఒక్కమారుగా సీత సంగతి గుర్తు వచ్చి హనుమంతుడు హతాశుడయ్యాడు. తన తొందరపాటువలన లంకతో పాటు సీతమ్మ కూడా అగ్నికి ఆహుతయ్యిందేమో అన్న భ‌యంతో విలవిలలాడిపోయాడు. తన చాంచల్యం వలన తన జాతికి, పనికి కీడు తెచ్చినందుకు రోదించి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. కాని సీత క్షేమంగా ఉన్నదని తెలిసి, ఊరట చెందాడు. మరొక్కమారు సీతను దర్శించి, ఆమెకు సాంత్వన వచనాలు పలికి, రాముడు సకల వానరసేనతో త్వరలో రాగలడని మ‌రోమారు చెప్పి సీత‌మ్మ పాదాల‌కు న‌మ‌స్క‌రించి, తిరిగి ఉత్తరదిశకు బయలుదేరాడు.


ఇలా హనుమంతుడు రాముని దూతగా సాగరాన్ని లంఘించి, సీతను కనుగొని, రాక్షసులను సంహరించి, లంకాద‌హ‌నం చేసి, రావణుని మదమణచి, సీతకు సాంత్వన కూర్చి, తిరుగు ప్రయాణానికి అరిష్టము అనే పర్వతాన్ని అధిరోహించాడు.


*తిరుగు ప్ర‌యాణం:*


హనుమంతుడి పద ఘట్టనంతో అరిష్ట పర్వతం నేలలో క్రుంగిపోయింది. ఒక మహానౌక సముద్రాన్ని దాటినట్లుగా హనుమంతుడు సునాయాసంగా ఆకాశాన్ని దాటాడు. దారిలో మైనాక పర్వతాన్ని గౌరవంగా స్పృశించి, ఉత్తర సాగర తీరం సమీపించగానే పెద్దయెత్తున గర్జించాడు. ఆ కేక విని జాంబవంతాదులు ఇది హనుమంతుని విజయసూచక ధ్వానమని గ్రహించి హర్షంతో గంతులు వేయసాగారు. మేఘంలాగా హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి గురువులకు, జాంబవంతాది వృద్ధులకు, యువరాజు అంగదునకు ప్రణామం చేశాడు. - "కనుగొంటిని సీతమ్మను. ఆమె రాక్షసుల బందీయై, రాముని కొరకు ఎదురు చూచుచు కృశించియున్నది. " అని హనుమంతుడు చెప్పాడు. "కనుగొంటిని" అన్న మాటలతో వానరు లందరూ పరమానందము పొందారు. అతనిని కౌగలించుకొని సంతోషంతో చిందులు వేశారు. తరువాత తన లంకా నగర సందర్శనా విశేషాలను అన్నింటినీ తన బృందంలోనివారికి వివరంగా చెప్పాడు హనుమంతుడు.


ఇంక అంతా కలసి వెళ్ళి లంకను నాశనం చేసి, రావణుని ఓడించి, సీతను తెచ్చి రామునకు అప్పగించాలని అంగదుడు అభిప్రాయపడ్డాడు. కాని జాంబవంతుడు అందుకు వారించి, ముందుగా జరిగిన సంగతిని రామునకు, సుగ్రీవునకు నివేదించ‌డ‌మే సరైనపని అని చెప్పాడు. అందరూ సంరంభంగా కిష్కింధకు బయలుదేరారు.

*మధువనం:*

సీత జాడ తెలియడం వలన అంగదాది వానరులంతా ఉత్సాహంగా హనుమంతుని వెంట‌బెట్టుకుని హుషారుగా కిష్కింధకు బయలుదేరారు. దారిలో మధువనమనే మనోహరమైన వనాన్ని చేరుకొన్నారు. అది సుగ్రీవునిది. దధిముఖుడనే వృద్ధ వానర వీరుని పరిరక్షణలో ఉంది. అంగదుని అనుమతితో వానరులంతా ఆ వనంలో ఫలాలను కోసుకొని తింటూ, మధువులను గ్రోలుతూ, చిందులు వేస్తూ,  వనాన్ని ధ్వంసం చేయసాగారు. అడ్డు వచ్చిన దధిముఖుని తీవ్రంగా దండించారు. దిక్కు తోచని దధిముఖుడు తన తోటి వన రక్షకులతో కలిసి వేగంగా సుగ్రీవుని వద్దకు ఎగిరిపోయి జరిగిన అకృత్యం గురించి మొరపెట్టుకొన్నాడు.


సీతాన్వేషణా కార్యం సఫలమయి ఉండకపోతే తన భృత్యులైన వానరులు అంతటి సాహసం చేయజాలరని సుగ్రీవుడు ఊహించాడు. వనభంగం అనే నెపంతో దధిముఖుడు సీతాన్వేషణా సాఫల్య సమాచారాన్ని ముందుగా సూచిస్తున్నాడని, శుభవార్త వినే అవకాశం ఉన్నదని రామలక్ష్మణులకు సుగ్రీవుడు చెప్పాడు. శుభవార్త తెలిపినందుకు దధిముఖుని అభినందించాడు. దధిముఖుడు మధువనానికి తిరిగి వెళ్ళి అంగదాదులతో సాదరంగా మాట్లాడి త్వరగా సుగ్రీవుని వద్దకు వెళ్ళమన్నాడు. అంగదుడు, హనుమంతుడు, తక్కిన బృందం రివ్వున ఆకాశానికెగిరి ఝంఝూమారుతంలాగా సుగ్రీవుని వద్దకు బయలుదేరారు.


*రాముడికి శుభవార్త*

*సీతమ్మ‌ జాడ తెలుపుట:*


అంగదాది ప్రముఖులు, హనుమంతుడు మహోత్సాహంతో సుగ్రీవుడు, రామలక్ష్మణులు మొదలైనవారున్న ప్రస్రవణగిరిపై దిగారు. *దృష్టా దేవీ (చూచాను సీతను)* అని హనుమంతుడు చెప్పగానే రామలక్ష్మణులు మహదానంద భరితులయ్యారు. హనుమంతుని కార్య సాధనపై విశ్వాసము గల లక్ష్మణుడు సుగ్రీవునివంక ఆదరంగా చూశాడు. తక్కిన వానరుల ప్రోద్బలంతో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మకు ప్రణమిల్లి, ఆమె ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించి, తన సాగర లంఘనా వృత్తాంతమును రామలక్ష్మణసుగ్రీవులకు వివరించాడు.


ఓ రామా! సీతామాత నిరంత‌రం నిన్ను స్మ‌రిస్తూ రాక్షస స్త్రీల నిర్బంధములో దీనురాలై నిరంతరము నీకోసం ఎదురుచూస్తున్న‌ది. అందరిని కుశలమడిగినది. నీవు అనతి కాలములోనే వచ్చి ఆమెను విముక్తురాలను చేసి స్వీకరిస్తావ‌నే ఆశ మాత్రముననే జీవించియున్నది. ఒక నెల‌ లోపల అలా జ‌ర‌గ‌కుంటే తాను ప్రాణాల‌తో ఉండజాలనన్నది. రామా! సింహ పరాక్రముడైన రాముని, ధనుష్పాణియైన లక్ష్మణుని త్వరలో లంకా ద్వారంలో చూడగలవని ఆమెకు చెప్పాను. శుభకరమైన వచనములతో ఆమెను ఓదార్చి ఇటు వచ్చాను. - అని హనుమంతుడు శ్రీరామునకు విన్నవించాడు.


రామాయణంలో సుందరకాండకు విశేషమైన స్థానం ఉంది.

బ్రహ్మాండ పురాణం రామాయణంలోని ఒక్కొక్క కాండం పారాయణానికి

 ఒక్కొక్క ఫలసిద్ధిని పేర్కొంటూ సుందరకాండ గురించి ...

*"చంద్రబింబ సమాకారం వాంఛితార్ధ ప్రదాయకం*,

*హనూమత్సేవితం ధ్యాయేత్ సుందర కాండ ఉత్తమమ్‌* అని పేర్కొన్నది.

                  ***

ఆపదా మపహ‌ర్తారం ధాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్

                    ***

నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయ

నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ

                  ***

గోష్పదీకృత వారాశిం

మశకీకృత రాక్షసమ్

రామాయణ మహామాలా

రత్నం వందే అనిలాత్మజమ్.


 (సుంద‌ర‌కాండ స‌మాప్తం)

భగవత్ శక్తి

 I am  నేను అనే మా రూప రహిత జీవ తత్వం. నామ రూప గుణం లేని ఆత్మ సంభోదన లేనియెడల వీనికి తెలియదు. అలాగే భగవత్ శక్తి కూడా రూప నామ గుణ లక్షణము లేనియెడల ఆత్మ తత్వం తెలియదు. మనకు తెలియుటకై అనగా మన భావన యే రూపం మన గుణం, రూపం యెుక్క నామం, మనగుణమే నామం. ఆత్మ కూడా దేహ దారుణమై ప్రకాశించిన గాని ఐ అనే ౦ పూర్ణ శక్తి జీవ రూపంలో తెలియదు. వుంటే కాదు అది యిది అని ఐ యామ్ నేను అనే ప్ర ఙ్ఞానాన్ని కలగాలి. దీనినే ఐం అనే సరస్వతీ బీజం. దీనికి ప్రణవం తోడు రావాలి దానికి ఏక శబ్ద శక్తి ఓం ఐం అనే సరస్వతీ బీజం. భాష ఏదైనా భావము వక్కటే.వసంత పంచమీనాడు ప్రకృతి స్త్రీ రూపంలో సరస్వతీ రూప వాక్కును బ్రహ్మ వశం చేయుట వలననే సృష్టికి వుపక్రమించినట్టు వేదం తెలుపు చున్నది. అంతవరకు ప్రకృతి రూప సరస్వతీ శబ్ద లక్షణం తెలియలేదు. అంతా మౌనంగానే సాధన. సాధన తెలియాలి అనగా పరిపూర్ణమైన ఙ్ఞానాన్ని ప్రకృతి ద్వారానే తెలియాలి. లేనియెడల శూన్యం. తెలుసుకుంటూ నే వుందాం.

మొగలిచెర్ల

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...(మొదటి రోజు)*


*ఇది ఒక అవధూత చరిత్ర..* 


*ఇది ఒక సాధకుడి జీవనయానం!..*


1970 వ సంవత్సరం...


ప్రకాశం జిల్లా లో వలేటి వారి పాలెం మండలం లో గల మాలకొండ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం..శ్రీ లక్ష్మీనారసింహుడు స్వయంభువు గా వెలసిన స్థలమది.. వారం లో ఒక్క శనివారం నాడు మాత్రమే, శ్రీ స్వామి వారికి అర్చనలు జరుగుతాయి..మిగిలిన ఆరు రోజులూ ఆ దేవాలయం మూసివేసి ఉంటుంది..కొన్ని శతాబ్దాల నుంచి ఉన్న ఆచారమది..ఆరు రోజుల పాటు ఆ లక్ష్మీ నారసింహుడు ఋషులు, దేవతలచే పూజింపబడుతాడనీ.. ఒక్క శనివారం నాడు మాత్రం మానవ పూజ కు అర్హత ఉందనీ స్థల పురాణం..అక్కడి స్వామి వారిని "శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి " గా పిలుస్తారు..కొలుస్తారు..


ఆ మాలకొండ కు దక్షిణ దిశగా ఉన్న మొగలిచెర్ల వాస్తవ్యులు శ్రీ పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి దంపతులు..మొగలిచెర్ల లో వున్నవే నాలుగు బ్రాహ్మణ కుటుంబాలు..అందులో వీరి కుటుంబం ఒకటి..మొగలిచెర్ల గ్రామం లో నే కాకుండా చుట్టుప్రక్కల కూడా వీరి కుటుంబానికి మంచి పేరు ఉంది.. 


మాలకొండ దేవస్థానానికి శ్రీ శ్రీధరరావు గారు ట్రస్టు బోర్డ్ అధ్యక్షుడిగా వుండేవారు..అదీకాక, ఆ దంపతులు మాల్యాద్రి లక్ష్మీ నారసింహుడికి భక్తులు..పవని నిర్మల ప్రభావతి గారు ఆసరికే తెలుగులో రచయిత్రి గా పేరు తెచ్చుకుని వున్నారు..ప్రతి శనివారం ఆ దంపతులు క్రమం తప్పకుండా మాలకొండ కు వెళ్లి, ఆ స్వామిని దర్శించి వచ్చేవారు..మొగలిచెర్ల నుంచి, రెండెద్దుల తో కట్టబడిన గూడు బండిలో..తమతో పాటు మరో పదిమందికి ఆహారం ఇంటినుంచే తయారుచేసుకుని మాలకొండకు తీసుకు వెళ్లేవారు..మాలకొండ పైకి వెళ్ళడానికి ఆరోజుల్లో రోడ్డు సౌకర్యం లేదు..అందువల్ల, కొండ క్రిందనే తమ బండిని ఉంచి, దంపతులిద్దరూ మెట్ల మార్గం గుండా పైకి నడచి వెళ్లి, మళ్లీ సాయంత్రం కొండదిగి, తిరిగి ఇంటికొచ్చేవారు..


శ్రీధరరావు గారు, మాలకొండ పైకి వెళ్ళడానికి రోడ్డు కొరకు అధికారులతో మాట్లాడి ఎటువైపునుంచి కొండమీదకు రోడ్డువేస్తే సౌకర్యంగా ఉంటుందో నని సర్వే చేయించే పనిలో, ఇతర రోజుల్లో మాలకొండకు వెళ్లసాగారు..


డిసెంబర్ నెలలో ఒకరోజు...శ్రీధర రావు గారు మాలకొండ వెళ్లి, ఆ కొండలోనే కొద్దిగా దిగువున ఉత్తరంగా ఉన్న పార్వతీదేవి అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లారు..పార్వతీ దేవి ఆలయానికి ఇంకొంచెం పైన కొండలోనే మలచబడ్డ శివాలయం నుంచి, మెల్లిగా దిగుతూ వస్తున్న ఒక దిగంబర యువకుడిని చూసారు..జన సంచారం లేని ఈ కొండమీద ఈ దిగంబర యువకుడెవరు?..శ్రీధరరావు గారికి సందేహం కలిగింది..ఇంతలో ఆ యువకుడు పార్వతీదేవి అమ్మవారి ఆలయం లోకి వెళ్ళిపోయి తలుపువేసేసుకున్నాడు..


శ్రీధరరావు గారికి కుతూహలం రెట్టింపు అయింది..కొండదిగి, అక్కడ వున్న స్థానికులను "మీరెప్పుడైనా అమ్మవారి ఆలయం దగ్గర దిగంబరంగా ఉన్న వ్యక్తిని చూసారా?" అని అడిగారు..ఈ మధ్య తాము కొండమీదకు వెళ్ళినప్పుడు అతను కనబడ్డాడనీ..తపస్సు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడని..పార్వతీదేవి అమ్మవారి ఆలయాన్ని తనకు నివాసంగా మార్చుకున్నాడనీ తెలిపారు..


"నిజంగా తపస్సు కోసమే ఇక్కడకు వచ్చాడా?..లేదా మరేదైనా ఆశించి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నాడా?.." ఆ నిమిషంలో శ్రీధరరావు గారికొచ్చిన సందేహాలు..ఒక్కక్షణం కూడా ఆలస్యం లేకుండా శ్రీధరరావు గారు తిరిగి పార్వతీదేవి ఆలయం వద్దకు వెళ్లారు..తలుపు మూసి ఉంది..అక్కడే అరుగు మీద కూర్చున్నారు..పది, పదిహేను నిమిషాలు గడిచాయి..


తలుపుతీసుకుని, ఆ యువకుడు బైటకు వచ్చాడు..శ్రీధర రావు గారికి అప్పటిదాకా వేధిస్తున్న ఒక్క సందేహమూ మనసులో గుర్తులేదు..ఏమి అడగాలని అనుకున్నారో ఒక్క ప్రశ్న కూడా నోటినుంచి బైటకు రావడం లేదు..తానొక దిగంబర యువకుడి ఎదురుగా నిలుచున్నాననే స్పృహ కూడా లేదు..ఏదో మాయ!..ఏదో వింత అనుభూతి..ఇదీ అని చెప్పలేని మానసిక స్థితి..అలా మాన్ప్రడిపోయి నిలుచున్నారు..ఆ యువకుడు ఒక్క మాటా మాట్లాడలేదు..ప్రశాంతమైన చిరునవ్వుతో చూస్తున్నాడు..కొద్దిసేపటికి శ్రీధరరావు గారికి పరిసరాలు తెలిసివచ్చాయి.."మీరూ..." అని మాత్రం అనగలిగారు..


చేయెత్తి, ఒక్క క్షణం ఆగమన్నట్టు సైగచేసాడా యువకుడు..అమ్మవారి ఆలయం లోకి వెళ్లి ఒక చిన్న కాగితము, పెన్నూ తీసుకొని వచ్చి, "నేను ప్రస్తుతం మౌనం లో వున్నాను..సంక్రాంతి తరువాత మాట్లాడతాను.." అని వ్రాసి ఇచ్చాడు..శ్రీధరరావు గారు నమస్కారం చేసారు.. అదే చిరునవ్వు!..అదే ప్రశాంతత!..కొద్దిసేపు అక్కడే నిలుచుండి.. ఇక తాను వెళ్ళొస్తానన్నట్లు గా తలా ఊపి.. అమ్మవారి ఆలయంలోకి వెళ్ళిపోయాడు..శ్రీధరరావు గారు కొండ దిగి..రెండెడ్ల బండిలో తిరిగి మొగలిచెర్ల కు ప్రయాణమయ్యారు..


శ్రీధర రావు దంపతుల తో మాట్లాడటం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..సెల్..94402 66380 & 99089 73699).

నేను

 భగవంతుడు నాకు దుారంగా ఎక్కడో లేడు. నా

హృదయములో ఉండి నన్ను నడిపిస్తున్నాడు. ప్రాణరుాపంలో నా కార్యాలకు శక్తినిస్తున్నాడు. నా ఆలోచనలు, జ్ఞానము, జ్ఞాపకశక్తి, మరపు కుాడా-

అతని అనుగ్రహమే. వాయురుాపంలో నాకు సేద

దీరుస్తున్నాడు. నీరు, ఆహారం రుాపంలో నా శరీర

పోషణకు సహాయము చేస్తున్నాడు. సుార్యుడు, చంద్రుడు అతని ఆజ్ఞ మేరకే వెలుగు నిస్తున్నవి. కాలానుగుణంగా ఋతువులు ఏర్పడడం అతని అనుగ్రహము. తల్లి, తండ్రి, బందువుల రుాపంలో నన్ను వృద్ధిలోనికి తెచ్చినది భగవంతుడే. గురువుల

రుాపంలో జ్ఞాన బోధ చేసింది భగవంతుడే.


నాలో రెండు వున్నాయి. 

ఒకటి-పాంచభౌతికమైన నా దేహం. 

రెండు- భగవదంశయైన నా ఆత్మ. 

ఒకటి లేకపోతే రెండవదానికి ప్రయోజనం

లేదు. 

వీటిలో  ++నేను++ ఎవరు?

కుంకుమ పువ్వు

 కుంకుమ పువ్వు  - సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు . 


        కుంకుమ పువ్వుని సంస్కృతము నందు కాశ్మీరజము , కుంకుమము , బాహ్లీకము , శోణితము , సంకోచము , పీతనకము అనే పేర్లతో పిలుస్తారు . భావప్రకాశము అనే ప్రాచీన ఆయుర్వేద గ్రంథము నందు కుంకుమపువ్వు యొక్క నాణ్యత మరియు ఔషధగుణములు ఆయా దేశ వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది అని తెలియచేయబడినది. వానిలో కాశ్మీర దేశము నందు పుట్టెడు కుంకుమపువ్వు చిన్నచిన్న కేశరములు కలిగి కొంచం అంత ఎరుపురంగుతో కూడుకుని కమలం వంటి పరిమళము కలిగి ఉండును అనియు ఇదే అత్యంత శ్రేష్టం అని రాయబడినది.


           ద్రవ్యకోశము అనే వైద్యగ్రంధము నందు లేత ఎరుపురంగుతో , మంచి పరిమళముతో , చేతితో నలిపిన చేతికి అంటుకొని రంగువీడక యున్నచో అట్టి కుంకుమ పువ్వు శ్రేష్టం అయినది అనియు , బాగా ఎరుపు రంగుతో ఉండి నోటియందు వేసుకొనిన మిక్కిలి చేదుగా , పసుపుపచ్చ రంగుతో ఉన్నచో అట్టి కుంకుమపువ్వు తక్కువరకము అని తెలుసుకొనవలెను . 


                        కుంకుమపువ్వు సాధారణముగా కొంచం చేదు కలిగి ఉండి నాలుకకు తిమ్మిరి కలిగించునదిగా మెత్తగా ఉండును. ఇది జిగటగా ఉండును. కొంతమంది ఈ కుంకుమపువ్వుని చందనంతో అరగదీసి పైపూతగా వాడుదురు . మరికొంతమంది తాంబూలముతో లోపలికి సేవించెదరు. శరీరం నందు వేడిని పుట్టించి వీర్యవృద్ధిని , కాంతిని , బలము , ఆయుర్వృద్దిని కలిగించి విషము , శోష , మదప్రకోపము , నేత్రవ్యాదులు , శిరోవ్యాధులు , గొంతుజబ్బులు , శరీరము నందలి మచ్చలు , దురదలు , కుష్టు , చిడుము , గజ్జి మున్నగు చర్మరోగములు , రసదోషములు , మేధోరోగములు మొదలైనవానిని హరించును . రక్తశుద్ది కలిగించి  శరీర దుర్బలత్వము  హరించును . గడ్డలను కరిగించును . చర్మరోగములు మాన్పును . కస్తూరి వలే ఏ ఔషధమునకు అయినను అనుపానంగా ఇచ్చిన ఔషధం త్వరగా పనిచేయును . టైఫాయిడు జ్వరము , ఉన్మాదరోగము , అపస్మారము , ప్రసవించు సమయంలో సంభవించు వాతరోగములు , ఋతురక్తబద్ధం , సమస్త నేత్రరోగములు ( కంటి పైన పట్టు వేయవలెను ) , ఓడలలో ప్రయాణము చేయువారికి వచ్చు జబ్బులు , మనోచాంచల్యములు పోగొట్టును . 


  గమనిక  - 


     మితిమీరిన మోతాదులో తీసుకున్నచో రక్తము విరిచి అమితమగు వేడి పుట్టించి దౌర్బల్యము కలిగించును. కొన్నిసార్లు స్త్రీల గర్భకోశము పాడుచేయును . కుంకుమపువ్వు పుచ్చుకోదగిన ప్రమాణము 5 మొదలు 15 గోధుమగింజల ఎత్తు మాత్రమే . 


          మరింత సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   

   గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

నేటి కాలము

 *పొలాలు* *స్థలాలు* *అయ్యాయి,*

*స్థలాలు* *గజాలు* *అయ్యాయి,*

*గజాలు* *నోట్లు* *అయ్యాయి,*

*ఆస్తులు* *కోట్లు* *అయ్యాయి,*

*డబ్బులు* *సీట్లు* *అయ్యాయి,*

*బాటిళ్లు* *ఓట్లు* *అయ్యాయి,*

*చానళ్లు* *గులాములు* *అయ్యాయి*

*పదవులు* *ఆస్తులు* *అయ్యాయి,*

*పల్లెలు* *బస్తీలు* *అయ్యాయి,*

*బ్రతుకులు* *సుస్తీలు* *అయ్యాయి,*

*జీవాలు* *శవాలు* *అయ్యాయి,*

*కలాలు* *బలాలు* *అయ్యాయి,*

*అలవాట్లు* *బలహీనతలు* *అయ్యాయి,*

*సిగ్గులు* *ఎగ్గులు* *అయ్యాయి,*

*లాభాల* *పెగ్గులు* *అయ్యాయి,*

*పీఠాలు* *మనుగడ* *అయ్యాయి,*

*విలువలు* *గతాలు* *అయ్యాయి,*

*వలువలు* *బరువు* *అయ్యాయి,*

*మాటలు* *బీటలు* *అయ్యాయి,*

*తలపులు* *తలవంపులు* *అయ్యాయి,*

*నిజాలు* *యిజాలు* *అయ్యాయి....*

*కలియుగం*

*అతికినా వ్యర్థం*

*వెతికితే శూన్యం*

17, ఏప్రిల్ 2021, శనివారం

సైంటిఫిక్ లిటరసీ

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

    *విరించి విరివింటి గారి* విశ్లేషణ ను మార్చి వాట్సాప్ లో పంపగా నాకు చేరినది.

               🌷🌷🌷

మనదేశంలో 1% మాత్రమే సైంటిఫిక్ లిటరసీ ఉంది.  (scientific illiteracy) సైంటిఫిక్ లిటరసీ త్వరితగతిన మరింతగా పెరగవలసిన అవసరం అత్యవసరంగా ఉంది. దానికోసమై సైన్స్ చదివిన వారు కాస్తో కూస్తో తమవంతుగా ఇతరులతో నిరంతరం సైన్సును సైంటిఫిక్ కోణంలో నుంచి మాటలాడటం అవసరం. వివరించడం అవసరం. రిచర్డ్ డాకిన్స్ ఒక ఇంటర్వ్యూలో ఏమంటారంటే.."సైంటిస్టులు సైతం మత సంబంధ మూఢనమ్మకాలలో కూరుకుపోవడానికి కారణం మతం కాదు.  సైన్సు చెప్పేవారు దానిని సరిగ్గా సైంటిఫిక్ గా చెప్పకపోవడం" అని. 


కొంత సైన్సు తెలిసిన వారికీ(డాక్టర్లే కావొచ్చు లేదా సైంటిస్టులు కావచ్చు), సామాన్య ప్రజలకూ మధ్యన అగాధం ఎప్పటికీ ఉంది. గత శతాబ్దాలకంటే ఈ శతాబ్దంలో ఈ అగాధం మరింత పెరిగిందంటారు గడియారం భార్గవగారు. నిజమే కదా. "Amusing ourselves to Death" అనే పుస్తకంలో Neil postman మనుషులకు మారుతున్న జ్ఞాన మార్గాల గురించి చక్కగా వివరిస్తారు. ఒకప్పుడు మనుషులకు జ్ఞానం అందాలంటే కేవలం చదువుకుని నిష్ణాతులైన వారు ఉపన్యాసాలు ఇస్తేనే సాధ్యమయ్యేది.  వారి జ్ఞానం ప్రచారం ద్వారా పదిమందికీ ఉపయోగపడేది.

ఆ తర్వాత కాగితం వచ్చాక ఏదైనా చెప్పాలనుకున్నది రాయడం వలన చెప్పేవారు. నిష్ణాతులైన వారు తమ జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో చెప్పేవారు.


ఇక్కడ ఒకసారి ఆలోచించండి.  చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలి అనుకునేవారికి పుస్తకాల రూపంలో మాత్రమే జ్ఞానం అందుబాటులో ఉండేది.  ఆ జ్ఞానం కూడా డైరెక్టుగా ఆ జ్ఞానం కలిగివున్న నిష్ణాతుడు రాసినదే ఐవుండేది.  అంటే ప్రజలకు అందే జ్ఞానం first hand జ్ఞానం. Directly from the source. 


తరువాత జరిగిన మార్పు. రేడియో..టీవీ. ఇవి వచ్చే సరికి నిష్ణాతులైన వారి పుస్తకాల గురించి ఇతరులు మాట్లాడటం మొదలైంది. అంటే first hand నుంచి second hand కి జ్ఞానం బదలాయించడం అయింది. అలా మాట్లాడే వారు కూడా ఆ రంగంలో నిష్ణాతులు ఐవుండేవారు.   డైరెక్ట్ సోర్స్ కాకున్నా Secondary sources of knowledge లు పెరిగాయి.   కొంతకాలం తరువాత ఎవరైనా టీవీలో మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా ఏదైనా మాట్లాడే పరిస్థితి ఏర్పడేసరికి జ్ఞానతృష్ణ గల ప్రజలకు second hand knowledge పెరిగిందే తప్ప అంతకుమించి పెరగలేదు.


దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణను నీల్ పోస్ట్మన్ ఇస్తారు.  అబ్రహం లింకన్ స్పీచ్ సమయానికీ, అప్పటి ప్రజలకూ - ఇప్పటి అమెరికన్ అధ్యక్షుల స్పీచ్ కీ ఇప్పటి ప్రజలకూ.


అబ్రహం లింకన్ తన opponent డగ్లస్ కి మధ్య జరిగిన చర్చ దాదాపు వేయి మంది ప్రేక్షకుల మధ్యన ఏడెనిమిది గంటలు సాగుతుంది. ఇందులో లింకన్ కానీ డగ్లస్ కానీ వాడిన భాష, ఆ పదాలు గ్రాంథిక భాషలో సాగాయిట.  వాళ్ళు మామూలుగా మాట్లాడినా ఆ పదాలు ఏదో గ్రంథంలోంచి చూసి చదువుతున్నట్టుగా ఉండేవంట.  ఒకరకంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారికి గానీ ఆ స్పీచ్ ల క్లిష్టత అర్థమయేది కాదంట.  చాలా సీరియస్ గా వ్యక్తిగత దూషణలకు దూరంగా అమెరికా అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడారట.  ఇక్కడ వాళ్ళు అలా ఎందుకు మాట్లాడారు అంటే వాళ్ళ జ్ఞాన మార్గాలు కేవలం పుస్తకాలు మాత్రమే.  ఎన్నో పుస్తకాలు చదివి ఉండటం వలన వారి భాషకూడా అలాగే పుస్తకాల్లో ఉన్నట్టే ఉండేది. వారికి opponent ని కించపరుస్తూ మాట్లాడవలసిన అవసరంకూడా ఏమీలేదు.  తరువాత తరువాత వచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్ల భాష రాను రానూ భ్రష్టు పట్టడం మొదలైంది.  మరీ స్కూలు పిల్లల స్థాయికి వారి భాష పడిపోయి  సమస్యల కంటే- రేసిజం మీద, మతాలమీద గిల్లికజ్జాలు పెట్టుకునే స్థాయికి అధ్యక్ష కాండిడేట్ల డిబేట్ లు దిగజారాయి.  ట్రంపు మాట్లాడే భాష ఒక ఐదవ తరగతి పిల్లవాడు కూడా అర్థం చేసుకునేంతగా ఉంటుందంట. ఇది అచీవ్మెంట్ కాదు.  పతనం.  కారణం ఏమంటే ఇప్పటి అధ్యక్షుల knowledge sources డైరెక్టుగా పుస్తకాలు కాదు. First hand sources of knowledge కాదు. పుస్తకాలకంటే టీవీ ఛానళ్ళిచ్చే secondary or  tertiary superficial second hand third hand fourth hand...జ్ఞానమేఆధారం. 


ఇక అప్పటి ప్రజలు కూడా. ఏడెనిమిది గంటలు చర్చాగోష్టి జరిగినా కట్టు కదలకుండా కూర్చునేవారంట.  ఓపికగా శ్రద్ధగా వినేవారంట. ఎందుకంటే ఆ ప్రజల జ్ఞానమార్గాలు కూడా కేవలం పుస్తకాలు మాత్రమే.  కాబట్టి వారికి స్పీచ్ జరిగేకంటే ముందే pre conceived notions లేవు.  వారికి వాటిని అందించడానికి టీవీ యాంకర్లు లేరు.  మీడియా పేరుతో నోటికొచ్చిందంతా చెప్పేవారు లేరు.  కాబట్టి లింకన్ ఏం చెబుతాడో...డగ్లస్ ఏం చెబుతాడో అనే ఉత్సుకత.   ఎవరు తమను బాగు చేయగలరో అనే నిజమైన నిబద్ధత.  వారి స్పీచ్ ఆధారంగా వాళ్ళను అంచనా వేయాలి వాళ్ళకు ఓటు వేయాలి కాబట్టి ఆ శ్రద్ధ కూడా. ఇన్ని లక్షణాలు ఆ ప్రజలకు ఉండటానికి కారణం వాళ్ళ జ్ఞానమార్గాలు first hand sources నుండి ఉండటమే. ఇపుడు మనకంత ఓపికలున్నాయా.  అలా నాయకులు మాట్లాడితే వినగలిగే శక్తి ఉందా.  ఇతర నాయకులను కులాల పేరుతో మతాల పేరుతో అమ్మనాబూతులు తిడుతుంటే మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ లో వింటూ ఆనంద పడిపోయే స్థాయికి దిగజారాం కదూ.


ఇపుడు మీడియా వార్తా వ్యాపారం కాలంలో, యూట్యూబ్ కాలంలో మన జ్ఞాన మార్గాలు first hand second hand కూడా కాదు ఏ లక్షవో కోట్లవో ఎక్కడిదో ఐవుంటుంది.  అభిప్రాయాలే జ్ఞానమై కూర్చున్నాయి. వచ్చిన సమాచారమే తిరుగులేనిది ఐపోయింది. ఎవడో ఒకడు ప్రపంచంలో ఏ మూలలోనో కూర్చుని  తన అభిప్రాయాన్ని తన నోటికొచ్చినట్లు అదే జీవన సత్యమన్నట్టు వాట్సప్ లో ఏదో రాస్తాడు.  లేదా యూట్యూబ్ లో ఏదో వాగుతాడు.  రాసినవాడెవడో కూడా ఇదమిత్తంగా తెలియదు.  వాగేవాడేం చేస్తాడో కూడా ఎవరికీ తెలియదు.  దానికి గల ఆథెంటిసిటీ కూడా ఎవరికీ తెలియదు.  కానీ అదే నిజమని బాగా చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా నమ్ముతాడు.


ఇలా ఎందుకు జరుగుతుంది?  మనిషికి జ్ఞానాన్ని First hand knowledge ని అందించే జ్ఞాన మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. రూపు మార్చుకుని అభిప్రాయాలు, ఊహత్మక వర్ణనలే నిజాలైపోయాయి. పైగా ఇదే ultimate knowledge అని బొంకుతున్నాయి.  విచిత్రంగా చదువుకున్నవాడూ వాటిని నమ్ముతున్నాడు. మనమేమైనా ఆలోచించగలమా? ఈ బొంకుతున్న వారిని వదిలేసి ఆథెంటిక్ జ్ఞానం కోసం కొంతైనా ప్రయత్నం చేయగలమా?  అన్నది ప్రధాన సమస్యలా కనబడుతోంది.  Neil postman అన్నట్టు ఎంటర్టైన్మెంట్ పేరుతో we are amusing ourselves to death. No seriousness even at the edge of pandemic. ఈ రోజుకీ మనం సైంటిస్టులు చెప్పేదంతా అబద్ధమని ఏ వాట్సాప్ ప్రబుద్ధుడు రాసినా నమ్మేస్తున్నాం అంటే మన education స్థాయికీ literacy స్థాయికీ ఎంత అగాధం సృష్టించుకున్నామో కదా!


ఒకసారైనా తీవ్రంగా ఆలోచించవలసిన అంశాలివి.

కనీసం కరోనా కాలంలోనైనా మన జ్ఞాన మార్గాలు నిజంగా జ్ఞానమార్గాలేనా వొట్టి కాన్స్పైరింగ్ పుకార్లా అని తరచి చూసుకోవలసిన తరుణం వచ్చింది !


-విరించి విరివింటి


విరించి విరివింటి  గారి ఆర్టికల్ ని ఎక్కువమందికి చేరవేయాలనే ఉద్దేశ్యంతో కొంత ఎడిట్ చేసి (అనుమతి లేకుండానే) పోస్ట్ చేసి పంపినది.

కాశీ కి వచ్చే యాత్రికులకు విజ్ఞప్తి ,!!

 !!    కాశీ కి వచ్చే యాత్రికులకు విజ్ఞప్తి ,!!

కాశీ కి వచ్చే యాత్రికులకు విజ్ఞప్తి ఏమనగా వారణాసి కలెక్టర్ గారి ఆదేశాలు ప్రకారము ఏదైనా విశేష పరిస్థితిలో అవుతూనే వారణాసి కి రావాలని లేనిచో ప్రస్తుతం యాత్రలు వాయిదా వేసుకోవాలని కోరారు.

 కాశీ విశ్వనాధుడు అన్నపూర్ణ గుడి లో ప్రవేశం కావాలి అంటే మూడు రోజుల క్రిందట covid 19 ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ చేసుకుని రిపోర్ట్ తీసుకుంటేనే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రవేశం ఉంటుంది అని చెప్పారు కాశీలో కరోనా కేసులు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి రోజుకు రెండు వేల పైగా కేసులు వస్తున్నాయి పరిస్థితి అంత మంచిగా లేదు ఈ రోజు నుండి 3-5-2021 వరకు ప్రతి శనివారము ఆదివారము లాక్ డౌన్ పెట్టారు ఈ పరిస్థితుల్లో కాశీకి వచ్చే యాత్రికులు తమ ప్రయాణాలను కొద్దికాలము వాయిదా వేసుకోవాల్సి ఉందిగా శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధి పీఠాధీ శ్వర సనాతన సంస్కృతి సంరక్షణ ట్రస్ట్ వారణాసి తరఫున కోరడమైనది ప్రతి ఒక్కరూ ఈ విషమ పరిస్థితుల్లో నుంచి బయటకు రావాలి అంటే కోవిడ నియమములను పాటిస్తూ మాస్కు పెట్టుకోవటం రెండు గజాల దూరంలో ఉండటం చేతులు కడుక్కోవడం మొదలగు చేస్తూ అవసరం ఉంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని కోరుతున్నాము

ఇట్లు చైర్మన్ గబ్బిట శ్రీనివాస శాస్త్రి

నిర్లక్ష్యం వద్దు

 నిర్లక్ష్యం వద్దు అదేసమయంలో భయపడాల్సిన అవసరం లేదు.

కరోనా ఎవరికీ రావొద్దు అనేదే మన కోరిక అయితే పరిస్థితి చూస్తే  సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. దీనిని అందరం కలిసి కట్టుగా ఎదుర్కోవాలి. ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి అయితే అది మాత్రమే సరిపోదు. మానసిక సంసిద్ధత అవసరం.


పొరపాటున వస్తే భయం వద్దు.

జ్వరం,కాళ్ళు లాగడం, జలుబు, రుచిలేకపోవడం, వాసన లేకపోవడం , ఆకలి తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే RTPCR టెస్ట్ చేయించుకోవాలి. 

రాపిడ్ సాధ్యమైనంత వరకు వద్దు. 

వయస్సు ఎక్కువ ఉంటే HR CT scan చేయించాలి. దాని వల్ల వ్యాధి తీవ్రత తెలుస్తుంది.

సంవత్సర కాలం లో వైద్యులకు దీనిపై పూర్తి పట్టు దొరికింది.

సకాలం లో టెస్ట్ చేయిస్తే ఎలాంటి ప్రమాదం లేదు.

వచ్చిన వాళ్ళు, రానివాళ్ళు అందరూ నువ్వుల లడ్డు, బొప్పాయి పండు, అక్రూట్, ఖర్జురం , తినాలి. రోజు కొద్దిసేపు ఉదయంఎండలో నిలబడాలి.

కొద్దిగా వ్యాయాయం, యోగా చేయాలి. బాగా తినాలి.

అవసరమైతేనే బయటకు వెళ్ళాలి . 

నిపుణుల మాటలను బట్టి ఇది జూన్ మొదటి వారం నుండి మళ్ళీ మామూలు అవుతుంది.

45 ఏళ్ల పై వారు తప్పకుండా వాక్సిన్ తీసుకోవాలి. ఎలాంటి భయం వద్దు.

రెండవ డోస్ తరువాత 15 రోజులకు మనకు పూర్తి శక్తి వస్తుంది.

ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా ఒకరికి ఒకరు మాట్లాడుకొందాం . కలిసి ఎదుర్కొందాం

అరికాళ్ళ కింద మంటలు

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

“అరికాళ్ళ కింద మంటలు “- శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి .


ఆ అమ్మాయి తీరి కూచుని తన కష్టాలు ఏమీ చెప్పుకోలేదు ఆ కథలో. 

అసలు కూచోడానికి తీరికేది? ఇక ఎవరికైనా చెప్పుకోవడం కూడానూ..

పెద్దక్క పిల్లాడికి జుబ్బా , చిన్నక్క కి రవిక , అప్పటి కప్పుడు కుట్టి పెట్టాలి . పైగా వారి ఎకసెక్కపుమాటలూ పరోక్ష బెదిరింపులూ భరించాలి. మీ అమ్మనాన్నా పూసుకుంటారు ,పునిస్త్రీ సేవ చేసుకో , గంధం తీసిపెట్టు అని అమ్మమ్మ పురమాయించింది మరి. నిజమే, తీసిపెట్టాలి కదా.  పైగా మాట వినకుండా పెంకెతనం చేసి  చెల్లెలు  ఆ గిన్నెలో గంధం పడేస్తే, గూడలు పడిపోయేలా మళ్ళా గిన్నెడు గంధం తీయాలి.ఇదంతా కుంచముడు కందులు వేయించి ముగించాకనే.

అమ్మ , అలా పెత్తనాలకు పోయొస్తాను కాస్త వంట చేయవే అంటే మడి కట్టుకోవాలి . సినిమా కి పోయే తమ్ముడు పొగరుగా , పనసపెచ్చుల పులుసులో ముక్కలు తనకు ఉంచక పోతే మక్కెలు విరగతంతానంటే మాటాడక ఊరుకోవాలి. బాధ్యత గల తండ్రే , చేతకానితనంగా ఊరుకుంటే మన్నించాలి.

ఇదంతా ఎవరు చేస్తారు ఒక పదిహేడేళ్ళ పిల్ల రుక్కు.. రుక్మిణి. ఆమె  చేసిన తప్పు బాలవితంతువు అవడం. పెట్టిపుట్టలేదు కాబట్టే ఆ మొగుడు పోయాడు, ఈమె జన్మమింతే అని అమ్మమ్మగారి ఉవాచ. అమ్మమ్మ దృష్టిలో అందరి దృష్టిలో కూడా,   రుక్కు ఇక సుఖాలమీద ఆశ వదులుకుని, ఇంటోవారి సేవ చేసుకుంటూ జీవితం వెళ్ళమార్చాలి. ఆ ఇల్లు మనుషులూ తప్ప వేరే దిక్కు, వేరే ప్రపంచమూ లేవు. ఉండబోవు. అసలు వేరే ఆలోచనే ఉండరాదు.

 “ అరికాళ్ళ కింది మంటలు” కథ లో అప్పటి బాలవితంతువుల కష్టాలు వారి దుర్భర పరిస్ధితి కళ్ళకు కట్టినట్టు వివరించారు , శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రిగారు. వారి కథనం అపూర్వం . అద్భుతం.

రుక్మిణి దయనీయస్ధితికి మనసు కరిగి పోతుంది.

నాకు బాగా నచ్చినది రుక్కు తన  కష్టాలు చెప్పుకోదు తనంతతానుగా. మిగతావారితో జరిపే సంభాషణలలోనే మనము తెలుసుకుంటాము, ఆమె ఇబ్బందులన్నీ. ఇంటో ఉన్నవారే ఆమె అరికాలికింద మంటలు  ఎలా పెట్టారో చూస్తాం ఇందులో. 


ఒక మూఢాచారాన్ని మూఢ నమ్మకాన్ని ఆచరించాలనుకునే సమాజానికి అసలు ఆలోచన ఉండదనిపిస్తుంది, ప్రేమాభిమానాలు కూడా పోతాయనిపిస్తుంది. కేవలం గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా , 

ఆ ఆచారము పెట్టబడింది కాబట్టి అనుసరించి తీరడమే తమ కర్తవ్యము అనుకుంటారు కాబోలనిపిస్తుంది. కుటుంబం లోని వారి వాత్సల్యాన్ని  , మానవత్వాన్ని కూడా చంపేసే మూఢాచారాలు మీద కోపమూ, రుక్కు పరిస్ధితి మీద ఎంతో జాలి బాధ కలుగుతాయి . 

చివరకు వితంతు పరిస్ధితి  (దుస్ధితి) ని జుట్టు తీయించి గుండు చేయించడం ద్వారా సంపూర్ణం చేయాలి , లేకపోతే తను తలెత్తుకు తిరగలేనన్న అమ్మమ్మ ప్రతిపాదనను తండ్రి తిరస్కరించలేకపోవడం గమనిస్తుంది రుక్కు.  అంతేకాదు,  వీరేశలింగం పంతులుగారు తోటలో వితంతు వివాహాలు జరుగుతున్నాయని వింటుంది .ఆ రాత్రి  కమ్ముకున్న ఆలోచనలలో, మంటలలో పడకుండా తేరుకున్నదానిలా గభాలున రుక్కు తలుపులు తీసుకు వీధిలోకొచ్చి పడుతుంది. 

వీధిలో రుక్కు లాటి అభాగ్య వితంతు ఆడపిల్ల ఉన్న జట్కా బండి అతను , గ్రహిస్తాడు రుక్కు ఎక్కడి కెళ్ళాలనుకుంటోందో. పంతులు గారి తోటకైతే కానీ డబ్బులు తీసుకోనంటాడు, తన దగ్గర బాడుగ కి డబ్బులు లేవన్న రుక్కుతో.

రుక్కు కు పెళ్ళి అయి మంచి జీవితం అమరాలనీ , తరువాత అది తన కూతురికి కూడా మార్గం చూపాలని కోరుకుంటూ, ఆమెను పంతులుగారి తోటకు తీసుకెడతాడు. బండి మలుపు తిరిగింది అంటూ కధ ముగుస్తుంది. 


ఇది రుక్కులాటి బాల్యవితంతువుల జీవితానికి తిరిగిన మలుపే

ఏదో ఒకరకమైన  బాధలూ కష్టాలూ  సమాజం నుంచీ ఎదుర్కోవడం , ఆడవారికీ ఈనాటి వరకూ తప్పలేదు,  వాటినుంచి జాగ్రత్తగా బయటకు తీసుకువెళ్ళే , సాయం చేసే మంచి మనసున్నవారు , ఆ జట్కా బండతను వంటివారు ఇప్పుడున్నారా.. ఉంటే బావుండును కదా , అనిపిస్తుంది.రుక్కు లాగ స్వయం నిర్ణయం చేసుకోగలిగే ఆలోచన  వివేకము ధైర్యము ఆడవారిలో ఉంటే బాగుండుననిపిస్తుంది.

కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి గారి  గురించి,  నేను కొత్తగా ఏమీ చెప్పే సాహసం చేయలేను , 


ఆ పుస్తకంలో  ముందు మాటలో చెప్పినట్టుగా వారు  

“ ఛాందస తమస్సు నుండి పుట్టిన సంస్కరణ జ్యోతి”.

వీరేశలింగం గారి సంస్కరణోద్యమాన్ని మనసారా అభిమానించి, రచనల రూపంలో విస్తృత ప్రచారం చేసిన ధన్యజీవి.


కధా సమీక్ష : జానకీ చామర్తి .

సేకరణ: ప్రభాకరరావు, వరిగొండ

సుంద‌ర‌కాండ‌- సీతాద‌ర్శ‌న‌ఘ‌ట్టం

 శ్రీ‌శ్రీ‌శ్రీ‌

*రామాయణ దివ్యకథా పారాయణం*

* శ్రీ‌రామ న‌వ‌మి ప‌ర్వ‌దినం వ‌ర‌కు*

         *5 వ  రోజు*

     🌸 *సుంద‌ర‌కాండ‌*🌸


               ***

శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి.

                ****

మనోజవం 

మారుతతుల్య వేగం

జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం |

వాతాత్మజం 

వానరయూథ ముఖ్యం

శ్రీరామ దూతం 

శరణం ప్రపద్యే||


(మనస్సుని జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు,గొప్ప తెలివిగలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీ రామచంద్రునకు దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను.)

                 ***


సీతాన్వేష‌ణ సంక‌ల్ప దీక్ష‌తో ఆంజ‌నేయుడు మ‌హేంద్ర‌గిరి ప‌ర్వ‌తం ఎక్కి ఉత్సాహంతొ కాసేపు విహ‌రించాడు. మ‌హావేగంతో ఆకాశంలోకి ఎగిరేందుకు ప‌ట్టుకోసం భూమిపై కాలు పెట్టి అదిమితే అది ఎక్క‌డ కుంగుతుందో న‌ని మ‌హేంద్ర‌గిరి ప‌ర్వ‌తాన్ని ఆపుగా చేసుకున్నాడు. త‌ల‌పైకి ఎత్తి చూశాడు. విశాల ఆకాశం ప్రేర‌ణ‌నిచ్చింది. మ‌హోత్సాహం ఆవ‌హించింది. తూర్పుకు తిరిగాడు. సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి న‌మ‌స్క‌రించాడు. శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తిని శ‌రీరంలోకి ఆవ‌హింప‌చేసుకున్నాడు. 

వాన‌ర‌సేన‌వైపు తిరిగాడు, మిత్రులారా రామ‌కార్యార్థం వెడుతున్నాను. రామ‌బాణం ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంతో లంక‌లో ప్ర‌వేశిస్తాను. అక్క‌డ సీత‌మ్మ‌వారు లేక‌పోతే దేవ‌లోకం వెళ‌తాను. అక్క‌డా ఆ మ‌హాత‌ల్లి క‌నిపించ‌క‌పోతే రావ‌ణాసురుణ్ణే బంధించి ఈడ్చుకువ‌స్తాను . లేదంటే లంకాన‌గ‌రాన్నే పెళ్ల‌గించి తీసుకువ‌స్తాను చూస్తుండండి అంటూ 

ఒళ్లువిరిచి, దేహాన్ని సాగ‌దీసి.చేయి ముందుకు సాచి...జై శ్రీ‌రామ్ అంటూ  మ‌హేంద్ర‌గిరిని కాలితో గ‌ట్టిగా అదిమి హ‌నుమ ఒక్క ఉదుటున ఆకాశంలోకి లేచాడు.  వాన‌ర సేన హ‌నుమ‌కు,శ్రీ‌రామ చంద్ర‌మూర్తికి జేజేలు ప‌లుకుతున్న‌ది. హ‌నుమ మ‌హేంద్ర‌గిరినుంచి పైకి లేస్తుంటే ఆ ఊపుకు మ‌హేంద్ర‌గిరి ఊగిస‌లాడింది.  చెట్లు ఆ మ‌హోధృత గాలికి పుష్ఫ వ‌ర్షం కురిపించాయి. వాతావ‌ర‌ణం ఆహ్లాద‌క‌రంగా మారింది.జీవ‌కోటికి ఏదో తెలియ‌ని ఆనందం. విష‌ప్రాణులు భ‌యంతో విల‌విల‌లాడి పోయాయి. అలా స‌ముద్రం మీద మ‌హావేగంతో హ‌నుమంతుడు లంకాన‌గ‌రంవైపు దూసుకుపోతున్నాడు. స ముద్రంపై ప‌డిన హ‌నుమంతుడి నీడ, స‌ముద్రంలో గాలివాటుకు పోతున్న నౌక‌లా క‌నిపిస్తున్న‌ది. స‌ముద్రం అల్ల‌క‌ల్లోల‌మౌతున్న‌ది.  రెక్క‌ల ప‌ర్వ‌తంలా దూసుకుపోతున్నాడు మ‌న హ‌నుమ‌. దేవ‌త‌లు హ‌నుమ‌నుచూసి విజ‌యోస్తు విజ‌యోస్తు అని దీవిస్తున్నారు. 


*సాగ‌రుడి సాయం*


స‌ముద్రుడు త‌ల పెకి ఎత్తి చూశాడు. రామ‌కార్యార్థి అయిన హ‌నుమ‌కు ఎ దో ర‌కంగా స‌హాయం చేయాల‌నుకున్నాడు. అప్పుడు స‌ముద్రంలోనే దాగి ఉన్న మైనాకుడ‌నే ప‌ర్వ‌తాన్ని పిలిచి, ఈ స‌ముద్రం నుంచి పైకి లేచి నువ్వు హ‌నుమ‌కుఆతిథ్యం , కాసేపు విశ్రాంతి నివ్వు అలా రామ‌కార్యంలో త‌రిద్దాం అన్నాడు స‌ముద్రుడు. మైనాకుడు ఆకాశ‌వీధికి పెరుగుతూ వెళ్లి హ‌నుమ‌కు అడ్డంగా నిలిచాడు. విశ్రాంతి ఇవ్వాల‌న్న సంక‌ల్పంతో. హ‌నుమ త‌న‌కు ఏదో అడ్డుగా నిలిచింద‌ని భావించి గుండెతో మైనాకుడిని ఒక్క గుద్దు గుద్దాడు. దానితో క‌ల‌వ‌ర‌ప‌డిన మైనాకుడు నిజ‌రూపం లో ఎదురుగా నిలిచి  , త‌న శిఖ‌రంపై విశ్రాంతి తీసుకోమ‌న్నాడు. హ‌నుమ సంతోషించాడు.కానీ రామ‌కార్యార్థినై సంక‌ల్ప‌దీక్ష‌తో వెళుతున్నాను. విశ్రాంతి కిది స‌మ‌యం కాదు . అని మైనాకుడి తృప్తి కోసం అత‌నిని చేతితో స్పృశించి ప్ర‌భంజ‌న వేగంతో హ‌నుమంతుడు ముందుకు దూసుకుపోతున్నాడు. హ‌నుమ దీక్ష‌కు దేవ‌త‌లు ముచ్చ‌ట‌ప‌డ్డారు.

గంధ‌ర్వ దేవ‌తాగ‌ణాలు హ‌నుమ శక్తిసామ‌ర్థ్యాలు ప‌రీక్షించాల్సిందిగా నాగ‌మాత సుర‌ను కోరారు. ఆమె భారీ కాయంతో హ‌నుమ మార్గానికి అడ్డుప‌డింది. హ‌నుమా ఈరోజు నువ్వు నాకు ఆహారం. నువ్వు మ‌ర్యాద‌గా నా నోట్లోకి ప్ర‌వేశించు అని గ‌ద్దించింది. అప్పుడు హ‌నుమంతుడు, విన‌యంతో అమ్మా నేను రామ‌కార్యార్థినై వెళుతున్నాను. సీతామాత జాడ తెలుసుకుని వ‌చ్చిన త‌ర్వాత నీకు ఆహారం అవుతాను అన్నాడు. సుర‌న ఒప్పుకోలేదు. స‌రే నా దేహానికి స‌రిప‌డినంత‌గా నీ నోరు తెరువు అన్నాడు. సుర‌న నోరు పెద్ద‌ది చేస్తున్న‌ది. హ‌నుమ త‌న దేహాన్ని పెంచుతూ పోతున్నాడు. ఇలా ఇద్ద‌రూ పోటీ ప‌డుతున్నారు.  ఒక ద‌శ‌లో  హ‌నుమ  ఉన్న‌ట్టుండి త‌న దేహాన్ని బొట‌న వేలి స్థాయికి త‌గ్గించి సుర‌న నోట్లో కి ప్ర‌వేశించి క్ష‌ణ‌కాలంలో బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అమ్మా నీవు చెప్పిన‌ట్టే చేశాను. ఇక వెళ్లిరానా అన్నాడు. ఆంజ‌నేయుని సూక్ష్మ‌బుద్ధికి సంత‌సించి నాయానా నీకు కార్య‌సిద్ధి క‌లుగుతుంది. సీతారాముల‌ను క‌లుపుతావు అని ఆశీర్వ‌దించి మార్గం సుగ‌మం చేసింది.

అలా గ‌గ‌న‌త‌లంలో స‌ముద్రంపై దూసుకుపోతున్న హ‌నుమ నీడ‌ను ఛాయాగ్రాహిణి అనే స‌ముద్రంలోని రాక్ష‌సి సింహిక చూసింది. త‌న‌కు భ‌లే ఆహారం దోరికింద‌ని అనుకునుంది. నోరుతెరిచి హ‌నుమ నీడ ఆధారంగా  త‌న నోట్లోకి లాగే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. ఇది గ‌మ‌నించాడు హ‌నుమ‌. దేహాన్ని మ‌రింత పెంచినా ప్ర‌యోజ‌నం లేక పోయింది. వెంట‌నే సూక్ష్మ‌రూపియై సముంద్రంలోని సింహిక‌ను ఢీకొట్టి దాని ప్రాణాలు తీశాడు. సింహిక మృత‌క‌ళేబ‌రం సముద్రంపై తేలుతుంటే దేవ‌తలు సంతోషంతో పుష్ప‌వృష్టి కురిపించారు. ఈ విధంగా ధైర్యం, విశాల‌దృష్టి, బుద్ధి, చాక‌చ‌క్యం ప్ర‌ద‌ర్శించిన హ‌నుమ‌కు ఎదురులేద‌ని దేవ‌తులు దీవించారు. అంత‌లోనే హ‌నుమ‌కు ద‌క్షిణ‌తీరంలో ప‌ర్వ‌త పంక్తులు హ‌నుమంతుడికి క‌నిపించాయి. లంకాన‌గ‌రానికి ద‌గ్గ‌ర‌లోని త్రికూట‌గిరి శిఖ‌రం మీద దిగాడు.  ఇంత దూరం స‌ముద్రంపై ఎగిరివ‌చ్చినా ఏమాత్రం అలిసిపోలేదు. సాయం సంధ్యా వంద‌నాది కార్య‌క్ర‌మాలు ముగించాడు.


*లంకాన‌గ‌ర ప్ర‌వేశం*:


త్రికూట‌గిరినుంచి లంకాన‌గ‌రాన్ని చూశాడు హ‌నుమంతుడు. బ‌హు సుంద‌రంగాఉంది. అంతేకాదు చీమ‌కూడా న‌గ‌రంలో ప్ర‌వేశించ‌డానికి వీలులేకుండా రాక్ష‌సులు కాప‌లాకాస్తున్నారు. సూక్ష్మ‌రూపి అయి వాన‌ర రూపంలోనే లంక‌లో ప్ర‌వేశించి సీతామాత జాడ తెలుసుకోవాల‌నుకున్నాడు. చిన్న‌వాన‌రంగా లంక‌లో ప్ర‌వేశించ‌డానికి రాజ‌ద్వారం చేరుకున్నాడు. ఇంత‌లో లంకిణి అనే రాక్ష‌సి ఎదురుగా నిలిచి వ‌నాల‌లో తిరిగే నీకు ఇక్క‌డేం ప‌ని అని గ‌ద్దించింది. త‌న అనుమ‌తి లేకుండా లోప‌లికి ప్ర‌వేశించ‌డం కుద‌ర‌ద‌ని చెప్పింది. లోప‌ల ఉన్న వ‌నాల‌ను స‌ర‌స్సుల‌ను ప‌క్షుల‌ను చెట్ట‌ను ఆ న‌గ‌ర సౌంద‌ర్యాన్ని ఒక్క‌సారి వ‌చ్చేస్తాన‌న్నాడు. లంకిణి కుద‌ర‌ద‌న్న‌ది. నేను లంక‌ను కాప‌లా కాస్తుంటాను. న‌న్ను గెలిస్తే కాని నువ్వు లోప‌లికి అడుగు పెట్ట లేవు అంటూ హ‌నుమ‌ను ఒక్క దెబ్బ కొట్టింది. హ‌నుమ వెంట‌నే కుడిచేయి పైకిఎత్తి పిడికిలి బిగించాడు. కానీ కుడిచేతితో కొడితే లంకిణి చ‌నిపోతుంది. స్త్రీ క‌దా అని ఆలోచించి ఎడ‌మ చేతితో ఒక్క గుద్దు గుద్దాడు.ఆమె క‌ళ్లుతేలేసి కింద‌ప‌డింది. అప్పుడు లంకిణి, నాయ‌నా నువ్వు న‌న్ను గెలిచావు. ఒక వాన‌రుడు వ‌చ్చి న‌న్ను గెలిచిన నాడు రావ‌ణాసురిడి అంత్య‌కాలం స‌మీపించిన‌ట్టు అని బ్ర‌హ్మ‌గారు నాకు  చెప్పారు. ఇప్పుడు లంకా న‌గ‌రం భ‌విష్య‌త్తు, రాక్ష‌సుల భ‌విష్య‌త్తునాకు అర్ధ‌మై పోయింది. ఇక ద్వారం తెరుస్తున్నాను.ద్వ‌రాంగుండానే వెళ్లు సీత‌మ్మ‌ను క‌నిపెట్టు అని చెప్పింది.కానీ హ‌నుమ రాజ‌ద్వారం గుండా ప్ర‌వేశించ‌కుండా ఎడ‌మ కాలులోప‌లికి పెట్టి ప్రాకారం మీదినుంచి లంకాన‌గ‌రంలోకి కిందికిదూకాడు. అప్ప‌టికే రాత్రి అయింది. చంద్రుడి వెలుగులో లంకానగరం మరింత శోభాయమానంగా క‌నిపిస్తున్న‌ది.


అంతఃపురంలో సీతాన్వేషణ

చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ .. అన్నిచోట్లా సీతను వెదకాడు. రాత్రి వేళ రావణుని మందిరంలో కాంతలు భోగ లాలసులై, చిత్ర విచిత్ర రీతులలో నిద్రిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను చూచి కలవరపడిన హనుమంతుడు, తాను రామ కార్యాచరణ నిమిత్తం ఏ విధమైన వికారాలకూ లోను గాకుండా సీతాన్వేషణ చేస్తున్నందున తనకు దోషం అంటదని, తన బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లదని సమాధానపడ్డాడు. పుష్పక నిమానం అందాన్ని, రావణుని ఐశ్వర్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ తెలియ‌క చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి ఇష్టప‌డ‌ లేదు. తన కార్యం విఫలమైతే సుగ్రీవుడు, రామ లక్ష్మణులు, మరెందరో హతాశులౌతారని బాధ‌ప‌డ్డాడు. ప్రాణ‌త్యాగం చేసుకుందామ‌ని కూడా ఆలోచించాడు. సీత కనుపించకుండా తాను వెనుకకు వెళ్ళేది లేదని నిశ్చయంచుకొన్నాడు. ఆ సమయంలో అశోక వనం కనిపించింది.


నమోస్తు రామాయ సలక్ష్మణాయ,

 దేవ్యైచ తస్యై జనకాత్మజాయై, 

నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, 

నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని ప్రార్థించాడు.

 దేవతలు, మహర్షులు తనకు కార్య సాఫల్యత కూర్చవలెనని కోరాడు. బ్రహ్మ, అగ్ని, వాయుదేవుడు, ఇంద్రుడు, వరుణుడు, సూర్యచంద్రులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, శివుడు, సకల భూతములు, శ్రీమహావిష్ణువు తనకు కార్యసిద్ధి కలిగించాల‌ని ప్రార్థించి సీతాన్వేషణకు చివ‌రి ప్ర‌య‌త్నంగా అశోకవనంలో అడుగుపెట్టాడు.


అశోకవనంలో సీతమ్మ దర్శనం



అశోకవనం అనన్య సుందరమైనది. అందులో చక్కని వృక్షాలు, పూలు, చిత్ర విచిత్రములైన కృతక పర్వతాలు, జలధారలు ఉన్నాయి. అక్క‌డ‌ అతి మనోహరమైన ఒక శింశుపా వృక్షాన్ని ఎక్కి హనుమంతుడు చుట్టుప్రక్కల పరిశీలింపసాగాడు.


అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన ఒక స్త్రీని చూశాడు..  ఆమె ధరించిన ఆభరణాలు, ఆమె తీరు, ఉన్న స్థితిని బట్టి హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు. ఆమె దీనావస్థను, రామలక్ష్మణాదుల దుఃఖమును తలచుకొని, కాలం ఎంతటివారికైనా అతిక్రమింపరాని బలీయమైనది అనుకొని, హనుమంతుడు దుఃఖించాడు.


*త్రిజటాస్వప్నం*

అశోక‌వ‌నానికి రావ‌ణుడు వ‌చ్చాడు. సీతమ్మ‌ను బెదరించి, తనకు వశంకావాల‌ని ఆదేశించాడు. సీత ఒక గడ్డిపరకను అడ్డంగా పెట్టుకొని, రావణుని ధర్మహీనతను, భీరత్వాన్ని నిందించింది. పోగాలము దాపురించినందువల్లనే ఈ నీచ సంకల్పం కలిగిందని హెచ్చరించింది. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మం కావ‌డం తథ్యమని రావణుడికి గట్టిగా చెప్పింది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలని ప్రయత్నించ సాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదరించారు. భయ విహ్వలయై, ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకొన్నది.


వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, సీతవంటి పుణ్యస్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన క‌ల గురించి ఇలా  చెప్పింది 

"వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత కూర్చుని ఉంది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపైభాగాన నిలిచింది. ఎనిమిది వృషభములు పూన్చిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో, సీతా లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత, వారంతా పుష్పకం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళారు.ఇంకో వైపు, "ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి, పుష్పకంనుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూన్చిన రధంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుతున్న‌ట్టుంది. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఒంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో, దివ్యాభరణాలతో, తెల్లని గజం అధిరోహించి, మంత్రులతో కూడి ఆకాశంలో ఉన్నాడు. లంకా నగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలం త్రాగుతూ, పిచ్చివారివలె లంకలో గంతులు వేస్తున్నారు.....ఇలాంటి దృశ్యాన్ని నేను క‌ల‌లో చూశాను అని త్రిజట చెప్పింద‌. ఇది లంక‌కు రాబోయే చేటుకాలాన్ని సూచిస్తున్న‌ద‌ని హెచ్చ‌రించింది.

ఇలా చెప్పి త్రిజట తమను ఆపదనుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని తక్కిన రాక్షస కాంతలకు హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. ఆత్మహత్యకు సిద్ధపడిన సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.

త్రిజ‌ట త‌న స్వ‌ప్న వృత్తాంతాన్ని వివ‌రించ‌డం హ‌నుమ చెట్టుపై నుంచి విన్నాడు.ఇక ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌నుకున్నాడు. అయితే ఒక్క‌సారిగా ఆమెకు క నిపిస్తే కంగారుప‌డుతుంద‌ని, కేక‌లు వేస్తే కాగ‌ల కార్యం చెడిపోతుంద‌ని గ్ర‌హించాడు. నెమ్మ‌దిగా రామ‌క‌థా గానం చెట్టుపైనుంచే ప్రారంభించాడు.

    

ఆ రాముడు సీతను వెదకడానికి పంపిన దూతలలో ఒకడైన తాను ప్రస్తుతం లంకను చేరి, చెట్టుపైనుండి, సీతను చూచానని ఆ కథాక్రమంలో తెలియజేశాడు. ఆ రామకథా శ్రవణంతో సీత కొంత ఆనందించింది. కానీ తాను కలగంటున్నానేమోనని భ్రమ పడింది. తల పైకెత్తి, మెరుపు తీగవలె, అశోక పుష్పము వలె ప్రకాశిస్తున్న వానరుని చూచి కలవరపడింది. తాను విన్న విషయాలు సత్యాలు కావాలని బ్రహ్మకు, మహేంద్రునికి, బృహస్పతికి, అగ్నికి నమస్కరించింది. హనుమంతుడు మెల్లగా చెట్టు దిగివచ్చి ఆమెకు శుభం పలికాడు. సీతకు తన వృత్తాంతాన్ని, రాముని దుఃఖమునూ వివరించాడు. శ్రీరాముని పరాక్రమాన్నీ, గుణగణాలనూ ప్రశంసించి ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునయ వచనాలు పలికాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.

 

హనుమంతుడు భక్తితో అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించాడు. "రాముడు ఆజానుబాహుడు. కమల పత్రాక్షుడు. రూప దాక్షిణ్య సంపన్నుడు. శుభలక్షణములు గలవాడు, తేజోమూర్తి, ధర్మ రక్షకుడు, సర్వ విద్యాపారంగతుడు, లోకమర్యాదలను పాటించువాడు. సమ విభక్తములైన శరీరాంగములు కలవాడు. దీర్ఘములైన బాహువులు, శంఖమువంటి కంఠము కలవాడు.  ఉత్తముడు, వీరుడు. నల్లనివాడు. అతని తమ్ముడు లక్ష్మణుడు అట్టి శుభలక్షణములే కలిగి, ఎర్రని మేని ఛాయ గలవాడు - అట్టి రామలక్ష్మణులు నీ కోసం దుఃఖిస్తున్నారు త‌ల్లీ . సుగ్రీవునితో చెలిమి జేసి, నిన్ను వెదక‌టానికి నలువైపులా వానరులను పంపారు. ఓ సీతా దేవీ! త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇక్క‌డినుండి తీసుకువెళ‌తాడు, మ‌న‌స్సు దిట‌వుచేసుకుని ఉండు" - అని హనుమంతుడు చెప్పాడు.


*హనుమంతుడికి* 

*చూడామణి ఇచ్చిన  సీత* :

శ్రీరాముని గురించి విని, సీత ఊరడిల్లింది. తరువాత హనుమంతుడు ఆమెకు శ్రీరాముని ఆనవాలైన అంగుళీయకమును ఇచ్చాడు. రాముడు చెప్పిన మాటలు తెలియజేశాడు. ఆమెకు శుభం పలికాడు. తనతో వస్తే ఆమెను తీసికొని వెళ్ళగలనని అన్నాడు. సీత హనుమంతుని పలుకులకు సంతోషించి అతని పరాక్రమాన్ని ప్రశంసించింది. కాని స్వయంగా శ్రీరాముడే వచ్చి, రావణుని పరిమార్చి, తనను తీసికొని వెళ్ళాలని చెప్పింది. రాముని పరాక్రమానికి ముల్లోకాలలోను ఎదురు లేదని తెలిపింది. రామలక్ష్మణులకు, సుగ్రీవునకు, భల్లూక వానరులకు ధర్మక్రమ మనుసరించి కుశలం అడిగినట్లు తెలుపమని పలికింది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. ఒక్క నెలలో రాముడు తనను కాపాడకుంటే తాను బ్రతుకనని చెప్పింది. ఆ మ‌హాస‌ముద్రాన్ని దాటడం హనుమంతుడు, వాయుదేవుడు, గరుత్మంతుడు తప్పఇతరులకు ఎలా శక్యమని సంశయించింది.


అందుకు హనుమంతుడు తనకంటే గొప్పవారైన మహావీరులు వానరులలో ఎందరో ఉన్నారని, తాను సామాన్యుడను గనుకనే ముందుగా తనను దూత కార్యానికి -యుద్ధానికి కాదు,పంపారని ఆమెకు నచ్చచెప్పాడు. మహావీరులైన రామలక్ష్మణులు కపి భల్లూక సేనా సమేతంగా, త్వరలో లంకకు వచ్చి లంకను వాశనం చేసి రావణ సంహారం సాగించడం తథ్యమని ఆమ‌కు న‌చ్చ చెప్పాడు. హనుమంతుని సీతమ్మ ఆశీర్వదించింది.


యత్ర యత్ర రఘునాథ కీర్తనం

తత్ర తత్ర కృత మస్తకాంజలిం|

బాష్ప‌వారి పరిపూర్ణ లోచనం

మారుతిం నమత రాక్షసాంతకం||


          **

బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా|

అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్||

( ఎవరైతే హనుమంతున్ని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరుప్రఖ్యాతులు, ఙ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందగలుగుతారు.)

   ***

     (సుంద‌ర‌కాండ‌- సీతాద‌ర్శ‌న‌ఘ‌ట్టం స‌మాప్తం)



----------

ఇతిహాసాలు

 *📖 మన ఇతిహాసాలు 📓*


*సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఆలయాలే లేవెందుకు? త్రిమూర్తుల్లోకెల్లా చిన్నవాడయిన బ్రహ్మ ఎప్పుడూ వృద్ధుడుగానే ఉంటాడెందుకు?*


పద్మపురాణం ప్రకారం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామరపూవునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజుని సంహరించాడట సృష్టికర్త. ఆ సందర్భంగా పూవునుంచి రేకులు మూడుచోట్ల రాలి మూడు సరస్సులు ఏర్పడ్డాయట. వాటినే జ్యేష్ట పుష్కర్‌, మధ్య పుష్కర్‌, కనిష్ట పుష్కర్‌ అని పిలుస్తున్నారు. పైగా బ్రహ్మ భూమ్మీదకి వచ్చి తన చేతి(కరం)లోని పుష్పం నుంచి రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్‌ అని పేరు పెట్టాడట. ఆ తరవాత లోకకల్యాణం కోసం అక్కడే యజ్ఞం చేయాలనీ సంకల్పించాడట. ఎలాంటి ఆటంకాలూ లేకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు రాక్షసులు దాడి చేయకుండా సరస్సుకి దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంచూరా, తూర్పున సూర్యగిరి అనే కొండల్ని సృష్టించి దేవతలందరినీ ఆహ్వానించాడు. సుమూహుర్తం ఆసన్నమయింది. ఆహూతులంతా విచ్చేశారు. సావిత్రీదేవి(ఈమెనే సరస్వతి అని పిలుస్తారు)ని తీసుకుని రమ్మని కుమారుడైన నారదుడిని పంపిస్తాడు బ్రహ్మ.


నారదుడు వెళ్లేసరికి ఆమె రావడానికి సిద్ధంగానే ఉంది. కానీ కలహభోజనుడు వూరికే ఉంటాడా... 'నువ్వు ఒక్కదానివే అప్పుడే వచ్చి ఏం చేస్తావు. నీ స్నేహితులతో కలిసిరమ్మ'ని సలహా ఇస్తాడు. దాంతో తన సహచరులైన లక్ష్మీ, పార్వతిలతో కలిసి వద్దామని ఆగిపోతుంది సావిత్రి. యజ్ఞవాటిక దగ్గర మూహూర్తం మించిపోతోంది. సావిత్రీదేవి జాడ లేదు. దేవతలు, రుషులు అంతా సిద్ధంగా ఉన్నారు. అనుకున్న మూహూర్తానికే యజ్ఞం జరగాలన్న తలంపుతో బ్రహ్మదేవుడు ఇంద్రుడితో 'వెంటనే ఓ అమ్మాయిని చూడు. వివాహం చేసుకుని యజ్ఞం నిర్వహిస్తాను' అనడంతో సమీపంలోని గుజ్జర్ల కుటుంబానికి చెందిన పాలమ్ముకునే ఓ అమ్మాయిని తీసుకొస్తాడు ఇంద్రుడు. శివుడు, శ్రీమహావిష్ణువు సలహాల ప్రకారం గోవులోకి పంపించడం ద్వారా ఆమెను శుద్ధి చేస్తారు. ఇలా చేస్తే ఆమె పునర్జన్మ ఎత్తినట్లేనని చెప్పి అభ్యంగన స్నానం

చేయించి సర్వాభరణశోభితురాలిని చేస్తారు. గోవుతో శుద్ధిచేయబడినది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభిస్తారు. పూర్తవుతున్న సమయంలో అక్కడకు వచ్చిన సావిత్రీదేవి బ్రహ్మదేవుడికి పక్కన మరో స్త్రీ ఉండటం చూసి ఉగ్రరూపం దాలుస్తుంది. బ్రహ్మదేవుడితోసహా అక్కడున్న వారందరినీ శపిస్తుంది. భర్తని వృద్ధుడై పొమ్మనీ ఆయనకు ఒక్క పుష్కర్‌లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవనీ శపిస్తుంది. అన్ని యుద్ధాల్లోనూ ఓటమి తప్పదని ఇంద్రుడినీ, మానవజన్మ ఎత్తి భార్యావియోగంతో బాధపడతావని విష్ణుమూర్తినీ, శ్మశానంలో భూతప్రేతగణాలతో జీవించమని ఈశ్వరుణ్ణీ, దారిద్య్రంతో ఇల్లిల్లూ తిరిగి భిక్షాటన చేసుకొమ్మని బ్రాహ్మణులనీ ధనమంతా దొంగలపాలయి నిరుపేదగా మారమని కుబేరుణ్ణీ శపిస్తుందట. తరవాత ఆమె రత్నగిరి పర్వతాల్లోకి వెళ్లి తపస్సమాధిలోకి వెళ్లిపోయిందనీ ఆపై నదిగా మారిందనీ చెబుతుంటారు.


దీన్ని సూచిస్తూ రత్నగిరి కొండమీద సావిత్రీమాత ఆలయంతోపాటు ఓ చిన్న నీటిప్రవాహం కూడా ఉంది. దీన్ని సావిత్రీనది అని పిలుస్తారు స్థానికులు. ఆమెను పూజించిన స్త్రీలకు నిత్యసుమంగళి వరాన్ని ప్రసాదిస్తుందన్న నమ్మకంతో పుష్కర్‌ను సందర్శించిన భక్తులంతా ఆమె ఆలయాన్ని కూడా తప్పక దర్శిస్తారు.


సావిత్రీదేవి వెళ్లిన తరవాత బ్రాహ్మణులను యజ్ఞం పూర్తిచేయమని కోరతాడు బ్రహ్మదేవుడు. అందుకు వారంతా తమకు శాపవిముక్తి చేయమనీ ఆ తరవాతే యజ్ఞక్రతువు చేస్తామనీ అంటారట. అప్పటికే యజ్ఞఫలంతో సిద్ధించిన శక్తులతో గాయత్రీదేవి పుష్కర్‌ ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతుందనీ ఇంద్రుడు మళ్లీ స్వర్గాన్ని గెలుచుకుంటాడనీ విష్ణుమూర్తి రాముడిగా జన్మిస్తాడనీ బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని అందుకుంటారంటూ శాపతీవ్రతని తగ్గిస్తుందట. బ్రహ్మదేవాలయం పుష్కర్‌లో మాత్రమే ఉండటానికి ఇదే కారణమట. అయితే బ్రహ్మదేవాలయాలు అత్యంత అరుదుగానయినా అక్కడక్కడా లేకపోలేదు.


*chandrasekharrallabhandhiastrloger🎣*