6, మార్చి 2023, సోమవారం

అనుగ్రహాన్ని

 వారి అనుగ్రహాన్ని ఈ పేదగుండె భరించలేక పోయింది పార్ట్ 1


అది 1966, జూన్ ఒకటి. వారం రోజుల పాటు జరిగిన ఏథెన్స్ సమ్మేళనంలో నాలుగోరోజు.


అద్భుతమైన పడమటి సంధ్యారాగ నేపథ్యంలో ఫ్రేముకట్టినట్లున్న ఫింక్స్ పర్వతం. దానికెదురుగా తూర్పున అక్రోపోలిస్. దాని శిఖరాన కిరీటంలా సుప్రసిద్ధ పార్ధినన్ దేవాలయం. అందులో ఎథీనా.


ఎథీనా జ్ఞానదేవత. శాంతిప్రదాత్రి. పూర్వం ఈ కొండమీదే 'ఎక్లీషియా' జరిగేది. ఎక్లీషియా అంటే ఏథెన్స్ నగరవాసుల సభ. ఇక్కడే ఏథెన్స్ పౌరులనుద్దేశించి వారి ప్రతినిధులు మాట్లాడేవారు. 


ఏథెన్స్ సమ్మేళనానికి ఇంతకన్నా మనోజ్ఞమైన ప్రదేశం 'పార్థివ జాతీయ సంస్థ'కు దొరకదు. 


పార్థివ జాతీయ సంస్థను స్థాపించినవారు హెల్లెన్సేకు చెందిన 'పాల్' ప్రభువు. ప్రతి రెండేళ్ళకొకసారి గ్రీస్ దేశపు ముఖ్యపట్టణంలో ఒక అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించటం, పార్థివ జాతీయ సంస్థ చేపట్టిన ముఖ్యకార్యాల్లో ఒకటి. ఆ సమ్మేళనానికి 'ఏథెన్స్ సమ్మేళన'మని పేరు.


ఆ సమ్మేళనంలో మానవజాతి యింతవరకు సాధించిన పరిజ్ఞానాన్నీ, పొందిన అనుభవాలను దృష్టిలో వుంచుకొని ప్రసిద్ధులైన మేధావులు మానవుల ఆదర్శాలను, ఆకాంక్షలనూ ప్రవచించే అవకాశం కలుగుతుంది.


విచ్చేసిన ప్రతి విద్వాంసుడూ తనకిష్టమైన విషయం మీద ఏదో ఒక సాయంకాలం, ఆ సాంస్కృతికోత్సవాల్లో ఆరుబయట, ఫింక్స్ శిఖరం నుండి ప్రసంగించటం ఆనవాయితీ.


ప్రాసంగికులైన ఏడుగురు విద్వాంసుల్లో ఆరుగురిని విదేశాల నుండి ఆహ్వానించాలని పాల్ ప్రభువొక నియమం పెట్టిపోయారు. అలా వారు నియమం పెట్టడానికి కారణం ప్రాచీన గ్రీక్ తాత్వికుడైన "ఐసోక్రేట్స్". “మన సంస్కృతిలో పాలుపంచుకునే వారెవరైనా మనవారే. మన హెల్లెన్సె” అని ఆ తాత్త్వికుడొకపుడు ప్రవచించారు.


ఏథెన్స్ సమ్మేళనం మొట్టమొదట 1964లో జరిగింది. సమ్మేళనం జరగటానికి ముందే పాల్ చక్రవర్తి పరమపదించారు. వారి పుత్రులు కాన్ స్టెంటిన్ ప్రభువు ఆవారం రోజులూ అంతటా తానే అయి, అమితోత్సాహంతో ఉత్సవాలు నిర్వహించారు. ఆ ఉత్సవాలు విజయవంతం కావటం చూచి 1966లో పార్థివజాతీయ సంస్థవారు రెండవ ఏథెన్స్ సమ్మేళనాన్ని నిర్వహించే బాధ్యత తీసుకున్నారు.


అక్రోపోలిస్ పర్వతం మీద ఎథీనా దేవాలయంలో మే 29వ నాడు సమ్మేళనాన్ని ప్రభువులవారే స్వయంగా ప్రారంభించారు. ఆ తరువాత ఆరు రోజుల సమ్మేళనమూ ఫింక్స్ పర్వతం మీద జరిగింది. సమ్మేళనపు నాల్గవ నాడు అంటే, జూన్ ఒకటో తేదీన - నా వంతు వచ్చింది. “భారతీయవారసత్వం” అనేది నా ఉపన్యాస విషయం. నా ఉపన్యాసాన్ని ముగించే ముందు ఈమాటలన్నారు. 


"ప్రస్తుతం విజ్ఞానశాస్త్రమూ, టెక్నాలజీ సాధించిన పురోగతి దృష్ట్యా, భారతీయ వారసత్వం భవిష్యకాలంలో ఏమౌతుందోననే సందేహం, నా దేశంలోని ఆలోచనాపరులనే కాదు, విదేశీయులైన మేధావులను సైతం కలవరపరుస్తున్నది. భారతదేశాన్ని చూడటం కోసం యుగోస్లోవియా నుండి వచ్చిన విద్వాంసులొకరు కంచి కామకోటి పీఠాధిపతులైన శంకరాచార్య స్వామివారి దగ్గర ఈ సందేహం వెలిబుచ్చారు. సనాతన భారతీయ యతిజీవితాన్ని తూచా తప్పకుండా గడుపుతున్న ఆ ఋషి వెంటనే యిలా అన్నారు.


“భారతీయమైన ఆత్మకు చలనం లేదు. ఏమైనా చేస్తే ఆధునిక విజ్ఞానంగానీ, సాంకేతిక పరిజ్ఞానంగానీ అర్థం లేని పాత విశ్వాసాలనూ, గ్రుడ్డినమ్మకాలనూ పోగొట్టగలవేమో. అది మంచిపనే. భారతీయ సంస్కృతి యెన్ని సవాళ్ళనో ఎదుర్కొంది. ఎన్ని ఆఘాతాలనో తట్టుకుంది. అది నేటికీ చెక్కుచెదరలేదు. దానికి చావులేదు”.


శంకరాచార్యుల ప్రవచనంకన్నా దాని అమరత్వానికి మరొక నిదర్శనం అక్కరలేదు. భారతీయ వారసత్వం కేవలం భారతీయులది మాత్రం కాదు. ప్రపంచ జనులందరిదీను. 


నేను కంచి శంకరాచార్యులవారిని గురించి ప్రస్తావించిన సభలో గ్రీకు రాజ్ఞీమాత మాన్యశ్రీ ఫ్రెడరికా వారి తనయ మాన్యశ్రీ ప్రిన్సెస్ ఐరీన్ ఆసీనులైపున్నారు. వారు కొంత కాలంగా ధ్యానసాధన చేస్తున్నారు. వారికి భగవాన్ రమణముని బోధల మూలాన అద్వైతవేదాంతంతో పరిచయం కలిగింది. మృతులైన పాల చక్రవర్తితో బాటు వారిరువురూ భారతదేశంలో అధికారికంగా పర్యటించారు కూడా. కానీ పర్యటనలో భారతీయమైన అధ్యాత్మిక స్వరూపాన్ని అవగాహన చేసుకునే అవకాశంగానీ, తీరికగానీ వారికి లేకపోయాయి.


గ్రీస్ మహారాజ్జి, వారి పుత్రిక ఈసారి భారతదేశం వచ్చినప్పుడు కంచి కామకోటి పీఠాధిపతులను దర్శించాలని కోరికగా వుందని నాతో అన్నారు. వారి కోరిక ప్రకారం 1966, నవంబరు, డిసెంబరు మాసాల్లో భారతదేశానికి వచ్చి కంచి స్వామివారు కలుసుకున్నారు. వారి సమావేశం కాళహస్తిలో 1966, డిసెంబరు నాలుగు, ఐదు తేదీల్లో జరిగింది.


రాజ్ఞి ఫ్రెడరికా, రాకుమారి ఐరీన్ ఇంతటి సుదీర్ఘ ప్రయాణం చేయటం అలసట అనుకోలేదు. వారిరువురూ సత్యాన్వేషకులుగా భారతదేశానికి వచ్చారు. వచ్చినందుకు వారి శ్రమ వృథా కాలేదు. వారికీ, శంకరాచార్యులవారికీ జరిగిన సంభాషణ సంగ్రహం ఇదీ 


ప్రశ్న : స్వామీ, జాగ్రదవస్థలో నా ధ్యానం చాలావరకు క్రమబద్ధంగా సాగుతుంది. కాని స్వాప్నిక స్థితిలో ధ్యాననిష్ఠ నిలవటం లేదు. ఆ స్థితిలోనూ నిలవాలంటే యేం చెయ్యాలి? 


సమాధానం : వచ్చే స్వప్నాలెలాటివైనాసరే, ఆందోళన పడకండి. మేలుకున్న వేళల్లో ధ్యానమగ్నులై వున్నవారు నిద్రపోయాక కూడా ధ్యానమగ్నతలోనే వుండటం సాధ్యం కాకపోవచ్చు. నిద్రావస్థలో వచ్చే స్వప్నాలు ప్రాపంచికమైనవి కూడా కావచ్చు. అంతమాత్రంచేత అన్వేషకులు నిరుత్సాహపడరాదు. అలా నిరుత్సాహపడటం తమ అన్వేషణకు అంతరాయం అని గ్రహించాలి. 


జాగ్రదవస్థను స్వప్నాలు మలినపరచలేవు. కాని స్వాప్నిక స్థితిని జాగ్రదవస్థ మలినపరచగలదు. 


తెల్లవాడికి వచ్చే కలల్లో అతడు తెల్లవాడుగానే వుంటాడు. అలాగే నల్లవాడికి వచ్చే కలల్లో అతడు నల్లవాడుగానే వుంటాడు. జాగ్రదవస్థలో కలిగే అనుభవాలే కొంతవింతగా, అబ్బురంగా స్వప్నావస్థలోనూ కలుగుతాయి. అన్వేషకులు జాగ్రదవస్థలు ఆత్మ విచారం చేస్తూవుంటే, స్వప్నావస్థలోనూ ఆ చింతనమే కొంతవరకు ప్రతిబింబిస్తుంది. మేలుకుని వున్నప్పుడు తీవ్రమైన ఉద్రేకాలకు లోనుగాకుండా మనస్సును అదుపులో వుంచుకుంటే నిద్రలో కూడా మనస్సు నిశ్చలంగా వుంటుంది. 


ప్రశ్న : మనస్సును ఏకాగ్రంగా వుంచుకోవటానికి, స్థితప్రజ్ఞంగా నిలుపుకోటానికి ఉపకరించే ప్రక్రియ ఏదైనా వుంటే స్వామివారు సెలవివ్వాలి.


సమాధానం : సాధారణంగా ప్రతివారూ తమ ముక్కుపుటాల్లో ఒకదానితోనే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలు జరుపుతారు. ఒకవైపు జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలు రెండో వైపునకు మార్చటం కొంచెం శ్రమ. గాలిపీల్చి వదలటం కుడివైపున్న ముక్కురంధ్రం ద్వారా జరుగుతున్నదనుకోండి. దాన్ని ఎడమవైపునకు మార్చాలంటే కుడివైపు ఒత్తిడి తేవాలి. అంటే కుడిచేతి మీద ఒరిగి కూర్చోవాలి. కుడివైపునుండి ఎడమవైపునకు మార్చాలన్నా ఎడమవైపు ఒరిగి కూర్చోవాలి. ఈ మార్పు జరిగేటప్పుడు ఓ రెండు క్షణాలు రెండు రంధ్రాలు పనిచేస్తాయి. ఆ రెండు క్షణాల్లో “సమంగా” ఊపిరి పీల్చి వదులుతాయి. సాధన చేసినకొలదీ ఈ సమోచ్ఛ్వాస నిశ్శ్వాస స్థితి పెరుగుతుంది. అది పెరిగి పెరిగి మన స్వభావాన్నే మారుస్తుంది. క్రమంగా ఏకాగ్రత అలవడుతుంది. స్థితప్రజ్ఞత సిద్ధిస్తుంది.వారి అనుగ్రహాన్ని ఈ పేదగుండె భరించలేక పోయింది పార్ట్ 2


ప్రశ్న : పరిసరాలు అనుకూలించనప్పుడు, మన జీవన విధానాన్ని ద్వేషించే వారే చుట్టూ చేరినప్పుడు, ఎటుచూచినా దుర్మార్గం, దౌర్జన్యం మాత్రమే కనబడుతున్నప్పుడు మనిషిగా ఏం చెయ్యాలి? 


సమాధానం : ద్రోహబుద్ధి కలవారూ, దుష్టులూ, దుర్మార్గులూ చుట్టూ వున్నంత మాత్రాన మనం సహనాన్ని కోల్పోరాదు. వారిని ద్వేషించరాదు. పెగా వారిని సానుభూతితో, దయతో చూడాలి. ఎవరూ పుట్టుకతో దుర్మార్గులు కారు. పరిస్థితుల వల్లా, పెంపకంవల్లా దుర్మార్తులుగా మారుతారు. అలా మారినవారిని ద్వేషించటం న్యాయమా చెప్పండి. అందువల్ల సాధకుడెవరినీ ద్వేషించరాదు. తనలో తాను ఇలా వితర్కించుకోవాలి. 


“పుట్టుకతో దుర్మార్గులెవరూ లేరు. పరిస్థితులవల్ల వారు దుర్మార్గులుగా మారారు. వారిని చూచి జాలిపడాలేగాని ద్వేషించడం తప్పు. నాకు ప్రియమైనవాడే, నాకొడుకే దుర్మార్గుడుగా మారితే నేనేం చేస్తాను? వాణ్ణి ద్వేషిస్తానా? వదులుకుంటానా? దగ్గరకు తీసి అనురాగంలో ముంచెత్తి వాణ్ణి క్రమంగా దారికి తెచ్చుకుంటాను. మంచివాడుగా మార్చుకుంటాను. 


"పరాయివాణ్ణయినా అంతే. సత్యాన్వేషకునికి నిజానికి పరాయి వారంటూ లేరు. అందరూ ఒకేరక్తం పంచుకు పుట్టినవారే. పరిస్థితులవల్లా, పెంపకంవల్లా నేనే దుర్మార్గుడుగా మారితే నాగతేమిటి? అందువల్ల ప్రతి దుర్మార్గుడిలో నన్నే చూచుకుంటాను. నా ఆత్మనే దర్శిస్తాను. అతణ్ణి ఎప్పుడూ ద్వేషించను”. 


ప్రశ్న : సవికల్ప సమాధి స్థితికీ, నిర్వికల్ప సమాధి స్థితికి వున్న భేదం ఏమిటి? సహజ సమాధి అంటారే, అదెలావుంటుంది? 


సమాధానం : ధ్యానమార్గంలో, ఏకాగ్రపథంలో సవికల్పమూ, నిర్వికల్పమూ అనేవి రెండుదశలు. సవికల్పసమాధిలో మనస్సు నిశ్చలంగా వుంటుంది, చెదరదు. ఒక విషయంమీద ఏకాగ్రమై నిలుస్తుంది. అందులో లీనమౌతుంది.


నిర్వికల్పసమాధిలో మనస్సు పనిచేయటం మానుతుంది. అదృశ్యమైపోతుంది. అప్పుడు ఆత్మ ఒక్కటే ప్రకాశిస్తుంది. యోగానికి లక్ష్యం నిర్వికల్ప సమాధే. 


అద్వైతంలో కూడా ధ్యానానికి అవసరముంది. కాని ధ్యానానికి గమ్యమైంది అద్వైతంలో అభేదబ్రహ్మం. 


ఇక సహజసమాధి అనేది బ్రహ్మ విచారంవల్ల కలుగుతుంది. అది ఆత్మ సాక్షాత్కార సహజస్థితి. క్షణక్షణం మారే అద్భుతాల కతీతమైన యోగదశ.


ప్రశ్న : సంప్రదాయాల విషయంలోనూ, ఆచార విషయంలోనూ నాయకుడైన వాడేం చేయాలి? అవి తనకు ఉపయోగపడవని తెలిసికూడా వాటినే పాటించక తప్పదా? 


సమాధానం: ఒక వర్గానికి, ఒక సమాజానికో, ఒక ప్రభుత్వానికి నాయకత్వం వహించేవాడు సాంప్రదాయికంగా వచ్చే మతాచారాలనూ, కర్మకాండనూ నిరాదరించకూడదు. అవి తన కవసరం కాదని తెలిసినా, వాటిని పాటించి తీరాలి. ఉదాహరణకు చర్చిలో జరిగే ఆచారకాండ తన ఆధ్యాత్మిక పురోగతికి అనావశ్యకమని యెరిగి కూడా మతాచార్యుడు దాన్ని అనుసరించాలి. 


అలా అనుసరించకపోతే ఆ ఆచారకాండవల్ల లాభపడే వారుకూడా దాన్ననుసరించరు. అది అనుసరించతగని ఒరవడిలాంటిది. 


“కర్మపరతంత్రులైన అజ్ఞానుల మనస్సును జ్ఞానులైన వారు కర్మమార్గం నుండి తొలగనివ్వరు. తామూ ఆ కర్మలనే కుశలబుద్దితో చేస్తూ వారికీ మార్గదర్శకంగా వుంటారు” అని భగవద్గీతలో వుంది. నాయకులూ, ఉన్నతులూ అయినవారు ప్రజలే స్థితిలో వుంటే ఆస్థితినుండే వారిని ముందుకు నడిపించాలి. అంతేగాని సంప్రదాయంగా వస్తున్న పూజా విధానాలను మానకూడదు.


స్వామివారు తమకు దర్శన మనుగ్రహించటం ఒక భాగ్యంగా భావించి వారితో జరిపిన సంభాషణ తమ హృదయం మీద ఎంతటి చెరగని ముద్ర వేసిందో ఉగ్గడిస్తూ మహారాణి యిలా అన్నారు.


"స్వామి చరణసన్నిధిలో గడిపిన యీరెండు రోజులూ మరిచిపోలేము. ఈ రెండు రోజులూ స్వచ్ఛమైన ఆధ్యాత్మికత్వంలో జీవించాము. ఏ అదృశ్యశక్తో మమ్ము వారి చెంతకు చేర్చింది”. 


ఈ అనుభవాలే విపులీకరిస్తూ, ఆ మహనీయునితో తమ సమావేశాన్ని నెమరువేసుకుంటూ మహారాణివారింకా యిలా అన్నారు.


"కొంతకాలంగా అడగటానికి వివరణలే తప్ప కొత్త ప్రశ్నలేవీ లేని స్థితికి చేరుకున్నయను. అయినా నాకు ఆత్మానుసంధానం అస్థిరంగానే వుంది. సాధన చేసేకొలది అది సిరపడవచ్చు. అప్పుడు ఏ సమస్యావుండదు. దేనికైనా కాలం రావాలి. అప్పుడు అదృష్టం కూడా కలసివస్తుంది. అదృష్టం కాకపోతే అంతటి సర్వోత్తముని సందర్శించే భాగ్యం మాకెలా కలుగుతుంది చెప్పండి! విచలించి పోకుండా వారి అనుగ్రహాన్ని మనసులోనే యిమిడించుకోవటం సాధ్యం కాకుండా వుంది.


ఆధ్యాత్మికాన్వేషకులు అంతరంగంలో పొందే అతిలోకమైన అనుభవాన్నే వ్యోమగాములు బహిరంగంగా పొందుతారని స్వామివారన్నారు. వారి సాన్నిధ్యంలో మాకు అతిలోకమైన బహిరంతరానుభూతి కలిగింది. మేము ధన్యులం. ఆధిభౌతికానికి ఆధ్యాత్మికానికి వారు విస్పష్టమైన అనుబంధం. అన్వేషకులకు ఆధిభౌతికమూ ఆధ్యాత్మికమూ వేరు కావు. వేరుకావనటానికి స్వామివారే రుజువు. దుర్బలమైన శరీరంలో వారు అతిథి. బక్కచిక్కిన వారి శరీరం కంటికి కనబడుతూనే వుంది. ఏ బ్రహ్మపదార్థంతో ఆ అతిథికి అభేదం ఉందో బ్రహ్మపదార్థమూ ఆ దేహంగా దృశ్యమాన మవుతున్నది. దీనివల్ల భౌతికమూ, ఆధ్యాత్మికమూ వేరుకావని స్వామివారే నిరూపించటం లేదా!? ఆ తేజస్సులోని అందం మన గ్రుడ్డికళ్ల కెలా తెలుస్తుంది!?


“వారి అనుగ్రహాన్ని ఈ పేదగుండె భరించలేక పోయింది. సంతత ధారాపాతంగా కన్నీరు కారింది. అది సామాన్యమైన కన్నీరు కాదు. తీరిన కోరికల కన్నీరు. తృప్తి, ఆనందం కార్చిన కన్నీరు. మనస్సును కడిగి శుభ్రపరచిన కన్నీరు. మనస్సును కరిగించిన కన్నీరు. వారు ప్రతీకగా నిలచిన పరమసత్యంతో మనస్సును ఏకం చేసిన కన్నీరు..”


సరిగ్గా రెండేళ్ళకు రాణి, రాకుమారి మళ్లీ స్వామివారిని దర్శించటం కోసం భారతదేశం వచ్చారు. ఈసారి మేనకోడలు డోరోథీ, మేనల్లుడు కార్ల్ కూడా వారి వెంట వున్నారు. స్వామివారు మచిలీపట్నంలో వుండగా 1968, డిసెంబరు 6, 7, 8 తేదీల్లో వారితో సమావేశాలు జరిగాయి. అతిథులు మొత్తం ఎనిమిది గంటలకు పైగానే స్వామివారితో సంభాషించారు. సంభాషించినంత సేపూ స్వామివారి వివేకంలో, అనుభూతిలో ఓలలాడారు. స్వామివారి ఆధ్యాత్మిక దీప్తిలో మునిగితేలారు. మూడవతేదీన వారు మద్రాసులో కాలుమోపినప్పటినుండి, మచిలీపట్నంలో మూడు రోజులు గడిపి పదకొండవ తేదీ మద్రాసు నుండి బాంబే మీదుగా యూరప్ చేరేవరకూ వారి మనస్సులో ఒకే ఒక ఆలోచన - స్వామి వారిని గురించి.


స్వామివారిని సందర్శించటం జీవితంలో తమకు భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన వరం అనుకున్నారు వారు. వారికి స్వామి అనుగ్రహం కోకొల్లలుగా లభించిన మాట కూడా వాస్తవమే!


వారు స్వామివారితో వేరువేరుగానూ సంభాషించారు, అందరూ కలసి సంభాషించారు. వారడిగిన ప్రశ్నల్లో వారికున్న గాఢమైన చిత్తశుద్ధి, నిశితమైన పారమార్థికాన్వేషణా కనబడేవి. ఇక స్వామివారి సమాధానాల్లో ఎంతో విస్పష్టమైన ఆదేశం వుండేది. ఎంతో సులభమనోజ్ఞమైన వివరణం వుండేది. అంతరమైన అన్వేషణ సుగమం కావటానికి స్వామివారి మాటలు ఎంతగానో తోడ్పడతాయి. అసలు ఆ సంభాషణలు వినటమే ఓ అద్భుతమైన అనుభవం అనిపించింది నాకు.


(సశేషం)


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం


(సశేషం)


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: