13, అక్టోబర్ 2023, శుక్రవారం

రామాయణమ్ 353

 రామాయణమ్ 353

...

ఓ రామా ! ఈతడు రావణుడు పంపిన గూఢచారి కావచ్చును కావున నలుగురు సహచరులతో సహా ఆతనిని చంపివేయుదము అని సుగ్రీవుడు రామునితో పలుకగా ఆ మాటలు విని కాసేపు దాశరధి మౌనము పాటించెను.

.

మిత్రమా ! ఈ రాక్షసుడు దుష్టుడైనను కాకపోయిననూ నాకు ఏమీ భయము లేదు .ఇతడు నాకు ఏ విధముగనూ అపకారము చేయలేడు,చేయజాలడు.

.

సుగ్రీవా నేను తలచుకొన్నచో నా ఈ ధనుస్సునుండి సంధించిన బాణములు సకల పిశాచ,రాక్షస గణములను క్షణములో రూపుమాపగలవు .

.

పూర్వము "కండువ" అను ఒక మహర్షి చెప్పిన వచనములను వినుము.....

.

క్రూరుడు అయిన శత్రువు తన వద్దకు వచ్చి అంజలి ఘటించి కాపాడమని ప్రార్ధించినపుడు ,తనకు చెడు పేరు రాకూడదు అని తలపోయు రాజు అతనిని చంపకూడదు.

.

తన శరణుజొచ్చిన వానిని ఏకారణముచేతనైనా రక్షించలేకపోయినచో అతడు నిందితమైన పాపము చేసినవాడగును.

.

తాను శరణు ఇచ్చి న వాడు తన కళ్ళముందరే ప్రాణము విడిస్తే ,అది పుణ్యమును నశింపచేయును.

.

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే 

అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ

.

ఎవ్వడైననూ వచ్చి నేను నీవాడను అని చెప్పుచూ ఒక్కసారి శరణుపొందిన చాలును,వానిని  సకలప్రాణులనుండి నేను కాపాడెదను...ఇది నా వ్రతము...

.

అని రామచంద్రుడు దృఢచిత్తుడై పలికెను.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: