🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*తల్లి బిడ్డను పోషించినట్లు భక్తి భక్తుణ్ణి కాపాడుతుందని ఈ శ్లోకములో శంకరులు వివరించారు.*
*శ్లోకము : 62*
*ఆనందాశ్రుభి రాతనోతి పులకం నైర్మల్యత శ్ఛాదనం*
*వాచా శంఖముఖ స్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః౹*
*రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా*
*పర్యంకే విని వేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి.!!*
*తాత్పర్యము :-*
*ಓ మహాదేవా ! తల్లి ప్రేమతో ఆనంద బాష్పములు జారుతుండగా బిడ్డను చేరదీసి, రోమాంచిత గాత్రుణ్ణి చేసే విధంగా, భక్తి రసము భక్తుడికి ఆనందబాష్పములు ఒలికించి, శరీరము పులకించి ఉప్పొంగేటట్లు చేస్తుంది.*
*తల్లి బిడ్డకు ఈగలూ, దోమలూ, చలి మొదలైన వాటి బాధ లేకుండా, బట్ట కప్పిన విధంగా భక్తి నిర్మల భావాన్ని కప్పుతుంది.*
*తల్లి శంఖములో పోసి కడుపార బిడ్డకు పాలు పట్టించినట్లు, "భక్తి" వేదాది వాక్యముగా నీ చరిత్రామృతమును తనివి తీరా ఆస్వాదింప చేస్తుంది.*
*రుద్రాక్షలు ధరింప జేసి, విభూతిని పెట్టించి అంగరక్ష కావించి, తల్లి బిడ్డను మంచముపై పడుకో పెట్టి కాపాడుతున్న విధంగా, భక్తి మనస్సు నందు ఈశ్వరధారణ అనే మంచములో ప్రవేశబెట్టి కాపాడుతుంది.*
*వివరణ :-*
*భక్తి తల్లి వంటిది. తల్లి పిల్లల. యోగక్షేమాలను స్వప్న , జాగ్రదవస్థలలోనూ కోరు కుంటుంది.*
*ఈశ్వరా ! భక్తి అనేతల్లి, నీ భావన అనే ఉయ్యాలలో, భక్తుడు అనే శిశువును, చక్కగా ఉంచి కంటికి రెప్పలా కాపాడుతుంది.*
*తల్లి బిడ్డను చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఒక్కోసారి ఆ వాత్సల్య రసం ఆనంద బాష్పాల రూపంలో పైకి తన్నుకు వస్తుంది. ఆ బిందువులు ఒకటో రెండో బిడ్డపై పడగానే ఆబిడ్డ ఆనంద పారవశ్యముతో గగుర్పాటు చెందుతుంది. అలాగే భక్తి భక్తుణ్ణి రోమాంచితునిగా చేస్తుంది.*
*తల్లి పిల్లకు దృష్టి తగలకుండా, గాలి మొదలయినవి సోకకుండా తాయెత్తులు కడుతుంది. మంత్రించిన. విభూతిని శరీరానికి రాస్తుంది. భక్తి అనే తల్లి కూడా రుద్రాక్షలతో , విభూతితో భక్తుడనే పిల్ల వాడికి రక్షకడుతుంది. భక్తుడనే పిల్లవానిని ఈశ్వర భావన అనే ఉయ్యాల తొట్టిలో పెట్టి నిద్ర పుచ్చుతుంది.*
*ఎంతగా ఏడుస్తున్న పిల్లవాడైనా తల్లి ఎత్తుకోగానే ఏడుపు మానివేస్తాడు. బిడ్డకు తల్లి ఒడిలో ఏదో అనిర్వచనీయమైన ఆనందానుభూతి కల్గుతుంది. భక్తి కూడా అటువంటిదే . భక్తి అంటే భగవంతుని పై పరమ ప్రేమ. ఆ పరమ ప్రేమ హృదయంలో ఆవేశిస్తే భక్తుడి కంఠం గద్గద మవుతుంది, శరీరం పులకరిస్తుంది. కండ్ల నుండీ నీరు స్రవిస్తుంది. అంతటి భక్తిగల భక్తులు తమ వంశాన్ని, ఈ భూమినీ పావనం చేస్తారని నారద మహర్షి సైతం చెప్పారు.*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి