5, సెప్టెంబర్ 2020, శనివారం

ఆధునిక వివేకానందుడు

----/ఆధునిక వివేకానందుడు/--డా. సర్వేపల్లి రాధాకృష్ణ---------అది ఒక చారిత్రాత్మక మైన రోజు.......
ఆ రోజు మైసూర్ యూనివర్సిటీ లో ఒక ఆచార్యుని ఇంటి ముందు ఎంతో మంది విద్యార్థులు గుమిగూడి ఉన్నారు. వారందరి ముఖాలలో నైరాశ్యం,నిస్పృహ తాండవిస్తున్నాయి.ఇంక కొద్దిసేపటిలో తమందరికి తండ్రితో సమానమైన గురువు,గురువు అన్న పదానికే నిలువెత్తు నిదర్శనం అయిన ఓ మహనీయుడు ఇంక కొద్దిసేపటిలో వాళ్ళదగ్గర నుంచి కలకత్తా నగరానికి వెళ్ళబోతున్నాడు.అదీ వారి నిస్పృహకు కారణం.
ఇంటి వాకిట్లో మైసూర్ మహరాజా పంపిన జోడు గుఱ్ఱాల సార్ట్ బండి సిద్దంగా ఉంది.సన్నగా రివటలా ఉన్న ఆ యువ గురువు బయటకు వచ్చి తన తలపాగా సర్దుకుని సార్ట్ బండిలో కూర్చున్నాడు.
అప్పుడు జరిగింది ఆ అద్భుతం!!!!!
ఒక్కసారిగా ఆ విద్యార్థులు అందరూ ఆ గుఱ్ఱపు బండికి అడ్డంగా నిల్చున్నారు.బండికి కట్టిన గుఱ్ఱాలను విప్పేశారు.బండి కాడిని తమ భుజాలపై వేసుకుని ఆ గురువును అక్కడికి3 కిలోమీటర్ల దూరంలోని మైసూరు రైల్వే స్టేషన్ కు తీసుకువెళ్ళి రైలు డ్రైవర్లకు తమ గురువుగారిని జాగ్రత్తగా గమ్యం చేర్చవలసిందిగా వేడుకున్నారు.
ఆధునిక భారతంలో మరే గురువుకు ఇంతటి ఆదరణ లభించలేదు.
ఆ గురువు డా.సర్వేపల్లి రాథాకృష్ణన్.
ఆ రోజు గురువును భుజానికెత్తుకొని తీసుకెళ్ళిన ఆ విద్యార్ధులందరి నాయకుడు ఆ తరువాత రోజుల్లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు.....
కర్నాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి గా నిలిచిపోయాడు.అతని పేరు నిజలింగప్ప......
*****///**********
ఒకసారి కొందరు పెద్దలు రాధాకృష్ణన్ గారితో మాట్లాడుతూ" మీరు ఎంతో గొప్ప మేధావులు. కానీ మీరు ఏ ఆక్స్ ఫర్డ్,కేంబ్రిడ్జి లాంటి యూనివర్సిటీ లలో చదువుకుని ఉండిఉంటే మీ మేధకు మరింత గుర్తింపు వచ్చి ఉండేది"అన్నారు.
దానికి రాధాకృష్ణన్ సమాధానమిస్తూ "నేను ఆ యూనివర్సిటీ లకు ఓ విద్యార్ధిగా కాక ఓ ఆచార్యుని గా మాత్రమే వెడతాను"అన్నారు.
అలాగే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పెర్మనెంట్ విజిటింగ్ ప్రొఫెసర్ గానే అక్కడ అడుగుపెట్టిన మహనీయుడు ఆయన.
***///************
స్వతంత్ర భారత దేశపు రాయబారి గా రష్యాలో అడుగు పెట్టిన రాధాకృష్ణన్ మర్యాదాపూర్వకంగా రష్యా అధ్యక్షుడు స్టాలిన్ ను కలవడానికి వెళ్ళినప్పుడు స్టాలిన్ ఆయనను నిర్లక్ష్యం చేశాడు. రాధాకృష్ణన్ ఇంటికి వెళ్ళి తన విధులను నిర్వర్తించడం మొదలు పెట్టారు.
ఓ రోజు అర్ధరాత్రి స్టాలిన్ దగ్గర నుంచి ఆయనకు పిలుపొచ్చింది.
రాధాకృష్ణన్ స్టాలిన్ దగ్గరకు వెళ్ళి భుజాలపై చేతులు వేసి ఆరోగ్యంగా ఉన్నారా అని పలకరించారు.స్టాలిన్ ను అప్పటి వరకూ ఆరకంగా పలకరించిన వారెవరూ లేరు.స్టాలిన్ కరిగి పోయాడు.ఆనాటి నుండి రాధాకృష్ణన్ మహాశయునికి స్టాలిన్ ఎంతో గౌరవమిచ్చాడు.
***///************
రాధాకృష్ణ పండితులు రాష్ట్రపతిగా ఉండగా అప్పటి గ్రీకు దేశాధ్యక్షుడు భారతదేశ పర్యటనకు వచ్చారు.
ఆయనకు స్వాగతం చెబుతూ మీరు మా దేశానికి మా ఆహ్వానం పై వచ్చారు.కానీ శతాబ్దాల క్రితం మీ దేశం నుంచి మా ఆహ్వానం లేకుండానే మీ చక్రవర్తి ఒకరు వచ్చి మమ్ములను అనేక ఇబ్బందులకు గురి చేశాడు.
మీరు వారిలా కాక మంచి మనసుతో విచ్చేశారు. మీకు భారతప్రజానీకం స్నేహ హస్తాన్ని అందిస్తోంది.అంటూ అలగ్జేండర్ పై భారతీయులకున్న దృక్పథాన్ని వెల్లడించారు.
****///***********
స్వతంత్ర భారత దేశానికి తొలిసారిగా అమెరికా అధ్యక్షుడిగా లిండన్ జాన్సన్ వచ్చారు.
భారత సంయుక్త పార్లమెంట్ సమావేశంలో అమెరికా అధ్యక్షుని పరిచయం చేయమని రాధాకృష్ణన్ ను జవహర్ లాల్ నెహ్రూ హఠాత్తుగా కోరారు.
అప్పటికప్పుడు ఆశువుగా అమెరికా అధ్యక్షుని పరిచయం చేశారు రాధాకృష్ణన్.
అమెరికా అధ్యక్షుడు తాను తయారు చేసుకున్న ప్రసంగ పాఠాన్ని తడబడుతూ చదివి కూర్చున్నాడు.
తరువాత అప్పటి అమెరికా లోని భారత రాయబారి ఎమ్.సి.చాగ్లాను తన కారెక్కించుకుని మీ ప్రెసిడెంట్ నిజంగా భారతీయుడేనా లేక ఆంగ్లేయుడా?ఆయన మాట్లాడిన తీరుతో నా ప్రసంగాన్ని తడబడుతూ చదవ వలసి వచ్చింది. అని అన్నారు జాన్సన్.
ఒక అమెరికా అధ్యక్షుడు ప్రొటోకాల్ ను పక్కన పెట్టి ఒక దేశపు రాయబారిని తన కారులో కూర్చోబెట్టుకోవడం చరిత్రలో ఆ ఒక్కసారి మాత్రమే జరిగింది.
*****///**********
ఇప్పటికీ ఆంధ్రవిశ్వ కళాపరిషత్,బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల గోడలను తడిమితే ఆ మహిమాన్వితుని కంఠం వినిపిస్తూనే ఉంటుంది.ఆయన తిరుగాడిన ఆ విద్యాలయాల వరండాలలో ఆయన స్ఫూర్తి నిరంతరంగా అందుతూనే ఉంటుంది. సంద్రం దగ్గరకు కడవ తీసుకుని వెడితే కడివెడు నీళ్ళే...గరిటయితే గరిటెడు నీళ్ళే...!!
------

కామెంట్‌లు లేవు: