24, ఫిబ్రవరి 2021, బుధవారం

*మన మహర్షులు - 2*

 *మన మహర్షులు - 2*


 *అత్రి మహర్షి:*


🍁🍁🍁🍁🍁


అత్రి మహర్షి  సప్తమహర్షులలో  ఒకరు.


అత్రి మహర్షి బ్రహ్మదేవుడి మనస్సులోంచి పుట్టాడు. 


అంటే బ్రహ్మమానస పుత్రుడన్నమాట. అలా పుట్టిన అత్రి మహర్షిని బ్రహ్మదేవుఁడు “లోక రక్షణ కోసం నేను కొంతమందిని సృష్టిస్తున్నాను, నువ్వు గొప్ప తపశ్చక్తిని పొంది నాకు ఈ సృష్టికార్యంలో సాయపడాలి" అని అడిగాడు


అందుకు అత్రి మహర్షి సరే! అలాగే సాయపడతానని చెప్పి ఒక మంచి అనుకూలమయిన ప్రదేశాన్ని చూసుకుని తపస్సు ప్రారంభించాడు


ఈ మహర్షి చేసిన ఘోరతపస్సుకి ఆయన కళ్ళల్లోంచి ఒక గొప్ప తేజస్సు బయటికి వచ్చి భూమి, ఆకాశం అన్ని దిక్కులా వ్యాపించి పోయింది. ఆ తేజస్సుని భూమ్యాకాశాలు కూడా భరించలేక పోవడం వల్ల అది సముద్రంలో పడిపోయింది


ఇది బ్రహ్మదేవుడికి తెలిసి ఆయన ఆ తేజస్సుని అత్రిమహర్షికి  తేజస్సు యొక్క కొంత అంశతో చంద్రుడు కుమారుడుగా పుడతాడని, క్షీరసాగర మథన సమయంలో మిగిలిన అంశ వచ్చి చంద్రుడిని కలుస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు.


https://www.facebook.com/సనాతన-హిందూ-ధర్మం-101453447917569/


 కొంతకాలం తర్వాత, అత్రి మహర్షికి  అనసూయాదేవితో వివాహం జరిగింది. 

 అనసూయాదేవి గొప్ప

పతివ్రతగా వినుతికెక్కింది.


 ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అనసూయాదేవిని పరీక్షిద్దామని బయలుదేరి అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చారు. 


అత్రి మహర్షి అనసూయాదేవి వారికి ఆతిథ్యం ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పుడు త్రిమూర్తులు మహర్షితో మాకు వడ్డించే స్త్రీ నగ్నంగా వడ్డించాలి

అన్నారు. అనసూయాదేవి అంగీకారంతో అత్రిమహర్షి మీ కోరిక ప్రకారమే అన్నాడు.


త్రిమూర్తులు స్నానం చేసి కూర్చున్నాక అనసూయ వారిమీద మంత్రజలం చల్లి చంటి పిల్లల్లా చేసి నగ్నంగా వడ్డించింది. మళ్ళీ దుస్తులు ధరించి వాళ్ళ ముగ్గుర్ని మంత్రజలంతో మామూలుగా చేసి తినండి అంది. భోజనం తర్వాత మళ్ళీ చంటి పిల్లల్ని చేసి ఉయ్యాలలో వేసింది.


త్రిమూర్తుల్ని వెతుక్కుంటూ సరస్వతి, లక్ష్మి, పార్వతి వచ్చి అనసూయ దగ్గర చంటి పిల్లల్ని చూసి మా భర్తల్ని మాకియ్యమని అడిగి అత్రి అనసూయలను మా ముగ్గురి అంశలతో ముగ్గురు పిల్లలు కలుగుతారని దీవించి తమ భర్తల్ని తీసుకుని వెళ్ళిపోయారు.


ఒకసారి కౌశికుడి భార్య, సూర్యుడు ఉదయించగానే తన భర్త చనిపోతాడని తెలిసి సూర్యుడు ఉదయించకుండా చేసింది. అనసూయాదేవి సూర్యుడు ఉదయించేటట్లు చేసి కౌశికుణ్ణి కూడా బ్రతికించింది.


అత్రి మహర్షి సంతానం కోసం  వంద సంవత్సరాలు భార్యతో కలిసి తపస్సు చేశాడు.


అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై పిల్లలు కలిగేలా వాళ్ళని ఆశీర్వదించారు.


 కొన్నాళ్ళయ్యాక అత్రి మహర్షి  

 అనసూయా దేవికి చంద్రుడు,  దత్తాత్రేయుడు, దుర్వాసుడు అనే పేర్లతో ముగ్గురు పిల్లలు పుట్టారు.


సంసారపోషణార్ధం  పృథు చక్రవర్తి దగ్గరకు ధనం కోసం  వెళ్ళాడు అత్రి మహర్షి.


ఆ సమయంలో పృథుచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఆ యాగాశ్వాన్ని రక్షించడానికి తన కుమారుడితో వెళ్ళమని పృథు చక్రవర్తి అత్రి మహర్షిని అడిగాడు. అత్రి మహర్షి సరేనని బయల్దేరాడు.


పృథు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు యాగాశ్వాన్ని దాచేశాడు. 


అత్రి మహర్షి తన దివ్యదృష్టితో చూసి ఆ విషయం పృథు చక్రవర్తి కుమారుడికి చెప్పాడు.


 అతడు ఇంద్రుణ్ణి జయించి ఆ యాగాశ్వాన్ని తీసుకుని వచ్చాడు.


అశ్వమేధయాగం పూర్తయ్యాక పృథు చక్రవర్తి ఇచ్చిన ధనం, వస్తువులు మొదలయిన వాటిని తీసుకువెళ్ళి పిల్లలకిచ్చి అత్రి మహర్షి అనసూయా దేవితో కలిసి తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు.


 ఒప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. అందులో రాహువు వేసిన అస్త్రాలకి సూర్యచంద్రుల్లో వెలుగు తగ్గిపోయి లోకమంతా చీకటయిపోయింది. అప్పుడు

అత్రి మహర్షి తన చూపులతోనే రాక్షసులందర్ని చంపేశాడు.


అత్రి మహర్షి రచించిన ఆత్రేయ ధర్మశాస్త్రంలో దాన ధర్మాలు, జపతపాలు రహస్య పాయశ్చిత్తాలు మొదలయిన వాటి గురించి తెలియచేయబడ్డాయి.


అలాగే అత్రి సంహితలు అనే గ్రంథాల్లో ఆచారాలు, గురుప్రశంస, చాతుర్వర్ణ ధర్మాలు, జపమాలాపవిత్రత, పుత్రులు దత్తపుత్రులు మొదలయినవాటి గురించి తెలియచేయబడ్డాయి.


దత్తపుత్రుణ్ణి స్వీకరించవచ్చు అనే దాన్ని గురించి మొట్టమొదట ప్రవేశపెట్టింది.

అత్రిమహర్షి......!


చదివారు కదా !... సప్తమహర్షుల్లో ఒకడయిన అత్రి మహర్షి గురించి...


రేపు మరో మహర్షి గురించి తెలుసుకొందాం...


*సనాతన హిందూ ధర్మం*

🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: