17, ఏప్రిల్ 2022, ఆదివారం

హనుమ ద్విజయోత్సవం

 *ఈ రోజు చైత్రమాసం పౌర్ణమి హనుమ ద్విజయోత్సవం*



చాలా మంది భక్తులకు ఒక సందిగ్ధం - హనుమాన్ జయంతి ఎప్పుడు ?? -


 హనుమాన్ విజయోత్సవ దినం ఎప్పుడూ అనేది ..


హనుమంతుని జన్మ తిథి చైత్రమాసం లోనా , వైశాఖంలోనా ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది...!!


అలాంటి వారు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు.


పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు. 


అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు.


అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. 


ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. 


దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు.


అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు.


ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా 60 అడుగుల శోభా యాత్రగా ఊరేగిస్తారు.


చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుండి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు.


ఈ దీక్ష చివరి రోజున  హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. 

ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. 


వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు.


హనుమంతుని జన్మ తిథి వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. 


"కలౌ పరాశర స్మృతి:" అని శాస్త్రాలు చెప్తున్నాయి.

 

శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే

పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||


అని చెప్పబడింది.  దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు. 


ఈ రోజున హనుమాన్ చాలీసా , ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.


చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు.


 శ్రీ రాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట.


 మన హిందూ సమాజంలో జాడ్యం, బద్దకం, నిర్లిప్తత, తమస్సు మొదలైన గుణాలు పెరిగిపోయాయి. అవన్నీ వదలాలంటే, తప్పకుండా ఆంజనేయ స్వామి వారిని వేడుకోవాలి.


 అప్పుడే హిందువుల్లో చైతన్యం ఉట్టిపడుతుంది, జడత్వం నశిస్తుంది. కనుక సనాతన ధర్మ పునర్వైభం, భారతదేశ సంరక్షణ, ప్రపంచ శాంతి అనేవి సంకల్పాలుగా చేసుకుని, మనం కూడా ఈ 40 రోజుల పాటు ఇంట్లోనే హనుమాన్ చాలీసా పారాయణ చేయవచ్చు. 


మన కోసం చేసిన పూజ కంటే, పదిమంది మేలు కోరి చేసింది, మరింత ఫలితం ఇవ్వడమే కాదు, మనకు శీఘ్ర ఫలాన్ని, రక్షణను, కామ్యసిద్ధిని, కార్యసిద్ధిని ఇస్తుంది.


*మనోజవం మారుత తుల్యవేగం*

*జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్౹*

*వాతాత్మజం వానరయూధ ముఖ్యం*

*శ్రీరామదూతం శిరసా సమామి॥*


ఆరోగ్యప్రదాత, జ్ఞానప్రదాత, అభయప్రదాతైనటువంటి ఆ సంజీవనీ దాత మనందరికీ మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాలు ప్రసాదించాలని  కోరుకుంటూ ... అందరికీ హనుమద్విజయోత్సవ శుభాకాంక్షలు....

కామెంట్‌లు లేవు: