28, ఏప్రిల్ 2023, శుక్రవారం

భయం


           _*సుభాషితమ్*_


శ్లో॥

భోగే రోగభయం కులే చ్యుతి భయం  విత్తే నృపాలాద్భయం,

మానే దైన్యభయం బలే రిపుభయం రూపే జరాయా భయమ్।

శాస్త్రే వాదభయం గుణే ఖలభయం కాయే కృతాన్తాద్భయం,

సర్వం వస్తుభయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవాsభయమ్।।

            ~భర్తృహరి వైరాగ్యశతకమ్.


భావం:-

భోగాలు అనుభవిస్తున్నామనే తృప్తి మిగలకుండా రోగాలొస్తాయేమోనని రోగభయం,మంచి కులంలో పుట్టామని తృప్తి పడడానికి ఏం తప్పు జరిగినా కులానికి అప్రతిష్ఠ వస్తుందేమోనని భయం,బాగా డబ్బుఉన్నదిలే అని ఆనందపడితే రాజు ఆధనాన్ని(టేక్సులరూపంలో) కైంకర్యం చేస్తాడేమోనని భయం(దొంగలవలన కూడా భయం), మానశౌర్యంచేత విర్రవీగేవీలులేకుండా అనుక్షణం ఎప్పుడు  ఏంజరుగుతుందోననిభయం, సౌందర్యం ఉందనుకుంటే ముసలితనం వస్తుందని భయం, శాస్త్రవిజ్ఞానం ఉందనుకుంటే ప్రతివాదులతో వాదనాభయం, మంచిశరీరం ఉందనుకుంటే దీనికి ఎప్పుడు యముని బాధ కలుగుతుందోనని భయం, ఇలా ప్రతీదానికి ఏదోఒక విఘాతం ఉందిగాని భయం లేనిది ఒక్క వైరాగ్యానికే. అని శ్లోకభావము.: .

             _*కర్మలు*_


కర్మలు మూడు రకాలు..... 

1) ఆగామి కర్మలు

2) సంచిత కర్మలు

3) ప్రారబ్ధ కర్మలు


*_-----ఆగామి కర్మలు-----_*

మనము చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మల క్రిందకే వస్తాయి.... వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్నిస్తాయి.... మరికొన్ని తరువాత కాలంలో, కొన్ని మరు జన్మలలో ఫలితాన్నిస్తాయి..... అసలు కొన్ని ఏ ఫలితాలను కూడా ఇవ్వకపోవచ్చు! వివాహమైన దంపతులందరికీ సంతానం కలుగకపోవచ్చు! అయితే కొన్ని మాత్రం ఫలితాన్నివ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటం కోసం కూడబెట్టుకొని ఉంటాయి..... ఉదాహరణకు మనం భోజనం చేస్తాం... . అది కర్మ..... వెంటనే మన ఆకలి తీరుతుంది..... ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితన్నిచ్చేస్తాయి.... కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్నివ్వవు..... దానధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం,అవన్నీ వెంటనే ఫలితన్నిచ్చేవి కావు..... ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది...... ఇలా కొన్ని కర్మలు అప్పటి కప్పుడే ఫలితన్నివ్వలేక, తర్వాత ఎప్పుడో ఫలితాన్నివ్వటానికి కూడబెట్టబడి (సంచితం చేయబడి) ఉంటాయి..... ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ‘అగామికర్మలే’!


*_-----సంచిత కర్మలు-----_*

మనము పూర్వ జన్మలలో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అనుభవించలేకపోతే అవి సంచితమవుతాయి..... అంటే వాటిని ఒక జన్మ నుండి మరొక జన్మకి, అక్కడి నుండి వేరొక జన్మకు మనము తీసుకుని వెళ్తాము.జీవుడు శరీరాన్ని వదిలిపెట్టినా ఈ సంచిత కర్మలు మాత్రం జీవుణ్ణి వదలి పెట్టకుండా అతడితో వస్తుంటాయి..... జీవుడు ఈ శరీరాన్ని వదలి వెళ్ళేటప్పుడు, ఆ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించిన కర్మఫలాలను మూటగట్టుకొని తగిన మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళుతాడు..... దీనికి కారణం ‘సంచిత కర్మలు


*_-----ప్రారబ్ధ కర్మలు-----_*


సంచితములో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఫలితాలను ఇస్తాయి.... ఇలా అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు...... మనము చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు...... మనము చేసుకున్న కర్మల ఫలితమే మనము అనుభవిస్తాము..... ప్రారబ్ద కర్మల ఫలితాన్ని అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్లి, ఆ శరీరంతో జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు.... అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ద కర్మఫలాలన్ని అనుభవించటం పూర్తయ్యేవరకు ఆ శరీరం ఉంటుంది.... ఆ కర్మలను అలా వదిలించుకోవడానికి వచ్చి, చేసే, చేసిన కర్మలను వదిలించుకోకుండా మరల మరల అజ్ఞానముతో వాటికి మరికొన్ని కూడగట్టుకుంటున్నాం!ఇలా ప్రోగు చేసుకోవడం వలనే మరల మరల ఈ జన్మలు,శరీరాలు వస్తున్నాయి..... కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణులమైతే మరో జన్మే లేదు..... ఇక్కడ మీకో అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి.... ఎవరెవరు ఏ ఏ కర్మలు అనుభవించాలో, అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారు..... ఆ అనుభవాలను ,కర్మ ఫలాలు ఏ గర్భం ద్వారా పొందవచ్చో ఆ గర్భాన్ని ఎంచుకుంటారు..... అంతకు మించి , నిజానికి కూతురు, కొడుకు అనే బంధాలు లేవు.….. కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన ,జన్యుపర సంబంధం లేని భార్యాభర్తలకు జన్మించటాన్ని మనం చూసాం!అలా వారు పుట్టటాన్ని వారి ప్రారబ్ధ కర్మ అని అంటారు........



భార్యాభర్తలు కూడా అటువంటి ప్రారబ్ధ కర్మాన్నే ఆ శిశువు ద్వారా అనుభవించి తీరాల్సిందే!యోగసాధన ద్వారా ఇలాంటి కర్మలను కొంతవరకు evaporate చేసుకోవచ్చు! అలా కర్మలు తొలగించబడేవరకు వైకల్యంతో పుట్టిన శిశువు నానా బాధలు పడుతూ జీవిస్తూ ఉంటాడు.... ఇది పరమ సత్యం..... ఇటువంటి సంఘటనలను మీరు కూడా చూసే ఉంటారు..... వైకల్యంతో పుట్టిన ఆ శిశువు వలన భార్యాభర్తలు పడే బాధలు వర్ణనాతీతం..... ఆ బాధను చూసి కొంతమంది ,ఆ బాలుడిని మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రంలో చేర్పిస్తారు..... అయితే, అది అంత మంచిది కాదేమో! కారణం–ఈ ప్రారబ్ధకర్మ నుంచి తల్లి తండ్రులు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తే లేక ఆ శిశువు ఆ కర్మ అనుభవించకుండా చేయటం వలన, వారు అట్టి కర్మను మళ్ళీ ఏదో ఒక రూపంలో అనుభవించాల్సిందే! అంబానీ సోదరులు అత్యంత ధనవంతులుగా జన్మించి సుఖాలను అనుభవించటానికి,నిత్యం దేవుడిని సహస్ర నామాలతో అర్చించే పూజారికి మరియు గుడి బయట అడుక్కునే వేలాదిమంది బిచ్చగాళ్ళు దీన స్థితిలో ఉండటానికి కారణం వారి వారి ప్రారబ్ధమే...... ఈ కర్మ ఫలాలను పూర్తిగా అనుభవించేవరకూ జీవుడు మరల మరల జన్మిస్తూనే ఉంటాడు...... జన్మ పరంపరలు పూర్తైన వారు, తర్వాత దివ్య శరీరంతో రాశీమండలంలోకి ప్రవేశిస్తారు. సృష్టి ప్రణాళికలో వారి పాత్ర కనుక ఉంటే,మరలా వారు ఈ భూమి మీద జన్మిస్తారు..... ఇంతకు ముందర నేను చెప్పిన విధంగా వారు యేయే అనుభూతులు పొందాలో అట్టి తల్లి గర్భాన్ని వారే ఎన్నుకుంటారు...... జన్మ పరంపరలు పూర్తి కాకపోతే ,వారు రాశీమండలంలోకి చేరటానికి అర్హులు కారు..... కారణం శరీరం నశించిన తర్వాత ,సూక్ష్మ శరీరం కూడా నశిస్తుంది.....వెంటనే జీవాత్మ పరమాత్మలో లీనం అవుతుంది....సూక్ష్మ శరీరం నశిస్తే కానీ జీవికి మోక్షం కలుగదు.....సూక్ష్మ శరీరం నశించాలంటే మనల్ని అలుముకున్న అజ్ఞానం నశించాలి.....సూక్ష్మ శరీరం నశింప చేసుకోవాలంటే దానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపచేసుకోవాలి.....ముముక్షువు మొదటగా సూక్ష్మ శరీరాన్ని నశింపచేయకుండా ,దానికి మూలమైన కారణ శరీరాన్ని నాశనం చేయాలి. ...అసలు ఈ శరీరం ఏర్పడటానికి కారణం అజ్ఞానమే!ఆ అజ్ఞానాన్ని నశింపచేస్తే కారణ శరీరం నశిస్తుంది. .....అసలు ఈ జన్మల పరంపరలు కొనసాగటానికి కారణాలు–అహంకారం వలన అజ్ఞానం కలుగుతుంది..... అజ్ఞానం వలన అభిమానం కలుగుతుంది. ....అభిమానం వలన కామ,క్రోధ ,మోహాలు ఏర్పడుతాయి. కామ, క్రోధ, మోహాలు ఏర్పడటం వలన కర్మలు చేయవలసి వస్తుంది.....కర్మలు చేయటం వలన పునర్జన్మలు వస్తాయి..... ప్రారబ్ధకర్మలను ఆనందంగా అనుభవిస్తూ,మరేయితర దుష్కర్మల జోలికి పోకుండా , కర్మ ఫలాలను ఆశించకుండా జీవిస్తే మోక్షం పొందటం సులభం

కావచ్చేమో!జాతక కధల ప్రకారం బుద్ధుడిది అది 700 వ జన్మ అని చెప్పబడింది....ఇక మనం ఎన్ని జన్మలు ఎత్తాలో? మళ్ళీ ఈ మానవ జన్మే వస్తుందని నమ్మకం ఏమీ లేదు... అందుకని ఈ జన్మలో సత్కర్మలు చేస్తూ మిగిలిన జీవితాన్ని గడుపుదాం! ప్రాపంచిక విషయాలాలసలో ఉన్నప్పటికీ వాటి వాసన అంటకుండా జీవించటం అనేదే కర్మయోగ సాధన సారాంశం. అంటే తామరాకు మీద నీటి బొట్టులా జీవించటం!


*_........శుభం భూయాత్......._*

: *బహువిధ స్నానములు*


*పంచవిధ-స్నానములు :* సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 

1. ఆగ్నేయము (విభూతిని శరీరమంతట పూసికొనుట), 2. వారుణము (జలమున మునుగుట), 3. బ్రాహ్మము (ఆపోహిష్ఠేత్యాధి మంత్రము నుచ్చరించుచు దర్భలతో జలమును మార్జనము చేసికొనుట), 4. వాయవ్యము (సాయం సమయములో గోవుల డెక్కలను లేచిన), వాన కురియుచుండగా నందు శరీరమును తడుపుకొనుట).


*షడ్విధ-స్నానములు :* 

1. నిత్యము, 2. నైమిత్తికము, 3. కామ్యము, 4. క్రియాఖ్యము, 5. మలకర్షణము, 6. కర్మాంగము.


*సప్తవిధ-స్నానములు :* 

1. మంత్రము, 2. భౌమము, 3. ఆగ్నేయము, 4. వాయవ్యము, 5. దివ్యము, 6. వారుణము, 7. మానసము.


*దశవిధ-స్నానములు :*

1. ఆగ్నేయము (భస్మస్నానము), 2. వారుణము (పర్జన్యస్నానము), 3. బ్రహ్మస్నానము (గాయత్రీ స్నానము), 4. వాయవ్యము (గోధూళి స్నానము), 5. అవగాహము, 6. కంఠస్నానము, 7. కటిస్నానము, 8. కాపిలము, 8. కాపిలము. 10. మానసము.


"ఆగ్నేయం వారుణం బ్రాహ్మం వాయవ్యం చావగాహనమ్‌, కంఠస్నానం కటిస్నానం కాపిలం మంత్రమానసే"

కామెంట్‌లు లేవు: